వివేకా హత్య కేసు.. దోషులెవరు? నిర్దోషులెవరు?.. సునీత పోరాటం తేల్చేసిందా?

గత నాలుగేళ్లుగా వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలు వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు ఎందుకు ఎదుర్కొందన్నది కూడా ఇప్పుడు సందేహాలకు తావు లేకుండా తేలిపోయింది. హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సీబీఐ విచారణే వద్దనీ, కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐకి ముందుకు సాగకుండా అడ్డంకులు ఎదురౌతున్నా కిమ్మనకుండా చోద్యం చూడడానికీ కారణమేమిటన్నది కూడా ఇప్పుడిప్పుడే మబ్బులు విడిపోయినట్లు విడిపోతోంది. తెలుగుదేశం నెత్తిన ఇప్పటి వరకూ ఉన్న నిందా భారం ఒక్క సారిగా తొలగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. దీనికంతటికీ కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆమె దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.   తన తండ్రి హత్యకు కారణమైన హంతకులు, ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ చేసిన న్యాయ పోరాటం నిజంగా  నిస్సందేహంగా తెలుగుదేశం నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. ఆమె అలుపెరుగని పోరాటం ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ కు వస్తున్నదనడంలో సందేహం లేదు. అమె పట్టుబట్టి తన తండ్రి హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది వెలుగులోకి వచ్చే దిశగా కేసు దర్యాప్తు సాగుతోంది.  ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తునన  పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.  సోదరుడు సీఎంగా ఉన్నందున,   తండ్రిని హత్యచేసిన వారెవరన్నది    సులభంగా తేలిపోతుందని తొలుత ఆమె భావించారు. వివేకా హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న సోదరుడు జగన్  వివేకా హత్య కేసు దర్యాప్తునకు హత్య జరిగిన వెంటనే వివేకా గుండెపోటుతో మరణించారని మీడియా ముందు చెప్పిన జగన్, ఆయన అనుయాయులూ  ఆ తర్వాత గొడ్డలి పోటని, ఆ పోటు వెనుక నారాసుర రక్త చరిత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.  సరే ఆ తరువాత జరిగిన ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇక తండ్రిహత్య కేసు  సత్వరమే పరిష్కారమై పాత్రధారులు, సూత్రధారులకు శిక్ష పడుతుందని ఆశించారు.  అయితే జగన్ అనూహ్యంగా వివేకా హత్య కేసులో  సీబీఐ విచారణ అవసరం లేదని.. కోర్టుకు తెలిపింది. దీంతో వివేకా కుమార్తె సునీత కంగుతిన్నారు.   ఆ తర్వాత కూడా కేసు నెలలపాటు నత్త నడకన సాగడంతో సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. సాధించారు. అయితే సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే అడ్డుపడుతుండటం వివేకా హత్యలో సునీత-ఆమె భర్త హస్తం ఉందన్న రీతిలో ఒక వర్గం మీడియాలో కథనాలు రావడంతో ఆమెకు తన తండ్రి హత్య వెనుక ఉన్న శక్తులెవరన్న విషయంలో ఒక స్పష్టత వచ్చింది. అందుకే జగన్ సీఎంగా ఉన్న ఏపీలో కేసు ముందుకు సాగదని నిర్ధారణకు వచ్చి ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి అప్పగించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదలీ చేసింది. అక్కడ నుంచే వివేకా హత్య కేసు విచారణ వేగం పుంజుకుంది.   కడప జైలులో ఉన్న నిందితులను హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు మార్చడం, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించడం, ఆ విచారణ ఆధారంగా రాబట్టిన సమాచారంతో జగన్ ఓఎస్‌డీ, భారతి పీఏలను విచారించడం,  వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం చకచకా జరిగిపోయాయి. అలాగే అవినాష్ రెడ్డిని రెండో సారి విచారించేందుకు కూడా సీబీఐ నిర్ణయించుకోవడం.. ఇదంతా సునీత పోరాట ఫలితమేనన్నది కాదనలేని వాస్తవం.  వివేకా హత్య కేసులో ఎవరు హంతకులు? ఎవరు నిర్దోషులు? ఈ కేసులో   ఎవరెవరిని అరెస్టు చేస్తారన్నది పక్కన పెడితే..  తన తండ్రి హంతకులెవరో తేల్చాలని సునీత చేసిన పోరాటం నిజంగా చారిత్రాత్మకం. ఆమె మడమ తిప్పని పోరాట ఫలితమే.. ఈ కేసు ముందుకు సాగేలా చేసింద. లేకుంటే ఎన్నటికీ పరిష్కారం కాని కేసులాగే వివేహా హత్య కేసు కూడా మిగిలిపోయి ఉండేది. అలా మిగిలిపోయి ఉంటే.. ఈ కేసులో నేరస్థులు ఆరోపణులు చేస్తూ.. నిర్దోషులు నిందలు మోస్తూ గడపాల్సి వచ్చేంది. గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య.. కేసులో వివేకా దగ్గరి బంధువులు అప్పటి ప్రభుత్వంపై.. ప్రభుత్వాధినేతపై ఆరోపణలు గుప్పించారు. ఆ ఆరోపణల కారణంగానే అప్పటి విపక్ష పార్టీకి సానుభూతి.. అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు ప్రతిఫలంగా దక్కాయి.  సరే ఎన్నికల పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. విపక్షంలో ఉండగా తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేలా అడుగులు వేశారు. విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తు అంటూ డిమాండ్ చేసిన ఆయన అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నారు. సునీత గట్టిగా నిలబడి ఉండక పోతే ఏం జరిగేది? ఈ   కేసు ఎప్పటికీ పరిష్కారమయ్యేది కాదు.   వివేకా హత్య నిందను తెలుగుదేశం పార్టీ మోస్తూ ఉండాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అన్న అపనిందను దశాబ్దాలుగా చంద్రబాబు ఎలా మోశారో..  వివేకా హత్య కేసులో ఆరోపణలను సైతం అలాగే మోయాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అపనిందల భారం నుంచి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబును తప్పించారు. అయితే అందుకు దశాబ్దాలు పట్టింది. వివేకా హత్య కేసు ఆరోపణల నుంచి సునీత పోరాటం తెలుగుదేశం పార్టీని బయట పడేసింది.   ఇప్పుడు సునీత పోరాటం వల్ల.. వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులెవరన్న ఒక్కో నిజం నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తోంది. ఏకంగా సీబీఐ తన విచారణలో ఎంపీ అవినాష్‌రెడ్డి,  ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లు ప్రస్తావించింది. దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్‌గా మారారు. అందులో పాత్రధారులు-సూత్రధారులెవరన్నదీ స్పష్టంగా పేర్కొని, వాటిని కోర్టుకు సమర్పించింది.   సీబీఐ గానీ, మరొకరు గానీ కోర్టుకు ఆధారాలు సమర్పించిన తర్వాత, అది అధికార డాక్యుమెంట్‌తో సమానమే. కోర్టు నుంచి ఎవరైనా ఆ కాపీలు తీసుకోవచ్చు. పిటిషనర్ న్యాయవాది కూడా వాటిని తీసుకోవచ్చు.  ఇవన్నీ కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది నిజాన్ని నిగ్గు తేల్చడానికి సునీత జరిపిన పోరాటం గురించి మాత్రమే.   

