ఒక మతాన్ని కించపరిచేలా పోస్టులు.. బెంగుళూరులో చెలరేగిన హింస.. ముగ్గురి మృతి 

ఫేస్ బుక్ లో ఒక మతాన్ని కించపరిచేలా పెట్టిన పోస్ట్ బెంగుళూరులో హింసకు దారి తీసింది. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ వల్ల ఈ హింస చోటుచేసుకుంది. పులకేశినగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి బంధువు ఒకరు తన ఫేస్ బుక్ అకౌంట్ లో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద పోస్ట్ పెట్టినట్లు గా తెలిసింది. దీంతో బెంగళూరులోని DJ హళ్లి, KG హళ్లి, పులకేశి నగర్ ప్రాంతాల్లో దుమారం రేగి అది హింసకు దారి తీసింది. ముందుగా ఎమ్మెల్యే ఇంటి ముందు గుమికూడిన ఆందోళనకారులు ధర్నా చేసి తరువాత రాళ్లు విసిరారు. ఆ తరువాత కొన్ని వాహనాలను కూడా తగులబెట్టారు. ఇదే సందర్భంలో మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫెయిర్ ఇంజన్లను కూడా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటి పక్కనే అయన కొత్తగా కట్టుకుంటున్న మరో ఇంటిని కూడా ధ్వంసం చేయడంతో హింస మరింత పెరిగింది.   అంతేకాకుండా డీజే హళ్లిలోని ఓ పోలీస్ స్టేషన్ పైనా దాడి చేసినట్లు తెలిసింది. ఐతే ఆందోళనకారులు ఎమ్మెల్యే మేనల్లుడిపై కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళన కారులు స్టేషన్ పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆందోళనకారులు స్టేషన్ఈ బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నప్పటికీ స్టేషన్ లోకి చాలా సేపటి వరకు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దాడిలో డీసీపీ వాహనం కూడా ధ్వంసం అయిందని సమాచారం. ఐతే పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన హింసలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా గాయపడటంతో వారిని హాస్పిటల్ కు తరలించారు.   ఐతే ఎమ్మెల్యే బంధువు మాత్రం ఈ పోస్టుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని తన ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి కుట్రపూరితంగా ఇలా చేసారని అంటున్నారు. అదే సమయంలో ప్రజలు శాంతంగా ఉండాలని ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి విజ్ఞప్తి చేసారు. ఈ ఘటన పై పూర్తీ స్థాయిలో దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈ ఘటన పై దర్యాప్తు జరిపించి, చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా దాడులకు దిగడం సమస్యకు పరిష్కారం కాదని.. శాంతి భద్రతలను సరిదిద్దేందుకు అదనపు బలగాల్ని దింపినట్లుగా కూడా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అయన చెప్పారు.

ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ 

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల గత కొన్ని నెలలుగా ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 12 శాతం వడ్డీతో సహా 2 నెలల్లోపు వేతన బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.   కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తో పాటు మరి కొన్నిరాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా 50 శాతం వేతనాన్ని చెల్లించేలా జీవోను జారీచేసిన చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో దానిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఐతే దీని పై తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారించిన కోర్టు ఆ జీవోను కొట్టివేసింది.

పాపం ఏపీ సర్కార్.. సుప్రీం లో మరో సారి తప్పులతో పిటిషన్

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసందే. హైకోర్టు ఉత్తర్వు పై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ లో పలు తప్పులు దొర్లడంతో అవి వెనక్కి వచ్చాయి. ఈ పిటిషన్ లో స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం పేర్లు తప్పుగా పేర్కొన్నారు. అలాగే దీనికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి కూడా సరిగా పేర్కొనలేదు. దీంతో తప్పులు సరి చేసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఐతే ఇప్పటికే ఈ పిటిషన్ పై త్వరగా విచారించాలని మరో అప్లికేషన్ పెట్టగా అసలు పిటిషన్ లో తప్పులు బయట పడడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది   ఈ నెల 16న శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉన్న ఏపీ సర్కార్ ఇపుడు పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క హైకోర్టులో 14వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా మరో పక్క సుప్రీంకోర్టులోనూ మళ్లీ పిటిషన్ వేయాల్సి ఉంది. దీంతో రెండు కోర్టుల్లోనూ సమాంతరంగా విచారణ జరిగే అవకాశం లేదు. ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ పై విచారణ తేలిన తరవాత హైకోర్టులో విచారణ జరుగుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లలో తప్పుల వల్ల పదహారో తేదీకి క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు. మరో పక్క ప్రభుత్వం నియమించిన న్యాయనిపుణులకు పిటిషన్లు వేయడం కూడా రావడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు నిమ్మగడ్డ కేసు విషయంలో కూడా తప్పులతో కూడిన పిటిషన్లు వేయడంతో ఒక సారి వెనక్కి వచ్చాయి.

సోము వీర్రాజు స్పీడ్ కి బ్రేకులు.. హైకమాండ్ మనసులో ఏముంది?

