కర్ణాటకలో అమూల్ కల్లోలం

బెంగుళూరులో తమ పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో   డెలివరీ చేస్తామంటూ గుజరాత్ కు చెందిన ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్) చేసిన ట్వీట్ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయ దుమారాన్ని రేపింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారు అయిన నందిని బ్రాండ్   నిర్వాహకులను ఇబ్బందుల పాల్డేయడానికి, నందిని బ్రాండ్ ను వినియోగిస్తున్న కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ను, అమూల్  లో విలీనం చేయడానికి జరుగుతున్న కుట్రగా కాంగ్రెస్, జేడీ(ఎస్)  విమర్శలు గుప్పిస్తున్నాయి. అమూల్ ఉత్పత్తులను కొనేది లేదంటూ కన్నడిగులు  ప్రతిజ్ఞ చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. అమూల్, నందిని మధ్య ఎలాంటి  రాజకీయాలు లేవని, దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్ గా నందిని నిలుస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి అమూల్ ను   దొడ్డిదారిన తెచ్చేందుకు గుజరాత్ కు చెందిన ప్రధాని, కేంద్ర మంత్రి  ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక దేశం, ఒక అమూల్ అంటూ ప్రధాని మోడీ సర్కారు చేసిన వ్యాఖ్యకు జేడీ(ఎస్) నేత  కుమారస్వామి చురకలు వేశారు.  ఒక దేశం, ఒక అమూల్, ఒక పాలు, ఒక గుజరాత్ అనేది కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానంగా మారిపోయిందంటూ ట్వీట్ చేశారు. దేశమంతా గుజరాతీమయం చేయాలనేది మోడీ లక్ష్యంగా కనిపిస్తోందనీ ,  ఆ లక్ష్య సాధన కోసం  కాషాయం పార్టీ ఎంతటికైనా దిగజారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలో మళ్లీ కరోనా మృత్యుఘంటికలు?!

దేశంలో మరో మారు కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు  మోగిస్తోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవలి కాలంలో రోజు వారి కేసులు అధికమవ్వడం ఆందోళన రేకెత్తించినా.. మరణాల సంఖ్య స్వల్పంగా ఉండటం ఒకింత ఊరటగా మిగిలింది. ఆయితే గత 24 గంటలలో ఏకంగా కరోనా కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో మారు మహమ్మారి తన కరాళ నృత్యం చేయడానికి రెడీ అయ్యిందా అన్న అందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. గత 24 గంటలలో అంటే ఆదివారం ఒక్క రోజే దేశంలో కరోకా బారిన పడి 14 మంది మృత్యు ఒడికి చేరారు. అంతే కాకుండా ఆదివారం ఒక్క రోజే 5880 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల మేరకు రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరగడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకే రోజులో ఇంచు మించుగా 50 శాతానికి పైగా హెచ్చు కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కరోనా కట్టడి చర్యలకు సంబందించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.  ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మహారాష్ట్ర, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళనకరంగా ఉంది.   

టార్గెట్ మోడీ.. వేదిక అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభ.. కేసీఆర్ వ్యూహం!

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ పాలన, అవినీతిపై పరోక్షంగా చేసిన విమర్శలపై కేసీఆర్ స్పందించకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నేరుగా పేరు పెట్టి విమర్శించకుండా మోడీ పరోక్ష వ్యాఖ్యలకే సరిపెట్టేయడంతో కేసీఆర్ స్పందించలేదని కొందరు అంటుంటే.. మోడీపై పకడ్బందీ విమర్శలతో విరుచుకుపడేందుకు కేసీఆర్ సమాయత్తమౌతున్నారని మరి కొందరు అంటున్నారు.  మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఘాటు రిప్లై ఇచ్చేందుకు తగిన  అంబేడ్కర్ జయంతి రోజున  రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ సభేనని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కేసీఆర్ మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోడీ ప్రస్తావించిన అన్ని అంశాలకూ ఘాటుగా రిప్లై ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.  అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నెల 14న ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో కేసీఆర్ ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్న ఆసక్తి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై  సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఓ వైపు అంబేడ్కర్ ను కీర్తిస్తూనే.. మరోవైపు రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ మోడీకి కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు.  కేంద్ర విధానాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయనడానికి ఉన్న ఉదాహరణలతో సహా మోడీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా కేంద్రం, మోడీపై విమర్శలతో విరుచుకుపడే అవకాశాలు దండిగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.  ఉదాహరణలతో సహా వివరించడానికి కసరత్తు మొదలైంది. అంబేడ్కర్ ను నిరంతరం తల్చుకునే విధంగా రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టిన సంగతిని చెబుతూ,  కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంటు (సెంట్రల్ విస్టా) భవనానికి కూడా  అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ అసెంబ్లీ చేసి ఏకగ్రీవ తీర్మానాన్ని మోడీ లెక్కలోకి తీసుకోలేదన్న సంగతిని బలంగా ఎస్టాబ్లిష్ చేయలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  అదే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతందని సోదాహరణంగా వివరించేందుకు కూడా సీఎం కేసీఆర్ సమాయత్తమౌతున్నట్లు చెబుతున్నారు.  

