కరోనా కేసుల్లో ఏపీ రికార్డులు.. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష!!
posted on Aug 19, 2020 @ 10:36AM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతోంది. గత 11 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది.
మంగళవారం కొత్తగా 9,652 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాత్రమే మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. మూడు లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు నమోదు చేసింది.
ఏపీలో తొలి లక్ష కరోనా కేసులకు 137 రోజులు పట్టింది. రెండో లక్ష కేసులు మాత్రం కేవలం 11 రోజుల్లోనే నమోదయ్యాయి. అనంతరం మూడో లక్ష కేసులు కూడా 11 రోజుల్లోనే వెలుగు చూశాయి. ఈ స్థాయిలో కేసులు మరే రాష్ట్రంలో నమోదు కావడం లేదు.
రోజువారీ కేసుల్లో ఏపీ టాప్ లో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రోజుకు సగటున పదివేల కేసులు నమోదు కావడంలేదు. మహారాష్ట్రలోనూ రోజుకు సగటున 8 వేల కేసులు మాత్రమే వెలుగు చూస్తున్నాయి.
ఏపీలో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష మంది కరోనా బారిన పడినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
కరోనా విజృంభణలో దేశంలో అంత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.