గన్నవరం ఎయిర్ పోర్ట్ భూములలో నాట్లు వేసిన రైతులు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతులు తమ భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎపి రాజధాని అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడంతో విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులు కూడా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వారు ఇచ్చిన భూముల్లో మళ్ళీ సాగు చేపట్టి సవాల్ విసిరారు. తాజాగా విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో తిరిగి వ్యవసాయం చేయటానికి రైతులు సిద్ధమయ్యారు. కొందరు రైతులు దమ్ము చేసి నారుమళ్లు కూడా వేశారు. ఇప్పటికే విమానాశ్రయ స్వాధీనంలో ఉన్న ఈ భూముల్లో రైతులు సాగు చేపట్టడంతో ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఈ వ్యవహారం పై రైతులతో చర్చలు జరుపుతున్నా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.   రాష్ట్ర విభజనకు ముందు గన్నవరం ప్రాంతం లో రియల్‌ భూమ్‌ ఉండడంతో భూముల ధరలు భారీగా ఉండేవి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర విభజన జరగటంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటంతో విజయవాడ విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది. విభజన చట్టంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రం పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించింది. దీనికి అవసరమైన 700 ఎకరాల భూములను ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించింది. అయితే అప్పట్లో రైతులు తమ భూములు ఇవ్వటానికి మొదట నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని అమరావతి రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇస్తామని అప్పటి సీఎం చంద్రబాబు హామీ ఇవ్వటంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములు అప్పగించారు. రైతులకు ఏటా ఇచ్చే కౌలుతో పాటు కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో తమ స్వాధీనంలోకి తీసుకున్న భూముల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ విస్తరణ పనులు చేపట్టింది. గన్నవరం ప్రాంత రైతుల ప్యాకేజీలో భాగంగా రాజధానిలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్ లు, యాన్యుటీ వంటి సౌకర్యాలు కల్పించడానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఎన్నికల నాటికి మూడొంతుల మంది రైతులకు అమరావతిలో ప్లాట్లు కూడా కేటాయించారు.   అయితే ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ రైతుల సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసింది. అప్పటికే ప్లాట్లు కేటాయించగా మిగిలిపోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు అటకెక్కింది. దీనికి సంబంధించి దాదాపు 108 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి ప్రగతి లేదు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తేవడంతో అమరావతిలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో అమరావతి నుంచి పరిపాలనా కేంద్రం తరలిపోతే తమ త్యాగానికి కూడా విలువ లేకుండా పోతుందని.. తాము ఖరీదైన భూములను విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చామని, ఐతే ప్యాకేజీలో భాగంగా అమరావతిలో ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకపోవటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   దీంతో రన్‌వేకు సమీపంలో విమానాశ్రయం స్వాధీనంలో ఉన్న తమ భూముల్లో తాజాగా రైతులు దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేస్తున్నారు. నూతన రన్‌వే వెంట ఉన్న నేవిగేషన్‌ కంట్రోల్‌ స్టేషన్‌ దగ్గర ఉన్న భూముల్లో వారు సాగు చేపట్టారు. ఈ పరిణామంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉలిక్కి పడ్డారు. రైతులతో చర్చలు సాగిస్తున్నా ఫలితం కనిపించలేదు. ఒకవేళ బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. రైతులు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు సమస్య జఠిలమవుతుందని, సామరస్యంగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే అమరావతి రైతులు కోర్టు బాట పట్టగా, తాజాగా తమకు జరుగుతున్న అన్యాయంపై గన్నవరం ప్రాంత రైతులు కూడా న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తమ సమస్యల పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి పైగా సమయం ఇచ్చి ఓపికతో ఎదురు చూసామని, ఐతే తమ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు గురుగాం లోని వేదాంత హాస్పిటల్ లో రెండు వారాలుగా చికిత్స అందించిన తరువాత ఆయనకు టెస్ట్ చేయగా నెగెటివ్‌ రావడంతో డిస్చార్జు చేసారు. కరోనా నుండి కోలుకున్నందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.    అయితే తాజాగా ఆయన శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఇప్పటి నుండి ఎయిమ్స్‌లోనే ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.

సీఎం కేసీఆర్ పై దుష్ప్రచారం.. సౌదీలో పని చేస్తున్న యువకుడి అరెస్ట్ 

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ యువకుడు అసత్య ప్రచారం చేశాడు. ఆయనకు ముక్కు ద్వారా కరోనా వైరస్ సోకి సీఎం కేసీఆర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. తాజాగా ఆ యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.   హైదరాబాద్ కు చెందిన పన్యాల రాజు అనే యువకుడు ముక్కు ద్వారా కరోనా సోకి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించారని, దానిని గాంధీ హాస్పిటల్ వైద్యులు కూడా ధ్రువీకరించారని ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్ట్ చేశాడు. దీనికోసం మార్ఫింగ్ చేసిన కేసీఆర్ ఫోటో ఉన్న పోస్ట్‌ను సోషల్ మీడియాలో రాజు షేర్ చేశాడు. జూన్ 8వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసారు.   జగిత్యాలకు చెందిన రాజు సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. అతడు ఈనెల 14వ తేదీన సౌదీ అరేబియా నుండి ఇండియాకు వచ్చాడు. అయితే ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాజును అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారుల ఇచ్చిన సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వెళ్లి అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.

ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ పై పిల్.. హైకోర్టులో ఈ రోజు విచారణ

ఏపీలో న్యాయమూర్తుల ఫోన్లపై నిఘాపెట్టారని అనుమానాలతో కూడిన వార్తలు వచ్చిన నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్‌ సోమవారం ఈ పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌, ట్రాకింగ్‌, నిఘా మొదలైన విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం తో దర్యాప్తు చేయించాలని, అంతేకాకుండా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిల్ లో అభ్యర్థించారు.   పిటిషనర్ నిమ్మీగ్రేస్‌ తరఫున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ముందు హాజరై న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారంటూ ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని, లేకపోతె ట్యాపింగ్‌కు పాల్పడినవారు సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశముందని శ్రవణ్‌కుమార్‌ న్యాయమూర్తులను కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈరోజు (మంగళవారం) విచారణ చేపడతామని పేర్కొంది.   ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్‌ చట్టం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని ప్రకటించాలని ఆ పిల్ లో కోరారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించే న్యాయవాదుల ఫోన్‌ నంబర్లను కూడా ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని లాయరు శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. వ్యక్తుల గోప్యతా హక్కును పరిరక్షించాల్సిన అధికారులే దురుద్దేశంతో న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం ద్వారా వారిని నిరుత్సాహపరుస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు తీర్పులిచ్చారన్న తప్పుడు భావనలో కొంతమంది అధికారులున్నారని అయన అన్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న కొంతమంది అధికారపార్టీ మద్దతుదారులు ఏకంగా న్యాయమూర్తులను దూషిస్తూ, అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెట్టిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న శాసనసభ స్పీకర్‌, ఒక పార్లమెంటు సభ్యుడు, మంత్రులు వంటి వారు కూడా న్యాయమూర్తుల పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని అయన తెలిపారు.

ఎన్నారై హాస్పిటల్ కు అచ్చెన్నాయుడు తరలింపు..

ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం అయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఎన్నారై ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ అచ్చెన్నాయుడికి ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స అందించాలని సూచించింది.   ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని ఎసిబీ అధికారులు జూన్ 12వ తేదీన అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయనకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పైల్స్ కు సంబధించిన సమస్యకు చికిత్స అందించారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆయనను రమేష్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గణపతి పూజలు గడపలోపలే..

ఆన్ లైన్ లో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం   బాలా పూర్ లడ్డు వేలం రద్దు   ప్రతి ఏడాది నగరమంతా మండపాలలో వెలిసి 11రోజులు పూజలు అందుకునే గణపయ్య ఈ ఏడాది ఇంటికే పరిమితం కానున్నారు.   దశాబ్దాలుగా ప్రతి ఏటా వేలాది మండపాలు దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో ముంబాయి, హైదరాబాద్ అత్యంత వైభవంగా గణనాధులు పూజలందుకుంటారు. నిమర్జనం కూడా కోలాహమే. అయతే దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వినాయక మండపాలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలు కూడా విష్నేశ్వరుడి పూజలను ఇంటికే పరిమితం చేయాలని ఆదేశించారు. ముంబయి తర్వాత అత్యంత వైభవంగా జరిగే హైదరాబాద్ లోనూ  గణేష్ మండపాలను అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.   దశాబ్దాలుగా.. ప్రజలందరికీ ఒక తాటిపైకి తీసుకురావాలన్న ఆలోచనతో స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో గణేష్ ఉత్సవాలను బాలగంగాధర తిలక్ ప్రారంభించారు. కాలక్రమేణా ఈ ఉత్సవాలు దేశంలోని వాడవాడలా నిర్వహిస్తున్నారు. చిన్నపెద్ద అన్న తారతమ్యం లేకుండా ప్రజలంతా రోజూ పూజలు, అన్నదానాలు,  ఊరేగింపులలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటుచేయడం, ప్రజలు గుంపులుగా రావడం వల్ల కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు ముందస్తులుగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.    వేలాది విగ్రహాలు.. నెలరోజుల ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలుపెట్టిన కార్మికులు ఇప్పటికే వేలాది భారీ విగ్రహాలను తయారుచేశారు. కొన్నివందల కుటుంబాలు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉంటాయి. జూలై, ఆగష్టు నాటికైనా కరోనా అదుపులోకి వస్తుందన్న ఆలోచనతో విగ్రహాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే నానాటికీ పెరుగుతున్న కేసుల కారణంగా పూర్తిగా వినాయక ఉత్సవాలను ఇంటికే పరిమితం చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.            ఇదే తొలిసారి.. గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మండపాలు ఏర్పాటుచేయని సందర్భం ఎప్పుడూ రాలేదు అంటున్నారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అంటున్నారు. 1980 నుంచి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలు నిర్వహించకపోవడం ఇదే తొలిసారి అన్నారు.   ధన్వంతరి నారాయణగా.. ఆన్ లైన్ లోనే హైదరాబాద్  గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ భారీ వినాయకుడి స్థానంలో ఈ సారి తొమ్మది అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పేరు పెట్టారు. ఆన్ లైన్ లోనే దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. లడ్డు వేలంలో అత్యంత పేరున్న బాలాపూర్ గణేష్ ఎత్తు తగ్గించడమే కాకుండా లడ్డూ వేలం రద్దు చేశారు. అనుమతులు లేవు..   కరోనా విజృంభిస్తున్న కారణంగా ఈ సారి గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. ఇంటిలోనే పూజలు చేసుకోవాలి. ఇది మీ ఆరోగ్యం కోసమే.. దయచేసి గణపతి పూజ గడపలోపలే చేసుకోండి అంటున్నారు.   కరోనా మహమ్మారి కారణంగా  ప్రభుత్వాలు  ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  అయితే ఇప్పటికే వివిధ రంగుల్లో మండపాలకు తరలడానికి సిద్ధంగా ఉన్న వినాయకుల సంగతి.. విగ్రహాల అమ్మకాలపై ఆధారపడిన కార్మికుల సంగతేఎంటీ అన్నది ప్రశ్నార్ధకం.   మట్టి గణపతులు..విత్తన విగ్రహాలు.. భారీ విగ్రహాలకు స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడేలా మట్టి గణపతులను, విత్తన గణపతులను పూజించాలంటూ మరికొందరు సందేశాలు ఇస్తున్నారు. ఉగాదులు లేవు ఉషస్సులు లేవు..శ్రీరామ కళ్యాణ వేడుకలు లేవు, గ్రామదేవతలకు బోనాలు లేవు.. శ్రావణమాస పేరంటాలు లేవు, ఇప్పడు గణపతి ఉత్సవాలు కూడా లేవు.. ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంటికే పరిమితాలు అంటూ ప్రజలు వాపోతున్నారు.  

