అసెంబ్లీ లో మాటల యుద్ధం..అంతా గందరగోళం

అసెంబ్లీ రెండో రోజు జగన్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరిగింది. తమ సీఎం చంద్రబాబునాయుడు ఏపీని ఎలా అభివృద్ధి చేయాలా...నవ్యాంధ్రకు ఎలా నిధులు రాబట్టాలా అని ప్రతి రోజు హోం వర్క్ చేస్తుంటారని..అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి రోజు మనీ లాండరింగ్ కంపెనీలు..సూట్ కేసుల కంపెనీలు ఎలా పెట్టాలా అని హోం వర్క్ చేస్తుంటారని ఎద్దేవా చేశారు. జగన్ ఆయన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ విషయంలో బాగా ఆరితేరిపోయారని యనమల ఫైర్ అయ్యారు. అందుకే ప్రతి శుక్రవారం జగన్ జైలు దర్శనం చేసుకోవాల్సి వస్తోందని సెటైర్ వేశారు. ఇందుకు జగన్ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఓట్లకు కోట్ల మీద ఎక్కువగా హోం వర్క్ చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందుగా చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయంపై మాట్లాడుతూ ఒక రాష్ర్ట ప్రభుత్వంపై మరో రాష్ర్ట ప్రభుత్వం నిఘాపెట్టే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ధర్మం తనవైపు ఉందని..తాను ఎవ్వరికి భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను జీవింతో ఏ తప్పు చేయలేదని..తనతో పెట్టుకున్న వారంతా ఏమయ్యారో మీకు తెలుసని... రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్న చందంగా జైలుకెళ్లిన ఘనత మీకే ఉందంటూ ప్రతిపక్షనేత జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు సెటైర్లు వేశారు.

ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారు?

ప్రభుత్వ సలహాదారులకు.. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు.. వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లకు కేబినెట్ హోదా కల్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వటానికి వీల్లేదని స్పష్టం చేసింది. జీతాలు.. వసతులు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉన్నా.. కేబినెట్ హోదాలు మాత్రం ఇవ్వకూడదని పేర్కొంది.   కేసు విచారణలో భాగంగా.. రూల్స్ కు అనుగుణంగానే కేబినెట్ హోదా కల్పించామని.. జీతాలు.. సౌకర్యాల కోసం కేబినెట్ ర్యాంకు ఇచ్చినట్లుగా తెలంగాణ సర్కారు తరఫు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి చేసిన వాదనను హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జీతాలు కావాలంటే ఇచ్చుకోవచ్చని.. సౌకర్యాలు కూడా కల్పించుకోవచ్చు తప్పించి.. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వకూడదని స్పష్టం  చేసింది.   సలహాదారులు.. ఇతర హోదాలలో తీసుకున్న వారు మంత్రులతో సమానంగా కాదని స్పష్టం చేసిన హైకోర్టు వాదన.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎంతోమంది మంత్రుల మనసులకు కాసింత ఊరట ఇవ్వటం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రమాదానికి గురయిన తెదేపా ఎంపీ గల్లా జయదేవ్

  గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఒక స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేసే ముందు దానిని టెస్ట్ రైడ్ చేయబోయి దానిపై నుండి జారి క్రింద పడ్డారు. ఆయన వెన్నెముక, కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. ఆయనని హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముకకి కొంచెం లోతుగా గాయం అవడంతో దానిని సరి చేయడానికి చిన్న శస్త్ర చికిత్స చేయవలసి వస్తుందని సమాచారం. కానీ కంగారు పడవలసిందేమీ లేదని వైద్యులు స్పష్టం చేసారు. తెదేపా నేత నారా లోకేష్ అపోలో ఆసుపత్రికి వెళ్లి గల్లా జయదేవ్ ని పరామర్శించారు.

వైకాపాకు బాబు వార్నింగ్..!!

ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయాలని చూసే జగన్ లాంటి వాళ్లను చాలా మందిని చూశానని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అసెంబ్లీ వాయిదా పడ్డ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట పై ఈ రోజు అసెంబ్లీ లో జగన్ చేసిన వ్యాఖలను తప్పుబట్టారు బాబు.   పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని, ఆరోజు ఏ ప్రభుత్వమూ స్పందించనంత వేగంగా స్పందించానని, పీఠాధిపతి పుష్కర ఘాట్ లో ఉండబట్టే తాను కూడా అక్కడికే వెళ్లానుతప్ప మరే ఇతర కారణాలూ చెప్పారు. జగన్ మంచి సలహాలు ఇస్తే హర్షించి ఉండేవాడినని, కానీ వాస్తవానికి అలా జరగడం లేదని, ఇది రాష్ట్రమంతటికీ దురదృష్టకరమని అన్నారు. అలాగే ప్రతిపక్షంగా ఏది పడితే అది మాట్లడోచ్చని జగన్ అనుకుంటున్నారని, పదే పదే రెచ్చ గొట్టే ధోరణిలో మాట్లాడటం సరికాదని, అది ఆయన అపరిపక్వతకు నిదర్శనమని అన్నారు. అయితే, ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేయాలనేది జగన్ ఉద్దేశమని, ప్రతీ దానికి ఓ లిమిట్ ఉటుందని, ఆ లిమిట్ ను దాటితే మాత్రం సహించబోమని, అధికార పక్షంగా ఏం చేయాలో ఆ విదంగా  యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు బాబు. పద్దతిగా ఉండాలని ఈ సందర్భంగా విపక్షానికి సూచనా చేశారాయన.

