పోలవరం పూర్తి కావడం అసాధ్యం.. కేంద్రం క్లారిటీ.. జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌తేనా?

2021, డిసెంబ‌ర్ చివ‌రిక‌ల్లా పోల‌వ‌రం పూర్తి చేస్తాన‌ని గ‌తంలో సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాట‌లు చెప్పారు. చేత‌ల్లో మాత్రం చేతులెత్తేశారు. 2021 కాదు క‌దా.. 2022 నాటికైనా పోల‌వ‌రం పూర్త‌వుతుంద‌నే న‌మ్మ‌కం లేద‌ని కేంద్రం అంటోంది. జ‌స్ట్ అన‌డ‌మే కాదు.. పార్ల‌మెంట్‌లో ఆ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న కూడా చేసింది.  ‘‘వచ్చే ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పునరావాసం, పరిహారంలోనూ జాప్యం జరుగుతోంది. కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. ప్రాజెక్టు స్పిల్‌వే ఛానల్‌ పనులు 88 శాతం, అప్రోచ్‌ ఛానల్‌ ఎర్త్‌వర్క్‌ పనులు 73 శాతం పూర్తి అయ్యాయి. పైలట్‌ ఛానల్‌ పనులు 34 శాతమే పూర్తయ్యాయి. పోలవరం సవరించిన అంచానాలు రూ.55,548 కోట్లకు టీఏసీ ఆమోదం తెలపింది’’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది.    నిర్ణీత గడువులోగా పోలవం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం తెలిపింది.  పోల‌వ‌రం ప‌నులు గ‌తంలో ఎలా సాగేవి.. ఇప్పుడు ఎలా జ‌రుగుతున్నాయంటూ అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప‌రుగులు పెట్టింది. సోమ‌వారం..పోల‌వారంగా మార్చుకొని.. ప్రాజెక్టు ప‌నుల‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. గ‌త‌ టీడీపీ ప్ర‌భుత్వానికి అటు అమ‌రావ‌తి.. ఇటు పోల‌వ‌రం.. ఈ రెండే ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా ఉండేవి. కానీ, జ‌గ‌న్‌రెడ్డి వ‌చ్చాక సీన్ మారిపోయింది. అమ‌రావ‌తి, పోల‌వ‌రం రెండూ అట‌కెక్కాయి. రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటూ పోల‌వ‌రాన్ని రివ‌ర్స్ గేర్‌లో వెన‌క్కి న‌డిపించారు. జ‌గ‌న్ బ‌ల‌హీన‌త‌ల‌ను ఒడిసిప‌ట్టి.. కేంద్రం సైతం పోల‌వ‌రం నిధుల‌పై మొండికేస్తూ వ‌చ్చింది. జ‌గ‌న్ పిల‌క మోదీ చేతిలో ఉండ‌టంతో.. పోల‌వ‌రంపై గ‌ట్టిగా పోరాడ‌లేని దుస్థితి. రాష్ట్ర ఖ‌జానాలో డ‌బ్బులు లేక‌.. పున‌రావాసం, ప‌రిహారంలో తీవ్ర జాప్యం జ‌రుగుతోంది. అలా, జ‌గ‌న్‌రెడ్డి వైఫ‌ల్యం పోల‌వ‌రానికి శాపంగా మారింది. పోల‌వ‌రం.. ఎంతెంత దూరం అంటే.. మ‌రింత దూరం అన్న‌ట్టుగా వెన‌కెన‌క్కి వెళుతోంది. గ‌డుపులోగా ప్రాజెక్టు పూర్తికావ‌డం అసాధ్యమ‌ని కేంద్ర వివ‌ర‌ణ‌తో తేలిపోయింది.   

హిందువుగా మారిన  షియా వక్ఫ్‌బోర్డు మాజీ చీఫ్..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం చోటు చేసుకుంది. వివాదాస్పద ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. వసీం రిజ్వీని సోమవారం దాస్నా ఆలయానికి చెందిన మహంత్ నరసింహ ఆనంద సరావతి అధికారికంగా హిందూ మతంలోకి మార్చారు.  తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత తతను ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నాడు. తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింహ ఆనంద సరావతి నిప్పంటించాలని కూడా రిజ్వీ పేర్కొన్నాడు. షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ అయిన రిజ్వీ సుప్రీంకోర్టులో వివాదాస్పద పిటిషన్ దాఖలు చేశారు. పలు రాడికల్ ఇస్లామిక్ సంస్థలు తనను శిరచ్ఛేదం చేయాలని పిలుపునిచ్చినందున ప్రాణహాని ఉందని రిజ్వీ పలుసార్లు వీడియోను విడుదల చేశాడు. అయితే అత్యున్నత న్యాయస్థానం రిజ్వీ పిటిషన్‌ను పనికిరానిదిగా పేర్కొంటూ అతనికి రూ.50,000 జరిమానాను విధించింది.  వసీం రిజ్వీ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నవంబర్ 17న ఫిర్యాదు చేశారు. రిజ్వీ ప్రవక్త మహమ్మద్‌ను దూషిస్తూ హిందీలో ఓ పుస్తకాన్ని రాశారని, అందులో అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఒవైసీ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. 

మోడీ సిగ్నల్.. టీఆర్ఎస్ ఎంపీలు జంప్!

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్వానంగా తయారైందని అన్నారు.  పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసనలు తెలుపుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫొటోలకు పోజులు తప్ప టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో నిరసనలు తెలుపుతున్నామని చెబుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం నుంచి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు ఉండవని అన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్  నుంచి టీఆర్ఎస్ ఎంపీలు మాయమవబోతున్నారని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సర్కారుకు ఆదేశాలు అందడమే అందుకు కారణమని చెప్పారు. వరి సాగు విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతామన్న కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.  

జగన్ కోర్టుకు రావాల్సిందే.. హైకోర్టులో సీబీఐ స్ట్రాంగ్ వాదన..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్  వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు హాజరు మినహాయింపు ఇవ్వొద్దని ఆయన కోరారు. పిటిషన్ పై వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.  విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది పలు అంశాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో జగన్ ఇదే అభ్యర్థన చేస్తే సీబీఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కారణంగానే గతంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించినట్టు కోర్టుకు వివరించింది. ప్రస్తుతం జగన్ హోదా మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశలోనే ఉన్నాయని, హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని కోర్టులో సీబీఆ వాదించింది. ఈ పిటిషన్ పై పూర్తిస్థాయిలో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ కేసులో ఏం తీర్పు రాబోతుందన్నది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం అదేశిస్తే ఈ కేసులో కీలక పరిణామాలు జరగవచ్చని తెలుస్తోంది. 

ఓటీఎస్ రిజిస్ట్రేష‌న్ల చ‌ట్ట‌బ‌ద్ద‌త ఎంత‌? ఆ డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయా?