జూపల్లి, పొంగులేటిపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు.. హర్షం వ్యక్తం చేసిన ఇరువురు నేతలు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను పార్టీ నుంచి బీఆర్ఎస్ సస్పెండ్ నుంచి సస్పెండ్  చేస్తూ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వారిరువురినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.  గత కొంత కాలంగా  పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ పార్టీ నాయకత్వంపైవిమర్శలు చేస్తున్నారు.  అదే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ అగ్ర నాయకత్వం తనను పట్టించుకోలేదని, మూడేళ్లుగా పార్టీ సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటువంటి వీరిరువురూ ఆదివారం (ఏప్రిల్ 9) కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంగే  గంటల వ్యవధిలో పార్టీ కార్యాలయం నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనవెలువడింది. కాగా తమ సస్పెన్షన్ పై ఈ ఇరువురూ కూడా వేర్వేరుగా ఒకే లాంటి వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులకు తనకు విముక్తి కలిగిందని పొంగులేని వ్యాఖ్యానించారు. దొరల గడీ నుంచి విముక్తి లభించినందకు సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా ఇప్పటికైనా పార్టీ నుంచి   సస్పెండ్ చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు.   అటు జూపల్లి సైతం తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ తో తనకు పంజరం నుంచి బయటకు వచ్చినట్లుగా ఉందన్నారు. అయితే తన సస్పెన్షన్ కు కారణం చెప్పాలన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత సస్పెండ్ చేసి ఉంటే బాగుండేదని జూపల్లి పేర్కొన్నారు. 

ఏపీ సీఎం నార్సిసిజంతో బాధపడుతున్నారు.. రఘురామ రాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో మారు సొంత పార్టీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసీపీ చేపట్టిన కార్యక్రమం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రచ్చబంగా కార్యక్రమంలో భాగంగా శనివారం ( ఏప్రిల్ 8)న మీడియాతో  మాట్లాడిన రఘురామరాజు వైసీసీ మా నమ్మకం నువ్వే జగన్ అంటుంటే జనం మాత్రం మా నమ్మకం కాదు.. నమ్మక ద్రోహం నువ్వే జగన్ అంటూ విరుచుకుపడుతున్నారని అన్నారు.   అందుకే జగన్ ను కీర్తిస్తూ వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విపక్ష తెలుగుదేశం సైతం స్వాగతిస్తోందని అయిన అన్నారు. విపక్షం జగనే తమకుఅధికారం కట్టబెడతారన్న నమ్మకం తెలుగుదేశంలో కనిపిస్తోందని చెప్పారు.  విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, ఇంటి పన్నులను పెంచి, చెత్తపై కూడా పన్ను వేసి   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  జనంలో తన విశ్వసనీయతను అధ:పాతాళంలోకి దిగజార్చుకుంటే.. వైసీపీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ఇంటింటికి తిరిగి స్టిక్కర్లను అతికిస్తుంటే జనం  ఏవగించుకుంటున్నారన్నారు. ఒకవైపు వైసీపీ వారు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికిస్తుంటే, చాలా చోట్ల జనం వాటిని పీకి పారేయడం కనిపిస్తోందని చెప్పిన రఘురామరాజు..  అలా స్టిక్కర్లు పీకేసిన వారిపై జగన్ సర్కార్  చర్చలు తీసుకుంటుందేమోనని అనుమానం కలుగుతోందనిఅన్నారు.   ఏపీ ముఖ్యమంత్రి జగన్ నార్సిసిజం అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని రఘురామరాజు అన్నారు. నార్సిసిజం అనేది తనను తాను అతిగా ప్రేమించుకునే మానసిక రుగ్మత పేరు అని వివరించారు.  

మోడీజీ.. ఏమయ్యింది? క్యాడర్ కు ఉత్సాహం ఇవ్వని ప్రసంగం ఏంటి?

తెలంగాణలో రాజకీయ వేడి రోహిణీకార్తెను మించిపోయింది. టీఎస్పీఎస్సీ, టెన్త్‌ పరీక్షల లీకేజీ లు కేంద్రంగా  రాష్ట్రంలో సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అరెస్టుల పర్వం అదనం.  ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు  బండి సంజయ్ అరెస్టుతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  వైరం ఉష్ణోగ్రత పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో మొన్నశనివారం (ఏప్రిల్ 8)న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ను చీల్చి చెండాడేస్తారనిఅందరూ భావించారు. మోడీ హైదరాబాద్ వచ్చినది అధికారిక పర్యటనలోనేఅయినా.. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మోడీ బీఆర్ఎస్ పై మాటల తూటాలు ఎక్కుపెడతారనే అంతా భావించారు.  ముఖ్యంగా బీజేపీ తెలంగాణ శ్రేణులు మోడీ ప్రసంగంపై అంచనాలను రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి అమాంతంగా పెంచేసింది. సీఎం కేసీఆర్‌ పాలనపై మోదీ విమర్శనాస్త్రాలు  సంధిస్తారనీ, ముఖ్యంగా బీజేపీ తెలంగాణ  అధ్యక్షుడు బండి సంజయ్‌ అక్రమ అరెస్టును ఉద్దేశించి పరేడ్ గ్రౌండ్ వేదికగా  బీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారనీ కమలంశ్రేణులు భావించాయి. అయితే ప్రధాని మోడీ ప్రసంగం వారిఅంచనాలకు ఏ మాత్రం చేరువగా లేదు.   మోడీ  సభ కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు భారీగా జనాన్ని సమీకరించారు. తన సభకు వచ్చిన భారీ జనసందోహాన్ని చూసి మోడీ  మురిసిపోయారు. అయితే మోడీ అయితే మురిసిపోయారు  కానీ బీజేపీ శ్రేణులు మాత్రం మోడీ ప్రసంగంతో చాలా చాలా నిరాశ చెందారు.  మోడీ ప్రసంగం లో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకపోవడం వారిని నిరాశపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది.  మోడీ ప్రసంగం యావత్తూ పరోక్ష విమర్శలకే  పరిమితమైంది.  అంతే కాకుండా ఆయన ప్రసంగంలో కార్యకర్తల్లో ఉత్సాహాన్నినింపే అంశం ఒక్కటీ లేదు అన్నిటికీ మించి టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టై బెయిలు మీద  బయటకు వచ్చిన బండి సంజయ్ ఉదంతంపై ఆయన మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం పార్టీ శ్రేణులలో నిరాశకు కారణమైంది. మోడీ బండి సంజయ్ అరెస్టు వ్యవహారాన్ని కనీసం పరోక్షంగా కూడా ప్రస్తావించకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం నివ్వెరపరిచింది. ఇక సామాన్య జనం అయితే.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ ప్రమేయం ఉందా? అందుకే మోడీ ఆ విషయాన్ని  తన ప్రసంగంలో అవాయిడ్ చేశారా అన్నఅనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇదే కాకుండా మోడీ తన పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో కూడా భేటీ కాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.  