కాంగ్రెస్ ..కు అంత లేదు.. కవిత సెటైర్లు

గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించడం పాత సామెత ... వందేళ్ల  కాంగ్రెస్ పార్టీని నిన్నగాక మొన్న పేరుమార్చుకుని జాతీయ అవతారం ఎత్తిన బీఆర్ఎస్  ఎక్కిరించడం కొత్త సామెత. అవును  ఢిల్లీ లిక్కర్  స్కాం పుణ్యాన జాతీయ మీడియాలో తరచూ వినిపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కాంగ్రెస్ ఎక్కిరించారు. ఎగతాళి చేశారు. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను కవిత ఎద్దేవా చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె, కాంగ్రెస్ పార్టీని చులకన చేసి మాట్లాడారు. అంతేకాదు  హస్తం పార్టీ అహంకారం వీడాలని సలహా కూడా ఇచ్చారు. నిజమే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనంగా ఉన్న మాట నిజమే కానీ, ఇప్పటికీ  ప్రతిపక్ష పార్టీలు అన్నిటిలో  నిజమైన జాతీయ హోదా గుర్తింపు ఉన్న పార్టీ  ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. సంఖ్యాపరంగా చూసినా పార్టీ మనుగడ పరంగా చూసినా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జాతీయ ప్రత్యామ్నాయం. ఇది బీఆర్ఎస్ మాత్రమే కాదు , కమలం పార్టీ కూడా కాదనలేని, అంగీకరించి తీరాల్సిన నిజం. మిగిలిన పార్టీలలో  వేటికీ కూడా లోక్ సభలో మూడంకెల సంఖ్యను దాటిన చరిత్ర లేదు. సమీప భవిష్యత్ లో బీఆరేఎస్ సహా మరే ఇతర   జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా మూడంకెల సంఖ్యకు చేరుకునే అవకాశం లేశ మాత్రంగా  కనిపించడం లేదు. మరో వంక వందేళ్ళకు పైబడిన చరిత్ర ఇంచుమించుగా 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు పదేళ్లకు పైగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించిన అనుభవం ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజుకు కూడా  పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే.  సో.. ఖర్గే చెప్పినా చెప్పక పోయినా సహజంగానే   బీజేపీ వ్యతిరేక పార్టీలకు ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేది కాంగ్రెస్ పార్టీయే. అందులో సందేహం లేదు.  బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి.   అందుకే ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ కాలికి  బలపం కట్టుకుని దేశ మంతా తిరిగినా ఒక్కటంటే ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా  కాంగ్రెస్ ను కాదని  కేసీఆర్  తో జట్టుకట్టలేదు. చివరకు చేసేదేంలేక కేసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం,  ఎంట్రీ పాస్  గా టీఆర్ఎస్ పేరును, బీఆర్ఎస్  మార్చుకున్నారు. మరోవంక ఒక మమత బెనర్జీ,  ఒక కేసీఆర్, ఒక అరవింద్ కేజ్రివాల్ మినహా మిగిలిన  ప్రాంతీయ పార్టీలు  ముఖ్యంగా శరద్ పవార్, నితీష్ కుమార్  ఎంకే స్టాలిన్ వంటి ఉద్దండ నాయకులు కాంగ్రెస్ చెయ్యి వదిలేది లేదని కుండబద్దలు కొట్టారు. చివరకు వామ పక్ష పార్టీలు కూడా ప్రాంతీయ స్థాయిలో ఏ పార్టీలతో పొట్టు పెట్టుకున్నా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటుందని స్పష్టంగా చెపుతూనే ఉన్నాయి. నిజానికి  నిజం ఏమిటో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటో కవితకు తెలియంది కాదు. చివరకు కేంద్రంలోనే కాదు, అవసరం అయితే  రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పదనే విషయం  కేసేఆర్ మొదలు కవిత వరకు అందరికీ తెలుసు. అలాగే, రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకే బీఆర్ఎస్  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని గుర్తించడం లేదని అంటున్నారు.

బీఆర్ఎస్ కు తెలంగాణలో కష్టకాలమేనా?... యూజ్ ఆండ్ త్రో పాలసీయే అసలు కారణమా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు యుద్ధ తంత్రాన్ని తలపంప చేస్తాయి. ఆయన అవసరానికి బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకోవడానికి వెనుకాడరు.. ఈ మాట ఎవరో అన్నది కాదు స్వయంగా కేసీఆరే. ఆయన రాజకీయ చాణక్యం ముందు నరేంద్ర వంటి ఎందరో నేతలు సోదిలోకి లేకుండా పోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో నేతలు ఆయన పంచన చేరి ఆ తరువాత కనుమరుగైపోయారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఉద్యమ సమయంలో తనతో కలిసి నడిచిన ఎందరో నేతలను ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ కాదు.. జాతీయ స్థాయి రాజకీయాలు అంటూ ఆయన చేసిన చేస్తున్న ప్రసంగాలకుఆకర్షితులై గతంలో ఆయనతో విభేదించో.. లేక ఆయనకే నచ్చకో దూరం అయిన వారిని మళ్లీ అక్కున చేర్చుకున్నారు. పిలిచి మరీ పార్టీ కండువా కప్పారు. పార్టీలో చేరే వరకే ఆ తరువాత వారికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, బిక్షమయ్యగౌడ్ వంటి నేతలు ఘర్ వాపసీ అంటూ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తరువాత పార్టీలో వారి అతీగతీ పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అలాగే మోత్కుపల్లి.. కేసీఆర్ నిజమైన దళిత బంధుగా కేసీఆర్ ను అభివర్ణించి పంచన చేరి ఈ నాడు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినా.. పార్టీ నుంచి బయటకు పంపేసినా ఏ పని చేసినా అవసరం వినా మరో మాటకు తావే ఉండదని రాజకీయ వర్గాలలో ఓ టాక్ జోరుగా ఉంటోంది. నేతలను ఇలా కూరలో కరివేపాకులా వాడుకున్న ఆయన తీరు కారణంగానే తెరాస భారాసగా మారిన తరువాత రాజకీయంగా ఆయన తెలంగాణలో వెనుకబడే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో వెనుక బాటు అన్నంత మాత్రాన ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ దూసుకు పోతోందని కాదు.. విస్తరణ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కేసీఆర్ ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి మొండి చేయి చూపుతారు అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఘర్ వాపసీల తో అయితేనేమీ, ఆపరేషన్ ఆకర్ష్ తో అయితేనేమి.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ హౌస్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎవరికి పార్టీ టికెట్ కేటాయించినా అసమ్మతి, అసంతృప్తి భగ్గు మనడం ఖాయం. అంతేనా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనే రెబల్స్ బెడద అధికంగా ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి.  ఏళ్ల తరబడి నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయకుండా నాన్చిన ఫలితంగా ఇప్పుడు ఆ నామినేటెడ్ పోస్టుల భర్తికీ కేసీఆర్ పచ్చ జెండా ఊపినా.. ఎవరికి పదవి ఇస్తే ఎవరికి కోపం వస్తుందో అన్న జంకు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం, ఎదుర్కొని గెలుపు బాట పట్టడం అంత సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. 