చంద్రబాబుకు జగన్ సవాల్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలైన తొలిరోజే గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జగన్, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. హత్యరాజకీయాల ప్రస్తావన కూడా మరోసారి తెరమీదకొచ్చింది. ఈ విమర్శల పర్వంలోనే జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.   ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా మాట్లాడిన బాబు.. లోక్ సభలో నాడు కాంగ్రెస్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటి ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే.. బాబు చేసిన ఈ స్టేట్ మెంట్ పై ఏమాత్రం వాస్తవం లేదని జగన్ ఖండించారు. చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలు స్టేట్ మెంట్ లో లేవన్నారు. ఒకవేళ.. ఎక్కడైనా ఉన్నాయని నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని.. లేకుంటే బాబే రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరారు. స్టేట్ మెంట్ లో ఒకటి ఉంటే చంద్రబాబు ఇంకొకటి మాట్లాడారని చెప్పారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్.. సభలో తమకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవం చాలా దారుణమన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలను చంద్రబాబు సందేహంలో పడేశారని ఆరోపించారు. ఇలాంటి సభను తానెక్కడా చూడలేదని మండిపడ్డారు. ఆయన చేసేవన్నీ దిక్కుమాలిన రాజకీయాలని, సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

జగన్ కు చంద్రబాబు పంచ్

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. దీనిపై జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వారు ఆత్మహత్యలు చేసుకోలేదని... కేవలం చంద్రబాబు నాయుడు బీజేపీ మంత్రులు ఇస్తున్న స్టేట్ మెంట్ల పై నమ్మకం లేకే వారు ఆవేదనతో చనిపోయారని జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన సీఎం చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్మోహ్న్ రెడ్డి ఏం చేశారని..ఆయన పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు.   పార్లమెంటు సమావేశపు హాలు తలుపులు మూసేసి మరీ రాష్ర్ట విభజన చేస్తుంటే జగన్ పార్లమెంటులో కూర్చుని ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రి వెంకయ్యనాయుడు రాష్ర్టానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే అప్పుడు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

జగన్ పై మండిపడ్డ స్పీకర్

పుష్కర తొక్కిసలాట మృతుల సంతాపం తీర్మానం సందర్భంగా వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే స్పీకర్ మైకులు కట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.దీని పై స్పందించిన స్పీకర్ జగన్ పై అగ్రహం వ్యక్తం చేశారు.సభలో ప్రతిపక్ష నేత హుందాగా వ్యవహరించాలని ..సభను,సభావతిని అవమానపరిచేలా మాట్లాడటం తగదని జగన్‌కు సూచించారు.సంతాప తీర్మానాల్లో రాధ్దాంతం సృష్టించడం సభా సంప్రధాయాలకు విరుద్దమన్నారు.జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించేకోవాలని స్పీకర్ సూచించారు.

చంద్రబాబు మేకప్ వేసుకొని, హీరోలా..

సోమవారం శాసనసభ సమావేశాల్లో పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు సంతాప తీర్మానం సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాటలో మరణించినవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రధ్దాంజలి ఘటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విపక్ష నేత జగన్ అన్నారు. విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్ లో స్నానానికి వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మేకప్ చేసుకుని వచ్చారని , సినిమాలో హీరోలా కనిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కేటాయించిన ఘాట్ వద్దకు చంద్రబాబు వచ్చారని అన్నారు.   మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సంతాప సందేశం కాకుండా మొత్తం అంతా మాట్లాడి ,ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఫ్యాక్షన్ సందేశం ఇస్తున్నారని యనమల ఆరోపించారు. ఇది సంతాప సందేశంగా కనిపించడం లేదని, పరిమితంగానే మాట్లాడాలని, వేరే చర్చలో వీటిని మాట్లాడవచ్చని అన్నారు.   జగన్ మాట్లాడుతూ..మనిషిని పొడిచి, ఆ తర్వాత దండలు వేసినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.సభలో దీనిపై గందరగోళంగా మారింది. కోడెల మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, మొత్తం శాసనసభపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని అన్నారు.శాసనసభపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోడెల అన్నారు.తాను చంద్రబాబుపై ఆరోపణ చేస్తే శాసనసభపై ఆరోపణలు చేస్తున్నట్లు చెబుతున్నారని అన్నారు.