బాబు, పవన్ ల పై సెటైర్లు వేసిన అంబటికి చుక్కలు చూపిన నెటిజన్స్

వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ అంటే వెటకారాలు.. పంచ్ లతో వైరి పక్షాలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. అటువంటిది తాజాగా అయన ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ తో ఒక్క సారిగా నెటిజన్స్ అంబటి పై విరుచుకు పడుతున్నారు. నిన్నటి రోజు మొత్తం సోషల్ మీడియాలో ఆయనకు చుక్కలు చూపించారు.   పూర్తి వివరాల్లోకి వెళితే మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాంబాబు ఒక ట్వీట్ చేస్తూ స్వరాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోలేని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లకి రాష్ట్ర రాజకీయాలు గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ తీవ్రంగా విమర్శించారు. దీంతో ఇటు తెలుగు తమ్ముళ్లు, అటు జన సైనికులు రంగంలోకి దిగి అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.   అంతేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎక్కడి నుంచైనా జరుపుకోవచ్చని వారు అంబటికి హితబోధ చేస్తున్నారు. మన దేశంలోనే కాదు విదేశాలలో ఉండి కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవచ్చని ఈ సందర్భంగా వారు చెపుతున్నారు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన వేడుకని ఆ విషయం కూడా తెలియని అంబటి రాంబాబు అసలు ఎమ్మెల్యే ఎలా అయ్యారని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్ర్తున్నారు. అయ్యా అంబటి గారు "2015 ఆగస్టు 15 న జగన్ కూడా హైదరాబాద్ నుంచి జెండా ఎగురవేశారు, మరి మీ లాజిక్ ప్రకారం చూస్తే, జగన్ కి మన రాష్ట్రానికి సిఎం గా ఉండటానికి అర్హత ఉందంటారా ?" అంటూ సెటర్లు వేశారు. మరి కొందరు "ఇదేమీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదని కాబట్టి రాష్ట్రంలోనే ఉండి జరుపుకోవాల్సిన అవసరం కూడా లేదని" స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక మీ చిల్లర రాజకీయాలు ఆపమని కూడా వారు సలహా ఇచ్చారు. రాష్ట్రం మీద అంత ప్రేమున్న మీరు కరోనా సోకితే పక్క రాష్ట్రంలో ఎందుకు చికిత్స తీసుకున్నారు అదేదో ఇక్కడే చేయించుకోవచు కదా అని కూడా వారు అంబటిని నిలదీస్తున్నారు. ఎపుడూ ఇతర పార్టీల నేతలకు చుక్కలు చూపించే అంబటి చేసిన ఒకే ఒక్క ట్వీట్ బూమ్ రాంగ్ అయి మళ్ళీ వాయిస్ లేకుండా చేసింది.