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సోము వీర్రాజుకుకు అమరావతి అంశంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి షాకిచ్చారు. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉండటమే మంచిదన్నారు. ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో  మాట్లాడిన సోము వీర్రాజు.. 13 జిల్లాలున్న రాష్ట్రానికి 13 రాజధానులు ఉంటే తప్పేంటన్నారు. మూడు రాజధానులకు మద్దతిస్తున్నట్లుగా తన వాయిస్ చెప్పారు. అయితే, ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడిన రాం మాధవ్ మాత్రం.. మూడు రాజధానులను పూర్తిగా  వ్యతిరేకించారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు లక్నో ఒక్కటే క్యాపిటల్ గా ఉందన్నారు. ఒక్క రాజధాని ఉన్న యూపీలో సరైన పాలన జరగడం లేదా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు సమక్షంలోనే అమరావతిపై రాంమాధవ్ క్లారిటీ ఇవ్వడంతో ఆయన షాకయ్యారు.   ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటనను రాష్ట్ర బీజేపీ గతంలో వ్యతిరేకించింది. అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అమరావతికి మద్దతుగా నిలిచారు. కన్నాతో పాటు మరి కొందరు నేతలు అమరావతి కోసం గళం వినిపించారు. అయితే సోము వీర్రాజు మాత్రం  పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు‌ మంచి జరుగుతుందన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటూనే చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని టీడీపీ కోరగా.. కేంద్రానికి సంబంధం లేదంటూ బాబుకు కౌంటర్లు ఇచ్చారు వీర్రాజు.        ఇక సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించడం, అమరావతికి మద్దతుగా నిలిచిన కన్నాను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం, చంద్రబాబుకు వ్యతిరేకమనే అభిప్రాయం ఉన్న సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు ఇవ్వడంతో.. అమరావతి విషయంలో జగన్ సర్కార్ నిర్ణయానికి కేంద్రం అనుకూలమనే భావన కలిగింది. రాజధాని అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణలో.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని విషయమని కేంద్రం అఫడవిట్ ఇవ్వడంతో అది మరింత బలపడింది. దానికితోడు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలను కూడా రాష్ట్ర బీజేపీ సస్పెండ్ చేసింది.   అమరావతికి మద్దతుగా మాట్లాడారని సీనియర్ నేత వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేయడంతో పార్టీలో సోము వీర్రాజుకు తిరుగులేదు అనుకున్నారు అంతా. కానీ గంటల్లోనే సీన్ మారిపోయింది. సోము వీర్రాజుకు హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. వెలగపూడి గోపాలకృష్ణకి హిందూ మహాసభ ఏపీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వెలగపూడికి కీలక పోస్ట్ దక్కడం, అది కూడా బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే జరగడంతో సోము వీర్రాజు వర్గం షాకైంది. సస్పెండైన వెలగపూడికి హిందూ ఆర్గనైజేషన్ లో కీలక పదవి ఇవ్వడం సోము వీర్రాజుకు ఇబ్బందికరమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    ఇక, సోము వీర్రాజు ప్రమాణ స్వీకార వేదిక పైనే అమరావతిపై రాంమాధవ్ చేసిన కామెంట్స్ ఏపీ బీజేపీలో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో అమరావతిపై బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదని కేంద్రం చెబుతున్నా.. పార్టీ పరంగా మాత్రం బీజేపీ అమరావతికే కట్టుబడిందనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా అమరావతికి‌ భూములిచ్చిన‌ చివరి  రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని రాంమాధవ్ చెప్పడంతో.. రాజధాని విషయంలో బీజేపీ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి సోము వీర్రాజు ఒకలా ఆలోచిస్తే, పార్టీ పెద్దలు మరోలా ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే, ముందు ముందు సోము వీర్రాజు పయనం అంత ఈజీగా ఉండదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

రికవరీ రేటు 71శాతం.. మరణాల రేటు 0.7శాతం

కరోనా అనుభవాలతో సమగ్ర వైద్య ప్రణాళిక రావాలి   గతంలోనూ ఎన్నో రకాల వైరస్ లు ప్రజలను అనారోగ్యం పాలు చేశాయి. భవిష్యత్ లోనూ ఇలాంటి వైరస్ లు దాడి చేసే ప్రమాదం ఉంది. కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడిపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా ఎన్నో అనుభవాలను నేర్పిస్తోంది. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సమగ్ర వైద్య ప్రణాళికను రూపొందించాలని కెసీఆర్ సూచించారు.   వైద్యరంగంలో సరైన మార్పులు తీసుకురావాలి. జనాభా నిష్పత్తి ప్రకారం డాక్టర్ల నియామకాలు ఉండాలని కెసీఆర్ అన్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. రికవరీ రేటు 71శాతం ఉంది. మరణాల రేటు 0.7శాతం ఉంది. కరోనా సోకిన వారికి  మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. శక్తివంచన లేకుండా వైద్యసిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నారని ఆయన వివరించారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ పై ఒక్కగానొక్క ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్..

పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన సంగతి తెలిసిందే. స్వయంగా రెండు నియోజకవర్గాలలో పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. ఐతే రాజోలు నుండి గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మెల్లమెల్లగా సీఎం జగన్ ను కలుస్తూ వైసిపి కి బాగా దగ్గరయ్యారు. మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే అయన ముందుగానే వైసిపి నాయకుడు.. ఐతే ఎన్నికలలో ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో జనసేన టికెట్ తెచ్చుకుని గెలుపొందారు. ఐతే తాజాగా ఒక చోట మాట్లాడుతూ సొంత పార్టీ జనసేన పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.   "అసలు అదో గాలి పార్టీ, అదేమైనా ఉండేది ఉందా..? స్వయంగా ఆయనే రెండుచోట్ల ఓడిపోయాడు, నాకు వైసీపీ టికెట్టు రాకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి నిలబడ్డాను గానీ’’ అంటూ రెచ్చిపోయారు. ఇప్పటికే సీఎం జగన్ తో మంచి అనుబంధం ఉన్నందున అయన వైసిపి లో చేరిపోయినా పెద్దగా ఆయనకు న్యాయపరంగా వచ్చే చిక్కులేమి లేవని అంటున్నారు. మరో పక్క స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల మధ్య విభేదాలు పరిష్కరిస్తే.. అసెంబ్లీ వరకు వైసీపీలో జనసేన విలీనం కూడా సాధ్యమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా.. కారణం అదేనా..!

