ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్టు.. తరువాత కవితేనా?

ముందు నుంచీ అనుకున్నట్లుగానే  లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. సీబీఐ ఆదివారం (ఫిబ్రవరి 26) ఆయనను విచారించి ఆ తరువాత అరెస్టు చేసింది. ఉదయం నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు.  ఇక్కడ తప్పని  సరిగా ప్రస్తావించాల్సిన అవసరమేమిటంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తారని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోడీ సర్కార్ ను వ్యతిరేకించే పార్టీలూ, నాయకుల లక్ష్యంగానే పని చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణను కేవలం ఆప్ మాత్రమే చేయడంలేదు. బీజేపీయేతర పార్టీలన్నీ చేస్తున్నాయి. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు వాటి ప్రతిష్టకు వన్నె తేచ్చేదిగా ఎంత మాత్రం లేదని సామాన్య జనం కూడా అభిప్రాయపడే విధంగా ఉందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అదలా ఉంచితో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడంతో ఇక తరువాతి వంతు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సౌత్ గ్రూప్ కు చెందిన కవిత, రామచంద్ర పిళ్లై మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు.   దీంతో తదుపరి అరెస్ట్ కవితనే కావొచ్చని అంటున్నారు. ఇప్పటికే కవితను సీబీఐ ఒక సారి విచారించింది. మరో సారి విచారణకు నోటీసులు జారీ చేసినా.. విచారణకు ఎప్పుడు హాజరు కావాలన్నది స్పష్టం చేయలేదు. ఇప్పుడు మనీష్ సిసోడియా అరెస్టుతో రోజుల వ్యవధిలోనే కవితనూ విచారించే అవకాశం ఉందని అంటున్నారు.   

జోడో .. హస్తానికి జీవన్ టోన్ టానిక్ అవుతుందా?

కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఏమి చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అనేది పక్కన పెడితే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పాతికేళ్ళకు పైబడిన తమ రాజకీయ జీవితంలో తొలి సారిగా చేపట్టిన భారత్ జోడో యాత్ర... చుట్టూనే ప్లీనరీ చర్చలు సాగిన వైనం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి, అసలు అందు కోసమే ప్లీనరీ సమావేశాలు నిర్వహించారా అన్న విధంగా పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదలు,  ప్రస్తుత అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే వరకు, వేదిక ఎక్కిన ప్రతి నాయకుడు, నాయకురాలు జోడో యాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. రాహుల్ గాంధీని అభినందిచారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 145 రోజుల పాటు సాగిన రాహుల్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం  రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలు కాదని  రాహుల్ గాంధీని దగ్గరుండి నడిపించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, వంటి నాయకులు యాత్ర పొడుగునా చెప్పినా, ఇప్పడు ప్లీనరీలో మాత్రం  జోడో యాత్రే కాంగ్రెస్ పార్టీకి  బలాన్నించే,   జీవన్ టోన్  టానిక్ అనే విధంగా ప్రసంగాలు సాగాయి.  నిజమే, దేశంలో మహాత్మా గాంధీ మొదలు చంద్ర శేఖర్ (మాజీ ప్రధాన మంత్రి) వరకు, వైఎస్సార్ మొదలు చంద్రబాబు, జగన్ వరకూ చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారు. నిజానికి, నడుస్తున్న పవర్ పాలిటిక్స్ చరిత్రలో పాదయాత్ర రాజకీయ పాఠ్యాంశంగా మారిపోయింది. అలాగే, అధికారానికి దగ్గరిదారి  (షార్ట్ కట్) పాదయాత్ర అనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అయితే పాదయాత్ర చేసిన వారంతా పవర్ లోకి వస్తారా , అంటే అయితే అది వేరే విషయం. వేరే చర్చ. అదలా ఉంచి మళ్ళీ,  ప్లీనరీ ప్రసంగాలలోకి వస్తే, ఆ ప్రసంగాలను గమనిస్తే, సోనియా గాంధీ మొదలు రాహుల్ గాంధీ వరకు జోడో యాత్ర సక్సెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారనే విషయం అర్థమవుతుంది. అలాగే  జోడో యాత్ర సక్సెస్ (?) విషయంగా అందరికంటే సోనియా గాంధీనే ఎక్కువ ఆనందించారు. నిజమే, కొడుకు ప్రయోజకుడు అయితే, ఏ తల్లి  మాత్రం సంతోషించదు. అందులోనూ సోనియాజీ, రాహుల్ గాంధీని ప్రయోజకుడిగా చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు  చూస్తున్నారు.  సో .. రాహుల్ జోడో యాత్ర సక్సెస్ విషయంగా సోనియాజీ అంతలా ఆనందపడి పోయారని అనుకోవచ్చును. అందుకే ఆమె  జోడోకు ముడివేసి క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై  చెప్పారు. ఇకపై పదవులకు దూరంగా ఉంటానని చెప్పు కొచ్చారు. అలాగే   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  రాహుల్ గాంధీ జోడో ..జీవన్ టోన్ టానిక్  అందించిన శక్తితో రేపటి ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే విశ్వాసాన్నిసోనియాజీ వ్యక్తం చేశారు.   అలాగే, రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్రతో తాను ప్రజలకు మరింత దగ్గరయ్యానని అన్నారు. జోడో యాత్ర తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని చెప్పారు. జోడో యాత్ర నేర్పిన పాఠాలతో కాంగ్రెస్‭ పార్టీకి పూర్వవైభవం రానుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అయితే నిజంగా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఆశిస్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవ స్థితిని తీసుకు వస్తుందా? కనీసం  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశిస్తున్న విధంగా, 2024 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ, సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? అంటే  అది ఇప్పుడే చెప్పలేమని, 2024కు ముందు 2023 పరీక్షను  ముఖ్యంగా, కర్ణాటక   ఫలితాలను బట్టే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. నిజానికి, అంత వరకు కూడా ఆగవలసిన అవసరం లేదు..   వచ్చే నెల మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోడోయాత్ర హిట్టా ..ఫట్టా అనేది తెలిపోతుందని పరిశీలకులు అంటున్నారు.