నిత్యానంద లీలలు.. కైలాస దేశంలో రిజర్వుబ్యాంకు, కొత్త కరెన్సీ

ఇటీవల ‘కైలాస’ అని కొత్త దేశాన్ని ప్రకటించిన నిత్యానంద.. తాజాగా ఆ దేశానికి రిజర్వు బ్యాంకుని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 22 వినాయక చవితి రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ కైలాస(ఆర్బీకే) ను ప్రారంభించబోతున్నట్లు  వెల్లడించారు. అదే రోజు నుంచి ఆర్బీకే కరెన్సీ చలామణిలోకి వస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఏ దేశ కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని నిత్యానంద తెలిపారు. అయితే, ఈ కథనాలన్నీ నిత్యానంద సొంత వెబ్‌సైట్‌ 'కైలాస.ఆర్గ్‌' వండివార్చిన సమాచారమేనంటూ ఈక్వెడార్‌ కొట్టిపారేసింది. కర్ణాటకలోని బిడిదిలో ఆశ్రమాన్ని స్ధాపించి పిల్లల అక్రమ నిర్బంధం, మహిళల అదృశ్యం, యువతులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం విడిచి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ క్వెడార్‌లోని భాగమైన ఓ ద్వీపాన్ని కొని, కొత్త దేశంగా ప్రకటించి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన దేశానికి పాస్‌పోర్ట్‌, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సొంతంగా బ్యాంకును కూడా ఏర్పాటు​ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రకటనలు అయితే వస్తున్నాయి కానీ ఆయన ఎక్కడున్నారో మాత్రం తెలియడం లేదు. నిత్యానంద పేరుతో వస్తున్న ప్రకటనలు మినహా ఆయన గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.   మరోవైపు ఈక్వెడార్‌  ఆర్బీకే, కరెన్సీ వార్తలను కొట్టిపారేసింది. అసలు నిత్యానంద తమ దేశంలో కానీ, చుట్టు పక్కల కానీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడం లేదని ఈక్వెడార్‌ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇవన్నీ జనాన్ని బురిడీ కొట్టించేందుకు నిత్యానంద చేస్తోన్న ప్రకటనలని అర్ధమవుతోంది.

చార్టెడ్‌ ఫ్లైట్‌లో లంగ్స్‌

పుణే నుంచి హైదరాబాద్‌కు గంటా ఇరవై నిమిషాల్లో   బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి సేకరించిన లంగ్స్ ను హైదరాబాద్‌ కిమ్స్‌ హార్ట్‌ అండ్‌ లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఇనిస్టిట్యూట్‌ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు చార్టెడ్‌ ఫ్లైట్‌లో లంగ్స్‌  తరలించారు. పుణే నుంచి హైదరాబాద్‌కు గంటా ఇరవై నిమిషాల్లో చేరుకునేలా ఎయిర్ ఫోర్స్  అధికారులు, పోలీసులు సహకరించారు.    పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. ఆ వ్యక్తి  కుటుంబసభ్యులు మానవత్వంతో అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవన్‌దాన్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. దాంతో పూనేలో మరణించిన వ్యక్తి లంగ్స్ హైదరాబాద్ లోని వ్యక్తికి అమర్చడానికి జీవన్‌ధాన్‌ డాక్టర్‌ స్వర్ణలత, పుణేలో జడ్‌టీసీసీ సెంట్రల్‌ కో–ఆర్డినేటర్‌ ఆర్తిగోఖలే సమాయత్తం అయ్యారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సర్జరీ ద్వారా లంగ్స్ సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు  గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు.   అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్‌ ఫ్లైట్‌లో లంగ్స్ తో  బయలుదేరిన వైద్యసిబ్బంది  బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. అప్పటికే  సమాచారం అందడంతో  కిమ్స్‌ వైద్యుల బృందం లంగ్స్  అవసరమైన వ్యక్తిని సర్జరీకి సిద్దం చేశారు. దాదాపు ఎనిమిది గంటల సర్జరీ తో ఆ వ్యక్తికి ఊపరితిత్తులను అమర్చుతారు.   నిర్ణీత సమయంలో అవయవాలు అమర్చడానికి సహకరించిన విమాన ఆధికారులకు, పోలీస్ అధికారులకు ఆపరేషన్ అవసరం అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

హైకోర్టు, సుప్రీం కోర్టుల పై ఏపీ డిప్యూటీ సీఎం సెన్సేషనల్ కామెంట్స్ ..

ఏపీలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ ఇప్పటికే పలు మార్లు హైకోర్టు, సుప్రీం కోర్టులు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుల పై కొంత మంది వైసిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. తాజాగా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు స్టే పై తాము కలగచేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయం పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలు తయారు చేయవని ఆయన అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తాము తమ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని ఆయన అన్నారు.   పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల కేసులను కోర్టులు త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఉన్నవాళ్లు భూకబ్జాలు చేస్తారు కానీ పేదవాళ్లు చేయరని ఆయన అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రతిపక్ష నేత చంద్రబాబు తపన అని ఆయన విమర్శించారు.   ఇప్పటికే అమరావతిలో శాసన రాజధానిని మాత్రమే కొనసాగిస్తూ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలని జగన్ సర్కార్ నిర్ణయించుకోవడంతో.. ఈ విషయంపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.

మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు కరోనా బారిన పడగా..  తాజాగా తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.  కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన ఇటీవల టెస్టు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. హర్ష కుమార్‌తో పాటు ఆయన ఇద్దరు కోడళ్లకు, మనవరాలికి కూడా కరోనా పాజిటివ్‌ గా తేలింది.   కాగా, ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. ఇప్పటివరకు 2,01,234 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 85,945 యాక్టివ్ కేసులున్నాయి.