ఎపి ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల 16 న చేయ తలపెట్టిన మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండ‌టంతో పాటు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున వేసిన పిటిష‌న్ ఇంకా విచార‌ణ‌కు రాక‌పోవ‌టంతో పాటు మ‌రో ముఖ్య కార‌ణం కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది..   మూడు రాజ‌ధానుల శంకుస్థాప‌న కోసం సీఎం జ‌గ‌న్ పీఎం న‌రేంద్ర‌మోడీని ఆహ్వానించాల‌ని భావించి అపాయింట్ మెంట్ కూడా అడిగారు. దీని కోసం స్వ‌యంగా మోడీని క‌లిసి ఆహ్వానించడానికి స‌మ‌యం కూడా కోరారు. ఒక వేళ ప్రధాని స్వ‌యంగా హ‌జ‌రుకాలేక పోతే క‌నీసం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అయినా హ‌జ‌ర‌య్యేలా చూడాల‌ని కూడా విజ్ఞప్తి చేశారు. కానీ ప్ర‌ధాని మోడీ నుండి ఎలాంటి స‌మాధానం రాలేదు అంతేకాక అసలు కలవడానికి స‌మ‌యం ఇస్తారో లేదో కూడా చెప్ప‌లేదు. ఐతే దీనికి కారణం ఈ విషయంలో కోర్టు కేసులు, ఉద్య‌మాలు కూడా ఉండడంతో మూడు రాజ‌ధానుల శంకుస్థాపన వాయిదా పడినట్లు తెలుస్తోంది.   గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిలో భూమిపూజ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో పక్క మూడు రాజధానుల వ్యవహారం పై కేసులు పెండింగ్ లో ఉండడం, అదే విధంగా ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థుతల వల్ల కూడా శంకుస్థాపన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఐతే మరో రెండు నెలల వరకు మంచి ముహూర్తం లేని కారణంగా బహుశా దసరా సమయానికి కేసులు పరిష్కారమవుతాయని. అలాగే కరోనా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున అపుడు శంకుస్థాపన కార్యక్రమం జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

కరోనా వాక్సిన్ వచ్చినా వేయించుకోమంటున్న జనం

బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న ఆస్ర్టజనికా వాక్సిన్ అతి త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చే మొదటి వాక్సిన్ గా ప్రాచుర్యం పొందింది. కానీ అదే బ్రిటన్లో యువజనం మాత్రం ఆక్స్ ఫర్డ్ కాదు కదా ఏ కంపెనీ వాక్సిన్ వచ్చినా కరోనాకు వాక్సిన్ వేయించుకోమంటున్నారట. ఆశ్యర్యకరమైన ఈ విషయాలు ప్రతిష్టాత్మక కింగ్ కాలేజీ లండన్ నిర్వహించిన ఒక క్విక్ సర్వేలో బయడపడ్డాయి. సర్వే నిర్వాహకులు 34 సంవత్సరాల లోపు యువతలో 22 శాతం మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. అదే 55- 75 సంవత్సరాల వయసులో మాత్రం వాక్సిన్కు సుముఖత ఎక్కువగా ఉందట. వారిలో కేవలం 10 శాతం మంది మాత్రం వాక్సిన్ వేయించుకునే విషయంలో పూర్తి సముఖతతో లేరట.   ప్రభుత్వం చెప్పే విషయాల మీద నమ్మకం లేకపోవడం, వాక్సిన్ లు అనారోగ్యం కలగచేస్తాయనే రకరకాల కుట్ర సిద్ధాంతాల మీద నమ్మకం ఉండటం వల్ల వీరు వాక్సిన్ వేయించుకోకపోవడానికి సిద్ధంగా లేరని సర్వే నిర్వాహకులు తెలిపారు. విచిత్రంగా ఉన్నా ఇది నిజం ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వాక్సిన్ల తయారీని, వాక్సిన్ ఆరోగ్యం మీద చూపే ప్రభావం మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేసే వ్యాక్సిన్ వ్యతిరేక బృందాలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా లెఫ్ట్ మరియు ఉదారవాద గుంపులు ఇటువంటి వాదనలు చేస్తుంటాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ అయితే వీళ్ళని పిచ్చవాళ్ళ గుంపు అని కూడా తిట్టాడు. అమెరికాలో అయితే అధ్యక్షుడిగా మళ్ళీ ట్రంప్ ఎన్నికను వ్యతిరేకించే వారిలో చాలా మంది వాక్సిన్ సిద్దాంత వ్యతిరేకులే. అయితే కరోనా విషయంలో వీరింకాపెద్ద ఎత్తున ఆరోపణకు దిగలేదు.  కానీ జనం మాత్రం భయపడుతున్నారని కింగ్ జార్స్ కాలేజీ సర్వేతో తేలింది.  ఈ వ్యతిరేకత కరోనా వ్యాప్తి కట్టడికి అవరోధం కూడా కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.   ఇంతకీ వాక్సిన్ వద్దనే వారు  ఎలాంటి బాపతు అని సర్వేలో ఆరా తీస్తే వీరంతా కరోనా నా గిరోనానా జాన్తనై అంతా కుట్ర , అది వచ్చిపోతుందంతే , మాస్కు లేదు తీస్కు లేదు అనే రకం అంట. ఈ సర్వే నిర్వాహకుల్లో ఒకరైన ప్రొఫసర్ బాబీ డఫీ మాత్రం వాక్సిన్ సైన్సు సాధించిన గొప్పవిషయాల్లో ఒకటని, దానిని వ్యతిరేకిస్తే కరోనా వ్యాప్తికి పెద్ద సమస్య కావచ్చనీ చెప్పారు.  సర్వేలోని మిగతా వివరాల్లోకి వెడితే బ్రిటన్ లో 53 శాతం జనం మాత్రం వాక్సిన్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారట.  మరో 16 శాతం మంది , వాక్సిన్ తాము తీసుకోకపోవచ్చని చెప్పారు కానీ నిర్ధారణగా చెప్పలేదు. 11 శాతం మాత్రం అమోమయంలో ఉన్నారట  కానీ వీరంతా అప్పటికపుడు నిర్ణయం తీసుకోవచ్చు.మొత్తం మీద 20 శాతం జనం మాత్రం వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక వ్యాక్సిన్ వద్దనే బాపతులో నాలుగు శాతం అయితే వాక్సిన్ ఎప్పటికీ రాదు అది హంబక్ అని కొట్టిపారేశారట. మొత్తంగా 44 శాతం జనం మాత్రం వాక్సిన్ సంవత్సరం లోపే అందుబాటులోకి వస్తుందని బావిస్తున్నారు.   ప్రపంచ ఆరోగ్యం సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు 26 కంపెనీలు వాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. అందులో అన్నింటి కన్నా ముందున్నది రష్యాకి చెందిన గామలేయా వాక్సిన్ , ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్. భారత్ లోను భారత్ బయోటెక్ , జైడిల్లా కంపెనీలు స్వంత వాక్సిన్ తయారుచేయడానికి సన్నాహాల్లో ఉన్నాయి. మంచి పరిణామం ఏంటంటే వాక్సిన్ త్వరగా అందుబాటులోకి తేవాలని ఎంత వత్తిడి ఉన్నప్పటికీ, తాము వాక్సిన్ తయారీ లో తీసుకోవాల్సిన అన్నిజాగ్రత్తలు, దశలు, ప్రయోగాలు పూర్తయ్యాకే వాక్సిన్ తీసుకువస్తామని భారత్ బయటెక్ అధిపతి కృష్ణ ఎల్లా చెబుతున్నారు. ఆక్స్ పర్డ్ యూనివర్సిటీతో వాక్సిన్ ఉత్పత్తి కోసం ఒప్పందం కుదుర్చుకున్న పూనే కి చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాక్సిన్ ధర 220 రూపాయలు అంటే భారత బయోటెక్ మాత్రం లీటర్ వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరలో వాక్సిన్ అందిస్తామని చెప్పింది.  భారత్ దేశంలో వామపక్షీయులు  గతంలో వాక్సిన్ లు వ్యతిరేకించిన బాపతే కానీ కరోనా విషయంలో కామ్ గానే ఉన్నారు. ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్న విషయాల ప్రకారం సామూహిక వ్యాధినిరోక శక్తి హెర్డ్ ఇమ్మూనిటీ రావాలన్నా జనాభాలో చాలా భాగం వ్యాక్సిన్ తీసుకోవల్సిందే.

