గన్నవరం ఎయిర్ పోర్ట్ భూములలో నాట్లు వేసిన రైతులు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతులు తమ భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎపి రాజధాని అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడంతో విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులు కూడా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వారు ఇచ్చిన భూముల్లో మళ్ళీ సాగు చేపట్టి సవాల్ విసిరారు. తాజాగా విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో తిరిగి వ్యవసాయం చేయటానికి రైతులు సిద్ధమయ్యారు. కొందరు రైతులు దమ్ము చేసి నారుమళ్లు కూడా వేశారు. ఇప్పటికే విమానాశ్రయ స్వాధీనంలో ఉన్న ఈ భూముల్లో రైతులు సాగు చేపట్టడంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఈ వ్యవహారం పై రైతులతో చర్చలు జరుపుతున్నా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.
రాష్ట్ర విభజనకు ముందు గన్నవరం ప్రాంతం లో రియల్ భూమ్ ఉండడంతో భూముల ధరలు భారీగా ఉండేవి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర విభజన జరగటంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటంతో విజయవాడ విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది. విభజన చట్టంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రం పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించింది. దీనికి అవసరమైన 700 ఎకరాల భూములను ఎయిర్పోర్టు అథారిటీకి అప్పగించింది. అయితే అప్పట్లో రైతులు తమ భూములు ఇవ్వటానికి మొదట నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని అమరావతి రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇస్తామని అప్పటి సీఎం చంద్రబాబు హామీ ఇవ్వటంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములు అప్పగించారు. రైతులకు ఏటా ఇచ్చే కౌలుతో పాటు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో తమ స్వాధీనంలోకి తీసుకున్న భూముల్లో ఎయిర్పోర్టు అథారిటీ విస్తరణ పనులు చేపట్టింది. గన్నవరం ప్రాంత రైతుల ప్యాకేజీలో భాగంగా రాజధానిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్ లు, యాన్యుటీ వంటి సౌకర్యాలు కల్పించడానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఎన్నికల నాటికి మూడొంతుల మంది రైతులకు అమరావతిలో ప్లాట్లు కూడా కేటాయించారు.
అయితే ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ రైతుల సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసింది. అప్పటికే ప్లాట్లు కేటాయించగా మిగిలిపోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు అటకెక్కింది. దీనికి సంబంధించి దాదాపు 108 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి ప్రగతి లేదు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తేవడంతో అమరావతిలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో అమరావతి నుంచి పరిపాలనా కేంద్రం తరలిపోతే తమ త్యాగానికి కూడా విలువ లేకుండా పోతుందని.. తాము ఖరీదైన భూములను విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చామని, ఐతే ప్యాకేజీలో భాగంగా అమరావతిలో ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకపోవటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రన్వేకు సమీపంలో విమానాశ్రయం స్వాధీనంలో ఉన్న తమ భూముల్లో తాజాగా రైతులు దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేస్తున్నారు. నూతన రన్వే వెంట ఉన్న నేవిగేషన్ కంట్రోల్ స్టేషన్ దగ్గర ఉన్న భూముల్లో వారు సాగు చేపట్టారు. ఈ పరిణామంతో ఎయిర్పోర్టు అధికారులు ఉలిక్కి పడ్డారు. రైతులతో చర్చలు సాగిస్తున్నా ఫలితం కనిపించలేదు. ఒకవేళ బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. రైతులు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు సమస్య జఠిలమవుతుందని, సామరస్యంగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే అమరావతి రైతులు కోర్టు బాట పట్టగా, తాజాగా తమకు జరుగుతున్న అన్యాయంపై గన్నవరం ప్రాంత రైతులు కూడా న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తమ సమస్యల పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి పైగా సమయం ఇచ్చి ఓపికతో ఎదురు చూసామని, ఐతే తమ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.