నిధులున్నా రంగారెడ్డి జిల్లాను పీడిస్తున్న అనారోగ్యం?

  అన్ని జిల్లాల్లోనూ ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకు నిధుల కొరత వెంటాడుతోంది. అటువంటిది నిధులున్నా రంగారెడ్డి జిల్లాను అనారోగ్యం పీడిస్తోంది. అధికారుల అశ్రద్ధ, నిర్లక్ష్యం పరాకాష్టకు చేరటం వల్ల ఈ నిధులను వినియోగించుకోవటమే మానేశారు. రాష్ట్రరాజధానితో కలుపుకుని ఉన్న ఈ జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలా అని సామాజిక ఆరోగ్య పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఈ జిల్లాలోని అన్ని పీహెచ్‌సిలకు రూ.70.50లక్షలను రెండు సార్లు విడుదల చేశారు. అయితే ఈ నిధుల్లో సగం కూడా వినియోగించలేదని పరిశీలనలో తేలింది. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. అంటురోగాలు ప్రబలుతాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు గురించి అధికారులను ప్రశ్నిస్తే మౌనం వహిస్తున్నారు. జననీ శిశు సంరక్షణ కింద గతేడాది రూ.1.90లక్షలు విడుదల చేస్తే దాన్ని అస్సలు ఖర్చు పెట్టలేదు. దీంతో ఆ నిధుల విడుదల ఆగిపోయింది. మొత్తంగా గతేడాది ఈ నిధుల్లో రూ.4,440 ఖర్చు చేశారు. గతేడాది ఆశావర్కర్లకు యూనిఫారాలకు రూ.తొమ్మిది లక్షలు విడుదల చేశారు. ఆ నిధులు పక్కదారి పట్టడంతో ఈ ఏడాది ఆ నిధులు కూడా విడుదల కాలేదు. అలానే సబ్‌సెంటర్‌ అన్‌టైడ్‌ఫండ్స్‌, ఫ్యామిలీప్లానింగ్‌, హాస్పటల్‌ డెవలప్‌మెంట్‌, ఆన్యువల్‌ డెవలప్‌మెంట్‌ నిధులను సక్రమంగా వినియోగించకపోవటంతో వాటిని కూడా ఆపేశారని సమాచారం. కుటుంబనియంత్రణకు గతేడాది రూ.27.06లక్షలు విడుదలయ్యాయి. దీన్ని వినియోగించలేదు. అందువల్ల ఈ ఏడాది నిధులు తగ్గించేశారు. జననీసురక్ష పథకం నిధులు విడుదలైనా అదీ వినియోగించలేదని తెలుస్తోంది.

కేసిఆర్‌ను ఎవరు కలిసినా వార్తే?

  ఢల్లీలో సుదీర్ఘలాబీయింగ్‌ నడిపి తెలంగాణా సాధిస్తానని బీరాలు పలికిన టిఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావును ఇప్పుడు ఎవరు కలిసినా పెద్ద వార్త అవుతోంది. ఎందుకంటే ఆయన ఢల్లీ స్థాయిలో కాంగ్రెస్‌ పెద్దలతో పెద్దలాబీయింగ్‌ నడిపారని తెలంగాణావాదులు నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణాజెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను కేసిఆర్‌ లాబీయింగే హీరోను చేసిందని చెప్పుకోవాలి. ఈయన ఎవర్ని కలిసినా వార్త అయ్యే పరిస్థితి కేసిఆర్‌ చలువ వల్ల వచ్చినదే. తాజాగా పీసిసి చీఫ్‌ బొత్సా సత్యన్నారాయణ తన కుమార్తె వివాహానికి కేసిఆర్‌ను ఆహ్వానించేందుకు కలిశారు. వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు? నవంబర్‌ 2న జరిగే బొత్సా కుమార్తె వివాహానికి కేసిఆర్‌ వెడతారా? అదీ కుటుంబ సమేతంగా రమ్మనమని బొత్సా పలికిన ఆహ్వానం కేసిఆర్‌ ఉపయోగించుకుంటారా? బొత్సాకుమార్తె వివాహానికి కాంగ్రెస్‌ ఢల్లీ నేతలు కూడా వస్తారని భావిస్తున్నారు. వీరితో మాట్లాడేందుకు కూడా ఈ వివాహవేదిక ఉపయోగపడగలదని కేసిఆర్‌ సన్నిహితులంటున్నారు. అందువల్ల బొత్సా ఆహ్వానం ఉపయోగించుకుంటే ప్రత్యేకించి కొంతకాలం ఢల్లీ వెళ్లాల్సిన పని తప్పుతుందని కేసిఆర్‌కు సన్నిహితులు సూచిస్తున్నారట. ఈ సూచనను కేసిఆర్‌ పాటించే అవకాశమూ ఉంది. వ్యక్తిగతమైన ఆహ్వానాలు వార్తలుగా మలచటం వరకూ ఓకే. కానీ, ఇంత సీరియస్‌గా రాజకీయ చర్చకు తావిస్తోందంటే కేసిఆర్‌ను ఎవరు కలిసినా వార్తే అంటున్నారు సీనియర్‌ జర్నలిస్టులు కూడా. కాంగ్రెస్‌ పార్టీలో వారైతే మరీ ప్రాముఖ్యత ఉన్న వార్తంటున్నారు. గతంలో బొత్సా ఒకసారి తెలంగాణాకు మద్దతుపలకటం, ఇప్పుడు కుమార్తె వివాహానికి ఆహ్వానించటం పరిశీలించతగ్గ అంశాలని నొక్కి చెబుతున్నారు.