క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేసింది.. వ్యాక్సిన్‌ను ప్రారంభించిన పుతిన్‌

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచానికి తీపికబురు చెప్పారు. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేశామని ప్రకటించారు.  వ్యాక్సిన్‌ కు ర‌ష్యా ఆరోగ్య శాఖ ఆమోదం ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగి ఉందని పేర్కొన్నారు. కాగా, త‌న కూతురికి వ్యాక్సిన్‌ వేయించినట్టు కూడా పుతిన్ వెల్ల‌డించారు. వ్యాక్సిన్ ఇచ్చిన త‌ర్వాత త‌న కూతురి శ‌రీరంలో స్వల్పంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిన‌ట్లు చెప్పారు. కానీ త్వ‌ర‌గానే త‌న కూతురు సాధార‌ణ స్థాయికి వ‌చ్చినట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఆ టీకాను భారీ స్థాయిలో ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు పుతిన్ చెప్పారు.       రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. సెప్టెంబ‌ర్ నుంచి ఆ టీకాను హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు తొలుత ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. జ‌న‌వ‌రి నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుంద‌న్నారు. 

నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధాని.. ఏపీకి మూడా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. ఏపీ మూడు రాజధానుల అంశంపై స్పందించారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని.. అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని రామ్ మాధవ్ ప్రశ్నించారు.    ఈ అంశంలో కేంద్రం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్ర పరిధి అంశాలపై టీడీపీ ప్రభుత్వ సమయంలో ఎలా ఉందో, ఇప్పుడుకూడా అలానే ఉందన్నారు. అంటే దీనర్థం ప్రశ్నించకూడదని కాదని వ్యాఖ్యానించారు. నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని, ఇప్పుడు మూడు రాజధానులనేవి అవినీతికి నిలయం కాకుండా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా మన పోరాటాలు ఉండాలన్నారు.   కాగా, ఒకవైపు కేంద్రం కలగజేసుకోదు అని చెప్తూ, అమరావతికి మద్దతుగా పార్టీ తీరుని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తూ.. మరోవైపు పార్టీ పరంగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం అన్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడటం విమర్శలకు దారితీస్తోంది. ఇలా రెండు పడవల మీద కాలేస్తూ ఏపీలో పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సోమ్ నాధ్ ఆలయానికి అమోధ్య రామాలయానికి ఏంటీ లింకు?