ముందున్నది.. మండే కాలం

ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి. ఉదయం పది కాదు, ఎదిమిది గంటలు దాటిన తర్వాతే గడపదాటి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఎండ భయానికి వణుకుతున్నారు.  అయితే వృద్దులు, చిన్న పిల్లలు, ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  సూచిస్తున్నారు.   అదలా ఉంటే ఇంతటితో అయిపోలేదు, ముందున్నది మరింత మండే ఎండల కాలమని, భారత వాతావరణ శాఖ (ఐఎండి ) హెచ్చరించింది. రానున్న ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.  రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు   తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని హెచ్చరించింది. ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారతదేశంలో ఎండలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదవుతాయని ఇటీవలే ఐఎండీ హెచ్చరించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఎండాకాలంలో తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఎండకు దూరంగా ఉండడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. ఇది దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపెడుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..  ఫిబ్రవరి నెలలో భారత్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత ఇంత భారీగా   ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే, పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయి. అయితే  ఉష్ణోగ్రతలు మరో సారి భగ్గుమనే అవకాశముందని ఐఎండీ  చెబుతోంది .అలాగే, ఎండల  నడుమ కురిసే అకాల వర్షాల ప్రభావంతో అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు అన్నటికంటే ముఖ్యంగా ఎక్కువ మోతాదులో పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మిగతా కాలాలలో తీసుకునే నీటి కంటే ఎండాకాలంలో  రెండింతలు అధికంగా నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అదే సమయంలో అదే పనిగా నీరు  తాగడం కూడా మంచిది కాదని, తక్కువ మోతాడులో ఎక్కువ సార్లు నీరు తాగడం ద్వారా దప్పిక దగ్గరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను తీసుకోవడం అవసరమని అంటున్నారు.  తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలనీ, విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం వల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని అంటున్నారు. అయితే, ఎండల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఈ అన్నిటికంటే కూడా ఎవరి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అంటున్నారు.

నిజంగానే పోయిందా!

తన ఫోన్ పోయిందని   ‌బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఈనెల 5న సంజయ్ అరెస్టు సమయంలో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తన ఫోన్ పడిపోయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మెయిల్ ద్వారా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు పంపారు. హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఎంపీ బండి సంజయ్ ను ఫోన్ గురించి అడిగితే లేదన్నారు. ఎక్కడుందంటే తెలియదంటున్నారు. ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని వారికి తెలుసు. అందుకే ఫోన్ ఇవ్వట్లేదు. అయినా.. బండి సంజయ్ ఫోన్ కాల్ డేటా సేకరిస్తామని పోలీసులు అంటున్నారు..   పరీక్ష పత్రం  షేర్ అయిన అందరికీ ప్రశాంత్ ఫోన్ చేయలేదు. పిల్లల సాయంతో ప్రశ్నపత్రం బయటకు తెచ్చుకున్నారు. కొన్ని ఫోన్లలో మెసేజ్ లు డిలీట్ చేశారు.. వాటిని రిట్రైవ్ చేయాలి. కాల్ డేటా సేకరించాల్సి ఉంది. ఎలాంటి కుట్ర చేయకపోతే బండి సంజయ్ ఫోన్ ఇవ్వొచ్చు కదా? అని ఇటీవల వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తన ఫోన్ పోయిందంటూ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్ పోయిందని బండి సంజయ్  అనడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అధికార పార్టీని అప్రదిష్ట పాల్జేయటానికి .. బీజేపీ మరింతగా దిగజారిపోయిందన్న విమర్శలు వినవస్తున్నాయి. 

బండి అరెస్ట్.. మరో సెల్ఫ్ గోల్?