అబ్దుల్ కలాం మృతికి ఏపీ అసెంబ్లీ నివాళి

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు ఏపీ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రపతి పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కలాం అన్నారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం ప్రయత్నించారని బాబు తెలిపారు. ఒంగోలులో ట్రిపుల్‌ఐటీకి అబ్దుల్‌కలాం పేరు పెడతాం ప్రకటించారు. చదువుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అబ్దుల్‌కలాం పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. భరతమా ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా జనగ్ ప్రసంగించారు. ఆయన మృతి చెందడం తనకే కాకుండా దేశాన్ని కలిచివేసిందన్నారు. అబ్దుల్‌కలాం సాధారణ జీవితం గడిపారని చెప్పారు. రాష్ట్రపతి పదవి అనంతరం ఉపాధ్యాయుడిగా జీవితం కొనసాగించారని జగన్ అన్నారు.

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  నేటి నుండి ఐదు రోజుల పాటు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈసారి విశాఖపట్నంలో ఆంద్ర విశ్వద్యాలయంలో కానీ గీతం విశ్వద్యాలయంల్లో గానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆలోచించినప్పటికీ, భద్రత ఇతర కారణాలరీత్యా హైదరాబాద్ లోనే నిర్వహించబోతున్నారు. ఈసారి కేవలం ఐదు రోజులే సమావేశాలు నిర్వహించబోతున్నా అవి సజావుగా సాగే అవకాశం లేదని ముందే స్పష్టమయిన సంకేతాలు కనబడుతున్నాయి.   మొదటి రోజునే ప్రత్యేక హోదాపై నోటీసు ఇచ్చి దానిపై సభలో తీర్మానం చేసి ఆమోదింపజేయాలని వైకాపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తెదేపా దానిని వ్యతిరేకిస్తే వైకాపా సభను స్తంభింపజేయవచ్చును. కానీ వైకాపా ప్రతిపాదనను తిరస్కరిస్తే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని తెదేపా కోరుకోవట్లేదు, ప్రయత్నించడం లేదు,’ అని వైకాపా చేస్తున్న వాదనలకు బలం చేకూరినట్లే అవుతుంది. పైగా తాము దాని కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదిస్తే దానిని కూడా తెదేపా అడ్డుకొందని వైకాపా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుక వైకాపాకి ఆ అవకాశం ఇవ్వకుండా తెదేపాయే ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రతిపాదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   అప్పుడు వైకాపా రాజదాని భూసేకరణ, ఇసుక అక్రమ రవాణా వంటి వేరే ఇతర అంశాలు లేవనెత్తి అధికార పార్టీని నిలదీయవచ్చును. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఈ అసెంబ్లీ సమావేశాలను కనీసం 15రోజులు నిర్వహించాలని వైకాపా కోరబోతోంది. ఆ ప్రతిపాదనను తెదేపా నిరాకరించడం ఖాయం కనుక, దానిపై కూడా సభలో రభస జరిగే అవకాశం ఉంది. కొద్ది సేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికార పార్టీ సభ్యలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ (వైకాపా) సభ్యులు అసెంబ్లీ సమావేశాలకి బయలుదేరారు. మరికొద్ది సేపటిలో సమావేశాలు మొదలు కాబోతున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపం తెలిపిన తరువాత సభా కార్యక్రమాలు మొదలవుతాయి.