రాజ్యాంగం ఏం చెబుతోంది.   కొద్ది రోజుల కిత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పత్నీసమేతంగా కాకుండా ఒంటరిగా అయోధ్యలో మందిర భూమి పూజకు వెళ్ళడం సరైనదైనా అనే విషయంపైన పెద్ద చర్చ జరుగుతోంది. ఇదొక్కటే కాదు అయోధ్య విషయంలో మోడికి సంబందించి అనేక ఆసక్తి కరమైన విషయాలు ఉన్నాయి. చాలా మందికి తెలియదు కానీ దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలకు వెళ్ళే మోడీ, అసలు అయోధ్యకు గత ఆరేళ్ళలో వెళ్ళనే లేదు. ఏకంగా భూమి పూజ సందర్భంగా గుజరాత్ కు చెందిన మోడీ అయోద్యకు వెళ్ళి సెక్యులర్, ఆద్యాత్మిక పరమైన వాదోపా వాదాలకు తెరిలేపారు. అదే గుజరాత్కు చెందిన సోమ్ నాధ్ ఆలయమే అసలు స్వతంత్ర భారతావనిలో మందిర రాజకీయాలకు తొలి ఆనవాలు కావడం విశేషం.    రాజేంద్రప్రసాద్ భారత రాష్ర్టపతిగా ఉన్నపుడు కేంద్రమంత్రి మున్షి ఆహ్వానం మేరకు 1951లొ గుజరాత్లో సోమ్నాధ్ అలయం శంఖుస్థాపనకు ఆయన వెళ్ళారని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ ఆయన్ను బహిరంగంగా విమర్శించారు. ఇపుడు అదే గుజరాత్ కు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి హోదాలో అయోధ్య లోని రామమందిర భూమి పూజకు వెళ్ళారు. 1990 లో రామనిర్మాణమే రాజకీయ ఎజెండాగా అద్వానీ రధయాత్ర చేసి బీజేపీ ఎదుగుదలకు రాచబాట వేస్తే, అదే విషయంలో ఖంగు తిని దశాబ్దాల కాలంలో రాజకీయంగా ఖంగు తిన్న కాంగ్రెస్కు మరో చరిత్ర ఉంది.    సెక్యులర్ పార్టీగా పేరున్నకాంగ్రెస్ లో ప్రధాన మంత్రిగా ఉన్నపుడు రాజీవ్ గాంధీ అయోధ్య నుంచే 1989 లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అదే గుజరాత్ లో ఎన్నికల ప్రచారాల కోసం అక్కడ అన్ని మందిరాలకు వెళ్ళారు. ఆయన తాత గారైన నెహ్రూ బారత ప్రెసిడెంట్ సోమ్ నాథ్ ఆలయానికి వెళ్ళడాన్ని ఆక్షేపించారు. ఇంకా తమాషా విషయం ఏంటంటే 1949లొ విగ్రహాలు అయోధ్యలో ప్రతిస్థాపించినపుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ అధినాయకత్వంలో. అపుడు మసీదు గేట్లను మూసి వేసి, ఉదయం సాయంత్రం ప్రార్ధనలు మొదలుపెట్టారు.  ఆ తరువాత 1986లొ రాజీవ్ గాంధీ ప్రభుత్వమే గేట్లను తెరిచి వివాదానికి దారి తీసి , శిలాన్యాస్ కు కారణమైంది. ఫైజాబాద్ ఎన్నికల ప్రచారంలో అదే రాజీవ్ గాంధీ రామ మందిరం కట్టిస్తామని కూడా హామీ నిచ్చారు.    పివి నరసింహారావు హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై, అది అంతమంగా బీజేపీ ఎదుగుదలకు, కాంగ్రెస్ పతనానికి కారణమైంది. దీన్ని బట్టి చూస్తే మందిర రాజకీయాలు మమూలు రాజకీయాల కంటే శక్తివంతమైనవని అర్ధం కావడం లేదూ. కాకపోతే ఇదంతా రాముడి మహిమని, సెక్యులర్, హిందూ వ్యతిరేక కాంగ్రెస్ అంతు చూసింది రాముడేనని అనే హిందూ వాదులు లేకపోలేదు కానీ కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం దీనిని హిందువుల మక్కాగా చేసే ప్రయత్నం చేస్తుందనేది నిర్విదాంశం. ఇంతకీ రాజ్యాంగ ప్రకారం ప్రధాన మంత్రి ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళచ్చా అంటే ఎక్కడా రాజ్యాంగలో వెళ్ళకూడదు అని లేదు. రాజ్యంగ స్పూర్తి ప్రకారం అన్ని మతాలకు సమదూరంగా ఉండాలి, గౌరవించాలి కానీ మత వ్యతిరేకత అక్కర్లేదు.

నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటా.. రాష్ట్రపతికి శిరోముండనం బాధితుడి లేఖ

గత నెల జులై 18న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లో పోలీసులు దళిత యువకుడైన ప్రసాద్ కు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై ఏపీలో తీవ్ర దుమారం రేగిన సంగతి కూడా తెలిసిందే. అయితే తనకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందిన బాధితుడు ప్రసాద్ తాజాగా " నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటాను. నాకు అనుమతి ఇప్పించండి. ఇక్కడ నాకు ఎవరూ న్యాయం చేయడంలేదు" అంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. రాష్ట్రపతి గ్రీవెన్స్‌కు ఈ మేరకు అయన ఈ లేఖ రాశారు. గతనెల 18న సీతానగరం పోలీసుస్టేషన్‌లో వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తనకు ఎస్‌ఐ శిరోముండనం చేసి హింసించారని ఆ లేఖలో అయన వివరించారు. ఈ లేఖ రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు చేరిందని, తమ పరిశీలనలో ఉందని స్టేటస్ లో తెలపడం జరిగింది. "నేను చాలా పేదకుటుంబానికి చెందిన వాడిని. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పు అయినట్లుంది" అని ప్రసాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.   జులై 22న సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కూడా శిరోముండనాన్ని సీరియస్ గా భావిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ కేసు విషయంలో ఏడుగురి మీద ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్ లో 6వ ముద్దాయి ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికాగా, 7వ ముద్దాయి పోలీసు అధికారి అయిన ఎస్‌ఐ కాగా అతడిని సస్పెండ్‌ చేసి అరెస్ట్‌ చేసి, జైలుకు కూడా పంపారు. అయితే ఎఫ్‌ఐఆర్ లో 1 నుంచి 6 వరకూ ఉన్న ముద్దాయిలను మాత్రం ఇంతవరకూ అరెస్ట్‌ చేయలేదు. ఈ కేసులో వీరే ప్రధాన నిందితులు. అంతే కాకుండా ఇక్కడ ఎస్‌ఐ ఉద్యోగంలో చేరి కేవలం 48 గంటలు అయింది. ఆయనకూ, నాకూ ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేవు. అసలు ఈ శిరోముండనం కేసు విషయాన్ని జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ కూడా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ముద్దాయిలను అరెస్ట్‌ చేయలేదు. నాకు ఏవిధమైన సహాయమూ చేయలేదు. నేను దళితుడిని కావడం వల్లే నాకు న్యాయం జరగడంలేదు. "నేను నా పరువు కాపాడుకుంటాను... దయవుంచి నక్సల్స్‌లో చేరడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి" అని రాష్ట్రపతికి రాసిన ఆ లేఖలో ప్రసాద్ పేర్కొన్నారు. అయితే ఈ కేసు రాష్ట్రపతి దృష్ఠికికూడా వెళ్ళిన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

