మార్చేస్తారా? మందలించి సరిపెడతారా?

తెలంగాణ గవర్నర్ తమిళి సై  గురువారం (ఏప్రిల్ 13) హస్తినలో పర్యటించనున్నారు.  పెండింగ్ బిల్లుల వివాదం సుప్రీం కోర్టులో ఉన్న తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రిపబ్లిక్ డే వేడుకల వివాదం, ఆ తర్వాత బడ్జెట్  ఆమోదం విషంయలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించటం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తదితర విషయాలను ఆమె ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించే అవకాశాలు ఉన్నాయి. గత వారం రోజుల్లో తెలంగాణలో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణామాల  ఆమె ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాలలో ఆసక్తి వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. అన్నిటికీ మించి  గత కొన్నేళ్లుగా  ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నట్లుగా ఉన్న పరిస్థితులు మారినట్లుగా అనిపించినా, ఆ గ్యాప్ అలాగే ఉందనడానికి   7 కీలక బిల్లులకు  గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకుండా పెండింగ్ లో ఉంచడం, తాజాగా మంత్రి కేటీఆర్ గవర్నర్ వ్యవస్థ అవసరమా అంటూ కొత్త చర్చకు తెరలేపడం నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ తర్వాత పెండింగ్ లో ఉంచిన బిల్లులపై  గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాలలో నెలకొంది.   ఇదలా ఉంటే ఏడాది కిందట తెలంగాణ గవర్నర్ గా తమిళిసై మార్పు తప్పదన్న వార్తలు జోరుగా వినిపించాయి. చీటికీ మాటికీ గవర్నర్ తమిళిసై రాష్ట్ర  ప్రభుత్వంతో తగవుల కారణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్ట మసకబారుతోందన్న భావన కు వచ్చిన కేంద్రం ఆమెను తెలంగాణ గవర్నర్ గా తప్పించడమే మేలన్న భావనకు వచ్చిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. ఇక ఇప్పుడు పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లడం.. సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడటం నేపథ్యంలో ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చే రోజున గవర్నర్ ఒక మెట్టు దిగి మూడు బిల్లులకు ఆమోదం తెలిపినా మిగిలిన వాటిని పెండింగ్ లోనే ఉంచడం వంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై తాజా హస్తిన పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లుల విషయంలో అనవసర రగడ వద్దన్న మందలింపుతో సరిపెడతారా లేక ఆమెను మార్చే నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.

పులివెందుల వైసీపీలో అసమ్మతి భగ్గు!

వైసీపీలో ఇంత కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఇప్పుడు ఆ నివురు తొలగించుకుని బయటపడుతోంది. ఇంత కాలంగా అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు పెను మంటలుగా ప్రజ్వరిల్లుతున్నాయి. తాజాగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వైసీపీ నేత, శ్రీ వృషభలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి.. పార్టీ తరుపట్ల తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. పార్టీలో కొనసాగి ఏం ప్రయోజనం లేదని, కార్యకర్తలకు న్యాయం చేయలేని పార్టీలో ఉండి ప్రయోజనం ఏముందని రాజీనామా చేసినట్లుఆయన ప్రకటించారు.  అసలు పార్టీలో అసమ్మతి, అసంతృప్తి రగులుతోందన్న విషయం ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనే వెల్లడైంది. బహిరంగంగా, బాహాటంగా సీఎంకు వ్యతిరేకంగా నేతలూ, కార్యకర్తలూ అప్పట్లోనే రోడ్డెక్కారు. అప్పటి దాకా జగన్ మాటే శాసనం అన్నట్లుగా వైసీపీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వ్యవహారాలు నడిచేవి. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ పరిస్థితి మారింది. జగన్ నిర్ణయాలను అప్పట్లో పలువురు నేతలు సూటిగానే ప్రశ్నించారు. సరే ఆ తరవాత బతిమాలో, బామాలో.. కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం ద్వారాలో పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. అసంతృప్తి అగ్నిని తాత్కాలికంగా చల్లార్చారు. అప్పటి నుంచీ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంపై సమీక్షల పేరుతో జగన్ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు వాటికి అజ్యం పోశాయి. ఆ ఎఫెక్ట్ గ్యాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. మూడుకు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ కోల్పోయిన వైసీపీకి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పరాభవం తప్పలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ కు కంచుకోట లాంటి పులివెందులలో.. వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లలో సగం కూడా రాలేదంటే అధికార పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. స్థానిక ఎన్నికలలో కుప్పంలో తెలుగుదేశం పరాజయం తరువాత జగన్ ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందని అని వ్యాఖ్యానించారు. అయితే సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ కు ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన పేపథ్యంలో ఆయన, ఆయన సలహాదారు అసలు వాళ్లు మా ఓటర్లే కాదని చేతులు దులిపేసుకున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు తాజాగా అదే పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ కు ఆయన కుటుంబానికి సన్నిహితుడైన జయ చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనేమీ నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుడు కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ ఆయన కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ఆయన రాజీనామా చేసి ఊరుకోలేదు.. పార్టీ మీదా, పార్టీ అధినేత మీదా విమర్శలు చేశారు. పులివెందుల నుంచి వైసీసీకి రాజీనామాల పర్వం తనతోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఇప్పటికే పలువురు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎవరికి ఏ పని కావాలన్నా వాలంటీర్ ఉషాలక్ష్మి ఇంటికి వెళ్లాల్సిందేననీ, కానీ ఆమె ఒక్క పని కూడా చేయరనీ జయచంద్రారెడ్డి అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన పనులే పులివెందులలో జరిగే పరిస్థితి లేదన్నారు. ముందు ముందు పులివెందుల వైసీపీ నుంచి మరిన్ని రాజీనామాలు తధ్యమని జోస్యం చెప్పారు. అధికార పార్టీ నేతలకు భయపడి కొందరు బయటపడటం లేదు కానీ, పార్టీ కార్యకర్తలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జయచంద్రారెడ్డి కుండబద్దలు కొట్టారు. 

తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్‌ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల నడుమ చెలరేగిన మాటల మంటలు చల్లారకముందే తాజాగా తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ఏపీలో అభివృద్ధి శూన్యమని, ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంత ప్రజలు వారి రాష్ట్రంలో ఓటు- హక్కును రద్దు చేసుకుని తెలంగాణాలో నమోదు చేసుకోవాలని సూచించారు.  తెలంగాణ మంత్రి హరీష్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు హరీష్‌ రావ్ ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులను అడిగితే తెలుస్తుంది. అభివృద్ధిలో తెలంగాణకు- ఆంధ్రప్రదేశ్‌కు భూమికి -ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హరీష్‌ ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణాలో స్థిరపడ్డారని ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉంటున్నారన్నారు.  ఏపీ, తెలంగాణలను చూశారు.. ఏపీలో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ మీకు ఓటెందుకు ? అక్కడ ఓటును రద్దు చేసుకుని తెలంగాణాలో ఓటు నమోదు చేసుకోండని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలే ఏపీ మంత్రులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దానిపైనే ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి.  తెలంగాణ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా ఏపీ మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారు. వారి వ్యాఖ్యలపై హరీష్‌ రావు మరోసారి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు, సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్‌ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు  ఉంది. కేసీఆర్‌ కిట్‌ ఉంది.. కల్యాణ లక్ష్మి ఉంది.  ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది అంటూ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ఏపీలోని రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు. ప్రత్యేక హోదాకు కేంద్రం ఎగబెట్టినా ఏమీ అడగరు. ఏపీలో ఏముంది.? అని ప్రశ్నించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదన్న ఆయన. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మకానికి పెట్టినా నోరెత్తరు.. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని పరోక్షంగా తెలుగుదేశం పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. వైకాపా, తెదేపా రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు.  అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి. అది మీకే మంచిదని ఆంధ్ర మంత్రులకు హరీష్‌ హెచ్చరించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్‌ అయ్యారు. హరీష్‌ రావు.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని (తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. హరీష్‌ మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగాణలో సంక్షేమ పథకాలు మా సంక్షేమ పథకాలకు తేడా చూడు.  జీడీపీలో మేం దేశంలోనే నంబర్‌ వన్‌లో ఉన్నాం.  ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి. అంటూ విమర్శలు చేశారు. అలాగే, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.   తెలంగాణాలో అభివృద్ధిపై భారాస ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. హరీష్‌ రావుకు ఏం సంబంధం ఉందని ఏపీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్‌ రావు ఎవరు? బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలన్నారు. మొత్తం మీద తెలంగాణ, ఆంధ్ర మంత్రులు మధ్య మాటల యుద్ధంతో  వాతావరణం హీటెక్కుతోంది. రానున్న రోజుల్లో ఇది ఏ మలుపు తిరుగుతోందనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  మరి కొన్ని నెలలో రెండు రాష్ట్రాలలో ఎన్నికలు రానున్నాయి.. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల తమ వాగ్యుద్ధంతో వాతావరణం గరం గరం  అవుతోంది.

