ముంబై టెస్టులో భారత్ రికార్డ్ విజయం.. జయంత్, అశ్విన్ స్పిన్ కు కివీస్ విలవిల..
posted on Dec 6, 2021 @ 10:30AM
ముంబైలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్నైట్ స్కోర్తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. నాలుగవ రోజు ఆటవో గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది. నాలుగవ రోజు ఆటలో జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోల్స్ (44) పరుగులతో ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా టెస్టుల్లో పరుగల పరంగా భారత్కిది అత్యంత భారీ విజయం.
ఈ మ్యాచ్లో కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసింది, కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ 10/119 చారిత్రక బౌలింగ్ ప్రదర్శన చేసినా.. మయాంక్ అగర్వాల్ 150 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరులుగు చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే అలౌటైంది. ఇది భారత్లో ఒక టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో నమోదైన అత్యల్ప స్కోర్. హైదరాబాద్ పేరస్ సిరాజ్ 3 వికెట్లతో టాప్ ఆర్డర్ను దెబ్బకొట్టగా తర్వాత అశ్విన్ నాలుగు, అక్షర్ పటేల్ రెండు వికెట్లతో మిగతా ఆటగాళ్ల పనిపట్టారు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ స్వల్ప స్కోరుకే ఆలౌటై ఫాలో ఆన్లో పడినా.. టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసేందుకే మొగ్గుచూపింది. మయాంక్ 62 పరుగులతో మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడారు. పుజారా 47, శుభ్మన్ గిల్ 47, కెప్టెన్ విరాట్ కోహ్లీ 36 పరుగులతో రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడి 41 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్లో భారత్కు 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. అశ్విన్ మరోసారి చెలరేగడంతో ఆదివారమే న్యూజిలాండ్ సగం పని అయిపోయింది. డారిల్ మిచెల్ 60 పరుగులు, హెన్రీ నికోల్స్ 44 పరుగులతో కాస్త ప్రతిఘటించడంతో ఆట నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం జయంత్ యాదవ్ విజృంభించి గంటలోనే మ్యాచ్ను పూర్తి చేశాడు.