అంతర్జాతీయ క్రికెట్‌ కు ధోనీ గుడ్‌బై

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ధోనీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇన్నాళ్లూ తనకు మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.    యావత్ దేశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకున్న రోజున.. ధోనీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ధోనీ రిటైర్మెంట్ ప్రకటనతో క్రికెట్‌ అభిమానులు షాకయ్యారు. దేశం తరపున మరింత కాలం క్రికెట్‌ ఆడతాడనే ఆశతో ఉన్న ధోనీ అభిమానులు ఈ ప్రకటనతో షాక్ కు గురవుతున్నారు.    భారత క్రికెట్‌కు ధోనీ రెండు దశాబ్దాల పాటు సేవలందించాడు. టీమిండియా తరపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. టీ20, వన్డే ప్రపంచకప్‌ లను అందించి అందరి ఆదరాభిమానాలను పొందాడు. 2019 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ ధోనీ ఆడిన చివరి మ్యాచ్. ఆ మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలై, టోర్నీ నుంచి తప్పుకుంది.

సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి పెద్ద కుట్ర.. హీరో రామ్ సంచలన ట్వీట్లు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన రామ్.. దీని వెనుక పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది అని అనుమానం వ్యక్తం చేశారు.   "హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?" అని రామ్ ప్రశ్నించారు. "ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్" అంటూ మరో ట్వీట్ చేశారు. అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని పేర్కొన్నారు. "పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి!... వైఎస్ జగన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌,మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం." రామ్ అని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.  

వర్షపు నీరు తూర్పు పడమరగా..

రెండు సముద్రాల సరిహద్దు శిఖరం   మూడు వైపుల సాగరతీరాలు, ఒక వైపు హిమగిరులతో ఉండే భారతదేశ భౌగోళిక స్వరూపం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. పెట్టనిగోడలా రక్షణ నిచ్చే పర్వతశ్రేణులు, అమృత ధారలు కురిపించే జలపాతాలు, సస్యశ్యామం చేరే నదీజలాలు ఆహ్లదానిస్తాయి. దేశ సరిహద్దుల్లోనే కాదు భారతదేశంలోనూ ఎన్నో అద్భుతమైన అంశాలు దాగి ఉన్నాయి. ప్రతి ప్రాంతానికో చరిత్ర. ప్రతి అంశానికో ప్రత్యేకత భారతదేశ విశిష్టత.   పశ్చిమ కనుమల్లోని ఒక శిఖరం పై పడే వర్షపు నీరు రెండు గా విడిపోయి భిన్న దిశల్లో ప్రవహించి రెండు వేరువేరు సముద్రాలకు చేరుతుంది. ఈ విషయాన్ని భౌగోళిక సర్వేలో గుర్తించిన బ్రిటిష్ అధికారులు ఈ ప్రాంతంలో శిలాశాసనం ఏర్పాటు చేశారు. దానిపై " రిడ్జ్ అరేబియా సముద్రం బే ఆఫ్ బెంగాల్ " పదాలను చెక్కారు. మరి ఈ శిఖరం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా.. కర్ణాటకలో హసన్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో బిస్లే ఘాట్ నుంచి సక్లేష్పూర్ వెళ్లే దారిలో మంకనహళ్లి అనే చిన్న గ్రామం ఉంటుంది. బిస్లే నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన కాంక్రీట్ ప్లాట్ ఫాం పై ఈ శాసనం ఉంటుంది.   ఈ శాసనం ఉన్న పాయింట్ కు ఎడమపైవు పడే వర్షపు నీరు పడమటి వైపు ప్రవహించి కుమారధార, నేత్రావతి నదుల్లో చేరుతుంది. ఆ నదులు చిక్ మంగుళూరు సమీపంలో అరేబియా సమద్రంలో కలుస్తాయి. ఇక కుడి వైపు పడే వర్షపు నీరు తూర్పు దిశగా ప్రవహించి హేమావతి ఉపనదుల్లో చేరుతుంది. సమీప ప్రాంత ప్రజల తాగు, సాగు నీటి అవసరాలను తీర్చుతూ పరుగులు తీస్తాయి. కావేరి నదిలో కలిసి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడులో బంగాళ ఖాతంలో కలుస్తాయి.   పశ్చిమ కనుమల్లో ఎన్నో ప్రకృతి సుందర దృశ్యాల మధ్య తూర్పుపడమర సముద్రాల శిఖరంగా ఉన్న ఈ భౌగోళిక వింత తప్పక చూడాల్సిన ప్రదేశం.

మనతో పాటు మరో ఐదు దేశాలు

బ్రిటిష్ పరిపాలన నుంచి 15 ఆగస్టు 1947లో భారతదేశానికి విముక్తి లభించింది. లక్షలాది మంది స్వాతంత్య్రం సమరంలో పాల్గొన్ని తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి భారతమాతకు స్వేచ్ఛ ప్రసాదించిన రోజుగా, జాతీయ పర్వదినంగా భావిస్తాం. దాంతో గత 73ఏండ్లుగా ఆగస్టు 15వ తేదీని దేశ స్వాతంత్య్రం దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. వాడవాడలా జాతీయ జెండాను ఎగురవేసి స్వేచ్ఛ పతాక రెపరెప లను ఆస్వాదిస్తాం. అయితే ప్రపంచంలో మరికొన్ని దేశాలు కూడా 15ఆగస్టును స్వాతంత్య్ర దినోత్సవం గా, జాతీయ దినోత్సవంగా జరుపుకోంటున్నాయి.   ఉత్తర, దక్షిణ కొరియాలు 1945లో జపాన్ లొంగిపోయిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అప్పటివరకు జపాన్ ఆక్రమణలో ఉన్న కొరియా 15ఆగస్టు 1945న జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందిన సందర్భంగా ఈ రెండు దేశాలు స్వేచ్ఛాదినంగా ( Liberation Day)గా నిర్వహించుకుంటాయి. ఆ తర్వాత కొరియాను  యునైటెడ్ స్టేట్స్ , సోవియట్ యూనియన్ రెండుగా విభజించాయి. ఉత్తర కొరియా,  దక్షిణ కొరియాలుగా విడిపోయాయి. దక్షిణ కొరియాలో అధ్యక్షపాలనా విధానం కొనసాగుతుంది. దక్షిణ కొరియా ప్రజల జీవనప్రమాణం అత్యున్నత స్థాయిలో ఉంది. 2004 నుండి రొబోట్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇక ఉత్తరకొరియా దేశ బడ్జెట్ లో అత్యధికం శాతం రక్షణవ్యవస్థకు కేటాయిస్తూ నియంతృత్వపాలనలో కొనసాగుతోంది. అత్యధిక సంఖ్యలో సైన్యం కలిగిన దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. సైనికుల సంఖ్య పరంగా  ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలలో చైనా, అమెరికా, భారతదేశాలు ఉన్నాయి. అంతేకాదు అణ్వస్త్రాలు కూడా తయారు చేసింది. బహ్రెయిన్ ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉన్న చిన్న ద్వీపం. పురాతనకాలం నుండి బహ్రయిన్ ముత్యాల ఉత్పత్తికి ప్రసిద్ధి. 19వ శతాబ్దం నాటికి బహ్రయిన్ ముత్యాలు ప్రపంచంలో నాణ్యమైన ముత్యాలుగా గుర్తింపు వచ్చింది. 1521లో పోర్చుగీసు వారు ,  1783లో బని ఉత్బా వంశస్థులు ఈ ద్వీపాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత 1800 చివరిలో యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఒప్పందం ద్వారా ఇది బ్రిటీష్ వారి వశమైంది. ఇక్కడ 1931 లో చమురును కనుగొన్నారు. ఆ తర్వాత చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారు. చమురు శుద్ధి కర్మాగారం ఉన్న గల్ఫ్‌లోని మొదటి రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు వచ్చింది. ఐక్యరాజ్యసమితి సర్వే తర్వాత ఇది దేశంగా గుర్తించబడి 15ఆగస్టు 1971లో స్వాతంత్య్ర రాజ్యంగా అవతరించింది. అయితే బ్రిటిష్ వారితో స్నేహ ఒప్పందం కుదుర్చుకుంది. బహ్రెయిన్ బ్రిటిష్ వారి నుంచి  15 ఆగస్టున స్వాతంత్య్రం పొందినప్పటికీ జాతీయ దినంగా నిర్వహించదు. మొదటిసారి బహ్రెయిన్ సింహాసనాన్ని ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా  అధిరోహించిన రోజు 16 డిసెంబర్ ను జాతీయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు.   లిచెన్ స్టాయిన్ యూరప్ ఖండంలో స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల మధ్యన ఉండే ఒక చిన్న దేశం  లిచెన్ స్టాయిన్ . యూరప్ లోని నాల్గవ అతి చిన్న దేశం ఇది. అంతేకాదు అత్యధిక జిడిపి కలిగిన దేశం. ఈ దేశంలోనూ 15ఆగస్టును జాతీయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు. అయితే ఈ దేశానికి ఇది స్వాతంత్య్రం వచ్చిన రోజు కాదు. ఆ దేశ యువరాజు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకునే జాతీయ పండుగ రోజు.   లిచెన్ స్టాయిన్ యువరాజు  ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ II పుట్టినరోజు 16 ఆగస్టు. ముందు రోజు రాత్రి నుంచే ఆ దేశంలో ఉత్సవాలు చేసేవారట. 1989 లో ప్రిన్స్ మరణం తరువాత, జాతీయ సెలవుదినాన్ని15 ఆగస్టు గానే  రోజున ఉంచాలని నిర్ణయించారు. దాంతో ఇప్పటికీ 15 ఆగస్టును ఆ దేశంలో జాతీయదినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు.   కాంగో మధ్య ఆఫ్రికాలోని ఒక దేశం. అపారమైన ఆర్థిక వనరులతో కూడిన విస్తారమైన దేశం.  15 ఆగస్టు1960 న  ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగో  పూర్తి స్వాతంత్య్రం పొందింది.  ఆఫ్రికాలో అధికంగా పట్టణీకరణ చెందిన దేశాలలో కాంగో ఒకటిగా ఉంది. దేశంలో 62 మాట్లాడే భాషలు వాడుకలో ఉన్నాయి. విద్యాబోధన అన్ని స్థాయిలలో ఫ్రెంచిభాషలోనే ఉంటుంది.

మేక్ ఇన్ ఇండియా తో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో..

25ఏండ్లు వచ్చిన కొడుకు సొంత కాళ్లపై నిలబడాలని ఆ కుటుంబం కోరుకుంటుంది. కానీ 75ఏండ్లు వచ్చినా దేశం మాత్రం స్వయం సమృద్ధి సాధించలేకపోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతాకాన్నిఆయన ఎగుర వేశారు. ఆ తర్వాత  దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.   కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశమంతా ఒక్కటై నిలిచిందన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై ఈ విపత్తును ఎదుర్కోవడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాయని ప్రజలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. కరోనా ఒక్కటే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయన్నారు. చుట్టుముట్టిన సమస్యలన్నింటీని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పని చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.   దేశసరిహద్దుల్లో రక్షణ దళాలు, దేశంలో పోలీసులు దళాలు నిరంతరం దేశ భద్రతను, ప్రజలను రక్షిస్తున్నాయన్నారు. ఎదురయ్యే సవాళ్లు మన సంకల్పాన్ని మరింత ధృడం చేస్తాయన్నారు.   కరోనా విపత్కర పరిస్థితి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుండి దేశంలోని అన్నిరంగాల వారిని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయుల సక్సెస్ మంత్రగా మారిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. భారత్ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదని, ఉన్నత విలువలతో కూడిన జీవనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంగా మిగిలిపోకూడదని, అది అందరి సంకల్పం కావాలని మోడి పిలుపునిచ్చారు.   మేక్ ఇన్ ఇండియా తో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంలో దేశం ముందుకు పోతుందన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదంలో భారత్‌ తయారు చేస్తున్న వస్తువులను ప్రపంచం ఆదరించేలా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తి కొనసాగించాలన్నారు. 

హైకోర్టు తీర్పుల గురించి జగన్ ఏం అనుకుంటున్నారు?

వరసపెట్టి హైకోర్టు అన్ని విషయాలలో జగన్ ప్రభుత్వాన్ని మొట్టి కాయలు వేస్తోంది. అయినా ఏపీ సీఏం జగన్ అండ్ కో ఏమాత్రం వెరవకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం నుంచి అమరవాతే కాదు, పంచాయితీ కార్యాలయలకు వైసీపీ రంగులు వేయడం వరకు అన్నింటా ఎదురు దెబ్బలే అయినా జగన్ ప్రబుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.    అమరావతి విషయంలో కూడా కోర్టులు ఏ తీర్పు ఇచ్చినా వెనక్కి తగ్గేది లేకుండా కార్యాలయాలను షిష్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. రాజధానిగా అమరావతిని మార్చలేదని, మరో రెండు రాజధానులు పెడుతున్నామనే వాదన తెస్తారని, అందుకే కొన్ని కార్యాలయ్యాలు అక్కడకి పంపుతున్నామని కోర్టు చెబుతారని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమరావతి సమర్దకులు సుప్రసిద్ధ లాయర్ హరీష్ సాల్వేను తమ కోసం వాదించడానికి నియమించుకుంటే జగన్ వర్గం ఆయన రంగంలోకి దిగకుండా చూసుకుందని వినికిడి.    అసలు రాజధానిని అక్కడ నుంచి తరలించి, హైకోర్టును కర్పూలు పంపే ప్రయత్నంతోనో హైకోర్టు వర్గాలు భగ్గమంటున్నాయి. అప్పటి నుంచి స్టేట్ , అండ్ కోర్టు మధ్య ఉప్పు నిప్పు లానే ఉంది. పబ్లిక్ లోను, కొంత జాతీయ మీడియాలోను జగన్ అపఖ్యాతి కూడగొట్టుకొన్నది నిజమే. అయితే ఆ ముప్పును ఆయన ఎలా తొలగించుకుంటారనే విషయంలో వైసీపీకి మహా నికార్సయిన క్లారిటీ ఉందట. ఏంటంటే ఎల్లో మీడియా అంటూ పత్రికల మీద దాడి చేసి గుడ్డ కాల్చి మొహం వేసినట్లు కోర్టుల మీద కూడా ఎదురు దాడి చేయడమేనట.    కోర్టులు అకారణంగా తనను వెంటాడుతూ ఉన్నాయని తన మీద పగబట్టి టీడీపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని పదే పదే చెప్పి ప్రజల అటెన్షన్ ను కోర్టు తీర్పు మీద కూడా కోర్టు ఇంటెన్షన్ మీదకు డైవర్టు చేసే ప్రయత్నమట. అందుకే మంత్రులు,ఎంఎల్ ఏలు తాజాగా కోర్టులను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నారని వాదన లేవదీస్తున్నారు. అలా పదే పదే మాటాడుతుంటే ప్రజలకు కోర్టుల మీద నమ్మకం పోతుందని, అమరావతి నిర్మాణం మీద చేసినట్లునే కోర్టు తీర్పుల మీద ప్రచారం చేయాలనే మహా వ్యూహం ఉందని అంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ నేర్పిన విద్యనే ఇపుడు మరోసారి ప్రయోగించనున్నారట. నిజానికి కోర్టు తమ మీద ఎన్ని మొట్టికాయలు వస్తే అంత మంచిదనే వర్గం కూడా ఉందట వైసీపీలో.

ఆధార్ కార్డు తరహాలో.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డు

దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. 74వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వన్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ స్కీమ్‌ను ప్రకటించారు. ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు.  వన్ నేషన్  వన్ హెల్త్ కార్డు నినాదంలో రూపొందించిన ఈ పథకం ద్వారా  దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ ఫార్మెట్‌లో భద్రపరుస్తారు. ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్య పరిస్థితి సమీక్షించడానికి, మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ డిజిటల్‌ ఫార్మెట్‌లో భద్రపరచడానికి ఉపయోగపడుతుంది.    కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా నేర్చుకున్న గుణపాఠాల్లో భాగంగా ఈ పథకం రూపొందిందని చెప్పవచ్చు. దేశంలోని దవాఖానాలు, క్లినిక్ లను సెంట్రల్ సర్వర్ కు అనుసంధానం చేస్తారు. గ్రామాల్లో మరిన్ని వెల్ నెస్ సెంటర్లను ప్రారంభిస్తారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకానికి మొదటి దశలో రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు.   ఈ పథకం అమలులోకి వస్తే దేశంలోని ఒక వ్యక్తి ఏ డాక్టర్‌‌ దగ్గరకు వెళ్లినా, దవాఖానకు వెళ్ళినా అంతకు ముందు తన హెల్త్ హిస్టరీకి సంబంధించిన ఎలాంటి రిపోర్టులు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి కేటాయించిన యూనీక్ ఐడీ కార్డు నెంబర్ చెప్పితే చాలు. అతని హెల్త్ హిస్టరీ మొత్తం డాక్టర్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆధార్ కార్డు తరహాలోనే ఈ ఆరోగ్య కార్డ్ కూడా రూపొందించనున్నారు. అయితే ఈ కార్డు తీసుకోవాలా, వద్దా అన్న నిర్ణయం ఆయా వ్యక్తులకు ఇచ్చారు. అంతేకాదు  ప్రజల వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని పూర్తి భద్రంగా, రహాస్యంగా ఉంచుతారు.

కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్ పై బుగ్గన రాజీనామా కోరిన దేవినేని ఉమా

గత నెలలో ఎపి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబులు పేమెంట్లు చేసిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేసారు. ఈరోజు జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన పొరపాటున రూ.649 కోట్లు గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు బదిలీ అయ్యాయని ఎలా చెబుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే పెన్షనర్ల చెల్లింపులో కూడా జూలై 30న డబుల్ పేమెంట్ జరిగిందని ఆయన చెప్పారు. అలాగే చిత్తూరు జిల్లాలో కొందరు కాంట్రాక్టర్లకు కూడా డబుల్ పేమెంట్ జరిగిందన్నారు. ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ పేమెంట్స్ రూపంలో.. ఎంత మొత్తం చెల్లింపులు జరిపారో ఆర్ధిక మంత్రి బుగ్గన వివరణ ఇవ్వాలని ఉమా డిమాండ్ చేశారు.    ఈ మొత్తం వ్యవహారంపై ఆర్ధిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పి తీరాల్సిందేనని.. అసలు ఆర్ధిక శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. ఎలా సమర్థిస్తారని దేవినేని ప్రశ్నించారు. ఈ మొత్తం  వ్యవహారానికి  బాధ్యత వహిస్తూ మంత్రి బుగ్గన వెంటనే రాజీనామా చేయాలని ఉమా డిమాండ్ చేశారు.

అమిత్‌షాకు క‌రోనా నెగెటివ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. ఈశ్వరుడి దయ వల్ల కరోనా నుంచి బయటపడ్డానని అన్నారు. తనకు చికిత్స అందించిన మేదాంత హాస్పిటల్ డాక్టర్లకు, మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. అలాగే, తాను కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. అయితే, వైద్యుల సలహా మేరకు మరి కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉంటానని చెప్పారు.    55 ఏళ్ల అమిత్ షా రెండు వారాల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆగ‌స్టు 2న ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు అమిత్‌ షా స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆస్ప‌త్రిలో చేరుతున్న‌ట్టు తెలిపారు. త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌వారు క్వారంటైన్‌లో ఉండాల‌ని, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే క‌రోనా పరీక్షలు చేయించుకోవాల‌ని సూచించారు.

మాజీ సీఎం చంద్రబాబు పై లోకాయుక్తలో కేసు నమోదు.. 

ఏపీ సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో ధర్మ పోరాట దీక్ష పేరుతో పలు నగరాలలో దీక్ష చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఒకసారి దేశ రాజధాని ఢిల్లీలో కూడా అఖిల పక్ష నాయకులతో కలిసి దీక్ష చేసారు. ఐతే కేంద్ర ప్రభుత్వం పై చేసిన ఈ దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.   తాజాగా దీని పై అడ్వొకేట్ ఏ.వి. రమణ లోకాయుక్తకు మొన్న జులై నెలలో ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుకు ఆధారంగా ఆ అడ్వొకేట్ కొన్ని బడ్జెట్ పేపర్లను, అలాగే అప్పటి కొన్ని వార్తల క్లిప్పింగులను కూడా జతచేశారు. అప్పట్లో మొత్తం 11 కోట్ల మేరకు నిధుల్ని విడుదల చేయగా, ఢిల్లీ దీక్షకు దాదాపు 7.5 కోట్లు ఖర్చు చేశారని అయన ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఐతే తాజాగా ఈ విషయంలో స్పందించిన లోకాయుక్త చంద్రబాబు పై కేసు నమోదు చేస్తున్నట్లుగా ఆ అడ్వొకేట్ కు ఇచ్చిన సమాధానం లో తెలిపింది.

కరోనా వ్యాక్సిన్ తయారీలో బీసీఎం తో బీఈ ఒప్పందం

కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ తయారుచేసేందుకు చాలా ఫార్మాకంపెనీలు పరశోధనలు చేస్తున్నాయి. ప్రపంచంలోని జనాభా మొత్తానికి సరిపోవాలంటే ఒక దేశమో.. ఒక సంస్థనో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తే సరిపోదు. అందుకే ఫార్మా రంగం అభివృద్ధి చెందిన ప్రతిదేశంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ తయారీలో ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ ను డెవలప్‌ చేసేందుకు యూఎస్‌కు చెందిన బేలర్‌‌ కాలేజి ఆఫ్‌ మెడిషిన్‌(బీసీఎం)తో హైదరాబాద్‌ బేస్డ్‌ ఫార్మా కంపెనీ బయోలాజికల్‌–ఈ లిమిటెడ్‌(బీఈ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బీసీఎం డెవలప్‌ చేసిన కరోనా వ్యాక్సిన్ ను పెద్ద మొత్తంలో ఉత్తత్పి చేయడానికి బీఈకి వీలుంటుంది. ఈ వ్యాక్సిన్ ను బీఈ మరింతగా అభివృద్ధి చేసి అందుబాటు ధరల్లో మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు బీసీఎంతో కుదుర్చుకున్న ఒప్పందం సాయపడుతుందని బీఈ మేనేజింగ్ డైరక్టర్‌‌ మహిమా దాట్ల అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ పై ఫేజ్‌ 1, 2 క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.   కోట్లాది మందికి సోకి లక్షలాది మంది మరణానికి కారణం అవుతున్న కరోనాను ఎదుర్కొన్న వ్యాక్సిన్ సురక్షితమైన, అందరినీ అందుబాటు ధరలో ఉండేలా తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న భారత్ బయోటెక్ లీటర్ వాటర్ కన్నా తక్కువ ధరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని అంటుంది. సామాన్యలకు సైతం అందుబాటులో ఉండే ధరలో ఈ వ్యాక్సిన్ త్వరగా రావాలని ప్రపంచ మానవాళీ ఎదురుచూస్తోంది.

ముగిసిన రాజస్థాన్ సంక్షోభం... విశ్వాస తీర్మానం లో గట్టెక్కిన గెహ్లాట్ సర్కార్

రాజస్థాన్ లో దాదాపు నెలకు పైగా సాగిన రాజకీయ సంక్షోభం ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంతో ముగిసిపోయింది. రాష్ట్ర పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని అసెంబ్లీకి వచ్చిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఈ రోజు జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. గెహ్లాట్ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూజువాణి ఓటు(వాయిస్ ఓటింగ్)తో నెగ్గింది. ఈ విశ్వాస పరీక్ష ముగిసిన తరువాత రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది.    కొద్ది కాలం క్రితం సీఎం అశోక్ గెహ్లాట్ కు, అప్పటి డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా చేసుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా, కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి సచిన్ పైలట్ తో మాట్లాడి తిరిగి వెనక్కు తీసుకు వచ్చి అశోక్ గెహ్లాట్ సర్కార్ ను గట్టెక్కించారు.    ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభ వ్యహారాల మంత్రి కుమార్ ధారివాల్ మాట్లాడుతూ గోవా, మధ్యప్రదేశ్ తరహాలో బీజేపీ ఇక్కడ కూడా దొడ్డి దారిన అధికారం కైవసం చేసుకోడానికి ప్రయత్నించిందని ఐతే ఇక్కడ దాని ఆటలు సాగలేదని అన్నారు. కరోనా సమయంలో మధ్యప్రదేశ్ లో బీజేపీ చేసిన నిర్వాకం వల్ల కరోనా విజృంభించింది అని అయన విమర్శించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పోటీ!!

దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికకు సంబంధించి ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దుబ్బాక నుంచి పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రామలింగారెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి 60 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అక్కడ టీఆర్ఎస్ కు తిరుగులేదని, కవిత పోటీ చేస్తే రికార్డ్ మెజారిటీతో కూడా గెలవొచ్చని, అందుకే కవిత దుబ్బాక నుంచి పోటీ చేయడానికి సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.   అయితే, దుబ్బాక నుంచి కవిత పోటీ చేయనున్నారన్న ప్రచారంతో ఆమెపైన, సీఎం కేసీఆర్ పైన రామలింగారెడ్డి అనుచరుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయట. రామలింగారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, కేసీఆర్ వెన్నంటి ఉన్నప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడేమో ఆయన మరణించారని అందరూ బాధపడుతుంటే ఆయన కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వకుండా కవిత ని ఇక్కడ నుండి పోటీ చేయించాలని చూడటం ఏంటి? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.   అయితే, కవిత దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారాన్ని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే, ఆమె ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు.   నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత కొంత సైలెంట్ అయ్యారు. తర్వాత ఆమె రాజ్యసభకు వెళ్తారని, లేదు ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం కేసీఆర్ ఆమెని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. చివరికి కేసీఆర్ కవితని ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రకటించారు. ఇప్పటికే ఆమె నామినేషన్ కూడా వేశారు. కానీ కరోనా వల్ల ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. ఈలోగా దుబ్బాక స్థానం ఖాళీ కావడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడటానికి కవిత సిద్దమవుతున్నారని ప్రచారం మొదలైంది.   కరోనా కారణంగా దుబ్బాక ఉపఎన్నిక కూడా ఇప్పట్లో జరిగే అవకాశంలేదు. అదీగాక ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ వేసున్న కవితని.. దుబ్బాక బరిలో దింపితే.. విమర్శలు వ్యక్తమవ్వడంతో పాటు.. రామలింగారెడ్డి అనుచరులకు, స్థానిక కేడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని టీఆర్ఎస్ భావిస్తోందట. అందుకే, రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.   మరోవైపు, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఎవరు బరిలో నిలిచినా తాము పోటీకి సిద్దమంటున్నాయి విపక్షాలు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధం కావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. బీజేపీ కూడా అభ్యర్థిని నిలపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ బుడతడు ఆనంద్ మహీంద్రా కు ఇన్స్పిరేషన్ అట..

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన లేదా తనను ఇన్స్పైర్ చేసిన అంశాల పై తరచుగా స్పందిస్తూ ఉంటారు. ఆ అంశాలను తనను ఫాలో అవుతున్న లక్షలాది మండి ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఓ బాలుడు భారత జాతీయగీతం పాడుతున్న వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసారు. ఈ వీడియోను తాను కొన్ని సంవత్సరాల క్రితం చూశానని అప్పటినుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం ముందు ఆ వీడియో చూస్తుంటానని అయన వెల్లడించారు. ఆ బాలుడు ఎంతో అమాయకంగా, ఎంతో ఏకాగ్రతతో జనగణమన పాడిన తీరు తనను విపరీతంగా ఆకట్టుకుందని అయన ఈ సందర్బంగా వివరించారు.ఈ వీడియో ఎప్పుడు చూసినా తనకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని ఆనంద్ మహీంద్రా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా అపుడు ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడై ఉంటాడని, ఒకవేళ అతడు ఇప్పుడు పాడితే మరింత విభిన్నంగా పాడతాడేమో అని పేర్కొన్నారు.

రేయ్ వెధవల్లారా.. గూబ పగులుద్ది.. వైసిపి కేడర్ కు ఎంపీ రఘురామరాజు స్ట్రాంగ్ వార్నింగ్

వైసిపికి కొరకరాని కొయ్యగా మారిన నరసపారం ఎంపీ రఘురామకృష్ణం రాజు అటు జగన్ ప్రభుత్వం పై మండి పడుతూ మరో పక్క తన పార్టీ నేతల పై విరుచుకు పడ్డారు. గత కొంత కాలంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న వారికి అయన తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది అమెరికా నుండి.. మరి కొంత మంది ఇండియా నుండి కాల్ చేసి "నిన్ను లేపేస్తాం నాకొడక " అంటూ తిడుతున్నారని అయన తెలిపారు. "మొన్న ఒక వైఎస్ రెడ్డి.. నిన్న రామిరెడ్డి అట. రాజీనామా చేయి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు నా ఇంటి దగ్గరకు వస్తే సీఆర్‌పీఎఫ్ వాళ్లు షూట్ చేసి పారేస్తారు" అంటూ అయన ఫైర్ అయ్యారు.    "అసలు ఏంట్రా నేను రాజీనామా చేసేది. మీరు చేయండి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీ కేర్ ఫుల్. ప్రజామోదంతో నేను నెగ్గా. ఏంట్రా రాజీనామా చేసేది. యూజ్ లెస్ ఫెలోస్.. మీరు చేయండి. అమరావతి అక్కడే ఉంటుందంటూ అబద్దాలు ఆడారు. రేయ్ గూబ పగులుద్ది. నేను నా బొమ్మతో కూడా నెగ్గా... ఒక్క జగన్ బొమ్మ వల్ల మాత్రమే గెలవ లేదు. నేను రాజీనామా చేయనని చెబుతున్నా... వెధవల్లారా. నన్నెవరైతే బెదిరించారో.. ఆ వెధవలకే చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండండి.. నా జోలికి రాకండి. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. మీ ఏడుపు ఏంట్రా.. పనికి మాలిన వెధవల్లారా. నాకు ప్రతి రోజూ వందల కాల్స్ వస్తాయి. రాజీనామా.. రాజీనామా అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడకండి. పాపులు శిక్షించబడుదురు. నాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేస్తే ఎవరూ స్పందించడం లేదు. లోకాయుక్తలో కూడా పిటిషన్ దాఖలు చేశాను. చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఎవరూ స్పందించలేదు. లోకాయుక్త కూడా పట్టించుకోకపోతే నేను చేయాల్సింది చేస్తాను. గోళ్లు సరిపోవు.. గొడ్డలే కావాలంటే అలాగే చూద్దాం’’ అంటూ వైసిపి నాయకులు లీడర్ల పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.

అజ్ఞాతం వీడిన పీవీపీ.. పోలీసుల ఎదుట హాజ‌రు!!

కిడ్నాప్ కేసుతో పాటు మరో కేసులో వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.    గత సెప్టెంబర్ 16న పీవీపీ తన వద్ద మేనేజర్ గా పని చేసిన తిమ్మారెడ్డిని కిడ్నాప్ చేశారంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీవీపీ పై ఏ1 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.   అనంతరం బంజారాహిల్స్ లో ఓ విల్లాకు సంబంధించిన గొడవలో ఆ విల్లా యజమాని పీవీపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులపై పీవీపీ కుటుంబసభ్యులు కుక్కలను వదిలారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ సీరియస్‌గా తీసుకున్నారు.   పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో పీవీపీ హైదరాబాదును వీడి విజయవాడకు వెళ్లిపోయారు. ఆ తర్వాత  తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందారు. అయితే, ఈ రెండు కేసులకు సంబంధించి విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో.. ఈరోజు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట పీవీపీ విచారణకు హాజరయ్యారు.

బీజేపీ నేత సాధినేని యామినిపై కేసు నమోదు

ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమం ఎస్వీబీసీ చానల్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు.   రామమందిరం భూమి పూజను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా యామిని మండిపడ్డారు. హిందూ మనోభావాలను ఎస్వీబీసీ చానల్ పట్టించుకోలేదని ఆరోపించారు. హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యామినిపై కేసు నమోదైంది.

జగన్ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ.. రాజధాని తరలింపు పై స్టే పొడిగించిన హైకోర్టు

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై వేసిన పిటిషన్ల పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం నిన్న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదే విషయాన్నీ కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.    ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా ఈ చట్టాల అమలుపై న్యాయస్థానం ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని ప్రభుత్వం తరుఫు న్యాయవాది రాకేష్ త్రివేది కోర్టును కోరారు. స్టేటస్‌ కో విధించడం వల్ల సీఎం క్యాంప్ కార్యాలయం తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. దీంతో పాటు వేరే కార్యాలయాలను తరలించుకోవాలన్నా కోర్టు ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని రాకేష్ త్రివేది కోర్టుకు విన్నవించారు.    ఇదే సందర్భంలో పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ.. అసలు మూడు రాజధానులు అనేది విభజన చట్టానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా ఒక్క రాజధాని ప్రస్తావనే ఉందని అయన తెలిపారు. ఈ నేపథ్యంలో తాము జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్టుగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది.   దీంతో కేసు వాయిదా వేయండి కానీ... స్టే పొడిగింపు వద్దని ప్రభుత్వ న్యాయవాది రాకేష్ త్రివేది న్యాయస్థానాన్ని కోరారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో అంత అర్జెంటు ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వానికి తన విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని న్యాయవారికి కోర్టుకు వివరించారు. కాగా, ఆన్ లైన్ విచారణలో పలు సమస్యలు ఉన్నాయని, కాబట్టి తమ పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, దీని పై ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేశ్ త్రివేది స్పందిస్తూ.. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా తాము నేరుగా హైకోర్టులో వాదనలు వినిపించలేమని, అందువల్ల ప్రభుత్వం తరఫున తమ వాదనలను డిల్లీ నుండి వినిపిస్తానని తెలిపారు.

ప్రధానిగా మోదీ కొత్త రికార్డ్

ప్ర‌ధాని నరేంద్ర మోదీ స‌రికొత్త రికార్డ్ న‌మోదు చేశారు. అత్య‌ధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈక్రమంలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని అధిగమించారు. వాజ్‌పేయి ప్రధానిగా 2,268 రోజులు ప‌నిచేయ‌గా.. మోదీ గురువారంతో ఈ రికార్డును అధిగమించారు.   ఇక మొత్తం ప్రధానమంత్రుల్లో దేశానికి సుదీర్ఘ‌కాలం సేవ‌లందించిన నాలుగో ప్ర‌ధానిగా నిలిచారు. తొలి మూడు స్థానాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. దేశ మొద‌టి ప్ర‌ధాని నెహ్రూ 16ఏళ్లపాటు, ఇందిర 15ఏళ్ల పాటు, మన్మోహన్‌ పదేళ్ల పాటు ప్రధానులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ త‌ర్వాత రికార్డు నిన్న‌టి వ‌ర‌కు వాజ్‌పేయి పేరు మీద ఉంది. తాజాగా ఆ రికా‌ర్డును మోదీ అధిగ‌మించేశారు.