నితీష్ తో బీజేపీ పర్మనెంట్ కటీఫ్ నిజమేనా?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి  అంటారు.  ఇదో  నానుడి. అయితే ఈ నానుడి అన్ని సందర్భాలలో నిజం అవుతుందా అంటే  లేదు. అందుకు కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి, అంటున్నారు, అది కూడా మరెవరో కాదు,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.  అవును  బీజేపీతో తెగతెంపులు చేసుకుని  కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టు కట్టిన, బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్  తో మరోమారు చేతులు కలిపే ప్రశ్నే లేదని అమిత్ షా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నితీష్ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోయాయని విస్పష్టంగా తేల్చేశారు. నిజానికి, రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం. అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  లో బీజేపీ, టీడీపీ ఎన్ని సార్లు పొత్తు  పెట్టుకున్నాయో అన్నిసార్లూ విడిపోయాయి. అయినా మళ్ళీ  మళ్ళీ కలుస్తూనే ఉన్నాయి. అలాగే  ఇతర పార్టీలు కూడా, ‘చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ’  టైపులో పొత్తులు పెట్టుకోవడం, విడి పోవడం మళ్ళీ కలవడం .. మళ్ళీ విడాకులు .. మళ్ళీ .. ఇలా రాజకీయ చక్రం తిరుగుతూనే వుంది.  అయితే, ఎన్నికల వ్యూహకర్త అవతారం చాలించి, ప్రత్యక్ష రాజకీయాల్లో పాదం మోపేందుకు బీహార్ లో పాదయాత్ర వేస్తున్న ప్రశాంత్ కిశోరే, నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించిన నేపథ్యంలో అమిత్ షా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో  ఆ తర్వాత ఏడాదికే 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, నితీష్ పార్టీ జేడీ(యు), పాశ్వాన్ పార్టీ, ఎల్జీపీతో కలిసి ఎన్డీఎ కూటమిగా పోటీ చేసి విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలలో జేడీయు కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా, ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదిలివేసింది. అయితే  గత ఆగష్టులో నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని  ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు.   ఈ నేపథ్యంలో బీహార్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో గత లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని నిలుపు కునేందుకు నితీష్ కుమార్ మీద ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 40 లోక్ సభ స్థానాలకు గానూ ఎన్డీఎ 39 (బీజేపీ 17, జేడీయు 16, ఎల్జీపీ 6 సీట్లు ) గెలుచుకుంది. ఈనేపథ్యంలోనే వెస్ట్ చంపరాన్ జిల్లాలోని లారియాలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా ముఖ్యమంత్రి నితీష్ కుమార్  పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. నితీష్ కుమార్ , బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి కావాలనే కోరికతో బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ తో బీహార్ సీఎం నితీష్ చేతులు కలిపారని అన్నారు. జేడీయూ, ఆర్జేడీలది అపవిత్ర కూటమిగా అభివర్ణించారు.నితీష్ కుమార్‌కు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేసిందని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా చేసేందుకు జేడీయూ సుప్రీం అంగీకరించారని, ఆయనే ఆటవిక పాలనగా ముద్ర వేసిన లాలు పాలన మళ్ళీ తెచ్చేందుకు నితీష్ కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.  ఎప్పటికప్పుడు మనసు మార్చుకునే నితీష్‌తో భాగస్వామ్యంపై విసుగెత్తిపోయామని, ఇక ఎప్పటికీ ఆయనకి బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. ''జయప్రకాష్ హయాం నుంచి నితీష్ కాంగ్రెస్, జంగిల్ రాజ్‌పై పోరాడారు. ఇప్పుడు లాలూ ఆర్జేడీ, సోనియా గాంధీ కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపారు. ప్రధాన మంత్రి పదవి కావాలనే ఆశతో అభివృద్ధి వాది నుంచి అవసరవాదిగా మారారు'' అని అమిత్‌షా విమర్శలు గుప్పించారు. బీహార్ పరిస్థితి బాగోలేదని, శాంతిభద్రతలు లేవని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులను చంపుతున్నారని, నితీష్ మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ప్రధాన మంత్రి నిషేధించారని గుర్తుచేశారు. బీహార్‌లో ఆటవిక పాలనకు చరమగీతం పాడాలంటే ఒకే మార్గం ఉందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో  నరేంద్ర మోడీని తిరిగి ప్రధానిని చేయాలని అన్నారు. బీహర్‌లో ప్రతి రోజూ ఏదో ఒక హత్య, అత్యాచారం వార్తలు వెలుగుచూస్తున్నాయని, నితీష్ కుమార్‌కు, ఆయన ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.  గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని, అయినప్పటికీ ప్రధానమంత్రి ఇచ్చిన మాట కోసం మరోసారి నితీష్‌ను ముఖ్యమంత్రిని చేశారని అమిత్‌షా అన్నారు. బీహార్‌ వెనుకబాటుతనాన్ని నితీష్, లాలూ ఎప్పటికీ పోగొట్టలేరని, రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇదే తగిన తరుణమని అన్నారు. ఇందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. సుమారు అరగంట సేపు చేసిన ప్రసంగంలో సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులు, 370 అధికరణ రద్దు, ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐపైప నిషేధం వంటి అంశాలను అమిత్‌షా ప్రస్తావించారు.అయితే బీజేపీ నిజంగానే, నితీష్ కుమార్ తో శాశ్వత తెగతెంపులు చేసుకుందా? అంటే  అది ఇప్పుడే చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాగే  జెడీయులోని ఆర్జేడీ వ్యతిరేక వర్గాన్ని తమ వైపు తిప్పుకుని, జేడీయులో చీలిక తెచ్చే ఉద్దేశంతో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు.

కొత్త గవర్నర్ ఎదుట పాత డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్  గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్  రెండురోజుల కిందట (ఫిబ్రవరి 24) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు తిరగక ముందే ఆయన ఢిల్లీ వెళ్లారు. రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మరి కొందరు కేంద్ర మంత్రులతో సమావేశ మయ్యారు. నిజానికి  ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్ ఢిల్లీ వెళ్ళడం వెనక  ఏదో ఉందని అనుకోవలసిన అవసరం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత కేంద్ర పెద్దలను కలిసి కృతఙ్ఞతలు చెప్పడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే, గవర్నర్  సయ్యద్ నియామకం జరిగిన క్షణం నుంచి  అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్ సయ్యద్ ఢిల్లీ పర్యటనకు కొంత రాజకీయ ప్రాధాన్యత ఉన్నా ఉండవచ్చును. అందుకే గవర్నర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాలలో అసక్తి రేకెత్తిస్తోంది.   అదలా ఉంటే  గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే, సిబిఐ మాజీ జేడీ  వీవీ లక్ష్మీనారాయణ రాష్ట్ర్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం సమర్పించాలని  గవర్నర్ ను కోరారు. ఈ మేరకు ఆయన, ట్విట్టర్ ద్వారా నేరుగా గవర్నర్ కు వినతి పత్రం పోస్ట్ చేశారు. అంతేకాదు, గవర్నర్ తో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సేతారామన్ ను ట్యాగ్ చేశారు. నిజానికి  కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయనతో ఇంచు మించుగా 40 నిముషాలకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా, శాంతి భద్రతల పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించినట్లు సమాచారం.  అదలా ఉంటే   రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని  తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు  మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇతర నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే  జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష డిమాండ్ ను ఇంతవరకు పట్టించుకోలేదు. అందుకే  జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితిని  నేరుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. అలాగే  మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని  ఆ విధంగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని లక్ష్మీనారాయణ గవర్నర్ ను కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడుతోన్ననేపథ్యంలో ప్రజల్లో గందరగోళం నెలకొందని లక్ష్మినారాయణ వినతి పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని తెలుసుకునే అధికారం ప్రజా ప్రతినిథులకే కాకుండా ప్రజలకు కూడా ఉంటుందని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యకలపాలలలో పారదర్శకత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని  బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టులో వుంది. ఆయన ఎలా స్పందిస్తారనేది చూడవలసి ఉందని అంటున్నారు.

విపక్షాల పై కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్  మనసులో ఏముందో  ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో  ఉహించడం కష్టం. అందుకే  అయన ఏమి చేసినా  ఏమి చేయక పోయినా ఏం మాట్లాడినా, ఏదీ మాట్లాడక పోయినా మీడియా ఫోకస్ మాత్రం ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది. ఈ మధ్య కొంత కాలంగా ఆయన  మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. కానీ  గత మూడు నాలుగు రోజులుగా ఆయన  బీఆర్ఎస్ ముఖ్యనేతలు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఏమిటి చర్చిస్తున్నారు? అనేది ఎవరికీ తెలియక పోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికలపై దృష్టి  కేద్రీకరించి నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.  రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మునుగోడు ఉప ఏన్నిక తర్వాత అంతర్గత కలహాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మరో మారు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలు రెండూ ఎవరి దారిన వారు, తమ పని తాము చేసుకు పోతున్నారు. ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంచార్జి, మాణిక్‌రావు ఠాక్రే ఎక్కువ తక్కువలు లేకుండా, అందరికీ బాధ్యతలు అప్పగించారు. ఎవరికీ వారు హాత్ సే హాత్ జోడో  యాత్రలలో బిజీ అయిపోయారు.  కొట్లాటలు సర్దు మణిగాయి. కార్యకర్తలలో మళ్ళీ జోష్ పెరిగింది. మరో వంక బీజేపీలో అంతర్గత తగవులు తెరపై కొచ్చాయి. మరో వంక బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఎందుకనో ఏమో కానీ, ముందులా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద చూపడం లేదు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలు వరసగా వాయిదా పడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పొగడ్తలతో ముంచెత్తి, రాజేసిన సెగలు, పొగలు  బీజేపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సో ఇదే అదనుగా ముందస్తుకు వెళితే, బీజేపీని కట్టడి చేయడం మరింత సులువవుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఓ పది సీట్లు ఎక్కువ వచ్చినా, పట్టుకొచ్చుకోవడం ఈజీ అవుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి మళ్ళీ మరో మారు ముందస్తు ఎన్నికలపై మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.  అయితే ముందస్తు ఎన్నికల సంగతి ఎలా ఉన్నా, నవంబర్ , డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికలకు, ఆరు నెలలు ముందుగా అంటే, ఏప్రిల్, మే నాటికి అభ్యర్ధులను ఖరారు చేసందుకు వీలుగా ముఖ్యమంత్రి ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు. నిజానికి గతంలో ముఖ్యమంత్రి సిట్టింగులు అందరికీ సీట్లు ఖాయం అని ప్రకటించారు. అయితే ఇప్పడు, కొంత మందికి మొండి చేయి చూపించక తప్పదన్న వాదన వినిపిస్తోంది.  వామ పక్ష పార్టీలతో ప్రత్యక్ష పొత్తులు, కాంగ్రెస్ లోని ఒక వర్గంతో లోపాయికారి ఒప్పందాలు, తదితర తాజా పరిణామాలను బేరీజు వేసుకుని కొత్త జాబితా సిద్దం చేస్తునట్లు చెపుతున్నారు. సర్వే నివేదికలు సాకుగా చూపి కొందరు సిట్టిగులకు మొండి చేయి చూపించే అవకాశం ఉందని అంటున్నారు.  అందుకే ముఖ్యమంత్రి కేసీఅర్ గెలుపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి వేర్వేరు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి సాధ్యమైనంత త్వరలో పంపించాలని నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ విస్తరణ చేయాలంటే.. మూడో సారి గెలిచి తీరాలి. మూడోసారి గెలవాలంటే ముందస్తుకు పోవడంతో పాటుగా, సిట్టింగులలో కొందరు త్యాగాలకు సిద్దం కావలసి ఉంటుంది. ముందస్తుకు వెళ్ళేలా ఉంటే, ఏప్రిల్ మే లలో  గే కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చకూడా నడుస్తోంది. గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థుల్నిప్రకటించారు. ఈ సారి కూడా అలా జరిగే అవకాశం ఉందని, అంటున్నారు. ముందస్తుకు వెళ్ళేలా ఉంటె వారం పది రోజుల్లో అసెంబ్లీ రద్దు, అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని లేదంటే, ఏప్రిల్ మే నెలలలో అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఏదైనా కేసీఆర్ విపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