కరోనా గురించి 2008లోనే చెప్పిన పుస్తకం

ప్రపంచం, జీవితం కరోనా ముందు తరువాత లా మారిందనక చెప్పకతప్పదు. కరోనా తగ్గిపోయినా జనంలో భయం తగ్గదనీ, ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుందనే ఆలోచనతో చాలా మంది తికమకపడుతున్నారు. ఇదే సమయంలో కరోనా మీద అనేక జోస్యాలు పుడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది అత్యంత ఆశ్యర్యకరమైన ఒక పుస్తకం, అందులోని 312 వపేజీలో చెప్పిన భవిష్యత్తు దర్శనం ప్రపంచ వ్యాప్తంగా టాకింగ్ పాయింట్ గా మారింది. అమెరికాకు చెందిన సిల్వియా బ్రౌనీ అనే ఆమె ఎండ్ ఆఫ్ డేస్ అని భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రాసిన పుస్తకం 312 వ పేజీలోని ఆఖరు పేరాలో 2020 నాటికి ఒక ప్రపంచ మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పింది.   అదే పేరాలో ఇపుడు కరోనా ఏ రకమైన లక్షణాలతో ప్రజలను వెంటాడుతుండటంతో అదే లక్షణాలను చెప్పడం విశేషం. ఆ పేజీలోని పదిలైన్ల చివరి పేరాలో ఆమె న్యుమోనియా లాంటి ఊపిరిత్తులకు సంబంధించిన అనారోగ్యం ప్రపంచమంతా ప్రబలుతుందని చెప్పింది. కరోనా లో ఊపరితిత్తులే దెబ్బతినడం గమనార్హం. దీనికి విరుగుడు కూడా ఉండక ఇంకా ప్రమాదకరంగా ఉంటుందని. అయితే ఆ రోగం దానంతట తగ్గిపోయి నిదానంగా కనుమరుగైపోతుందననీ ఆ పేరాలో ఉంది. అంత వరకు బాగానే ఉంది అని ఊపిరిపీల్చుకోవడానికి లేదు, అనేక సంవత్సరాల తరువాత  ఆ వ్యాధి మళ్ళీ వచ్చి ప్రపంచాన్ని విసిగించి ఇక పూర్తిగా మాయమైపోతోందనీ చెప్పింది. ఇప్పటి వరకు అనేక మంది జ్యోతిష్కులు రకరకాల ప్రళయాల గురించి, భవిష్యత్తు దార్శనికులు ఇంత కచ్చితంగా మహమ్మారి చెప్పిన దాఖలా లేకపోవడంతో ఇఫుడు ప్రపంచంలో ఇదొక చర్చకు దారి తీసింది. మన బ్రహ్మంగారు మాత్రం తూర్పు నుంచి ఒక వ్యాధి సోకి కోటి మందికి పైగా చనిపోతారని చెప్పారంటారు. ఆయన వంద సంవ్సరాల క్రితం ఆ విషయం చెబితే ఎండ్ ఆప్ డేస్   పుస్తకం 2008 లొ ప్రచురితమైంది. దీనిని  రాసిన సిల్వియా బ్రౌనీకి అమెరికా ఫ్యూచర్ టెల్లర్ గా పేరుంది.  ఈ పుస్తకం గురించి హాలీవుడ్ నటి కిమ్ కండర్సన్ ఈ మధ్య ట్వీట్ చేయడంతో మళ్ళీ చర్చనీయం అయింది. సిల్వియా బ్రైనీకి ఎంత మంది ఫాలోయర్లు ఉన్నారో అంతే మంది వ్యతిరేకులున్నారు. ఆదే పస్తకంలో ఆమె అమెరికా లో ప్రెసిడెంట్ తరహా పాలన వ్యవస్థ నశించిపోతుందని దానికి నాంది 2020లోనే పడుతుందనీ ప్రెడిక్ట్ చేసింది. అయితే గతంలో ఆమె చేసిన భవిష్యత్తు ఊహగానాలు కొన్ని తప్పు కావడంతో ఇదంతా యాదృచ్చికమని కొట్టిపారేశావారూ లేకపోలేదు.  విచిత్రమైన విషయం ఏంటంటే కొన్నేళ్ళ క్రితం వచ్చిన హాలివుడ్ సినిమా కంటేజియస్  చైనా దేశంలోని వూహాన్  నగరంలో ఒక వైరస్ మహమ్మారి గురించి చుట్టూ తిరగుతుంది. కరోనా మొదలైన కొత్తలో ఈ సినిమా బాగా చర్చనీయాంశమైతే ఇపుడు ఈ పుస్తకం చర్చనీయాంశమౌతుంది.   చాలా మంది భారతీయ జ్యోతిష్కులు సెప్టెంబరు తరువాత కరోనా తగ్గుముఖం పట్టి కొంతకాలానికి మళ్ళీ రావచ్చని చెప్పడం విశేషం. అందులో ఇటీవల కాలంలో యూట్యూబ్ లో బాగా ప్రాచుర్యం సంపాదించిన అభిగ్న అనే కుర్రాడు కూడా ఒకడు. ఈ ఊహగానాలు ఎంతవరకు నిజమో తేలాలంటే సెప్టెంబరు ఆఖరు వరకు వేచి చూడాల్సిందే.

