ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు
posted on Sep 30, 2020 @ 5:41PM
సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు పిటిషన్ను హైకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. ఇజ్రాయెల్ నుండి ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి హైకోర్టు ఓ కేసును రిఫరెన్స్ ఇచ్చింది. ఒకవేళ ప్రభుత్వం దాని ప్రకారం కేసు నమోదు చేయకుంటే.. అపుడు కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేయాలని ఏబీకి హైకోర్టు సూచించింది. కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఆ గైడ్లెన్స్ను ప్రభుత్వం పాటించకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
గత టీడీపీ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్గా పనిచేశారు. ఆ సమయంలో ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ.. వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయనను విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.