గడువు పెరగడంతో ‘సహకార’ పాలకమండలికి సువర్ణావకాశం!

  అనుకోకుండా సహకార సంఘాల పాలకమండలి సభ్యుల పదవీ కాలం పెరిగింది. అదీ 2013ఫిబ్రవరి 14వరకూ పరిమితి పొడిగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సహకార సంఘం తరుపున పోటీ చేద్దామనుకున్న కొత్త నేతలు కంగుతిన్నారు. 2010 అక్టోబర్‌21తో పదవీకాలం ముగిసిన పాలకమండలికి సువర్ణావకాశం లభించింది. ఇంకా నల్లుకోవాల్సిన ఆమ్యామ్యా ఏమైనా మిగిలి ఉంటే పాలకమండలి దాన్ని తొందరగా సంపాదించుకోవచ్చు. అయితే ఈసారి ఎన్నికలు ఖాయమని నమ్మిన కొత్తనేతలు ఇప్పటికే సభ్యులను మచ్చిక చేసుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వారి ఆశలకు కొంత కాలం ప్రభుత్వమే బ్రేక్‌ వేసింది. ఈ బ్రేక్‌ వేయకుంటే సహకార సంఘం ఎన్నికల కోసం అధికారుల ఓటర్ల గుర్తింపు కూడా పూర్తి చేశారు. కొత్తజాబితాలతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఇటువంటి పిడుగులాంటి వార్త రావటంతో ఇక ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని అధికారులు సైతం నీరసపడ్డారు.  ఓటర్ల జాబితాలు సవరించి  బకాయిలు రికవరీ చేసి కొందరికి ఓటు హక్కు కల్పించిన తాము ప్రభుత్వ చర్యకు నివ్వెరపోతున్నామని జిల్లా సహకార అధికారి ఒకరు ‘తెలుగువన్‌’తో చెప్పారు. ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా వేసిన ప్రభుత్వం 2013లోనైనా ఎన్నికలు నిర్వహిస్తే అంతే చాలని సహకార సంఘ సభ్యులు ఆశిస్తున్నారు.

ఆక్వా రుణాలమాఫీ వెనుకున్నది బాబుపై కోపమేనా?

  రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇది సాధ్యం కాదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆక్వాబకాయిలు రూ.468కోట్లు రద్దు చేశారు. అంతేకాకుండా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 32లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు అందిస్తామని కూడా సిఎం ప్రకటించారు. దేశం మొత్తం మీద రాష్ట్ర రైతులు 10శాతం మాత్రమే రుణాలు పొందుతున్నారని చెప్పారు. అన్నదాతల కోసం మరో రెండువేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయనున్నామని హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో రూ.16వేల కోట్లు ఖర్చు చేసి 30లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని హామీలు వరుసగా సిఎం ఎందుకు ప్రకటించారు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము బ్యాంకురుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట మరిచిపోయేందుకని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి సిఎం ముందుగా అనుకున్నది ఈసారి విద్యారంగ పరంగా రాష్ట్రప్రజలను ఆకట్టుకోవాలనుకున్నారని తెలిసింది. అయితే బాబు ప్రకటనతో తన ఆలోచన మార్చుకుని రైతులకు సంబంధించిన అంశాలపై తీవ్రస్థాయిలో స్పందించారు. అంటే ఒకరి(బాబు)పై కోపం వస్తేనే నేతలు(సిఎం) వాస్తవాలు(సంక్షేమం) అర్ధం చేసుకుంటారా? లేక పార్టీలో ఉన్న నేత(వట్టివసంతకుమార్‌ తదితరు)లు నష్టపోతున్నారని సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారా?

సహనం కోల్పోతున్న సిఎం...సమాధానమిస్తున్న బాబు!

  తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది? అలానే అస్తమానూ సిఎం పదవికి ఇంకొకరిని ఎంపిక చేస్తారన్న వార్తలు చదివి చదివి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విసిగిపోయారు. దీనికి తోడు సీనియర్ల అడ్డగోలు వ్యాఖ్యలు కూడా ఆయన్ని కలవరపరుస్తోంది. చివరికి మనిషి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఉన్నా రాష్ట్రంలో జరుగుతున్న మార్పులపైనే ఆయన దృష్టిసారిస్తున్నారు. దీనితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర, ప్రసంగాలు ఆయన గమనిస్తున్నారు. ఇంకోవైపు వైకాపా నాయకురాలు షర్మిల చేసే వ్యాఖ్యలు కూడా పరిశీలిస్తున్నారు. షర్మిల వ్యాఖ్యానాలపై కాంగ్రెసు మహిళా నేతలకు ఆయన పని పెట్టారు. తాను మాత్రం చంద్రబాబుకు వస్తున్న స్పందన గమనించి ఆశ్చర్యపోయి ఆయనకు సమాధానం తానే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబు తన ప్రసంగంలో రైతులకు రుణమాఫీ అంశం ప్రస్తావించగానే సిఎం అదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బాబు  ఏమాత్రం తడుముకోకుండా కాంగ్రెస్‌ వారి అవినీతి ఆపితే రుణమాఫీ ఎంతో ఈజీ అని సమాధానమిచ్చారు. ఊహించని ఈ సమాధానంతో కొంత ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫొటోల కోసం ఇందిరమ్మ బాట కాదు తాము అధికారంలోకి వస్తే నిజంగా రుణమాఫీని అమలు చేస్తామని బాబు రైతులకు భరోసా ఇచ్చారు.

