పుతిన్ ప్రత్యర్థి పై విషప్రయోగం.. రష్యాలో పెను దుమారం

రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో పెను దుమారం రేగింది. సైబీరియాలోని టోమస్క్ సిటీ నుంచి మాస్కోకు విమానంలో వెళ్తుండగా అలెక్సీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లిన అయన అపస్మారక స్థితిలో పడిపోయారు. అలెక్సీ బాత్రూమ్ నుంచి ఎంతకూ రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. ఆయన కిందపడి పోయి ఉన్నారు.   వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఓమస్క్ సిటీలో అత్యవసరంగా ల్యాండ్ చేసి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోమాలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన శరీరంలో విషం అవశేషాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఐతే ఈ రోజు ఉదయం అలెక్సీ కేవలం టీ మాత్రమే తాగారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాంటిన్‌లోనే ఎవరో టీలో విషం కలిపారని భావిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేఫ్‌ను మూసివేసి.. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు .   "రష్యా ఆఫ్ ద ఫ్యూచర్" రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడంతో ప్రజల్లో బలమైన నేతగా గుర్తింపు వచ్చింది. ఇపుడు ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆయనపై చాల సార్లు దాడులు కూడా జరిగాయి. గతంలో కూడా ఓసారి విషప్రయోగం జరిగింది.

టాప్ లో తెలంగాణ.. ఏపీ ఎక్కడుందో తెలుసా?

ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరధ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా మంచి నీటి సరఫరా అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో 98.31 శాతం ఇళ్ళకు మంచి నీటి నల్లా కలెక్షన్లు ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం 98.31 శాతం ఇళ్ళకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల ‌శక్తి మంత్రిత్వశాఖ జల్‌ జీవన్‌ మిషన్‌ వివరాలు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 54.38 లక్షల ఇళ్లుండగా వాటిల్లో 53.46 లక్షల ఇళ్లకు తాగునీరు అందుతోంది. తెలంగాణ తరువాత 89.05 శాతంతో గోవా రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా, 87.02 శాతంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరి మూడో స్థానంలో నిలిచింది.    నల్లా కలెక్షన్లలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలిస్తే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రం బాగా వెనకపడిపోయింది. ఈ జాబితాలో కేవలం 34.62 శాతంతో ఏపీ 13వ స్థానంలో నిలిచింది. ఇక 2.05 శాతంతో పశ్చిమ బెంగాల్, 1.86 శాతంతో మేఘాలయ చివరి స్థానాలలో ఉన్నాయి.  ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. "కేంద్ర జల శక్తి నివేదిక ప్రకారం.. తెలంగాణ 98.31 శాతం నల్లాల కనెక్షన్లతో తాగునీరు అందిస్తూ తొలిస్థానంలో నిలిచింది. మిషన్ భగీరథ ద్వారా ఈ తాగునీరు అందుతోంది. ఈ అద్భుత విజయానికి కారణమైన సీఎం కేసీఆర్ దూరదృష్టికి, కష్టపడి పనిచేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ టీమ్‌ కు అభినందనలు" అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలి

రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలి కేసీఆర్ దండు పేరుతో గవర్నర్‌పై ట్రోలింగ్‌ ఆపండి -మహిళా మోర్చా డిమాండ్ రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోవిద్ 19 వైరస్ వ్యాప్తి నివారణపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, ఈ విషయంపై ఎన్నోసార్లు గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ ప్రభుత్వానికి, అధికారులకు సూచనలు చేశారని  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతా మూర్తి అన్నారు.    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన తప్పిదాలను చక్కదిద్దుకోకుండా రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగ బద్దంగా పనిచేస్తున్న గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని, గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కేసీఆర్ దండు పేరుతో గవర్నర్‌పై ట్రోలింగ్‌ను డీజీపీ అడ్డకోవాలని ఆమె కోరారు. ప్రజల సమస్యలను, ఆరోగ్యాన్ని పట్టించుకోని  ప్రభుత్వ పనితీరును విమర్శిస్తే గవర్నర్ అన్న మర్యాద కూడా లేకుండా ట్రోల్ చేస్తారా అని మహిళా మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదిరెడ్డిని సస్పెండ్ చేసి, గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కేంద్రమంత్రి షెకావత్‌ కు కరోనా.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా?