వంశీ ప్రతిష్ట డ్యామేజీ.. వైసీపీలో ఆయన వ్యతిరేకులు సో హ్యాపీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు.. స్థానిక టీడీపీ కార్యాలయంపై ముకుమ్మడి దాడితో... ఫ్యాన్ పార్టీలోని వంశీ వ్యతిరేక వర్గానికి చక్కటి అవకాశం చే జేతులా చిక్కినట్లు అయిందని.. ఈ నేపథ్యంలో వంశీకి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సదరు వర్గానికి చేతి నిండా పని దొరికినట్లు అయిందనే ఓ చర్చ ఆ నియోజకవర్గంలో విస్తృతంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వల్లభనేని వంశీ..  ఆ తర్వాత జగన్ పార్టీలోకి దూకేసిన సంగతి తెలిసిందే.  అయితే వంశీ రాకను.. గన్నవరం నియోజకవ వైసీపీ  ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ రంగంలోకి దిగి.. వెంకట్రావ్‌ను కూల్ కూల్ చేశారు. కానీ వంశీకి, యార్లగడ్డ వెంకట్రావ్‌కు మధ్య వైరం నాడే కాదు.. నేటికి పచ్చి పచ్చిగానే ఉందని తదననంతర పరిణామాలు రుజువు చేశాయి.  మరోవైపు ఇదే నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ కీలక నేత దుట్టా రామచంద్రరావు  తన అల్లుడికి గన్నవరం టికెట్ ఇప్పించుకొనేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన జగన్‌ ఫ్యామిలీతో దగ్గర బంధుత్వం కలిగి ఉన్న వ్యక్తి కూడా.  వీరందరినీ కాదని... వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ టికెట్ వంశీకేనంటూ ఇప్పటికే  జగన్   క్లారిటీతో చెప్పేసినట్లు వైసీపీ శ్రేణుల్లోనే ఒక చర్చ జోరుగా సాగుతోంది.  జరిగిన, జరుగుతున్న పరిణామాలను దుట్టా వర్గం, యార్గగడ్డ వర్గం  సైలెంట్‌గా గమనిస్తూ ఉన్నాయనీ....   తాజాగా టీడీపీ కార్యాలయంపై వంశీ వర్గీయులు దాడి ఘటనను ఈ రెండు వర్గాలు తమకు అనుకూలంగా మలచుకుని.. వంశీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే అవకాశాలు  మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  మరోవైపు గతంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.... ఆ తర్వాత ఓ టీవీ చర్చా కార్యక్రమంలో సారీ సిస్టర్ అంటూ క్షమాపణలు చెప్పినా..  అప్పటికే వంశీ ఇమేజ్‌ ఎంతగా డ్యామేజ్ కావాలో అంతా  జరిగిపోయిందని.. ఇప్పుడు తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై ముక్కుమ్మడి దాడి ఘటనతో టోటల్‌గా వంశీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందనే ఓ చర్చ సైతం సైతం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే  కొడాలి నానికి అయినా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయినా.... పోలిటికల్ లైఫ్ ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలో చేరి.. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కన్నతల్లి లాంటి పార్టీపైనే ఆరోపణలు గుప్పించడం వల్ల... వీరిపై ప్రజల్లో ఓ విధమైన తప్సుడు అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతోందని.. ఈ  అంశాన్ని దుట్టా, యార్లగడ్డ వర్గాలు... ఒక తాటిపైకి వచ్చి.. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలిగితే..  ఆయన తట్టుకోగలడా అనే ఓ విధమైన సందేహం ప్రస్తుత ఎమ్మెల్యే వర్గంలో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.  అదీకాక వంశీపై రాజకీయంగా పట్టు సాధించేందుకు యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా వర్గాలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొంటూనే ఉన్నాయని... ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో వంశీపై టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్‌ను బరిలో నిలిపేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని తెలుసుకొన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. టీడీపీ కార్యాలయంపై దాడి చేయాలంటూ ఆయన వర్గీయులను ఆదేశించారనే చర్చ సైతం స్థానికంగా వైరల్ అవుతోంది.   ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో గన్నవరం నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుదన్న సంగతి అందరికి తెలిసిందే. అందుకే 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ వేవ్‌లో సైతం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందారు. అలాంటి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పట్టాభిని నిలబెడితే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందని.. అందులో ఎటువంటి సందేహం అయితే లేదనే ఓ చర్చ సైతం వంశీ వర్గీయుల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వంశీ వర్గీయులు సైకిల్ పార్టీ కార్యాలయంపై దాడికి పునుకున్నారనే చర్చ సైతం స్థానికంగా కొన.. సాగుతోంది.

కాంగ్రెస్ ప్లీనరీలో కీలక చర్చకు సోనియా, రాహుల్ దూరం!

కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. నిజంగానే గాంధీ కుటుంబం పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను పార్టీకి వదిలేసి దూరంగా ఉంటున్నారు. అంటే రాజకీయ వర్గాలలో మాత్రం ఔననే సమాధానం వస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచీ ప్రక్షాళన చేసి.. క్యాడర్ ను మరింత క్రియాశీలంగా మార్చాలన్న నిర్ణయంతో ఉంది. అందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షులు  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పూర్తిగా సహకారం అందిస్తున్నారు. పార్టీ తమ ప్రమేయం లేకుండానే స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కీలక సమావేశాలు, నిర్ణయాలలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటున్నారు. అలా అని పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా అంటే అదేం లేదు. కాంగ్రెస్ లో ప్రస్తుతం కనిపిస్తున్న జోష్ కు, విజయంపై పెరిగిన విశ్వాసానికి రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. ఇలా ఉండగా కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 24) నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వేదికగా జరుగుతాయి. ఏఐసీపీ అధ్యక్షడు మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాలలో మొత్తం 6 తీర్మానాలను పార్టీ ఆమోదిస్తుంది. ముఖ్యంగా సీడబ్ల్యుసీకి ఎన్నికల నిర్వహణపై స్టీరింగ్ కమిటీ చర్చిస్తుంది. అయతే ఈ చర్చకు పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దూరంగా ఉంటారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పూర్తి స్వేచ్ఛను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చేందుకే వారీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

టి.20 మహిళల ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఫైనల్ ఆశలు గల్లంతు