ట్వీట్ పెడితే విచారణకు అడ్డుపడినట్టా?.. రామ్‌కు బాసటగా చంద్రబాబు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై సినీ నటుడు రామ్ పోతినేని చేసిన ట్వీట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, రామ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు.. రామ్ కి వార్నింగ్ ఇచ్చారు. "అగ్ని ప్రమాదం కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోము. విచారణకు అడ్డొస్తే, అవసరమైతే రామ్ కి కూడా నోటీసులు ఇస్తాం'' అని విజయవాడ ఏసీపీ అన్నారు.   విజయవాడ ఏసీపీ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే రామ్ మరో సంచలన ట్వీట్ చేశారు. అసలైన కుట్రదారులకు కచ్చితంగా శిక్షలు పడతాయని, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని రామ్ అన్నారు. అంతేకాదు, ఈ వివాదానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రకటనలు చేయబోనని రామ్ స్పష్టం చేశారు.   కాగా, రామ్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. రామ్‌ పై విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని పేర్కొన్నారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువని.. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి చేటు అని  చంద్రబాబు అన్నారు. 

అమరావతి కేసులో కొత్త ట్విస్ట్.. సుప్రీంలో విచారణ 19 కి వాయిదా..

ఏపీలో తీవ్ర న్యాయ పోరాటంగా మారిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారం పై సుప్రీం కోర్టు లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజధాని బిల్లుల పైన విచారించిన హైకోర్టు తొలుత ఈ నెల 14 వ తేదీ వరకు స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే, ఈ నెల 14న మరోసారి విచారించిన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన స్టే ఇవ్వాలంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీని పైన ఈ రోజు సుప్రీం కోర్టులో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.   సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ఈరోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఆ సమయంలో ఈ కేసులో వాదిస్తున్న రంజిత్ కుమార్ అనే న్యాయవాది సుప్రీం చీఫ్ జస్టిస్ ముందు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమరావతి రాజధాని రైతులు దాఖలు చేసిన పిటీషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ఇదే విషయమై హైకోర్టు ఇచ్చిన స్టిటిస్ కో ఉత్తర్వుల పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసారు. అయితే రాజధాని రైతుల తరపున సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బంధువులే న్యాయస్థానాల్లో వాదిస్తున్న విషయాన్నిఅయన ప్రస్తావించారు. దీంతో ఈ కేసు విచారణ నుండి తాను తప్పుకుంటున్నానని తెలుపుతూ "నాట్ బిఫోర్ మీ" అంటూ ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసారు.

పవన్ అభిమానికి సీఎం జగన్ సాయం.. ప్రభుత్వం తరఫున సాయం చేసి ప్రచారమా?

'పవన్ కళ్యాణ్ అభిమానికి సీఎం వైఎస్ జగన్ సాయం' అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స అవసరమంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ గా మారగా, ఈ వార్తపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించారు. పవన్ అభిమాని అనారోగ్యానికి సంబంధించిన వార్తను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో.. దీనిపై స్పందించిన సీఎం జగన్ వెంటనే నాగేంద్రకి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో నాగేంద్రకు చికిత్స జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.   నాగేంద్ర అనారోగ్యానికి సంబంధించిన వార్తపై సీఎం జగన్ స్పందించి ప్రభుత్వం తరఫున సాయం చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో కొందరి అత్యుత్సాహం మాత్రం విమర్శలకు దారి తీస్తోంది.   'పవన్ కళ్యాణ్ అభిమానికి వైఎస్ జగన్ సాయం' అంటూ ఏదో వ్యక్తిగతంగా జగన్ సాయం చేసినట్టు కొందరు ప్రచారం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.  అతను ఏ హీరో అభిమాని అయినా ముందు రాష్ట్ర పౌరుడు, అదే వేరే హీరో అభిమానికి సాయం చేస్తే ఇలా ప్రచారం చేసుకుంటారా?, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండబట్టే ఇలా ప్రచారం చేసుకుంటున్నారని తప్పుబడుతున్నారు. అదీగాక అక్కడ జగన్ వ్యక్తిగతంగా సాయం చేయలేదు. ప్రభుత్వం తరఫున చేశారు. అసలు ప్రభుత్వం అంటేనే పార్టీలకి, కులాలకు, వర్గాలకు అతీతంగా పనిచేయాలి. అలా పనిచేసినందుకు ఖచ్చితంగా అభినందించాలి. కానీ కొందరు మాత్రం పవన్ అభిమానికి జగన్ వ్యక్తిగతంగా సాయం చేసినట్టు ప్రచారం చేయడం మాత్రం తప్పని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు మరో పెద్ద షాక్ 

