సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక పరిణామం
posted on Aug 19, 2020 @ 12:21PM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తున్నట్లు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. విచారణ సమయంలో మహారాష్ట్ర, బీహార్ పోలీసులు మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం కోరింది. బీహార్ సీఎం వినతి మేరకు కేసును ఇప్పటికే సీబీఐకి కేంద్రం అప్పగించింది. అయితే, సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసును మహారాష్ట్ర పోలీసులే పూర్తి దర్యాప్తు చేస్తారని, సీబీఐ విచారణ అవసరమే లేదని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ విచారణ అంశంపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారాణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సహకరించాలని, అవసరమైతే ఈ కేసును తాజాగా ఫైల్ చేయవచ్చన్న సౌలభ్యం కూడా కల్పించింది.