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా పోరు సెమీస్ తో ముగిసింది. సెమీస్ లో ఆస్ల్రేలియా చేతిలో ఐదుపరుగుల తేడాతో పరాజయం పాలైంది. విజయం ముంగిటకు వచ్చి కూడా చివరి నిముషంలో తడబడి ఓటమి మూటగట్టుకుంది. అయితే పోరాడి ఓడిన భారత అమ్మాయిలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. మొత్తం మీద టైటిల్ ఆశలో వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా మహిళల జట్టుకు ఆ ఆశ నెరవేరలేదు. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడింది.  173 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటైన తర్వాత దీప్తి శర్మ (20 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సిన దశలో భారత్ పది పరుగులు మాత్రమే సాధించగలిగింది. దీంతో 5 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.  ఈ విజయంతో ఆస్ట్రేలియా ఫైనల్స్ కు చేరింది. అయితే సెమీస్ లో టీమ్ ఇండియా ఓటమికి దురదృష్టమే కారణమని చెప్పాలి. విజయం దిశగా జట్టును నడిపిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అవ్వడంతోనే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 15వ ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్ ప్రీత్ కౌర్ నాలుగో బంతిని హర్మన్ మరో షాట్ కొట్టింది. అయితే బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపిన ఫీల్డర్..బంతిని వేగంగా వికెట్ కీపర్ కు త్రో చేసింది. రెండో పరుగు తీస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజ్ లోకి చేరేలోగా కీపర్ వికెట్ స్టంప్ చేశాడు. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అయ్యింది. ఆ ఔటే విజయం ముందు టీమ్ ఇండియా బోల్తాపడేలా చేసింది. జర్వంతోనే క్రీజ్ లోకి దిగిన స్కిప్పర్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్ తో జట్టును దాదాపు విజయం అంచులకు చేర్చింది. అయితే దురదృష్టవశాత్తూ..ఆమె రనౌట్ టీమ్ కు విజయాన్ని దూరం చేసింది. 

ఇక అరెస్టేనా?

ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దమైందా?అంటే పోలిటికల్ సర్కిల్‌లో ఔననే సమాధానమే వినిపిస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 24)  వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరుకానున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు   సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు  ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయిందని, అలాగే మరోవైపు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిడం చూస్తుంటే.. ఇక ఈ  హత్య కేసులో వరుస బెట్టి ఆరెస్ట్‌లే తరువాయి అన్న ప్రచారం కూడా జోరందుకొంది.    అయితే ఈ హత్య కేసులో   అవినాష్ రెడ్డిని గత నెల 28 తేదీనే సీబీఐ అరెస్ట్ చేసేందుకు సిద్ధమైందని.. అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. వాటి వివరాల ఆధారంగా కాల్స్ వెళ్లిన వారిని ఓ సారి విచారిస్తే.. ఆ తర్వాత తమ పని మరింత సులువు అవుతుందన్న ఓ ఆలోచనతో ఉందని.. అందుకే ఆ రోజు.. సీబీఐ వెనక్కి తగ్గి....  అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని.. ఆ క్రమంలోనే ఆయన ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణీ వైయస్ భారతీ పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసి.. వారిని విచారించిన తర్వాత.. సీబీఐ అధికారులకు  క్లారిటీ   వచ్చిందని.. అందుకే మళ్లీ   అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారని.. అదీ కూడా వాట్సప్‌లో పంపడం బట్టి చూస్తే..  అరెస్టు తప్పదన్న చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిందని తెలుస్తోంది.  ఇంకోవైపు.. గత నెల 28 నే తనను అరెస్ట్ చేస్తారని కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి అర్థమైందని.. అందుకే తనతోపాటు.. తన సొంత జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు జిల్లాలోని పలువురు కీలక నాయకులు, కేడర్‌ను సైతం హైదరాబాద్ తీసుకువచ్చారనే ప్రచారం సైతం కొన.. సాగుతోంది. కానీ సీబీఐ మాత్రం వేచి చూసే దోరణి కారణంగా.. నాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని సమాచారం.    అదీకాక జనవరి 28వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి... సీబీఐ విచారణకు హాజరయ్యారని.. మరోవైపు తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్... అంతకుముందు అధికారికంగా ఆ రోజు నిర్ణయించుకున్న అన్నీ పర్యటనలను అర్థాంతరంగా రద్దు చేసుకుని మరీ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారనే అంశం కూడా ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.   మరి ఫిబ్రవరి 24వ తేదీన సీఎం  జగన్..   తన అధికారిక పర్యటనలు లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? లేకుంటే. ఓ వేళ ఆ రోజు పర్యటనలు ఏమైనా ఉంటే వాటిని గతంలో లాగా అర్థాంతరంగా రద్దు చేసుకుని.. తన నివాసానికే పరిమితమైపోతారా? అనే సందేహాలు సైతం  వ్యక్తం అవుతున్నాయి.   వివేకా హత్య కేసులో ఓ వేళ వైయస్ అవినాష్ రెడ్డి   అరెస్ట్ అయితే.. ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసేది ఎవరిని అనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.

పట్టిన దయ్యం వదలాలంటూ భార్యకు కుక్కతో పెళ్లి!

మనుషుల్లో మూఢనమ్మకాలు 21వ శతాబ్దంలోనూ సభ్య సమాజాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. శాస్త్ర, సాంకేతిక విజ్ణానం ఎంతగా అందుబాటులోకి వచ్చినా మనిషిలోని మూఢత్వాన్ని పారద్రోల లేకపోతున్నాయనడానికి తాజా ఉదాహరణగా నిలుస్తుందీ సంఘటన. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు ఓ కుక్కతో పెళ్లి జరిపించాడు. ఎందుకయ్యా అంటే తన భార్యకు దయ్యం  పట్టిందనీ, దానిని వదల్చాలంటే కుక్కతో పెళ్లి చేయక తప్పదని బదులిచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అతగాడి భార్య కూడా తనకు దయ్యం పట్టిందనీ, కుక్కుతో పెళ్లి జరిగితేనే దయ్యం వదులుతుందనీ చెప్పడం. కుక్కతో పెళ్లికి తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని ముక్తాయించడం. అసలీ ఆలోచన వారికి ఎలా వచ్చిందంటే.. ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆమెకు దయ్యం పట్టిందని పండితులు(?) చెప్పారట. ఆ దయ్యం వదలాలంటే ఓ శునకంతో ఆమెక వివాహం జరిపించాలని, అలా చేస్తేనే దయ్యం వదులుతుందని నమ్మకంగా చెప్పారట. ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నీ భార్యకు దయ్యం పట్టడం సంగతేమిటో తెలియదు కానీ.. నీకు మాత్రం పిచ్చి పీక్స్ కు చేరిందయ్యా అంటూ సదరు భర్తపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముందు ఇద్దరూ మంచి వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స చేసుకోండి అని సలహా ఇస్తున్నారు. 