రాజధానిలో పురాతన వస్తువుల మాఫియా

  "font-size: larger;">రాష్ట్ర రాజధాని ట్విన్‌సిటీస్‌ కేంద్రంగా పురాతన వస్తువుల దందా సాగుతోంది. ఇక్కడి దందాను చూస్తే ముంబయ్‌, చెన్నయ్‌ వంటి నగరాలు కూడా ఎందుకూ పనికి రావన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆ నగరాలను తలదన్నే మాఫియాగ్యాంగులు ఇక్కడ దందా సాగిస్తున్నాయని పోలీసులకు సమాచారం అందుతోంది.   నేరానికి రేటు కట్టే మాఫియా ఇటీవల తన రూటు మార్చుకుని పురాతన వస్తువుల ఖరీదు పెంచుతోంది. అంతర్జాతీయంగా ఉన్న తమ సంబంధాలను పదిలం చేసుకుంటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దొంగలకు మాఫియా ఆహ్వానం పలుకుతోంది. ఐదు రూపాయల నోటుకు 50రూపాయలు చెల్లిస్తున్న మాఫియా ఆదేశాలు దొంగలు వరంగా  మారుతున్నాయ్.   నిజాం నవాబుల కాలంలో ఉన్న గుళ్లలో ఉన్న పంచలోహవిగ్రహాలపై కన్నేశారు. విదేశీయులు పురాతన వస్తువులకు కొన్ని శక్తులుంటాయన్న నమ్మకంతో మాఫియా నుంచి ఆభరణాలు, పురాతన వస్తువులు కూడా కొనుగోళ్లు చేస్తున్నారట. రియల్‌ఎస్టేట్‌ పేరిట మాఫియా దందాలో చాలామంది నిమగ్నమయ్యారని తెలుస్తోంది.   తాజాగా 12ముఠాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారంటే ఇంకా ఎన్ని ముఠాలు ఈ రెండు నగరాల్లో ఉన్నారో? ఈ ఏడాది అక్టోబర్‌ వరకూ ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటికి 27 ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాజాగా జరిగిన లాల్‌దర్వాజాలోని మహంకాళి ఆలయం, గొల్నాకలోని నల్లపోచమ్మ, ఉప్పుగూడలోని రెండు ఆలయాల్లో దొంగతనాలు ముఠాల పనితీరుకు అద్దం పడుతున్నాయి. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా తెలివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.   ప్రత్యేకించి స్టువర్టుపురం దొంగలు కూడా వీటిలో నిమగ్నమై ఉండవచ్చని అనుమానాలున్నాయి. చోరీ సొత్తును ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. అక్కడ తమ వారికి చెప్పి మాఫియా ఆ వస్తువులను సొంతం చేసుకుంటోంది. పోలీసుయంత్రాంగం దీనిపై దృష్టిసారించి పురాతన వస్తువులను, ఆభరణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

కాటన్‌ ఆనకట్టని కూల్చేస్తారా?

  తరాలు మారినా చరిత్ర చిరస్థాయిగా నిలుస్తుందనేది భారతీయవిశ్వాసం. అటువంటి విశ్వాసాలకు, నమ్మకాలకు, అభిమానాలకు అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా తిలోదకాలు ఇస్తుంటారు. అటువంటి ఘటనే ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద జరుగుతోంది.   గోదావరిపై సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ దొర నిర్మించిన ఆనకట్ట ఆయన్ని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా  చేసింది. 1850లో ఈ ఆనకట్టను నిర్మించారు. ఈ నిర్మాణం వల్ల బీళ్లువారిన పొలాలు గోదావరి జలాలతో సస్యశ్యామలమయ్యాయి. అందుకే పిల్లల పాఠ్యపుస్తకాల్లోనూ కాటన్‌కు చోటిచ్చారు. అంతటి పురాతన కట్టడమైన దుమ్ముగూడెం ఆనకట్టను జల విద్యుత్తు ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చినా వాస్తవానికి ఈ కట్టడాన్ని కాపాడుకునేందుకు కేంద్రం జీఓ కూడా విడుదల చేసింది.   2008లో విడుదలైన ఈ జీఓ ప్రకారం కేంద్రం పురాతనకట్టడాలను తొలగించరాదని, వాటి బదులు కొత్త నిర్మాణాలు చేపట్టాలని స్పష్టంగా పేర్కొంది. ఈ అంశాన్ని విద్యుత్తు ప్రాజెక్టు అధికారులు బేఖాతరు చేశారు. వీరిపై చర్యలు తీసుకునైనా కాటన్‌ నిర్మించిన ఆనకట్టను చారిత్రకచిహ్నంగా మిగల్చాలని స్థానికులు, చారిత్రకవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే తమ వ్యతిఏకతను వీరు విద్యుత్తు అధికారులకు తెలియజేశారు.