ఒన్స్ బిట్టెన్ ..ట్వైస్ షై (Once bitten, twice shy) ఇదొక ఇంగ్లీష్ సామెత. అంటే ఒకసారి పొరపాటునో,గ్రహపాటునో తప్పు చేసి దెబ్బతిన్న వ్యక్తి, రెండోసారి అదే తప్పు చేయడు. అదే తప్పు చేసేందుకు జంకుతారు, లేదా భయపడతారు .. జాగ్రత్త పడతారు. అనేది  ఈ ఇంగ్లీష్ సామెత సారాంశం. చదువు సంధ్యా లేని, చాయ్ వాలా ప్రధాని మోడీకి ఈ సామెత తెలియక పోవచ్చును కానీ, ఎ న్నోవేల పుస్తకాలను బట్టీయం పట్టేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే  అమేరికాలో గొప్పగొప్ప చదువులు చదివిన మంత్రి కేటీఆర్ కు ఈ సామెత, ఈ సామెత సారాంశం తెలియదని అనుకోలేము. కానీ ఎందుకనో కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఈ మాటలు అంటున్నది ఎవరో తండ్రీకొడుకులంటే గిట్టని ప్రతిపక్షాలు కాదు.  బీఆర్ఎస్ అభిమానులే అంటున్నారు. ఒక రకంగా  సామాన్య ప్రజలకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, మీడియా ముందుకొచ్చి సమాధానాలు ఇచ్చుకో లేక అవస్థ పడుతున్న గులాబీ పార్టీ వాచస్పతులు  విస్తు పోతున్నారు. ధాన్యం రగడ మొదలు ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల బేరసారల వరకూ, అక్కడి నుంచి ఇప్పుడు తాజాగా తెర పై కొచ్చిన పదవ తరగతి ప్రశ్న పత్రాల లీక్ లేదా మాల్ ప్రాక్టీసు వ్యవహారం వరకూ  కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఎండగట్టేందుకు చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి ఆందోళన, ప్రతి న్యాయ, రాజకీయ పోరాటం బూమరాంగ్ అవుతూనే ఉన్నాయి. అయినా తండ్రీకొడుకులు తగ్గేదే లే  అంటున్నారని, బీఆర్ఎస్  నాయకులు ప్రైవేటు టాక్ లో  తలలు పట్టుకుంటున్నారు.   ముఖ్యంగా పదవ తరగతి హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్’ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం, అది కూడా పది రోజుల క్రితం చనిపోయిన అత్తగారు దశదిన కర్మలో పాల్గొనేందుకు ఇంటికి చేరిన కొద్ది సేపటికే, పోలీసులు బిలబిల మంటూ ఆయన ఇంట్లోకి ప్రవేశించి, ఎందుకు, ఏమిటీ అన్న ప్రశ్నలను సమాధానం చెప్ప కుండా బలవంతంగా ఎత్తుకు పోవడం చట్ట పరంగా సరైనది అయినా కాకున్నా, సెంటిమెంట్ పరంగా, ప్రభుత్వం, పోలేసులు చేసిన బ్లండర్ మిస్టేక్ .. చాలా పెద్ద తప్పని బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటు టాక్’లో ఒప్పుకుంటున్నారు.  అలాగే, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గానికి చెందిన ఓ మహిళా నాయకురాలు అయితే, ముఖ్యమంత్రికి ఆ సలహా ఎవరు ఇచ్చారో కానీ, బలగం సినిమా సెంటిమెంట్’ వెంటాడుతున్న సమయంలో తల్లితో సమానమైన  అత్తమ్మ దశదిన కర్మకు వచ్చిన అల్లుడు, బండి సంజయ్’ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఎంత మాత్రం సమంజసం కాదని కాదని, చట్టాని పక్కన పెట్టి రాజకీయం గాచూసినా  పెద్ద తప్పని అన్నారు. ముఖ్యంగా మహిళల సెంటిమెంట్’ను గట్టిగా దేబ్బతీసిందని అంటున్నారు. అందుకే, సిరిసిల్లల ముఖ్యంగా మహిళలు సర్కార్’కు శాపనార్ధాలు పెడుతున్నారని, ఈ ప్రభావం ఎన్నికలపై ఉంటుందని, ఆమె విశ్లేషించారు. ఈ సందర్భంగా బలగం సినిమాకు సిరిసిల్లకు ఉన్న సంబంధాన్ని, కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సినిమా సెంటిమెంట్’ను మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  అలాగే, ఫార్మ్ హౌస్ కేసులో చాంతాడంత రాగం తీసి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులను, ‘దొరికిన  దొంగలు’ అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సహా దేశంలోని అనేక వ్యవస్థలకు చెందిన ముఖ్యులందరికీ ఆడియోలు, వీడియో క్లిప్పింగులు పంపి కూడా చివరకు, అదే సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో చీవాట్లు తిన్న వైనాన్ని బీఆర్ఎస్ అభిమానులే  గుర్తు చేస్తున్నారు. ఇక పదవ తరగతి పరిక్ష పత్రం లీక్ కు సంబంధించి, వరంగల్ ఏసీపీ, బండి అరెస్ట్’కు ముందొక  రకంగా తర్వాత మరొక రకంగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి .. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేశారని పోలీసు అధికారులే అంటున్నారు. ఇది సోషల్ మీడియా యుగం. ఒక్క సారి నిరు జారితే, ఇక వెనక్కి తీసుకోవడం అయ్యేపనికాదని, పోలీసు అధికారులు పూటకో మాట చెపితే, పోలీసుల పరువే పోతుందని, ఇప్పుడు ఈ కేసులోనూ అదే జరిగిందని అంటున్నారు. అలాగే, ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో డ్యామేజ్ అయిన ప్రభుత్వ ఇమేజ్’ ను కాపాడుకునేందుకు దారులు వెతుకుంటున్న సమయంలో,  టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో బండి సంజయ్’ ను ఇరికించే విఫల ప్రయత్నం చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం మరో మరకను కొని తెచ్చుకుందని, అంటున్నారు. నిజానికి, పదవతరగతి పరీక్ష పేపర్ మల ప్రాక్టీసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న బండి సంజయ్’ సమాధానాలు ఇవ్వవలసిన ప్రశ్నల కంటే, ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

బాలయ్యను మించిన సైకియాట్రిస్ట్ లేడు!