రాజకీయాలకు సోనియా గుడ్ బై?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారా?  చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్‭పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం రెండో రోజున  శనివారం (ఫిబ్రవరి 25)  పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ఆమె చేసిన  ఆసక్తికర వ్యాఖ్యలు, ఈ ప్రశ్నను తెరపైకి తెచ్చాయి.  నిజానికి సోనియా గాంధీ తన ప్రసంగంలో రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నానని స్పస్తమైన ప్రకటన ఏదీ చేయలేదు. కానీ  రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర  విషయాన్నిప్రస్తావిస్తూ.. భారత్ జోడో యాత్రతో తన  ఇన్నింగ్స్  పూర్తి కానుండటం సంతోషంగా ఉందని అన్నారు. దీంతో  ఆమె రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే అలాంటిదేమీ లేదని  ఆమె భారాత్ జోడో యాత్ర నేపధ్యంగా తానూ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పు కున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించారని, అలాగే మరో మరు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వేకరించనని మాత్రమే చెప్పారని పార్టీ స్పష్టం చేసింది.  సహజంగా, రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదు. అయితే వయసు మీద పడిన తర్వాత లేదా అనారోగ్య సమస్యల కారణంగా కొందరు రాజకీయ నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అయితే, ఇంచు మించుగా రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన  సోనియా గాంధీ మాత్రం  కారణాలు ఏవైనా చాలా కాలంగా రాజకీయ ఒత్తిళ్ళ నుంచి విశ్రాంతి కోరుకుంటున్నారు. నిజానికి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశంతోనే 2018లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కుమారుడు  రాహుల్ గాంధీకి అప్పగించారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ  రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా  చేయడంతో, గత్యంతరం లేని పరిస్థితిలో ఆమె  మరో మారు  పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయినా, ఎంత కాలమైనా రాహుల్ గాంధీ  అధ్యక్ష బాధ్యతలు తీసుకోకపోవడంతో గత సంవత్సరం అక్టోబర్ లో   మల్లిఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.  అదలా ఉంటే భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కీలక మలుపు అన్న ఆమె ఆ యాత్ర కోసం రాహుల్ గాంధీ పట్టుదలతో పనిచేశారన్నారు.  ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలను పునరుద్దరించేందుకు రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఎంతో దోహదపడిందని అన్నారు. రాహుల్ గాంధీకి అండగా నిలిచి జోడో యాత్రను సక్సెస్ చేసిన కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. కార్యకర్తలు ఖర్గే నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సోనియా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు దేశానికి ఇది ఎంతో కీలక సమయమని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. బీజేపీ,  ఆర్ఎస్ఎస్ పాలనలో కనికరం అనేది లేకుండా పోయిందని, ప్రతి సంస్థను అణచివేసి, స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.  మోడీ నిర్ణయాలన్నీ కొద్ది మంది వ్యాపారులకు మాత్రమే అనుకూలంగా ఉంటున్నాయని సోనియా మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో.. బీజేపీని ఓడించాలని కార్యకర్తలకు సోనియా పిలుపునిచ్చారు.  అదలా ఉంటే సోనియా గాంధీ తమ ప్రసంగంలో రాజకీయ జీవితం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపు తిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ – ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని సోనియా తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు జరిగిన ప్లీనరీలో, పార్టీ టాప్ కౌన్సిల్ సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించాలని కమిటీ తీర్మానించింది. కాంగ్రెస్ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర పార్టీలతో పొత్తులతో సహా 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌నకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ ప్లీనరీలో చర్చించారు.

తెలంగాణ ఆర్టీఐ ఖాళీ.. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ

తెలంగాణ ఆర్టీఐ ఖాళీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ లో ఐదుగురు కమిషనర్లు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమిర్ హుస్సేన్, గుగులోతు శంకర్ నాయక్ లు శుక్రవారం పదవీ విరమణ చేశారు. దీంతో ఇప్పుడు సమాచార హక్కు కమిషన్ లో కేవలం సిబ్బంది మాత్రమే మిగిలారు. రాష్ట్రప్రభుత్వ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 2017లో బుద్దా మురళిని సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ గా  ఎంపిక చేసింది. ఆ తరువాత సీనియర్ జర్లలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్గా, సయ్యద్ అమిర్ హుస్సేన్, గిరిజన విద్యార్థి శంకర్ నాయక్ లను కమిషనర్లుగా ఎంపిక చేసింది. వీరి నియామకానికి అప్పటి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయడంతో అందరూ ఓకే సారి ప్రమాణ స్వీకారం చేశారు. గడువు ముగియడంతో అందరూ ఒకేసారి పదవీ విరమణ చేశారు. ప్రధాన కమిషనర్ బుద్ధా మురళి అయితే ఈ ఏడాది జనవరిలోనే పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచీ ప్రధాన కమిషనర్ నియామకం జరగలేదు. ఇప్పుడు కమిషనర్లు కూడా పదవీ విరమణ చేయడంతో ఆర్టీఐ ఖాళీ అయిపోయింది. ప్రభుత్వం కమిషనర్ల నియామక ప్రక్రియ ఇంకా ఆరంభించలేదు. ఎప్పడు ఆరంభిస్తుందన్న క్లారిటీ కూడా లేదు. దీంతో ఆర్టీఐ నామమాత్రంగా మిగిలిపోయినట్లు అయ్యింది. సమాచార హక్కు చట్టం లక్ష్యం నీరుగారుతున్న పరిస్థితి ఏర్పడింది. 

కన్నా దారిలో ఇంకొందరు.. తెలుగుదేశంలోకి వలసల జోరు!

ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయం వేడెక్కుతుంది. అది సహజమే. రాజకీయ పార్టీలలో గెలుపు గుర్రాల వేట మొదలవుతుంది. అదీ సహజమే. రాజకీయ నాయకుల్లో టికెట్ల ఆరాటం ఆరంభమవుతుంది. రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగైపోయిన నేపధ్యంలో అటు పార్టీలు, ఇటు నాయకులు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతారు. అది కూడా సహజమే. కానీ ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే గడువు ఉంది.  కానీ అప్పుడే పార్టీల్లో.. నాయకుల్లో ఎన్నికల హడావుడి పెరిగిపోయింది. గెలుపు గుర్రాల వేట కూడా ఆరంభమైపోయింది.  ఇటు పార్టీలు అటు నాయకులు ఎన్నికల మూడ్  లోకి వెళ్లి పోయారు. ఓ వంక వడపోతలు మరోవంక గోడ దూకుడులు  అప్పుడే జోరందుకున్నాయి.  ముఖ్యంగా ప్రధాన పార్టీలు అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించడంతో పోటీకి సిద్దమవుతున్ననేతలు, ఆశావహులు, స్థానిక సమీకరణాలు, పార్టీల బలాబలాలు, గెలుపు అవకాశాలు బేరీజు వేసుకుని, ఉన్న పార్టీలో ఉండడమా,   గోడ దూకడమా అన్న లెక్కల్లో బిజీ అయిపోయారు. మాజీ మంత్రి,  రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంతో..  ఇప్పడు రాజకీయ వర్గాల్లో  నెక్స్ట్ ఎవరు?  అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా  బీజేపీ నుంచి బయటపడేది ఎవరన్న చర్చ స్పీడప్ అయ్యింది. నిజానికి కన్నా వెంట ఆయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలోనే తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  కేవలం అనుచరులు మాత్రమే కాదు, సహచరులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారనే  ప్రచారం సాగుతోంది.  రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు చాలా మంది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, ఇతర పార్టీల లోకి సర్దుకున్నారు. ఇప్పడు బీజేపీ విషయంలోనూ బీజేపీ నాయకులు అదే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  నిజానికి అప్పట్లో  టీడీపీ  వైసేపీలలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఏదో విధమైన రాజకీయ ఫలాలను ఎంతో కొంత మేర అందుకున్నారు. కొందరు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలలో మంత్రులయ్యారు. మరి కొందరు ఇతర అధికార పదవులు  అందుకున్నారు. రాజకీయంగా నిలదొక్కుకున్నారు. కానీ  కమలం గూటికి చేరిన కీలక నేతలు ఎవరికీ కూడా ఎలాంటి పదవువులూ దక్కలేదు. రాష్ట్రంలో ఆ అవకాశమే లేదు. కేంద్రంలో అవకాశం ఉన్నా  బీజేపీ నాయకత్వం బయటి వారిని బయటనే ఉంచేసింది. దీంతో సహజంగానే, బీజేపీలోని మాజీ కాంగ్రెస్ నాయకులు  ఏదో ఆశించిన బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు తీవ్రమైన ఉక్క పోతకు గురి అవుతున్నారు. ఇప్పుడు అలాంటి వారంతా, కన్నా ..  బాటలో కొత్త దారులు వెతుక్కుక్కుంటున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీలో చేరిన వెంటనే పని  ప్రారంభించిన కన్నా లక్ష్మినారాయణ చాలా మంది మాజీ మిత్రులు, బీజేపీ నాయకులు తనతో టచ్ లో ఉన్నారని చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నా  ఎవరి పేర్లూ చెప్పక పోయినా కొందరు బీజేపీ సీనియర్లు తనతో టచ్‌లో ఉన్నారన్నారని.. వారంతా త్వరలోనే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని.. ఇప్పటికే అనుచరులతో మాట్లాడుతున్నారని.. అన్నీ త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. అయితే, కన్నా తనతో టచ్ లో ఉన్నవారిలో,  దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారని వస్తున్న వార్తల్లో  నిజం లేదని స్పష్టం చేశారు. అయితే, నిజానికి కన్నా టీడీపీలో చేరతారనే ప్రచారానికి ముందు నుంచే, టీడీపీలో చేరే వారిలో పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. సుదీర్ఘ కాలం తరువాత ఇటీవల  దగ్గుబాటి వెంకటేశ్వర రావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైనప్పటి నుంచి, ఈ ప్రచారం జరుగుతూనే వుంది.  అయితే పురందేశ్వరి ప్రస్తుతం తనతో పాటు టీడీపీలో చేరడం లేదని చెప్పిన కన్నా,  ఆమె భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉందని అన్నారు, అంటే  ఆమె కూడా  తెలుగు దేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని అనుకోవచ్చుననే సంకేతం కన్నాలక్ష్మీనారాయణ ఇచ్చారు. పురందేశ్వరి విషయం ఎలా ఉన్నా  కన్నా... మాజీ కాంగ్రెస్, బీజేపీ   మిత్రులకు టీడీపీ ఎంట్రీకి రోడ్డు మ్యాప్ క్లియర్ చేసినట్లేనని, ఇప్పటికిప్పుడు కాకపోయినా, ముందుముందు టీడీపీలోకి వలసలు జోరందుకుంటాయని   అందరూ అంగీకరిస్తున్నారు. అందుకే ముందు ముందు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తధ్యమని అంటున్నారు.

నూతన సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 14న

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఏపీల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తన జన్మదినం అయిన ఫిబ్రవరి 7 ముహూర్తంగా నిర్ణయించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  అడ్డు రావడంతో ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా  ఏప్రిల్ 14న అంబేడ్కర్ రోజున సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించాలనీ, అదే రోజున  సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ  సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఒకే వేదికపై నలుగురైదుగురు ముఖ్యమంత్రులు కూర్చుంటే.. బీఆర్ఎస్ సభపై దేశ వ్యాప్త చర్చ జరుగుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సభకు పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, కేరళ, పంజాబ్, డిల్లీ ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా ఆహ్వానించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

మరో మెడికో ఆత్మహత్య

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్మయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఆస్పత్రిలో ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉంది. అంతలోనే మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి  బలవన్మరణానికి పాల్పడ్డాడు.  నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళా. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష (22) తన హాస్టల్ గదిలో శుక్రవారం ( ఫిబ్రవరి 24) రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాసరి హర్ష ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం డిన్నర్ చేసేంత వరకూ తోటి విద్యార్థులతో కలివిడిగా తిరిగిన హర్ష ఆ తరువాత తన గదిలోకి వెళ్లిపోయాడనీ, ఉదయం చూసే సరికి ఉరి వేసుకుని మరణించాడని సహ విద్యార్థులు చెబుతున్నారు.   దాసరి హర్ష స్వస్థలం మంచిర్యాల జిల్లా చింతగూడ.   

రాజకీయాలలో దార్శనికుడి తొలి అడుగుకు నేటితో నాలుగున్నర దశాబ్దాలు

రాజకీయంగా ఆయనతో విభేదించే వారు కూడా ఆయన దార్శనికతను వేనోళ్ల పొగుడుతారు. అభివృద్ధి విషయంలో ఆయన ఎక్కడా, ఎవరితోనూ రాజీపడరు. ఆయనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. హైదరాబాద్ బిజినెస్ స్కూల్, హైటెక్ సిటీ, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రగతి దారిలోనూ తొలి అడుగు ఆయనదే. అటువంటి దార్శనికుడు రాజకీయ ప్రస్థానం నేటికి నాలుగున్నర దశాబ్దాల కిందట మొదలైంది. ఔను సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల కిందట ఇదే రోజు (ఫిబ్రవరి 25, 1978) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు చంద్రబాబు తొలిసారి నామినేషన్ వేశారు.  అప్పటి నుంచీ చంద్రబాబుది ఒకే దీక్ష, ఒకే లక్ష్యం, ఒకే సంకల్పం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలో అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ నంబర్ వన్ గా చూడాలి. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగానే సాగింది. అభివృద్ధి విషయంలో కానీ, ప్రజా సంక్షేమం విషయంలో కానీ ఎక్కడా ఎప్పుడూ చంద్రబాబు రాజీపడిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్న సమయంలోనూ.. లేని సమయంలోనూ కూడా ఆయన రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసమే తపించారు. సంపద సృష్టి జరగాలి.. ఆ పెరిగిన సంపద ఫలాలు పేదవాడికి చేరాలి. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన ఆలోచన, తపన, కృషి ఇందుకే. అడుగులూ ఆ లక్ష్య సాధనకే... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తొలి సారిగా ఎన్నికల బరిలో అడుగుపెట్టి  నేటికి సరిగ్గా 45 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఈ నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మరెన్నో సంక్షోభాలను అధిగమించారు. ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అపనిందలు మోశారు. అన్నిటినీ ప్రజా జీవితంలో ప్రజల కోసం అడుగులు వేయడానికి లభించిన అవకాశాలుగానే భావించి ముందుకు సాగారు. దార్శనికత ఉన్న నేతగా.. దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లు విపక్ష నేతగా క్రీయాశీలంగా వ్యవహరించిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్లుగా విపక్ష నేతగా జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. ప్రజలకు అండగా నిలబడుతున్నారు.  ప్రజాక్షేత్రంలో ఇంతగా  సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ మనగలిగిన నేత వర్తమాన రాజకీయాలలో మరోకరు కనిపించరు. అతి పిన్న వయస్సులోనే చట్టసభకు ఎన్నికైన నాయకుడిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు.   తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబుదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.  1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా  రాజకీయ కుట్ర జరిగి నెల రాజు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చంద్రబాబు ముందుండి నడిపించారు.  1985 ఎన్నికల్లో తెలుగుదేశం విజయంలో కీలక భూమిక పోషించారు.    1995 సెప్టెంబర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఆయన హయాంలోనే ఇప్పుటి ఐటీ హబ్ సైబరాబాద్ నిర్మాణమైంది. సాహసోపేతంగా  ఆర్థిక సంస్కరణలను  అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి దారిలో పరుగులు పెట్టించారు. అందుకే తిరుగులేని మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చారన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ సారధ్యంలో బీజేపీ, కమ్యూనిస్టులు సహా దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.   నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ  ఏర్పాటు వెనుక క్రియాశీలంగా వ్యవహరించిందీ చంద్రబాబే.   దేశ ప్రధాన మంత్రుల నియామకంలోనూ అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్నే మిగిలిన పార్టీలన్నీ శిరోధార్యంగా భావించాయి. ఇక రాష్టప్రతులుగా కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలామ్ ఎంపికలో కీలక భూమిక పోషించింది కూడా చంద్రబాబునాయుడే అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.   విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం 208 రోజులు 2,817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజనతో  అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్నిటా అగ్రస్థానంలో నిలబడాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని జనం నమ్మారు. అందుకే  మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగల నాయకుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొట్టమొదట గుర్తుకొచ్చిన పేరు చంద్రబాబు నాయుడు కనుకనే   2014 ఎన్నికలలో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. సరే ఆ తరువాత 2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ అభ్యర్థనకు తోడు వివేకా హత్య, కోడి కత్తి కేసుల కారణంగా వచ్చిన సానుభూతి పవనాలతో వైసీపీ విజయం సాధించింది. కానీ విజయం సాధించిన స్వల్ప కాలంలోనే జనంలో ఆ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల భ్రమలు తొలగిపోయాయి. వివేకా హత్య వెనుక ఉన్నదెవరు? కోడికత్తి సంఘటన డ్రామా ఎవరి వ్యూహం అన్నవి జనానికి అర్ధమౌతున్నాయి. దానికి తోడు రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు.. అప్పులే తప్ప అభివృద్ధి జాడ లేకపోవడంతో మళ్లీ జనం చంద్రబాబు వైపు చూస్తున్నారు.  తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ప్రజల పక్షానే నిలిచారనడానికి ఇప్పుడు ఆయన సభలకు జనం బ్రహ్మరథం పట్టడమే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