పాలడుగు వ్యాఖ్యలు కొంచెం కరెక్టే అనిపిస్తోందా?

  కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఊరికే ఒకరిపై నింద వేయరన్న నమ్మకం రాజకీయపరిశీలకులకు ఉంది. ఎందుకంటే హూందా అయిన రాజకీయతత్వాన్ని పాలడుగు ప్రతిబింబింపజేస్తారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్య రాష్ట్రం మొత్తం ఆలోచించేలా ఉంది. వైకాపాలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలంతా నీతినిజాయితీ లేనోళ్లే అని ఆయన తేల్చేశారు. అసలు ఈ మాట అందామనుకుని కూడా కాంగ్రెస్‌లో ఎందరో పెద్దలు వెనుకడుగు వేశారు.  కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ పార్టీలోనే జీవించారన్న భావన వారికి అడ్డువచ్చింది. పాలడుగు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారనటానికి ఇంకో తాజా ఉదాహరణ ఇది. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారం కట్టబెడితే ప్రలోభాలకు లోనై తమ తమ సొంతపార్టీలను వైకాపా కోసం నట్టేట ముంచుతున్నారని పాలడుగు ధ్వజమెత్తారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నీతి నిజాయితీ లేని వారికి టిక్కెట్లు ఇవ్వటం వల్లే ఈ దారుణస్థితి వచ్చిందని తేల్చారు. రాజకీయాల్లో కనీస విలువలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆశలను వమ్ము చేసిన ఈ వైకాపా నేతలందరూ ప్రజలకు వివరణ ఇవ్వాలని పాలడుగు డిమాండు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యల్లో కొసమెరుపు నిజానికి బంధుత్వం అడ్డురాదన్నట్లుంది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందేనని పాలడుగు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాలు విన్న వారందరూ పాలడుగు బాగా కరెక్టుగా మాట్లాడారేమిటీ అంటున్నారు.

మనీలాండ్రిరగ్‌ కింద జగన్‌కు శిక్ష పడితే?

  దేశంలోనే అతిపెద్ద నేరమైన మనీలాండ్రిరగ్‌ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి శిక్ష పడితే? ఈ ప్రశ్న తాము వినలేమంటున్నారు వైకాపా నేతలు, కార్యకర్తలు. ఇప్పటికే జగన్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ ఇంకా పట్టుబిగించి సిబిఐ ద్వారా జగన్‌ నేరాలను రుజువు చేసి దేశప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు తనకున్న అవకాశాలను వినియోగించుకోనుంది. దీని వల్ల భవిష్యత్తు ఏమిటో ఆ పార్టీ నేతలకే అర్ధం కావటం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే వరుస నిరసనలు, కార్యక్రమాలు చేసేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు వయస్సు అడ్డంకిగా ఉంది. ఈ వయస్సులో ఏదైనా అనారోగ్యం వస్తే అన్న భయంతోనే ఆమె కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇక ఆ పార్టీలోనే ఉన్న జగన్‌ సోదరి షర్మిల, జగన్‌ భార్య భారతి గురించి ఒకసారి ఆలోచిస్తే...షర్మిల కార్యక్రమాలు భుజాన్న మోసేందుకు సిద్ధంగానే ఉంది. కానీ, తన సోదరుడు జగన్‌ విడుదలవుతాడన్న నమ్మకంతోనే ఆమె కాలక్షేపంగా కార్యక్రమాలు సాగిస్తోంది. ఒకచోట మగ్గం నేసి మరోచోట కూలీలతో కలిసిపోయిన షర్మిల తాను తాత్కాలికం అన్న భావనను ముందుగానే ప్రతిబింబింప జేస్తోంది. జగన్‌ భార్య భారతి అయితే పూర్తిగా వ్యాపారాల్లోనే మునిగిపోయింది. తనకు పార్టీ కార్యక్రమాలకు అంతంతమాత్రమే అన్నట్లు ఆమె వ్యవహరిస్తోంది. ఈ దశలో జగన్‌ కనుక దోషి అయి శిక్ష అనుభవిస్తే పార్టీని ముందుకు నడపాల్సింది ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ మాత్రమే. ఆ కమిటీలో ఉన్న అందరికీ  ముక్కు మీద కోపం. కమిటీలో మైసూరారెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితర పెద్దతలకాయలు ఉన్నా జగన్‌ ఇక రాడని తెలిస్తే వారి భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా ఉండరనేది జగమెరిగిన సత్యం.

ఇక అంధకారంలో ఐదు జిల్లాల ప్రభుత్వకార్యాలయాలు?

  ఇపిడిసిఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అంధకారంలో మగ్గనున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోని కార్యాలయాల కరెంటుబిల్లులు చెల్లించకపోవటంతో ఇపిడిసిఎల్‌ విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. ఒక్క విశాఖ జిల్లాలోని మొత్తం 27 ప్రభుత్వ కార్యాలయాల బకాయి రూ.162కోట్లు అని లెక్క తేలటంతో ఇపిడిసిఎల్‌ పైనిర్ణయం అమలు చేస్తోంది. ప్రతీనెల బిల్లులు వసూలు చేస్తేనే కానీ, తమ సంస్థ నష్టాల్లో ఉందో? లాభాల్లో ఉందో తెలియని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలు బిల్లు చెల్లించకపోవటం సంస్థపై భారంగా ఉందని ఇపిడిసిఎల్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆల్‌రెడీ ఈ మేరకు చర్యలు తీసుకున్నామని వారు చెబుతున్నారు. ఈ కారణంగా విశాఖ జిల్లాలోని విద్యాశాఖలో విద్యుత్తుసరఫరా నిలిచిపోవటంతో అధికారులు ఛార్జింగ్‌లైట్లు తెచ్చుకుని విధులు నిర్వహిస్తున్నారు. అలానే మేజర్‌, మైనర్‌ పంచాయతీలు కూడా విద్యుత్తు బకాయిలు చెల్లించటం లేదు. మేజర్‌ పంచాయతీల నుంచి రూ.43కోట్లు, వైద్యఆరోగ్యశాఖ రూ.7.50కోట్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద రూ.6.63కోట్లు, మున్సిపాల్టీలు రూ.3.15కోట్లు, మున్సిపల్‌ కార్పొరేషన్లు రూ.1.63కోట్లు, హోంశాఖ రూ.1.37కోట్లు బకాయి ఉన్నట్లు ఇపిడిసిఎల్‌ వివరించింది.    

'షో'కు'' ‘కారు’ రెడీ?

  ప్రదర్శనకు కారు సిద్ధమైంది? అదేనండీ బాబూ! తెరాస(టిఆర్‌ఎస్‌) ఎన్నికల సింబల్‌ కారే కదా! అది ఇప్పుడు కొత్తగా బలప్రదర్శన చేయాలని నిశ్చయించుకుంది. తెలంగాణాలో ఉన్న నేతలందరినీ తన కారులోనే ఎక్కించేసుకోవాలని కేసిఆర్‌ ముచ్చటపడుతున్నారు. ఆయనకు తెలంగాణామార్చ్‌ తరువాత నేతలందరూ కలిసి ఉంటే తెలంగాణా వచ్చేసినట్లుంటుందనిపిస్తోందంట. అందుకే చిన్ననేతనైనా కలవటానికి కేసిఆర్‌ సిద్ధంగా ఉన్నారు. ఇకపెద్దనేతనైతే తన లాబీయింగ్‌ కళంతా ప్రదర్శించి లొంగదీసుకుంటారన్న మాట. అందుకే నిన్నటికి నిన్న పరిగి తెలుగుదేశం ఎమ్మెల్యే కె.హరీశ్వరరెడ్డిని లైనులో పెట్టారు. తాజాగా ఏమో తెలుగుదేశం నేత నాగం జనార్దనరెడ్డిని, వేణుగోపాలరెడ్డిని కూడా వశపరుచుకునేందుకు కసరత్తులు చేస్తున్నారట. కేసిఆర్‌ తనకున్న వశీకరణ శక్తులతో తెలంగాణాలో ఇంకో పార్టీ మిగల్చకుండా కలిపేసుకోవాలని ఆత్రుత పడుతున్నారు. ఎందుకంటే ఇంకో పార్టీ ఉంటే ఎన్నికలు లేకపోతే ఏకగ్రీవమే కదా! అందుకని అన్ని పార్టీల నేతలను కలిసి తనతో పాటు ఉద్యమించాలని కోరుతున్నారట. ఏమైనా టిఆర్‌ఎస్‌ కోరినట్లు చేసేందుకు ఈ చేతులు కలిపిన నేతలందరూ సిద్ధమయ్యారు. ఇంకా మరింత మందిని తమ నేత కలుస్తాడని టిఆర్‌ఎస్‌ నాయకులు చెప్పుకుంటున్నారు. వైకాపా తమపై ఏ ప్రభావం చూపలేదంటూ పరకాల ఎన్నికల్లో చెమటలు తుడుచుకున్న కారు నేతలందరూ జగన్‌ బాటలో నేతలను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారన్న మాట.

తెలంగాణాకు కట్టుబడని బిజెపి? అధికారం కోసమేనా అప్పుడు లొంగింది?