షర్మిలపై కాలుదువ్వుతున్న అనురాధ? టిడిపి కొత్త ఎన్నికల అస్త్రం?

  తెలుగుదేశం పార్టీ తమ తరుపున కొత్తగా నేతలను రంగంలోకి దించేందుకు కసరత్తులు చేస్తోంది. దానిలో భాగంగానే కొందరు నేతలను విమర్శనాస్త్రాలతో మాటలను పదును పెట్టుకోమని (2014ఎన్నికల కోసం) ఆ పార్టీ వారిని పరిశీలిస్తోంది. పైగా, వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలను ఎదిరించటం అలవాటుపడే మహిళానేతలకు పెద్దపీట వేసేందుకు సైతం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ పెద్దగా స్పందించని ఆ పార్టీ మహిళానేతలు తమ అధినేత పాదయాత్ర సందర్భంగా తమ ఘాటైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఓ అస్త్రం వెలుగులోకి వచ్చింది. ఆమే తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి పంచుమర్తి అనురాధ. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ సోదరి షర్మిలతో తలపడేందుకు తాను సిద్ధమని ఆమె ప్రకటించారు.  పేదరైతుల భూములను దోచుకున్న ద్రోహి వైఎస్‌ అని ఆమె ఘాటుగా విమర్శిస్తూ తాను షర్మిలతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించే అర్హత షర్మిలకు లేదని ఆమె అన్నారు. జగన్‌ ఒక దొంగ అని సిబిఐ, ఈడీ ఎప్పుడో చెప్పారన్నారు. దొరసాని కథలు చెబుతూ పాదయాత్రలతో షర్మిల కాలం గడపటాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. వైఎస్‌ హయాంలో దాదాపు 15వేల మంది రైతులు చనిపోయారని ఆమె అంచనా వేశారు. తాను చేసిన ఆరోపణలపైనే కాకుండా షర్మిల చేసిన వ్యాఖ్యానాలపైనా తాను సమాధానం చెప్పగలనని, తనతో బహిరంగ చర్చకు షర్మిల సిద్దమా అని సవాల్‌ విసిరారు.

తమిళం తరహాలో తెలుగుభాషను గుర్తించరెందుకు?

  పొరుగున ఉన్న తమిళనాడు మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాలు తెలుగులో ఎందుకు ముద్రించటం లేదు? భాష ప్రాముఖ్యతను ఎందుకు గుర్తించటం లేదు? ఈ రెండు ప్రశ్నలు మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నాయి. భాషపై తెలుగుప్రజలందరికీ మమకారం ఉన్నా అమలులో మాత్రం ఇంగ్లీషును ఉపయోగించటానికి ప్రతీ ఒక్కరూ అలవాటుపడిపోయారు. ప్రత్యేకించి పిల్లలను కూడా విశ్వజనీయంగా తీర్చిదిద్దాలని ప్రతీ తెలుగు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. దీంతో ప్రైవేటు కాన్వెంటులు, కార్పొరేట్‌ సంస్థలు తెలుగులోనే బోధించే ప్రభుత్వ పాఠశాలల కన్నా ఎక్కువ ఆదరణను పొందుతున్నాయి. తెలుగుభాషోపాధ్యాయుడు కూడా తమ పిల్లలు ఇంగ్లీషు మాట్లాడితే ఆనందిస్తున్నాడు. బయటికి వచ్చినప్పుడు మాత్రమే తెలుగుపై ప్రేమచూపిస్తున్నారు. పైగా, తెలుగుభాషలో పరభాషాపదాలు ఇట్టే చొచ్చుకుపోతున్నాయి. వాటిని ఆదరించి తెలుగుభాషలో మాట్లాడటానికి యువత సిగ్గుపడుతున్నారు. ఇటువంటి సమాజపోకడలకు నేతల వైఖరి కూడా తోడైంది. ప్రభుత్వం ప్రతీసారీ తమ ఆదేశాలు తెలుగులోనే వెలువరిస్తామంటూ భీషణప్రతిజ్ఞలు చేయటానికి అలవాటుపడిరది. ఆచరణలో మాత్రం దానిపై శ్రద్ధ చూపటం లేదు. ప్రత్యేకించి తమిళనాడులో ప్రభుత్వ ఆదేశాలు తమిళంలో ప్రచురించటానికి కారణం పరిశీలిస్తే యావత్తు నేతలందరూ కలిసికట్టుగా అమలు చేయటానికి కంకణబద్ధులయ్యారు. వీరితో పాటు ప్రభుత్వమూ ఆచరణకు నడుం కట్టింది. అంతేకాకుండా తమది ప్రాచీనభాష అని చాటుకునేందుకు ఆ ప్రభుత్వం పలురకాల శాసనాలను ప్రచారం చేసింది. ఆ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తే తాజాగా అధికారభాషాసంఘానికి తోడు లభించినట్లే. లేకపోతే తెలుగుభాష తన పటుత్వాన్ని, గుర్తింపును కోల్పోతుందని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మార్పు వస్తేనే ఇది సాధ్యమని కూడా పరిశీలకులు తేలుస్తున్నారు.

