ఢిల్లీలో ‘స్కిల్’ చూపించిన కవిత!
posted on Jun 12, 2014 @ 5:41PM
రాజకీయ తెలివితేటల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తెలివితేటల్లో తండ్రి పోలికలను పుణికి పుచ్చుకున్న నిజామాబాద్ ఎంపీ కవిత ఢిల్లీ లెవల్లో తన తెలివితేటలు, ‘స్కిల్’ చూపించారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా నరేంద్రమోడీ ప్రసంగిస్తూ ఇండియాని స్కామ్ ఇండియాగా కాకుండా ‘స్కిల్’ ఇండియాగా తీర్చిదిద్దాలనేది తన స్వప్నమని చెప్పారు. ఈ ప్రసంగాన్ని విన్న పార్లమెంటు సభ్యురాలు కవిత మైండ్లో ఫ్లాష్ వెలిగింది. తన స్కిల్ చూపించాలన్న ఉత్సాహం వచ్చేసింది. మోడీ ఉపయోగించిన ‘స్కిల్’ అనే మాటని పట్టుకుని కవిత ఉత్సాహంగా ముందడుగు వేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన కవిత, ప్రధానమంత్రి దేశంలో స్కిల్ పెరగాలని ఆశిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో అర్జెంటుగా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. తెలంగాణ ప్రజల్లో స్కిల్ (వృత్తి నైపుణ్యం) పెరిగేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమెని కోరారు. అదేవిధంగా నిజామాబాద్ లో పసుపు నిల్వ, విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుతో పాటు పలు విషయాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కవిత ప్రస్తావించిన అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.