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎందరో కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు కరోనా బారిన పడగా.. తాజాగా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని ఆయన ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు ఐసోలేషన్‌ లో ఉండి, ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని షెకావత్‌ సూచించారు.   ఇదిలా ఉండగా.. షెకావత్‌ కు కరోనా రావడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొనే జల వివాదాలను పరిష్కరించడానికి వీలుగా అపెక్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ సమావేశానికి చైర్మన్‌ హోదాలో షెకావత్‌ అధ్యక్షత వహించాల్సి ఉంది. సభ్యులుగా తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్న ఈ సమావేశం.. షెకావత్‌ కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వాయిదా పడే అవకాశముంది.

చైనా దుకుడుకు బి-2తో చెక్

భారత్ కు మద్దతుగా డియోగో గార్పియా గా చేరుకున్న మూడు బి-2 బాంబర్లు   భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ కి చెక్ పెట్టేందుకు అమెరికా వైమానిక దళం సిద్ధంగా ఉంది. ఈ మేరకు భారత్ కు సహాయంగా అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన బి-2 స్పిరిట్ బాంబర్లు మూడు హిందూ మహాసముద్రంలోని డియోగో గార్పియా నౌకాకేంద్రానికి చేరుకున్నాయి. 2020 ప్రారంభంలోనే ఇక్కడికి అమెరికా బి-52 హెచ్ ఫైటర్ జెట్లు ఆరు చేరుకున్నాయి. అదనంగా బి-2 బాంబర్లు రావడంతో డ్రాగన్ కంట్రీ కుటిల యత్నాలకు వ్యూహాత్మకంగా చెక్ చెప్పడానికి భారత్ సిద్ధమైంది.    భారత్ చైనా సరిహద్దుల వెంట, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సమీపంలో, లఢఖ్ సమీపంలోని  వైమానిక స్థావరంలో  35 యుద్ధవిమానాలను మోహరించినట్లు నిఘా విమానాల ద్వారా స్పష్టమైంది. రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానికదశంలోకి వచ్చినప్పటి నుంచి చైనా మరింత స్పీడ్ గా ఫైటర్ జెట్ లను సరిహద్దుల వెంట మోహరిస్తుంది.   భారత్ చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో అమెరికా బాంబర్లు భారత్ కు సహాయంగా వచ్చాయి. మూడు బాంబర్లతో పాటు 200మంది వైమానిక దళ సిబ్బంది కూడా సహాయం అందించేందుకు ఇక్కడికి చేరుకున్నారు. డియోగో గార్పియా స్థావరానికి అమెరికా వైమానిక దళ కమాండర్ క్రిష్టఫర్ కోనన్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే భారత, అమెరికా వైమానిక దళ సైన్యం ట్రైనింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం భారత్ చైనా మధ్య ఉన్న వాతావరణం ఎప్పుడైనా యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్ కు మద్దతునిచ్చేలా అమెరికా యుద్ధనౌకలు అండమాన్, నికోబార్ దీవుల సమీపానికి ఇప్పటికే చేరాయి.   29గంటలు ప్రయాణం చేసి... అతి శక్తివంతమైన బాంబర్ గా పేరున్న బి-2 అమెరికా నుంచి 29 గంటల పాటు ప్రయాణం చేసి హిందూ మహాసముద్రంలోని డియోగో గార్పియా స్థావరానికి చేరుకుంది. మూడు బి-2 బాంబర్లు భారత్ కు అండగా చైనా పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. 50వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేయగల ఈ బాంబర్లు ఒకసారి ఇంధనం పూర్తిగా నింపుకోని దాదాపు 19వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలవు. అంతేకాదు 11వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ కూడా లక్ష్యాన్ని సరిగ్గా చేధించగల శక్తి సామర్ధ్యం వీటి సొంతం. ఒకోసారి ఏడు అణ్వస్త్రాలను తీసుకుపోగల అత్యంత ఆధునిక బాంబర్ ఇది. ఎజిఎం -129 ఆధునిక క్రూయిజ్ క్షిపణిని కూడా బి-2 మోయగలదు. రాడర్లకు దీని ఉనికి చిక్కద్దు. ఈ బాంబర్ సైలెంట్ గా శత్రు భూభాగంలోని స్థావరాలను టార్గెట్ చేయగలదు. ఇంటలిజెన్స్ గ్రిడ్, ఇంటిగ్రేటెడ్ నిఘాతో పనిచేసే బి-2 ను ఎదుర్కొన్నే శక్తివంతమైన ఫైటర్ల లేవు. గగనతలంలో అత్యధిక ఎత్తులో ఎరుగుతూనే శత్రు కదలికల స్ట్రీమింగ్ వీడియోలను గ్రౌండ్ కంట్రోలింగ్ యూనిట్స్ కు పంపే కమ్యూనికేషన్ వ్యవస్థ ఇందులో ఉంది.

ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నకు డబ్బు చేరినట్లు ఆధారాల్లేవు

ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డీలర్ల నుంచి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ వెల్లడించింది. ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు.   "మంత్రి వద్దకు పలు కంపెనీలు వస్తుంటాయి.. అధికారులకు సిఫారసు చేయవచ్చు, పరిశీలించి అర్హులైన వారికి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ ఒప్పందం చేసుకోవాలంటూ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. టెండర్‌కు వెళ్లాల్సిన వాటిని ఇలా చేయకూడదు. అందుకే ఆయనతో పాటు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌ ను కూడా అరెస్టు చేశాం" అని రవికుమార్‌ చెప్పారు.   ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అచ్చెన్నాయుడుకు నగదు ముట్టినట్లుగా ఎలాంటి ఆధారాల్లేవని.. చెప్పడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోనూ ఈఎస్‌ఐ స్కాం జరిగింది. అక్కడ ఏసీబీ చురుగ్గా వ్యవహరించి.. అవినీతి లావాదేవీలను వెలికి తీసింది. కానీ ఏపీలో ఈఎస్ఐ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందంటున్న ఏసీబీ అధికారులు.. అక్రమ సొమ్ము అచ్చెన్నాయుడుకి చేరింది అనడానికి ఎలాంటి ఆధారాల్లేవంటున్నారు. పోనీ అరెస్ట్ చేసిన ఇతర అధికారుల వద్దనైనా అక్రమ లావాదేవీల సొమ్ము కనిపెట్టారా అంటే అదీ లేదు.   అచ్చెన్నాయుడు కేవలం మూడు లేఖలు మాత్రమే రాశారని.. ఏసీబీ అధికారి రవికుమార్ చెబుతున్నారు. ఆ లేఖల కారణంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు సహా పన్నెండు మంది అరెస్ట్ చేసి ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. ఇంత వరకూ ఏసీబీ చార్జిషీటు దాఖలు చేయలేదు. ఏ3 నిందితుడుగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదని చెబుతూ.. ఇప్పటి వరకూ అరెస్ట్ చేసిన నిందితులకు బెయిల్ రాకుండా.. ఏసీబీ అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.    వందల కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు, కానీ ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. కోట్ల అవినీతి జరిగిందని చెప్తూ, ఆ అవినీతి సొమ్మును బయట పెట్టకుండా ఇలానే జాప్యం చేస్తే అధికారులపై నమ్మకం పోయే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పేరుకు పేదల పథకం... కానీ వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారింది

పేదలకు ఇళ్ల స్థలాల పథకం పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశానని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.   "పేరుకు పేదలకు ఇళ్ళస్థలాల పథకం... కానీ అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలను... ఎకరా రూ.5 లక్షలు చేయని ఆవభూములను ఎకరా రూ.45 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు తమ కమీషన్లను కోట్లలో దండుకున్నారు." అని చంద్రబాబు విమర్శించారు. "ఇలాంటి స్కామ్ లు రాష్ట్రమంతా చోటు చేసుకున్నాయి. ఈ పథకం పేదల కోసమా? ప్రజాధనాన్ని పార్టీ నేతలకు దోచిపెట్టే పథకమా? అందుకే ఈ భూముల కొనుగోలు పై సమగ్ర దర్యాప్తు జరిపించి, ప్రజాధనాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసాను" అని చంద్రబాబు తెలిపారు.   కాగా, పేదలకు ఇళ్ల స్థలాల పథకం మొదటి నుండి విమర్శలకు వేదికైంది. వివాదాస్పద స్థలాలను, ముంపు ప్రాంతాలను, విలువ లేని స్థలాలను ఎంపిక చేసి కొందరు పెద్దలు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆవ భూములు నివాస యోగ్యం కాదని హెచ్చరించినా, ఆ నివేదికను పక్కన పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. టీడీపీ, బీజీపీ సహా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మౌనం వహించటం విమర్శలకు దారి తీస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే గడువుకన్నా ముందుగానే వ్యాక్సిన్