ఆదరణ’తో బాబుకు ప్రజాదరణ?

  తొమ్మిదేళ్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్రపాలనలో అత్యంత కీలకమైన పథకం ఆదరణ. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేసేవారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేయటమే మానేసింది. అందువల్ల వృత్తులపై కాంగ్రెస్‌కు పెద్దగా పట్టు చిక్కలేదనే చెప్పాలి. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీ కోసం వస్తున్నా పాదయాత్రలో వృత్తిదారులు ఆ పథకాన్ని గుర్తు చేశారు. తమకు పనిముట్లు కొనుక్కోవాలంటే పెరిగిన కుటుంబభారం, ఖర్చులు ఆయన ముందుంచారు. అసలే తెలుగుదేశం పార్టీకి 2012 ఉపఎన్నికల్లో ఓటమికి వృత్తిదారుల సహకారం లేకపోవటమే కారణమని గుర్తించారు. అందువల్ల వృత్తిదారులకు ఉత్సాహాన్ని నింపేందుకు చంద్రబాబు ఆదరణ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఇప్పటికే బిసి డిక్లరేషను ప్రకటించిన తొలిపార్టీగా ఉన్న తెలుగుదేశం వృత్తిదారులకు మరింత దగ్గరయ్యేందుకు అవకాశం లభించింది. తనతో పాటు పార్టీ శ్రేణులు కూడా వృత్తిదార్లకు పూర్తిస్థాయి సహకారమందిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ కూడా వృత్తిదార్లను ఆకట్టుకుంది. ఇప్పటిదాకా తమ తరుపున అధికారులను ప్రశ్నించేవారే కరువయ్యారని బాబును వృత్తిదారులు ఆదరిస్తున్నారు.

కావూరి, విహెచ్‌కు ప్రమోషన్‌?

  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసం తృప్తితో ఉన్న ఎంపీ కావూరి సాంబశివరావు, వి.హనుమంత రావుకు ఏఐసిసిలో కీలక స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చినట్లు సమాచారం. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిం చడం ద్వారా వారిలో నెలకొన్న అసం తృప్తి కి చెక్‌పెట్టాలని అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా వారి సీనియా రిటీకి తగిన గౌరవం కల్పించినట్లవుతుందని పార్టీ అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోంది. రెండేళ్లలోపు కేంద్ర, రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశమున్నందున పార్టీ పదవులే కీలకమవుతాయన్న భావనను కలిగించి ఈ ఎంపీల్లో ఉన్న అసంతృప్తిని పారద్రోలాలి అని నాయకత్వం భావిస్తోంది. త్వరలో ఏఐసిసిలో ప్రక్షాళన చేయాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. రేండేళ్లలోపు లోక్‌సభకు సాధారణ ఎన్ని కలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని విజయపథంలో నడిపించేలా ఏఐసిసి కొత్త టీంను ఏర్పాటుచేసుకోవాలని సోనియా ఆలోచనగా కనిపిస్తు న్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంపీలు కావూరి సాంబశివరావు, వి.హనుమం తరావుకు ఏఐసిసి స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కావూరికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశముందని పార్టీ ముఖ్యనేతలు కొందరు పేర్కొంటున్నారు.

వన్‌సైడ్‌ ప్రేమ పిచ్చ!