  దేశంలోనే ప్రత్యేక తెలంగాణా డిమాండును ఆదరించిన పార్టీ బిజెపి. ఇది అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకమునుపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జాతీయ సమావేశాలను నిర్వహించుకుంది. ఆ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణా ఇస్తామని ప్రకటించుకుంది. అనంతరం అధికారంలోకి ఎన్‌డిఎ కూటమి వచ్చింది. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా చేరింది. ఆ పార్టీ మద్దతు వల్లే కేంద్రంలో అధికారం అనుభవించిన బిజెపి ఆ తరువాత ఎన్నికల్లోనే ఓటమి పాలైంది. జాతీయస్థాయి పార్టీ కాస్తా ప్రాంతీయపార్టీలతో పోటీపడే స్థాయికి చేరింది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ నేత లాల్‌కృష్ణ అద్వానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి ఉంటే తెలంగాణా ఇచ్చేసి ఉండేవారమంటున్నారు. అప్పట్లో తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అవసరమైతే తాము మద్దతు ఉపసంహరించుకుంటాం కానీ, తెలంగాణా ప్రత్యేకరాష్ట్రానికి మద్దతు ఇవ్వబోమని నిర్ణయాన్ని వెల్లడిరచింది. తాజాగా పెరిగిన ఒత్తిడులకు తెలుగుదేశం పార్టీ కొంత లొంగినమాట నిజమే. కానీ, ఇప్పటికీ సమైక్యతాభావనలను ఆ పార్టీ ప్రతిబింబింపజేస్తోంది. అందువల్ల అప్పట్లో అధికారం కోసం బిజెపి తమ తీర్మానాన్ని గాలికి వదిలేసింది. ఎక్కడ తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటుందోనని అసలు ఆ రాష్ట్ర ప్రతిపాదనే పెట్టలేదు. అధికార కాలం ముగిశాక మళ్లీ నెపం మాత్రం తెలుగుదేశం పార్టీపైకి నెడుతోంది.

అశ్లీల చిత్రం వుమెన్ ఇన్ బ్రాహ్మిణిజం

  సినిమాలలో ఆడవారిని అశ్లీలంగా చూపడం మామూలైపోయిందని, కధలు కూడా అందుకు తగ్గట్లుగానే తయారవుతాయి, హీరో కాస్త ఏడిపించడానికి, లేదా రెండు మూడు పాటలు విదేశాలలో తీయడానికి అంతకు మించి ఉపయోగం ఉండటం లేదంటున్నారు మహిళా ప్రేక్షకులు.  ఇదివరలో హీరోయిన్స్ కి కాస్ట్యూమ్ ఖర్చులుండేవి. ఇప్పటి నిర్మాతలకు అలాంటి ఖర్చులుండటం లేదంటున్నారు పాతతరం ప్రేక్షకులు. అయితే ఇంతకన్నా దారుణంగా నీలి చిత్రానికి  ఎ విమెన్ ఇన్ బ్రాహ్మిణిజం పేరుతో నిర్మాత, ధర్శకుడు గంగాధర్ తీసారని మహిళలు ఛీత్కరిస్తున్నారు. ఇది కేవలం పేరుకు మాత్రమే భ్రాహ్మణ అని ఉందని, చిత్రం మొత్తం స్త్రీలను కించపరిచేదే అని ప్రేక్షకులు చెబుతున్నారు. దర్శకుడు చలం పేరును ఉపయోగించుకుంటూ తన వికారపు చేష్టలన్నీ బయట పెట్టుకున్నారని  విమర్శకులు చెబుతున్నారు. అంతే కాకుండా సినిమా డైరక్టర్ అనాధాశ్రమంలోని వారితో యాక్టు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. నెగెటివ్ టాక్ తో  సినిమా ప్రమోషన్ కోసం ప్రముఖ ఛానల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  సాటి విశ్లేషకులు, ఫోన్స్ చేసిన ఆడియన్స్ పిచ్చి తిట్లు తిట్టారు. అసలు  ఈ సినిమా తీయటానికి ఖర్చు చేసిన డబ్బులే  ఒంగోలు నుండి కర్నూలు వెళ్లే దారిలో ఉన్న గ్రానైట్ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించినవే అని ఆరోపణలు వినవస్తున్నాయి. మహిళలను అందంగా, గౌరవంగా సినిమాల్లోచూపక పోయినా పర్యాలేదు కాని ఇలాంటి చెత్త సినిమాలు తీయాయని కూడదని మహిళా సంఘాలు హెచ్చరిస్తూ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపి వేయాలని కోరుతున్నారు.