బీజేపీ పై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ 

ఏపీ మంత్రి కొడాలి నాని తాజాగా బీజేపీ పైన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడాలి నాని మాట్లాడుతూ.. భారత్ లో పుట్టిన కరోనా ఒకటుందని, అదే బీజేపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా అది పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను కలిపి తినేస్తోందని, అలాగే త్రిపురలో కాంగ్రెస్‌ను తినేస్తోందని మంత్రి నాని వ్యాఖ్యానించారు. బీజేపీ అనే కరోనాకి ఇది అది అని ఏమీ లేదని, అది తగులుకుంటే అన్నిటిని తినేస్తోందని బీజేపీపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అది ఇప్పటికే వచ్చిందని, జనం అంతా బాగా మాస్క్‌‌లు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు.   అయితే మంత్రి కొడాలి నాని బీజేపీ పై తాజాగా చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ మండిపడింది. కొడాలి నాని బీజేపీని కరోనాతో పోలుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేవైఎమ్ ప్రకటించింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఒక గొప్ప శక్తిగా తమ పార్టీ ఐన బీజేపీ ఎదిగిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా అవినీతి, కుటుంబ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న టీడీపీ, వైసీపీ లాంటి ప్రాంతీయ వైరస్‌లకు దేశవ్యాప్త వ్యాక్సిన్ బీజేపీ అని కూడా ట్వీట్ చేసింది.

వెంటిలేటర్ పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... పరిస్థితి ఆందోళనకరం!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్న వైద్యులు గత రాత్రి ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేసారు. ఆయనకు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైనా, అయన 84 సంవత్సరాల వయసు రీత్యా మరో పక్క కరోనా వైరస్ కారణంగా ఇతర అవయవాల పనితీరు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచామని, ప్రత్యేక వైద్య బృందం అనుక్షణం పరిశీలిస్తోందని ఢిల్లీలోని సైనిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.   దీంతో ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఇటు ప్రజలు అటు పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా కోరుకుంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని, ఆయన త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షించారు.   2012 నుంచి 2017 మధ్యకాలంలో రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్... నిన్న ఉదయం తనకి కరోనా పాజిటివ్ గా తేలిందని, దీంతో గత రెండు వారాలుగా తనను కలిసినవారంతా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండి కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. చాలాకాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీకి తలలో నాలుకలా వ్యవహరించారు. అంతే కాకుండా ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై, జాతి నిర్మాణంపై అనేక పుస్తకాలు రచించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. 2019 లో ప్రణబ్ భారత్ రత్నను, 2008లో పద్మ విభూషణ్ అవార్డును, 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును స్వీకరించారు.

వారం రోజుల నుండి భారత్ లోనే అత్యధిక రోజువారీ కరోనా కేసులు.. డబ్ల్యుహెచ్ఓ

కరోనా విషయంలో కొంత ఆందోళన.. కొంత ఊరట..   ప్రపంచంలో కరోనా కలకలం మొదలైనప్పటి నుండి ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ వస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ని తరిమికొట్టగలమనే ఆశలు కొత్తగా చిగురిస్తున్నాయని తన తాజా బ్రీఫింగ్ లో తెలిపింది. ఐతే ఇదే సమయంలో కరోనా ప్రపంచాన్ని వణికించే మహమ్మారిగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదన్న విషయాన్ని అన్ని దేశాలూ గుర్తుంచుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. మరీ ముఖ్యంగా భారత్ లో కరోనా కేసులు బాగా పెరిగిపోతుండటంపై WHO తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రోజులుగా అమెరికా, బ్రెజిల్‌లో కంటే ఇండియాలోనే రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది. ఇక్కడ మరో సమస్యేంటంటే ఆ రెండు దేశాల్లో కరోనా ఇంకా తగ్గట్లేదు. ఇపుడు వాటికి తోడు ఇండియా కూడా వచ్చి చేరింది. దీని ఫలితంగా ప్రపంచంలో 2 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు ఉంటే, కోటికి పైగా పాజిటివ్ కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదయ్యాయన్న సంగతి మనకు తెలిసిందే.   ఇదే సందర్భంలో కరోనాను అంతం చేయడానికి రాకెట్ సైన్స్ తరహా విధానంలో సాధ్యం కాదని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ప్రజలు కంగారు పడటం ద్వారా కరోనా పోదనీ.. ఈ వైరస్ పూర్తిగా పోవడానికి ప్రజలు, ప్రపంచం లోని దేశాలూ క్రమశిక్షణతో మెలిగితే కచ్చితంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులు, పద్ధతుల ద్వారా కరోనా వైరస్‌కి ఊహించిన దాని కంటే బాగానే బ్రేక్ వేశామని వివరించింది.   మన దగ్గర కచ్చితమైన పవర్‌ఫుల్ వ్యాక్సిన్లు ఉన్న పోలియో, మీజిల్స్ (తట్టు) ను ఇప్పటికీ పూర్తిగా పోగొట్టేందుకు కష్టపడాల్సి వస్తోందని అయితే కరోనాకి సరైన వ్యాక్సిన్ రావడం ద్వారా పూర్తిగా వైరస్ పోతుందని అనుకోలేమని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.   కరోనాకు కనుక వ్యాక్సిన్ వస్తే దాని ద్వారా ఇతర కరోనా తరహా వైరస్‌లకూ చెక్ పెట్టగలమా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సరైన సమాధానం లేదని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ఈ దిశగా పరిశోధనలు మాత్రం సాగుతున్నాయని వివరించింది. అంతే కాకుండా వాతావరణంలోని మార్పుల ద్వారా కరోనా వైరస్ పోదనీ, అది ఎండ, వాన, చలి ఇలా ఏ వాతావరణంలోనైనా ఈ వైరస్ బతుకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