విజయసాయి రెడ్డి అధికారాలకు కత్తెర!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..  వైయస్ జగన్ హార్ట్ కోర్ ఫ్యాన్ అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు దూరం పెట్టారు? ఎందుకంటే.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేస్తున్న పాదయాత్రలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. అలా వచ్చిన రైతులను.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఔను జగన్ ఆయనను దూరం పెట్టడానికి అదే ఏకైక కారణం. ఈ సంగతి స్వయంగా   ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. సరే ఆ తరువాత జరిగిన పరిణామాలతో  కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు కోటం రెడ్డికి వచ్చిన పరిస్థితే వైసీపీ కీలక నేత విజయసాయికి వచ్చింది. విజయసాయినీ జగన్ దూరం పెట్టారని పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయనను జగన్ ఎందుకు దూరం పెట్టారు అన్న ప్రశ్నకు  ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విజయసాయి అక్కడకు వెళ్లి పరామర్శించడం,  ఆయన మరణించిన తరువాత ఆయన అంత్యక్రియల వరకు నందమూరి, నారా ఫ్యామిలీలు ఎలా అయితే అంత్యక్రియల ఏర్పట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారో..  విజయసాయిరెడ్డి కూడా చేశారు. ఎందుకంటే.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డి భార్యకు సొంత చెల్లెలి కుమార్తె కావడంతో ఆ బంధుత్వంతో విజయసాయి కూడా అక్కడే ఉండి అన్ని విషయాలూ దగ్గరుండి చూసుకున్నారు.   బెంగళూరు నుంచి తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తీసుకు వచ్చిన నాటి నుంచి విజయసాయిరెడ్డి అక్కడే ఉండి.. తారకరత్నకు నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను   విజయసాయిరెడ్డి పలకరించి.. వారి పక్కనే కూర్చొని కొద్ది సేపు   ముచ్చటించారు.  అయితే ఈ వ్యవహారాన్ని ఎవరూ పొలిటికల్ గా చూడలేదు. ఒక విషాద సమయంలో బంధువు కుటుంబానికి విజయసాయి అండగా నిలుచున్నారనే భావించారు. అయితే  విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని అధికార వైసీపీ అధినేత జగన్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తనను ధిక్కరించడంగానే భావించారు.   ఎందుకంటే.. వైసీపీ  అధిష్టానం  రాజకీయ ప్రత్యర్ధులు అంటే వ్యక్తిగత శత్రువులుగానే భావిస్తుంది.  ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకు తార్కానమే.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్.. అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు  వైసీపీ నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా ప్రకటించింది. అందులో యువత, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, ట్రేడ్ యూనియన్, వాణిజ్యం, సాంస్కృతిక, పబ్లిసిటీ, నేత కార్మికులు, వైద్యులు, ఐటీ, వికలాంగులు, సేవాదళ్,  గ్రీవెన్స్ సెల్‌తోపాటు వివిధ విభాగాల అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఇలా అన్ని జిల్లా స్థాయి పార్టీ అనుబంధ విభాగాల నియామకంపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్తగా పేర్కొంది. అది ఇప్పుడు అసలు సిసలు చర్చకు.. అదే వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెట్టారన్న చర్చకు తెరలేపింది.  ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. అదీకాక విజయసాయిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు.  అటువంటి విజయసాయిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించేసింది. విజయసాయికి కో ఇన్ చార్జ్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆ స్థానంలో నియమించారు.    విజయసాయిరెడ్డి వ్యవహారశైలి గత కొన్ని రోజులుగా మారింది ఈ విషయాన్ని  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజే కనిపెట్టారంటే..  పార్టీ అధిష్టానం కనిపెట్టలేదా? ఇంతకీ ఆ మార్పు ఏమిటంటే  విజయసాయిరెడ్డి తన ట్వీట్లలో హీట్ ను పూర్తిగా తగ్గించేశారు. సంసారపక్షంగా, హుందాగా ఆయన ట్వీట్లు ఇటీవలి కాలంలో ఉంటున్నాయి. అదే గతంలో అయితే విజయసాయి  చంద్రబాబు, లోకేష్ పై.. ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడే వారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.  అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పెద్దలతోనే కాదు.. అక్కడి అధికార కేంద్రాలతో సైతం ఆయన చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటారు. అందుకే ఆయనకు రాజ్యసభకు ప్యానెల్ ఛైర్మన్ పదవి  దక్కింది.. అలాగే తాజాగా సంసద్ రత్న అవార్డు కూడా వచ్చింది. దీంతోనే వైసీపీ అధిష్టానానికి ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని చెబుతున్నారు.  ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. విజయసాయిరెడ్డిని జగన్ ఇక పక్కన పెట్టేసినట్లేనని అంటున్నారు.  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయనకు ఉద్వాసన పలికినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.

శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ మాట కొస్తే, దేశ రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కున్న స్థానం ప్రత్యేకం. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడంలో ప్రస్తుతానికి మోదీ, షా జోడీది పై చేయి అయితే కావచ్చు కానీ, అ విషయంలో శరద్ పవార్  ఆ ఇద్దిరికీ ఏ మాత్రం తీసిపోరు. నిజం చెప్పాలంటే వారికంటే పవార్ రెండాకులు ఎక్కువే చదివారు.   2019లో మహారాష్ట్ర బీజేపీ, శివసేన కూటమిలో తలెత్తిన సంక్షోభం  ప్రభుత్వం ఏర్పాటుకు అవరోధంగా మారిన సమయంలో,  ఆ ఇద్దరినీ సైతం శరద్ పవార్ బురిడీ కొట్టించారని అంటారు. ఇక విషయంలోకి వెళితే, 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో,బీజేపీ,శివసేన కూటమిని ప్రజలు గెలిపించారు. మెజారిటీ కట్ట బెట్టారు. కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు తలెత్తడంతో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాలేదు. ఈ నేపద్యంలో మరో గత్యంతరం లేకనో.  లేక రాజకీయ ఎత్తుగడలో భాగంగానో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి సిఫార్స్  మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.  ఇంతవరకు అంతా శాస్త్రోక్తంగానే జరిగింది కానీ, ఆ తర్వాత సీన్ మారింది. శివ సేన దారికి వచ్చే వరకు రాష్ట్రపతి పాలన కొనసాగించాలన్న బీజేపీ అగ్ర నేతల ఎత్తుగడలను ముందుగానే పవార్ పసిగట్టారు. (నిజానికి రాష్ట్రపతి పాలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వమే అయినా, కేంద్ర ప్రభుత్వం అ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని సృష్టించింది మాత్రం శరద్ పవార్ అంటారు)  అంతే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగామూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమికి పురుడు పోశారు. ఆ తర్వాత దానికి మహా వికాస్ అఘాడీ (ఏమ్వీఎ) గా నామకరణం చేశారు. సరే అదంతా వేరే కథ. ఇక శరద్ పవార్ చాణక్యం విషయానికి వద్దాం.శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అఘాడీ ప్రభుత్వం ఏర్పడాలంటే, ముందు రాష్ట్రపతి పాలన అడ్డుగా నిలిచింది. అందుకోసం పవార్, పథకం రచించారు. మాములుగా అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన అంత తేలిగ్గా ఎత్తివేయదు.  ఆ విషయం పవార్ కు బాగా తెలుసు. అందుకే పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ ద్వారా బీజేపీతో రాయబేరాలు నడిపారు.  రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం తెల్లారేసరికి  బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే, దేశ రాజకీయాల్లో మహాశ్చర్యాలలో ఒకటిగా నిలిచిన  బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కేవలం మూడంటే మూడు రోజులలో   పతనమైంది. ఆ తర్వాత, ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ  స్వీకారం చేశారు. అదంతా ఇప్పడు చరిత్ర.  అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు  దేవేంద్ర ఫండవిస్ 2019లో అజిత్ పవర్ తో కలిసి తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనక  శరద్ పవార్ మద్దతు ఉందని  చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పడు దుమారం రేపుతున్నాయి. గత వారం రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో, ‘అప్పుడేం జరిగింది?’ అనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఈ నేపధ్యంలో శరద పవార్ అసలు గుట్టు విప్పారు. అయితే అసలు విషయం చెప్పకుండా  అప్పడు అలా రాత్రికి రాత్రి ప్రభుత్వం ఏర్పాటు జరగకపోయి ఉంటే రాష్ట్రపతి పాలన సుదీర్ఘంగా  కొనసాగేదని మాత్రమే పేర్కొన్నారు. ఆయన అంత ముక్తసరిగా చెప్పిన ఆ ఒక్క మాటే..  2019 మూడునాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు ఆయన ఎత్తుగడలో  భాగమేనన్న వాస్తవాన్ని బయటపెట్టేసింది. అందుకే  ఆయన పవార్  అయ్యారు. రాజకీయ ఎత్తులు , జిత్తులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎందుకంటారో మరో సారి రుజువైంది. దటీజ్ పవార్!

అరెస్టు లేకపోయినా.. అవినాష్ లో ఎందుకీ ఆందోళన, అసహనం?

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్.. రెండో సారి సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం (ఫిబ్రవరి 24) ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సారి అవినాష్ అరెస్టు తథ్యం అంటూ పలు విశ్లేషణలు వెలువడ్డాయి. రాజకీయ పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమనే భావించారు. ఎందుకంటే రెండో సారి విచారణకు రావాలంటూ ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు  పంపిన అనంతరం  సీబీఐ హైకోర్టులో వేసిన ఓ కౌంటర్‌లో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారో పేర్కొన్నారు. ఆ కౌంటర్ కూడా వివేకా హత్య కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేశారు.  దీంతో   సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందనే అంతా భావించారు. అయితే సీబీఐ అవినాష్ ను ఐదు గంటలపాటు ప్రశ్నించి వదిలేసింది. మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పలేదు. ఈ పరిణామం సహజంగా అవినాష్ కు ఎంతో ఊరట కలిగించి ఉండాలి. కానీ సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డిలో ఆ ఊరట కనిపించలేదు సరికదా.. గతంలో ఎన్నడూ లేనంత ఆందోళన కనిపించింది. ఖంగారు కనిపించింది. సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదు.. ఏడాది కాలంగా విపక్ష తెలుగుదేశం ఏవైతే ఆరోపణలు చేసిందో వాటికి అనుగుణంగానే సీబీఐ విచారణ, ప్రశ్నలు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐని విపక్ష తెలుగుదేశం మ్యానేజ్ చేస్తోందన్న అర్ధం వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. పనిలో పనిగా మీడియాపైనా విమర్శలు గుప్పించారు. దుష్ప్రచారం చేస్తన్న మీడియా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. అయితే వివేకా ఆందోళన వెనుక, సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదంటూ చేస్తున్న విమర్శలు, ఆరోపణల వెనుక.. రెండో సారి విచారణలో సీబీఐ ఆయనకు సంధించిన ప్రశ్నలే కారణమని తెలుస్తోంది. తొలి సారి విచారణలో ఆయన తప్పించుకోలేని విధంగా వివేకా హత్య తరువాత ఎవరెవరికి ఫోన్ చేశారన్న దానిపై ప్రశ్నలు సంధించిన సీబీఐ ఈ సారి పూర్తిగా  అవినాష్ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలపై కాన్ సన్ ట్రేట్ చేసిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి   కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ఆధారంగా  అవినాష్ పై ప్రశ్నల వర్షం కురిపించిందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ప్రశ్నించడంతో అవినాష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారనీ, అందుకే మీడియాతో  మాట్లాడుతూ ఆందోళన, అసహనాన్ని దాచుకోలేకపోయారని అంటున్నారు. ఇప్పటికే లాజికల్ గా ఒక కంక్లూజన్ కు వచ్చేసిన సీబీఐ అరెస్టుల కంటే.. ఈ కేసులో సూత్రధారులను కూడా వెలికి తీయడం అన్న అంశంపైనే దృష్టి పెట్టిందని దర్యాప్తు తీరును పరిశీలిస్తున్న న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాలు, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో ప్రస్తావించిన అంశాలనూ గమనిస్తే..  ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే అవినష్ రెడ్డిలో తనను సీబీఐ అరెస్టు చేయలేదన్న ఊరట కనిపించడం లేదని చెబుతున్నారు. 

ఎన్నికల సంగతి తరువాత.. ముందు కవిత చిక్కులపైనే కేసీఆర్ దృష్టి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐలు వేటికవిగా దర్యాప్తును వేగవంతం చేసిన క్రమంలో రోజు రోజుకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు చేరువ అవుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే స్వయంగా కవిత, బీఆర్ఎస్ లు కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు అయితే.. ఏం చేయాలన్న దానిపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సీనియర్ మంత్రులు, నేతలతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య ప్రగతి భవన్ లో అధికారిక ప్రకటనలేవీ లేకుండానే అత్యవసర సమావేశాలు జోరుగా సాగుతున్నాయనీ అంటున్నారు. ఆ సమావేశాల చర్చల సారం ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టయితే ఏం చేయాలి.. లీగల్ గా ఎదుర్కోవడంతో సరిపెట్టకుండా, పొలిటికల్ ఫైట్ ఏ విధంగా చేయాలి అన్న దానిపై వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయ ప్రకటనలు, విమర్శలకు దూరంగా ఉన్న కవిత ఇటీవలి కాలంలో కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం కూడా వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం వెనుక ఒక వేళ డిల్లీ మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేస్తే కేంద్రాన్ని విమర్శించిన కారణంగా కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు జరిగిందంటూ కేంద్రాన్ని తప్పుపట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు.  మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేయడం జరిగితే.. అది పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి... ఇప్పటికే కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీయే కాకుండా కాంగ్రెస్, వైఎస్సార్టీపీ.. ఇతర పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై షర్మిల విమర్శల కారణంగానే ఇటీవల ఆమెను రెండు సార్లు అరెస్టు చేశారంటూ వైఎస్సార్టీపీ ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక ఇప్పుడు కవిత అరెస్టు జరిగితే.. కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తున్నందుకే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేయాలని భావించినా.. సామాన్య జనంలో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా తేలికగా తీసుకుంటారా అన్న చర్చ కూడా ప్రగతి భవన్ లో జరుగుతున్నట్లుగా సమాచారం.  ఇక కవితను అరెస్టు చేయడమంటూ జరిగితే లీగల్‌గా ప్రొసీడ్ కావడం? అదే సమయంలో రాజకీయంగా బీజేపీని డిఫెన్స్ లో పడేయడం అన్న అంశాలపైనే ప్రగతి భవన్ లో చర్చలన్నీ కేంద్రీకృతమయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎన్నికల సంవత్సరంలో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అధినేత.. తన కుమార్తెను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి ఎలా రక్షించుకోవాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఎలా అన్న ఆందోళన కూడా పార్టీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది.   లిక్కర్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లు, అందులో సీబీఐ, ఈడీ లేవనెత్తిన అంశాలు, నిందితులపై మోపిన అభియోగాలు, వీటన్నిటినీ మించి కవితను సీబీఐ గత ఏడాది డిసెంబరు 11న సాక్షిగా ప్రశ్నించడం, ఆ తరువాత సీఆర్పీసీ సెక్షన్ 191 కింద మరో నోటీసు జారీ చేయడం, ఇక అక్కడ నుంచి చార్జిషీట్లలో కవిత పేరును ఈడీ, సీబీఐలు పదేపదే ప్రస్తావిస్తుండటంతో  ఆమెను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఫిక్స్ కేంద్ర ద్యాప్తు సంస్థలు ఫిక్స్ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా కవిత మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఆరోపించడం ఆరోపణలు ఆమెను చిక్కుల్లో పడేశాయని అంటున్నారు. అదీ కాక ఇప్పటికే కవితకు సన్నిహితులుగా చెబుతున్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులు అరెస్టు కావడంతో ముందు ముందు కవిత కూడా అరెస్టయ్యే అవకాశాలే ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  ఒక వేళ అదే జరిగితే ఏకకాలంగా న్యాయపరంగా, పొలిటికల్ గా ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహరచనపైనే ఇప్పుడు సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

ఏపీలో బీజేపీ మౌనం దేనికి సంకేతం? ఒంటరి పోరేనా?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. సుదీర్ఘ కాలం పాటు, మూడు పర్యాయాలు ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత ... అన్నిటినీ మించి, రాష్ట్రంలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ టార్గెట్ చేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కన్నా లక్ష్మినారాయణ, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయన  ఏదో వచ్చిన దారిలో వంటరిగా వెళ్ళి పోలేదు. వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన  పలువురు కీలక నేతలతో సహా తన వెంట వచ్చిన పుచిక పుల్ల సహా అందరినీ ఉడ్చుకు పోయారు. అంతే కాదు  బీజేపీ ఒరిజినల్ క్యాడర్, లీడర్ లను కూడా కన్నా సైకిల్ ఎక్కించారు. నిజానికి ఇది బీజేపీకి పెద్ద షాక్. అసలే ఏపీలో అంతంత మాత్రంగా, అంటే ఉండీ లేనట్లుగా ఉన్న బీజేపీకి కోలుకోలేని దెబ్బ. అయినా  బీజేపీ నాయకత్వంలో చలనం లేదు.  వచ్చేవాళ్ళు వస్తుంటారు.. పోయే వాళ్ళు పోతుంటారు అనే నిర్లిప్త ధోరణి కైపిస్తోంది. రాష్ట్ర నాయకులే కాదు, జాతీయ నాయకులు సైతం, కన్నా రాజీనామా పై స్పందించలేదు.  నిజానికి కన్నా...  ఎవరికీ చెప్పకుండా, ఎవరితోనూ చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి విషయంలో ఆయన తన అసంతృప్తిని ఏమాత్రం దాచుకోలేదు. నిజానికి, కన్నా తమ అసంతృప్తిని లేఖల రూపంలో అయితే నేమీ, పత్రికలు, మీడియా ద్వారా అయితే నేమి పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆయన్ని ఢిల్లీకి పిలిపిచుకుంది. మాట్లాడింది. అంతే  ఆ తర్వాత అంతా మౌనం. ఈ నేపథ్యంలోనే  కన్నా ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని, అయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విషయంలో ఏ విధంగా అయితే ఎటూ తేల్చకుండా, అయన తమ దారి తాను చూసుకునేలా చేసిందో, అదే సైలెంట్ స్ట్రాటజీనే కన్నా విషయంలోనూ కంటిన్యూ చేసింది.   నిజానికి, అప్పుడే కాదు. ఇప్పుడు ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం మౌనం వీడక పోవడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అందుకే  కన్నా రాజీనామా విషయంలో బీజేపీ నాయకత్వ ధోరణి, ఒక విధంగా నిండా మునిగినవాడికి చలేమిటన్న విధంగా ఉందని అంటున్నారు. నిజమే  ఏపీలో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏపీలో బీజేపీకి మినిమం స్టేక్ కూడా లేదు. అలాగే, టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా బీజేపీకి రాజకీయంగా ఒరిగేదీ లేదు పోయేదీ లేదు. బహుశా అందుకే కావచ్చు, బీజేపీ  జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని,( రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, తెలుగు దేశం పార్టీలు రెండూ బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చాయి, అలాగే, రాజ్యసభలో బిల్లుల  విషయంలోనూ ఉభయ పార్టీలు అప్రకటిత మిత్ర పక్షాలుగా బీజేపీకి అండగా నిలుస్తున్నాయి) టీడీపీ, వైసీపీలకు సమాన దూరం పాటించాలనే వ్యూహంతో అడుగులు వేస్తోందనే విశ్లేషణలు వినవస్తున్నాయి.  నిజానికి, రాష్ట్రంలో మరోసారి టీడీపీ,బీజేపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు 2014లో లాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడుతుందని చాల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే, ఇప్పడు తెలుగు దేశం, జనసేన పొత్తు విషయంలో స్పష్టమైన సంకేతాలున్నా  బీజేపీ విషయంలో ఆ క్లారిటీ లేదు.  నిజానికి  ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు అయినా లేదు. సో ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రభావం ఇంచు మించుగా జీరో.. అయినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలరాదనే లక్ష్యంతో  తెలుగు దేశం  అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు. అయితే, బీజేపీ ఎందుకనో ఏమో, జనసేనతో పొత్తుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేస్తోంది. మరోవంక జనసేన వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీతో పొత్తు అనివార్యమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజా పరిణామాలను గమనిస్తే  ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమవుతున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. అదే జరిగితే  బీజేపీ ఓటుతో పాటుగా, మోడీ అభిమానులు, కేంద్ర ప్రభుత్వ విధానలను సమర్ధించే మధ్యతరగతి ఓటర్లు ఏం చేస్తారు? ఇదీ ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

ఎన్నికలు వద్దు... ఎంపికలే ముద్దు..సీబ్ల్యూసీపై కాంగ్రెస్ ప్లీనరీ నిర్ణయం

 పాతికేళ్ళ తర్వాత గత సంవత్సరం (2022) అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీ కుటుంబ బయటి వ్యక్తి మల్లి ఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ లో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర, 2023 జనవరి 30 తేదీన శ్రీనగర్ ( జమ్ము కశ్మీర్) లో ముగిసింది. జోడో యాత్రకు కొనసాగింపుగా, ప్రస్తుతం, హత్ సే హాత్ జోడో యాత్ర సాగుతోంది. ఈ నేపధ్యంలో శుక్రవారం(ఫిబ్రవరి 24) ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో మూడు రోజులపాటు జరిగే  కాంగ్రస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ నిర్వహించడం ద్వారా ఆ రాష్ట్రంతోపాటు  పక్కనున్న మధ్యప్రదేశ్‌, తెలంగాణ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి  ఆ భరోసాతో 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఇందుకోసం భావసారూప్య పార్టీలతో జట్టుకట్టే అంశంపైనా ప్లీనరీలో మేధోమథనం సాగించనున్నారు. ఈ ప్లీనరీకి కాంగ్రెస్‌ అగ్రనాయకులతోపాటు సుమారు 15వేల మంది ప్రతినిధులు హాజరు అవుతున్నట్లు సమాచారం. అయితే, పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా  పార్టీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సభ్యుల ఎన్నికకు సంబంధించి, మళ్ళీ పాత, ‘ఎంపిక’ విదానానికే ఓటేసింది.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ()కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నామినేట్ చేస్తారని ఆయన వెల్లడించారు. రాయపూర్‌లో  జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ తొలి సెషన్  స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ తదితరులు సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కార్యవర్గానికి ఎన్నిక వద్దని, నామినేషన్ వేయాలనే నిర్ణయం కూడా ఏకగ్రీవంగా జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని సింఘ్వీ తెలిపారు.  పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటులో పార్టీ నేతతో కలిపి సీడబ్ల్యూసీలో మొత్తం 25 మంది సభ్యులు ఉంటారు. 12 మంది ఎన్నిక ద్వారా మరో 11 మంది నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నికవుతారు. ఎన్నికలు అవసరం లేదని సీనియర్లు, ఉండాలని జూనియర్లు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 1997లో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి.  కాగా ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరు కాలేదు. మల్లికార్జున్ ఖర్గే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చేందుకే వారంతా సమావేశానికి దూరంగా ఉన్నారని, మిగతా నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సీనియర్ నేతలు చెప్పారు. ఇదిలా ఉండగా రాయపూర్ లో ప్రారంభమైన ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

యువరాజ పట్టాభిషేకం కోసమేనా.. కేసీఆర్?

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంచు మించుగా  ఏడాది నుంచే ముందస్తు ఊహగానాలు వినిపిస్తూ వచ్చినా, ఎందుకనో గానీ, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ ఇక్కడా అక్కడా ముందస్తు మాట వినిపిస్తున్నా, ఇక ముందస్తు ముచ్చట లేనట్లే అనే అభిప్రాయమే బలపడుతోంది.  అధికార పార్టీ ‘ముఖ్య’ నాయకుడు సహా ఆ పార్టీ నాయకులు అందరూ, ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలే సమయం ఉందని క్యాడర్ ను సన్నద్దం చేస్తున్నారు.  తాజాగా  మంత్రి కేటీఆర్  గురువారం(ఫిబ్రవరి 23) జయశంకర్ భూపాల పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలోనూ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయముందనే అన్నారు.   అయితే, అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలకంటే, జాతీయ రాజకీయాలపైనే అంతకంటే ముఖ్యంగా, ఏపీలో బీఆర్ఎస్  పార్టీని బలోపేతం చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.  నిజానికి  ఇంతవరకు తెలంగాణ సహా మరే రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరగలేదు. అందుకు ఒకే ఒక్క మినహాయింపు ఆంధ్రప్రదేశ్. టీఆర్ఎస్ పేరు మారి బీఆర్ఎస్ గా అవతరించిన కొద్ది రోజులకే మూడు పార్టీలు మారి వచ్చిన తోట చంద్రశేఖర్‌ ను పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టారు. అంతేకాదు ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకంటే ఏపీ నాయకులకు ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయనీ, వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోయేందుకు వీలుగా గ్రీన్ కార్డు ఎంట్రీ సదుపాయం కల్పించారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.  అదలా ఉంటే కేసీఆర్ ప్రత్యేక దృష్టి కారణంగానే ఏపీలో బీఆర్ఎస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయని అంటున్నారు.  తాజాగా విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల బీఆర్ఎస్ లో చేరారు. ఆమెతో పాటుగా మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి,  ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రితో పాటు మరికొందరు  మైనారిటీ నాయకులు  గుంటూరు పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన శకుంతల గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది మేయర్‌గా పనిచేసిన ఆమె, ఆ తర్వాత కాంగ్రెస్‌‌లో కొంత కాలం, ఆ తర్వాత టీడీపీ మరికొంత కాలం పనిచేశారు. చివరకు 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అయితే  అక్కడ ఆమెకు తగిన ప్రాధాన్యత దక్కలేదో ఏమో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె మరో  మారు కండువా మార్చారు. బీఆర్ఎస్‌లో చేరారు. అదలా ఉంటే, కారణం ఏమైనా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల కంటే, ఏపీ పాలిటిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే ఆయన ఎపీ లోనూ న్యూస్ పేపర్  (నమస్తే ఆంధ్ర ప్రదేశ్) ప్రారంభించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అంతేగాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు.  అయితే  ఎంత చేసినా ఏపీలో బీఆర్ఎస్ కు ఓట్లే కానీ సీట్లు రావని రాజకీయ విశ్లేషకులు స్పష్టం  చేస్తున్నారు. అయితే ఆ సంగతి కేసీఆర్ కు తెలియదని అనుకోలేం.   కేటీఆర్’ పట్టాభిషేకం కోసం గ్రౌండ్ ప్రిపేర్  చేసేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా, ఓ వంక ఇటు పార్టీలో,  అటు ప్రభుత్వంలో కేటీఆర్ ప్రాధాన్యత పెంచుతూ,  అదే సమయంలో  జాతీయ రాజకీయాల పేరిట తమ ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకున్తున్నారని అంటున్నారు.

మౌనమేలనోయీ.. విజయసాయీ!?

వైసీపీలో కీలక నేత విజయసాయి. అందులో సందేహం లేదు. పార్టీ ఆవిర్బావం నుంచి.. పార్టీ నిర్మాణం వరకూ, 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సహా అన్నిటా అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అందుకే విజయసాయిని జగన్ వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, ప్రధాని, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ సహా ప్రతి విషయాన్నీ స్వయంగా పర్యవేక్షించే వ్యక్తి విజయసాయి. అలాగే అధినేత మనసెరిగి విపక్షంపై మాటల దాడి చేయడంలోనూ,  విమర్శలతో విపక్షాల నాయకులను చెరిగేయడంలోనూ విజసాయి స్టైలే వేరు.. రూటే సెపరేటు. ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ నాయకులనూ ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి కూడా. అయితే ఆయన ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్లుగా ముందుకే సాగారు తప్ప వెనుకడుగు వేసిన సందర్బం కనిపించలేదు. అయితే ఇటీవలి కాలంలో విజయసాయికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా అన్న అనుమానం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తమౌతోంది. గత కొంత కాలంగా ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల పార్టీ వ్యవహారాలన్నీ తానై  చక్కబెడుతున్నారు. ఈ పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ విజయసాయి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆయనదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించి.. సజ్జల కుమారుడికి ఆ బాధ్యతలు కట్టబెట్టారో.. అప్పటి నుంచీ విజయసాయి ప్రతి కదలికపైనా జగన్ నిఘా పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమౌతూ వస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా గత నెలలో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన సందర్భంగా... ఆ విచారణ తేదీ కంటే ముందు  జగన్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ కావాలని భావించారు. అయితే.. మోడీ అప్పాయింట్ కన్ ఫర్మ్ చేయడంలో విజయసాయి విఫలం కావడంతో జగన్ కినుక వహించారని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. రీసెంట్ పాస్ట్ నుంచి విజయసాయి తీరు కూడా పార్టీ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నిటికీ మించి రాజ్యసభ వేదికగా అమరావతిపై ఆయన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వైసీపీకి శరాఘాతంగా తగిలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించినట్లు కేంద్రం స్పష్టం చేయడమూ, మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తమను సంప్రదించ లేదని కుండబద్దలు కొట్టడంతో ఇంత కాలం అమరావతి విషయంలో జగన్ సర్కార్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. దీంతో వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడింది. ఇది కూడా పార్టీలో విజయసాయి ప్రాధాన్యత తగ్గడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇక లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన రోజు.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై మూడు వారాల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ను విజయసాయి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న విజయసాయికి బంధువు కావడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన తారకరత్న ఆరోగ్యం గురించి మాట్లాడిన మాటలు, ఆ తరువాత తారకరత్న మరణించిన అనంతరం మీడియా ఎదుట విజయసాయి మాట్లాడిన మాటలూ, వైసీపీ నేతల విమర్శలను ఖండించే విధంగా ఉన్నాయి. అన్నిటికీ మించి విజయసాయి ఆ సందర్భంగా చంద్రబాబుతో ముచ్చటించడం, బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించడం అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదలా ఉంచితే.. ఇటీవలి కాలంలో విజయసాయి తెలుగుదేశం, ఆ పార్టీ నేతలపై విమర్శల జోలికి పోవడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య మౌనం పాటించడమో లేదా, సౌమ్యంగా మాట్లాడడమో చేస్తున్నారు. విజయసాయి అంటే భగ్గుమనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం విజయసాయిలో వచ్చిన ఈ మార్పును గుర్తించి.. ఇది మంచి పరిణామమంటూ కితాబునిచ్చారు. వైసీపీ పట్ల ప్రజలలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించడం వల్లే విజయసాయిలో మార్పు వచ్చిందని రఘురామరాజు భాష్యం చెప్పారనుకోండి.. అది పక్కన పెడితే.. ఇటీవల గన్నవరంలో జరిగిన సంఘటనలపై తెలుగుదేశం.. వైసీపీల మధ్య మాటలయుద్ధమే జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం పరుషంగా విమర్శలు చేస్తూ.. పోలీసుల అండ లేకుండా ఎంత మంది వచ్చినా ఎదుర్కొనడానికి సై అంటూ సవాల్ విసిరారు. ఇక తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయితే చెప్పనే అక్కర్లేదు. వైసీపీకి అండగా నిలుస్తున్న పోలీసు అదికారుల సంగతి అధికారంలోకి వచ్చాకా తేలుస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. అదే సమయంలో జగన్ పైనా, వైసీసీ నేతలపైనా విమర్శల దాడి తీవ్రం చేశారు. ఇన్ని జరుగుతున్నా విజయసాయి నోరు మెదపడం లేదు. గతంలో జగన్ మీద ఈగ వాలితే.. అందుకు తెలుగుదేశం అధినేతే కారణమంటూ విరుచుకుపడే విజయసాయి.. ఇప్పుడు నోరెత్తడం లేదు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపైనా ఆయన మాట్లాడటం లేదు.  తాజాగా ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విజయసాయి వైసీపీ మంత్రులకు దూరంగా కూర్చోవడం కూడా ఏపీ రాజకీయ సర్కిళ్లలో చర్చకు తెరలేపింది. అంతే కాకుండా ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ ను హస్తినలో కలిసినది వైసీపీ నుంచి ఇద్దరు మాత్రమే.. వారిలో ఒకరు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాగా రెండో వ్యక్తి విజయసాయి మాత్రమే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయసాయి వైసీపీ నాయకులతో కలివిడిగా కనిపించకపోవడం  రాజకీయ వర్గాలలో పలు అనుమానాలకు తావిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిని దూరం చేసుకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న ఆందోళన ఇప్పుడు వైసీపీ లో కనిపిస్తోందని అంటున్నారు. అసలు విజయసాయి నిజంగా పార్టీ కార్యక్రమాలకు తనంత తానుగా దూరం జరుగుతున్నారా? లేక పార్టీయే దూరం పెడుతోందా అన్న అనుమానాలకు తోడు.. ఈ మౌనం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అన్న సందేహాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.