సెలబ్రటీలు కాస్త ఆలోచించండి

  వన్ నేషన్ వన్ కార్డ్ పేరుతో దేశమంతా తమ సేవలను విస్తరిస్తున్నామని సెలబ్రటీలను బుక్ చేశారు వికె సాయికుమార్. వివరాల్లోకి వెళితే వన్ కార్డు లోనే భ్యాంకింగ్ సేవలు, ఆధార్, ఐడెంటిటి ఇంకా అనేక సర్వీసులను  అనుసంధానం చేశామని దాని ప్రచారానికి గానూ సౌరవ్ క్రికెటర్ సౌరవ్ గంగూలీని, మంత్రి పోన్నాలక్ష్యయ్యను, సినీతార నమిత, నేషనల్ ఐడల్  శ్రీరమ్, హాస్యనటుడు గండు హనుమంతరావుని తీసికొచ్చి ప్రచారం చేయించారు. అందులో భ్రాండ్ అంబాసిడర్ గా నమితను నియమించారు. సాంకేతిక అంశాలను పరిశీలించిన కొంతమంది దీని పని తీరుపై అద్యయనం చేసి కాస్త తీగలాగేటప్పటికి సాయికుమార్ ఇంత మందితో ప్రమోట్ చేయించడానికి డబ్బు ఎక్కడిదా అని ఆరా తీస్తే అదికాస్త మైనారిటీ కార్పొరేషన్ దని బయటికొచ్చింది దాంతో  ఈ సెలబ్రటీలకందరికీ తలనోప్పి వచ్చింది. తాజాగా పోలీసులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది బయటకు లాగుతున్నారు. ఇంతకు ముందు కూడా గంగూలీ ఒక టివి కార్యక్రమంలో ఒక కంపెనీని ప్రమోట్ చేస్తూ చేసిన కార్యక్రమంలోని విజేతలకు డబ్బులివ్వలేదని కూడా గలాటా జరిగింది. కాబట్టి సెలబ్రటీలు కాస్త ఆలోచించుకొని కార్యక్రమాలకు హాజరయితే బావుంటుందని ప్రజలు భావిస్తున్నారు. లేదంటే ఉన్న పేరు పోగొట్టు కోవలసి వస్తుందంటున్నారు.

మళ్లీ మోడీ రాజ్యమే

  గుజరాత్ ఓటర్లు మళ్లీ మోడీకే పట్టం కట్టాలని చూస్తున్నరు. తాజా సర్వేల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా టుడే జరిపిన సర్వేలో అరవై శాతంమందికిపైగా గుజరాత్ ఓటర్లు మోడీవైపే మొగ్గుచూపుతున్నట్టు తేలింది. మైనారిటీల్లోకూడా మోడీని ఇష్టపడేవాళ్ల శాతం అరవైని మించిపోయింది. మోడీ డైనమిజం, అభివృద్ధి మంత్రం.. గుజరాత్ మీద బాగా పనిచేశాయి. గోద్రా అల్లర్లమచ్చని చాకచక్యంగా తుడిచేసుకోగలిగిన మోడీకి దేశంలోనే కాదు యూకేలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అల్లర్లలో నష్టపోయినవాళ్లకి మోడీ పూర్తి న్యాయం చేశారని నమ్ముతూ ఇటీవలే యూకే.. గుజరాత్ పై ఆర్థిక ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసింది. ఇంకా చాలా దేశాలనుంచి గుజరాత్ కి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయ్. మూడోసారికూడా మోడీకే పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న వార్త బిజెపితోపాటు ఇతర పార్టీల్లోనూ క్రేజ్ పుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో కాబోయే ప్రథాని అభ్యర్థి అన్న ప్రచారానికి రోజురోజుకీ బలం పెరుగుతోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ తరఫున ప్రథాని పీఠానికి రాహుల్ గాంధీ పోటీ పడితే బిజెపి తరఫున మోడీ బరిలోకి దిగుతారని దేశంలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అదే గనక జరిగితే రాహుల్ తో పోలిస్తే మోడీకే ఎక్కువ చరిష్మా ఉంది కనక ఆయనకే ప్రధానిపదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కమలనాధులు గట్టిగా చెబుతున్నారు.