  నేటి తరం యువకుల ఏకపక్ష ప్రేమలు యువతులకు అనేక అనర్థాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించడం, తిరస్కరణకు గురైతే పగ, ప్రతీకారాలు పెంచుకోవడం నేటి యువతలో ప్రమాదకర పోకడగా మారింది. అమెరికాలో ముక్కుపచ్చలారని పసికందు శాన్వి హత్యకు గురికావడానికి, వరంగల్‌ జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని సహచరులే హత్య చేయడానికి, ఇంకా అనేక చోట్ల యాసిడ్‌ దాడులకు, హత్యలకు కారణమవుతున్నది ఈ ప్రమాదకర పోకడ. నైతిక విలువల పాఠాలు లుప్తమైన విద్యావిధానం ఈ ప్రమాదకర పోకడకు ప్రధాన కారణంగా వుందన్నది నిపుణుల విశ్లేషణ. యువతీ యువకులు పరస్పరం ప్రేమించుకోవడం ఎంత సహజమో, ఏకపక్ష ప్రేమలు కూడా అంతే సహజం. ఏకపక్ష ప్రేమికులు చేయవలసింది అవతలి వ్యక్తిని బలవంతంగా సంసార చట్రంలో ఇరికించడం కాదు. ఆ ప్రయత్నం విఫలమైతే హతమార్చడం కాదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. తాను ప్రేమించిన వ్యక్తి ఇష్టానిష్టాలను, మనోభావాలను గ్రహించి, తన ప్రేమోద్వేగాలను త్యాగం చేయడమే నిజమైన ప్రేమ అని యువకులు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో? ‘నీ సుఖమే నే కోరుకున్నా... నినువీడి అందుకే వెళుతున్నా’ అని అక్కినేని సినిమాలో వినిపించే పాత పాట యువతకు స్ఫూర్తిదాయకం కావాలి.

సిబిఐ జేడీ సందడి ఎక్కడ?

  జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, సమన్లు, అరెస్టులతో సంచలనం సృష్టించిన సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ పేరు ఈ మధ్య వార్తలలో ఎక్కడా కనపడడం లేదు. జగన్‌ అరెస్టు తర్వాత లక్ష్మీనారాయణను రియల్‌ హీరోగా కీర్తిస్తూ, ఆయన ధైర్యాన్ని అభినందిస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అయితే ఆయన ఫోన్‌ సంభాషణల వివాదం తర్వాత సైలెంట్‌ అయిపోయినట్టు కనిపిస్తోంది. జగన్‌ కేసుకు సంబంధించి రాజకీయ స్థాయిలో ఏవైనా రాజీ ఒప్పందాలు కుదిరాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనికి తోడు ఈ కేసులో ఒక్కొక్కరికి నెమ్మది నెమ్మదిగా బెయిల్‌ మంజూరు అవుతోంది. మరోవైపు మంత్రులు ధర్మాన ప్రసాదరావు తదితరులపై ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. ముద్దాయిలుగా మంత్రుల పేర్లు వున్నప్పటికీ వారు పదవుల్లో దర్జాగా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే జగన్‌ అక్రమాస్తుల కేసులో కంటికి కనిపించని మతలబు ఏదో జరుగుతోందనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

తెరాస పల్లెబాట

  తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు పాదయాత్ర విజయవంతంగా సాగుతుండడం, మరోవైపు జగన్‌ సోదరి షర్మిల పాదయాత్ర చేస్తుండడంతో తాము కూడా యాత్ర చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఢల్లీ పెద్దలతో ఇటీవల కెసిఆర్‌ పలుదఫాలు చర్చలు జరిపారు. దసరాలోపే తెలంగాణపై  కేంద్రంనుంచి ప్రకటన వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అయితే కేంద్రంనుంచి అటువంటి ప్రకటన ఏదీ రాలేదు. అంతర్గత సమస్యల కారణంగా కేంద్రం తెలంగాణపై ప్రకటన చేయలేదా, లేకపోతే అటువంటి ఉద్దేశమే లేదా అన్నది కెసిఆర్‌కు అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమం ఉధృతి తగ్గకుండా వుండేందుకు గ్రామగ్రామాన బస్సు యాత్రలు చేపట్టడానికి తెరాస నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను నవంబరు మొదటివారంలో ఖరారు చేసే అవకాశం వుంది.

కాంగ్రెస్ కి చింతలపూడి ఎమ్మెల్యే రాజీనామా

  పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దాల రాజేశ్‌కుమార్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్వీకర్‌కు పంపనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే తాను గెలిచానని రాజేశ్ ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మితో సమవేశమై ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన తెలిపారు. రాజేశ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలోకి వలస వెళ్లడం తనకు ముందే తెలుసని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తెలిపారు. ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వలస బాట పడతారని.. వీరంత స్వార్థం కోసం పార్టీకి మోసం చేసి పోతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రి వర్గంలో అవకాశం రాని సీనియర్ ఎంపీలలో కొందరికి అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు.  

ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు అరికట్టలేరా?

  చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు అరికట్టడం అసాధ్యమా? ఎందుకు పోలీసులు, అటవీశాఖాధికారులు దాడులకు మాత్రమే పరిమితమయ్యారు? ఈ రెండు ప్రశ్నలు జిల్లావాసుల మెదడును తొలిచేస్తున్నాయి. ప్రత్యేకించి కోట్లాది రూపాయల ఎర్రచందనం పలుప్రాంతాల్లోని పరిశ్రమలకు తరలించేందుకు స్మగ్లర్లు నడుపుతున్న నెట్‌వర్క్‌ జిల్లా వాసులను కలిచివేస్తోంది. ప్రభుత్వానికి ప్రతిగా రాజ్యమేలుతున్న స్మగ్లర్లు ఆయుధాలతో తిరుగుతుండటం కూడా భవిష్యత్తులో భారీప్రమాదానికి సంకేతంగా నిలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఎదురుకాల్పులకు తెగించిన స్మగ్లర్లు ఇంకేమి చేస్తారో అని జిల్లావాసులు భయపడుతున్నారు. కొన్ని అటవీగ్రామాలను తమ సొంత అడ్డాగా మార్చుకున్న స్మగ్లర్ల వివరాలు సేకరించటం, వారిని అదుపులో పెట్టడం పోలీసులకు, అటవీశాఖాధికారులకు ఏమంత కష్టం కాదు. అయినా ఎందుకు వారిని అదుపులో పెట్టలేకపోతున్నారు? అంటే అమ్యామ్యాలా అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతోంది. కానీ, పోలీసుల దాడిలో దొరికిన సరుకు చూస్తుంటే ఎంత విలువైన సంపదను స్మగ్లర్లు దోచుకుంటున్నారో అన్న ఆందోళనా తప్పటం లేదు. తాజాగా 80లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను రేణిగుంట దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే గుడిపాల మండలం ఎన్‌ఆర్‌పేట చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు దొరికాయి. ఈ రెండు సంఘటనలూ పోలీసు, అటవీశాఖల సమర్ధతను వెక్కిరిస్తున్నాయి.

పురందేరేశ్వరిపై ఆశలు పెంచుకుంటున్న తూర్పుగోదావరి?

  ఎన్నో ఏళ్ల కల ఇప్పుడు నెరవేరుతుందని తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా పురందరేశ్వరి తాజాగా బాధ్యతలు చేపట్టడంతో ఆమె తమ జిల్లాకు సహకరిస్తుందని పలువురు ఇప్పటికే తమ ఆశను వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా విశాఖ వరకూ పారిశ్రామికకారిడార్‌ కలను ఆమె నెరవేర్చగలరని నమ్ముతున్నారు. విశాఖ పార్లమెంటేరియన్‌గా ఉన్న ఆమెకు అనుకోకుండా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో దక్కిన అవకాశం ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమల కోసం ఈ రెండు జిల్లాల్లో భూములను సేకరించినా అవి ప్రారంభం కాలేదు. వీటి విషయం ఆమె ఒకసారి ఆలోచించి ఔత్సాహికపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటం ద్వారా కొత్తగా పారిశ్రామికకరణ ఊపందుకోగలదని కాంగ్రెస్‌ నాయకులు విశ్లేషిస్తున్నారు. అలానే పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి కూడా ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్థికి తొలిప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన జన్మస్థలానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తరువాత తనకు ఆదరణ ఎక్కువ ఉండే తూర్పుగోదావరి జిల్లాకు పూర్తిస్థాయి సహకారమందిస్తారని పీఆర్పీనేతలు వెల్లడిస్తున్నారు. అలా కనుక చిరంజీవి చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈ మూడు జిల్లాల్లో మంచి ఆదరణ లభిస్తుందని కూడా భావిస్తున్నారు.

హిందూ,ముస్లీమ్‌ మతాలపై వైకాపాకు చిన్నచూపు? పెరుగుతున్న విమర్శలు!

  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు హిందూముస్లీమ్‌ మతాలపై చిన్నచూపు ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి వారు అనుసరిస్తున్న విధానాలే అద్దం పడుతున్నాయంటున్నారు. గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి (జగన్‌) హిందూయాత్రా స్థలమైన తిరుపతిలో పెద్ద దుమారం లేపారు. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (జగన్‌ తండ్రి) కూడా తిరుపతిలో అన్యమత ప్రచారానికి మూలకారణమయ్యారని వివాదంలో ఇరుక్కున్నారు. వీరిద్దరి తరువాత తాజాగా జగన్‌ సోదరి షర్మిల తన మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా పరోక్షంగా ముస్లీమ్‌ వ్యతిరేకతను చాటుకున్నారంటున్నారు. ఆమె ఈ యాత్రలో భాగంగా బూట్లతో పాదయాత్ర చేస్తున్నారు. ఆ బూట్లు వదలకుండానే ముస్లీమ్‌ పవిత్రస్థలమైన దర్గాకు వెళ్లారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బడన్నపల్లి దర్గాలో ఆమె బూట్లతో మసీదుకు చేరుకున్నారు. వాటిని విడవకుండానే హాజీలు, హాలీమ్‌లు చేస్తున్న ప్రార్ధనలో పాల్గొన్నారు. బక్రీదురోజున షర్మిల ఇలా ప్రార్ధన చేయటం ఇప్పుడు రాష్ట్రంలో పెద్దదుమారం లేపుతోంది. దీన్ని పెద్ద ఇష్యూ చేయకూడదని దర్గా పెద్దలు వదిలేశారు. కానీ, ఇతర ముస్లిం నేతలు తమను ఇలా అవమానించటం బాగోలేదంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతల వైఖరి వల్ల వైకాపా హిందూముస్లిం మత వ్యతిరేక రంగును పులుముకున్నట్లు అయిందని మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌లో సిఎం కిరణ్‌ కరివేపాకూ ఒక్కటేనా?

  రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కరివేపాకులా మారారు. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రస్థాయిలో ఆమోదం తీసుకోవాలి. కాంగ్రెస్‌ అధిష్టానం, కేంద్రం తీసుకునే నిర్ణయాలు శిరసావహించాలి. అంతేకానీ, ఎదురుతిరిగితే పదవి పోయినట్లే! అలా అని కేంద్రం నిర్ణయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అధిష్టానం ఆగ్రహిస్తుంది. దీంతో కుడితిలో పడ్డ....చందాన్న సిఎం కిరణ్‌ మౌనంగా కేంద్రాన్ని ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా కేంద్ర స్థాయిలో జరిగే మార్పు కాంగ్రెసు కార్యకర్తతో సమానంగా తెలుసుకునే స్థితిలో సిఎం ఉన్నారు. దీంతో వంటల్లో కరివేపాకును వాడినట్లే సిఎంను కాంగ్రెసు చూస్తోందన్న విషయం తేలిపోయింది. తాజాగా కేంద్ర మంత్రుల నియామకం విషయంలోనూ సిఎంకు ఎటువంటి సమాచారం లేదు. పైగా, ఆయన తన ప్రతిపాదనలైన నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాతే కేంద్ర మంత్రుల నియామకం జరుగుతుందని బలంగా నమ్మారు. అయితే అధిష్టానం మాత్రం ముందుగా నిర్ణయం తీసుకుని నేరుగా అభ్యర్థులతో మాట్లాడి మంత్రి పదవులను కట్టబెట్టింది. నేరుగా క్యాబినెట్‌ కార్యదర్శి ఫోన్లు చేయటం, రాహుల్‌గాంధీ ప్రత్యేకశ్రద్ధ తీసుకోవటం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. మంత్రుల ప్రమాణస్వీకార సమయంలోనూ సిఎం వెటకారంగా మాట్లాడి వారి దృష్టిలో ఏమీ తెలియని వ్యక్తిగా మిగిలిపోయారు. పరోక్షంగా కాంగ్రెస్‌ అధిష్టానం తాము చేయాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులనైనా కిరణ్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మార్చేయగలమని కేంద్రమంత్రుల నియామకం ద్వారా హెచ్చరించింది. ఇప్పటి దాకా తన పోస్టు భద్రం అనుకుంటున్న సిఎం సర్దుకోవాల్సిన సమయం వచ్చిందని సన్నిహితులతో అంటున్నారట.

చిరంజీవికి కలిసొచ్చిన కాలం

  చిరంజీవికి పర్యాటక రంగం రావడంతో ఉబ్బితబ్చిబ్బవుతున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆయన విశాఖ పట్నం లో స్టుడియో ఏర్పాటు చేయబోతున్నరు. ఇంతకు ముందే అక్కడ రామానాయుడు స్టుడియో నిర్మాణం చేసారు. హైదరాబాద్ స్టుడియోలలో తెలంగాణ వాదులు ఎప్పుడు ఉద్యమం చేసి షూటింగులు కాన్సిల్ చేస్తారో అని భయం భయంగా నిర్మాతలు, డైరెక్టర్లతో పాటు సినీ యూనిట్ మొత్తం బెంబేలెత్తుతున్న నేపద్యంలో ఈ స్టుడియో నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకొంది. అలాగే చిరంజీవి అనుంగు శిష్యుడైన అనకాపల్లి ఎమ్మేల్యే గంటా శ్రీని వాసరావు కూడా విజవాడలోని భవాని ఐలాండ్ ను అభివద్ది చేసేందుకు తహతహ లాడుతున్నారు. దీంతో కాకినాడలోని బీచ్ తో పాటు మరికొన్ని సముద్రతీరాలలో  రిసార్ట్ కట్టించి పర్యాటక రంగాన్ని విస్తరించాలని చూస్తున్నారు. అయితే చిరంజీవి సొంత నిర్మాణాలకే ప్రాధాన్యం ఇస్తారా లేదా ఆంద్రప్రదేశ్ లో పర్యాటకరంగాన్నిసంవత్సరంన్నరలో అభివద్ది చేస్తారా అనేది కాలం జవాబు చెప్పాల్సిందే.

రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయా..,

  రాష్ట్రంలో పదకొండు మంది కేంద్ర మంత్రులు ఉండటంతో ప్రజలు మంచిరోజులొస్తాయని ఎదురు చూస్తున్నారు. గతంలో ఉన్న మంత్రులతో పెద్దగా ఒరిగిందేమీలేదని నాయకులు, ప్రజాసామ్యవాదులు పెదవి విరిచారు. గ్యాస్ కెటాయింపుల విషయం వచ్చాక పెట్రోలియం మంత్రి కొంత మేరకు రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ చిత్తశుద్దితో ఆదీవాసీల హక్కుల కోసం వారి భద్రత కోసం  పనిచేస్తున్నారు. వీరు మినహా మిగతా మంత్రులెవరూ ఆశించిన రీతిలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదు. ఇదివరలో రైల్యే సహాయ మంత్రిగా పనిచేసిన దత్తాత్రేయ కూడా పెండింగ్ ప్రాజెక్టులకోసం పట్టించుకోనేలేదు. ఇకనైనా కీలక పదవులన్నీ మన రాష్ట్రానికే వచ్చినందున మన ప్రయోజనాలకు ప్రాముఖ్యత నివ్వాలని ముఖ్యమంత్రితో సహా అందరూ కోరుకుంటున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు,కర్ణాటక పశ్చిమ బెంగాల్ ను చూసి మన రాష్ట్రమంత్రులు నిధులు రాబట్టటంలోనూ, కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తరలించడంలోనూ ప్రావీణ్యత చూపాలని కోరుతున్నారు. మొన్నటివరకు మంత్రులుగా ఉన్న పనబాక, పురంధేశ్వరి, పల్లంరాజు, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం. ఇకనైనా మన మంత్రులంతా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిద్దాం.

పేరుకే ప్రజాస్వామ్యం పెత్తనం బడా పారిశ్రామిక వేత్తలదే

  పేరుకే మనది ప్రజాస్వామ్యం కాని పరిపాలించేది మాత్రం బడా వ్యవాపారవేత్తలే అది నిన్నటి క్యాబినేట్ విస్తరణలో మరో సారి రుజువయ్యింది. అందులో రిలయన్స్ కనుసన్నల్లో రెండు జాతీయ పార్టీలు ఉన్నట్లు రాజకీయనాయకులే కాక మేధావులు, పారిశ్రామిక వేత్తలు ఒప్పుకుంటున్నారు. అదే మరో మారు నిజం అయ్యింది. అదీ జైపాల్ రెడ్డిని  పెట్లోలియం శాఖనుండి తప్పించడం ద్వారా. అంతకు ముందు ఇదే శాఖలో పని చేసిన మణిశంకర్ అయ్యర్ కూడా రిలయన్స్ బారిన పడి మంత్రిగా తప్పుకోవలసి వచ్చింది. దేశం లో నెంబర్ వన్ కుబేరుడి గా ఉంటానికి రిలయన్స్ చేసే ఆగడాలకు అంతేలేకుండా పోయింది. పుంఖాను పుంఖాలుగా విమర్శలు వెల్లువెత్తినా దర్వాప్తుకు ఆదేశించడమో, వివరణ కోరడమో లాంటి కార్యక్రమాలేకాదు అవి వింటానికి కూడా ప్రభుత్వానికి భయమే. మల్టీ బిలియన్లను ఒక్కపెట్రోలు ద్వారానే సంపాదించి దేశానికి మిలియన్ల బిలియన్లు నష్టం తెచ్చారన్నది జగమెరిగిన సత్యం. అందులో భాగంగానే జైపాల్ రెడ్డి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రిలయన్స్ గ్యాస్ తవ్వకాలపై దర్యాప్తు చేయించడం, గ్యాస్ ధరలను అడ్డుకోవడం, దానిపై కాగ్ తో ఆడిటింగ్ కోరడంతో రిలయన్స్ సంస్థలకు జైపాల్ కొరకరాని కొయ్యగా మారారు. ఆయనను తమ దారికి తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నించి ఆఖరుకు సోనియా ద్వారా అడ్డు తప్పించుకున్నారని మీడియా కోడై కూస్తుంది. మరి కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వీరప్పమొయిలీ ఏ దారిన నడుస్తారో మరి కొద్ది రోజుల్లో తేలనుంది  ఏది ఏమైనా దీంతో మన దేశంలోని ప్రజాస్వామ్యం డొల్లతనం దీని ద్వారా తెలుస్తుంది. అవినీతి రహిత దేశంగా ఉండాలన్న క్రేజీవాల్ లాంటి వారు కనీసం వందమందయినా  రిలయన్స్ ను నిలువరించగలరా అని నేటి ప్ర.జల ప్రశ్న.