ప్లీజ్ ప్లీజ్ అర్జెంట్.. సుప్రీం కోర్టు కు ఎపి సర్కార్ పిటిషన్

ఎపి ప్రభుత్వం మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తొలగించేందుకు పరుగులు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీని కోసం హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ రెండు రోజుల కిందట సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం విచారణకు వస్తుందని ఏపీ సర్కార్ భావించింది కానీ ఆలా జరగక పోవడంతో తాజాగా దీని పై వెంటనే విచారించాలంటూ మరో అప్లికేషన్ ను దాఖలు చేసింది.  అయితే అప్పటికే ఈ విషయంలో అమరావతి రైతులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్లు వేశారు. దీంతో ప్రభుత్వ పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదన వినాలని కోరారు. దీంతో ఈ పిటిషన్‌ కాపీని కెవియట్‌ వేసిన వారికి కూడా తామే పంపినట్లుగా ప్రభుత్వం తాజా అప్లికేషన్‌లో తెలిపింది. ఈ పిటిషన్ పై వీలైనంత త్వరగా విచారణ జరపాలని ప్రభుత్వం కోరింది.    ఇప్పటికే ఈనెల 16న మూడు రాజధానులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని మోడీని ఆహ్వానించడానికి జగన్ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. అయితే కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నందున శంకుస్థాపన సాధ్యం కాదు కాబట్టి వీలైనంత త్వరగా న్యాయ పరమైన చిక్కుల నుండి బయట పడాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నిస్తోంది.   ఇది ఇలా ఉండగా ఎపి ప్రభుత్వం ఈనెల 14వ తేదీ కల్లా ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈనెల పధ్నాలుగో తేదీకి విచారణను వాయిదా వేసింది. కానీ ఈ లోపే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు పధ్నాలుగో తేదీలోగా సుప్రీంకోర్టులో విచారణ జరగకపోతే మళ్ళీ 14న ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినా హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సహజంగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నందున అక్కడ పరిష్కారం అయిన తర్వాతే దానికి సంబంధించిన పిటిషన్లను హైకోర్టు విచారిస్తుంది. మరి ఈ విషయంలో  ఏం జరుగుతుందో వేచి చూడాలి.

అమరావతి విషయంలో సోము వీర్రాజుకు బిగ్ షాక్..!

నిన్న అమరావతిలో దీక్ష చేస్తున్న రైతుల శిబిరానికి చేరుకున్న రాష్ట్ర బీజేపీ నేత వెలగపూడి రామకృష్ణ అక్కడ రైతులకు తన పూర్తి సంఘీభావం తెలిపారు. అదే సమయంలో కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అంతే కాకుండా రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా తన చెప్పుతో తానే కొట్టుకోవడం జరిగింది. ఐతే రామకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ కొత్త అధ్యక్షులు సోము వీర్రాజు ఇది పార్టీ నిర్ణయానికి విరుద్దమంటూ ఆయనను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేసారు. దీంతో అటు అమరావతి రైతులు ఇటు జేఏసీ నాయకులు షాక్ కు గురయ్యారు. ఐతే తాజాగా ఇదే విషయంలో ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు పెద్ద షాక్ తగిలింది.   గత కొద్ది నెలలుగా ఢిల్లీ స్థాయిలో అమరావతి రైతుల తరుఫున పోరాడుతూ జేఏసీ ప్రతినిధులను అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలవద్దకు తీసుకెళుతూ అఖిల భారత హిందూ మహాసభ జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ జివిఆర్ శాస్త్రి కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా అమరావతి కోసం నిరంతరం గొంతెత్తి పోరాటం చేస్తున్న డాక్టర్ శాస్త్రి ప్రస్తుతం అమరావతి జేఏసీ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ శాస్త్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పెద్ద షాక్ ఇచ్చారు. నిన్న బీజేపీ నుండి సస్పెండ్ అయిన వెలగపూడి రామకృష్ణ ను ఆయన హిందూ మహాసభ ఎపి అధ్యక్షుడిగా నియమించారు.   ఇది ఇలా ఉండగా ఈ రోజు రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయని పాలెం ప్రాంతంలో రాజధాని రైతులు, మహిళలు సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నుండి సస్పెన్షన్‌కు గురి అయిన వెలగపూడి గోపాలకృష్ణ ప్రధాని మోదీ, అద్వానీ, ఎన్టీఆర్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిలాంటి బీజేపీ పార్టీ తనను బయటకు పంపిందన్నారు. ఐతే రైతులను ఇబ్బంది పెట్టి బలపడదామని అనుకోవడం మంచిది కాదని అయన పార్టీ నేతలకు హితవు పలికారు. హిందూ మహాసభ అద్వర్యంలో దక్షిణ అయోధ్యగా అమరావతిని చేయడానికి తానూ కృషి చేస్తానని అయన అన్నారు. అంతే కాకుండా వెంకటపాలెంలో నిర్మించే శ్రీవారి ఆలయం పూర్తి స్థాయిలో నిర్మించాలని కూడా ఉద్యమిస్తామని అయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ సహకారం కూడా తాము కోరుతున్నామన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర బీజేపీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు సమాధానం చెబుతానని గోపాలకృష్ణ తెలిపారు.

ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్ రేసులో ప‌తంజ‌లి

ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనాకు చెందిన మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్‌, బైజూస్‌, డ్రీమ్ 11 వంటి కంపెనీలు ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్ కోసం పోటీ పడుతున్నాయి. యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన దేశీయ ఆయుర్వేద ఔషధ సంస్థ 'పతంజలి' కూడా ఈ స్పాన్సర్‌షిప్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.    ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ చేసేందుకు పతంజలి సిధ్ధంగా ఉందని, తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు.     కాగా, సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు యూఏఈలో ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ఇందుకు గాను ఫ్రాంచైజీలు, ప్లేయ‌ర్లు ఇప్ప‌టికే సిద్ధ‌మ‌వుతున్నారు.