పేదలకు ఇళ్ల స్థలాల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ రోజు సమర్థించింది. సుప్రీం కోర్టులో హైకోర్టు స్టే ను స‌వాలు చేస్తూ ప్ర‌భుత్వం వేసిన రెండు పిటిష‌న్ల‌పై విచారించిన చీఫ్ జ‌స్టిస్ బొబ్డే ధ‌ర్మాస‌నం… హైకోర్టులో విచార‌ణ స‌రిగ్గానే జ‌రిగింద‌ని అభిప్రాయ‌ప‌డింది. అంతేకాకుండా ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.   రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్-5 జోన్ పై ప్ర‌భుత్వం ఉతర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాజధాని ప్రాంతం రైతులు, అమరావతి పరిరక్షణ జేఏసీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. హైకోర్టు స్టే పై రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాలు చేసింది. తాజాగా దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు స్టేను సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగ్గానే జరిగిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

బీజేపీ చేతిలో ఫేస్‌బుక్ కీలుబొమ్మ‌.. వాల్ స్ట్రీట్ కథనం పై ఫేస్‌బుక్ వివరణ 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని.. బీజేపీ నేతలు హింసను ప్రేరేపించేలా, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నా.. వీడియోలను షేర్‌ చేస్తున్నా.. ఫేస్‌బుక్‌ చూసీ చూడనట్లు వదిలేస్తోందని అమెరికాకు చెందిన అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ ఒక కథనం ప్రచురించింది. ‘ఫేస్‌బుక్‌ ఇండియా ఉన్నతాధికారి అంకిత్‌ దాస్‌ బీజేపీని తన భుజాలకెత్తుకున్నారు. ఆ పార్టీ నేతల ఫేస్‌బుక్‌ పేజీల్లో ఉన్న వివాదాస్పద పోస్టులపై వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ ఉద్యోగులు ఆ సాహసం చేయకుండా అడ్డుకుంటున్నారు. అదేమంటే.. భారత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతింటాయని దాంతో భారత్‌లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని అంకిత్‌ చెబుతున్నారు అని ఆ సంస్థ ప్రస్తుత, మాజీ అధికారులు పేర్కొన్నట్లు ఆ పత్రిక కథనం వెల్లడించింది.   వాల్‌స్ర్టీట్‌ జర్నల్ ప్రచురించిన ఈ క‌థ‌నం దేశంలో పెద్ద రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఇదే ‌స‌మ‌‌యంలో ఫేస్‌బుక్ నిష్పాక్షిక‌త‌పై కూడా చ‌ర్చ‌కు దారి తీసింది. అయితే ఈ వివాదం మ‌రింత ముదిరితే సంస్థ‌కు ముప్పు త‌ప్ప‌ద‌ని భావించిన ఫేస్‌బుక్ తాజా ప‌రిణామాల‌పై స్పందించింది. హింస‌ను ప్రేరేపించే విద్వేష‌పూరిత ప్ర‌సంగాల‌ను, స‌మాచారాన్ని తాము నిషేధిస్తామ‌‌ని… ప్ర‌పంచ‌వ్యాప్తంగా తాము ఇదే విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది. ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ నేత‌కు, పార్టీకి తాము అనుకూలంగా ప‌నిచేయ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని భావిస్తున్నాం. ఇందుకోసం రెగ్యులర్ నియంత్రణా విధానాన్ని అమలు చేస్తున్నాం. కచ్చితత్వం, నిజానిజాలే సోషల్ మీడియాలో ఉండాలన్నదే మా విధానం. ఇదే సందర్భంలో ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌న పూర్తిగా స‌త్య‌దూర‌మ‌ని ఫేస్‌బుక్ వెల్ల‌డించింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఏపీ సర్కార్ పై కఠిన చర్యలు తీసుకోండి.. మోడీకి చంద్రబాబు లేఖ 