మంచి తరుణం మించిన రాదు

  ఇది పాదయాత్రల టైమ్ రాష్ట్ర లెవల్లోనే కాకుండా రీజినల్ లెవల్లో కూడా దీన్ని ఇప్పుడు అన్ని ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే మాకేంటని ప్రజలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే తాము జీవితంలో ఎదుర్కొంటున్న సినిమా కష్టాలన్నీ సదరు నేతలతో చెప్పారనుకొండి వారు మీకు మేమున్నామంటూ అప్పటికప్ఫుడే సమస్యను రూపు మాపడానికి ఫోన్లు చేసి తత్ సంభందిత అధికారులతో మాటలాడి మీకు సహాయం చేస్తారు. అవసరమైతే ఆర్దిక సాయం కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు ఒక అవ్వకు 5 వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. అలాగే పేద మహిళలకు చీరలు కూడా ఇస్తున్నారు. ఇక వైసిపి నాయకురాలు షర్మిల ఒక వికలాంగుడికి యం బి ఎ చదవటానికి అలాగే అనాధ పిల్లలకు ఆర్దిక సాయంతో బాటు వారి బాధ్యతలను కూడా తీసుకున్నారు. అవసరమైనప్పుడు ఫోన్ చెయ్యండంటూ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారు. వీరిని చూసి ఇన్ స్పయిర్ అయిన తెలుగుతమ్ముళ్లు కూడా ఎవరి నియోజక వర్గంలో వారు పాద యాత్రలుచేపట్టారు. దేవినేని ఉమ తన నియోజకవర్గంలో పర్యటించాలనుకుంటుంటే అదే పార్టీకి చెందిన టౌన్ ప్రసిడెంట్ వల్లభనేని వంశీ  నిన్నటి నుండే పాదయాత్ర మొదలు పెట్టారు. అందు వల్ల యావన్మంది ప్రజలు  ఈ పాద యాత్రలు ఉపయోగించు కోవడమే తరువాయి.

భ్లాక్ ఫిలిం తీస్తే రోగాలే

  భద్రతా కారణాలవల్ల కార్ల సైడ్ డోర్లకున్న బ్లాక్ ఫిలిం తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే నల్ల ఫిలిం తేస్తే స్కిన్ కేన్సర్లు, కంటి జబ్బులు, చర్మం వయసు పెరగటం (ఏజ్ స్కిన్) లాంటివి వస్తాయని కంటి డాక్టర్లు, స్కిన్ స్పెషలిస్టులు చెబుతున్నారు. అంటే అల్ట్రావయొలేట్ రేస్ వల్ల స్కిన్ ఎలర్జీ కూడా వస్తుందని చెబుతున్నారు. ఈ కిరణాలు సాధారణ అద్దాల నుండి 75 శాతం వరకు చోచ్చుకెళతాయని వారు చెబుతున్నారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ద్రువ పరచిందనికూడా అన్నారు. అయితే రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లే మహిళా ఉద్యోగులు మాత్రం తమకు భద్రత కరువైదని అందువల్ల తాము ప్రయాణించే క్యాబ్ లలో తప్పకుండా బ్లాక్ ఫిలిం తొలంగించాల్సిందే నంటూ కోరుతున్నారు. అయితే  ఇప్పటికే తీసేసిన బ్లాక్ ఫిలిం కొన్ని రోడ్లమీద కుప్పలు కుప్పలుగా పడివుంది దీన్ని గనుక కాల్చితే విషపూరిత రసాయనాలు వాతావరణాన్ని కాలుష్యంతో నింపడమే కాక కేన్సర్ కు దారి తీస్తుందని కాబట్టి నగర పాలక సంస్దలు అందుకు సహకరించాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.