అల్లుడి కాళ్లు కడుగుతూ గుండెపోటుతో కుప్పకూలిన మామ

వాన రాకడ.. ప్రాణం పోకడ ముందుగా తెలియదంటారు.ఇదంతా గతం. వర్షం ఏ సమయంలో ఏ ప్రాంతంలో కురుస్తుందో కచ్చితంగా చెప్పే సాంకేతిక పరిజ్ణానం అందుబాటులోకి వచ్చింది. అలాగే వైద్య విజ్ణానం కూడా చాలా అభివృద్ధి చెందింది. చిన్న చిన్న పరీక్షలతో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే విజ్ణానం కూడా అందుబాటులోకి వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నాం. అయినా ప్రాణాలను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలోనే నేటికీ మానవుడు ఉన్నాడు. హాయినా నవ్వుతూ ఆనందంగా తిరుగుతున్న వ్యక్తి అంతలోనే గుండెపోటుతో కుప్ప కూలిపోతున్నాడు. వయస్సుతో సంబంధం లేకుండానే గుండె పోటుకు గురి అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా పచ్చటి పెళ్లి పందిట్లో వధువు తండ్రి గుండెపోటుతో కుప్పకూలిన సంఘటన విషాదాన్ని నింపింది. కుమార్తె వివాహంలో వరుడి కాళ్లు కడుగుతూ ఓ తండ్రి గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల గుండెలను పించేస్తోంది. మాటలు రాని విషాదమంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

హస్తిన చేరిన ఏపీ బీజేపీ పంచాయతీ.. సోము వీర్రాజుపై మురళీధరన్ కు ఫిర్యాదు

ఏపీ బీజేపీ పంచాయితీ ఢిల్లీకి చేరింది.   రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగించకపోతే, బీజేపీలో ఎవరూ ఉండే పరిస్థితి లేదంటూ ఓ  30 మంది ఏపీ బీజేపీ సీనియర్‌ నేతలు, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్‌కు   ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు.   రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వారంతా ఆయనకు వివరించారు. ఇటీవల సోము వీర్రాజు, మరికొందరు నాయకులపై వచ్చిన బలవంతపు దళితుల భూ కొనుగోలు ఆరోపణలను  మురళీధరన్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు 30 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు బుధవారం సాయంత్రం  కేంద్రమంత్రి మురళీధరన్‌తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లను పక్కకుపెట్టి, తన సొంత మనుషులతో వ్యవహారం నడిపిస్తున్నారని వారు మురళీధరన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై గ్రూపులు కడుతున్నారన్న ముద్ర వేస్తున్నారని వివరించారు. ఎలాంటి వనరులూ అందుబాటులో లేకపోయినా, తాము రెండేళ్లపాటు సొంత ఖర్చులతో జిల్లాల్లో పార్టీని విస్తరిస్తే, అవమానకరరీతిలో తొలగించారని ఫిర్యాదు చేశారు. దళితుల భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునే అంశంలో, పార్టీ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నదని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సోము వీర్రాజు  అవినీతి కారణంగా  పార్టీ నష్టపోతోందని, ఆయనను కొనసాగిస్తే, బీజేపీలో తొలి నుంచీ పనిచేస్తున్న వారంతా, పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ మేరకు ఒక  వినతిపత్రం కూడా ఆయనకు అందజేశారు. వారి ఫిర్యాదును సావధానంగా విన్న మురళీధరన్‌.. సోము వీర్రాజు, మరికొందరు నేతలు కలసి దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలపై, విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.  

విపక్షాల ఐక్యత ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు.. మోడీ బలం అదేనా?

కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం  అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కారణంగా ఈ చర్చ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.  ఈ  నేపథ్యంలోనే వచ్చే ఏడాది  సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని నిలువరించడమే లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డడానికి సన్నాహాలు చేస్తున్నది. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు ఇప్పటికే ప్రకటించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టించింది.  మల్లికార్జున్ ఖర్గే ప్రకటన నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి నడిచే పార్టీలు ఏవన్న చర్చ ప్రారంభమైంది.  ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ  తెలంగాణ   వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్  పొత్తుల అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొగ్రెసివ్ ఇండియా కోసం కాంగ్రెస్ లీడర్ షిప్ లో ఇప్పటికే టీమ్ సిద్ధం అయిందని గురువారం (ఫిబ్రవరి 23) ఒక ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్ మేరకు  కాంగ్రెస్ కూటమిలో 14 పార్టీలు ఉన్నాయి. అవి డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్ఎస్‌యూ, జేఎంఎం, యూఎంఎల్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, వీసీకే, పీడీపీ, ఎన్ సీ, కేసీ, ఎంఎన్ఎం . పరస్పరం గౌరవించుకుంటూ బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందడుగు వేస్తామని మాణికం ఠాకూర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంకా కలిసి వచ్చే పార్టీలను సైతం స్వాగతిస్తామని పేర్కొన్నారు.  అయితే మాణికం ఠాగూర్ తాను ప్రకటించిన కూటమి పార్టీల జాబితాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను పేర్కొనకపోవడంపై నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కీలకమైన, జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించే సత్తా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను విస్మరించడంలోనే కాంగ్రెస్ కు విపక్షాల ఐక్యత, మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలపై ఉన్న చిత్తశుద్ధి అవగతమౌతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా ఆ జాబితాలో వామపక్షాలు కూడా కనిపించకపోవడంపై కూడా కాంగ్రెస్ చెబుతున్న ఐక్యతపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. సహజంగానే బీఆర్ఎస్ కూడా ఆ జాబితాలో లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా బీజేపీయేతర కూటమి అంటూ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్న సంగతి తెలిసిందే.  

సుప్రీంలో విచారణకు రాని అమరాతి కేసు.. దిక్కు తోచని స్థితిలో జగన్ సర్కార్

అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో సారి వెనక్కు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలంటూ బెంచ్ ముందు ప్రస్తావించారు. 23వ తేదీన తొలి కేసుగా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది.  అయితే ఈ రోజు విచారణకు వచ్చే కేసులు జాబితాలో అమరావతి కేసు లేదు. ఇందుకు  సీజేఐ ఈ నెల 14న జారీ చేసిన సర్క్యులరే కారణమని చెబుతున్నారు.   ఒక సారి నోటీసు అయిన కేసులను బుధ, గురువారాల్లో విచారణ చేయవద్దని ఆ సర్క్యలర్ సారాంశం.  అందుకే అమరావతి కేసు గురువారం విచారణకు రాలేదని చెబుతున్నారు.  హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకు ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం కూడా ఒక కారణమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, లీగల్ సర్కిళ్లలోనూ జోరుగా సాగుతోంది. జగన్ కు సంబంధించిన కేసుల బెంచ్ హంటింగ్‌ కు ఆయన పాల్పడుతున్నారన్నదే ఆ చర్చ, ఈ నేపథ్యంలోనే . అమరావతి కేసులో గురువారం (ఫిబ్రవరి 23) విచారణకు రాకపోవడం, ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.  ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ సుప్రీంలో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఇబ్బందుల్లో పడేసింది. మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం ఒక విధంగా ఆయనను అసహనానికి గురి చేస్తున్నది. అమరావతి కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు సంగతి తరువాత కనీసం హైకోర్టు తీర్పుపై స్టే అయినా దక్కితే చాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు నాటికి విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామన్న కచ్చితమైన ప్రకటన చేయాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సుప్రీం కోర్టులో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఆశనిపాతంగానే పరిశీలకులు చెబుతున్నారు. 

కేసీఆర్ పాలనలో వీధుల్లో కుక్కులు.. వీధి రౌడీల్లా బీఆర్ఎస్ నేతలు.. బండి

తెలంగాణ ముఖ్యమంత్రిపైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు, విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బండి సంజయ్ రాష్ట్రంలో వీధికుక్కల బెడద ఎలాగో బీఆర్ఎస్ గూండాల భయం కూడా అలాగే ఉందన్నారు. దాడికి గురైన మురళీ గౌడ్ కుటుంబ సభ్యులను బుధవారం (ఫిబ్రవరి 23)న పరామర్శించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గూండాల తీరును గమనిస్తుంటే.. వారు డ్రగ్స్ మంత్తులో దాడులకు పాల్పడుతున్నారా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అధికార పార్టీ తప్పిదాలు, వైపల్యాలను విమర్శిస్తే.. ప్రతి విమర్శలుమాని భౌతిక దాడులకు పాల్పడుతోందని కేసీఆర్ సర్కార్ అని విమర్శించారు. మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడులకు పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి డిమాండ్ చేశారు. మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడిని నిరోధించడంలో విఫలమైన, దాడులకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రత్యర్థులను, తన విధానాలను వ్యతిరేకించే వారినీ భౌతికంగా నిర్మూలించడం అన్న తీరులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని బండి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీధికుక్కలు రోడ్లపై పిల్లలపై దాడులు చేస్తుంటే.. బీఆర్ఎస్ గూండాలు వీధిరౌడీల్లా మారి ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని బండి ఆరోపించారు

వంశీ టార్గెట్ పట్టాభి.. ఎందుకంటే?

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరంలో  టీడీపీ కార్యాలయంపై అధికార వైసీపీ కార్యకర్తలు  ముక్కుమ్మడి దాడి చేయడం.. అక్కడ ఉన్న వాహనాలను సైతం నిప్పుంటించడం.. ఆ క్రమంలో  తెలుగుదేశంఅధికార ప్రతినిధి  పట్టాభిని అక్కడి నుంచి  పోలీసులు  రహస్యంగా తరలించడం..  మరోవైపు బాధితులమైన తమపైన పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారంటూ.. విపక్ష తెలుగుదేశం ఆరోపించడం.. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక  వల్లభనేని వంశీ మార్క్ స్కెచ్ ఉందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.  రానున్న ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీకి పార్టీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని...  దీంతో ఆ టికెట్ కోసం పోటీ పడుతున్న  దుట్టా రామచంద్రరావు వర్గానికి, ఇటు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గానికి చెక్ చెప్పినట్లు అయిందని... ఈ నేపథ్యంలో తమకు ఎదురే లేదంటూ వంశీ వర్గం   సంబరాలే చేసుకుందని అంటున్నారు... అయితే తన సొంత పార్టీలో అసమ్మతి సెగ మాత్రం నివ్వురు గప్పిన నిప్పులాగా అలాగే ఎన్నికలు అయిన తర్వాత కూడా ఉంటుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బాగా అర్థమైందనే ఓ చర్చ సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.     మరోవైపు ప్రత్యర్థి టీడీపీ తరపున గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్టాబిని నిలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు పట్టాభికి అప్పగించేందుకు చంద్రబాబు సన్నాహాలు సైతం ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బచ్చుల అర్జునుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని అంటున్నారు.   అయితే ఓ వైపు సొంత పార్టీలో అసమ్మతి, మరోవైపు ప్రత్యర్థి పార్టీలో బలమైన నేత.. ఇంకోవైపు గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పక్కగా కంచుకోటగా ఉండడం... క్లియర్ కట్‌గా చెప్పాలంటే..  2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్‌లో సైతం.. గన్నవరం నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడిందంటే.. స్థానికంగా సైకిల్ పార్టీకి హార్ట్ కోర్ ఫ్యాన్స్  ఉండటమేననీ.... అందుకే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపు నల్లేరు మీద నడకే అయిందని..  అ లాంటి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పట్టాభి పోటీ చేస్తే.. తన గెలుపు సాధ్యం కాదన్న ఆందోళనతోనే  తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో భయభ్రాంతులు సృష్టించి వారిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే కార్యాలయంపైకి తన వర్గాన్ని వంశీ ఉసిగొల్పి దాడులు చేయించారనే చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో సర్క్యూట్ అవుతోంది.   అదీకాక.. పట్టాభి ప్రెస్ మీట్ పెట్టారంటేనే...  అధికార పార్టీలోని అగ్రనేతలకు చెమటలు పడతాయనీ, పట్టాభి విమర్శలు అంత సహేతుకంగా, ధాటిగా ఉంటాయన్న భావన వైసీపీ శ్రేణుల్లోనే ఏర్పడింది. అంత దూకుడుగా ఉన్న మరో  నాయకుడు ప్రస్తుత టీడీపీలో మరొకరు లేరనే ఓ టాక్ తెలుగుదేశంలోనే కాదు, విపక్ష వైసీపీలో కూడా ఉంది. గతంలో   పట్టాబి ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాదు.. ఆయన ఇంటిపై  వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.    ఇంకోవైపు.. వల్లభనేని వంశీ.. తెలుగుదేశం టికెట్‌పై గెలిచి.. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరారు.  ఆ క్రమంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబంపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ ఈ తరహా వ్యాఖ్యలపై అన్నీ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తర్వాత ఓ మీడియాలో లైవ్‌లో చర్చకు వచ్చి.. చంద్రబాబు ప్యామిలీకి వంశీ క్షమాపణలుచెప్పనప్పటికీ అప్పటికే వంశీకి వ్యక్తిగతంగా జరగాల్సిన డ్యామేజ్  జరిగిపోయింది.  అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం చంద్రబాబుపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అటు గన్నవరం నుంచి బరిలోకి దిగే వల్లభనేని వంశీపై, ఇటు గుడివాడ నుంచి బరిలో దిగనున్న కొడాలి నానిలపై టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులను దింపాలని చంద్రబాబు కృత నిశ్చయం ఉన్నారు. ఆ దిశగా పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ వర్గం.. తమదైన శైలిలో దాడులు చేసి.. ప్రతి పక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులోభాగమే.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై ఈ తరహా దాడులని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే సాగుతోంది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం.. కవిత ఉక్కిరి బిక్కిరి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు ఏకకాలంలో దూకుడు పెంచాయి. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ కుంభకోణం కేసులో ఏ క్షణంలో ఎలాంటి పరిణామం సంభవిస్తుందా అన్న ఉత్కంఠ సామాన్యులలోనే కాదు.. రాజకీయ వర్గాలలో సైతం నెలకొంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న సీబీఐ ఢిల్లీ డెప్యూటీ సీఎం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. మరో వైపు ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సీబీఐ ఒకసారి విచారించింది. ఇంకో వైపు ఆమె వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ఇందు కోసం ఈడీ కోర్టు అనుమతి కూడా పొందింది. ఈ నెల 8న బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసి మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో సీబీఐ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్చంద్రరెడ్డిల ఆధ్వర్యంలో నడుస్తున్న సౌత్ గ్రూప్ కు సంబంధించి బుచ్చిబాబును ప్రశ్నలతో సీబీఐ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడు ఇదే కేసులో బుచ్చిబాబును ఈడీ విచారణ చేయనుంది.  ఈడీ, సీబీఐలు రెండూ తమ దర్యాప్తులో ప్రధానంగా కాన్ సన్ ట్రేట్ చేస్తున్న సౌత్ గ్రూప్ లో కల్వకుంట్ల కవిత పాత్ర కీలకం అని ఇప్పటికే ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొన్న సంగతి విదితమే.   ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే అంశంపై  ఆమె మాజీ ఆడిటర్‌  బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  అంతే కాకుండా ఇదే కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన రాబిన్ డిస్టలరీస్ కు కూడా బుచ్చిబాగు గతంలో ఆడిటర్ గా పని చేశారు.  ఇదే డిస్టిల్లరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ గురించి కవితతో చర్చించినట్టు ఈడీ   చార్జిషీట్‌లో పేర్కొన్న సంగతి విదితమే.  ఈడీ ఇప్పటికే తన చార్జిషీట్ లో కవితకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ పలు అంశాలను ప్రస్తావించింది.   హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీపై 2021 మేలో హైదరాబాద్ లోని కవిత నివాసంలో జరిగిన ఆ సమావేశంలో  బుచ్చిబాబు కూడా పాల్గొన్నట్లు ఈడీ ఆరోపించింది.  మద్యం కుంభకోణంలో కీలకమైన పాత్ర సౌత్ గ్రూపుదేనని అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అరెస్టు చేసిన సంగతి విదితమే.  

ఎన్నికల వేళ నామినేటెడ్ పోస్టుల పందేరం.. అసమ్మతి తెనెతుట్టె కదపడమేనా?

నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందు కోసం ఇప్పటికే అన్ని  శాఖల నుంచి ఇందుకు సంబంధించిన జాబితాను తెప్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీలో ఇంత వరకూ ఎలాంటి పదవీ దక్కని వారెంతమంది, ఒక్క సారి పదవి దక్కిన వారెవరు.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అర్హతలుండీ పార్టీ టికెట్ దక్కే చాన్స్ లేని వారెవరు వంటి వవరాలన్నిటినీ క్రోడీకరించుకుని కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల పందేరానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు ఏ పదవి రాని లీడర్లు ఎవరెవరున్నారు?  ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై మంత్రులతో కేసీఆర్ చర్చించినట్లు కూడా చెబుతున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  ముగియగానే నామినేటెడ్ పోస్టుల పందేరం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ నిర్ణయించుకోవడమంటే అసమ్మతి తేనెతుట్టెను కదిపినట్లే అవుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్త మౌతోంది. చాలా ఏళ్లుగా వందలాది మంది బీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంవత్సరంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీలో అసమ్మతి పెరిగేందుకు దోహదపడే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ సీరియస్ గా నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. అడపాదడపా ఒక్కో కార్పొరేషన్ కు చైర్మన్ లనో డైరక్టర్లనో ప్రకటిస్తూ వచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కూడా నామినేటెడ్ పోస్టల భర్తీ చేపట్టకపోతే కేడర్ కు, నేతలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్న వాదన ఉన్నప్పటికీ.. ఎన్నికల వేళ పదవుల పందేరానికి శ్రీకారం చుడితే.. దక్కిన వారిలో అసమ్మతి భగ్గుమనడం ఖాయమన్న ఆందోళన కూడా వ్యక్తమౌతోంది.  ఎది ఏమైనా ఎన్నికల సమాయత్తం కోసం పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా స్తంబ్దంగా ఉన్న కేసీఆర్ నామినేటెడ్ పోస్టల భర్తీతో ఎన్నికలకు సిద్ధం కావడంపై పార్టీ శ్రేణుల్లో సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ముందు ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు పార్టీ నేతలనూ, శ్రేణులను జనంలోకి పంపే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే మేలు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

సోమేష్ కుమార్ కు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు?.. కేసీఆర్ వ్యూహమేంటి?

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వంలో కాదు, బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయనను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబెట్టే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. సోమేష్ కుమార్ స్వరాష్ట్రం బీహార్ లో ఆయనకు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించి.. ఆ రాష్ట్రం నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీకి నిలపాలన్న యోచన చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.   తొలుత ఆయన ఏపీలో రిపోర్టు చేసి.. ఆ తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వరకూ అన్నీ కేసీఆర్ చెప్పిన విధంగానే.. ఆయన కనుసన్నలలోనే జరిగాయని అంటున్నారు. ముందుగా ఆయనను రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారటీ) చైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే.. కోర్టుతీర్పు కారణంగా ఆయన తెలంగాణలో రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్టు చేసే సమయానికి ఆయన రెరా బాధ్యతలు చూస్తున్నారు. ఆయన వెళ్లినప్పటి నుంచీ కూడా ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారం జరిగింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారమూ విస్తృతంగా సాగింది. అయితే ఆయన మేనేజ్ మెంట్ స్కిల్స్, ఎడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స్ ను పార్టీ కి ఉపయోగించుకోవాలని కేసీఆర్ ఫిక్సయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ విస్తరణ విషయంలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  జాతీయ స్థాయిలో మద్దతు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలూ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి సొంతగా బీజేపీయేతర శక్తుల ఐక్యతకు తన వంతుగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్ ను దూరం పెట్టడంతో... బీహార్ లో తనకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టడానికీ, పార్టీ కార్యకలాపాల వేగం పెంచడానికీ, ఆ రాష్ట్రంలో ఇప్పటికే నితీష్ కు వ్యతిరేకంగా ఒంటరిగా తన పని తాను చేసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి బీఆర్ఎస్ బలోపేతం కోసం పని చేయడానికి సోమేష్ సేవలు వినియోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. సివిల్ సర్వెంట్లు తమ సర్వీసుల నుంచి అర్ధంతరంగా  రాజీనామా చేసి రాజకీయాలలోకి రావడం కొత్తేమీ కాదు. అందులో ఎంత వరకూ సక్సెస్ అయ్యారు అన్నది పక్కన పెడితే.. సివిల్ సర్వెంట్ల రాజకీయ ప్రవేశానికి ఆరంభంలో మాత్రం అన్ని వర్గాల నుంచీ ఆమోదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ ను రాజకీయాలలోకి తీసుకురావడానికి కేసీఆర్ ఆసక్తి చూపడం మాత్రం తెలంగాణ సీఎస్ గా ఆయన పని చేసిన తీరు నచ్చడమే నని అంటారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రికగా అంతా చెప్పే ధరణి రూపకల్పన వెనుక ఉన్నదంతా సోమేష్ కుమారేనని పార్టీ శ్రేణులే కాదు, పరిశీలకులు కూడా పలు సందర్భాలలో చెప్పారు. అంతే కాదు పలు సందర్బాలలో సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ పై బహిరంగ వేదికలపై సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ కు కేసీఆర్ ఏ నామినేటెడ్ పదవో, సలహాదారు పోస్టో కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశమే మెండుగా ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

వివేకా హత్య కేసు.. గుట్టు రట్టైపోతోందా?.. సీబీఐ అఫిడవిట్ లో సంచలన విషయాలు!