తాను సైకాలజీ చదవకపోయినప్పటికీ, తనను మించిన  సైక్రియాటిస్టు లేడంటున్నారు నందమూరి నటసింహం, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎవరేమనుకున్నా తాను మాత్రం వాస్తవాలు మాట్లాడతానని అంటున్నారు.  రాష్ట్రంలో సైకో పాలన పోవాలి ఇందుకోసం యువత అప్రమత్తంగా ఉండాలి. వారిని జాగృతం చేసేందుకే యువ గళం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.  అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలంలో నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా బాలకృష్ణ   ఈ వ్యాఖ్యలు చేశారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని బాలయ్య చెప్పారు. వైసీపీ పట్ల వ్యతిరేకత,  ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం మౌతోందన్నారు. యువతరం పాదయాత్రకు  అన్ని వర్గాలు నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు.  బడ్జెట్ లో రూ.17 లక్షల కోట్ల అని కాకి లెక్కలు చూపించిందని విమర్శించారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. అందరూ కంకణబద్దులై వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిం చాలని బాలకృష్ణ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో చట్ట వ్యతిరేక చట్ట  నడుస్తుంద న్నారు. పోలవరం పూర్తి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఈ  నాలుగేళ్లలో ఊసే ఎత్తలేదన్నారు. పెన్షనర్లు నెలనెలా పెన్షన్ రాక బాధలు పడుతున్నారన్నారు. విద్యుత్, డీజల్, చెత్త ఇలా అన్నిటిపైనా   పన్నులు పెంచేసి జగన్ సర్కార్  ప్రజల నడ్డి విరుస్తున్నదని బాలయ్య విమర్శించారు.   సైకో మళ్లీ అధికారం లోకి వస్తే జనం రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుందని హెచ్చరించారు.  హత్యా రాజకీయాల్లో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉందన్నారు.  ఇన్ని రోజులు.. ఆయనలో నటుడు ఉన్న విషయం మనందరకీ తెలుసు.. అయితే తనలో ఓ సైక్రియాటిస్ట్ కూడా ఉన్నాడనే విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. 

ఇది వైసీపీ ఎన్నికల టీం

రాష్ట్ర విభజన అనతరం ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ తొలి సారిగా భారీఎత్తున ఐఏఎస్ ల బదిలీలు జరగడం రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం బదిలీలు జరుగుతాయని అందరూ ఊహించారు. అయితే  కొందరు అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు పిర్యాదు చేయడం, అనంతరం ఈ నెల మూడో తేదీన జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో అధికారుల తీరుపై సీఎం వద్ద తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో బదిలీల జాబితాలో భారీ మార్పులు, చేర్పులు జరిగినట్లు సమాచారం. ఈసారి బదిలీల్లో కొందరు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు  ప్రాధాన్యత కల్పించినట్లు చెబుతున్నారు. అంతేగాకుండా మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండేందుకు ఎన్నికల టీంను నియమించారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీ ప్రభుత్వంలో మార్పు లకు శ్రీకారం చుట్టారు. పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. ఈసారి సీనియర్, జూనియర్ అధికారులందరికీ స్థాన చలనం కలిగింది. అయితే కొందరు జూనియర్లకు బదిలీల్లో ప్రాధాన్యత లభించగా, కొందరు సీనియర్లకు ఆప్రధాన్యత పోస్టులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా గవర్నర్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్.పి. సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా  అప్రాధాన్య పోస్టులో ప్రభుత్వం నియమించిందని పలువురు భావిస్తున్నారు.  గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను సాగనంపే క్రమంలో ఇదే తరహాలో బదిలీ జరిగినట్లు ఐఎఎస్ అధికారులు గుర్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. సూర్య నారాయణతో పాటు ఉద్యోగులకు సిసోడియానే గవర్నర్ అపాయింట్ ఇప్పించారు.  అప్పటికే బదిలీల జాబితా సిద్ధం అయినా విడుదల చేయలేదు. అపాయింట్మెంట్  ఇప్పించారన్న కారణంతో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని, ఆ సమయంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. అదే విధంగా దేవదాయ శాఖ కమిషనర్ గా ఉన్న ఎం.హరిజవర్ లాల్ కు కార్మిక శాఖ కార్య దర్శిగా.. అంతగా ప్రాధాన్యం లేని పోస్టులోకి బదిలీ చేసారు. పాత గుంటూరులోని ఒక ఆలయానికి చెందిన రెండెకరాలకు.... ఎన్ఓసీ ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమైంది. దానిపై తీవ్రంగా మండిపడిన హైకోర్టు... ఆయన ఆ పోస్టుకే అర్హుడు కాదని వ్యాఖ్యా నించింది. అయితే హరిజవర్ లాల్ దేవాదాయశాఖలో సమర్థవంతం గా పనిచేసినా ఆయనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించడం చర్చనీయాంశం అయింది. అలాగే  శేషగిరిబాబును కార్మికశాఖ కమిషనర్ గా ప్రాధాన్యత లేని శాఖలకు నియమించడంపై కూడా చర్చ జరుగుతోంది. అదే విధంగా ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి రీ కౌంటింగ్ కు అనుమతి ఇవ్వలేదని అక్కడి అధికార పార్టీ నేతలు సీఎంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెను విజయనగరం కలెక్టర్ గా పంపినట్లు చెటుతున్నారు. అయితే అక్కడ కలెక్టర్ గా పనిచేసిన సూర్యకుమారిని కీలకమైన పంచాయితీ రాజ్ కమిషనర్ గా పదోన్నతి లభించింది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లను మార్పు చేయగా ఇద్దరిని వేరే జిల్లాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను బాపట్ల కలెక్టర్ గా బదిలీ చేశారు.  బదిలీల్లో కీలక మైన దేవాదాయశాఖ, పంచాయితీ రాజ్ శాఖలతో పాటు స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్.. జెన్కో ట్రాన్స్కో, ఇంటర్ బోర్డు తదితర శాఖల అధికారులుకూ స్థాన చలనం కలిగింది. కాగా ఐపీఎస్ అధికారుల  బదిలీలకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే ఎస్పీ స్థాయి నుంచి ఐజీ ర్యాంకు అధికారుల బదిలీల జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ఐపీఎస్ జాబితా విడుదల కానున్నది.  రాష్ట్రంలో రోజు రోజుకు తన గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని గమనించిన సీఎం జగన్.. మరో ఏడాది కాలంలో జరగనున్న ఎన్నికలై ఇప్పటి నుంచే దృష్టి పెట్టరని పరిశీలకులు భావిస్తున్నారు. అనననుకూల పరిస్థితులను అనుకూలంగా మర్చడంలో జగన్ సామర్థ్యం తెలియంది కాదు.. అందుకనే ఈ కసరత్తులనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