దేశంలో సంపన్న సీఎం జగన్‌రెడ్డి

సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు.  28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల (ఢిల్లి, పుదుచ్చేరి)   సీఎంలలలో అందరికంటే సంపన్నుడు ఏపీ సీఎం. (మరో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము-కాశ్మీర్‌ గవర్నర్‌ పాలనలో ఉన్నందున అక్కడ ముఖ్యమంత్రి లేరు.)  కాగా, 30 ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఇందుకు మినహాయింపు. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే.  ఎన్నికల సందర్భంగా ఆయా నేతలు సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) విశ్లేషించింది. దీనిపై రూపొందించిన నివేదికను బుధవారం (ఏప్రిల్ 12)విడుదల చేసింది. దీని ప్రకారం, 29 మంది సంపన్న సీఎంల సగటు ఆస్తుల విలువ రూ.33.96 కోట్లు. అదే సమయంలో 30 మంది సీఎంలలో 13 మంది (43శాతం) పై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. కొందరు ముఖ్యమంత్రులు హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్‌ వంటి నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. నాన్‌బెయిలబుల్‌ పరిధిలోకి వచ్చే తీవ్రనేరాపణలను ఎదుర్కొంటున్నారు. వీరు దోషులుగా తేలితే వీరికి కనీసం  ఐదేల్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.  అత్యధిక ఆస్తులు కలిగిన మొదటి ముగ్గురు ముఖ్యమంత్రులలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి -ఆంధ్రప్రదేశ్‌ (రూ.510 కోట్లకుపైగా), పెమాఖండూ - అరుణాచల్‌ ప్రదేశ్‌ (రూ.163కోట్లు ఆపైన), నవీన్‌ పట్నాయక్‌ - ఒడిశా (రూ. 63.87కోట్లు) ఉన్నారు. నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయిపియు రియో ఆస్తుల విలువ రూ.46 కోట్లు, పుదుచ్చేరి సీఎం రంగస్వామికి రూ.38 కోట్ల విలువైన స్థిర,చరాస్తులు ఉన్నాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు రూ.17 కోట్లు, మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మాకు రూ.14 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆస్తుల విలువ రూ.23.5 కోట్లు కాగా, ఆయనకు రూ.8.8 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. ఎక్కువ అప్పులున్న సీఎంల జాబితాలో కేసీఆర్‌ మొదటి స్థానంలోనూ, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై రెండవ స్థానంలో ఉన్నారు. బొమ్మైకి రూ.4.9 కోట్ల అప్పులున్నాయి. బొమ్మై ఆస్తుల విలువ రూ.8.92కోట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు రూ.11.6 కోట్ల ఆస్తులు, రూ.3.75 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఏడీఆర్‌ నివేదికపై ఆయా రాష్డ్రాలలోని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో  ఎలా స్పందించాలా అని ప్రణాళికలు రూపొందించడంలో తలమునకలవుతున్నట్టు సమాచారం.. సందు దొరకటమే మొదలు దీనిపై రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలకు ఎలా పదును పెట్టాలి..? అని ఆలోచిస్తూ ఉన్నారని సమాచారం. రాజకీయాలలో క దేది విమర్శకులకు అనర్హం?

రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షల నజరానా!!

ఎన్నికల సమయంలో హామీలు ఆకాశానికి నిచ్చెనలేసేలా ఉంటాయి. పార్టీలన్నీ కూడా జనాల మద్దతు కూడగట్టుకోవడానికి హామీలను గుప్పిస్తూ ఉంటారు. అదిగో అదే దారిలో జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఉభయతారకమనదగ్గ ఒక హామీ ఇచ్చారు.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  కోలార్ లోని పంచరత్నలో జరిగిన ప్రచార ర్యాలీలో జెడిఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ తరపున  రెండు లక్షల రూపాయల నజరానా అందిస్తాం అంటూ హామీ ఇచ్చారు. రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది.  రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు ఈ నజరానా ఇవ్వాలి. అమ్మాయిలు రైతుల బడ్డలను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. తమ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే, రైతన్నల కుమారుల ఆత్మగౌరవంగా దీన్ని భావిస్తూ, ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లిలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ (ఎస్‌) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న జేడీఎస్ కొంచం భిన్నంగా ఆలోచించి ఈ హామీని ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చూడటానికి..ఇది రైతుల కుమారుల సంక్షేమం..కల్యాణం కోసంలా కనిపిస్తూనే మరో వైపు అమ్మాయిలకు లాభం చేకూరే పథకం అనడంలో సందేహం లేదు.  ఈ తాయిలం ఎలాంటి ఫలితం ఇస్తుందన్నది చూడాలి. 

బాలినేనికి పొమ్మన లేక పొగపెడుతున్నారా?