మన దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్ కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా పై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఒక వేళ కేంద్రం కనుక నిర్ణయిస్తే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ విషయంలో అత్యవసర ఆదేశాలు ఇవ్వడం ద్వారా అనుకున్న సమయం కన్నా ముందుగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమని ఐసీఎంఆర్ తెలిపింది.   దేశంలో క‌రోనా ప‌రిస్థితులు, వాక్సిన్ విష‌యం పై హోమ్ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఐసీఎంఆర్ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే మనదేశంలో భారత్ బయోటెక్ కోవాగ్జిన్, జైడస్ కాడిలా జైకోవిడ్ వ్యాక్సిన్లు రెండో దశ ట్రయల్స్ ను పూర్తి చేసుకున్నాయని... ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో కరోనా నిరోధక యాంటీ బాడీలు పెరగడమే కాక సైడ్ ఎఫెక్ట్ లు కూడా పెద్దగా నమోదు కాకపోవడంతో, "ఎమర్జెన్సీ ఆథరైజేషన్" ద్వారా వ్యాక్సిన్ ను రిలీజ్ చేసి యువతకు ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు.   ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నప్పటికీ, కేంద్రం అత్యవసరమని భావిస్తే, వెంటనే దాన్ని విడుదల చేసేందుకు సిద్ధమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ స్వయంగా వ్యాఖ్యానించినట్టు కమిటీలోని ఓ ఎంపీ మీడియాకు తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ కంప్లీట్ అయి ఫలితాలు రావడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని భార్గవ చెప్పారని, అయితే ప్రభుత్వం కనుక తప్పదని భావిస్తే, వ్యాక్సిన్ ను వెంటనే రిలీజ్ చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన తెలిపినట్లుగా తెలుస్తోంది.

ఫోన్ లో డాక్టర్ సూచనలతో ప్రెగ్నెంట్ కు డెలివరీ చేసిన మహిళా ఎస్ఐ

బాగా పాపులర్ అయిన హిందీ సినిమా "త్రీ ఇడియట్స్" లో డాక్టర్ అయిన హీరోయిన్ కరీనా కపూర్ సూచనలతో అమిర్ ఖాన్ ఒక ప్రెగ్నెంట్ కు డెలివరీ చేయించడం మనమందరం చూసాం. తాజాగా ఒక మహిళా ఎస్ఐ వైద్యురాలి అవతారం ఎత్తి ఒక మహిళకు పురుడు పోసింది. అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆ ఎస్ఐ అన్నీ తానై వ్యవహరించి ఆమెకు అండగా నిలబడింది. అక్కడ ఆ మహిళకు వైద్యం చేయడానికి సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఈ మహిళా ఎస్ఐ వైద్యురాలిగా మారి.. ఫోన్ లో డాక్టర్ సూచనల మేరకు వైద్యం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.   వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రావత్‌పురా జిల్లా బింద్‌లో నివసిస్తున్న బాద్‌షా తన భార్య పూజ (19) తో కలిసి గోవా ఎక్స్‌ప్రెస్‌లో దౌండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్నారు. అయితే దారి‌లో పూజకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో వారు ఝాన్సీ రైల్వే స్టేష‌న్‌లో దిగిపోయారు. దీంతో అంత రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో పాటు ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్లే సమయం కూడా లేకపోవడంతో అక్కడే ఉన్న మ‌హిళా ఎస్ఐ రాజ‌కుమారి గుర్జర్ మరికొంత మంది మహిళల సాయంతో ఏసీ కేబిన్ నుండి కొన్ని దుప్పట్లు తీసుకుని ఆ గ‌ర్భిణికి డెలివ‌రీ చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆ గర్భిణీ పరిస్థితిని గ‌మ‌నించిన మ‌హిళా ఎస్‌ఐ ‌ తన స్నేహితురాలైన‌ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలు కసోటియాకు వీడియో కాల్ చేశారు. ఆ డాక్టర్ ఫోనులో సూచ‌న‌లు ఇస్తుండ‌గా ఆ సూచనల ప్రకారం ఎస్ఐ రాజ‌కుమారి ఆ గ‌ర్భిణికి సుర‌క్షితంగా డెలివ‌రీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఆ తరువాత అంబులెన్స్‌ను పి‌లిపించి త‌ల్లీబిడ్డ‌లను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆ తల్లి బిడ్డ ఆసుప‌త్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన పై ఆ గర్భిణీ భర్త అయిన బాద్‌షా స్పందిస్తూ మ‌హిళా ఎస్ఐ రాజ‌కుమారి గుర్జర్ కనుక లేకపోతె తన భార్య బిడ్డ కూడా దక్కేవారు కాదని అంటూ.. ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు.

అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష

నిరుద్యోగులకు శుభవార్త   నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు   ఆన్ లైన్ పరీక్షలు, మూడేండ్ల వరకు స్కోర్ కార్డ్ వాలిడిటీ   నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చు, శ్రమ తగ్గించే ప్రయత్నం   ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై బ్యాంక్ ఉద్యోగం కోసం ఒక పరీక్ష, రైల్వే జాబ్ కోసం మరో పరీక్ష ఇలా అనేక రకాల ఉద్యోగాల కోసం రకరకాల పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. రెండు వేరువేరు ఉద్యోగాల పరీక్షలు ఒకే రోజు ఉన్నాయంటూ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఏదో ఒక జాబ్ సాధించాలన్న పట్టుదలతో అనేక పరీక్షలకు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు.   కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టులు, పబ్లిక్ సెక్టార్ లోని బ్యాంక్ ఉద్యోగాలు దాదాపు ప్రతి ఏటా భర్తీ చేసే లక్షా25వేల ఉద్యోగాల ను ఒకే పరీక్ష ద్వారా నియామాలు చేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటుచేశారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ మూడేండ్ల వరకు వర్తిస్తుంది. దేశంలోని దాదాపు 20 సంస్థల్లోని ఉద్యోగాలు ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.   ఊరికి దగ్గరలో, నచ్చిన భాషలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలంటే రాష్ట్ర రాజధాని, ముఖ్యపట్టణాల్లోనే రాయాల్సి ఉంటుంది. ఇది గ్రామీణ నిరుద్యోగ యువతకు ఖర్చు, శ్రమతో కూడిన అంశం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రామీణ యువతకు  అవకాశాలు మెండుగా కల్పించేలా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను వారికి దగ్గరలో ఉండే సెంటర్ నే పరీక్ష రాయడానికి ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదు తమకు నచ్చిన భాషలో రాసుకునే వీలు కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం గ్రామీణయువతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దిశగా నడిపించేలా ఉంది.   1517కోట్ల కేటాయింపు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ఏర్పాటుకూ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఇందుకోసం 1517.57కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఢిల్లీలో ఈ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. సెక్రటరీ స్థాయి అధికారి ఏజెన్సీకి చైర్ పర్సన్ గా ఉంటారు. ఈ ఏజెన్సీ నిర్వాణకు మూడేండ్లకు 1517.57 కోట్ల రూపాయలను కేటాయించారు. దేశంలో ప్రతి ఏటా భర్తీ చేసే 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2.50కోట్లమంది ప్రతిఏటా పోటీ పడుతున్నారు. ఇకపై ఈ ఏజెన్సీ ద్వారానే 1.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా మొదటిదశలో వెయ్యి పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేస్తారు. గ్రామీణ ప్రాంత యువతకు అందుబాటులో ఉండేలా జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాల కోసం మౌలికసదుపాయాలు కల్పిస్తారు. 

అప్పట్లో చంద్రబాబు నా ఫోన్ ట్యాప్ చేయించిన ఆధారం ఇదిగో.. టీడీపీకి సజ్జల కౌంటర్

ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అటు న్యాయమూర్తుల ఫోన్లు ఇటు విపక్ష నేతల ఫోన్లు కూడా వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇదిగో అంటూ ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఇదే ఆధారాన్ని తాము కోర్టులకు కూడా సమర్పించామని అయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపించడం లేదని అయన ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ టైంలో తన ఫోన్ ట్యాప్ జరిగిందని వైసీపీ నేత సజ్జల చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

గోదావరి మధ్యలో చిక్కుకు పోయిన టీడీపీ ఎమ్మెల్యే... 