ఏదైనా స్థ‌ల‌మో, ఇళ్లో కొనుక్కున్నారు అనుకోండి. దాన్ని ఎక్క‌డ రిజిస్ట్రేష‌న్ చేయిస్తారు? ఇది వెరీ సింపుల్ క్వ‌శ్చ‌న్‌. ఈజీగా ఆన్స‌ర్ చెప్పేయొచ్చు. ఎవ‌రైనా రిజిస్టార్ ఆఫీసులోనే క‌దా రిజిస్ట్రేష‌న్ చేయించేది అని అనుకుంటున్నారా? అయితే, మీది సగం రైట్ ఆన్స‌ర్‌.. స‌గం రాంగ్ ఆన్స‌ర్‌. ఇంత‌కుముందు అయితే మీరు చెప్పింది 100% క‌రెక్ట్ ఆన్స‌రే. కానీ, ఏపీలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం వ‌చ్చాక.. రిజిస్ట్రేష‌న్ల చ‌ట్ట‌బ‌ద్ద‌తే క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయింది. ఇళ్ల రిజిస్ట్రేష‌న్లు గ్రామ స‌చివాల‌యాల్లో కూడా చేస్తామంటున్నారు. బాండ్ పేప‌ర్ మీద కాకుండా.. వైసీపీ రంగుల ప‌త్రాల్లో కూడా డాక్యుమెంట్లు ఉంటున్నాయి. జ‌గ‌న‌న్న లీల‌లు.. ఇలా రంగు రంగుల మాయలా అనిపిస్తోంది. ఓటీఎస్ ప‌థ‌కం రిజిస్ట్రేష‌న్ల చెల్లుబాటే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని అంటున్నారు.  ఓటీఎస్ పథకం ద్వారా రూ. పది, రూ. ఇరవై వేలు కడితే రూ. పది లక్షల విలువైన ఇళ్లకు హక్కులు వస్తాయని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రూ. 8 లక్షల అప్పు వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, సబ్ రిజిస్ట్రార్లతో రిజిస్ట్రేష‌న్లు చేయించడం లేదు. గ్రామ సచివాలయాల్లోనే పంచాయతీ కార్యదర్శలు, వార్డు అడ్మిన్‌లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రభుత్వం మాత్రం వారిని తాత్కాలిక రిజిస్ట్రార్లుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసి.. పత్రాలు పంపిణీ చేస్తామంటోంది. చట్ట ప్రకారం ఇవి ఎంత వరకూ చెల్లుబాటు అవుతాయనే దానిపై స్పష్టత లేదు.  ఇక‌, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా పార్టీ ప్రచార చిత్రాల్లా ఉన్నాయి కానీ.. అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లా లేవంటున్నారు. ఏడు పేజీలు ఉండే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు.. వైసీపీ రంగులతో ఉన్నాయి. జగన్ ఫోటో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఇలాంటి డాక్యుమెంట్ల‌కు చట్టబద్ధత ప్ర‌శ్నార్థ‌క‌మే అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇవి క‌చ్చితంగా చెల్లుబాటు అవుతాయ‌ని గ‌ట్టిగా చెబుతోంది. కానీ, ప్ర‌జ‌ల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అదేదో.. నిబంధనలకు అనుగుణంగా.. స్టాంప్‌ డాక్యుమెంట్లతో, సబ్ రిజిస్ట్రార్లతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తే పేదల్లో నమ్మకం ఉంటుంది అంటున్నారు. జ‌గ‌న‌న్న‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదంటున్నారు. మ‌రోవైపు టీడీపీ మాత్రం ప్ర‌జ‌లెవ‌రూ ఓటీఎస్ క‌ట్టొద్ద‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చాక పేద‌లంద‌రికీ ఉచితంగా రిజిస్ట్రేష‌న్లు చేసిస్తామ‌ని ప్ర‌చారం చేస్తోంది.   

MCRHRDలో అడ్డగోలు నియామకాలు! హైకోర్టులో కాంగ్రెస్ నేత పిల్..   

తెలంగాణలో ప్రభుత్వ రూల్స్ ను అమలు చేయరా? నియామకాలను ఇష్టారాజ్యాంగా చేపడుతారా? అంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న నియామకాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు విరుద్దంగా ఎంసీహెచ్ఆర్డీలో నియామకాలు చేపట్టారంటూ ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. అక్రమ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ పిటిషన్ లో పొందు పరిచారు బక్కా జడ్సన్.  తెలంగాణలో 65 సంవత్సరాలకు పైబడిన వారికి  ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేదంటూ  2015 ఫిబ్రవరి 2న  GO Ms NO.55 ద్వారా ఆర్థిక శాఖఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు  కన్సల్టెంట్లుగా లేదా సలహాదారులుగా లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేదు. కాని గతంలో ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్దంగా MCRHRDలో నియామకాలు చేపట్టారు. గతంలో వివిధ శాఖల్లో పని చేసి పదవీ విరమణ పొందిన ముగ్గురు వ్యక్తులను ముఖ్యమైన పోస్టులలో నియమించారు. ఈ నియామకాలపైనే బక్కా జడ్సన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. MCRHRDలో నియామకాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు బక్కా జడ్సన్. MCRHRD డైరెక్టర్ జనరల్ పి.ప్రకాష్ రావును నియమించారు. డైరెక్టర్ ఆఫ్ ఫెసిలిటీస్ డీన్ గా డా.గౌతమ్ పింగిల్ తో పాటు  డా.ప్రొఫెసర్అబ్బాస్ అలీని నియమించారు. వీళ్లకు జీతాలు కూడా భారీగానే ఇస్తున్నారు. అయితే వీళ్ల ముగ్గురి వయసు 65 సంవత్సకాలు పైనే. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్దమని తన పిటిషన్ లో బక్కా జడ్సన్ వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక వాళ్లంతా రోడ్లపై తిరుగుతున్నారని.. కాని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మాత్రం అక్రమంగా నియమాకాలు చేపట్టారని తెలిపారు బక్కా జడ్సన్. పబ్లిక్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయవచ్చని, కాని అక్రమంగా వయసు పైబడిన వారిని నియమించుకున్నారని చెప్పారు.   MCRHRDలో నియమించబడిన ముగ్గురి వివరాలను కూడా ఆర్టీఐ ద్వారా సేకరించారు బక్కా జడ్సన్. ప్రకాష్ రావు హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా మాత్రమే చదివారని తన పిటిషన్ లో పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ టూరిజం నుండి జనరల్ మేనేజర్ గా ఆయన రిటైర్ అయ్యారని చెప్పారు. అయినా ప్రకాశ్ రావు కీలక పోస్టు అప్పగించడంతో పాటు 70 వేల వేతనం, 30 వేల రూపాయల ఇన్సెంటివ్ తో పాటు కారును కూడా సంస్థే ప్రొవైడ్ చేసిందని తెలిపారు. డాక్టర్ గౌతమ్ పింగిల్ నెలవారీ జీతం లక్షన్నరగా ఉందన్నారు. ప్రొఫెసర్ అబ్బాస్ అలీకి 70 వేల వేతనంతో పాటు ఇతరత్రా అలవెన్సులు కూడా ఇస్తున్నారని చెప్పారు జాన్సన్. ఈ పదవీ విరమణ పొందిన అధికారులు నిర్వహిస్తున్న మూడు పోస్టులు ఎవరికైనా ఇవ్వవచ్చని తన పిటిషన్ లో చెప్పారు జడ్సన్. MCRHRDలో కీలకమైన పోస్టులను తెలంగాణ వ్యక్తులకు కాకుండా ఇతరులకు ఇవ్వడంపైనా జాన్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాష్ రావుకు అనుకూలంగా జారీ చేసిన రెండు నియామక పత్రాలను పిటిషన్ లో అందించారు జాన్సన్. MCRHRDI డైరెక్టర్  సంస్థను తన ఆధీనంలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నియామకాలు అడ్డగోలుగా చేపడుతున్నారని జాన్సన్ ఆరోపించారు. ప్రకాశ్ రావుకు ఇచ్చిన  డైరెక్టర్ ఫెసిలిటీ పోస్ట్ మంజూరు చేయబడిన పోస్ట్ కాదని.. కొత్తగా స్పష్టించి ఇచ్చారని తెలిపారు. కొత్తగా పోస్టును క్రియేట్ చేసి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని ఎలా నియమించారని ప్రశ్నించారు.     

అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా.. అధికారుల పరేషాన్! 

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. అయినా ఆయన రోడ్డెక్కారు. పార్టీ నేతలు, అనుచరులతో కలిసి రోడ్డుపై ధర్నాకి దిగారు. ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ధర్నా చేయడంతో పోలీసుల టెన్షన్ పడ్డారు. ఆయనను అక్కడి నుంచే తరలించేందుకు శ్రమించారు.  వివరాల్లోకి వెళితే..  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రోడ్డుపై ధర్నాకి దిగారు.  అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే.  ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహ భూమి పూజ చేశారు. తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం తొలగించిన అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యేతో పాటు వందలాది ఆయన అనచురులు, టీఆర్ఎస్ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. జాతీయ రహదారి కోసం తొలగించిన విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  జాతీయ రహదారి నిర్మాణం కోసం రోడ్డుపై ఉన్న అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను తొలగించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య  అన్నారు. విగ్రహాలను తొలగించి నాలుగేళ్లు గడుస్తున్నా వాటి పునరుద్ధరణపై దృష్టి పెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా జాతీయ రహదారి విస్తరణ అధికారులు స్పందించి జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి నాటికి విగ్రహాలను ప్రతిష్టించాని డిమాండ్ చేశారు.

పేదల మెడకు ఉరితాళ్లు.. ఓటీఎస్‌పై చంద్రబాబు మండిపాటు..

ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? అని ప్రశ్నించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌కు అలవాటైందని.. తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భ‌య‌పెడుతున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఎన్టీఆర్ హయాంలోనే పేదలకు పక్కా ఇళ్ల పధకం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. 56 లక్షల 69 వేల మంది ఇళ్ల యజమానుల నుంచి రూ. 10 వేలు, రూ. 20 వేలు కట్టించుకునే పని మొదలు పెట్టారని, ఓటీఎస్ కోసం ఒత్తిడి లేదు అనేది పచ్చి అబద్ధమన్నారు. ఓటీఎస్‌కు అంగీకరించకపోతే అన్ని పధకాలు నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్న ఫోన్ కాల్ వాయిస్‌లను చంద్రబాబు వినిపించారు. ఇచ్చిన మాట తప్పిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. బాబాసాహెబ్‌కు నివాళులర్పించారు చంద్రబాబు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెట్టాలని ఆనాడు నిర్ణయించామన్నారు. రాజధానిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మారక నిర్మాణానికి ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. అలాంటి ప్రాజెక్టును జగన్ సర్కార్ పక్కన పెట్టేసిందని విమర్శించారు. రాజధానిలో అంబేద్కర్ స్మారక ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

రఘురామ వర్సెస్ వైసీపీ.. లోక్‌సభలో డైలాగ్ వార్‌..

ఎంపీ ర‌ఘురామ ప్ర‌శ్నించారు. లోక్‌స‌భ‌లో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ వైఖ‌రిని నిల‌దీశారు. నిజం మాట్లాడితే ఎవ‌రికైనా ఉలుకెక్కువ అంటారుగా.. అలానే జ‌రిగింది. ర‌ఘురామ వ్యాఖ్య‌ల‌పై లోక్‌స‌భా ప‌క్ష నేత మిథున్‌రెడ్డి కౌంట‌ర్లు వేశారు. ప‌ర‌స్ప‌రం సీబీఐ కేసులనూ త‌వ్వుకున్నారు. అలా అలా స‌భ‌లో ఆ ఇద్ద‌రు వైసీపీ నేత‌ల మ‌ధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో న‌డిచింది. ఎవ‌రూ త‌గ్గ‌క‌పోవ‌డంతో.. మాట‌ల యుద్ధం పీక్స్‌కు చేరింది. ఇంత‌కీ లోక్‌స‌భ‌లో అస‌లేం జ‌రిగిందంటే.... అమ‌రావ‌తి రైతుల మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పించడాన్ని జీరో అవర్‌లో ఎంపీ రఘురామ లేవ‌నెత్తారు. గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని.. అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని రఘురామ త‌ప్పుబ‌ట్టారు. శాంతి భద్రతలు క్షీణించాయని.. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ర‌ఘురామ స‌భ దృష్టికి తీసుకొచ్చారు.  అయితే, రఘురామ ప్రసంగాన్ని  వైసీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి విమ‌ర్శించారు. రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.  మిథున్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు అంతే స్ట్రాంగ్‌గా కౌంట‌ర్ ఇచ్చారు ర‌ఘురామ‌. తన మీద‌ రెండు సీబీఐ కేసులు మాత్ర‌మే ఉన్నాయని.. సీఎం జగన్‌ పైన వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఎంపీ రఘురామ అన‌డంతో వైసీపీ స‌భ్యులు ఇర‌కాటంలో ప‌డ్డారు. ఇలా, లోక్‌స‌భ‌లో ర‌ఘురామ వ‌ర్సెస్ మిథున్‌రెడ్డి ఎపిసోడ్ కాసేపు హాట్ హాట్‌గా కొన‌సాగింది. 