ఊరంతటిది ఒక దారైతే.. ఉలిపికట్టే దారెటో..?

హిండెన్బర్గ్ ఎక్కడిది?... ఎప్పుడైనా విన్నామా?... అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు..  జేపీసీ అవసరమే లేదని   అదానీ గ్రూప్ కు అండగా సాక్షాత్తు ఓ సీనియర్ ప్రతిపక్షనేత మాట్లడుతున్నారు.. ఆయనే మరెవరో కాదు.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్! అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్‌..  అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణలతో కూడిన నివేదికపై దర్యాప్తునకు ఒక పార్లమెంటరీ సంయుక్త సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండుతో తాను ఏకీభవించలేనని మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ఒక వైపు విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యతా యత్నాలు చేస్తుంటే వాటిని గండి కొట్టే విధంగా పవార్ తీరు ఉంది.  అదానీ గ్రూప్ కు అండగా ఆయన నిలబడ్డారు. తన ప్రసంగంలో ఆయన ఈ  విషయానికి (హిండెన్ బర్గ్ నివేదిక) అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. వీరి గురించి మనం ఎన్నడూ విన్నది లేదు. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు?  దాని నేపధ్యం ఏమిటి?  దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించిన అంశాలను వారు (ప్రతిపక్షాలు) లేవనెత్తినప్పుడు అందుకు అయిన మూల్యాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ భరించింది.  ఇలాంటి వాటిని మేం ఉపేక్షించేదిలేదు. ఇదంతా (అదానీ గ్రూప్ కు)  లక్ష్యంగా చేసుకున్నట్టు కనపడుతోందనేశారు  సదరు శరద్ పవార్ గారు. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఆయన బీజేపీకి, మోడీకి అండగా మాట్లాడారు. జేపీసీ డిమాండు అంశంపై తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు.  ఒక పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలని విపక్షాలు కోరుతున్నాయి. పార్లమెంటరీ సంఘాన్ని నియమించిన పక్షంలో అది పాలక పక్షం పర్యవేక్షణలోనే పనిచేస్తుంది. పాలక పక్షానికి వ్యతిరేకంగా డిమాండ్ పుట్టుకొచ్చింది.  పార్లమెంటరీ సంఘంలో మెజార్టీ సభ్యులు పాలకపక్షానికి చెందినవారు ఉంటారు. అలాంటప్పుడు వాస్తవం ఎలా వెలుగులోకి వస్తుందని ఆయన అటున్నారు. 'అదానీ- అంబానీ' అంటూ పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకోవడాన్ని తాను అంగీకరించేది లేదని ఆయన తేల్చేశారు. వటవృక్షంలా పెరిగిన బీజేపీని ఎలా అయినా మట్టికరిపించాలని ప్రతిపక్షాలు ఏకమైయేందుకు తంటాలు పడుతుంటే.. సదరు శరద్ పవార్   ఇలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆతర  ప్రతిపక్ష నేతలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు..  ఊరంతటిది ఒక దారైతే... ఉలిపికట్టె దారెటో అని జనాలు గుసగుసలాడుతున్నారు..!