రంగంలోకి దిగిన రాహుల్ సేన

  దేశంలో ముందస్తు ఎన్నికల హల్ చల్ మొదలయ్యింది. బరిలోకి దిగిన రాహుల్ సేన గెలుపు గుర్రాలకోసం వేట మొదలుపెట్టింది. ఎవరెవరి సత్తా ఏంటి? ఎవరికి టిక్కెట్టిస్తే గెలుస్తారు? ఎవరెంత వేగంగా పనిచేయగలరు? ఎవరికి జనంలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది? ఎవరు విధేయత కలిగిఉంటారు? ఉన్నవాళ్లకే టిక్కెట్టివ్వాలా? లేక క్యాండిడేట్ ని మార్చాల్సొస్తే ఎవర్ని ఎంపిక చేసుకోవాలి? ఎవరికి అంగబలం, ఆర్థికబలం పుష్కలంగా ఉన్నాయ్? అనే విషయాల్ని 50మంది సభ్యుల రాహుల్ టీమ్ జల్లెడ పడుతుంది. రాహుల్ ఎంపిక చేసుకున్న 50 మంది సభ్యుల టీమ్ లో ఏపీనుంచి ఏడుగురికి చోటు దక్కింది. రుద్రరాజు పద్మరాజు, కె.యాదవరెడ్డి, కందుల లక్ష్మీ దుర్గేశ్, భానుప్రసాద్, మాజీ  ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవాని రాహుల్ సేనలో సభ్యులయ్యారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన జట్టుని మరో రాష్ట్రానికి పంపి నిజాలను నిగ్గుతేల్చేందుకు రాహుల్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏపీలో పర్యటించబోతున్న టీమ్ సభ్యుల వివరాలు మాత్రం బైటికి పొక్కడం లేదు. ప్రజలతో ముఖాముఖీ మాట్లాడడం, వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకోవడం రాహుల్ సేన పని. జనసామాన్యంలో ఉన్న అభిప్రాయాల్ని కచ్చితంగా అలాగే రాహుల్ కి చేరవేయాల్సిన బాధ్యత కొత్త టీమ్ పై ఉంటుంది. కింది స్థాయి నేతలనుంచి, లోక్ సభ అభ్యర్ధులు, మాజీ లోక్ సభ అభ్యర్ధులు, మంత్రుల స్థాయివరకూ రాహుల్ సేన అభిప్రాయ సేకరణ చేస్తుంది. విలువైన సమాచారాన్ని క్రోడీకరించి రాబోయే రోజుల్లో కాబోయే ప్రథానమంత్రిగా కాంగ్రెస్ వర్గాలు బలంగా నమ్ముతున్న రాహుల్ కి అందచేస్తారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకా బాధ్యతలు చేపట్టనప్పటికీ ప్రథాన కార్యదర్శి హోదాను దాటి పనిచేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందని పార్టీలో సీనియర్ నేతలు చెప్పుకుంటున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభపరిణామం దగ్గర్లోనే ఉందని, త్వరలో రాహుల్ చేతికి అధికార పీఠం దక్కబోతోందని సంబరపడుతున్నారు. అంతా సవ్యంగా ఉంటే, అవకాశం ఉందనుకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుక్కూడా రాహుల్ గాంధీ సమాయత్తమవుతున్నారన్న ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయ్.

రాహుల్‌సేనలో తూర్పు ఆధిక్యం?

  అఖిల భారత కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ తన తరుపున ఓ 50మందితో ఏర్పాటు చేసిన సేనలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, కందుల లక్ష్మీ దుర్గేశ్‌ గురించి రాష్ట్రంలో తెలియని వారు లేరు. వీరు తూర్పుగోదావరి జిల్లాలోని కాంగ్రెస్‌ నేతల తలలో నాలుకలా మెదులుతారు. ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా ఉంటారు. అటువంటి వీరికి రాహుల్‌సేనలో కీలకమైన బాధ్యతలు దక్కటం తూర్పుగోదావరి వాసులను ఆనందానికి గురి చేసింది. రాజకీయ సమీకరణలు లెక్కించటంలోనూ వీరిద్దరూ దిట్టలే. సమీకరణల ఆధారంగానే తమ అభ్యర్థుల్లో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందో కూడా లెక్కించే అనుభవం సహజంగానే రుద్రరాజుకు అలవాటు. మీడియా వేసే అంచనాల్లో లోపాలను కూడా ఈయన ఎన్నోసార్లు ఎత్తిచూపిన సందర్భాలూ ఉన్నాయి. ఇక కందుల లక్ష్మీ దుర్గేష్‌ అభ్యర్థుల నడవడిక ఆధారంగా వారు ఎంతకాలం పార్టీ మారకుండా సేవ చేయగలరో అంచనా వేయగలరు. ఈయన అంచనా ఇప్పటి వరకూ తప్పలేదని రాజమండ్రి వాసులు బళ్లగుద్ది మరీ చెబుతుంటారు. వీరిద్దరినీ జాతీయస్థాయిలో ఉపయోగించటం వల్ల వారి మేధస్సు పెరిగి భవిష్యత్తులో పరిణతి చెందిన రాజకీయనాయకులుగా ఎదిగే అవకాశాలుంటాయని జిల్లావాసులు భావిస్తున్నారు.

ఇక ప్రజాభిప్రాయంపైనే 2014 కాంగ్రెస్‌ టిక్కెట్లు...రంగంలోకి దిగిన రాహుల్‌సేన?

  ప్రజల్లో నమ్మకం ఉన్న నేతలకే కాంగ్రెస్‌ పార్టీ 2014 ఎమ్మెల్యే, ఎంపి టిక్కెట్లు ఇవ్వనున్నారు. ఇది కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. దీని కోసం 50మందితో ఒక టీమును కూడా ఏర్పాటు చేశారు. ఈ టీము ముందస్తుగా ప్రతీ నియోజకవర్గంలోనూ పర్యటించి పరిశీలించి ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. దీన్ని బట్టి అభ్యర్థులు ఎవరో కాంగ్రెస్‌ అధిష్టానం ముందుగానే లిస్టు చేసుకుంటుంది. ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తయినా ఎన్నికలు వచ్చేంత వరకూ ఎవరికి టిక్కెట్లు ఇవ్వనున్నారో రహస్యంగానే ఉంచేందుకు టీముకు రాహుల్‌ సూచనలు ఇచ్చారు. ముందుగా కేంద్రంలో అధికారం సుస్థిరం చేసుకునేందుకు రాహుల్‌ పార్లమెంటు నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నారు. ఆ తరువాత రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకూ ఇదే తరహా ఎంపిక జరగనుంది. బలమైన అభ్యర్థి అయితేనే టిక్కెట్టు ఇవ్వాలని లేకపోతే వారిని వదుల్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలని రాహుల్‌ భావిస్తున్నారు. స్థానికంగా ఉండే కులసమీకరణలు, రాజకీయ విశ్లేషణలు కూడా ఈ 50మంది పూర్తి చేసి ఆ తరువాత అభ్యర్థుల వివరాలను పార్టీతో ప్రకటింపజేసేలా రాహుల్‌ ఏర్పాట్లు చేశారు. బెంగుళూరులో తాజాగా సమావేశమైన ఈ సేనలో రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, కె.యాదవరెడ్డి, కందుల లక్ష్మీ దుర్గేశ్‌, భానుప్రసాద్‌, రాష్ట్ర మహిళాకాంగ్రెస్‌ అధ్యక్షురాలు కె.గంగాభవానీ ఎంపికయ్యారు.

