భారత్ లో ముందుగా వచ్చేది ఆ వ్యాక్సినే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం...!
posted on Aug 19, 2020 @ 12:23PM
కరోనా తో ప్రపంచం తో పాటు భారత్ కూడా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అందరి చూపు వ్యాక్సిన్ పైనే ఉంది. ఇప్పటికే మన దేశంలోని భారత్ బయోటెక్, జైడస్ కాడిలా కంపెనీల వ్యాక్సిన్ల ట్రయల్స్ కీలక దేశాలలో ఉన్నాయి. అయితే మనదేశంలో అన్నిటి కంటే ముందుగా ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా ఈ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అయితే స్థానికంగా తయారవుతున్న వ్యాక్సిన్ లను కూడా నిశితంగా గమనిస్తున్నామని, అవి కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
అంతేకాకుండా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు, స్వదేశీ వ్యాక్సిన్ లు మార్కెట్లోకి రావడానికి మధ్య కేవలం కొన్ని వారాల గడువు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉండడంతో దానికే ముందుగా అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఈ వ్యాక్సిన్ పై పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ట్రయల్స్ నిర్వహిస్తూనే భారీ ఎత్తున తయారు చేసే ప్రక్రియలో ఉందని తెలిపారు. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.