ఏపీ కోసం బీజేపీ కొత్త డిమాండ్‌

మారాం చేస్తున్న పిల్ల‌ల్ని ఆద‌మ‌ర్చ‌టానికి కొన్ని ట్రిక్కులు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. చాక్లెట్ కావాల‌ని గోల పెడితే.. దాన్ని మ‌ర్చిపోవ‌టానికి మ‌రేదో ఆశ చూపించ‌ట‌మో.. మ‌రో విష‌యం గురించి మాట్లాడ‌ట‌మో చేస్తుంటారు. తాజాగా..అలాంటి ప‌నినే చే్స్తున్నారు ఏపీ బీజేపీ నేత‌లు. ఓ ప‌క్క ఏపీకి ప్ర‌త్యేక హామీ ఇస్తామ‌న్న త‌మ అగ్ర‌నేత‌ల హామీ గురించి ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌ని ఏపీ క‌మ‌ల‌నాథులు.. ప్ర‌తి ఎంపీ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చాల‌న్న స‌రికొత్త డిమాండ్‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు.   మ‌రింత అభివృద్ధి కోసం.. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ కోసం జిల్లాల పెంపు అనివార్య‌మ‌న్న‌ది వారి మాట‌. తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో జ‌రిగిన ఏపీ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశానికి హాజ‌రైన ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు హ‌రిబాబు మాట్లాడుతూ..ఈ స‌రికొత్త డిమాండ్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు.   హ‌రిబాబు లెక్క‌న చూస్తే.. ఏపీలో 25 జిల్లాలు ఉండాల‌న్న మాట‌. ఆచ‌ర‌ణ‌లో ఇదెంత సాధ్య‌మ‌న్న‌ది ఒక పెద్ద ప్ర‌శ్న‌. అయినా.. ఇప్ప‌టికే 13 జిల్లాల్ని మ‌రో ప‌న్నెండు జిల్లాలుగా మార్చ‌టం వ‌ల్ల.. మ‌రింత ఖ‌ర్చు పెర‌గ‌టంతోపాటు.. కీల‌క‌మైన ఐఎస్‌.. ఐపీఎస్ ల కేటాయింపు ద‌గ్గ‌ర నుంచి మ‌రెన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలీదు. కానీ.. అలాంటి అంశాల్ని ప్ర‌స్తావించ‌ని హ‌రిబాబు.. ఏపీని 25 జిల్లాలుగా చేయాల‌న్న డిమాండ్ చేసేశారు.   అంతేకాదు.. దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని విధంగా గ‌త ఏడాది కాలంగా కేంద్రం.. ఏపీకి చాలానే నిధులు ఇచ్చేసింద‌ని చెప్పుకొచ్చారు. ఏపీ ద‌శ‌.. దిశ‌ను మార్చే ప్ర‌త్యేక ప్యాకేజీ కానీ.. రాజ‌ధాని నిర్మాణానికి నిధుల హామీ కానీ..ప్ర‌త్యేక హోదా గురించి కానీ ఒక్క మాట మాట్లాడ‌ని హ‌రిబాబు.. అందుకు భిన్నంగా జిల్లాల పెంపు గురించి మాత్రం మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. అవ‌స‌ర‌మైన వాటి కంటే కూడా త‌మ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా హ‌రిబాబు మాట‌లున్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంజెక్షన్ సైకో కలకలం..ఆటో డ్రైవర్ పై దాడి

గత వారం రోజులుగా గోదావరి జిల్లాల్లోని వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడి బారి నుంచి తాజాగా ఓ ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు. ఇంతవరకు మహిళలపై దాడి చేస్తున్న ఈ సైకో ఆటోలో వెళుతున్న ఏసు అనే యువకుడిపై దాడి చేశారు.ఈ దాడి నుంచి తప్పించుకున్న ఆటో డ్రైవర్ .. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వారం వ్యవధిలో ఇప్పటివరకూ సైకో సూదిగాడు దాదాపు 15 మందిపై ఇంజెక్షన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అతగాడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేయటంతో పాటు.. రివార్డు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఏం, గవర్నర్

విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఇరు రాష్ట్రాలోని మహిళల భద్రతకు రక్షాకవచంగా ఉంటానన్నారు.మహిళా మంత్రులు పరిటాల సునీత,పీతల సూజత,మృణాశిని,కృష్ణాజిల్లా జడ్పీచైర్మన్ గద్దె అనూరాధ,బ్రహ్మకుమారీలు,పలువురు మహిళలు చంద్రబాబుకు రాఖీ కట్టారు.   రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.పలువురు ప్రముఖులు,నేతలు ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ నివాసంలో నిర్వహించిన రాఖీవేడుకల్లో కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్..కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి రాఖీ కట్టి అశీర్వాదం తీసుకున్నారు.   రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.గవర్నర్ నరసింహన్‌కు స్కూల్ విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు.

ఉల్లి అంటే హరీష్ కు కోపం వచ్చింది

ఉల్లి పేరు చెబితే సామాన్య ప్రజలు ఎలా మండిపడుతున్నారో, అలాగే తెలంగాణ మంత్రులు కూడా మండిపడుతున్నారు. ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా సబ్సిడీ మీద తెలంగాణ సర్కారు ఉల్లిపాయల్ని సరఫరా చేస్తున్న సగంతి తెలిసిందే. అయితే ఇంత చేస్తున్న ఉల్లిపాయల సరఫరాలో లోపాలు..జనాలు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో వార్తలు రావటంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.   రూ.40కోట్లు ఖర్చు చేసి ఉల్లిపాయిల్ని సబ్సిడీలో ప్రజలకు అందిస్తున్న కొన్ని పత్రికలు పచ్చి అబద్ధాలు రాస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయిలు ఖర్చు చేసి పనులు చేస్తున్నా.. విమర్శలు చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే రాసే ప్రతివార్త హరీశ్ రావు అండ్ కోలను పొగిడేయటం తప్పించి చిన్నపాటి విమర్శను కూడా భరించలేని స్థితికి తెలంగాణ సర్కారు చేరుకున్నట్లు కనిపిస్తోంది.