ముందస్తు ఎన్నికలతో మెరుపు దాడి .. పీకే ప్లాన్ అదేనా ?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్డంవుతున్నారా? ఐదేళ్ళు పూర్తయ్యే వరకు ఆగితే, ఇక ఆ తర్వాత పోటీ చేయడమే అనవసరమనే నిర్ణయానికి వచ్చారా?  విపక్షాలకు  సమయం ఇవ్వకుండా ఎన్నికలకు వెళితేనే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని, పీకే (ప్రశాంత్ కిశోర్) సలహా ఇచ్చారా? ఆ సలహా మేరకు ... వచ్చే మార్చిలో బడ్జెట్ ప్రవేశశ పెట్టి ఆ వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ రెడ్డి సిద్దమవుతున్నారా?అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు, ఫోర్త్ ఎస్టేట్ పండితులు.  జగన్ రెడ్డి ప్రభుత్వం ఓటు బ్యాంకును నిలుపుకేందుకు నవరత్నాలను నమ్ముకుని, అనుసరించిన తప్పుడు విధానాలు, రెండున్నరేళ్ళకేసర్కార్ మెడకు గుదిబండగా మారాయి. మరో వంక ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పేద ప్రజల వరకు అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత దినదినాభివృద్ధి చెందుతోంది. ఇలా  పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా ఇంకా పెరిగి కొంప ముంచక ముందే ఇల్లు చక్క పెట్టుకునే  ఆలోచనలతో ముఖ్యమంత్రి  అడుగులు వేస్తున్నారని, మూడు రాజధానుల రద్దు నిర్ణయం మొదలు ఇటీవల ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అదే సూసుచిస్తోందని, విశ్లేషకులు అంటున్నారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా పట్టాలు తప్పింది. అప్పుల కుప్ప కొండలా పెరిగి పోతోంది. రెండున్నరేళ్ళ పాలనలో జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడున్నర లక్షల కోట్ల అప్పుచేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెత్తిన ఐదున్నర లక్షల రూపాయల అప్పు ఉందని లెక్కలు చెపుతున్నాయి. అంతే కాదు ఇలా అడ్డగోలుగా, పరిమితులను దాటి చేసిన అప్పులకు, రూ.60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టింది. ఇక కుదువ పెట్టేందుకు అనువైన ఆస్తులు లేవు ... అప్పులు పుట్టే మార్గం లేదు.మరో వంక అప్పు పుట్టనిదే పూట గడిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచింది ... ట్రూఅప్’ పేరిట అదనపు వడ్డన విదించింది. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచింది. ఇక మద్యం రేట్ల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. అలాగే జనలా కళ్ళకు గంతలు కట్టి, జేబులకు కత్తెరలు వేస్తూనే ఉంది. ఇవేవీ చాలావన్నట్లుగా, కొత్తగా, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ ఒకటి తెచ్చింది. 1983 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు కట్టించి ఇచ్చిన 40 లక్షల  ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీపీ) ఫిక్స్ చేసింది. గ్రామాల్లో ఇంటికి రూ. 10.000 వేలు, పట్టణాల్లో రూ.15000 నగరాల్లో రూ.20,000 చెల్లించాలని ‘పెడల్ మెడ మీద కట్టి పెట్టింది. ఒకే సారి, రూ. 6000 కోట్ల రూపాయాలను కాజేసే పథకాన్ని తెచ్చింది. ప్రభుత్వ  ఉద్యోగులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు టార్గెట్లు ఫిక్స్ చేసి జనం జేబులు కొట్టేందుకు సిద్దమయింది. ఇలా ఎన్నిరకాలుగా, జనం నడ్డి విరిచినా ఖజానాలో కాసులు నిలవడం లేదు. నవరత్నాలు, ఓటు బ్యాంకు పథకాలు ఖజానాలో పడిన పైసాను పడినట్లుగానే  మింగేస్తున్నాయి. ఈనేపధ్యంలో ఇక ప్రభుత్వాన్ని నడపడం అయ్యేపని కాదని జగన్ రెడ్డికి అర్థమై పోయింది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే, సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలను జనంలో ఉండాలని, ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించినట్లు సమాచారం.మరో వంక పీకే టీమ్, ఇప్పటికే రంగంలోకి దిగి పని మొదలు పెట్టింది. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం ముందు  వైసీపీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. అయితే, ఎన్నికలను ఎదుర్కునేందుకు, ప్రతిపస్ఖాలు కూడా అంత సన్నద్ధంగా లేవు. ఇలా ప్రతిపక్షాలు ఎన్నికలకు సన్నద్ధంగా లేక పోవడం ఒక్కటే, అధికార ప్రభుత్వానికి దింపుడు కళ్ళెం ఆశగా కనిపిస్తోందని అంటున్నారు అంటున్నారు.అందుకే, ఆ దింపుడు కళ్ళెం ఆశకూడా కరిగి పోకముందే ముందస్తు ఎన్నికలతో మెరుపు దాడి చేయాలని పీకే ఇచ్చిన సలహాకు ముఖ్యమంత్రి ఓకే అన్నారని, ముందస్తుకు వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారని, అందుకే రూట్ మార్చి జనంలోకి వెళ్లేందుకు జగన్ రెడ్డి  సిద్డమవుతున్నారని అంటున్నారు.  

ఈటల రాజేందర్ కు షాక్.. జమునా హేచరీస్ భూకబ్జా నిజమేనన్న కలెక్టర్ 

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాక్ తగిలింది. ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని చెప్పారు. హకీంపేట, అచ్చంపేట పరిధిలో 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సర్వేలో వెల్లడయిందని జిల్లా కలెక్టర్ అన్నారు. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసిందని చెప్పారు.  అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారని, పెద్దపెద్ద షెడ్లను నిర్మించారని మెదక్ కలెక్టర్ వెల్లడించారు. జమునా హేచరీస్ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లను నరికి రోడ్లు వేశారని చెప్పారు. హేచరీస్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని తెలిపారు.  ఈటలకు చెందిన జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసింది నిజమేనని జిల్లా కలెక్టర్ చెప్పడంతో.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఈ భూముల వ్యవహారంలోనే రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. తర్వాత ఈటల టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజురాబాద్ కు జరిగిన ఉప ఎన్నికలో అద్బుత విజయం సాధించి కేసీఆర్ కు షాకిచ్చారు. 

వంశీని వాడుకొని వ‌దిలేశారా? వ‌ల్ల‌భ‌నేనికి వైసీపీ హ్యాండ్ ఇచ్చేసిందా?

ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి మా పార్టీకి సంబంధం లేదు. భువ‌నేశ్వ‌రికీ, చంద్ర‌బాబుకు ఆయ‌న చెప్పిన క్ష‌మాప‌ణ‌ల‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యేలు అంబ‌టి రాంబాబు, రాచ‌మ‌ల్లు శివప్రసాద్ రెడ్డిలు చేసిన వ్యాఖ్య‌లు ఇవి. టీడీపీ ఎమ్మెల్యే వంశీని అన‌ధికారికంగా వైసీపీలో చేర్చుకొని.. ఇన్నాళ్లూ ఆయ‌న‌తో అంట‌కాగిన వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు భువ‌నేశ్వ‌రి ఎపిసోడ్ ర‌చ్చ కావ‌డంతో.. ఆ త‌ప్పంతా వంశీపై తోసేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టున్నారు. వంశీ మా పార్టీ కాదంటూ.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో సంబంధం లేదంటూ కొత్త డ్రామా తెర‌పైకి తీసుకొస్తున్నార‌ని అంటున్నారు. వంశీ మేట‌ర్‌తో పార్టీకి ఇప్ప‌టికే తీవ్ర డ్యామేజ్ జ‌ర‌గ్గా.. తాజాగా న‌ష్ట‌నివార‌ణ ప్ర‌య‌త్నాల్లో భాగంగా త‌ప్పంతా వ‌ల్ల‌భ‌నేనిదే అన్న‌ట్టు వంశీని క‌రివేపాకులా వాడుకొని వ‌దిలించుకోవాల‌నేది అధికార పార్టీ ప‌న్నాగంలా కనిపిస్తోంద‌ని భావిస్తున్నారు. అంబ‌టి, రాచ‌మ‌ల్లు కామెంట్లు అందులో భాగ‌మేన‌ని అంటున్నారు.  భువ‌నేశ్వ‌రి పేరుతో మొద‌ట నిప్పు రాజేసింది వ‌ల్ల‌భ‌నేని వంశీని. ఆ నిప్పును స‌భ‌లో పొగ వ‌చ్చేలా మ‌రింత రాజేసింది మాత్రం అంబ‌టి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు. ఆ నిప్పును చంద్ర‌బాబు త‌న క‌న్నీళ్ల‌తో ఆర్పేయ‌డం.. నంద‌మూరి కుటుంబం వైసీపీ నేత‌ల‌ను దోషిగా నిల‌బెట్ట‌డంతో ప్ర‌జ‌ల్లో, మ‌హిళ‌ల్లో వైసీపీ నేత‌ల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పార్టీకి తీవ్ర న‌ష్టం చేకూర్చాయి. ఇదేదో తేడా కొట్టింద‌ని భావించిన వైసీపీ నాయ‌కులు.. ఇక అప్ప‌టి నుంచి ఆ విష‌యంపై మాట్లాడ‌టం మానేశారు. అయినా, ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు త‌గ్గ‌క‌పోవ‌డంతో.. ఓ టీవీ డిబేట్‌లో వంశీతో క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు. ఇష్యూను కాస్త కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.  ఇంత రచ్చ జరిగిన తర్వాత వల్లభనేని వంశీ వైసీపీతో కొనసాగితే.. రానున్న ఎన్నికల్లో మహిళా ఓట్లు గల్లంతు కావడం త‌ప్ప‌ద‌ని జగన్ అండ్ కో లెక్కేస్తోంది. అందుకే, వల్లభనేనిని ఫ్యాన్ గాలికి దూరం చేసేలా.. పొమ్మనకుండా పొగ పెట్టేలా ఉండేలా జ‌గ‌న్‌రెడ్డి స్కెచ్ వేశార‌ని అంటున్నారు. అందులో భాగంగానే సీఎం సొంత జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఆగమేఘాల మీద రంగంలోకి దించి.. వల్లభనేని వంశీ తమ పార్టీ ఎమ్మెల్యే కాదని.. టీడీపీ ఎమ్మెల్యే అంటూ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.  ఎలాగూ వంశీ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు కాబ‌ట్టి.. భువ‌నేశ్వ‌రిపై చేసిన ఆరోప‌ణ‌లు పాపాన్ని పూర్తిగా వంశీపైనే తోసేసేలా ఎత్తుగ‌డ‌ వేశారు వైసీపీ నేత‌లు. టెక్నిక‌ల్‌గా వంశీ టీడీపీ ఎమ్మెల్యే కావ‌డమే ఇందుకు కార‌ణ‌మంటున్నారు. భువ‌నేశ్వ‌రి శాపం పార్టీకి త‌గ‌ల‌కుండా వ‌ల్ల‌భ‌నేనిని సేఫ్ గార్డ్‌గా వాడుకుంటున్నట్టు ఉన్నారు. వంశీతో మాత్ర‌మే సారీ చెప్పించి.. అంబ‌టి, కొడాలి, ద్వారంపూడిలు ఇక ఆ మేట‌ర్‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేదంటూ సైడ్ అయిపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి వెల్లువెత్తుతున్న జ్వాలాగ్నికి వ‌ల్ల‌భ‌నేని వంశీని బ‌లిప‌శువు చేశారు. తాజాగా, వంశీకి మా పార్టీతో సంబంధం లేద‌ని.. ఆయ‌న చెప్పిన క్ష‌మాప‌ణ‌ల‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. భువ‌నేశ్వ‌రి ఎపిసోడ్‌లో వైసీపీకి అంటిన మ‌కిలీని వంశీతో క‌డిగేసుకునే స్కెచ్ వేసింద‌ని అంటున్నారు. ఈ వ్య‌వ‌హారంలో వ‌ల్ల‌భ‌నేని వంశీనే బ‌క‌రా అయ్యార‌ని.. అంబ‌టి, కొడాలి, ద్వారంపూడిలు తాము జారుకున్నామ‌ని అనుకుంటున్నారు కానీ.. ప్ర‌జ‌ల దృష్టిలో మాత్రం ఆ న‌లుగురు ఎప్ప‌టికీ దోషులేన‌నే విష‌యం మ‌ర్చిపోతున్న‌ట్టున్నారని మండిప‌డుతున్నారు.  భువనేశ్వరి కాళ్లను కన్నీళ్లతో కడుగుతానన్న వైసీపీ ఎమ్మెల్యే 

పసుపు రంగు మాయం.. శిల్పా కేసులో ట్విస్ట్.. గ్రేట్ విక్టరీ.. 

కడప జిల్లా కమలాపురం, బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కడప జిల్లా కమలాపురం, నెల్లూరు జిల్లా బుచ్చి మున్సిపల్ ఎన్నికలపై.. ఆ జిల్లాకు చెందిన నేతలతో  చంద్రబాబు సమీక్షించారు. ఇటీవల జరిగిన ఎన్నికలపై అభ్యర్థులు, నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు . --- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగును మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు. -------- అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 36వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం వెంగమాంబపురం నుంచి మహా పాదయాత్ర ప్రారంభమైంది. బంగారుపేట మీదుగా వెంకటగిరికి చేరుకోనుంది. రాజధాని రైతులకు సంఘీభావంగా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి రథానికి పూజలు చేసి, మంగళహారతులు ఇచ్చి, రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు.  ------ నిత్య చైతన్య మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పవన్ ఆయనను స్మరించుకున్నారు. ‘‘నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్. రాజ్యాంగంలో ఆయన కల్పించిన పౌర హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయి. అంబేద్కర్ గారు చూపిన మార్గంలోనే జనసేన ప్రస్థానం కొనసాగుతుంది’’ అని పవన్ చెప్పారు.  ----- అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ ఒక్క ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాదన్నారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గ్రామాల్లో భూమి అమ్మే వాళ్ళు లేరని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.  ------- తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన శిల్పా చౌదరి కేసులో  రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకొస్తోంది.కోట్ల రూపాయలు వసూలు చేసి మోహం చాటేశారు శిల్పా దంపతులు. వసూలు చేసిన కోట్ల రూపాయలను ఎక్కడ, ఏం చేసిందన్నదాని పై ప్ర‌స్తుతం విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు నాలుగు అకౌంట్లు గుర్తించినా.. ఆ అకౌంట్లో కేవలం వేలల్లోనే నగదు ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో నగదును ఎక్కడికి తరలించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు.  ---------- అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కోడిపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతకు చెందిన కారు ఢీకొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయపడ్డారు. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కోడిపల్లి సమీపంలో వైసీపీ నేతకు చెందిన కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  --- హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్‌లోని రోడ్ నెంబర్ 2లో అర్థరాత్రి సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంగా కారు నడిపి ఇద్దరిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఎవరిది? కారు నడిపిన వ్యక్తులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ------ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధియా విశ్వాస ఘాతుకుడని అన్నారు. సింధియాకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇచ్చిందని... అయినప్పటికీ పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరారని మండిపడ్డారు. డబ్బు ఇచ్చి తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెంట తీసుకెళ్లారని విమర్శించారు. ద్రోహులను చరిత్ర క్షమించదని డిగ్గీ అన్నారు. ----- న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు  372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. నాలుగవ రోజు ఆటలో జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు. టెస్టుల్లో పరుగల పరంగా భారత్‌కిది అత్యంత భారీ విజయం. 

వందల కోట్లలో మోసం.. అకౌంట్లలో కేవలం 4 వేలు! పోలీసులకు సవాల్ గా శిల్పా చౌదరి కేసు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన శిల్పా చౌదరి కేసులో  రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకొస్తోంది. కీలక మలుపులు తిరుగుతోంది. ఆమె మోసాల బాధితుల లిస్ట్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా శిల్ప వర్సెస్‌ రాధికారెడ్డి ఇష్యూ నడుస్తోంది. ఇప్పటికే రెండ్రోజుల పాటు శిల్పను విచారించిన పోలీసులు.. రాధికారెడ్డిని విచారించనున్నారు. అటు  శిల్పాచౌదరిని కూడా మరోసారి కస్టడీకీ తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉప్పర్‌పల్లిలో సోమవారం కస్టడీ పిటిషన్‌ వేశారు. రాధికారెడ్డికి కోట్ల రూపాయలు ఇచ్చానని శిల్ప చౌదరి చెబుతుంటే..  శిల్పనే తనను మోసం చేసిందని అంటోంది రాధికారెడ్డి. ఆధారాలతో సహా శిల్ప మోసాలను పోలీసుల ముందు బయటపెడతానంటోంది. దీంతో అసలేం జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  శిల్పా బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్న‌ట్లు పోలీసులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే సీజ్ చేసిన శిల్పా ఫోన్ నుండి పలు నెంబర్ల గుర్తించారు పోలీసులు. శిల్పా బాధితుల్లో ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులు ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులను వసూలు చేసిన శిల్పా… అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పేరుతో వసూలు చేసింది.కోట్ల రూపాయలు వసూలు చేసి మోహం చాటేశారు శిల్పా దంపతులు. వసూలు చేసిన కోట్ల రూపాయలను ఎక్కడ, ఏం చేసిందన్న దాని పై ప్ర‌స్తుతం విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు నాలుగు అకౌంట్లు గుర్తించినా… ఆ అకౌంట్లో కేవలం వేలల్లోనే నగదు ఉన్న‌ట్లు గుర్తించారు. శిల్ప అకౌంట్లను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. వసూలు చేసిన కోట్ల రూపాయల పైనే దృష్టి సారించారు. ఆ డబ్బుతో ఏం చేసింది.. ఎక్కడైనా బిజినెస్‌పెట్టిందా.‌.. లేక భూములు కొనుగోలు చేసిందా అన్న అంశాలపైనే నిఘా పెట్టారు పోలీసులు.  తమ దగ్గరి నుండే కోట్ల రూపాయలు తీసుకుందంటూ శిల్పా పై ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. అయితే ఈ కేసులో మరి కొంత మందిని విచారించే అవకాశం ఉంది.  శిల్ప చౌదరి మోసాలు  చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి బడా బాబుల దగ్గర కోట్లలో డబ్బులు లాగేసింది. కిట్టి పార్టీలు ఫేజ్ త్రీ పార్టీలతో ఆమె తమ పని కానిచ్చిందియ ఆమె విలాసవంతమైన జీవితం చూసి  నమ్మేసిన కొందరు ప్రముఖులు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నారు. తీరా అధిక వడ్డీ కాదు కదా.. అసలు కూడా తిరిగిరాకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కట్టారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సియర్స్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా వీరి బాధితుల లిస్ట్‌లో ఉన్నారు. అయితే ఆమె బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, బ్లాక్ మనీ ఇవ్వడంతో కొందరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని అనుమానిస్తున్నారు. 

హే అన్న‌మ‌య్యా.. ఇంత వైఫ‌ల్య‌మా?

వాన కురిసింది. వ‌ర‌ద ముంచెత్తింది. ప్రాజెక్టు నిండింది. ఇంత వ‌ర‌కూ సాధార‌ణమే. ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. విప‌త్తా? వైఫ‌ల్య‌మా? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. ఎగువ నుంచి అన్న‌మ‌య్య ప్రాజెక్టును వ‌ర‌ద ముంచెత్తుతున్నా కొద్దీ.. దిగువ‌కు అదే స్థాయిలో నీళ్లు వ‌ద‌లాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ప్రాజెక్టు నిండి డ్యాం కొట్టుకుపోయే వ‌ర‌కూ దోబూచులాడారు. గేట్లు ఎత్తాల‌నే చిన్న లాజిక్ అధికారులు ఎలా మిస్ అయ్యారు? పైనుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఇసుక లారీల కోస‌మే గేట్లు ఎత్త‌కుండా విల‌యానికి కార‌ణ‌మ‌య్యార‌ని చెబుతున్నారు. కేంద్రం సైతం ఈ విష‌యంలో ఏపీని గ‌ట్టిగా నిల‌దీస్తుండ‌టంతో జ‌ల విషాదం.. వివాదంగా మారింది. ఇంత‌కీ అన్న‌మ‌య్య, పింఛ‌ ప్రాజెక్టులో ఆ రోజు అస‌లేం జ‌రిగింది...?   అన్న‌మ‌య్య ప్రాజెక్టు కొట్టుకుపోయి.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం జ‌రిగింద‌ని అధికారులు అంటున్నారు. సామర్థ్యానికి మించిన వరదతో డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే పెను ప్రమాదానికి కారణమని జ‌ల‌వ‌న‌రుల నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరదల సమయంలో చూపించాల్సిన అప్రమత్తత విషయంలో వైఫ‌ల్య‌మే కార‌ణమ‌ని చెబుతున్నారు.  అన్నమయ్య జలాశయాన్ని ఖాళీ చేసే విషయంలో, గేట్లు ఎత్తే విషయంలో జలవనరులశాఖ అధికారులకు.. రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం కనిపించింది. ప్రవాహాల తీరుపై రెవెన్యూ అధికారులకు వర్తమానం పంపామని, ముందస్తు అనుమతి లేకుండా జలాశయాలు ఖాళీ చేయొద్దని మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ అధికారుల అనుమతి కోసం ఎదురు చూశామని జ‌ల వ‌న‌రుల శాఖ అధికారులు అంటున్నారు. అందుకే, సకాలంలో ప్రాజెక్టు ఖాళీ చేసేందుకు నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిందంటున్నారు.  అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులకు గతేడాది నవంబరులో వచ్చిన వరదలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నమయ్యలో అయిదో గేటు పని చేయట్లేదు. మరమ్మతు పనుల కోసం రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా, నిధులు మంజూరు కాలేదు. ఆ పాపం ఇప్పుడు శాపంగా మారిందని అనుమానిస్తున్నారు.  అన్నమయ్య జలాశయంలో నవంబరు 18 రాత్రి 8.30 సమయంలో 1.590 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఒక గేటు పని చేయకపోయినా 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపవచ్చు. మూడు రోజులు అతిభారీ వర్షాలని ప్రభుత్వమే చెబుతోంది. 87,296 క్యూసెక్కుల ప్రవాహాలు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. మరి ఆ సమయంలో 1.20 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? అదేరోజు అర్ధరాత్రి ప్రాజెక్టులో నీటి నిల్వ 1.805 టీఎంసీలకు పెరిగింది. మరోవైపు ప్రాజెక్టులోకి 1.71లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుంటే 1.46 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? భారీ వరద వస్తున్నప్పుడు జలాశయంలో నీటి నిల్వ పెంచేలా ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చేయడం ఏమిటి? ఆ తర్వాత రెండు మూడు గంటలకు కట్ట కొట్టుకుపోతే దీన్ని ప్రకృతి విపత్తు అనాలా? ప్రాజెక్టు నిర్వహణలో లోపం అనాలా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారుల వాద‌న‌:  కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడంతో, ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాజెక్టులకు ప్రమాదం సంభవించింది.    నిపుణుల మాట‌:  మూడు రోజులు అతి భారీవర్షాలు కురిశాయని ప్రభుత్వమే చెబుతోంది. అన్నమయ్య జలాశయానికి పైన బాహుదా, పింఛ, మాండవ్య మీదుగా నీటి ప్రవాహాలుంటాయి. ఆ మూడు కలిసిన చెయ్యేరు మీదే అన్నమయ్య జలాశయం ఉంది. అతి భారీవర్షాల వల్ల వరద వస్తుందని ఇంజినీరింగు అధికారులు అంచనా వేయగలరు. ఆ పరీవాహకంలో ఎక్కడ ఎంత వర్షం పడిందో లెక్కలూ అందుబాటులో ఉంటాయి. భారీవర్షాలు ప్రారంభమైన మూడోరోజు అర్ధరాత్రి తర్వాత రెండు జలాశయాల కట్టలు తెగాయి. అన్నమయ్య జలాశయంలో నిల్వ ఉన్న 1.590 టీఎంసీల నీటిని ముందే ఖాళీ చేసి వరద నీటిని నింపేందుకు సిద్ధంగా ఉండాలి కదా? అలా ఎందుకు చేయలేదన్నది జలవనరుల నిపుణుల ప్రశ్న. అనిల్ కుమార్ కు అన్నమయ్య సెగ.. కేంద్రం యాక్షన్ తప్పదా? 