గోదావరిలో వరద ఉధృతి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో గోదావరి జిల్లాలలో పలు గ్రామాలు, లంకలు నీట మునిగాయి. తాజాగా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పడవలో బాడవ గ్రామానికి వెళ్లి వస్తుండగా మధ్యలో సాంకేతిక లోపం తలెత్తి మర పడవ గోదావరిలో యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరిలో నిలిచిపోయింది. అంతేకాకుండా నదిలో ఉధృతికి పడవ కొంతదూరం కొట్టుకుపోయిందని సమాచారం.   మంగళవారం కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, బాడవ గ్రామాలు గోదావరి వరదతో పూర్తిగా జలదిగ్భంధం అయ్యాయి. ఈ గ్రామాల్లో ప్రజలు పూర్తిగా పడవలపై రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొంది. దాదాపు 1733 ఇళ్లు వరద నీటిలో ఉన్నాయని తహసీల్దార్ ఎల్.నరసింహారావు తెలిపారు. దీంతో ముంపుకు గురైన ఈ లంక గ్రామాల్లో పర్యటించేందుకు ఎమ్మెల్యే వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.

షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మురుగు నీటిలో కరోనా.. 

ఏది పట్టుకోవాలన్నా.. ఏది ముట్టుకోవాలన్నా ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి ప్రజలు కనీసం అడుగు బయట పెట్టని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో బయటి ఫుడ్ కూడా ఎవాయిడ్ చేసి ఇంటి భోజనం తో జనం సరిపెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైద‌రాబాద్ న‌గర ప్ర‌జ‌ల‌కు సీసీఎంబీ మ‌రో చేదు వార్త తెలిపింది. న‌గ‌రంలోని మురుగు నీటి ట్రీట్ మెంట్ ప్లాంట్ల వద్ద నుండి సేక‌రించిన నీటిలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించామ‌ని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.   కరోనా సోకినా ప్ర‌తి మ‌నిషిలో కూడా 35 రోజుల వ‌ర‌కు వైర‌స్ ఉండే అవ‌కాశం ఉంద‌ని, ఇది మ‌ల మూత్ర విసర్జ‌న ద్వారా మురుగునీటిలో క‌రోనా వైర‌స్ ఉండ‌వ‌చ్చ‌ని రాకేష్ మిశ్రా తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో కరోనా కేసులు బయటపడనప్పటికీ.. అక్కడ ఇన్ఫెక్షన్ బారిన పడినవారు ఉండవచ్చని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన ప్రకారం అసలు లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి హాస్పిటల్ లో చేరకుండానే తగ్గిపోతున్న వారి సంఖ్య కూడా ఏమి తక్కువ కాదని అందువల్లనే మన దగ్గర వైద్య సదుపాయాలు తక్కువగ్గా ఉన్న కూడా కరోనా తో నెట్టుకు రాగలుగుతున్నామని తేల్చింది. దీంతో ఇన్నాళ్లు కేవ‌లం ద‌గ్గు, తుమ్ములు, తుంప‌ర్ల ద్వారానే క‌రోనా వ్యాపిస్తుంద‌ని తేల‌గా ఇప్పుడు మ‌ల, మూత్ర విస‌ర్జ‌న ద్వారా కూడా వ‌స్తుంద‌ని సీసీఎంబీ తన తాజా పరిశోధన ద్వారా షాకింగ్ న్యూస్ తెలిపింది. దీంతో నగరంలో ప్రవహించే నాలాల్లోని మురుగు నీటి ద్వారా కూడా వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని తాజాగా హెచ్చ‌రించింది. సీసీఎంబీ, ఐఐసిటీ కలిసి చేసిన ప‌రిశోద‌నల్లో ఈ విష‌యం తేలినట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