బాబు ప్రసంగంలో పెరుగుతున్న పదును?

  మీ కోసం వస్తున్నా పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు మాటల్లో పదును రోజురోజుకు పెరుగుతోంది. మొదటి కిలోమీటరు పూర్తి చేసినప్పుడు చేసిన ప్రసంగానికి ఆ తరువాత చేస్తున్న ప్రసంగానికి ఎంతో వ్యత్యాసం ఉంది. పాదయాత్రలో తాను తెలుసుకున్న పలుఅంశాలను ప్రజల ముందే పెట్టి తనకు అధికారం వస్తే తప్పకుండా ఆ సమస్య పరిష్కరిస్తానని ఆయన ప్రత్యేకించి నొక్కి చెప్పటం రాజకీయవిశ్లేషణలో అనుభవాన్ని చాటుతోందని పరిశీలకులు కొనియాడేందుకు కారణమవుతోంది. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తన ఐదువందల కిలోమీటర్ల పాదయాత్రలో గట్టిగానే ప్రజల ముందుకు తీసుకువచ్చారు. సందర్శకులతోనూ, ప్రజలతోనూ మమేకమైన బాబు తన ఊపిరి ఉన్నంత వరకూ ప్రజాసేవ చేస్తానని ఘాటుగా విమర్శకులకు సమాధానం ఇచ్చారు. రైతులకు తొమ్మిది గంటల పాటు విద్యుత్తు, సిఎం కుర్చీ ఎక్కగానే రైతుల బ్యాంకు రుణాల మాఫీ ఫైలుపై తొలిసంతకం చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకూ ఏమంత స్పందన ఉంటుందని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌ కూడా బాబు ప్రసంగాలకు ఉలిక్కిపడుతోంది. మహిళల ఇబ్బందులు కనుక్కుంటూనే వారికి మద్యం బెల్టు షాపు ఒక్కటీ కనపడకుండా చేస్తానని హామీ ఇచ్చారు. బడుగులకు తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

వైకాపాను నీట ముంచే బాధ్యత కోట్లదేనా?

  మాట్లాడితే చాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఫలానా ఎమ్మెల్యే రెడ్డి చేరారట కదా అని వచ్చే ప్రశ్నలతో కాంగ్రెస్‌ విసిగిపోయింది. అందుకే ఆ పార్టీ పుట్ట ముంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు కారణమైన రెడ్డి సామాజికవర్గంపై దృష్టి సారించింది. ఆత్మీయ సదస్సులు, పదవుల ఆశలు, ఇంకేరకమైన మంతనాలు చేసినా పర్వాలేదంటూ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సూర్యప్రకాశరెడ్డి చేయాల్సిన పని ఒక్కటే వైకాపాను తుడిచేయటం అని తేల్చేసింది. అధిష్టానం ఇచ్చిన అవకాశంలో స్వేచ్ఛ కూడా కలిసి రావటంతో కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఇప్పటి వరకూ వైకాపాలో చేరిన రెడ్డి సామాజికవర్గ నేతలపై దృష్టి సారించారు. ప్రత్యేకించి వారితో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ రెడ్డిసామాజిక వర్గానికి చెందరని, ఆయన వెనుకుంటే తప్పుడు పనులు చేసే సామాజికవర్గంగా రెడ్డికులాన్ని పరిగణిస్తారని సూర్యప్రకాశరెడ్డి స్పష్టం చేయనున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగితే మంచి పదవులు కూడా అందించగలమని, ఎప్పటి నుంచో రెడ్డి కులస్తులకే సిఎం కుర్చీ అప్పగించిన కాంగ్రెస్‌ సేవలను మరువరాదని ఆయన హితవు పలకనున్నారు. ఇలా జగన్‌ను అన్నిరకాల నష్టపరిచేందుకు పావులు కదుపుతున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి రాయలసీమలో ఆదరణ కూడా ఎక్కువే కావటం గమనార్హం. మంచి కుటుంబంగా ఉన్న పేరును ఉపయోగించుకుని ఆయన ఆత్మీయభేటీలకు శ్రీకారం చుట్టనున్నారు.