ఎంపీలను పార్లమెంట్ కు వెళ్లొద్దన్న కేసీఆర్... ఎందుకో తెలుసా?
posted on Dec 6, 2021 @ 10:04AM
తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగు చుట్టే తిరుగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమే చేస్తోంది కేసీఆర్ సర్కార్. ఈ అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. తెలంగాణ పండిన వరి ధాన్యం కొనలేమంటూ కేంద్రం.. రాష్ట్రంపై వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెబుతున్నా కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కౌంటరిస్తున్నాయి. వరి ధాన్యం కొనలేని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. తెలంగాణ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో తొలి నాలుగు రోజులు టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలు హైలెట్ అయ్యాయి. వరి ధాన్యం కొనుగోలుపై చేయాల్సిన రచ్చ అంతా చేశారు. కేంద్రంపై కేసీఆర్ కూడా సీరియస్ గా ఉండటంతో రెండో వారం పార్లమెంట్ లో గులాబీ లీడర్లు మరింత దూకుడుగా ఉంటారని అంతా భావించారు. కాని సోమవారం సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ఎంపీల్లో చాలా మంది పార్లమెంట్ కు డుమ్మా కొట్టారు. వరిసాగుపై కేంద్రంతో తాడేపేడో తేల్చుకుంటామని కేసీఆర్ చెప్పగా.. పార్లమెంట్ కు టీఆర్ఎస్ ఎంపీలు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ ఆదేశాలను టీఆర్ఎస్ ఎంపీలు లైట్ తీసుకుంటున్నారా లేక బియ్యంపై పోరాటంలో కేంద్రం పట్టించుకోవడం లేదని వాళ్లు డుమ్మా కొట్టారా అన్నది చర్చగా మారింది.
అయితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కు హాజరుకాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. ఎంపీలు పార్లమెంట్కు వెళ్లవద్దని కేసీఆరే సూచించినట్లుగా తెలుస్తోంది. కేంద్రంతో కేసీఆర్ రాజీకి వచ్చి ఇలా చేయలేదట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమట. ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారడటంతో ఎన్నికలు జరుగుతున్న చోట ఉన్న ఎంపీలు.. ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో నలుగురు ఎంపీలు ఓటర్లతో నిర్వహిస్తున్న క్యాంప్లకు వెళ్లారు. ప్రతి ఓటు కీలకం కావడంతో క్రాస్ ఓటింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ లో ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల సభ్యులు గోవా, ఢిల్లీ, బెంగళూరు క్యాంపులకు వెళ్లారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే వారిలో అసంతృప్తి ఉంది. నిధులు, విధుల విషయంలో వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారింది. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారని చెబుతున్నారు. పోలింగ్ కు మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో పోలింగ్ ముగిసిన తర్వాతే ఎంపీలు పార్లమెంట్కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.