పేదల మెడకు ఉరితాళ్లు.. ఓటీఎస్పై చంద్రబాబు మండిపాటు..
posted on Dec 6, 2021 @ 1:59PM
ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ పేరుతో బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? అని ప్రశ్నించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్కు అలవాటైందని.. తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భయపెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ హయాంలోనే పేదలకు పక్కా ఇళ్ల పధకం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. 56 లక్షల 69 వేల మంది ఇళ్ల యజమానుల నుంచి రూ. 10 వేలు, రూ. 20 వేలు కట్టించుకునే పని మొదలు పెట్టారని, ఓటీఎస్ కోసం ఒత్తిడి లేదు అనేది పచ్చి అబద్ధమన్నారు. ఓటీఎస్కు అంగీకరించకపోతే అన్ని పధకాలు నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్న ఫోన్ కాల్ వాయిస్లను చంద్రబాబు వినిపించారు. ఇచ్చిన మాట తప్పిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. బాబాసాహెబ్కు నివాళులర్పించారు చంద్రబాబు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెట్టాలని ఆనాడు నిర్ణయించామన్నారు. రాజధానిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మారక నిర్మాణానికి ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. అలాంటి ప్రాజెక్టును జగన్ సర్కార్ పక్కన పెట్టేసిందని విమర్శించారు. రాజధానిలో అంబేద్కర్ స్మారక ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.