గవర్నర్ పై వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. రాష్ట్ర బిజెపి డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రస్తావించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ పై టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడాన్ని బిజేపి రాష్ట్ర నాయకులు తప్పు పట్టారు. సోషల్ మీడియాలో గవర్నర్ పై పోస్టులు పెట్టిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ కు రాజకీయాలను ఆపాదించడం అప్రజాస్వామికం అన్నారు.  గవర్నర్ ని టార్గెట్ చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే అన్నారు. కొందరు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ లను ముఖ్యమంత్రి చేష్టలుడిగి నట్లు చూస్తున్నారని విమర్శించారు. బిజేపి జాతీయ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్ ,అధికార ముఖ్య ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు, కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, మహిళామోర్చా నాయకులు డిమాండ్ చేశారు.   రాజ్యంగ పదవిలో ఉన్న గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తూ చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతాపార్టీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డాక్టర్ గా ఆమె కోవిద్ 19 వైరస్ వ్యాప్తి జరుగుతున్న తీరు, ప్రజలు పడుతున్న అవస్థలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి పలు సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.    హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తో పాటు ఇతర టిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంవరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. పార్టీ అదినేత గా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కోరారు.. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన నేతల ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడి లో విఫలమైన ప్రభుత్వం గవర్నర్ ని టార్గెట్ చేయడం అప్రజాస్వామికం ,శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవి లో ఉండి ఒక వైద్యరాలిగా  ప్రభుత్వానికి, సి ఎస్ కు ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పీరియాడికల్ గా విలువైన సూచనలు గవర్నర్ చేశారు. అయితే ఆ సూచనలు ఏవీ పాటించకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను గాలికి వదిలేశారు. వాస్తవాలు చెప్పి, బాధ్యతయుతంగా సూచనలు చేసిన గవర్నర్ పై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమో గమించాలన్నారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్ లను బిగించలేని దుస్థితి లో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు .   అధికారపార్టీ కబ్జాల కారణంగానే.. టిఆర్ఎస్ నేతల భూకబ్జాల కారణంగానే వరంగల్ నగరం వరదలకు అతలాకుతలమైనదని విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మార్వో లపై ఏసీబీ దాడులు కేసీఆర్ అవినీతి పాలనకు పరాకాష్ట అని సుధాకర్ రెడ్డి విమర్శించారు .   ఇకనైనా పద్దతి మార్చుకోండి - కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 ఎదుర్కోవడంలో దారుణ వైఫల్యం చెంది, సంక్షోభానికి కారణమైన కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ డా. తమిళిసై చివాట్లు పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం తమ పంథా మార్చుకుని కోవిడ్ విషయంలో వ్యవహరిస్తోన్న పద్ధతిని సరిచేసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు.   తెలంగాణ వ్యాప్తంగా, జిల్లాల్లోనూ, హైదరాబాద్ లోనూ చాలా కాలనీల్లో, అపార్టుమెంట్లలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. కానీ వాటి వివరాలు సేకరించే వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. స్వయంగా వైద్యురాలైన గవర్నర్ మార్చి నుంచీ టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా విషయంలో వ్యవహరిస్తోన్న తీరు, నేరపూరిత నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు. చివరికి ఇప్పుడు, ఆఖరి అస్త్రంగా బహిరంగంగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తెచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న గవర్నర్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శంకర్ విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్‌ పై కొందరు దౌర్జన్యం చేసి.. తాళాలు పగలగొట్టి రూ. కోటీ యాభై లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించారు. దీనిపై బాధితులు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఎస్పీ కూడా స్పందించలేదు.    అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్ చివరికి హైకోర్టును ఆశ్రయించాడు. తన షాపులో సామాగ్రిని అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతు ఉందని, ఎమ్మెల్యే వత్తిడి కారణంగానే పోలీసులు మౌనం వహిస్తున్నారని బాధితుడు శివ ప్రసాద్ తన పిటిషన్‌ లో ఆరోపించాడు. తన షాపును వారు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. పిటిషన్‌ ను పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యే మద్దాలి గిరితో సహా పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనంతపురం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రభాకర్‌ రెడ్డి కడప జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.   వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాలకి ఓ పోలీస్ అధికారి అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ప్రభాకర్‌రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను మళ్లీ రిమాండుకు కడప జైలుకు తరలించారు. జైల్లో ఉండగా ఆయనకు కరోనా సోకింది.  ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