సీబీఐ అధికారులు వివేకా హత్య కేసును దాదాపు ఛేదించేసింది. ఆ దర్యాప్తు సంస్థ తెలంగాణ హై కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో హత్యకు ముందు.. తరువాత ఏం జరిగిందన్న విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో హత్య జరిగిన తీరు, హత్య వెనుక ఎవరు ఉన్నారు. హత్య అనంతరం సాక్ష్యాల తారుమారులో అవినాష్ రెడ్డి పాత్ర..ఆయన తండ్రి భాస్కరరెడ్డి ప్రమేయం ఇలా పలు అంశాలను వెల్లడించింది. దీంతో ఇంత కాలంగా వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులపై ఉన్న అనుమానాలన్నీ వాస్తవమేనని సీబీఐ పేర్కొన్నట్లయ్యింది.    వైఎస్ హత్య పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జరిగిందనీ, వివేకా గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు జరిగిన ప్రయత్నం కూడా ఆ ప్రణాళికలో భాగమేనన్న అనుమానాలు ముందునుంచీ ఉన్నాయి. సీబీఐ తాజా అఫిడవిట్ లో ఇలా చేసిందెవరన్న క్లారిటీ వచ్చేసింది.   హత్య జరిగిన సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ గుట్టు బయటపడే సమయం దగ్గరకొచ్చేసిందని తాజా పరిణామాలను బట్టి అర్దమౌతోంది.  ప్రస్తుతం సునీల్ యాదవ్ కోణంలోనే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. ఆ అఫిడవిట్ లో కూడా హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర, ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఈ నెల 28న న అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనున్న సంగతి విదితమే. ఆ విచారణకు ముందే సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సాక్ష్యాలను మాయం చేసేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారని పేర్కొనడమంటే.. అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధం అవుతోందనే అర్ధమని న్యాయ నిపుణులు అంటున్నారు. అదే జరిగితే వివేకా హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు.  అవినాష్ ను ఈ నెల 28న విచారించిన తరువాత వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డి నుంచి తాడెపల్లి ప్యాలెస్ కు వెళ్లిన ఫోన్ కాల్ వివరాలను కూడా సీబీఐ బయట పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.  అదే జరిగితే కింగ్ పిన్‌లు బయటకు రావడం ఖాయమని  అంటున్నారు.  

ఏపీ బీజేపీలో తిరుగుబావుటా!

ఏపీ బీజేపీలో తిరుగుబాటు జరుగుతోందా? క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఆ పార్టీ ఏపీలో ముక్క చెక్కలవ్వడానికి సిద్ధంగా ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఏపీలో రాజకీయంగా బలోపేతం అన్న సాకుతో పార్టీ అధిష్ఠానం అమలు చేసిన వ్యూహాలు, ఎత్తుగడలు పూర్తిగా వికటించాయని అంటున్నారు. రాష్ట్రంలో కులాల చీలకతో సులభంగా బలోపేతం అవ్వవచ్చన్న అంచనాతో జగన్ సర్కార్ తో అంటకాగిన ఫలితమే.. ఏపీ బీజేపీలో ముసలానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు.  ఏపీ బీజేపీ పట్ల ఆ పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే రాష్ట్ర నాయకత్వానికీ, క్యాడర్ కూ మధ్య అగాధానికి కారణమైందంటున్నారు.  ఏపీ బీజేపీలో సంక్షోభానికీ, అసంతృప్తికీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డగోలుగా సమర్ధించిన జాతీయ నాయకత్వ తీరే కారణమని పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం తీరు కారణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారంటున్నారు. అక్కడితో రాజీనామాల పర్వం అగే పరిస్థితి కనిపించడం లేదని కూడా అంటున్నారు. కన్నా బాటలోనే  మరికొందరు కూడా ఉన్నారని చెబుతున్నారు. కన్నా పార్టీ కార్యకర్తలతో సమావేశమయి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రంగంలోకి దిగి బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్ర పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధమై విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయిన నేతలను పార్టీ జాతీయ స్థాయి నాయకుడు  శివప్రకాష్‌జీ వారించారు. ఈ నెల 26న తాను విజయవాడకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పడంతో బీజేపీలో రాజీనామాల పర్వానికి పడిన తెర తాత్కాలికమేనని పార్టీ శ్రేణులే అంటున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగిస్తే, తాము పార్టీకి రాజీనామా చేస్తామంటూ దాదాపు 200 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు   విజయవాడ కేంద్రంగా ఓ సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమాచారం తెలిసి పార్టీ అధినాయకత్వం వారించింది.  శివప్రకాష్‌జీ ఈనెల 26న విజయవాడ వచ్చి మరీ సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడాన్ని వాయిదా వేశారు. గతంలో కూడా రెండు సార్లు  పార్టీలో అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించిన సందర్భాలలో కూడా కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని వారించింది.  ఇప్పుడు ఇది మూడోసారి.  ఈసారి శివప్రకాష్‌జీ సమక్షంలో   తాడో పేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర బీజేపీ  అసమ్మతి నేతలు  ఉన్నారు.   బుజ్జగించి సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఈ సారి వెనక్కు తగ్గేదే లే అంటున్నారు. ఏపీలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? వైసీపీ విషయంలో పార్టీ అధిష్ఠానం వైఖరి ఏమిటి? సోము వీర్రాజును ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించరు? అని శివప్రకాష్ జీని నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు.   కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ వ్యవహరించిన తీరు ఏపీలో బీజేపీలో తొలి నుంచీ పని చేస్తున్న వారిలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.   బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచి పనిచేస్తున్న వారిలో సైతం ఏపీ బీజేపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ భూ స్థాపితం అయిపోతుందన్న భావనే వ్యక్తమౌతోందని అసమ్మతి నేతలు చెబుతున్నారు.  ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తుకు మద్దతు విషయంలో పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల వారు అసమ్మతి తెలియజేస్తున్నారు.   35 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఇప్పటికే సంతకాల సేకరణ చేసినట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  సోము వీర్రాజును అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేశారంటున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల పార్టీ అధినాయకత్వం  వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.