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి.. సీఎంకు సమీప బంధువు..ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఆయన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తాయి. అలాంటి నేతకు అవమానం జరిగింది. అదీ జగన్ అధికారిక కార్యక్రమం సందర్భంగా. సీఎం జగన్‌ మార్కాపురం పర్యటన సందర్భంగా వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిని   సీఎం హెలిప్యాడ్‌ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెవరో.. తన పవరేంటో చెప్పుకున్నారు. అయినా ససేమిరా అన్నారు. అంతే.. ఆయనకు ఒళ్లు మండింది. ఆగ్రహించిన ఆయన సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. ఆయన అనుచరులూ అనుసరించారు.   బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సొంత వర్గం ఉన్న నాయకుడు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత. అధికారదర్పం, అహంకారం పెద్దగా ప్రదర్శించరు. జిల్లాలో పేరుకు ఇద్దరు మంత్రులు ఉన్నా.. పలుకుబడి మాత్రం బాలినేనికే ఎక్కువ. అటువంటి ఆయన సీఎం హెలీపాడ్ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంత అవమానం జరిగాకా తాను అక్కడ ఎందుకు ఉండాలనుకున్నారు. అంతే వెంటనే వెనక్కు వెళ్లిపోయారు.   బాలినేనిని పోలీసులు ఇంతగా అవమానించడం ఏమిటని వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోయాయి. బాలినేనికి ముఖ్యమంత్రి వద్ద ప్రాధాన్యత లేదనడానికి నిదర్శనమా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బాలినేనికి సీఎం ఉద్వాసన పలకడంతో ఆయన ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఆ తరువాత ఏదో సద్దుకుపోయినా,  తాజాగా ఎదురయిన అవమానం పుండుమీద కారం చల్లినట్లుగా అయ్యిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ముఖ్యమంత్రి మార్కాపురం వచ్చిన తరువాత బాలినేనిని పోలీసులు నిలిపివేయడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలుసుకున్న జగన్ స్వయంగా బాలినేనికి ఫోన్ చేసి పిలిపించారు. దాంతో ఆయన వెనక్కు వచ్చి సీఎంతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయినా ఆయనలో పరాభవ భారం కనిపిస్తూనే ఉంది. కార్యక్రమం మొత్తం ముభావంగానే ఉన్నారు. తన అసంతృప్తిని దాచుకోలేదు. అది ఆయన ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఆయన అనుచరవర్గం కూడా చెబుతున్నారు.  జరిగిన సంఘటన చూస్తుంటే పొమ్మనలేక పొగపెడుతున్నట్లుగా ఉందని అంటున్నారు. 

విశాఖ ఉక్కు సరే తెలంగాణలో మూతపడిన పరిశ్రమల మాటేంటి?..లక్ష్మణ్

తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిచే దిక్కులేదు కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్  ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారని,  ఆ హామీ ఇచ్చి ఇన్నేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ఎంపీ లక్ష్మణ్‌ నిలదీశారు.  హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్‌, అజంజాహీ మిల్‌ మాటేమిటని ప్రశ్నించారు. ఈ భూములపైన బీఆర్‌ఎస్‌ నేతలు కన్నేశారని అందుకే వాటిని తెరిపించే విషయంలో మౌనం వహిస్తున్నారని లక్ష్మణ్   ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతి చేసుకునే వారని, వారికి కావాల్సిన వారికి బొగ్గు నిక్షేపాలు ఇచ్చేసి బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్‌ కూరుకుపోయింది.  బయ్యారం ప్రమేయం లేకుండానే  కడప స్టీల్‌ ప్లాంటు నడుస్తోందని, కడపలో జిందాల్‌ స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.   నల్లగొండలో యురేనియం పుష్కలంగా ఉంది, అక్కడ నిక్షేపాలను వెలికి తీస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.  వీటికి దిక్కు లేదు కానీ , వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్తారా..? అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌.. తన చుట్టూ పది మందిని పెట్టుకుని నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని లక్ష్మణ్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ వాడిన భాషను ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఇప్పుడు విశాఖ స్టీల్‌ అంటూ మోసం చేయాలని చూస్తున్నారనీ, అయితే జనం నమ్మరని అన్నారు.  జాతీయ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్‌ కు  ఏపీలో పార్టీ సింబల్‌కే   దిక్కు లేని పరిస్థితి ఉందన్నారు.   ముందు మన ఇల్లు చక్కదిద్దుకుని... తర్వాత పక్కోడి ఇల్లు గురించి తీరిగ్గా ఆలోచించాలని లక్ష్మణ్ కేసీఆర్ కు సూచించారు. 

కాంగ్రెస్ సారథ్యంలో విపక్ష కూటమి దిశగా తొలి అడుగు!

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా యత్నాలలో ఒక ముందడుగు పడిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ తో బుధవారం భేటీ అయ్యారు. ఈ బేటీలో ఆర్జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ కూడా ఉన్నారు. భేటీ అనంతరం  ఖర్గే మీడియాతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. నితీష్, తేజస్విలతో భుటీ సామరస్య పూరిత వాతావరణంలో అర్థవంతంగా జరిగిందన్నారు.   2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఖర్గే చెప్పారు.ముందు ముందు మరిన్ని పార్టీలు కలిసి వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.  నితీష్ కూడా ఈ భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తామన్నారు. కాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉన్న విపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారిని కలుపుకునే బాధ్యతను ఈ భేటీ సందర్భంగా నితీష్ కుమార్ తీసుకున్నారు.   ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ, తేజస్వీ యాదవ్‌, జేడీ(యూ) చీఫ్‌ లాలన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఎంపీ నసీర్‌ హుస్సేన్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్ లు పాల్గొన్నారు. ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మోడీ డిగ్రీ సర్టిఫికేట్, అదానీ వ్యాపార వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విపక్షాల ఐక్యతకు గండి పడినట్లే నంటూ వచ్చిన వ్యాఖ్యలను పూర్వ పక్షం చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీల నాయకులు భేటీ అయ్యి వచ్చే ఎన్నికలలో ఐక్యంగా సాగాలన్న నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాటింగ్.. సుఖేష్ చంద్రశేఖర్ లేఖతో సంచలనం

సుఖేష్ చంద్రశేఖర్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురితో తాను చేసిన చాటింగ్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చేసిన చాటింగ్ ను బయటపెట్టాడు. ఈ మేరకు జైలు నుంచి విడుదల చేసిన లేఖలో సుఖేఖ్ చంద్రశేఖర్ కల్వకుంట్ల కవితతో తన వాట్సాప్ చాట్ ను బయటపెట్టాడు.  ఇప్పటి వరకూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నాయకులతో చాట్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజా  లేఖతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తన  వాట్సాప్ చాట్‌ను   బయటపెట్టడం సంచలనం సృష్ఠించింది. రాజకీయంగా కలకలం రేపింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాట్ ఇదేనంటూ సుఖేష్ కొన్ని స్క్రీన్ షాట్‌లను బయటపెట్టాడు. కవితక్క - టీఆర్ఎస్ అని సేవ్ చేసుకున్న నంబర్ తో సుఖేష్ చంద్రశేఖర్ చాట్ చేశాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో కల్వకుంట్ల కవితతో చాట్ చేసినట్లు సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు.  15కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్  పేర్కొన్నట్లు ఆ చాట్ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. అలాగే   ప్యాకెట్  అందజేస్తానని ఏజే చెప్పారని చాట్‌లో సుఖేష్ పేర్కొన్నాడు.  98101 54102 నెంబర్‌తో సుఖేష్ చాటింగ్ చేశాడు. సుఖేష్ లేఖ మొత్తం 6 పేజీలు ఉంది.  

మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో గత 24 గంటలలో  5 వేల 676 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 3 వేల 761 మంది కొవిడ్  నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 37 వేల 93  యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. కాగా జాతీయ కొవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.73 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220 కోట్ల 66 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే బుధవారం నాటికి 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క రోజే దేశవ్యాప్తంగా 7,830 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడేనని వివరించారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కు చేరిందని వివరించారు. ఒక్క ఢిల్లీలోనే 980 కరోనా కేసులు బయటపడ్డాయని తెలిపారు. ఇక రోజువారీ పాజిటివిటీ   విషయానికి వస్తే మంగళవారం నాటికి ఇది 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరింది.  వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు.  వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది. రాష్ట్రాల్లో చూస్తే.. కేరళలో అత్యధికంగా 13,745 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (4,667), ఢిల్లీ (2,338), తమిళనాడు (2,099), గుజరాత్ (1932), హర్యానా (1928), కర్ణాటక (1673), ఉత్తరప్రదేశ్ (1282) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1000 కంటె తక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఇండియాలో కరోనా వల్ల 15 మంది చనిపోయారు. వారిలో ఢిల్లీలో ముగ్గురు, పంజాబ్‌లో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు చనిపోయారు. కేరళలో ఇద్దరు చనిపోగా... గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన కరోనా మాక్ డ్రిల్‌ను సమీక్షించారు. ఢిల్లీలోని RML ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి కరోనా ఏర్పాట్లను పరిశీలించారు. మాక్ డ్రిల్ ఇవాళ కూడా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ప్రిపరేషన్ ఎలా ఉందో ఇందులో గమనిస్తారు. తద్వారా కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తే.. ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఎక్స్ బిబి.1.16 అనే వేరియంట్ కారణంగా కనిపిస్తోంది. ఇది గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది ప్రాణాంతకమైనది కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఐతే... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా సోకితే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు.

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి.. పది మందికి గాయాలు

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా  చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి  ఎంపీ నామా నాగేశ్వరావు,  ఎంఎల్ఏ లావుడ్యా రాములు నాయక్ కు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నాయకులు  పేల్చిన బాణాసంచ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి పది మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యకర్తలు పేల్చి బాణసంచా నిప్పురవ్వలు ఓ గుడిసెపై పడ్డాయి. ఆ గుడిసెకు నిప్పంటుకుంది. గుడిసెలో ఉన్న గ్యాస్ బండ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పది మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు వ్యక్తుల కాళ్లు తెగిపోయాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. 

మోడీగారి పులి వేట

ఏప్రిల్ 9వ తేదీన మధుసూదన్ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో డ్రయివర్ గా ఉద్యోగం చేస్తున్న మధుసూదన్ జీపులో దేశ  ప్రధాని నరేంద్రమోడీ అరణ్య విహారం చేయనున్నారు. ఇదీ ఆ కుటుంబం ఆనందానికి కారణం. ఉదయం 7.15 నుంచి 9.30 వరకూ మోడీని జీపులో ఎక్కించుకుని పులులను చూపించే బాధ్యత తన పూర్వ జన్మ సుకృతం అని మధుసూదన్ భావించాడు.  కానీ అతని ఆశలపై బందీపూర్ పులులు నీళ్లు చల్లాయి. 135 నిముషాల పర్యటనలో ఒక్కటంటే ఒక్క పులి కూడా మోడీ కంట పడలేదు. దీంతో  మోడీ నిరుత్సాహానికి గురయ్యారు. ఎలాగూ అంత దూరం వచ్చాం కదా అని ఓ ఫొటో షూట్ తో ప్రధాని సంతృప్తి చెంది తిరుగుప్రయాణమయ్యారు. రోజూ కనిపించే పలులు ఆ రోజు కనిపించకపోవడంతో డ్రయివర్ మధుసూదన్ కూడా తన దుదరృష్టానికి బాధపడ్డాడు.  ఇదిలా ఉండగా ప్రధాని మోడీని పులులు దర్శించుకోలేకపోవడానికి డ్రయివర్ కారణమంటూ కర్నాటక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. డ్రయివర్ మధుసూదన్ ఉద్యోగాన్ని ఊడబీకి జీపు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇదంతా చేస్తున్న కర్నాటక అటవీ శాఖ అధికారులకు ఒళ్లు మండింది. మోడీకి పులి కనబడకపోతే డ్రయివర్ ను ఉద్యోగం నుంచి తీసేయడం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జీపు రిజిస్ట్రేషన్ కు, పులి కనబడకపోవడానికి సంబంధం ఏమిటో అధికారులకు అర్ధం కావడం లేదు. మోడీకి పులి పంజా గుర్తులు చూపించామంటూ అటవీ అధికారులు బీజేపీ నేతలకు నచ్చ చెబుతున్నారు. మోడీ పర్యటనకు ముందే భద్రతా దళాలు, ఇతర వంది మాగధులు చేసిన హడావుడికి పులులు బెదిరిపోయి ఉంటాయని అటవీ అధికారులు అంటున్నారు. మోడీ పర్యటన తరువాత అడవిలో పులుల సంచారం తిరిగి ప్రారంభమైందని కూడా అధికారులు సెలవెచ్చారు. 

తెలంగాణలో ప్రగతి పరుగులు.. ఏపీలో ఎందుకు వచ్చేయండి!

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఏపీ అభివృద్ధి కుంటుపడిందని తెలంగాణ మంత్రి హరీష్ అన్నారు. అందుకే తెలంగాణలో స్థిరపడిన ఏపీ కార్మికులంతా అక్కడి ఓటు రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నిర్మాణంలో చెమట చిందించిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ గతంలోనే చెప్పిన విషయాన్ని హరీష్ ఇప్పుడు మళ్లీ గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి  తెలంగాణ మంత్రులు  ఏపీలోని అభివృద్ధి లేమినే అలంబనగా వాడుకుంటున్నారు. అందుకే అవకాశం వచ్చినా రాకపోయినా తమ రాష్ట్ర ప్రగతిని చెప్పుకోవడానికి ముందుగా ఏపీలోని అభివృద్ధి లేమిని ఎత్తి చూపుతున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు మరో సారి అదే చేశారు.  ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఆయన ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ పాలనలో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం కుదేలయ్యాయనీ, దీంతో అక్కడ పనులు లేక, దొరకక పొట్ట చేతబట్టుకు వచ్చిన నిర్మాణ రంగ కార్మికులందరూ ఇక్కడే సెటిల్ అయిపోవాలనీ, అక్కడ ఓటు రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేయించుకోవాలని పిలుపునచ్చారు. తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదనీ, ఇక్కడ చేతి నిండా పని దొరుకుతుందనీ, సంపాదనా పుష్కలంగా ఉంటుందనీ, తెలంగాణ అభివృద్ధి ఫలాల్లో భాగం కూడా దొరుకుతుందని చెబుతున్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణకూ ఆంధ్రప్రదేశ్ కూ ఆకాశానికీ, భూమికీ ఉన్నంత తేడా ఉందన్నారు. ఇప్పుడే కాదు.. గతంలో గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలలో ఏపీ సీఎం జగన్ ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా ఏపీలో వ్యవసాయ రంగం దీనస్థితి గురించి ప్రస్తావించి హరీష్ ఏపీ, ఏపీ సీఎం జగన్ గాలి తీసేశారు.   

వైకాపాలో ‘ముందస్తు’ తొందర!

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ రోహిణికార్తె ఎండలను మించిపోయింది.  రెండు రాష్ట్రాలలోనూ కూడా ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ముందస్తు ప్రశక్తేలేదని అన్యాపదేశంగానైనా సరే స్పష్టం చేసినా..వాటికి ఫుల్ స్టాప్ పడటంలేదు. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ కూ ఎన్నికలు అంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి  ఊతం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, వైసీపీ నాయకులూ ముందస్తు ముచ్చటే లేదంటూ సందర్భం కల్పించుకుని మరీ ప్రకటనలు గుప్పిస్తున్నారు.   అయితే పరిశీలకుల విశ్లేషణ మేరకు తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే   ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో మాత్రం ముందస్తుకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు ప్రశ్నార్థకంలో పడింది. ఆ పథకాలు కొనసాగించలేక నిలిపేయాల్సిన పరిస్థితి ఎదురైతే..  ప్రభుత్వ ప్రతిష్ట మంటగలుస్తుంది. ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లడం మేలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఆ పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల ఆ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు సూచన ప్రాయంగానే అయినా పలు మార్లు మీడియా ముఖంగానే చెప్పారు.   అందుకే రాష్ట్రంలో ఎన్నికల హీట్ ను పెంచేలా సీఎం జగన్ ఎమ్మెల్యేలకు మార్కులు గ్రేడులూ కేటాయిస్తూ పరుగులెత్తించే కార్యక్రమానికి తెరతీశారు. గడపగడపకూ, ఇంటింటికీ స్టిక్కర్లు అంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను పరుగులెత్తిస్తున్నారు. ఇవన్నీ జగన్ ముందస్తు ఆచోనలను ప్రతిబింబిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. ఈ  ఏడాది చివరి నాటికి తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిగేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అంటున్నారు.  

గవర్నర్ల వ్యవస్థ అవసరమా?

బీజేపీయేతర రాష్ట్రాలపై కక్ష సాధించడం కోసమే కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను వాడుకుంటోందని తెలంగాణ మంత్రి  కేటీఆర్‌ తప్పుబట్టారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొంతం దిలీప్‌ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్‌ రీట్విట్‌ చేశారు. ఆ ట్విట్‌కు కేటీఆర్‌ తన వ్యాఖ్యను జోడించారు. తమ అధికారాలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్న దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల్లోని గవర్నర్లపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల అభ్యంతరం తెలిపింది. బ్రిటిష్‌ కాలం నాటి గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్‌ కూడా కొన్ని బిల్లులను పెండింగ్‌లో పెట్టారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాజకీయ పావులుగా మారారని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదని, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. సహకార సమాఖ్య పాలనకు ఇది ఒక నమూనా కాదా అని ఆయన నిలదీశారు. టీమ్‌ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉందని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఎలా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్‌ప్రశ్నిస్తున్నారు.  గవర్నర్ వ్యవస్థ వ్యర్థ మని ఇప్పటికే పలువురు న్యాయ కోవిదులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. గవర్నర్లను .. తమ ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగించు కుంటోందని ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి.  ఈ తరుణంలో కేటీఆర్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

టీహబ్ ఒక అద్భుతం.. ఆదిత్యథాక్రే

శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే   హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు. అక్కడ మంత్రి కేటీఆర్‌తో ఆయన కొద్ది సేపు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తన ట్విట్టర్‌లో ఆదిత్య థాకరే.. మంత్రి కేటీఆర్‌ను కలిసిన ప్రతిసారి అద్భుతంగా, ఎంకరేజింగ్ ఫీలవుతానంటూ ప్రశంసల వర్షం కురిపించేశారు. సుస్థిరత, పట్టణీకరణ, సాంకేతికత లాంటి అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని పేర్కొన్నారు.  భారత దేశ ప్రగతిలో ఆ అంశాలు కీలకమని ఆదిత్య థాకరే తెలిపారు. టీహబ్‌ ఒక  మహాద్భుతంగా అభివర్ణించారు.  స్టార్ట్ అప్‌లు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులకు టీహబ్ మంచి ఊతం ఇస్తోందన్నారు.  మంత్రి కేటీఆర్‌ను కలవడం ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఆయన బ్రెయిన్ చెయిల్డ్ టీహబ్ విజిట్ చేసి థ్రిల్ అయ్యాననీ, అక్కడ అమేజింగ్ వర్క్ జరుగుతోందని ఆదిత్యథాక్రే ట్వీట్ చేశారు.  కాగా ఆదిత్య థాక్రే ట్వీట్ కు స్పందించిన కేటీఆర్   గత ఏడాది దోవోస్‌ సదస్సు సందర్భంగా కలిసిన తరువాత మళ్లీ ఆదిత్యథాక్రేతో భేటీ కావడం ఇదే తొలిసారనిపేర్కొన్నారు.ఆయనతో చర్చలు అర్ధవంతంగా జరిగాయని పేర్కొన్నారు.  భవిష్యత్ లో ఆయనతో కలిసి పని చేయాలన్న ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.   ఆదిత్యథాక్రే, కేటీఆర్ పరస్పర పొగడ్తలను పక్కన పెడితే...ఈ భేటీ కేవలం టీహబ్ సందర్శనకు మాత్రమే సంబంధించినది కాదని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మహారాష్ట్రపై నిశిత దృష్టి పెట్టారు. ఇక మహారాష్ట్రలో బాల్ థాక్రే బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  తన ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పాలన్న పట్టుదలతో ఉన్నారు.   మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని బావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాల్ థాక్రే నేతృత్వంలోని శివసేన బీఆర్ఎస్ తో చేతులు కలిపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్యఠాక్రే  హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాథాన్యత సంతరించుకుంది.  

కవిత కాలికి గాయం.. ఈడీ విచారణకు బ్రేక్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కాలుకు ఫ్రాక్చర్  అయింది. ఆ విషయాన్ని ఆమె  స్వయంగా ట్వీట్ చేశారు. తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు కవిత ట్వీట్ చేశారు. గాయం కారణంగా కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు.  ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఫ్రాక్చర్ ఎప్పడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయం ఆమె చెప్పలేదు.  అదలా ఉంటే కవిత కాలుకు గాయం అయిందన్న వార్త విన్నబీఆర్ఎస్ క్యాడర్, భారత జాగృతి కార్యకర్తలు కవిత అభిమానులు, సహజంగానే సానుకూలంగా స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ ఇష్ట దైవాలాను ప్రార్ధించారు. ప్రార్ధనలు చేస్తున్నారు.  కవితక్క జాగ్రత్త ... అంటూ సోషల్ మీడియా సందేశాలు పంపిస్తున్నారు.  మరోవంక దాల్ మే కుచ్ కాలా ..హై ..అని అనుమానిస్తున్న వారు అనుమానిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికీ మూడు సార్లు ఈడీ ఎదుట విచారణకు హాజరైన కవితను మరోమారు విచారించవచ్చనే సమాచారం అందుతున్న నేపథ్యంలో కవిత కాలి గాయం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో రకరకాలు కామెంట్లు వస్తున్నాయి. అయితే, ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్‌ చంద్రశేఖర్‌   వెల్లడించిన తాజా వివరాల నేపథ్యంలో ఈడీ ఏ క్షణంలో అయినా కవితకు ఫ్రెష్ సమన్లు జారీ చేయవచ్చని అంటున్నారు.

బీఆర్ఎస్ లో అంతర్మధనం

తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్ ఇదీ నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు నిర్వచనంగా చెప్పుకున్న మాట.  ఏది చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయవలసిందే. ఏది చెప్పినా కేసీఆర్ చెప్పవలసిందే. ఇతరులు ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా కేసీఆర్ పేరున చేయవలిసిందే.  , సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదనే విధంగా పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు నడిచాయి.  కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర మంత్రులు, పార్టీ పెద్దలు ఎవరు ఏమి చెప్పినా చివరకు కేసీఆర్ శంఖంలో పోస్తేనే అది తీర్ధం. ఆ మాటకు ఒక విలువ. అందుకు భిన్నంగా తొందరపడి ఏ మంత్రీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇంతవరకు ఏనాడూ  లేదు.  అయితే  తెరాస, బీఆర్ఎస్ గా మారిన తర్వాత లేదా అంతకు కొంత ముందు నుంచి పరిస్థితి   మారుతూ వస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హీట్ ఎక్కిన నేపథ్యంలో ఇటు కుటుంబంలో అటు పార్టీ, ప్రభుత్వంలో చోటు చేకున్న పరిణామాలు కొత్త చర్చకు తెర తీశాయి. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచీ  కేసీఆర్  ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా  అది కూడా ఫోటోల్లో కనిపించడం, ప్రెస్ నోట్’లో వినిపించడమే కానీ నేరుగా ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. అసెంబ్లీలో లేదా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ సభలో తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు లేదా మీడియా ముందుకు వచ్చిన సందర్భం ఇటీవల కాలంలో లేదనే చెప్పాలి.  చివరకు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం,  టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీక్ , ఎస్ఎస్సీ పేపర్స్ లీక్ /మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్.. విడుదల చివరకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనని టార్గెట్ చేస్తూ చేసిన తీవ్ర విమర్శలు ఇలా.. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి స్పందించలేదు. అయితే, ఉద్యమ కాలం నుంచీ కూడా కేసీఆర్  ప్రతికూల పరిస్థితుల్లో సైలెన్స్ గా ఉండడం, సమయం వచ్చినప్పడు   దూకుడు పెంచడం అనుభవంలో ఉన్న విషయమే అంటున్నారు. కేసీఆర్ విషయం అలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ జోష్ పెంచారు. సర్వం తానే అన్నట్లు (డీఫ్యాక్టో ముఖ్యమంత్రి)గా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ లో అయితే ఆయన అనుకూల వర్గం కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడంతో పాటుగా, ఎన్నికలకు ముందుగా ఆయన్ని  ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, అయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళాలని పార్టీలో ఒక వర్గం ‘డిమాండ్’ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే, ఏప్రిల్ 27న భారత రాష్ట్ర సమితి జనరల్ బాడీ మీటింగ్ జరగనున్న నేపధ్యంలో ఈ సమావేశంలో కేటీఆర్ ను భారాస రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం లేక పోలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇంతలోనే బీఆర్ఎస్ గుర్తింపు వ్యవహారం గందరగోళంలో పడింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపే కానీ, ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని నియమించిన పొరుగు రాష్ట్రం ఏపీ, పార్టీ విస్తరణ  ప్రారంభించిన కర్ణాటక, మహారాష్ట్ర సహా దేశంలో మరెక్కడా ఎలాంటి గుర్తింపు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్ ఒక విధంగా  డోలాయమానంలో పడిందని అంటున్నారు. అలాగే, ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ లో అంతర్మథనం జరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపద్యంలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్  ఆవిర్భావ దినోత్సవ  సభ లో ఏమి జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.