ఫోటో జర్నలిస్టులను ఆదుకోవాలి: బండి సంజయ్ కుమార్

వంద పదాలు వర్ణించలేని భావాన్ని ఒక ఛాయాచిత్రం వర్ణింపజేస్తుంది. అంతటి అపురూప, మహోన్నతమైన కళ ఫొటోగ్రఫీ.  ఓ ఫోటోను ఆకట్టుకునే విధంగా ఫ్రేంలో బంధించాలంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎంతో సృజనాత్మకతను జోడించాలి. అటువంటి ఫోటోగ్రాఫర్లందరికి హ్యాట్సాఫ్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ లకు పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.   విషాద సంఘటనలే కాదు.. ఆహ్లాదకరమైన దృశ్యాలను అందించి.. మనస్సులను రంజింప చేసి శక్తి ఫోటోకు ఉంది. మనస్సులను తుళ్లిపడేలా చేసి..మైమరిచేలా చేసే ఫోటోలు కూడా అనేకం ఉన్నాయి.  అంతట ఔచిత్యం ఉన్న ఫోటోగ్రఫీ నేడు సాంకేతికతను అద్దుకుని మరింత కొత్తగా ముందుకు సాగిపోతోంది అంటూ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ సందర్భంగా ఆయన ఫొట్రోగ్రఫిలో వస్తున్న ఆధునికతను ప్రస్తావించారు.   సమాజ అభివృద్ధిలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది. పత్రికా రంగంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమైంది.  ఒక ఫొటో ద్వారా వార్తా విషయం మొత్తాన్ని తెలియజేయడంలోనే ఫొటోగ్రాఫర్ల ప్రావీణ్యం దాగుంది. ప్రస్తుతం మనమందరం ఎదుర్కొంటున్న కరోనాపై చేస్తున్న యుద్ధంలో ఫొటో జర్నలిస్టులు కూడా ముందు వరుసలో ఉన్నారు. అనుక్షణం ప్రజలకు సమాచారం అందించడమే లక్ష్యంగా వీడియో జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వారందరి సేవలకు ధన్యవాదాలు అన్నారు.   తెలంగాణ ప్రభుత్వం ఫొటో జర్నలిస్టును పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి డబుల్‌బెడ్రూంల కేటాయింపులు జరగకపోవడం శోచనీయమన్నారు సంజయ్.  జర్నలిస్టుల సంక్షేమం కోసం  100  కోట్ల రూపాయల  సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ  హామీని నిలబెట్టుకోకపోవడం జర్నలిస్టులను విస్మరించడమే అన్నారు. కరోనా వార్తల సేకరణలో ఫొటో జర్నిలిస్టులు, జర్నలిస్టుల ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నారు, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శుభకార్యాలు నిలిచి ఫొటోగ్రాఫర్లకు ఉపాధి లేక, పెట్టిన పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, కెమెరాలకు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

వరద నీరుతో మునిగిన స్థలాలను ఇళ్లకు కేటాయించారు

కాదేదీ ఇళ్ల స్థలాలకు అనర్హం అన్నట్టు ఏపీ ప్రభుత్వం పలు వివాదాస్పద స్థలాలను పేదవారి ఇళ్ళ స్థలాల కోసం ఎంపిక చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వరద నీటిలో మునిగిపోయే స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.   ఆవ భూములలో ఇళ్ల స్థలాలు పంపిణీని వెంటనే రద్దు చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. వర్షాలకు ఇప్పటికే ఈ ప్రాంతమంతా మునిగిపోయిందని.. మళ్లీ వర్షం వస్తే 30 వేల మందికి పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఈ భూములకు ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకుని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆవలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని, ప్రభుత్వానికి కళ్లు ఉంటే అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు.   ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆవ భూములు నివాస యోగ్యం కాదని హెచ్చరించినా, ఆ నివేదికను పక్కన పెట్టి, ఒక యూనివర్శిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు స్వీకరించారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణ వ్యవహారంలో గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించకపోగా.. ఇప్పుడు అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే.. ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సెప్టెంబర్ 5 నుంచి జగనన్న విద్యాకానుక

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకు పైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది.  సెప్టెంబర్‌ 11న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.   సెప్టెంబర్‌ 1న గర్భిణీలు, బాలింతలు, పిల్లల కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టనుంది. సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. విద్యాకానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయనుంది. 3 జతల యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించాలని నిర్ణయించింది.    ఎన్నికల హామీ ప్రకారం ఇంటింటికి నాణ్యమైన బియ్యం అందించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని డిసెంబర్1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 9260 వాహనాల ద్వారా ఇంటివద్దనే తూకం వేసి బియ్యం పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకు సబ్సిడీపై వాహనాలు అందజేయనుంది. అలాగే 583 కోట్లతో బియ్యం కార్డుదారులకు వైఎస్సార్ భీమా పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.    పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజినల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.