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వార్తలు దుమారం రేపుతున్నాయి. హైకోర్టు జడ్జ్ ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఒక ప్రముఖ దిన పత్రికలో వచ్చిన వార్తలు ఏపీలో రాజకీయంగా పెద్ద కలకానికి దారి తీస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగుల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపిస్తూ మాజీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌ధానికి ఒక లేఖ ‌రాశారు. ఏపీలో అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు భ‌విష్య‌త్తులో దేశానికి కూడా ముప్పు తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అయన ఆ లేఖలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, ఇతర చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాల‌ని అయన విజ్ఞ‌ప్తి చేశారు. బాబు రాసిన ఈ లేఖను ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్‌ ప్రసాద్ కు కూడా ఈ లేఖను పంపించారు.   చంద్రబాబు ప్రధాని మోడీకి రాసిన లేఖ సారాంశం మీ నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది. ఉగ్ర శ‌క్తుల నుంచి ముప్పు త‌గ్గి, దేశం వెలుప‌ల‌ సరిహద్దులు కూడా బలోపేతం చేయబడ్డాయి. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ల‌ ట్యాపింగ్ రూపంలో రాజ‌కీయ నాయ‌కులకు, ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన‌వారికి ముప్పు పొంచి ఉంది దీనితో దేశ భ‌ద్ర‌త‌కు వాటిల్ల‌బోయే న‌ష్టం గురించి మీ దృష్టికి తీసుకువ‌స్తున్నాను.   వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జ‌రుపుతోంది. అన్నిటికంటే ముందుగా గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులు, విధానాలపై దాడి చేసి… రాష్ట్ర పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పించారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి ఇత‌ర రాజ్యాంగ సంస్థలపైనే అలాగే దాడి చేసారు. వీటితో పాటు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తమ గ‌ళం వినిపిస్తున్న‌ ప్రతిపక్ష పార్టీల నేత‌లు, లాయ‌ర్లు, మీడియా వ్య‌క్తులు, సామాజిక కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తూ ప్రభుత్వం బెదిరిస్తోంది. అటువంటి వారందరి ఫోన్‌ల‌ను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతోంది. తమ చర్యలకు న్యాయవ్యవస్థ నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్య వ్యవస్థ మూడో స్తంభమైన న్యాయవ్యవస్థను కూడా పాలక వైయస్ఆర్సిపి ప్రస్తుతం లక్ష్యంగా చేసుకున్నట్లు తాజాగా కనిపిస్తోంది   తాజాగా వైసిపి ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ల వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇల్లీగల్ సాఫ్ట్‌ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని మేము ఆందోళన చెందుతున్నాం. దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు కూడా ప్రత్యక్ష ముప్పు వచ్చే అవకాశం ఉన్నందున ఇది మరింత ప్రమాదకరమైనది. ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమే కాకుండా, అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను కూడా తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి పరిస్థితులు దారితీస్తాయి. దీన్ని ఇపుడే క‌ట్ట‌డి చేయ‌క‌పోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థలు కూడా నాశనం అవుతాయి. క‌నుక ఏపీలోని ప్ర‌భుత్వ‌, అలాగే ప్రైవేట్ సంస్థ‌లు ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు (ఫోన్ ట్యాపింగ్) కు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచార‌ణ జ‌రిపించాల‌ని విజ్ఞ‌ప్తి అంటూ చంద్ర‌బాబు ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

చెట్లు ఎక్కే బైక్

ప్రాణనష్టాన్ని నివారించే యత్నం బైక్ పై కూర్చోని రివ్వున పైకి వెళ్లే ఈ అమ్మాయిని చూశారా ఇది ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో కాదండి. ఆకాశాన్ని తాకేలా నిటారుగా పెరిగిన కొబ్బరితోటలోని దృశ్యం. సుప్రియ అనే అమ్మాయి తన తండ్రి తయారుచేసిన బైక్ ను పరీక్షిస్తున్న వైనం.   కర్ణాటక లోని బట్వాల్ గ్రామంలో గణపతి భట్ తన స్నేహితుడితో కలిసి తయారుచేసిన బైక్ ఇది. 80అడుగుల ఎత్తు వరకు నిటారుగా పెరిగే చెట్లను ఎక్కడానికి ఈ బైక్ ఎంతో ఉపయోగపడుతుంది. తాటి, కొబ్బరి చెట్లు ఎక్కడానికి,  కాయలు సులభంగా కోయడానికి చెట్టు ఎక్కే పనిని ఈ బైక్ సులభతరం చేస్తుంది. చెట్టు పైకి వెళ్లడం, తిరిగి కిందికి రావడం అంతా క్షణాల్లో జరుగుతుంది. ఒక వ్యక్తి చెట్టు ఎక్కడానికి సగటున ఎనిమిది నిమిషాలు పడుతుంది. ఈ బైక్ వల్ల నిమిషంలో చెట్టు పైకి చేరుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్దతిలో నడుస్తూ క్షణాల్లో చెట్టు పైకి చేరుస్తుంది.   28కిలోల బరువు ఉన్న ఈ బైక్ టూ స్ట్రోక్ ఇంజన్ తో నడుస్తోంది. హైడ్రాలిక్ డ్రోమ్ షాక్ అబ్జర్వస్ తో పనిచేస్తోంది. ఒక లీటర్ పెట్రోల్ తో దాదాపు 80చెట్లు ఎక్కిదిగవచ్చు. సులభంగా చెట్లు ఎక్కడానికి ఉపయోగపడే ఈ ఇంజన్ ను కర్ణాటక ప్రభుత్వం గుర్తించి వర్క్ షాపులు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ బైక్ ధర 75వేల రూపాయలు. ఈ బైక్ నడపడానికి ఎలాంటి భయం లేదంటుందోంది గణపతి కుమార్తె సుప్రియ. ఎవరైనా సులభంగా ఈ బైక్ ను నడిపేలా తయారుచేశారు.     ఆకాశాన్ని అంటేలా పొడవుగా పెరిగే కొబ్బరి, తాటి చెట్లపైకి ఎక్కాలంటే చాలా నైపుణ్యత కావాలి. కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండే కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నైపుణ్యం గల చెట్టులేక్కేవారికి చాలా కొరత ఉంది. చెట్టు పై నుంచి పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. మానవ వనరులు సరిగ్గా లేకపోవడం, సమయం ఎక్కువ తీసుకోవడం, ప్రమాదాలు జరగడం తదితర కారణాలతో కొత్త గా కొబ్బరి తోటలు వెయాలంటే భయపడుతున్నారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సులభంగా చెట్లు ఎక్కడానికి  ఉపకరించే చిన్నచిన్న పరికరాల రూపకల్పన జరిగింది.  కానీ, ఇవీ ఏవీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. వీటిని ఉపయోగించడానికి కూడా కొత్త నైపుణ్యత అవసరం కావడంతో ఈ ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యా యి   కొబ్బరి తోటలను ప్రపంచంలోని 93 కి పైగా దేశాలలో సాగుచేస్తారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, భారతదేశం ప్రపంచంలోని ప్రధాన ఉత్పత్తి దేశాలు. మన దేశంలో దాదాపు 18.95 లక్షల హెక్టార్లలో పండిస్తారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, గోవా, పశ్చిమ బెంగాల్, పాండిచేరి, మహారాష్ట్ర,  అస్సాం, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు కొబ్బరి సాగు చేస్తున్నాయి. అయితే కొబ్బరి చెట్లు ఎక్కడం మాత్రం స్థానికుల తరతరాల సంప్రదాయ వృత్తిగా వస్తోంది. నైపుణ్యం గల వ్యక్తులు లభించక చాలా ప్రాంతాల్లో కొత్తగా కొబ్బరి సాగు చేయడానికి భయపడుతున్నారు. కూలీలు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తుండటంతో ఖరీదైన పంటగా మారుతుంది. కేవలం కొబ్బరికాయలు తెంచడానికే కాదు పురుగుమందులు వేయాలన్నా చెట్టు ఎక్కాల్సిందే. ఈ సమస్యను నివారించాలంటే సాంకేతికను జోడించాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. చెట్లు ఎక్కి కొబ్బరి కాయలను తెంచడానికి అనేక పరికరాలను తయారుచేశారు.   తాజాగా కర్ణాటక లోని ఒక రైతు తన స్నేహితునితో కలిసి తయారుచేసిన బైక్ మంచి ఫలితాలను ఇస్తోంది. కర్ణాటక ప్రభుత్వం వర్క్ షాపులు నిర్వహిస్తూ చెట్లు ఎక్కే ఈ బైక్ ను కొబ్బరి,  పోక,  తాటి మొదలైన నిటారుగా పెరిగే చెట్ల కాయలను కోయడానికి అనుగుణంగా శిక్షణ ఇస్తోంది. స్థానికులను ప్రోత్సహించేలా శిక్షణ ఇస్తూ, వారిలోని నైపుణ్యాలను పెంచుతున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే ప్రయత్నంతో పాటు వాణిజ్యపంటల సాగును పెంచేందుకు, ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సామాజిక అసమానతలే నేరాలకు కారణం