వరి వద్దు పత్తి ముద్దు..  తెరాస సర్కార్ కొత్త మంత్రం 

చివరాఖరుకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డికుండ బద్దలు కొట్టారు. యాసంగిలో వరి సాగు చేస్తే ప్రభుత్వం కొనదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఆఫ్కోర్సే ఇప్పటికే, ప్రభుత్వ పెద్దలు వరి వేస్తే ఉరే’ అని తేల్చి చెప్పారు అనుకోండి. అయినా, ఇప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి మరో మారు మరింత ‘ఘట్టి’గా  అదే విషయం చెప్పారు. ఇంత చెప్పినా వినకుండా రైతులు వరి సాగు చేస్తే అందుకు రైతులే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పండిన పంటను ప్రభుత్వం కొనక పోతుందా, అనుకుంటే నష్టపోక తప్పదని హెచ్చరిక కూడా చేశారు. మిల్లర్లతో ముదస్తూ ఒప్పందం  ఉన్నరైతులు మాత్రమే వరి వేయాలన్నారు. రైతులు కేంద్రాన్ని నమ్మి యాసంగిలో వరి వేస్తే నిండుగా మునుగడం ఖాయమని, కేంద్రానిది తడిబట్టతో గొంతుకోసే విధానమని ఆరోపించారు.  బాగుంది. కేంద్రానికి తడిగుడ్డతో గొంతు కోసే విధానమే కావచ్చును. కేంద్రం మీద నమ్మకం లేకనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వరి వద్దన్నారని అనుకుందాం. మరి యాసంగిలో రైతులు ఏ పంటలు వేయాలి, ఏ పంటలు పండించాలి? అంటే దానికి కూడా, మంత్రి నిరంజన్ రెడ్డి ముచ్చటైన సమాధానమే ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, ఏ విధంగా అయితే,శాసన సభ సాక్షిగా లెక్కలు చెప్పి మరీ ,60 లక్షలు 80ల క్షలు కాదు కోటి ఎకరాల్లో వరి సాగు చేసినా ‘ఐ యామ్ హ్యాపీ.’ .చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని బల్ల గుద్దారో అంతకంటే గట్టిగా మంత్రి నిరంజన్ రెడ్డి 80 లక్షల నుంచి కోటి ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలని రైతులకు సూచించారు. అంతే కాదు, అప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వరిసాగుకున్న ఉజ్వల భవిష్యత్, వరి రైతుల బంగారు భవిష్యత్ గురించి ఎలాగైతే బ్రహ్మాండ ఉపన్యాసం ఇచ్చారో .. ఎంత చక్కటి భరోసా ఇచ్చారో, పత్తి రైతు బంగారు భవిష్యత్ గురించి వ్యవసాయ మంత్రి అంతే చక్కటి భరోసా ఇచ్చారు.  ఇప్పుడు  పత్తి  కనీస మద్దతు ధర కన్నా రూ.3వేల వరకు ఎక్కువ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పత్తిని కొంటోందన్నారు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పత్తికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉందని, ఎంత పంట వచ్చినా కొనే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. సీసీఐ కొనుగోలు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధర ఇచ్చి పత్తిని కొంటుందని చెప్పారు. అయితే వరి (బియ్యం) కానీ, పత్తి కానీ, ఏదైనా చివరకు కొనవలసింది, కేంద్ర ప్రభుత్వం లేదా  కేంద్ర ప్రభుత్వ సంస్థలే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌‌‌‌‌‌‌‌గా మాత్రమే పని చేస్తుంది. ఇదే విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి కూడా,స్పష్టం చేశారు   “ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌‌‌‌‌‌‌‌గానే వ్యవహరిస్తుంది” అని  చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం  కొనేది  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్-సీఐ అయితే,పట్టిని కొనేది కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సీసీఐ). అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే, రేపు సీసీఐ కూడా ఎఫ్సీఐ లానే చేతులు ఎత్తేస్తే , ఎవరిదీ భరోసా, కోటి ఎకరాలలో వరి పండిన కొంటామని ముఖ్యమంత్రి నిండుసభలో ఇచ్చిన హమీకే దిక్కులేనప్పుడు, మంత్రి నిరంజన్ రెడ్డి పత్తి విషయంలో ఇస్తున్న హామీని నమ్మేదేలా, అని రైతులు ప్రశ్నిస్తున్నారు.  మరో వంక పట్టి పంటకు సంబంధించి తెలంగాణ రైతులకు చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. పత్తి రైతులతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల్లో అత్యధిక మంది పట్టి రైతులే ... అని గుర్తుచేస్తున్నారు రైతులు. 

ముంబై టెస్టులో భారత్ రికార్డ్ విజయం.. జయంత్, అశ్విన్ స్పిన్ కు కివీస్ విలవిల.. 

ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు  372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.  నాలుగవ రోజు ఆటవో గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది. నాలుగవ రోజు ఆటలో జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోల్స్‌ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టెస్టుల్లో పరుగల పరంగా భారత్‌కిది అత్యంత భారీ విజయం.  ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన  తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది, కివీస్ బౌలర్ అజాజ్‌ పటేల్‌ 10/119 చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన చేసినా.. మయాంక్‌ అగర్వాల్‌ 150 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 52 పరులుగు చేయడంతో  భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.  అనంతరం న్యూజిలాండ్‌  తొలి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే అలౌటైంది.  ఇది భారత్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్‌. హైదరాబాద్ పేరస్ సిరాజ్‌ 3 వికెట్లతో టాప్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టగా తర్వాత అశ్విన్‌ నాలుగు, అక్షర్‌ పటేల్ రెండు వికెట్లతో మిగతా ఆటగాళ్ల పనిపట్టారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.  రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ స్వల్ప స్కోరుకే ఆలౌటై ఫాలో ఆన్‌లో పడినా.. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ చేసేందుకే మొగ్గుచూపింది. మయాంక్‌  62 పరుగులతో మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడారు. పుజారా  47, శుభ్‌మన్‌ గిల్‌ 47, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 36 పరుగులతో రాణించారు.  చివర్లో అక్షర్‌ పటేల్‌  ధాటిగా ఆడి 41 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.  న్యూజిలాండ్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్‌ఇండియా. అనంతరం రెండో ఇన్నింగ్స్‌  మొదలుపెట్టిన న్యూజిలాండ్‌.. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. అశ్విన్‌ మరోసారి చెలరేగడంతో ఆదివారమే న్యూజిలాండ్‌ సగం పని అయిపోయింది. డారిల్‌ మిచెల్‌  60 పరుగులు, హెన్రీ నికోల్స్‌  44 పరుగులతో కాస్త ప్రతిఘటించడంతో ఆట నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ విజృంభించి గంటలోనే మ్యాచ్‌ను పూర్తి చేశాడు. 

ఎంపీలను పార్లమెంట్ కు వెళ్లొద్దన్న కేసీఆర్... ఎందుకో తెలుసా? 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగు చుట్టే తిరుగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమే చేస్తోంది కేసీఆర్ సర్కార్. ఈ అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. తెలంగాణ పండిన వరి ధాన్యం కొనలేమంటూ కేంద్రం.. రాష్ట్రంపై వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెబుతున్నా కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కౌంటరిస్తున్నాయి. వరి ధాన్యం కొనలేని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. తెలంగాణ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  పార్లమెంట్ సమావేశాల్లో తొలి నాలుగు రోజులు టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలు హైలెట్ అయ్యాయి. వరి ధాన్యం కొనుగోలుపై చేయాల్సిన రచ్చ అంతా చేశారు. కేంద్రంపై కేసీఆర్ కూడా సీరియస్ గా ఉండటంతో రెండో వారం పార్లమెంట్ లో గులాబీ లీడర్లు మరింత దూకుడుగా ఉంటారని అంతా భావించారు. కాని సోమవారం సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ఎంపీల్లో చాలా మంది పార్లమెంట్ కు డుమ్మా కొట్టారు. వరిసాగుపై కేంద్రంతో తాడేపేడో తేల్చుకుంటామని కేసీఆర్ చెప్పగా.. పార్లమెంట్ కు టీఆర్ఎస్ ఎంపీలు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ ఆదేశాలను టీఆర్ఎస్ ఎంపీలు లైట్ తీసుకుంటున్నారా లేక బియ్యంపై పోరాటంలో కేంద్రం పట్టించుకోవడం లేదని వాళ్లు డుమ్మా కొట్టారా అన్నది చర్చగా మారింది.  అయితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కు హాజరుకాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లవద్దని కేసీఆరే సూచించినట్లుగా తెలుస్తోంది. కేంద్రంతో కేసీఆర్ రాజీకి వచ్చి ఇలా చేయలేదట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమట. ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారడటంతో  ఎన్నికలు జరుగుతున్న చోట ఉన్న ఎంపీలు.. ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.  దీంతో నలుగురు ఎంపీలు ఓటర్లతో నిర్వహిస్తున్న క్యాంప్‌లకు వెళ్లారు. ప్రతి ఓటు కీలకం కావడంతో క్రాస్ ఓటింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ లో ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల సభ్యులు గోవా, ఢిల్లీ, బెంగళూరు క్యాంపులకు వెళ్లారు.  ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే వారిలో అసంతృప్తి ఉంది. నిధులు, విధుల విషయంలో వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారింది. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారని చెబుతున్నారు. పోలింగ్ కు మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో పోలింగ్ ముగిసిన తర్వాతే ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.  

సంక్రాంతి తర్వాత పెను గండమే! దేశాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్..  

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్.. కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. డిసెంబర్ 5 నాటికే కొత్త వేరియంట్ దాదాపు 40 దేశాలకు పాకింది. ఒమిక్రాన్ ను మొదట గుర్తించిన సౌతాఫ్రికాలో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్ కేసులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. మన దేశంలోనూ ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మిగిస్తోంది. ఇప్పటికే 21కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. ఇందులో రాజస్థాన్ లో 9, మహారాష్ట్రలో 6, గుజరాత్, ఢిల్లీలో  ఒక్కో కేసు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోజూ ఒమిక్రాన్  రిస్క్ దేశాల నుంచి వందలాది మంది వస్తున్నారు. వాళ్లలో ఇప్పటికే 13 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే వాళ్ల శాంపిల్స్ ను జీనోమ్ టెస్టుకు పంపగా.. ఇక్కడ రిపోర్టులు రాలేదు. ఆ ఫలితాలు వస్తేకాని విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు సోకింది ఒమిక్రానా లేదా మరో వైరస్ అన్నది తేలనుంది.  ఒమిక్రాన్ కు సంబంధించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరి నాటికి పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని తెలంగాణ డీహెచ్  శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నాయన్నారు. ఒకటి, రెండు నెలల్లో భారత్‌లోనూ ఒమైక్రాన్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్‌ గడల పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అర్హులంతా టీకా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పా రు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితా లోని 12 దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌కు 900 మందిపైగా వచ్చారని తెలిపారు. విమానాశ్రయంలో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపామని చెప్పారు. ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయన్నారు. ‘‘ఏ క్షణమైనా ఒమైక్రాన్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు శ్రీనివాస రావు.  ఒమైక్రాన్‌ కేసులను దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు శ్రీనివాస రావు. తప్పుడు ప్రచారంతో వైద్య ఆరోగ్య శాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు.  ప్రభుత్వం కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నదని.. ప్రతి రోగికి చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైరస్‌ వ్యాప్తి పెరిగినా రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ విధించేంతటి ప్రభావం ఉండదని చెప్పారు.. ఒమైక్రాన్‌ సోకినవారిలో ఒళ్లు నొప్పులు, తల నొప్పి, నీరసం ఉంటాయని.. ఈ లక్షణాలున్నవారు దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వేరియంట్‌ తీవ్రతపై అధ్యయనాలు జరుగుతున్నాయని, పూర్తి స్పష్టత వచ్చేందుకు మరో వారం పడుతుందని తెలిపారు. ఒమైక్రాన్‌ ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కేసులు పెరుగుతున్నాయన్నాయని.. కాని ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశమని శ్రీనివాసరావు చెప్పారు.