Read more!

పందెం కాశాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

 

 

 

ఒక పిచ్చి పందెం ప్రాణం తీసింది. స్నేహితుల మధ్య గొప్పకోసం చేసిన పని ఒకరి ప్రాణం తీయగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో పడేలా చేసింది. ఆ పందెం మరేమిటో కాదు.. 15 నిమిషాల వ్యవధిలో ఫుల్ బాటిల్ మద్యాన్ని నీళ్ళు కలపకుండా తాగడం. ఈ పందెం ఫలితం.. ఒక నిండు ప్రాణం. కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం తంగళ్లపల్లిలో కొంతమంది స్నేహితులు పావుగంటలో పుల్ బాటిల్ తాగినవాడే వెరీ స్ట్రాంగ్ అన్నారు. అది విని రవి అనే యువకుడితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఫుల్ బాటిల్ మద్యం తాగడానికి ముందుకొచ్చారు. రవి అనే వ్యక్తి బాటిల్ మొత్తం తాగేసి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు బాటిల్ మద్యం తాగి కోమాలోకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు బతకడం కూడా సందేహాస్పదమే అని వైద్యులు అంటున్నారు. వీళ్ళు ఇలా పనికిమాలిన పందాలు కాసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.