అమరావతి రైతులకు బాసటగా అయోధ్య వీరుడు.. ఫీజు కేవలం ఒక్క రూపాయి
posted on Aug 19, 2020 @ 12:47PM
లాయర్ పరాశరన్ ఈ మధ్య కాలంలో ఈ పేరు తెలియని వారుండకపోవచ్చు. దీనికి కారణం కొన్ని దశాబ్దాల పాటు సాగిన బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో ఎంతో నిష్ఠతో వాదించి మన దేశానికి సంబంధించిన అతిపెద్ద సమస్యను పరిష్కరణలో పాలు పంచుకున్నారు. అయన గతంలో అటార్నీ జనరల్గా కూడా సేవలు అందించారు. అటువంటి పెద్ద లాయర్ ఇప్పుడు అమరావతి రైతుల తరపున సుప్రీం కోర్టులో వాదించబోతున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే మూడు రాజధానులు, అమరావతి భూములు వివాదంపై సుప్రీం కోర్టులో వాదించేందుకు ప్రముఖ లాయర్ హరీష్ సాల్వేను జగన్ ప్రభుత్వం నియమించుకుంది. ఎంతో సక్సెస్ఫుల్ లాయర్గా పేరున్న ఆయన ఈ కేసును చేపట్టడంతో అమరావతి రైతులు ఆందోళన చెందారు. దీంతో హరీష్ సాల్వే స్థాయిలో తమ తరపున పోరాడే మరో లాయర్ కోసం ప్రయత్నం చేసారు. అయితే ఎంత మందిని అప్రోచ్ అయినా వారు ఎక్కువ మొత్తంలో ఫీజు డిమాండ్ చేయడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే చివరి ప్రయత్నంగా వారు న్యాయవాద వృత్తిలో తల పండిపోయిన పరాశరన్ను ఆశ్రయించారు. రైతుల గోడు విని చలించిపోయిన పరాశరన్ వారి తరుఫున వాదించేందుకు అంగీకరించారు. అయితే ఈ కేసును అయన కేవలం ఒక్క రూపాయి ఫీజు తోనే వాదించేందుకు అంగీకరించారు. ఇప్పటికే పరాశరన్ తరుపున ఆయన కుమారుడు మోహన్ పరాశరన్ అమరాతి వివాదంపై రైతుల తరపున వాదనలు వినిపిస్తున్నారు. రెండు రోజుల కిత్రం అమరావతిపై జరిగిన వాదనల్లోనూ పరాశరన్ పాల్గొన్నారు. ఇప్పటికే అమరావతి భూములపై సుప్రీం కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు రావడంతో.. రాజధాని తరలింపు విషయంలోనూ తాము గెలుస్తామని ఆ రైతులు ధీమాగా ఉన్నారు.