క్లారా విచ్మన్(17 ఆగస్టు 1885 - 15 ఫిబ్రవరి 1922)   ఒక మనిషి నేరం చేశాడంటే అందుకు చాలావరకు సమాజమే కారణం అంటూ వాదించే స్త్రీవాద న్యాయవాది క్లారా విచ్మన్. జర్మన్ డచ్ న్యాయవాది. రచయిత, ఫెమినిస్ట్ గా గుర్తింపు పొందారు. నేరం, న్యాయం, శిక్ష తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నో వ్యాసాలు ఆమె రాశారు.   హాంబర్గ్ లో 17 ఆగస్టు, 1885లో క్లారా జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ ఆర్థర్ విచ్మన్. ఖగోళ శాస్త్రవేత. వారి కుటుంబం నెదర్లాండ్స్ కు వలస వచ్చింది. క్లార్ విద్యార్థిదశలోనే స్త్రీవాద ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నేవారు. న్యాయవాద విద్యను పూర్తిచేసిన తర్వాత నేరాలు, న్యాయవ్యవస్థ, శిక్ష అంశాలపై అనేక రచనలు చేశారు. 1919లో ఆమె క్రైమ్ అండ్ పనిష్మెంటు విధానానికి వ్యతిరేకంగా కమిటీని ఏర్పాటుచేశారు. 21 మార్చ్,1920 న నేరం, శిక్ష, సమాజం అంశంపై ఆమె చేసిన ప్రసంగం అత్యంత ప్రసిద్ధి చెందింది. సామాజిక అసమానతల ద్వారా, అన్యాయాల ద్వారానే నేరప్రవృత్తి పెరుగుతుందని ఆమె అభిప్రాయం.   మానవహక్కులు, మహిళా సాధికారత కోసం ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సంస్థ సోరోప్టిమిస్ట్ ఇంటర్నేషనల్ లో క్లారా కీలక సభ్యురాలిగా పనిచేశారు. మహిళల హక్కులపై ఎంతో పోరాటం చేసిన ఆమె 15 ఫిబ్రవరి 1922న మరణించారు. ఆమె పేరుతో ఏర్పాటుచేసిన క్లారా విచ్మన్ ఇనిస్టిట్యూట్ లో కొంతకాలం మహిళా న్యాయవాదులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఆమె జీవితం పై వచ్చిన పాసీ వూర్ వ్రిజిద్ - క్లారా విచ్మన్ (1885-1922) పుస్తకాన్ని ఆమ్ స్టర్ డ్యామ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించింది.