రైతులకు సూపర్ గుడ్‏న్యూస్.. ఖాతాల్లో ఏకంగా 12 వేలు జమ! 

అన్నదాతలకు ఇది నిజంగా పండుగలాంటి వార్తే. రైతుల ఖాతాల్లో ఏకంగా 12 వేల రూపాయలు జమ కాబోతున్నాయి. దీపావళి సందర్భంగా రైతులకు సంబంధించి ఈ కీలక ప్రకటన రాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గత నాలుగేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోస కల్పిస్తోంది. ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా రూ. 6 వేల వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మోడీ ప్రభుత్వం.  అయితే తాజాగా రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రైతులకు ఇప్పటివరకు ప్రతి ఏటా  కేంద్రం రూ. 6 వేలను విడతల వారిగా అందిస్తుండగా.. ఇక నుంచి  6 వేలకు బదులుగా రూ. 12 వేలు ఇవ్వనుంది. ప్రతి విడతలో రైతులకు రూ. 2 వేలకు బదులుగా రూ. 4 వేలు జమ కానున్నాయి అన్నమాట. 2021 దీపావళీ నాటికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతోంది బీజేపీ సర్కార్.  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు త్వరలో 10వ విడత నగదు అందుకోనున్నారు. పదవ విడత నగదు ట్రాన్స్‏ఫర్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. డిసెంబర్ 15న రైతులకు 10వ విడత నగదు అందించనున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లను బదిలీ చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 10వ విడతను డిసెంబర్ 15, 2021 నాటికి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.  గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లేదా అంతకు ముందు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇంతకుముందు అందుకోకపోతే వాళ్లు చివరి విడత మొత్తాన్ని తర్వాతి విడతతో పాటుగా రూ. 4000 నేరుగా వారి ఖాతాలో పొందుతారు.  ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధిఖాతా నమోదుకు చివరి తేదీ 30 అక్టోబర్ 2021. PM-KSNY విడతను తనిఖీ చేయడానికి దశలు: * అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/. లాగిన్ కావాలి * హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ సెక్షన్ ఓపెన్ చేయాలి. * ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ లబ్ధిదారుడు.. వారి అప్లికేషన్ స్టేటస్ తనిఖీ చేయవచ్చు. అందులో రైతుల పేరు.. వారి బ్యాంకు వివరాలు ఉంటాయి. * ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. * ఆ తర్వాత గెట్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేయాలి

జ‌పాన్ మిత్ర‌వింద‌.. సామాన్యుడిని పెళ్లాడిన రాకుమారి..

ఆమె జ‌పాన్ రాకుమారి. పేరు మ‌కో. ఓ సామాన్యుడిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుంది. కానీ, రాజ కుటుంబం నిబంధ‌న‌లు క‌ఠినంగా ఉన్నాయి. బ‌య‌టి వారిని పెళ్లి చేసుకుంటే.. ఆమె రాచ‌రికాన్ని వ‌దులుకోవాల్సి ఉంటుంది. రాజ‌భ‌ర‌ణ‌మూ కోల్పోవాల్సి ఉంటుంది. అయినా, ఆమె రాచ‌రికం కంటే.. రాజ‌భ‌ర‌ణం కంటే.. ప్రేమే గొప్ప‌ద‌ని భావించింది. ప్రియుడు కీ కొమురోను పెళ్లాడింది. మూడేళ్లుగా సాగుతున్న ఆ వివాహ వివాదం.. తాజాగా వారి వివాహ‌బంధంతో సుఖాంతం అయింది. జ‌పాన్‌లో ఆ పెళ్లి సంచ‌ల‌నంగా మారింది. మకో - కిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్‌ ప్యాలెస్‌ అధికారికంగా ధ్రువీకరించింది. పెళ్లి తర్వాత మకో రాజప్రసాదాన్ని వీడారు. ప్యాలెస్‌లో ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు ప్రకటించారు.  జపాన్‌ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తె మకో. టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో చదువుకున్నారు. తనతో పాటు చదువుకునే కొమురోతో ప్రేమ‌లో ప‌డ్డారు. 2017లోనే వారి ప్రేమ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్టు వారు అప్పుడే ప్రకటించారు. అయితే ఏడాది తిరిగే స‌రికి అనుకోని స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో వారి పెళ్లి అప్పట్లో రద్దయ్యింది. దీంతో 2018లో కొమురో.. లా చదివేందుకు న్యూయార్క్‌ వెళ్లిపోయారు. మూడేళ్ల పాటు కొమురో యూఎస్‌లోనే ఉండిపోయారు. జపాన్‌కు ఒక్క‌సారి కూడా రాలేదు.  గత నెలలో చదువు పూర్తి చేసుకుని కొమురో జ‌పాన్‌కి తిరిగొచ్చారు. మ‌కో-కిమురోలు పెళ్లి ప్రతిపాదన మ‌ళ్లీ తీసుకొచ్చారు. అప్ప‌ట్లో త‌లెత్తిన‌ ఆర్థిక వివాదంపై కొమురో లిఖిత‌పూర్వ‌క హామీ ఇవ్వ‌డంతో.. వారి పెళ్లికి మ‌కో కుటుంబం అంగీకారం తెలిపారు. ఎలాంటి హ‌డావుడి లేకుండా చాలా సింపుల్‌గా మ‌కో-కిమురోల వివాహం జ‌రిపించేశారు. సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించలేదు. వీరు పెళ్లిని ధృవీక‌రిస్తూ అధికారికంగా పత్రాలు మాత్రం విడుదల చేశారు.  జపాన్‌ రాజ కుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల‌నేది రూల్‌. ప్రేమ కోసం.. గాఢంగా ప్రేమించిన ప్రియుడి కోసం అందుకు సిద్ధ‌మైన మ‌కో.. రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్లను వ‌దులుకొని మ‌రీ.. కిమురోను వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత రాజ‌మందిరం వీడుతూ భావోద్రేగానికి లోన‌య్యారు. మ‌గ‌ధీర మూవీలో మ‌రుజ‌న్మ ఎత్తి మ‌రీ ప్రేమ‌ను సొంతం చేసుకున్న మిత్ర‌వింద‌లా కాకుండా.. మ‌కో రాచ‌రికాన్ని త్య‌జించి మ‌రీ త‌న ప్రేమ‌ను సాధించుకోవ‌డం.. ప్రియుడిని పెళ్లి చేసుకోవ‌డం.. కాస్త‌ సినిమాటిక్‌గా ఉన్నా.. వారిది చ‌రిత్ర‌లో నిలిచే వివాహ‌బంధం. 

భారత్- పాక్ మ్యాచ్ పై సానియా మీర్జా సంచలన కామెంట్స్...

టీట్వంటీ వరల్డ్ కప్ లో కోహ్లీ సేన పై పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.భారత్ కనీస పోటీ ఇవ్వకపోవడంతో కోహ్లీ సేనపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. సోషల్ మీడియాలో తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత మాజీ క్రికెటర్లు, అనలిస్టులు కూడా భారత ఓటమిపై తమదైన విశ్లేషణులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ అభిమానుల మధ్య వార్ కూడా సాగుతొంది. పాక్ గెలుపుపై అక్కడి రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా భారత్ - పాక్ మ్యాచ్ పై స్పందించారు భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ సానియా మీర్జా.  తన భర్త షోయబ్ మాలిక్‌ ను ‘జిజాజీ’ లేదా బావ అని అభిమానులు పిలిచిన వైరల్ వీడియోపై సానియా మీర్జా తాజాగా వ్యాఖ్యానించింది.  ఆదివారం భారత్ తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అభిమానుల గుంపు ‘జిజా జీ’ అని నినాదాలు చేసింది. షోయబ్ మాలిక్ 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని పెళ్లాడినప్పటి నుంచి అభిమానులు మ్యాచ్ జరుగుతున్నపుడు జిజా జీ పదాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి తొమ్మిది సెకన్ల క్లిప్ ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. ఇది మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 4 లక్షలకు పైగా వ్యూస్ ను సంపాదించింది. ఈ వీడియో సానియా మీర్జా దృష్టిని కూడా ఆకర్షించింది.ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ సానియా మీర్జా నవ్వుతో కూడిన రెండు ఎమోజీలు, రెండు హృదయాల ఎమోజీలతో స్పందించారు.  ‘‘క్రీడాస్ఫూర్తి, సహృదయత యొక్క ఈ ప్రదర్శనను పలువురు ప్రశంసించారు.’’ అని సానియామీర్జా సమాధానం ఇచ్చారు.

హైద‌రాబాద్‌ను కోతులు స్వాధీనం చేసుకున్నాయా?

జి.ఉల‌గ‌నాథ‌న్. జ‌ర్న‌లిజంలో మేటి. పార్ల‌మెంటేరియ‌న్‌కు అసోసియేట్ ఎడిట‌ర్‌. ది న్యూయార్క్ టైమ్స్‌కు కాల‌మిస్ట్‌. గ‌తంలో ద‌క్క‌న్ హెరాల్డ్‌, ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌లో న్యూస్ ఎడిట‌ర్‌గా చేశారు. సిమ్‌బ‌యోసిస్‌లాంటి ప‌లు ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల్లో మీడియా కోర్సుల‌కు ప్రొఫెస‌ర్ కూడా. బెంగ‌ళూరులో సెటిల్ అయిన ఆయ‌న ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఐదు రోజులు ఉన్నారు. త‌న ఐదు రోజుల ఎక్స్‌పీరియ‌న్స్‌ను, గ‌త హైద‌రాబాద్‌కు ప్ర‌స్తుత న‌గ‌రానికి వ‌చ్చిన మార్పుల గురించి త‌న‌దైన శైలిలో అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఆ వివ‌రాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. హైద‌రాబాద్ గురించి జి.ఉల‌గ‌నాథ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే... హైదరాబాద్ టుడే (ఐదు రోజుల బస తర్వాత నేను గ్రహించిన విష‌యాలు):  1. లేటెస్ట్ ఓల్డ్ సిటీగా మారింది, ఇప్పుడు నాలుగు నగరాలు ఉన్నాయి. పురాతన నగరం చార్మినార్ & ఆవల, ప్రస్తుత హైదరాబాద్ పాత నగరం, సికింద్రాబాద్, కొత్త హైటెక్ సిటీ. ఇక్కడ పాక్షిక అక్షరాస్యులు మరియు ఎక్కువగా అసభ్యత కలిగిన ప్రజలు కోటీశ్వరులుగా మారారు. వారు శక్తి మరియు డబ్బును చాటుకోవడానికి ఇష్టపడతారు.  2. ట్రాఫిక్ ఎక్కువ‌. రోజుకు దాదాపు 20 గంటల ట్రాఫిక్ ఉంటుంది. పాదచారులకు రోడ్లు దాటడానికి కనీసం 15 నిమిషాలు పడుతుంది. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, జీవిత బీమా చేయించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ఒకప్పుడు ట్రాఫిక్ పోలీస్ అనే జాతి ఉండేది కానీ ఇప్పుడు అది అంతరించిపోయింది.  3. పాత సైకిల్ రిక్షా స్థానంలో వ‌చ్చిన‌ ఆటోలు విలాసవంతమైన ప్రజా రవాణా. బస్సులు తగ్గించబడ్డాయి. ఆటోలలో కనీస ఛార్జీ 100 రూపాయలు. ఆటో డ్రైవర్ల ఇష్టానుసారం ఆ ధ‌ర డ‌బుల్‌, త్రిబుల్ అవుతుంది. చిన్న కరెన్సీలు ఉన్నాయని ఆటోవాలాల‌కు తెలియదు.  4. కేవలం మూడు రకాల కార్లు మాత్రమే ఉన్నాయి. ఆడిస్, పోర్చే మరియు లెక్సస్‌లు ధనవంతులు & శక్తిమంతుల కోసం. బ్యూరోక్రాట్‌ల కోసం ఫార్చ్యూనర్లు. చిన్న రాజకీయనేత‌లు, వారి కుటుంబాల కోసం ఇన్నోవాలు. ఇతర బ్రాండ్లు దాదాపుగా లేవు.  5. మంచి శాఖాహార రెస్టారెంట్లను కనుగొనడం చాలా కష్టమైన పని. చౌకైన, రుచిలేని 'టిఫిన్ సెంటర్లు'..  లేదంటే, భోజనం ధర రూ .400 కంటే ఎక్కువ ఉండే  ఫాన్సీ హోటళ్లు. అక్క‌డ రుచిక‌ర‌మైన తాలీస్ తిన‌డానికి సీటు దొర‌కాలంటే పెద్ద క్యూలో వేచి ఉండాలి. ఈ లూటింగ్ కేఫ్‌లతో పోలిస్తే బెంగళూరు స్వర్గం.  6. ఇరానీ టీ కేఫ్‌లు వేల సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు ప్రతీ కాలనీలో వందలాది ఆసుపత్రులు వ్యాపారం చేస్తున్నాయి. ICMR ప్రకారం, తెలంగాణలో అత్యధిక సంఖ్యలో నకిలీ వైద్యులు ఉన్నారు. 7. కార్, టూ వీలర్ రైడర్లు.. రేపు లేదన్నట్టు డ్రైవ్ చేస్తుంటారు. హార్న్‌ను చాలా బిగ్గరగా ఉపయోగించ‌డం.. రోడ్డుపై ఉన్న మిగిలిన వ్యక్తులను చెవిటి వారిగా నిరంతరం ఒప్పించడం.  8. మాస్క్‌లు మరియు హెల్మెట్‌లు అవసరం లేదు. చాలామంది వాటిని చూడలేదు. వ్యక్తిగతంగా కంటే గులాబీ కటౌట్‌లలో ఎక్కువగా కనిపించే ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. 9. హైదరాబాద్ మెట్రో మాత్రమే ఆదా చేసే ఏకైక విష‌యం. ఢిల్లీ మెట్రో తర్వాత నేను దేశంలో రెండవ అత్యుత్తమ ర్యాంక్‌ని ఇస్తాను. బెంగళూరు మెట్రోతో పోలిస్తే సిగ్గుచేటు, ఈ కాంక్రీట్ అడవిలో చిన్న సందులు మరియు బైలేన్‌లలో స్తంభాలను స్థాపించడానికి వారు స్థలాన్ని కనుగొనడం ఒక అద్భుతం.  10. ఈ పరిస్థితికి క్రెడిట్ లేదా నింద ఎవరికి వస్తుంది? వాస్తవానికి మ‌న‌ స్నేహితుడు చంద్రబాబు నాయుడుకే. ఆయ‌న‌ బిల్లులను, క్లింటన్ మరియు గేట్స్‌ను  తీసుకురావడంలో విజయం సాధించారు. న‌గ‌రాన్ని మార్చారు. కానీ, కోతులు స్వాధీనం చేసుకుంటాయని ఊహించలేదు.   

పాక్ తో భారత్ ఓటమికి కారణాలు ఇవే..! 

టీట్వంటీ వరల్డ్ కప్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. టెస్ట్ క్రికెట్ చాంపియన్ గా , అద్భుతమైన ఆటగాళ్లతో ఉన్న కోహ్లీసేన పూర్తి విశ్వాసంతోనే బరిలోకి దిగింది. అందరి అంచనాలు కూడా భారత్ వైపే ఉంది. వరల్డ్ కప్ లో గత రికార్డులు కూడా టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయి. అయినా వరల్డ్ కప్ మ్యాచ్ లో ఊహించని ఫలితం వచ్చింది. పాకిస్తాన్ చేతిలో ఘోరపరాజయం పాలైంది భారత జట్టు. కోహ్లీ సేన ఓటమితో యావత్ భారతావని నిర్ధాంతపోయింది. అది కూడా దారుణంగా ఓడిపోవడంతో అంతా షాకయ్యారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా మరీ ఇంత దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  మ్యాచ్ పై పెద్ద ఎత్తున పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఇండియా మాజీ కెప్టెన్‌, మాస్టర్ బ్లాస్టర్  సచిన్‌ టెండుల్కర్ ఈ మ్యాచ్‌పై తన విశ్లేషణను పంచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసిన సచిన్‌.. భారత్ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని చెప్పారు మాస్టర్. పిచ్‌  బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా భారత్‌ ఇంచుమించు 20-25 పరుగులు తక్కువ స్కోర్‌ సాధించిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా షహీన్‌ అఫ్రిది విసిరిన అప్‌ఫ్రంట్‌ బంతులను ఎదుర్కొనే సమయంలో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సరైన ఫుటవర్క్‌తో కనిపించలేదన్నాడు. పాక్‌ పేసర్‌ గంటకు 140కిమీ వేగంతో బంతులు విసురుతుంటే.. మన  బ్యాట్స్‌మెన్‌ అందుకు తగ్గట్టు క్రీజులో లేరని చెప్పారు మాస్టర్. పాక్‌ జట్టు మాత్రం తమ బౌలర్లను కచ్చితమైన ప్రణాళికతో సమర్థవంతంగా వినియోగించుకుందని, ఒకరి తర్వాత ఒకరిని అవసరాలకు తగ్గట్టు బౌలింగ్‌ చేయించిందని సచిన్‌ వివరించాడు.   టీమిండియా చాలా రోజులుగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడలేదని, దీంతో ఆ జట్టును అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని సచిన్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిందని తెలిపారు.  సూర్యకుమార్‌ రెండు షాట్లు బాగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడన్నారు. అనంతరం కోహ్లీ, పంత్‌ భాగస్వామ్యం నిర్మించాలని చూసినా అవసరమైనంత ధాటిగా ఆడలేదని అభిప్రాయపడ్డారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్‌ అవకాశాలను దెబ్బ తీసిందన్నారు.  పాక్‌ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఆదిలోనే వికెట్లు తీయలేకపోయిందని సచిన్‌ చెప్పారు. అలా చేసిఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని, దాంతో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలోకి వెళ్లేవారని అంచనా వేశారు. భారత బ్యాటింగ్‌ సమయంలో పాకిస్థాన్‌ అదే చేసిందని టెండుక్లర్ స్పష్టం చేశారు. ఇక పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ మెల్లిగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ టీమ్‌ఇండియాపై ఒత్తిడి తెచ్చారన్నాడు. తేలికైన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూనే సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించారని తెలిపాడు. అయితే, టీమ్‌ఇండియా కీలక సమయాల్లో ఒత్తిడి పెంచి పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని మాస్టర్ బ్లాస్టర్ చెప్పారు. టీమ్‌ఇండియా ఓటములకు పలు కారణాలుగా కనిపిస్తున్నా పాకిస్థాన్‌ను సరైన రీతిలో ఎదుర్కోలేకపోవడమే కోహ్లీసేన చేసిన అతి పెద్ద తప్పుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఆ జట్టు ఇటీవల ఎలా ఆడుతోంది.? అందులో కీలక ఆటగాళ్లు ఎవరు? బౌలర్లు ఎలా రాణిస్తున్నారు.? వారిని ఎలా ఎదుర్కోవాలి.? 2017లో నాటి పరిస్థితులే ఇప్పుడూ ఎదురైతే ఏం చేయాలి? మన బౌలర్లు ఎలా రాణించాలి? అనే విషయాలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. 

ఏపీలో అరాచక పాలన..  మీకు పట్టదా మోడీజీ!

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నా, అక్రమాలు  జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన జీవించే హక్కు సహా ప్రాధమిక హక్కులు అన్నింటికీ భంగం వాటిల్లుతున్నా, ప్రభుత్వమే ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కలగజేసుకోదు? పత్రికలపై దాడులు, ప్రసార మాధ్యమాల పై అధికార, అనధికార ఆంక్షలు, పాత్రికేయులపైనా భౌతిక దాడులు జరుగుతున్నా, కేంద్రం ఎందుకు నోరు తెరవదు? ఇదేమిటని ప్రశ్నించదు?   ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పార్టీ నాయకుల ఇళ్ళపై దాడులు జరుగుతున్నా? రాష్ట్రం డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు అంతర్జాతీయ అడ్డాగా మారుతున్నా?ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, అరాచక పాలన సాగిస్తున్నా, కేంద్రం ఎందుకు జోక్యంచేసుకోదు,ఎందుకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిదు? ఎందుకు ఉలకదు,ఎందుకు  పలకదు? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరినీ వేదిస్తున్న  ప్రశ్నలు ఇవి. నిజమే కావచ్చును, శాంతి భద్రతలు స్టేట్ సబ్జెక్టు అయితే కావచ్చును. కానీ, పరిస్థితి విషమించి, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేని దుర్మార్గ పరిస్థితులు తలెత్తిన సమయంలోనూ, కేంద్రం కళ్ళు తెరవను అంటే, ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి, కేంద్ర రాష్ట్ర సంబందాలకు, కేంద్ర విధులు, విశేష అధికారాలకు అర్థమేముంటుంది?ఇదీ రాష్ట్ర ప్రజలను వేదిస్తున్న సందేహం.  రాష్ట్రంలో పరిస్థితి ఎంత అద్వాన్నంగా వుందో అందరికీ తెలిసినా నాలుగు పదుల విశేష రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న, ప్రతిపక్ష నేత నార చంద్రబాబు నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే, ఇటీవల రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం సాగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే, 73 ఏళ్ల వయసులోనూ, మధుమేహం వంటి ఆరోగ్య  సమస్యలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా, 36 గంటల నిరాహరదీక్ష చేశారు. అంతకు ముందే, తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్లపైనా జరిగిన దాడులకు సంబందించిన సమాచారం మొత్తం ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి లేఖల ద్వారా ఫోన్ ద్వారా తెలియ చేశారు. అయినా ఆశించిన రీతిలో కేంద్ర నుంచి స్పందన లేదు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన నేపధ్యంలో ఆర్టికల్ 356 ప్రయోగించ వలసిన అవసరాన్నివివరిస్తూ లేఖలు రాశారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అందుకూ  అటు కేంద్రం నుంచి స్పందన లేదు. చివరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  తెలుగు దేశం పార్టీ ప్రతినిధి బృదం రాష్ట్ర పతి రామనాథ్ కోవింద్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.   రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి దాదాపు అరగంటకుపైగా ఆయనకు వివరించారు. ముఖ్యంగా నెల 19న రాజధాని అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు, నేతలపై వరుసగా జరిగిన క్రూరమైన దాడుల విషయంలోనూ సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. రాష్ట్రం మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిపోయిందని, ఈ ముఠాలకు సంబంధించిన క్రిమినల్‌ నెట్‌వర్క్‌ను వెలికిలాగేందుకు విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అధికార వైసీపీతో ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై.. రాజ్యాంగపరమైన విధులను, బాధ్యతలను విస్మరిస్తున్న రాష్ట్ర డీజీపీని రీకాల్‌ చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. వీటితోపాటు పలు ఇతర అంశాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.  గత రెండున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వ అరాచకాలను ప్రస్తావిస్తూ ‘స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రర్‌ ఇన్‌ ఏపీ’ పేరిట టీడీపీ రూపొందించిన పుస్తకాన్ని కూడా కోవింద్‌కు అందజేశారు.   ఇదలా ఉంటే,రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైంది.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు కక్ష సాధింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచే తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్రానికి తెలియజేస్తూనే ఉన్నారు, అయినా, కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా పరిస్థితి దినదిన ప్రవర్తమానంగా దిగజారి, ఈ స్థితికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచే చంద్రబాబు నాయుడు అనుభవంతో చేసిన సూచనను పాటించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రం పట్టించుకుంటుందా? ప్రజాగ్రహానికి గురవుతుందా ? బంతి కేంద్రం కోర్టులో ఉంది.

ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌కు బ్రేక్‌.. దీక్ష‌కు దిగిన ష‌ర్మిల‌.. ఎందుకంటే..?

ప‌ట్టుద‌ల మామూలుగా లేదు. చిత్త‌శుద్ధిలో అస‌లేమాత్రం కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు. తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ ఏర్పాటు చేయ‌డ‌మే ఓ సాహ‌సం అనుకుంటే.. ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తుండ‌టం ష‌ర్మిల‌కే సాధ్యం అంటున్నారు. రాజ‌న్న రాజ్యం కోస‌మంటూ.. తండ్రి వైఎస్సార్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ.. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ‌వుతున్నారు.  అయితే.. తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ ప్ర‌స్థానం నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాటంతోనే మొద‌లైంది. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర దీక్ష‌తో ఘ‌నంగా ఉనికి చాటుకున్నారు. ఇక‌, ప్ర‌తీ మంగ‌ళ‌వారం నిరుద్యోగ దీక్షల‌తో చిత్త‌శుద్ధి చాటుకుంటున్నారు ష‌ర్మిల‌. అందుకే, పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉన్నా.. నిరుద్యోగ దీక్ష‌ల‌ను మాత్రం వీడ‌టం లేదు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం తాను ఎక్క‌డ ఉంటే అక్క‌డే.. దీక్ష చేస్తూ క‌మిట్‌మెంట్ చాటుకుంటున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం ద‌గ్గ‌ర‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి.. దీక్షలో కూర్చున్నారు. నిరాహార దీక్ష సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇచ్చారు వైఎస్ ష‌ర్మిల‌. 

చిక్కులో సీఎం కేసీఆర్?ఈసీ ఎంట్రీతో గులాబీలో టెన్షన్.. 

తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. టీఈర్ఎస్ ప్లీనరీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్లీనరీలో హుజురాబాద్ ఉప ఎన్నికపై మాట్లాడిన కేసీఆర్.. ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు. ఒక రకంగా హెచ్చరించినట్లుగా మాట్లాడారు.  హుజురాబాద్ లో ఎన్నికల సంఘం  రాజ్యాంగ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌గా వ్య‌వ‌హ‌రించాలి. గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా, బాధ్య‌త గ‌ల పార్టీ అద్య‌క్షుడిగా, ఒక ముఖ్య‌మంత్రిగాభార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి ఒక స‌ల‌హా ఇస్తున్నాను. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నాను అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ స‌భ పెట్టొద్దు ఇది ఏం క‌థ.. ఇది ఒక ప‌ద్ధ‌తా? కొంద‌రు దిక్కుమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  గులాబీ బాస్ మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని హెచ్చరిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల సంఘాన్ని హెచ్చరించడంపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా స్పందించాయి. ఎన్నికల సంఘాన్ని కించపరిచేలా కేసీఆర్ మాట్లాడారని కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా కేసీఆర్ మాట్లాడారని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విపక్షాల ఫిర్యాదులతో పాటు కేసీఆర్ మాటలపై తమ దృష్టికి వచ్చిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన బైట్ ను సీఈసీ సేకరించిందని, ఆయన మాటలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోందని ఈసీ వర్గాల సమాచారం. కేంద్ర ఎన్నికల కమిషనర్, తెలంగాణ ఇంచార్జ్  ఉమేష్ సిన్హా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట్లాడిన మాటలను పరిశీలిస్తున్నామని, ఈసీని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రూల్స్ కు విరుద్దంగా ఉన్నాయనే చర్చే రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈసీని హెచ్చరించినట్లుగానే ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని, ఇది సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఈసీని ఉద్దేశించి కామెంట్లు చేసిన నేతలపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారని, సీఎం కేసీఆర్ పైనా కఠిన చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ఈసీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతుండగా.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ గులాబీ లీడర్లలో కనిపిస్తోంది. కేసీఆర్ పై ఈసీ యాక్షన్ తీసుకుంటే మాత్రం హుజురాబాద్ పోలింగ్ పై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే చర్చ సాగుతోంది. 

మ‌ద్యం షాపున‌కు మ‌హిళ‌లు సై.. మందుబాబులు ఫుల్ ఖుషీ..

ఎక్క‌డైనా మ‌ద్యం షాపు కావాలా? వ‌ద్దా? అని మ‌హిళ‌ల‌ను అడిగితే.. ఎక్కువ శాతం మంది వ‌ద్ద‌నే అంటారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం.. ఆ జిల్లా, ఈ గ్రామం.. అనే తేడా లేకుండా.. మ‌హిళ‌లు ఎప్పుడూ మ‌ద్యం షాపుల‌కు వ్య‌తిరేకంగానే ఉంటారు. మ‌గాళ్లు సంపాదించిన‌దంతా తాగుడుకే త‌గ‌లేస్తార‌ని.. డ‌బ్బులు ఖాళీ.. ఒళ్లు గుల్ల‌  చేసుకుంటార‌నే కార‌ణంతో మ‌హిళ‌లు.. మ‌ద్యం పాలిటి మ‌హంకాళిలుగా మారుతుంటారు. బెల్టు షాపుల‌పై దాడులు చేయ‌డం.. త‌మ వీధిలో నుంచి మ‌ద్యం షాపు తీసేయాలంటూ ధ‌ర్నాలు చేయ‌డం.. అలాంటి దృశ్యాలు రెగ్యుల‌ర్‌గా క‌నిపిస్తుంటాయి. కానీ, ఈ ఫోటో మాత్రం వాట‌న్నింటికీ డిఫ‌రెంట్‌. మ‌హిళ‌లే త‌మ గ్రామంలో మ‌ద్యం షాపు కావాలంటూ చేతులెత్తి ఆమోదం తెలుపుతున్న అరుదైన దృశ్యం ఇది.  మ‌హిళ‌ల్లో చాలా మార్పు వ‌స్తున్న‌ట్టుంది. త‌మ గ్రామంలో మ‌ద్యం షాపుల‌కూ ఎలాంటి అభ్యంత‌రం లేదంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ఈ ఫోటో అలాంటిదే. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళలంతా.. తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు ఇలా జైకొట్టారు. త్వరలో మద్యం దుకాణాలకు టెండర్లు పిలవనున్న నేపథ్యంలో తెలంగాణ‌లోని వినోభానగర్, గుండెపూడి గ్రామాల్లో సోమవారం పీసా గ్రామసభలు నిర్వహించారు. వినోభానగర్‌ పంచాయతీ కార్యాలయం ద‌గ్గ‌ర‌ సమావేశంలో ఇలా మద్యం దుకాణం ఏర్పాటుకు చేతులెత్తి మద్దతు ప్రకటించారు మ‌హిళ‌లు. ఆ సంద‌ర్భంగా తీసిన ఫోటో ఇది. మ‌హిళ‌లూ.. మీకు వంద‌నాలు అంటున్నారు మ‌ద్యం ప్రియులు.   

పార్టీ నేత‌ల‌కు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌.. రూ.20కోట్లకు దావా!.. ఎందుకో తెలుసా?

అస‌లే అధికార పార్టీ. అందులోనూ అరాచ‌కానికి కేరాఫ్‌. నోరున్న నేత‌ల‌దే హ‌వా. ఎంత‌గా నోరు వాడితే పార్టీలో అంత‌గా అంద‌లం. మంత్రులుగా ఉన్న‌వారు త‌మ ప‌ద‌విని కాపాడుకోడానికి.. ఎమ్మెల్యేలు మంత్రులు అవ‌డానిక‌.. పార్టీ లీడ‌ర్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకోవ‌డానికి.. ఇలా వైసీపీ వాళ్లంతా న‌మ్ముకుంటున్న ఏకైక మార్గం.. ర‌చ్చ‌..తిట్లు..బూతులు..అరాచ‌కం..విధ్వంసం.  ఈ స్ట్రాట‌జీ బాగా వ‌ర్క‌వుట్ అవుతుండ‌టంతో.. ప్ర‌తిప‌క్షంతో పాటు స్వ‌ప‌క్షం మీద కూడా ఇదే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు కొంద‌రు నాయ‌కులు. తాజాగా, ఉద‌య‌గిరి వైసీపీలో కుమ్ములాట‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిపై జెడ్సీటీసీ చేజ‌ర్ల సుబ్బారెడ్డి ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టా మొత్తం మీడియా ముందు పెట్టేశారు. వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఏ రేంజ్‌లో దోపిడీకి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారో చేజ‌ర్ల మాట‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.  త‌న‌పై చేసిన విమ‌ర్శ‌ల‌పై సొంత‌పార్టీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.  చిత్తూరులో గోడలకు నీళ్లు పట్టుకొని బతికినవాళ్లు తన గురించి విమర్శిస్తే తరిమి కొడతానని.. తన దగ్గర ఎదిగి తననే విమర్శిస్తారా? అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చేజ‌ర్ల సుబ్బారెడ్డిపై రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాల వారీగా వైసీపీ నేత‌ల్లో కుమ్ములాట‌లు తీవ్ర స్థాయికి చేరాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు ఇలా పార్టీ శ్రేణులంతా అవినీతి, అక్ర‌మాల‌తో చెల‌రేగిపోతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. వైసీపీ నేతలు లంచవతారాలుగా మారిపోయారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు న‌ల్ల‌పురెడ్డి. ఏపీలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేత‌లు అవినీతిలో పోటీ ప‌డుతున్నారు. వాటాల విష‌యంలో వ‌ర్గ పోరు న‌డుస్తోంది. ఫ‌లితంగా.. ఇలా ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ.. బ‌జారున ప‌డుతున్నారు వైసీపీ నాయ‌కులు. ఏకంగా ఎమ్మెల్యే మేక‌పాటి అవినీతిపైనే ఆయ‌న అనుచ‌రులు ఆరోప‌ణ‌లు చేయ‌డం.. ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి త‌న అనుచ‌రుల అవినీతిపై హెచ్చ‌రించ‌డం.. వైసీపీ దోపిడీ బ్యాచ్‌గా మారింద‌నే విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చుతున్నాయని అంటున్నారు. య‌ధా రాజా.. త‌దా నేత‌ల‌ని కూడా అంటున్నారు.   

ఉత్తుత్తి అరెస్టులేనా?, బొండాపై మ‌రోకేసు.. క‌లెక్ట‌ర్‌పై రేవంత్‌ ఫైర్‌.. టాప్‌న్యూస్ @1pm

1. టీడీపీ నేత  బొండా ఉమాపై  అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. బొండా ఉమాపై 153 ఎ, 294 బి, 504, 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  2. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసుల ప్రకటనలపై టీడీపీ తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాడి కేసులో 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మూడు దఫాలుగా ఎస్పీ కార్యాలయం ప్రకటన చేసింది. కాగా ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని క్రిందిస్థాయి సిబ్బంది చెబుతోంది. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చామని విచారణ సిబ్బంది తెలిపింది.  3. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం వరి రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. ‘సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా ఊరుకోను’ అంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఈ ఎత్తుగడ అన్నారు. వరి పంటలు వేయనప్పుడు ఇక లక్షల కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టుల నిర్మాణాలు ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 4. వైసీపీ నేతలకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తనపై అవినీతి ఆరోపణలు చేసిన జెడ్పీటీసీ చేజర్ల సుబ్బారెడ్డి, త‌దిత‌ర‌ నేతలపై మేకపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో గోడలకు నీళ్లు పట్టుకొని బతికినవాళ్లు తన గురించి విమర్శిస్తే తరిమి కొడతానని.. తన దగ్గర ఎదిగి తననే విమర్శిస్తారా? అని మండిపడ్డారు. రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.  5. ఏపీలో నిరసనకు దిగిన వారి గొంతులు నొక్కేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఏపీలో నిరసన గొంతులు నొక్కేస్తున్నారు, అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి పాలన విధించాలి. డ్రగ్స్‌పై విచారణకు ఆదేశించి, డీజీపీని రీకాల్ చేయాలి. దాడులపై సీబీఐ విచారణ చేయాలి. అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై టీడీపీ పోరును దాడులతో ఆపలేరు’’ అని దేవినేని ఉమ అన్నారు. 6. కొవిడ్‌ మృతుల పరిహారం చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబానికి రూ.50,000 మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు నమునాను కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులలో పొందుప‌రిచింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 7. హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందని.. ఊర్లను బార్లుగా మార్చి, మద్యం ఏరులు పారిస్తున్నారని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పౌరులు ఏ పార్టీలో ఉండాలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. మీడియాలో తన మొహం కనిపించకుండా చేసేందుకు ఇప్పటికే 500 కోట్ల నల్లధనం ఖర్చు చేశారని ఆరోపించారు.  8. హుజురాబాద్ ఎన్నికలను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించాలని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్‌రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల మెడ చుట్టూ ఉరి తాడు బిగిస్తోందని అన్నారు. వరిసాగుపై జిల్లా కలెక్టర్ మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.  9. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సుదీర్ఘకాలంగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మహా పాదయాత్రకు అనుమతిపై డీజీపీ ఈనెల 28 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.  10. గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెవెన్యూలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా ఇస్తారో చెప్పాలని హైకోర్ట్ ఆదేశించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

రేవంత్ రెడ్డి కారు ఎవరిది? ఆంధ్రా కాంట్రాక్టర్ దేనా? 

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి సంబంధించిన పలు ఆధారాలు బయటపెడుతున్నారు. సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీపైనా సంచలన కామెంట్లు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు గులాబీ లీడర్లు. బ్లాక్ మెయిలింగ్ తో కోట్లాది రూపాయలు కూడబెట్టారని ఆరోపించారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగే అన్నారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ కోట్లాది రూపాయలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే ప్లీనరీ వేదికపై తెలుగు తల్లి ఫోటో పెట్టారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు ఎమ్మెల్యే కిషోర్ కుమార్. రేవంత్ రెడ్డి తిరుగుతున్న కారు ఆంధ్రా కాంట్రాక్టర్ ది కాదా అని ప్రశ్నించారు. కర్నూల్ కు చెందిన కాంట్రాక్టర్ సంస్థ పేరుతో రిజిస్టర్ అయిన కారులో రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని, దాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డికి ధమ్ముంటే తాను చెప్పేది నిజం కాదని నిరూపించుకోవాలన్నారు గాదరి కిషోర్ కుమార్.  సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీపై స్పందించిన రేవంత్ రెడ్డి..  ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఫ్లెక్సీ పెట్టారని అన్నారు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తురాలేదన్నారు. 2001 జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎగపాకిందని విమర్శించారు. పార్టీ కార్యాలయాల పేరుతో సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల  ఆస్తులను సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.420 కోట్లు ఉన్నాయంటే.. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 

మొన్న వైవీ.. నిన్న‌ ఆళ్ల‌.. ర‌చ్చనా? రాయ‌బార‌మా? ఏంటి సంగ‌తి?

వైఎస్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర చేస్తున్నారు. తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు వడివ‌డిగా అడుగులు వేసుకుంటున్నారు. ప్ర‌జ‌ల నుంచీ మంచి స్పంద‌నే వ‌స్తోంది. వైఎస్సార్ అభిమానులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు మిన‌హా ఆమె వెంట నిలిచే బ‌ల‌మైన నాయ‌కులు లేరు. ష‌ర్మిల‌ సింగిల్‌గా పాద‌యాత్ర‌తో దూసుకుపోతున్నారు. ఇదీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న టాక్‌.  క‌ట్ చేస్తే.. ఆదివారం వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఆమె బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ ష‌ర్మిల‌ను క‌లిసి మ‌ద్ద‌తు ప‌లికారు. వైఎస్ త‌ర‌హాలో ష‌ర్మిల‌ చేస్తున్న పాద‌యాత్ర‌కు స‌పోర్ట్ చేశారు. ష‌ర్మిల యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత వ‌ర‌కూ ఓకే. వైవీ సుబ్బారెడ్డి.. ఆమెకు బాబాయ్ కాబ‌ట్టి ప‌ర్స‌న‌ల్‌గా ఆయ‌న క‌లిసుంటార‌ని అన్నారు. ష‌ర్మిల‌ను జ‌గ‌న్ కాద‌నుకున్నా.. వైవీ సుబ్బారెడ్డి వెళ్లి ష‌ర్మిల‌ను క‌ల‌వ‌డం వైసీపీలో క‌ల‌క‌లం రేపింది. అదంతా ఫ్యామిలీ మేట‌ర్ అని లైట్‌గా తీసుకునే ప‌రిస్థితి లేదంటున్నారు.  ఇక సోమ‌వారం మ‌రింత ఇంట్రెస్టింగ్ ప‌రిణామం జ‌రిగింది. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆంధ్ర నుంచి తెలంగాణ‌కు త‌ర‌లివ‌చ్చి.. ష‌ర్మిల పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య కూర్చొని ఆమె ప్ర‌సంగాన్ని విన్నారు. పాద‌యాత్ర అనంత‌రం షర్మిల‌తో గంట‌కు పైగా స‌మావేశ‌మ‌య్యారు. ఇది మాత్రం క్యాజువ‌ల్ కానే కాదు. ఫ్యామిలీ మేట‌ర్ అంత‌క‌న్నా కాదు.  జ‌గ‌న్ కోట‌రీలో కీల‌క నేత‌లుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిలు వ‌రుస‌గా ఇలా ష‌ర్మిల పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం.. ఆమెతో స‌మావేశ‌మ‌వ‌డం.. అత్యంత ఆస‌క్తిక‌ర అంశం. జ‌గ‌న్‌ను కాద‌ని వారిద్ద‌రు స్వ‌త‌హాగా ఈ ప‌ని చేసి ఉంటార‌ని అనుకోలేం. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కీ రోల్ పోషించిన ఆళ్ల‌.. ఇప్పుడు ష‌ర్మిల పాద‌యాత్ర‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. వాళ్లిద్ద‌రూ జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లోనే ష‌ర్మిల‌ను క‌లిశారా?  ప్ర‌జా ప్ర‌స్థాన పాద‌యాత్ర‌కు బూస్టింగ్ ఇస్తున్నారా? జ‌గ‌న్ త‌ర‌ఫున రాయ‌బారానికి వ‌చ్చారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.  తాను జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణం కాదంటూ ష‌ర్మిల మొద‌ట్లోనే తేల్చి చెప్పారు. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆస్థి త‌గాదాలు, ఆధిప‌త్య పోరు, చెల్లిని అన్న ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఆమె అలిగి రావ‌డం.. ఇలా ర‌క‌ర‌కాలుగా అన్నారు. అయితే, అవ‌న్నీ ఉత్తి ప్ర‌చార‌మేనా? వాళ్లంతా ఒక్క‌టేనా? అనే చ‌ర్చ కొత్త‌గా స్టార్ట్ అయింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల మాట్లాడుతూ.. జ‌గ‌న్‌తో త‌న‌కు అంత పెద్ద‌గా విభేదాలు ఏవీ లేవ‌ని.. తాము ఇప్ప‌టికీ ఫోన్లో మాట్లాడుకుంటున్నామ‌ని.. వైఎస్సార్ స‌మాధి ద‌గ్గ‌ర గ‌తంలోనూ తాము మాట్లాడుకోలేద‌ని.. చిన్న చిన్న‌ గొడ‌వ‌లు ఉన్నా.. కూర్చొని మాట్లాడుకుంటే స‌మ‌సిపోయేవేన‌ని ఆమే స్వ‌యంగా స్ప‌ష్టం చేశారు. అది నిజ‌మేన‌న్న‌ట్టు.. ఇప్పుడు జ‌గ‌న్ స‌న్నిహితులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిలు ష‌ర్మిలను క‌లిసి చ‌ర్చించ‌డం ఆస‌క్తిక‌రం. అంటే.. వారంతా ఒకే తాను ముక్క‌లా? ష‌ర్మిల జ‌గ‌న‌న్న వ‌దిలినా బాణ‌మేనా? మ‌రి, ఫ్యామిలీలో గొడ‌వ‌లు ఉన్నాయ‌నే ప్ర‌చారం కావాల‌నే చేశారా? లేక‌... చెల్లి పాద‌యాత్ర చేయ‌డం చూడ‌లేక‌.. అన్న రాయ‌బారం పంపించారా? అనే అనుమాన‌మూ వ‌స్తోందంటున్నారు. ఇందులో ఏది నిజ‌మో.. జ‌గ‌న్‌-ష‌ర్మిల మ‌ధ్య అస‌లేం జ‌రుగుతోందో.. క్లారిటీ వ‌చ్చీ రానట్టుగా ఉందంటున్నారు.  

అటు కొవిడ్.. ఇటు ఆంథ్రాక్స్.. వరంగల్ జిల్లాలో వణికిపోతున్న జనం 

కొవిడ్ మహమ్మారి తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గకుండానే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో కలకలం రేగింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, చాపలబండలో ఆంథ్రాక్స్  వెలుగు చూసింది. ఆంథ్రాక్స్ వ్యాధి లక్షణాలతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. చనిపోయిన గొర్రెలు సాంబయ్య అనే రైతుకు చెందినవి. అధికారులు దగ్గరుండి గొర్రెలను ఖననం చేయించారు. ఆంథ్రాక్స్ లక్షణాలతో నాలుగు గొర్రెలు చనిపోవడంతో దుగ్గొండ మండలంలో తీవ్ర భయాందోళన నెలకొంది. గొర్రెలు చనిపోయిన చాపలబండ గ్రామంలో అయితే జనాలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడిపోతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆంథ్రాక్స్  లక్షణాలు కనిపిస్తున్నా..ఇంకా నిర్దారణ కాలేదని చెప్పారు. పూర్తి నివేదికలు వచ్చాకే తేలుతుందన్నారు. ఒకవేళ ఆంధ్రాక్స్ అయినా భయపడాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలతో ఉంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. 

కొవిడ్ టీకా తీసుకుంటేనే రేషన్, పెన్షన్.. 

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే కీలకం కావడంతో.. అందరికి టీకా అందిచండమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై చర్యలు తీసుకునేందు సిద్ధమైంది. రాష్ట్రంలో ఎవరైనా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే.. వారి రేషన్‌ మరియు పింఛన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు.  కొత్త నిబంధనలు నవంబర్‌ 1 వ తేదీ నుంచే అమలు చేస్తామని  శ్రీనివాస రావు స్పష్టం చేశారు. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు. కరోనా మూడో వేవ్‌ ను అరికట్టేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 3 కోట్ల వ్యాక్సిన్ మైలురాయిని క్రాస్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 179 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు కరోనా సోకి మరణించారు. అలాగే.. 104 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ఒక్కొక్కరిని చెండాడుతా.. సుప్రీంకోర్టు నన్నేం ఏం చేయలేదు! సిద్ధిపేట కలెక్టర్ కామెంట్ల కలకలం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాకు ఆయన కలెక్టర్. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం. ఆ కలెక్టర్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘంగా కాలంగా ఆయన సిద్దిపేటలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని రోజులు మార్చినా.. తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు బినామీగా కలెక్టర్ వ్యవరిస్తున్నారనే ఆరోపణలను విపక్ష నేతలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలాన్ని దక్కించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయనకు వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ బినామీ కాబట్టే.. అతని సంస్థకు ఖరీదైన భూములను తక్కువ ధరకు కట్టబెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఆయన అధికార పార్టీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఇన్ని ఆరోపణలు ఉన్న సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్రికల్చర్ మీటింగ్‌లోఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి  హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన సరఫరా చేసే డీలర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘యాసంగిలో ఏ ఒక్క డీలర్ కేజీ వరి విత్తనాలు కూడా అమ్మడానికి వీళ్లేదు. అలా అమ్మితే వెంటనే ఆ షాపును సీజ్ చేస్తాం. షాపును రీఓపెన్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పినా, ప్రజాప్రతినిధులు చెప్పినా, నా పైఅధికారులు చెప్పినా నేను వినను. నేను కలెక్టర్‌గా ఉన్నన్ని రోజులు ఆ షాపు ఓపెన్ కానివ్వకుండా చేస్తా. ఒకవేళ డీలర్లు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెన్షన్ అవుతారు.’’ అని సిద్ధిపేట కలెక్టర్ అన్నారు.  సిద్ధిపేట జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ తీరుపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.  సిద్దిపేట కలెక్టరేట్‌లో విత్తనాలు, ఎరువుల డీలర్లతో జరిగిన సమావేశం వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించలేక ప్రభుత్వం చేతులెత్తేసేంది. అందుకే ప్రభుత్వం విత్తనాల అమ్మకాన్ని నిలిపివేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. రాష్ట్రంలో వరి పండించే అవకాశం లేనప్పుడు మరి లక్షల కోట్లు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం దేనికి.’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కలెక్టర్ హోదాలో ఉండి ఇలా బెదిరించడం ఏంటని నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది.

చంద్ర‌బాబు మారాలా? కోట‌రీ వ‌ల్లే క‌ష్టాలా? నిజ‌మైన నేత‌ల నినాద‌మేంటి?

చంద్ర‌బాబు మారాలి. లోకేశ్ మారాలి. తండ్రీకొడుకులు మారాలి. టీడీపీలో కొత్త చ‌ర్చ న‌డుస్తోంది. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ మూక‌ల దాడి, బీభ‌త్సం త‌ర్వాత తెలుగు త‌మ్ముళ్లు కొత్త చ‌ర్చను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. మాజీ మంత్రి ప‌రిటాల సునీత మొద‌ట ఆజ్యం పోశారు. అదిప్పుడు దావాగ్నిలా పార్టీలో ర‌గులుతోంది. పార్టీ శ్రేణులంతా వైసీపీ దాడుల‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. దెబ్బ‌కు దెబ్బ‌.. దాడికి ప్ర‌తిదాడి చేయాలంటూ పిలుపిస్తున్నారు. ప‌రిటాల సునీత అయితే ఏకంగా.. చంద్ర‌బాబు సీఎం అయ్యాక ఓ గంట క‌ళ్లు మూసుకుంటే చాలు.. తామేంటో చూపిస్తాం అంటూ.. వైసీపీని ఫ‌స‌క్ చేస్తామ‌నే రేంజ్‌లో స‌వాల్ చేశారు. ఆమె ప్ర‌సంగాన్ని చంద్ర‌బాబు సైతం ఆస‌క్తిగా విన్నారు. సునీత పిలుపు త‌ర్వాత ఇత‌ర నాయ‌కులూ చంద్ర‌బాబు మారాల‌నే సూచ‌న చేస్తుండ‌టం ఆసక్తిక‌ర ప‌రిణామం.  ఇక‌ చంద్ర‌బాబును పార్టీ శ్రేణులే ప‌లు ర‌కాలుగా త‌ప్పుబ‌డుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న చుట్టూ గిరి గీసుకొని.. ఓ కోట‌రీని ఏర్పాటు చేసుకొని.. అందులోంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయార‌ని అంటున్నారు. పవ‌ర్‌లో ఉన్న‌ప్పుడు అధికారం అనుభ‌వించి.. హ‌వా న‌డిపించిన ఆ కోట‌రీ.. టీడీపీ అధికారం కోల్పోగానే.. ప‌టాపంచ‌లు అయిపోయింద‌ని.. చంద్ర‌బాబును వ‌దిలేసి ఎవ‌రి దారి వారు చూసుకున్నార‌ని మండిప‌డుతున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబుదే త‌ప్ప‌నే విధంగా చ‌ర్చ న‌డుస్తోంది. పార్టీ కోసం ప్రాణాలొడ్డి.. వైసీపీ కుతంత్రాల‌ను ఎదుర్కొటూ.. నిబద్ధ‌త‌తో ప‌ని చేస్తున్న‌ నిజ‌మైన నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అప్ప‌ట్లో చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని త‌ప్పుబ‌డుతున్నారు. తీరా.. అధికారానికి దూర‌మ‌య్యాక‌.. అధినేత‌కు ఇప్పుడు త‌త్వం బోధ‌ప‌డుతోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలుస్తున్న‌దంతా నిఖార్సైన తెలుగు త‌మ్ముళ్లేన‌ని గుర్తు చేస్తున్నారు.  అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు కొంద‌రివాడే అంటారు. మంత్రి నారాయ‌ణ‌, ఎంపీలు సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేశ్‌లాంటి వాళ్లు చంద్ర‌బాబును హైజాక్ చేశార‌ని చెబుతారు. అధినేత సైతం వారికే ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇచ్చే వార‌ని చెబుతారు. ఇప్పుడు వాళ్లెవ‌రూ పార్టీలో లేరు. ప్ర‌స్తుతం పార్టీని, చంద్ర‌బాబును కంటికి రెప్ప‌లా కాపుడుకుంటున్న‌ది.. ప‌రిటాల‌, చింత‌మ‌నేని, కూన ర‌వికుమార్‌, కొల్లు ర‌వీంద్ర‌, దూళిపాళ్ల‌, బుద్దా వెంక‌న్న‌, బొండా ఉమా, ప‌ట్టాభి లాంటి వాళ్లే. అందుకే, అధికారంలో ఉన్నా లేకున్నా.. నిజ‌మైన నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను పట్టించుకోవాల‌ని.. పార్టీని బ‌తికించుకోవాల‌ని.. త‌ద‌నుగుణంగా చంద్ర‌బాబు మారాల‌నే చ‌ర్చ న‌డుస్తోంది.  ఈ సంద‌ర్బంగా ప‌రిటాల సునీత చేసిన మ‌రో కామెంట్ సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్.. న‌ర‌సారావుపేట‌కు ప‌రామ‌ర్శ‌కు వెళుతుంటే.. ప్ర‌భుత్వ ప్రోద్బ‌లంతో పోలీసులు విజ‌య‌వాడ‌లోనే ఆయ‌న్ను అడ్డుకున్నారు. ఆ సంద‌ర్భంగా లోకేశ్ వెంట ప‌ట్టుమ‌ని ప‌ది మంది కార్య‌క‌ర్త‌లు కూడా లేర‌ని.. అలాంటి ప‌రిస్థితి రావొద్దంటూ సునీత సూచించారు. ఇదంతా గ‌తంలో క్రింది స్థాయి కార్య‌క‌ర్త‌ల‌కు చంద్ర‌బాబు కానీ, లోకేశ్ కానీ.. త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇప్పుడు ఆ కేడ‌ర్ కాస్త దూరంగా ఉంటోంద‌ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితులు మ‌ళ్లీ రావొద్దంటే.. నిజ‌మైన తెలుగు త‌మ్ముళ్ల‌కు త‌గిన‌ ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేడ‌ర్ నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి.  అయితే, టీడీపీ అధినేత తీరునూ గ‌ట్టిగా స‌మ‌ర్థించే వాళ్లూ ఉన్నారు. న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు నిత్యం ప‌రిపాల‌నా ప‌నుల్లో బిజీగా ఉండేవార‌ని.. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపైనే ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టార‌ని చెబుతున్నారు. లోకేశ్ సైతం కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా ఉంటూ ఏపీ అభివృద్ధి, పెట్టుబ‌డుల‌పైనే దృష్టి కేంద్రీక‌రించ‌డం వ‌ల్ల‌.. పార్టీని, కేడ‌ర్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేక‌పోయార‌ని.. అంతేకానీ వేరే ఉద్దేశ్యం లేద‌నేది చంద్ర‌బాబు త‌ర‌ఫు వ‌ర్ష‌న్‌. ఏది ఏమైనా.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ రౌడీల దాడుల త‌ర్వాత‌.. పార్టీని మ‌రింత ధృఢంగా, ప‌టిష్టంగా మార్చ‌డంపై అధినేత చంద్ర‌బాబు మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రాన్ని గ‌ట్టిగా సూచిస్తోంది. దీక్ష‌లు, ధ‌ర్నాల‌తో పాటు అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌పై ఇంకా దూకుడుగా, ధీటుగా జ‌వాబిచ్చేలా ప‌దునైన‌ వ్యూహాలు సిద్ధం చేయాల‌ని.. అందుకు అనుగుణంగా కేడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేయాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిని తీసుకొచ్చింద‌ని అంటున్నారు. మ‌రి, కేడ‌ర్ కోరుతున్న‌ట్టు.. చంద్ర‌బాబు మారుతారా? లోకేశ్ మ‌రింత అగ్రెసివ్ అవుతారా? కోట‌రీకి స్థానం లేకుండా చేసి.. నిజ‌మైన కేడ‌ర్‌తో రాజ‌కీయ ర‌ణ‌తంత్రం ర‌చిస్తారా? చూడాలి...

జ‌గ‌న్ ఇంటికి వైసీపీ కార్య‌క‌ర్త పాద‌యాత్ర‌.. మ‌రీ ఇంత అరాచ‌క‌మా?

ఏపీలో పాల‌న అనేదే లేదు. కేవ‌లం అరాచ‌కం మాత్ర‌మే. ఓవైపు అధికారులు.. మ‌రోవైపు వైసీపీ పెద్ద‌లు.. ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలు, ల‌బ్దిదారులు, అర్హుల ఎంపిక‌ విష‌యంలో పార్టీ లీడ‌ర్లదే పెత్త‌న‌మంతా. అయితే, వైసీపీ కండువా క‌ప్పుకున్న వారంద‌రి మాటా చెల్లుబాటు కావ‌ట్లేదు. కొంద‌రిదే హ‌వా. క్రింది స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునే వారే లేదు. పార్టీ ప్ర‌ముఖులే కాదు.. అధికారులు సైతం సామాన్యుల‌ను లెక్క చేయ‌డం లేదంటున్నారు. స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఉద్యోగుల్లో ఉదాసీన‌త, బ‌ద్ద‌కం, నిర్ల‌క్ష్యం బాగా పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు. ఇక‌ లంచగొండిత‌నం గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఏపీలో అధికారుల ఓవ‌రాక్ష‌న్‌ను మ‌రోసారి గుర్తు చేస్తోంది. కృష్ణా జిల్లా ధ‌నియాల‌పేట‌కు చెందిన వైసీపీ కార్య‌క‌ర్త ప‌ల్ల‌పు శ్రీనివాస‌రావుకు అధికారుల చేతిలో చేదు అనుభ‌వం ఎదురైంది. కుటుంబ సభ్యత్వ ధ్రువపత్రం కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు శ్రీనివాస‌రావు. య‌దావిధిగా లంచం అడిగార‌ట అక్క‌డి అధికారులు. అదేంటి.. లంచం ఎందుకు?  తాను వైసీపీ కార్య‌క‌ర్త‌న‌ని చెప్పార‌ట‌. అయితే ఏంటి? ఎవ‌రైనా స‌రే.. లంచం ఇస్తేనే ప‌న‌వుతుంద‌ని ఆ ఆఫీస‌ర్ నుంచి రిప్లై వ‌చ్చింది. మ‌నోడు షాక్‌. అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ను త‌న‌నే లంచం అడుగుతారా అంటూ గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. అధికారులు ఇంకా ముదురు క‌దా. అందుకే, శ్రీనివాస‌రావు ఎంత వాదించినా.. లంచం ఇస్తేనే ప‌న‌వుతుంద‌ని తేల్చేశారు. ఒళ్లు మండిన ఆ వైసీపీ కార్య‌క‌ర్త‌.. మీ సంగ‌తి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌రే తేలుస్తానంటూ పాద‌యాత్ర చేప‌ట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. లంచం అడిగారంటూ వైసీపీ కార్యకర్త పల్లపు శ్రీనివాసరావు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి పాదయాత్ర చేపట్టారు. ‘అధికారుల నిర్లక్ష్యం.. లంచగొండితనం..సీఎం సారూ నాకు న్యాయం చేయండి..’ అంటూ ప్లకార్డు ప‌ట్టుకొని.. మెడలో వైసీపీ కండువా క‌ప్పుకొని.. పాద‌యాత్ర‌గా తాడేప‌ల్లి ప్యాలెస్ వైపు వెళ్తున్న శ్రీనివాస‌రావు ఉదంతం ఏపీలో క‌ల‌క‌లంగా మారింది. మ‌రి, అవినీతికే బ్రాండ్ అంబాసిడ‌ర్ లాంటి సీఎం జ‌గ‌న్‌రెడ్డి.. అవినీతికి పాల్ప‌డుతున్న అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారా? అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు. 

టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి! రేవంత్ రెడ్డి దెబ్బకు మైండ్ బ్లాంక్...

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితీ ద్వదశాబ్ది వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ప్లీనరీ అట్టహాసంగా సాగింది. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కేసీఆర్. పార్టీ 20వ పండుగ కావడంతో హైదరాబాద్ మొత్తం గులాబీమయం చేసింది అధికార పార్టీ. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విపక్షాలు ఆందోళన కూడా చేశాయి. గ్రేటర్ పరిధిలో బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేదం ఉండగా.. ఇంత పెద్ద స్థాయిలో ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించాయి.  టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జలదృశ్యం నుంచి జనదృశ్యం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ ఉద్యమం ముసుగులో గులాబీ పార్టీని విస్తరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలు నగరంలో టులెట్ బోర్డ్ పెడితే జీహెచ్ఎంసీ 2 వేల జరిమానా వేస్తుందని, కాని హైదరాబాద్ కట్టిన టీఆర్ఎస్ జెండాలు వాళ్లకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు ఎంత ఫైన్ వేస్తారని బల్దియా అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నేత విగ్రహాలకు సైతం టీఆరెఎస్ జెండాలు కట్టారన్నారు. ప్లీనరీలో తెలంగాణ అమర వీరులను కూడా స్మరించుకోలేదన్నారు. జల దృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం అవినీతి దృశ్యంగా దోపిడీ దృశ్యంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఫ్లెక్సీ పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తురాలేదన్నారు. 2001 జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎగపాకిందని విమర్శించారు. కొండా లక్ష్మణ్ బాపు, బియ్యాల జనార్దన్ రావు, జయశంకర్, కేశవరావు, గుడ అంజయ్య, సాంబశివుడు, రహ్మాన్, చివరి నిమిషం వరకు కేసీఆర్ కోసం పనిచేశారన్నారు. గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, పాపారావు, విజయ రామరావు, ఆలే నరేంద్ర, విజయశాంతి.. ఎవర్ని గుర్తు చేసుకోలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మలే ప్లీనరీలో పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అన్నారు. ఓయూకు ఎంత నిధులు కేటాయించారో తెలపాలన్నారు. యువతను ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తలో లక్ష 7 వేల ఖాళీలున్నాయని కేసీఆర్ చెప్పారని, బిశ్వల్ కమిటీ రిపోర్ట్ కూడా లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని చెప్పిందన్నారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ, నిరుద్యోగుల సమస్యలపై కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంతా కలిసి పోరాటం చేశాలని కోరారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, కేసీఆర్ పై పెట్టిన కేసులు తొలగించుకున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయాల పేరుతో సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల  ఆస్తులను సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.420 కోట్లు ఉన్నాయంటే.. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బైలాస్ మార్చారంటే కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్ అని భవిష్యత్ ముఖ చిత్రం తెలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు