అసలు వాళ్లు టీచర్లేనా.. ఇదేంపని?

విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సన్మార్గంలో నడవడమెలాగో చెబుతూ ఆదర్శంగా ఉండాల్సిన గురువులే తప్పుదారిన నడిచారు.  వివాహేతర సంబంధం పెట్టుకుని వృత్తికే తలవంపులు తెచ్చారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి బంధువుల చేతిలో దెబ్బలు  తిని అవమానం పాలయ్యారు.  సభ్య సమాజం తలవంచుకునే ఈ ఘటన ములుగు జిల్లా మంగపేటలో  వెలుగు చూసింది. మంగంపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో   స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్, మరో మహిళా ఉపాధ్యాయురాలు కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఆ మహిళా ఉపాధ్యాయురాలి భర్త  మహబూబాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అక్రమ సంబంధం విషయం తెలిసిన  ఆమె భర్త గత ఏడాది   డిసెంబర్ నెలలో పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరినీ హెచ్చరించాడు.  జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకూ ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని గత నెలలో మంగపేట నుండి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డెప్యూటేషన్‌పై పంపారు.  ఈ నేపథ్యంలోనే సెలవుపై మంగపేట వచ్చి ఆ మహిళా టీచర్ భర్తకు తన భార్య అక్రమ సంబంధాన్ని ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. వారిరువురూ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని   బంధువులకు, స్థానిక ఉపాధ్యాయులకు సమాచారం అందించాడు. వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న సాంబయ్యతో పాటు బంధువులు వారిరువురికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

బీబీసీ డాక్యుమెంటరీ వెనుక రాజకీయ ప్రోద్బలం

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై   బీబీసీ ప్రసారం చేసిన ఇండియా: ద మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై బీజేపీ వర్గాలు బీబీసీపై భగ్గుమంటున్నాయి. అదే సమయంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించడంపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.  ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు ముందు  అంటే 2002 గుజరాత్ లో చోటు చేసుకున్నా హింసాత్మక సంఘటనలు కథావస్తువుగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇండియా: ది మోడీ క్వశ్చన్  పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను  యూట్యూబ్‌ (ఇండియా)లో బీబీసీ అప్‌లోడ్‌ చేసింది. అయితే అప్‌లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఐటీ శాఖ ఈ వీడియోను తొలగించింది. డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ధ్వజమెత్తారు.  నిజానికి, ఆ డాక్యుమెంటరీ లో ఏముంది? అందులో ఉన్నదంతా  ఉన్నదంతా నిజమేనా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ డాక్యుమెంటరీ రాజకీయ దుమారాన్ని అయితే సృష్టిస్తోంది. గోద్రా దుర్ఘటన (గుజారత్ అల్లర్లకు అగ్గిరాజేసిన 59 మంది కరసేవకుల సజీవ దహనం సంఘటన) నేపధ్యంలో జరిగిన గుజరాత్ లో అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని మాత్రమే కాదు, ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన క్లిప్పింగ్ లను  కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సహజంగానే లౌకికవాద వ్యక్తులు, శక్తులు, బీజేపీయేతర రాజకీయ పార్టీలు  ప్రభ్తువ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అంతే కాదు, నిషేధం ఉన్నా ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆసక్తి చూపడం కాదు, ప్రభుత ఉత్తర్వులను ధిక్కరించి అయినా, ప్రదర్శించి తీరుతామని, కొన్ని వామపక్ష అనుబంధ విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి. మరోవంక ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం సహా అనేక పార్టీలు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలనే డిమాండ్ తో గొంతు కలుపుతున్నాయి.   డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటున్నాయి.  డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం.. మోడీ ప్రభుత్వం దాన్ని ఎలా నిషేధిస్తుంది..   అని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ ప్రశ్నించింది.  ప్రజలే ఈ డాక్యుమెంటరీని చూసి వాస్తవమేమిటన్నది నిర్ణయించుకుంటారని పేర్కొంది.   ఈ అంశంపై బీజేపీకి  ఇది భారతదేశాన్ని విభజించడానికి పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్ర అనీ ,. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతోందని పేర్కొంది. ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేయాలని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల బృందాన్ని కోరింది. అయితే ఈ డాక్యుమెంటరీ కచ్చితంగా ప్రదర్శిస్తామని జేఎన్ యుఎస్’యు సభ్యుడు ఒకరు తెలిపారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. కాగా.. హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. ఈ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు భారతదేశంలోని కొంతమంది ఇప్పటికీ వలసరాజ్యాల మత్తు నుండి ఇంకా బయటపడలేదని అన్నారు. అలాంటి వ్యక్తులు బీబీసీని భారత సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా పరిగణిస్తారని, తమ నైతిక గురువులను సంతోషపెట్టడానికి దేశం గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలోనైనా తగ్గించేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు. అయితే ఎన్నికల సంవత్సరంలో బీబీసీ సృష్టించిన వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, అనే భయం అయితే అందరిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ బీబీసీ డాక్యుమెంటరీపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఇది యాధృచ్ఛికంగా చేసింది కాదనీ, ఈ సమయంలో అది ప్రసారం కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందనీ పేర్కొన్నారు. రాజకీయ ప్రోద్బలమే ఈ డాక్యుమెంటరీకి కారణమని అన్నారు.  రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా జరుగుతుంటాయని అందుకు ఈ డాక్యుమెంటరీయే నిదర్శనమని పేర్కొన్నారు. 

తెలుగుదేశం నాయకుడు పట్టాభికి రెండు వారాల రిమాండ్

గన్నవరంలో ఘర్షణలపై టీడీపీ నేత పట్టాభిరామ్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం(ఫిబ్రవరి 20) గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు  మంగళవారం (ఫిబ్రవరి 21)గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.  పట్టాభి, తదితరులు తనకు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.  తనను కులం పేరుతో దూషించారని సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఏ1గా పట్టాభి, ఏ2గా దొంతు చిన్నా, ఇంకా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి.   ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. కాగా పట్టాభి  తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపారు. తోట్లవల్లూరు పీఎస్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడించారు. పీఎస్ లో అడుగుపెట్టేసరికి అక్కడంతా చీకటిగా ఉందని తెలిపారు. ముసుగువేసుకుని ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి, తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని పట్టాభి వివరించారు. అరికాళ్లు, అరచేతులపై తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న అనంతరం పట్టాభి, తదితరులకు రెండు వారాల రిమాండ్ విధించిన న్యాయమూర్తి పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

నో సెకండ్ చాన్స్.. ఇది కన్షర్మ్.. ఏపీలో వైసీపీ సీన్ అయిపోయిందా?

2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమి కారణాలను సహేతుకంగా విశ్లేషించడం సాధ్యం కాదు.  ఎందుకంటే.. రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ, నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, రాష్ట్రాన్ని   గాడిలో పెట్టేందుకు, తన అనుభవం అంతా రంగరించి  ప్రణాళికా బద్దంగా అడుగులు వేశారు. రాజధాని అమరావతిని, ‘గ్రోత్ ఇంజిన్’ నగరంగా అభివృద్ధి చేసేందుకు  చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా  భూసమీకరణ  చేశారు. నిర్మాణాలూ ఆరంభమయ్యాయి. మొత్తం ప్రపంచం దృష్టి అంతా అమరావతిపైనే కేంద్రీకృతమై ఉంది. మరొక్క ఐదేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే, రాజధాని నగరం అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడమే కాదు, రాష్ట్రం అన్ని రంగాలో అభివృద్ధి సాధించేది. అగ్రగామి రాష్ట్రంగా నిలిచేది. అయితే కారణాలేమైతేనేం, 2019 అసెంబ్లీ ఎన్నికలో తెలుగు దేశం పార్టీ పరాజయం పాలయ్యింది. వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అభ్యర్ధన ఆ పార్టీని గెలిపించింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆతర్వాత ఏమి జరిగిందన్నది కళ్ళ ముందు కదులుతున్న,నడుస్తున్న చరిత్ర.  రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే,  అది జగన్ రెడ్డి   పాలనలో 3 శాతానికి పడిపోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వలన రాష్ట్రం ఏం కోల్పోయిందో చెప్పడానికి ఈ లెక్క చాలు. నిజానికి, జగన్   పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు.అందుకే  ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రన్న రావాలి ... వెలుగు తేవాలి  అంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న   యాత్రలకు పోటెత్తున్న జనాన్ని చూస్తే  జగన్ పాలనతో వారు ఎంతగా విసిగిపోయారో, చేసిన తప్పు దిద్దుకోవడానికి ఎంతగా ఎదురు చూస్తున్నారో  అర్థమవుతుంది.   నిజానికి 2019 ఓటమి తర్వాత తెలుగు దేశం ‘అస్తిత్వం’ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.  వైసేపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం , టీడీపీ బలం కేవలం 23 స్థానాలకు పడిపోవడంతో టీడీపీ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదన్న విశ్లేషణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా రాజకీయంగా అంత చురుకైన పాత్రను పోషించలేక పోవచ్చని, అలాగే, పార్టీని ముందుకు నడిపించడంలో గతంలోలా చురుకుగా వ్యవహరించే అవకాశాలులేవని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆ చాలా మందే, అటు చంద్రబాబు విషయంలో తమ అంచానాలు తప్పాయని అంగీకరిస్తున్నారు.  వైసేపీ అరాచక పాలనను తట్టుకుని  టీడీపీ అస్తితాన్ని నిలుపుకోవడమే కాదు, పడిలేచిన కెరటంలా దూసుకొస్తోంది.  చంద్రబాబు  2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు కదుపుతున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడికి ఇదేం కొత్త కాదు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ప్రతి ఓటమి నుంచి గుణపాఠాలు నేరుస్తూ.. గెలుపు తలుపులు తెరిచారు. ఇప్పడు మళ్ళీ అదే జరుగుతోంది. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అన్నట్లుగా చంద్రబాబు 70 ఏళ్ల యువకుడిలా  సాగిస్తున్న రోడ్ షో లు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నిపుతున్నాయి. చంద్రబాబు వేసే ప్రతి అడుగులో కొత్త ఉత్సాహం తోణికిసలాడుతోంది. టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.  ఆలాగే లోకేష్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే కాదు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే.. నారా లోకేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే.. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. వెనకడుగు వేయలేదు. వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా తాజాగా పాదయాత్రతో జనంలో మమేకం అయ్యారు.   మరోవంక జగన్ రెడ్డి  2019 ఎన్నికలలో అన్ని విధాల అండగా ఉన్న, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను   దూరం చేసుకున్నారు. వారనే కాదు.. 2019 ఎన్నికల సమయంలో ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఆయన బంధువర్గం ఇప్పుడు దూరమైంది. అందుకు జగన్ తీరే కారణం. సొంత సోదరి   షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసినా,జగన్ రెడ్డి స్పందించలేదు. కనీసం ఖండించలేదు.  ఇక పార్టీలో ఆయన నమ్మే వారు, ఆయన్ని నమ్మే వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయనకు దూరం అవుతున్న పరిస్థితి. ఇక జనం సంగతి చెప్పనే అవసరం లేదు. ఒక్క చాన్స్ అంటే ఇచ్చామనీ, మరో చాన్స్ అంటే నమ్మడానికి సిద్ధంగా లేమనీ జనం అంటున్నారు.  ఈ విషయం ఎవరో చెప్పడం లేదు. రాజకీయ పరిశీలకుల విశ్లేషణల జోలికి పోనవసరం లేదు. ఆయన స్వయంగా సొమ్ములిచ్చి మరీ చేయించుకుంటున్న సర్వేలే చెబుతున్నాయి. ఆ సర్వే నివేదికలను పట్టుకుని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు పీకుతున్న క్లాసులే తేటతెల్లం చేస్తున్నాయి. వైనాట్ 175 నుంచి మరోసారి అధికారంలోకి రావడానికి అవసరమైనన్ని స్థానాలనైనా గెలుస్తే చాలంటూ ఆయన చెబుతున్న బేల మాటలే వైసీపీ, జగన్ గ్రాఫ్ ఎంతలా పడిపోయిందో తేటతెల్లం చేస్తున్నాయి. మూడు రాజధానుల నుంచి విశాఖే ఏకైక రాజధాని అంటూ మారిన స్వరమే చెబుతోంది.  మరో సారి అధికారం అన్నఆశ జగన్ లో అడుగంటి పోయిందని. విపక్షాల సభలూ, సమావేశాలపై ఆంక్షలూ, నిషేధాలే చెబుతున్నాయి

పొత్తు పొడుపు.. తెలుగుదేశం, జనసేన సీట్ల పంపకం ఎలా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  సినిమాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాలలో మాత్రం రాణించ లేక పోతున్నారు.  ఆయన స్వయంగా తన నోటితోనే ఆ విషయాన్ని చెప్పారు.  రాజకీయాల్లో తాను  ‘ఫెయిల్’ అయ్యానని,  అయినా, రాజకీయాలను వదిలి వెళ్లనని, పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. సరే అయన ఫెయిల్డ్ పొలిటీషియన్ అయినా.. ఎన్నికలలో ఆయన, ఆయన పార్టీ ప్రభావాన్ని మాత్రం తక్కువ చేసి చూడటానికి ఇసుమంతైనా అవకాశం లేదు. అయితే ముందుగా ఆయన రాజకీయాలలో ఎందుకు రాణించలేకపోతున్నారన్న విషయానికి వస్తే.. అందరూ చెప్పే ఒకే ఒక  ప్రధాన కారణం  ఆయన చేస్తున్న జోడు పడవల ప్రయాణం.   ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో ఇటో కాలు అటో కాలు అన్నట్లు ప్రయాణం చేయడం వలన సామాన్య జనం ఆయన్ని సినిమా స్టార్ గా గుర్తించినంతగా పొలిటికల్ స్టార్  గా గుర్తించడం లేదు. అందుకే  ఆయన మీటింగులకు జనం వచ్చినా,  ఆయన ప్రసంగాలకు చప్పట్లు కొట్టి జయజయ ధ్వనాలు పలికినా అందంతా ఓ సినిమా హీరోకు వచ్చిన జన నీరాజనంగానే అంతా భావిస్తున్నారు తప్ప.. ఒక కంప్లీట్ పొలిటీషియన్ గా మాత్రం ఆయనకు ఇప్పటికీ జనంలో పూర్తి స్థాయి గుర్తింపు వచ్చిందని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.  అదే ఆయన పొలిటికల్ ఫెయిల్యూర్ కు కారణంగా రాజకీయ పండితులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో ఆయన అప్పటి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికలలో ఆయన మద్దతు ఇచ్చిన కూటమి విజయం సాధించింది. 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఆయన ఒంటరిగా రంగంలోకి దిగారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఆ ఎన్నికలలో త్రిముఖ పోరుకు కారణమయ్యారు. సరే ఆ ఎన్నికలలో జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. జనసేనాని స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. కానీ.. జనసేన ఒంటరి పోరు ఎన్నికల ఫలితంపై మాత్రం స్పష్టమైన ప్రభావం చూపింది. కేవలం జనసేన రంగంలో ఉండటం వల్లనే వైసీపీ విజయం సాధించిందని ఎన్నికల ఫలితాల తరువాత తేలింది. సరే అది పక్కన పెడితే.. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కూటమితో బీజేపీ కలుస్తుందా? కలవదా? అన్నది అప్రస్తుతం. ఆ పార్టీ కలిసినా, కలవకున్నా రాష్ట్ర రాజకీయాలపై కానీ, ఎన్నికలపై కానీ ఏ మాత్రం ప్రభావం పడదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఉన్న స్టేక్ అలాంటిది. కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంకుతో రాష్ట్ర రాజకీయాలను శాసించాలని బీజేపీ కలలు కంటే కనవచ్చు కానీ.. ఆ కలలకు అనుగుణంగా  రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అడుగులు వేస్తాయనుకోవడం మాత్రం భ్రమే అవుతుంది.   జనసేన విషయానికి వస్తే..   ఆయనకున్న హీరో ఇమేజే, రాజకీయాల్లో ఆయన ఫెయిల్యూర్ కి కారణం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే సినిమాలు వదులు కునేందుకు పవన్ కళ్యాణ్  సిద్ధంగా లేరు.  సినిమాలు వదులు కుంటే పార్టీ నడవదు. రాజకీయాలు వదులుకునేందుకు, పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు. ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న తపన అలాంటిది.  అదలా ఉంటే, ఓ వంక ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్దమవుతున్నాయి.అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జిల్లాల పర్యటనలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్ర కూడా  ప్రజా మద్దతుతో   సాగుతోంది.  జనసేనాని కూడా వారాహిలో బస్సు యాత్రకు సిద్ధమౌతున్నారు.  నిజానికి జనసేన ప్రచార రధాలు ఎప్పుడో సిద్ధమైనా  ప్రచారం మాత్రం ఇంకా పట్టాలు ఎక్కలేదు. ఇక   పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర కు సమాయత్తమౌతున్నారు అయితే ఇప్పటికే ఒకటికి రెండు సార్లు వాయిదా పడిన పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఎప్పుడు  మొదలవుతుంది? మొదలైనా, నిరాటంకంగా జరుగుతుందా, షూటింగుల మధ్యలో, ‘గ్యాప్’ యాత్రలు చేస్తారా అన్నదానిపై జనసేన శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తు, సీట్ల పంపకాలు విషయంలో జనసేన పట్టుదలకు పోకుండా పట్టు విడుపులు ప్రదర్శిస్తేనే ఇరు పార్టీల మధ్య స్నేహ బంధం గట్టిగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే   వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందనీ,  బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనలు కలిసే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో పోటీ చేస్తాయనీ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.   తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య  సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ప్రాథమికంగా అవగాహన కుదిరిందని కూడా ప్రచారంలో ఉంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు.  తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ సామర్థ్యం ఉన్న వారిలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.   అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు. గత ఎన్నికలలో  130కి పైగా స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది.  ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచే సామర్థ్యం మాత్రం లేదనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం  లేదు. అలాగే పవన్ కల్యాణ్ వినా జనసేనలో మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన వారంతా ఆటలో అరటి పండుతో సమానం.   అదే తెలుగుదేశం విషయాన్ని తీసుకుంటే.. ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి  గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేపట్టారు. శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణ శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం.  అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచింది. ఏపీలో జగన్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి అవసరమైన శక్తి, బలం, బలగం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయి.  సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్  ముందున్న ఏకైక ఆప్షన్  తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒక్కటే. అలాగే  తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అదికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం  ఉంది.  అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేన పార్టీతో పొత్తు తెలుగుదేశం పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే  ఇరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో సీట్ల సర్దుబాటు అంశం కీలకం కానున్నది.  ఈ నేపథ్యంలోనే జనసేన ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను కోరుతోందన్న ప్రచారం పొత్తు చర్చలు ముందుకు సాగేందుకు అవరోధంగా మారాయని అంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన 40 స్థానాలను కోరుతోందన్న ప్రచారం సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 20 నుంచి పాతిక స్థానాలను జనసేనకు కేటాయించేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు.  సీట్ల పంపకం విషయంలో పీటముడి పడకుండా ఉంటే జనసేన, తెలుగుదేశం పొత్తుకు ఢోకా ఉండదని అంటున్నారు. జనసేనలో అయితే పొత్తులో భాగంగా కోరిన స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరారని అంటున్నారు.   ఇక ఇటీవలి సర్వేలలో కూడా తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు వైసీపీ ఓటమికి రాచబాట పరిచినట్లేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనూ పొత్తులో భాగంగా  జనసేన   తన వాస్తవబలం ఆధారంగా సీట్ల కేటాయింపునకు ఓకే చెబితో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ మాట నిలబడుతుంది. అధికార వైసీపీ ఓటమి ఖాయం చేసినట్లౌతుంది.

శివసేన పిట్ట పోరును ఈసీ తీర్చేసినట్లేనా?.. సుప్రీం కోర్టు ఏం చెబుతుంది?

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న సామెతగా మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన విషయంలో ఈసీ రంగంలోకి దిగి తగవు తీర్చింది.  శివసేన పార్టీ పేరును, పార్టీ గుర్తును ఇద్దరికి కాకుండా తాత్కాలికంగా సీజ్ చేసి.. ఆ తరువాత తీరిగ్గా. పిడుక్కి, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా మెజారిటీ పేరు చెప్పి షిండే  వర్గానికి దఖలు చేస్తూ తీర్పు ఇచ్చేసింది. పిల్లి అలాగే చేస్తుంది. ఏది చేసిన తన యజమానికి లాభం చేకూర్చే విధంగానే చేస్తుంది. అయితే ఆ తీర్పు ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యం కావాలన్న రూలేం లేదు. సీఈసీ తాను తగవు తీర్చేశానని చేతులు దులిపేసుకున్నా.. తమ ఎన్నికల గుర్తును దొంగిలించారంటూ మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈసీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు గుర్తుల అంశం సుప్రీం కోర్టులో ఉండగా.. షిండే వర్గానికి వాటిని దఖలు చేసేందుకు ఈసీ ఎందుకు తొందరపడిందన్నది ఆయన ప్రశ్న. గతంలో అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సమయంలో కేంద్ర ఏన్నికల సంఘం శివసేన గుర్తును ఇరు పార్టీలకూ చెందకుండా సస్పెండ్ చేసింది. అప్పట్లో ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినా అప్పటికి అది సరైన నిర్ణయంగానే పరిశీలకులు పేర్కొన్నారు.   గత ఏడాది జూన్ లో శివసేన రెండుగా చీలి, షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వర్గం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం అసలు శివసేన తమదేనని  తమ వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ వస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సమాచారం ఇచ్చేందుకు థాకరే వర్గంఅప్పట్లో పదే పదే గడవు పొడిగింపు కోరడంతో అప్పటికి అంటే అంధేరీ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల  సంఘం  శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల  చిహ్నాన్ని స్తంబింప చేసింది. అప్పట్లో , కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి షిండే వర్గం స్వాగతించింది. అయితే, మాజీ ముఖ్యమంత్రి థాకరే వర్గం మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాని తప్పు పట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అన్యాయమంటూ గగ్గోలు పెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న స్నేహం కారణంగానే షిండే వర్గానికి అనుకూలంగా ఈసీ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు గుప్పించింది.  ఎవరెలా వ్యవహరించినా చివరకు సత్యమే గెలుస్తుందని థాకరే వర్గం అప్పట్లో విశ్వాసం వ్యక్తం చేసింది. అదలా ఉంటే శివసేనలో చీలిక వచ్చిన అనంతరం జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో, అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక అప్పట్లో ఎనలేని ప్రాధాన్యత  సంతరించుకుంది.  సరే ఆ ఉప ఎన్నికలో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం విజయం సాధించింది. జనం మా వెంటనే ఉన్నారని ఈ ఫలితం రుజువు చేసిందని అప్పట్లో ఉద్ధవ్ థాక్రే విజయ హాసం చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేన ఎన్నికల గుర్తును.. షిండే వర్గానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్ధవ్ థాక్రే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సుప్రీంలో ఉన్న అంశంపై ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవలసిన అగత్యం ఏమొచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీం అత్యవసర విచారణకు నిరాకరించిందనుకోండి అది వేరే సంగతి. ఉద్ధవ్ థాక్రే పిటిషన్ మంగళవారం ( ఫిబ్రవరి 21)న బెంచ్ మీదకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పిట్ట తగవు.. పిట్ట తగవు పిల్లి తీరిస్తే ఇరు పక్షాలకూ కూడా అన్యాయమే జరగాలి.. కానీ శివసేన గుర్తు విషయంలో మాత్రం ఈసీ నిర్ణయాలను షిండే వర్గం మాత్రమే స్వాగతిస్తోంది. అంటే ఈసీ పిల్లి వివక్ష చూపుతోందా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో మాత్రమే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

జేడీయూలో అసమ్మతి భగ్గు.. నితీష్ ఐక్యతా రాగానికి చిక్కు!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతటితో ఆగకుండా రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేర వేరే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకూ రాజీనామా చేసిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  నితీష్ కుమార్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జేడీయూ పార్లమెంటరీ బోర్డు చైర్ పర్సన్ సహా పార్టీలో పలు కీలక పదవులు నిర్వహిస్తున్న ఉపేంద్ర కుష్వారా పార్టీ నుంచి వైదొలగడం.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న నితీష్ కు గట్టి ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఉపేంద్ర కుష్వారా నితీష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కేవలం నితీష్ తీరు కారణంగానే జేడీయూ బలహీనపడిందని ఆయన ఆరోపించారు. 2005లో నితీష్ ముఖ్యమంత్రి అయిన సమయంలో ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి. అయితే సీఎం అయిన తరువాత నితీష్ పూర్తిగా మారిపోయారనీ, ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పార్టీని నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు. పార్టీలో బీసీ, దళిత నాయకులను అణగదొక్కుతూ, తొలి నుంచీ పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆర్జేడీ నేతలను తన వారసులుగా ప్రకటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తన పదవి కాపాడుకోవడానికి పలు మార్లు మిత్రధర్మాన్ని ఉల్లంఘించిన నితీష్ కుమార్ ఇప్పుడు కేంద్రంలో అధికారపీఠంపై కన్నేసి సొంత పార్టీనే నిర్వీర్యం చేసేయత్నం చేస్తున్నారని విమర్శించారు. 63 ఏళ్ల కుహ్వాగా ఎంపీగా, ఎమ్మెల్సీసీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు.  పార్టీలో నితీష్ తరువాత ఆ స్థాయి పలుకుబడి, ఫాలోయింగ్ ఉన్న నాయకుడు.   ఒక వైపు నితీష్ కుమార్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పార్టీల ఐక్యతకు సారథ్యం వహించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటే.. సోంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తుండటం కచ్చితంగా ఆయనను చిక్కుల్లో పడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ చేతులు కలపి పోరాడాలంటూ   పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫ్రంట్ గా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీని మట్టి కరిపించి ఆ పార్టీ సంఖ్యాబలాన్ని 100కు కుదించవచ్చిన నితీష్ చెబుతున్నారు. అంతే కాకుండా విపక్షాలు ఐక్యం కాకుంటే.. మరో సారి మోడీయే ప్రధాని అవుతారంటూ ఆయన విపక్షాల ఐక్యత బీజేపీయేతర పక్షాలకు అనివార్యంగా అవసరమని కూడా చాటారు. ఈ మాటలను ఆయన  పట్నాలో జరిగిన సీపీ ఎం 11వ జనరల్ కన్వెన్షన్  చెప్పారు. అంతే కాదు విపక్షాల ఐక్య కూటమికి సారథ్యం వహించాలన్న తన ఆకాంక్షను కూడా నితీష్ ఇటీవలి కాలంలో అన్యాపదేశంగానైనా సరే పదె పదే వ్యక్తం చేస్తున్నారు. అ టువంటి తరుణంలో జేడీయూలో నంబర్ 2గా గుర్తింపు పొందిన కుష్వారా నితీష్ పై ధిక్కార స్వరం వినిపించడం, సొంత కుంపటి పెట్టుకోవడానికి సిద్ధపడటం, అదే సమయంలో నితీష్ కుమార్ తన అధికార దాహానికి పార్టీని ఫణంగా పెడుతున్నారంటూ విమర్శించడం చూస్తుంటే.. నితీష్ ఐక్యతా యత్నాలకు ఆదిలోనే హంసపాదు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో చరిత్ర సృష్టిస్తాయా?

తెలంగాణలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని అంటున్నారు. అవును ఇందులో రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి సందేహం లేదు. ఉప ఎన్నికల విషయంలోనే రికార్డులను తిరగరాసిన చరిత్ర ఉన్న తెలంగాణలో జనం తమ తమ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేసిన హిస్టరీ ఉంది. అటువంటిది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ ఒకే సారి ఎన్నికలు జరుగుతుంటే.. గత రికార్డులు తుడిచిపెట్టుకు పోవడం ఖామయని అంటున్నారు. ఔను రాకార్డుల గురించే ఇక్కడ చెప్పుకుంటున్నాం. 2012 అక్టోబర్ లో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక అప్పటికి ఒక రికార్డు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును తిరగరాసింది. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలు గత రికార్డులన్నిటినీ తిరగరాయడం ఖాయమని జనం భావిస్తున్నారు. అలా తిరగరాయాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. కాదు.. కాదు మీరనుకుంటున్నట్లుగా రికార్డులు ఎన్నికల ఫలితాల గురించీ కాదు.. మెజారిటీ స్థానాలు, మెజారిటీ ఓట్ల విషయంలోనూ కాదు.. పోలింగ్ శాతం విషయంలోనూ కాదు. ఓటరు చైతన్యం విషయంలో అంత కంటే కాదు. ఇక్కడ మనం ఎన్నికల వ్యయం రికార్డుల గురించి చెప్పుకుంటున్నాం. ఔను ఎన్నికల ఖర్చు విషయంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రికార్డులను తిరగరాస్తాయని చెప్పుకుంటున్నారు.  తెలంగాణలో 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎప్పటికీ చెరగని మరకగా మిగిలిపోయిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉన ఎన్నిక  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరకను మరిచిపోయేలా అంత కంటే పెద్ద మరకను మిగిల్చింది.  హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాలా ఇన్ని కోట్లని ఎవరూ లెక్కకట్టలేదు కానీ.. అయిన ఖర్చు మాత్రం  చెప్పలేము. తక్కువలో తక్కువ   వెయ్యి కోట్ల పైమాటగానే అప్పట్లో చెప్పుకుంటున్నారు. కానీ శ్రీ సర్కార్ వారు ఆ మూడు నాలుగు నెలల్లో  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని  అధికారిక గణాంకాలే సూచించాయి.  ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల రూపాయల విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే అనే విశ్లేషణలు అప్పట్లో వెల్లువెత్తాయి.  అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేశారని అప్పట్లో సామాన్య జనమే నెలల తరబడి చెప్పుకున్నారు. అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కోట్లలో సోమ్ము కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.  హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే, ‘అత్యంత’ఖరీదైన ఉప ఎన్నికగా అప్పట్లో చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన  కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు తెరాస నాయకులను బహిరంగంగా నిల దీశారు. ధర్నాలు చేశారు. ఇది కూడా చేశారు. అదీ  హుజురాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో  సృష్టించిన మరో  ‘చరిత్ర’. వాస్తవానికి  హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత  రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అప్పట్లో అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు డిమాండ్ చేశారు.  అంతలా రికార్డులు సృష్టించిన ఉప ఎన్నిక తరువాత మునుగోడు నియోజకవర్గానికి గత ఏడాది నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది.  ఆ ఉప ఎన్నిక హుజూరాబాద్ రికార్డులను తిరగరాసింది.  అధికార బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్), ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ఖర్చు విషయంలో పోటీలు పడ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఓటర్ల డిమాండ్ కారణంగా పార్టీలు పోటీలు పడక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తిందనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో  ఓటర్ల అంచనాలను రీచ్ కావడానికి మూడు ప్రధాన పార్టీలూ వ్యయం విషయంలో ఆకాశాన్నే హద్దుగా పెట్టుకున్నాయి.   మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల చొప్పున ఇచ్చాయన్న ప్రచారం జరిగింది.  అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకూ ఒక్కో ఓటుకు పందేరం చేశాయన్న మాట.  ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల వ్యయం విషయంలో గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం ఎంత తక్కువగా చూసుకున్నా వంద కోట్లకు పైమాటేనని అంటున్నారు. వాస్తవంగా ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం నిబంధనల ప్రకారం 40లక్షల రూపాయలకు మించకూడదు.  కానీ అన్ అఫిషియల్‌గా అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.  దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయగలిగిన ఆర్థిక స్థోమత ఉన్నవారు మాత్రమే రంగంలోకి దిగుతారనడంలో సందేహం లేదు.  

మా దేశం దివాళా తీసేసింది.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన

పాకిస్థాన్ దివాళా తీసేసింది. ఈ విషయాన్ని బయట దేశం నుంచి ఎవరో చెప్పడం కాదు. స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి  పీఎమ్ఎల్-ఎన్ పార్టీ నేత ఖ్వాజా ఆసిఫ్  చెప్పారు. మా దేశం దివాళా ఆల్రెడీ దివాళా దీసేసిందంటూ   ఓ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఔను   పాకిస్థాన్ దివాళా అంచున ఉంది. విదేశీ అప్పులను చెల్లించలేకపోతోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది అన్న వార్తలు వింటున్నాం మనం అయితే ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మాత్రం మనం దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం అని దేశ ప్రజలకు అర్ధమయ్యేలా వాస్తవ పరిస్థితి చెప్పేశారు. ఈ సమస్యను అధిగమించి.. మళ్లీ మన కాళ్ల మీద మనం నిలబడాలంటే..   అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పరిష్కారం కాదు. అని కుండబద్దలు కొట్టేశారు.  పాకిస్థాన్ ప్రస్తుతం అసాధారణ స్థాయిలో ఆర్థికఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విదేశీ కరెన్సీ నిల్వలు మరోమూడు వారాల పాటు మాత్రమే దిగుమతులకు సరిపోతాయి. ఇదిలాఉంటే.. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పొందిన పాకిస్థాన్..వాయిదాలు కట్టడంలో విఫలం కావడంతో ఐఎమ్ఎఫ్.. నిధుల విడు దల నిలిపివేసినట్టు సమాచారం. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో పాకిస్థాన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ద్రవ్యోల్బణం అసాధారణంగా పెరిగిపోయింది. కనీసం గోధుమలు కొనుక్కోవడానికి కూడా జనం వద్ద డబ్బులు లేవు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం హద్దును ఎప్పుడో దాటేశాయి. పాకిస్థాన్ దివాళాకు ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినా కూడా ఇప్పటి వరకూ అక్కడ సుస్థిర ప్రభుత్వం లేదు.  దేశంలో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని సంతోషపడినంత సేపు కూడా ఆ ప్రజా ప్రభుత్వం స్ధిరంగా అధికారం లో కొనసాగిన దాఖలాలు లేవు.  అక్కడి ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వాలు కూడా సైన్యాధ్యక్షుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందన్నది వాస్తవం. సైనికుల కనుసన్నలలో మెలిగినంత కాలం మాత్రమే పాక్ లో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఎప్పుడైతే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వాధినేత ప్రయత్నిస్తారో.. ఆ మరుక్షణమే సైనిక తిరుగుబాటుతో ఆ ప్రభుత్వం కూలిపోతుంది. అందుకే అక్కడ సైనిక ప్రభుత్వాలే దీర్ఘకాలం మనుగడ సాగించాయి.    స్వాతంత్య్రం లభించిన దగ్గర నుంచి పాక్‌లో ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న దాయాది దేశాన్ని 1948 నుంచి శత్రువుగానే చూడడం, ఎంతసేపూ కశ్మీర్‌ను ఎలా ఆక్ర మించుకుందామనే  కుయుక్తులే ఆ దేశ రాజకీయాలకు శాపం అయ్యిందంటే అతిశయోక్తి కాదు.  దేశంలో దారిద్ర్యంతో జనం సతమతమౌతున్నా,  పట్టించుకోకుండా కాశ్మీర్ ను కబలించడమెలా అని కుట్రలు పన్నడంలో పాకిస్థాన్ పాలకులదీ, సైన్యానిదీ ఏకాభిప్రాయమే.  దేశంలో   సమస్యలు ఎదురైనప్పుడల్లా వాటి పరిష్కారం కోసం కృషి చేయడం అటుంచి ఆ సమస్యపై నుంచి  దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్ ను బూచిగా చూపడంలో సైన్యం, ప్రభుత్వాలది ఒకే మాట.   ఇదే ఆయుధంతో ఏడున్నర దశాబ్దాలుగా అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాకిస్థాన్ ఏదో రూపంతో భారత్ తో కాలుదువ్వుతూ, యుద్ధం చేస్తూనే వస్తోంది.  పాలకులు, సైన్యం అనుసరించిన ఆ వైఖరే పాకిస్థాన్ నేటి దుస్థితికి, ఆ దేశ ప్రజల దీనావస్థలకు కారణమనడంలో సందేహం లేదు. ఏ దేశంపై అయితే నిత్య ద్వేషంగా రగిలిపోయిందో.. ఆ దేశంలోనే విలీనమౌతామంటూ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఆందోళనకు దిగారు.  ఆ ఆందోళనలు అణచివేయలేక, దేశంలో అలజడిని, ప్రజల కష్టాలనూ తీర్చలేక పాకిస్థాన్ సతమతమౌతోంది. 

విజయసాయిలో మార్పు.. పరివర్తనేనా?.. రఘురామకృష్ణం రాజు అనుమానం

వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతను గమనించిన తరువాత ఆయనలో మార్పు వస్తోందని, ఇది మంచి పరిణామమేనని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో విజయసాయి చేస్తున్న ట్వీట్లు చూస్తే ఆయనలో వస్తున్న మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అందుకు కారణమైన అధికార వైసీపీ తీరు.. ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకత చూస్తే ఎవరిలోనైనా మార్పు రాక తప్పదని అన్నారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్టులు తథ్యమని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించుకోవడం ఏ విధంగా చూసినా పెద్ద పరిణామమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.   నందమూరి తారకరత్న చిన్న వయస్సులోనే మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, ఆయన మరణంపై కొందరు వైసీపీ నేతలు, లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయన్నారు. వైసీపీ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమనీ, వారు చావులో రాజకీయ లబ్ధి వెతుక్కుంటున్నారని విమర్శించారు.  ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను స్వార్థ రాజకీయాల కోసం ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీ పార్వతి వంటి మారి మాటలు, వ్యాఖ్యలను  విజయసాయి తన మాటలు, చేతల ద్వారా తప్పని చాటారు. రఘురామరాజు అన్నారు. నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.  

ఏపీలో కేసీఆర్ క్యాస్ట్ కార్డ్.. వైసీపీకి మద్దతుగా వ్యూహ రచన?

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో చావో రేవో పరిస్థితి ఉంది. పార్టీ జాతీయ పార్టీగా మార్చిన తరువాత నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటుండటం, మరో వైపు తెలుగుదేశం కూడా తన ఉనికిని బలంగా చాటుతుండటంతో ఆయనకు ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం సంగతి అటుంచి తెలంగాణలో అధికారాన్ని కాపాడుకోవడమే ముఖ్యంగా మారిపోయిన పరిస్థితి. అయినా కూడా కేసీఆర్ దృష్టి అంతా తెలంగాణపై కంటే.. ఏపీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ కు మద్దతుపైనే ఉంది. తద్వారా తెలంగాణలో ఏపీ సెటిలర్స్ అండ తనకు దక్కేలా చూసుకోవాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఏ విధంగా అయితే ఏపీలో జగన్ అధికారానికి రావడానికి తోడ్పాటు అందించారో, అదే విధంగా వచ్చే ఎన్నికలలో కూడా సహకారం అందించాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల ఆందోళనలు, ఆగ్రహం రూపంలో విస్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. మరో సారి అధికారం అన్న వ్యూహంతోనే పావులు కదుపుతూ పరస్పర సహకారం కోసం ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు సమూలంగా మార్చేసే తెలుగుదేశం- జనసేన పొత్తును మొదట్లోనే విచ్ఛిన్నం చేయడంపైనే దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే కేసీఆర్ క్యాస్ట్ కార్డును ప్రయోగించాలని నిర్ణయించారు. ఏపీలో జనసేన తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళితే.. జగన్ మరోసారి అధికారం సాధ్యం కాదన్న అవగాహనతో ఉన్న కేసీఆర్.. అదే జరిగితే.. ఆ పొత్తు ప్రభావం బీఆర్ఎస్ పై కూడా తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పటికీ పటిష్టమైన, బలమైన క్యాడర్ బేస్ ఉండటం, అలాగే జనసేనానికీ తెలంగాణలో అభిమానుల అండతో పాటు కాపు సామాజిక వర్గం కూడా అండగా నిలుస్తుందన్న అంచనాలతో ఉన్న కేసీఆర్.. ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవ కుండా  తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వేళ ఆ రెండు పార్టీలూ పొత్తు కుదుర్చుకుంటే.. ఆ కూటమికి కీలకం కానున్న కాపు సామాజిక ఓట్లలో చీలికకు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తొలుత ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన  మాజీ ఐఏస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరకూ తోట చంద్రశేఖర్ జనసేనలో ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గాన్ని గంపగుత్తగా తనవైపు తిప్పుకోగలిగే సత్తా, సామార్ధ్యం ఆయనకు ఉన్నాయా అన్న విషయంలో కేసీఆర్ కు అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన కన్నా ను కూడా సంప్రదించారు. కన్నా కమలం పార్టీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారు. అయితే కన్నా ఆ ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తనను అడ్డుపెట్టుకుని కాపు సామాజిక ఓట్లు చీల్చాలన్న వ్యూహంలో భాగస్వామ్యం కాలేనని సున్నితంగా చెప్పారు. ఇక ఆ తరువాత కేసీఆర్ పవన్ కల్యాణ్ తో కూడా తెలంగాణలో పొత్తు విషయమై సంప్రదించారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ కూడా ఈ సంగతి అన్యాపదేశంగానైనా చెప్పారు. తెలంగాణలో జనసేన, బీఆర్ఎస్ పొత్తు ద్వారా ఇటు తెలంగాణలో లబ్ధి పొందడమే కాకుండా.. అటు ఏపీలో తన మిత్రుడు జగన్ కు కూడా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావించారు. అయితే అందుకు జనసేనాని సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు. మొత్తంగా జనసేన- తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొసగకుండా చేయడం, అది కుదరకపోతే.. కాపు సామాజిక వర్గంలో చీలక ద్వారా లబ్ధి పొందడం అన్న లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకే తెలుగుదేశం, జనసేనల పొత్తు కుదిరితే.. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నను పదే పదే తెరమీదకు తీసుకురావడం ద్వారా జనసేన శ్రేణుల్లో.. ఆ డిమాండ్ బలంగా వినిపించేలా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ పని మొదలెట్టేసింది. ఫర్ సపోజ్ కలిసి పోటీ చేసి ఏపీలో అత్యధిక స్థానాలను తెలుగుదేశం, జనసేన కూటమి గెలుచుకుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబా? పవన్ కల్యాణా అని ప్రశ్నిస్తూ.. జనసేన శ్రేణుల్లో ఆశ, ఆశక్తి రేకెత్తించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే డిమాండ్ జనసేన శ్రేణుల నుంచి వస్తే.. ఇరు పార్టీల మధ్యా పొత్తు కుదిరినా క్షేత్ర స్థాయిలో ఓట్ల బదలీ జరిగే అవకాశం ఉండదన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరో వైపు తెలంగాణలో కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక వచ్చి.. ఆ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న కీలక  నియోజకవర్గాలలో బీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నది బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో తెలుగుదేశం- జనసేనల మధ్య పొత్తు అన్న మాటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీల అధినేతలను కలవరపాటుకు గురి చేస్తోందనడంలో సందేహం లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ఎక్స్ పోజ్ అయిపోయినట్లేనా?

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించిందా.. అంటే వైసీపీ శ్రేణుల నుంచే ఔనన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఒక సారి వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు పిలిచింది. ఈ సారి ఫిబ్రవరి 25న హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు రావాలని సీబీఐ ఆ నోటీసులలో ఆదేశించింది. అదే సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి  వైఎస్ భాస్కరరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన ఎక్కడ విచారణకు హాజరౌతారో చెప్పాలని ఆయనకే ఛాయిస్ ఇచ్చింది.  భాస్కరరెడ్డికి నోటీసుల విషయం పక్కన పెడితే.. నెల రోజులు కూడా పూర్తి కాకుండా అవినాష్ రెడ్డిని రెండో సారి విచారణకు పిలవడంతో  అవినాష్ ను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తం అవుతుంది. తొలి సారి ఆయనను విచారణకు పిలిచిన సందర్భంలోనే అవినాష్ అరెస్టు పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎంపి కనుక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి లోక్ సభ స్పీకర్ అనుమతి కూడా సీబీఐ తీసుకుందని అప్పట్లోనే గట్టిగా వినిపించింది. పైగా ఆనవాయితీకి భిన్నంగా అప్పట్లో ఆయనను సాయంత్రం నాలుగు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించడంతో.. అదే రోజు రాత్రి అయనను అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. అయితే అప్పట్లో సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదు.. కానీ కీలక విషయాలను ఆయన నుంచి రాబట్టిందని అంటున్నారు. ముఖ్యంగా దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ చేరుకునేందుకు అవసరమైన కీలక సమాచారం అవినాష్ రెడ్డి నుంచి రాబట్టిన సీబీఐ.. సీఎం జగన్ ఓఎస్డీ, జగన్ సతీమణి భారతి పిఎలను విచారణకు పిలిచి ప్రశ్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.   వివేకా హత్య ఘటన  సాక్ష్యాలు  మాయం చేయడం దగ్గర నుంచీ, ఆయన గుండెపోటుతో మరణించారన్న ప్రచారం వరకూ అన్నిటా అవినాష్ రెడ్డి పాత్రే కీలకమనీ సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు.   వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారిన క్షణం నుంచీ సీబీఐ దూకుడు పెంచింది. ఏపీలో విచారణ సందర్భంగా ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్నో అవరోధాలను ఎదుర్కొనడమే కాకుండా.. పలు అపవాదులనూ ఎదుర్కొంది. స్వయంగా దర్యాప్తు సంస్థ అధికారులపైనే కేసులు నమోదయ్యాయి. బెదరింపులూ వచ్చాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డే నని సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు. అందుకే కేసును ఏపీ నుంచి మార్చాలంటూ.. వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంను ఆశ్రయించిన సందర్బంగా, సీబీఐ కూడా ఏపీ నుంచి కేసు విచారణను మార్చాలనే పేర్కొంది. ఆ సందర్బంగా సుప్రీం కోర్టుకు కేసు దర్యాప్తులో అవరోధాలకు సునీత చెప్పిన ప్రతి కారణమూ అక్షరసత్యమని వాగ్మూంలం కూడా ఇచ్చింది.   వివేకా హత్య కేసు దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనీ,  ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె  సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసింది.  ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కేసును తెలంగాణకు బదలీ చేసింది. అంతే అప్పటి వరకూ మందగమనంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తు ఒక్కసారిగా జోరందుకుంది. కేసు హైదరాబాద్ కు మారిన తరువాత వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు జోరందుకోవడమే కాకుండా.. అంతకు మందు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందన్న అభిప్రాయాలు కూడా బలపడ్డాయి. ఇక గత జనవరిలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన తరువాత ఈ హత్య కేసు పాత్ర ధారులే కాకుండా, వెనుక ఉన్న సూత్ర ధారుల విషయం కూడా వెలుగులోనికి వస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

జై భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మార్మోగుతున్న నినాదాలు!

నిర్బంధం, వివక్ష, అభివృద్ధి లేమి.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) లో భారత అనుకూల ఆందోళనలకు దారి తీశాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దివాళా తీసిన పాకిస్థాన్ ( ఆ దేశ రక్షణ మంత్రే దివాళా అని ప్రకటించారు), ఇప్పుడు వేర్పాటు ఉద్యమం.. కాదు కాదు పీవోకేలో భారత్ లో విలీనం డిమాండ్ లో విలీన ఉద్యమం తారస్థాయికి చేరింది.   1947లో జమ్ము-కశ్మీర్ నుంచి కొంత భాగాన్ని పాకిస్థాన్  ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పిలుస్తున్నారు.  ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్ గా విభజించింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ జనాభా (అజాద్ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్) 2020 నాటికి దాదాపు  52 లక్షలు. 1947కు ముందు   పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా జమ్మూ-కశ్మీర్లో భామే.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రెండు భాగాలలో ఒకటైనగిల్గిట్ బాల్టిస్టాన్ లో భారత్ లో విలీనం డిమాండ్ తో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. విభజన సమయంలో, జమ్మూ కశ్మీర్ భారతదేశం లేదా పాకిస్థాన్లో చేరాలా అనే అంశంపై ఆనాటి పాలకుడు మహారాజా హరిసింగ్ దానిని స్వతంత్ర దేశంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు.  అయితే జమ్ము-కశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరణ తరువాత ఆ ప్రాంతం విలీనం గురించి ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని అప్పటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటిన్ సూచన మేరకు ప్రయత్నాలు జరిగినా.. అది జరగలేదు. అనంతరం హరిసింగ్ 1947 అక్టోబర్ లో   ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ కు  గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్  ఆమోదంతోనే కాశ్మీర్ వివాదానికి బీజం పడింది.   ఏడు దశాబ్దాలుగా దోపిడీ, వివక్షలు అనుభవిస్తూ గడిపిన పాక్ ఆక్రమిత  కాశ్మీర్ ప్రజలకు భారత్ లో అభివృద్ధి, సంస్కరణలు తమ దయనీయ స్థితి నుంచి విముక్తి పొందే మార్గాన్ని చూపించాయి.  తాము ఒకపక్క అనేక సమస్యలతో సతమతమవుతుంటే తమకు పోరుగునే ఉన్న భారత్ లోని కశ్మీర్ అభివృద్ధిలో నడుస్తుండడంతో తాము కూడా భారత్ లో కలవాలన్న కాంక్ష పెరిగింది. అదే వారిని విలీన ఉద్యమానికి ఆకర్షితులను చేస్తున్నది.   

కాగడా పెట్టి వెతికినా కనిపించని పొలిటికల్ హార్మనీ!

భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ డీఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా చెబుతుంటారు. దేశంలో ప్రజల మధ్య సామరస్యం సంక్షోభమో, సమస్యో వచ్చిన ప్రతి సారీ కనిపిస్తూనే ఉంటుంది. అకేషన్ కు అనుగుణంగా దేశ ప్రజలు ఐక్యతను చాటుతూనే ఉన్నారు. దేశంలో మతసామరస్యం కోసం రాజకీయ నాయకులు, పార్టీలూ శ్రమించాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలకు తమ ఐక్యతను ఎలా చాటాలో, ఎప్పుడు చాటాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కుల,మత, వర్గ విభేదాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అని జనం పదే పదే చాటుతున్నారు. వాస్తవానికి సామరస్యం ఉండాల్సింది రాజకీయ పార్టీల మధ్యే. రాజకీయ నేతల మధ్యే. ప్రజాస్వామ్య మనుగడలోనే ప్రమాదంలో పడేసేంతగా రాజకీయ పార్టీల మధ్య ప్రత్యర్థి పార్టీలు అన్న భావన సమసిపోయి, శతృపార్టీలా అన్నంతగా విభేదాలూ, విద్వేషాలు ప్రజ్వరిల్లుతున్నాయి. వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య వైరుథ్యాలు, విభేదాలు సైద్ధాంతిక పరిధి దాటేసి వైరి పక్షాల స్థాయికి చేరిపోయింది. ఈ ధోరణి ఇందిరా గాంధీ హయాం నుంచీ కనిపిస్తున్నా.. ఇఫ్పుడు మోడీ హయాంలో మాత్రం కొత్త ఎత్తులకు ఆ ప్రమాదకర ధోరణి చేరింది. పార్లమెంటు సమావేశాలలో పార్టీల సభ్యులు బద్ధ శత్రువుల్లా మారి ఘర్షణలకు సైతం దిగుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలు వ్యక్తిగత దూషణలకు, పరస్పర నిందారోపణలకు పరిమితమౌతున్నాయి. రోజుల తరబడి సభా కార్యక్రమాలు జరగకుండా వాయిదాల పర్వం నడవడం అన్నది గతంలో ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా ఇప్పుడొక ఆనవాయితీగా మరిపోయింది.  పార్టీల ఈ తీరు, వైఖరి  ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. విపక్షాల సూచనలను విమర్శలను ఖండించడానికే అధికార పార్టీ సభ్యులు ఉన్నారా అన్నట్లుగా బీజేపీ, మిత్రపక్షాలు వ్యవహరిస్తుంటే.. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించడానికే ఉన్నట్లుగా విపక్ష సభ్యుల తీరు కనిపిస్తోంది.  రాజకీయ పార్టీల ఈ వైఖరి కారణంగా ప్రజాహితం, దేశ హితం, ప్రజా హితం కోసం చర్చలు జరగడం లేదు. పరస్పరం గౌరవించుకుంటూ.. ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలకు వేదికగా నిలవాల్సిన పార్లమెంటు.. ఒక కుస్తీగోదాలా మారిపోయింది. అధికార విపక్ష సభ్యులు పరస్పర నిందలు, ఆరోపణలతో పార్లమెంటు సమావేశాలలో అర్ధవంతమైన చర్చ ను అటుంచి అసలు సమావేశాలనే అర్ధరహితంగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అప్రజాస్వామిక విధానాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించాయి. ఒక అంశంపై చర్చ విషయంలో మంచి చెడుల సంగతి ఇసుమంతైనా పట్టించుకోకుండా.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, కనుక మనం సమర్ధించాలి అన్నట్లుగా అధికార పక్షం, అధికార పక్షం సమర్ధిస్తోంది కనుక మనం వ్యతిరేకించాలి అన్నట్లుగా విపక్షం తమ తమ పట్టుదలలకే పరిమితమై ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేశాయి. ఆరోగ్యకర పార్లమెంటరీ వ్యవస్థలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, కాగడా పెట్టి వెతకినా కనిపించడం లేదు.  దురదృష్టవశాత్తూ పాలక, ప్రతిపక్షాలు మధ్య  ద్వేష భావమే తప్ప సుహృద్భావం  మచ్చుకైనా లేదు. అందుకే సమాజంలోనూ విద్వేష ధోరణులు గోచరిస్తున్నాయి.  ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే ముందుగా రాజకీయ పార్టీలలోనూ, ఆయా పార్టీల నాయకులలోనూ మార్పు రావాలి. సామరస్య ధోరణి రాజకీయ పార్టీలలో కనిపించాలి. 

కన్నా క్లారిటీ.. టీడీపీలోకే!

కన్నా లక్ష్మినారాయణ తాను ఏ పార్టీలో చేరబోతున్నాన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.   భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం ఆయన తన అనుచరులతో  సమావేశమై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదని ఆ సమావేశంలో అత్యధికులు చెప్పడంతో కన్నా తాను తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల  23న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకుంటారని ఆయన అనుచరులు తెలిపారు.  కన్నాను తమ పార్టీలో చేర్చుకునేందుకు  జనసేనతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేసింది.  వైసీపీ నుంచి కూడా కన్నా కోసం ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు.  ఇక  కన్నా లక్ష్మినారాయణకు టీడీపీలో చేరేందుకే  నిర్ణయించుకోవడంతో తెలుగుదేశం పార్టీకి  చేరికతో టీడీపీకి అదనపు బలం చేకూరినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీలో కన్నాకు పొమ్మన లేకపోగపెట్టిన చందంగా వ్యవహరించిన సోము వీర్రాజు చేజేతులా పార్టీకి ఇంతో అంతో ఉన్న బలాన్ని కూడా దూరం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఒక్క కన్నా లక్ష్మీనారాయణ అనే కాదు.. రాష్ట్ర విభజన తరువాత అటు కాంగ్రెస్ లో ఇమడ లేక, ఇటు తెలుగుదేశంలోనో, మరో పార్టీలోనో చేరలేక బీజేపీలో చేరిన పలువురు మాజీ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో ఉక్కపోతకు గురౌతూనే ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చేప్పేశారు. ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారని చాలా కాలంగా, అంటే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాటి నుంచీ ప్రచారం జరుగుతున్నా.. ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయంలో నిన్న మొన్నటి దాకా క్లారిటీ లేదు. జనసేనలోనా, తెలుగుదేశంలోనా అన్న చర్చ జరిగింది. అయితే తెలుగువన్ మాత్రం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాడే ఆయన రూటు తెలుగుదేశం వైపే అని చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. కన్నా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించేశారు. అయితే కన్నా బాటలోనే నడిచే నేతలు ఏపీ బీజేపీలో ఇంకా పలువురు ఉన్నారు. కేంద్ర మాజీ  మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా త్వరలోనూ బీజేపీ గూటిని వీడే అవకాశం ఉంది.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు పట్ల ఆమె బహిరంగంగానే తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా త్వరలో పార్టీ వీడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక పార్టీ నుంచి వైదొలగి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కన్నా ప్రధాని మోడీ పట్ల తనకు గౌరవం, నమ్మకం ఉన్నప్పటికీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ప్రకటించారు. ఒక దశలో కన్నాను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్ఠానం ఒక కేంద్ర మంత్రిని రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది.  ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలకు, అలాగే గత నెల  24న భీమవరంలో  జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ కూడా కన్నా   డుమ్మా కొట్టినప్పుడే ఆయేన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైపోంది.  ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరడం ఖాయమని కూడా పరిశీలకులు తేల్చేశారు.  వాస్తవానికి బీజేపీకి కన్నా గుడ్ బై చెప్పేందుకు గ్రౌండ్ గత  ఏడాది డిసెంబర్ లోనే  ప్రిపేర్ అయ్యింది.   జనసేన రాజకీయ వ్యవహారాల  కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.   అ పాత మిత్రులం  కదా  అందు  ఓ సారి  కలిసి కబుర్లు చెప్పు కున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని  అటు నాదెండ్ల, ఇటు కన్నా కూడా అప్పట్లో చెప్పినా వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు.   అప్పట్లోనే జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ  చేరిక అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ బీజేపీలో కన్నా ఉక్కపోతకు కారణం ఎవరంటే మాత్రం కచ్చితంగా సోము వీర్రాజే అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.  కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న సమయంలో  నియమించిన ఆరు  జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు  తొలగించారు. దీంతో  అంతవరకూ కొంత సైలెంట్ గా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు  జనసేనతో    సంబంధాలు బలహీనం అవ్వడానికి కూడా   సోము వీర్రాజ  వైఖరే కారణమని  కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ  బహిరంగంగానే  తప్పుబట్టారు.  కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో  ఏం జరుగుతుందో  పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్  స్టార్ట్ అయిందని, ఆ తరువాత  రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరు కావడంతో   ఆయన పార్టీ మారడం ఖాయమని అప్పట్లోనే నిర్ధారణ అయ్యింది.  అయితే కన్నా ఏ పార్టీలో, ఎప్పడు చేరుతున్నారు అన్నదే తేలాల్సి ఉందని అప్పట్లో పరిశీలకుల పేర్కొన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు   కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఇప్పుడు కన్నా తెలుగుదేశంలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించేసి క్లారిటీ ఇచ్చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు పెంచింది. ఒక వైపు ఈ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతుండగా, మరో పైవు సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సీబీఐ.. దానికి కొనసాగింపుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను  హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గత ఏడాది డిసెంబరు 11న సీబీఐ విచారించింది.  అలాగే ఇదే కేసులో మనీ లాండరింగ్ కోణం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. ఇదే కుంభకోణంలో అవినీతి, అధికార దుర్వినియోగం, ఎక్సయిజ్ పాలసీ కారణంగా ఢిల్లీ రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన నష్టం తదితరాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణం కేసులో ఏకకాలంలో రెండు దర్యాప్తు సంస్థలూ దూకుడు పెంచడంతో ఏ క్షణంలో ఎవరు అరెస్టవుతారు అన్న ఉత్కంఠ రాజకీయవర్గాలలో నెలకొని ఉంది.  ఈ స్కామ్‌లో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది. మరికొందరిని  అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండుకు తరలించింది. వీరిపై తీవ్రమైన అభియోగాలు నమోదైనందున బెయిల్ ఇవ్వడానికి స్పెషల్ కోర్టు నిరాకరించింది.   ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఇప్పటికే  ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ పలువురిని అరెస్టు చేసి వారిపై చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. స్కామ్‌లో పలువురి ప్రమేయం ఉన్నందున వారిని విచారించే ప్రక్రియ కొనసాగుతున్నదని, ఆ తర్వాత తదుపరి చార్జిషీట్‌లో అదనపు వివరాలు వెలుగులోకి వస్తాయంటూ అప్పట్లోనే సీబీఐ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎంకు రెండో సారి నోటీసులు జారీ చేయడంతో ఈ సారి  మనీశ్ సిసోడియాను ప్రశ్నించి వదిలేస్తుందా? లేక అరెస్టు చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తొలిసారి విచారణకు హాజరైనప్పుడు బీజేపీలో చేరాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేశారంటూ మనీష్ సిసోడియా మీడియా ముఖంగా చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించిన సీబీఐ తమకు రాజకీయాలతో సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఈ కుంభకోణం కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించి పకడ్బందీగా దర్యాప్తు కొనసాగిస్తోందని చెబుతున్నారు. దీంతోనే మనీశ్ సిసోడియాకు రెండో సారి నోటీసులు జారీ చేయడంతో ఆయనను ప్రశ్నించి వదిలేస్తారా? అరెస్టు చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే  ఎమ్మెల్సీకవితకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందన్నప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఎందుకంటే గతంలో సీబీఐ విచారణ అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ,  లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒక సాక్షిగా మాత్రమే తనను సీబీఐ అధికారులు విచారించారంటూ కవిత చెప్పారు. అ యితే ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సీఆర్‌పీసీలోని సెక్షన్ 191 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీచేసి కొన్ని డాక్యుమెంట్లు, ఆధారాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.  రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వ్యక్తిగతంగా స్థిర, చరాస్తుల వివరాలు, డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలు తదితరాలను 2022 వరకూ క్రోడీకరించి ఇవ్వాలని ఆ నోటీసుల్లో సీబీఐ పేర్కొన్నది. ఆ ప్రకారం వివరాలను కవిత వారికి సమర్పించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మనీశ్ సిసోడియాను ఒకసారి విచారించిన తర్వాత రెండో సారి కూడా నోటీసులు జారీచేయడంతో కల్వకుంట్ల కవితకు సైతం ఇలాంటి నోటీసులు అందుతాయని నిపుణులు అంటున్నారు.  

వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ  షర్మిలపై నమోదు అయింది. దీంతో మహబూబాబాద్‌లో  షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకుని,  ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.  షర్మిల పాదయాత్రలో భాగంగా.. శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ  షర్మిల విమర్శించడమే కాకుండా పరుష పదజాలంతో దూషించారంటూ బీఆర్ఎస్ స్థానిక నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి  పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.   గతేడాది నవంబర్‌లో వైయస్ షర్మిల.. తన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర అనివీతి ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు ఆప్పట్లో వైయస్ షర్మిల రాత్రి బస చేసే బస్సును దగ్ధం చేసే ప్రయత్నం చేయడమే కాకుండా,  అక్కడ ఆ పార్టీకి చెందిన కార్లను సైతం చేశారు.  దీంతో తమపై జరిగిన దాడిని  షర్మిల ఖండించి..  నిరసన చేపట్టారు. ఇది శాంతి భద్రతల సమస్యకు దారి తీసే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు అప్పట్లో ఆ  ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించే క్రమంలో  షర్మిల గాయపడ్డారు. దీనికి నిరసనగా అప్పట్లో షర్మిల  తనకు భద్రత కావాలని కోరుతూ.. బీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేసిన కారులోనే  ప్రగతి భవన్‌కు పయనమయ్యారు.  ఆ సందర్భంగా పోలీసులు క్రేన్ సహయాంతో షర్మిల ప్రయాణిస్తున్న కారును, ఆమె కారులో ఉండగానే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. దాంతో అప్పట్లో షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. అనంతరం ఆమె కోర్టు అనుమతితో పాదయాత్రను పున: ప్రారంభించారు. పాదయాత్ర పున: ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే  షర్మిలను మళ్లీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. 

మళ్లీ జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. ఈ సారి అసమ్మతిని తట్టుకోగలరా?

ఏపీ సీఎం జగన్ మరో సారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారా? ఇటీవల ఆయన ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవరికైనా ఔననే అనిపించకమానదు. మునిగిపోతున్న వైసీపీ నావను వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గట్టెక్కించాలన్న పట్టుదలతో ఉన్న జగన్.. అందు కోసం ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు స్పష్టంగానే తెలుస్తోంది. మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తి, అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వడంతో కేబినెట్ సహచరులు విఫలం అవుతున్నారన్న ఆగ్రహం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నేరుగా హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో.. మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.   మోస్ట్లీ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత ఏ క్షణంలోనైనా జగన్ తన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలున్నాయనీ వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన హింట్ ఇచ్చారు. పని తీరు మెరుగు పరచుకోకుండా ఉద్వాసన తప్పదని  కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓ నలుగురు మంత్రులకు హెచ్చరిక కూడా చేశారు. అప్పట్లో   లిక్కర్ కుంభకోణంలో సీఎం జగన్ సతీమణి భారతిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిని మంత్రులు స్పందించడం లేదంటూ.. కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులను  తప్పిస్తానని హెచ్చరించినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన వార్తలు పెద్దగా వినిపించలేదు. ఆరు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై జోరుగా ప్రచారం జరుగుతోంది.   అయితే గతంలో మగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన అని ప్రచారం జరిగితే.. ఇప్పుడా మంత్రుల సంఖ్య ఆరడజనుకు పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణగా కనీసం అరడజను మంతి మంత్రులకు ఉద్వాసన తప్పదని పార్టీ శ్రేణుల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సారి వైఎస్ వివేకా హత్య కేసులో నేరుగా తన కుటుంబం వైపే వేలెత్తి చూపుతూ విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. మంత్రుల స్పందన తూతూ మంత్రంగానే ఉందన్న ఆగ్రహం జగన్ లో ఉందని అంటున్నారు. ఈ సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గరయ్యే వారిలో ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కిన రోజా, అలాగే తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా గత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజనిల పేర్లు ఉన్నాయని అంటున్నారు.   అయితే గత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వైసీపీలో పెద్ద ఎత్తున ఆగ్రహ, అసమ్మతి జ్వాలలు ఎగసి పడ్డాయి. అప్పటితో పోలిస్తే వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు, శ్రేణులు, కార్యకర్తలలో కూడా అసమ్మతి చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమాయత్తం కావడం పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఎన్నికల వేళ మరో సారి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వంపై అసమ్మతి భగ్గుమనడానికి ఇది దారి తీస్తుందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది.  గత పునర్వ్యవస్థీకరణ సందర్భంగా  కొందరు పాతవారిని కొనసాగిస్తూ కొందరిని తప్పించడంతో అసంతృప్తి భగ్గు మంది. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొందరు మౌనం దాల్చి తన నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు.   మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే మళ్లీ గతంలో జరిగిన నట్లుగానే అసంతృప్తి భగ్గుమనడం తథ్యమని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడిన తరుణంలో ఈ సారి ఆ వ్యక్తమయ్య అసంతృప్తి, అసమ్మతి తాటాకు మంటలా కాకుండా బడబాగ్నిగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడు కట్టుకుందనీ, కొందరు బహిరంగంగానే పార్టీ అధినాయత్వాన్ని, ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారనీ, ఇటువంటి తరుణంలో మరోసారి  జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే.. వెల్లువెత్తే అసమ్మతి, అసంతృప్తిని తట్టుకోవడం అంత సులభ సాధ్యం కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి.  

బాల బాబాయ్.. తారకరత్న పిలుపు తలచుకుని కన్నీరు పెట్టిన బాలయ్య

నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబీకులు, ఆ కుటుంబ అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు, తెలుగుసినీ పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారందరూ ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ.. బాల బాబాయ్ అంటూ అప్యాయంగా పిలిచేవాడని తలచుకుని తలచుకుని కన్నీరు పెడుతున్నారు. ఆ పిలుపు ఇక వినబడదన్నఊహే తట్టుకోలేకపోతున్నానని బాలయ్య అన్నారు. తారకరత్న మరణం తమ కుటుంబానికీ, తెలుగుదేశం ఫ్యామిలీకి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకున్నతారకరత్న.. రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసేందుకు సమాయత్తమౌతున్న తరుణంలో గుండెపోటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమన్నారు. గుండెపోటుకు గురై మూడు వారాలకు పైగా మృత్యువుతో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని అన్నారు.  మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించిన తమనందరినీ శోక సంద్రంలో ముంచేశాడని విలపించారు. తారకరత్న ప్రేమ, అనురాగం ఎప్పటికీ మనతోనే ఉంటాయని ఆయన మరో బాబాయ్ నందమూరి రామకృష్ణ అన్నారు.  తారకరత్న మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పుడు కలిసినా బావా అంటూ ఆప్యాయంగా పలుకరించే వారని గుర్తు చేసుకున్నారు. బావా అన్న పిలుపు తారకరత్న నోటి వెంట ఇక వినపడదన్న ఊహే తట్టుకోలేకపోతున్నానని లోకేష్ పేర్కొన్నారు.  నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు ఆగిపోయాయంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటుని లోకేష్ పేర్కొన్నారు. తారకరత్న నిష్క‌ల్మ‌ష‌మైన  ప్రేమ‌, స్నేహ బంధం   ఎప్పుడూ తన హృదయంలో సజీవంగా ఉంటాయనీ పేర్కొంటూ, తారకరత్నతో ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తారకరత్న మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శనివారం రాత్రి బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తారకరత్న భౌతిక కాయాన్ని ఆదివారం (ఫిబ్రవరి 19) ఉదయం ఆ  మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం ఉదయం నుంచీ ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఫిలింఛాంబర్ లో ఉంచుతారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.