ఉద్యోగుల రెండో దశ ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధం

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రెండో దశ ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమౌతున్నారు. తమ ఉద్యమం రెండో దశ కార్యాచరణకు సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డికి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ తీరు  పట్ల అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం, ఆగ్రహం పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్తితి రోజు రోజుకూ దిగజారుతోంది. చివరికి ఉద్యోగులు, పెన్షనర్లకు సమయానికి వేతనాలు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అన్నింటికీ మించి ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి నిధుల కోసం అన్వేషణలోనే ప్రభుత్వం పుణ్యకాలాన్ని గడిపేస్తోంది. ఇక పాలనపై దృష్టి ఎక్కడ సారిస్తుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న ఉద్దేశమే లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.  దీంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. చేస్తున్న పనులలో వేగం తగ్గించేశారు. దీంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికే ఆరంభమైన పనులు పూర్తయ్యే పరిస్థితే కనిపించడం లేదు.  వేతన జీవులకూ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మేరకే వేతనాల చెల్లింపు జరుగుతోంది. నెల నెలా మొదటి తేదీన అందాల్సిన వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంతే కాదు ఏ శాఖకు ఏ తేదీన వేతనాలు పడతాయో తెలియని పరిస్థితి.  ఇక ఉపాధ్యాయుల పరిస్థితి అయితే మరీ దయనీయం. పీఆర్సీ కోసం పట్టుబట్టారన్న కోపాన్ని వేతనాల విషయంలో తీర్చుకుంటోందా అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహార శైలి ఉంటోంది. నవంబర్ జీతాలు ఇప్పటికీ చాలా జిల్లాలలో టీచర్లకు అందలేదు. ఎప్పుడు అందుతాయో కూడా తెలియని పరిస్థితి.వేతన జీవులకు సకాలంలో వేతనాలు అందకుంటే ఉండే ఇబ్బందులను ప్రభుత్వం అసలు పరిగణనలోనికే తీసుకోవడం లేదు.   ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే వారికి రావలసిన ప్రయోజనాలన్నీ అందజేసి, పెన్షన్ పేపర్లు కూడా సిద్ధం చేసి గౌరవంగా సాగనంపేవారు.   ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. తమ హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులూ, నిర్బంధాలు. నెలంతా పని చేసి వేతనం అడిగేందుకు వీలులేని పరిస్థితి. జీవితమంతా కొలువు చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి.  ఈ నేపథ్యంలోనే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన రెండో దశ ఉద్యమ కార్యాచరణ నోటీస్ అందజేశారు. డిమాండ్లు పరిష్కారం కానందున ఉద్యమం కొనసాగిస్తున్నామన్నారు. తమది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదనీ, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమమనీ ఆ నోటీసులు పేర్కొన్నారు.  

జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీసీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో కట్టిన వేలాది టిడ్కో గృహాల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. నెల్లూరులో మా ప్రభుత్వ హయాంలో నెల్లూరులో పేదల కోసం కట్టిన  నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు ఇవి అంటూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం హయాంలో పేదల కోసం నిర్మించిన లక్షలాది ఇళ్లకు ఇది సజీవ సాక్ష్యం అని పేర్కొన్న చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో నువ్వు కట్టిన ఇళ్లెక్కడ జగన్ అంటూ చేసిన ఆ ట్వీట్ ను జగన్ కు ట్యాగ్ చేశారు. దానికి తాను దిగిన సెల్ఫీని జోడించారు.  చంద్రబాబు తన మెబైల్ పోన్ తో  నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి జగన్ కు చాజెంజ్ విసిరారు.  రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని  తెలుగుదేశం లీడర్లు, క్యాడర్ కు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ కిరణాలతో కమలం వికసిస్తుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం (ఏప్రిల్ 7న) బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి  నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు.  అంతకుముందు అసెంబ్లీ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.  2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు.  ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరంగా ఆయన.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన చివరకు బీజేపీలో చేరారు. నిజానికి గత కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్త తరచూ తెర మీదకు వస్తూనే వుంది. అలాగే ఆయన పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారనే కబుర్లు కూడా మీడియాలో షికార్లు చేశాయి. అయితే ఆ ఊహాగానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ  నల్లారి కషాయి కండువా కప్పు కున్నారు. కాగా  నల్లారి  చేరికతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత మెరుగుపడుతుందని ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తపరిచారు.  అలాగే కిరణ్ కుమార రెడ్డి 1952నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉందని  అసలు తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని  చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిందన్నారు.  దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు బీజేపీ  చేస్తున్న కృషి నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు.  అక్కడ పార్టీ పటిష్ఠత, కార్యాచరణపై నాయకులతో కనీస చర్చ కూడా ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.  తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ ఆశించిన విధంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్  కుమార్ రెడ్డి రాకతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నిజంగా బలపడుతుందా? కమలం వికశిస్తుందా అంటే లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరొచ్చినా, ఏమి చేసినా బీజేపీ పుంజుకునే అవకాశం లేదు. తెలంగాణలో  కిరణ్ రెడ్డి ఎంట్రీ వలన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

వైసీపీ ముక్త ఏపీ కోసమే ఆ కలయిక: రఘురామ రాజు

వైసీపీ ముక్త ఏపీ లక్ష్యంగా ఆ మూడు  పార్టీలు కలిసి పని చేయడం ఖాయమని ఆ పార్టీ రెబల్ ఎంపీ రామకృష్ణంరాజు అన్నారు. రచ్చబండలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన జనసేనానిని పవన్ కల్యాణ్ పొత్తులపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అని చెప్పడం కంటే ఇంకేం చెప్పాలని ప్రశ్నించారు.   పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజెపి పెద్దలతో జరిగిన సమావేశం లో ఏమి మాట్లాడారో నన్న టెన్షన్ జనసేన, తెలుగుదేశం శ్రేణులలో కంటే వైసీపీ నాయకత్వంలోనే ఎక్కువగా కనిపించిందన్న రఘురామ రాజు.. అది చాలదా జగన్ పార్టీలో ఓటమి భయం ఎంతగా గూడుకట్టుకుందో తెలియడానికి అని ప్రశ్నించారు.  టిడిపి తో పొత్తు గురించి బిజెపి పెద్దలతో మాట్లాడారా? అన్న మీడియా ప్రశ్నకు రాజకీయాలంటే అన్నీ మాట్లడుకుంటాంగా అన్న సమాధానం తరువాత కూడా పొత్తులపై అనుమానాలు వ్యక్తం చేసేవారు బుద్ధిహీనులూ ఔతారని రఘురామ అన్నారు.   ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంకు గతంలోనే ఉన్నది.  సరైన సమయం లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ నాయకత్వం కూడా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం స్పందిస్తుంది. జనాల సంక్షేమమే ముఖ్యం కానీ జగన్ సంక్షేమం కాదన్న విషయం ఆ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసునని, అందుకే  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేస్తాయని బిజెపి పెద్దలు మురళీధరన్, శివ ప్రకాష్ జి , నడ్డాలతో నాదెండ్ల మనోహర్ , పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ప్రగాఢ విశ్వాసంతో , రెట్టించిన ఉత్సాహంతో చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.  రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన లతో బిజెపి కలయికపై ఎటువంటి సందేహాలను పెట్టుకోవలసిన అవసరం లేదని   తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కుటుంబ సమేతంగా కలిసే అవకాశం టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీందర్ కుమార్ కు లభించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధ్వాన శాంతి భద్రతల పరిస్థితులను రవీంద్ర కుమార్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని కాపాడ వలసిందిగా కోరారు. దానికి ప్రధానమంత్రి స్పందిస్తూ ,అవును…ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పంజాబ్ మాదిరి గానే ఉన్నదని వ్యాఖ్యానించడం ద్వారా రవీందర్ కుమార్ వాదనలతో ఆయన ఏకీభవించినట్లయిందన్నారు.   టిడిపి, జనసేన, బిజెపి కలిస్తే మాడు పగులుతుందని, బాక్స్ బద్దలవుతుందని, కొంప కొల్లేరవుతుందన్న ఆందోళనలో వైసీపీ అగ్రనాయకత్వం ఉందని అన్నారు.   

నల్లారి చేరిక.. బీజేపీకి లాభమేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం. మాజీ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర చివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. 2004-09 మధ్య అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ పనిచేశారు. ఆ తర్వాత 2009- 10లో  ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ  స్పీకర్ గా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2010-2014 మధ్య ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా పని చేశారు.  ఆ సమయంలో... రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. 2014 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు  దూరంగా ఉంటూ వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ కు మళ్లీ  గుడ్ బై చెప్పిన ఆయన.. ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి జనాదరణ దాదాపుగా శూన్యం. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం వల్ల ఇప్పుడు ఆ పార్టీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు.. ఉనికే లేని పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వల్ల ఎవరికీ ఏ విధంగానైనా లాభం లేదు.  ఆయనకు రెండు రాష్ట్రాలో కూడా ఎలాంటి క్యాడర్ లేదు. చాలా కాలంగా పాలిటిక్స్ కు దూరంగా ఉండటంతో ఆయనకు ప్రత్యేక వర్గం అంటూ లేదు. త్వరలో ఎన్నికలొస్తున్నాయి.. అందుకు ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండటం బెటర్ అని భావించి చేరితే.. అది వేరే విషయం..కానీ ఆయన చేరిక వల్ల బీజేపీకి ఒరిగేది మాత్రం ఏం లేదంటున్నారు పరిశీలకులు?

విడదల రజని మెరుపులు.. మరకలు

ఏ రోటి దగ్గర ఆ పాటే పాడాలి... అదీ ఏ పాట అయినా సరే...  ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి... అది ఏ రంగు గొడుగు అయినా సరే.. అలా అయితేనే రాజకీయం చేయగలం.. అలా అయితేనే.. ఇలా పార్టీ మారి... అలా ఎమ్మెల్యే టికెట్ చేజిక్కించుకోవడం కోసం అప్పటి వరకు సంవత్సరాలకు సంవత్సరాలుగా... క్యూలో నిలబడి వేచి చూస్తున్న వారిని సైతం వెనక్కి నెట్టి మరీ ఎమ్మెల్యే టికెట్.. అదీ కూడా పైసా ఖర్చు లేకుండా సంపాదించేయవచ్చు. అలా దశ మహా విద్యలను మించిన ఆ మహిమాన్విత విద్య తెలిస్తే... రాజకీయాల్లో రాణించవచ్చని... అందులో కూడా ఎక్కడ అడ్డు అదుపూ.. ఆపూ లేకుండా దూసుకుపోవచ్చు అనేందుకు తాజా ఉదాహరణ చిలకలూరిపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ అని సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  జగన్ గురువారం (ఏప్రిల్ 6) ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ మహిళనైన తనకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణ పడి ఉంటానంటూ విడదల రజినీ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై ఆమె సంధించిన వ్యంగ్యస్త్రాలను సైతం నెటిజన్లు తమ దైన శైలిలో విశ్లేషిస్తున్నారు.  అయితే జై జగనన్న.. జై జై జగనన్న.. మన చిలకలూరిపేటలో మనమంతా..జగనన్నా అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కిపడాలా.. అంటూ విడదల రజినీ చేసిన వ్యాఖ్యలు.. ఏదో సినిమా డైలాగ్‌ను కాపీ కొట్టినట్లుగా ఉందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని.. జగనన్న గెలుపు తథ్యమని ఆమె చెప్పిన జోస్యం పట్ల నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఓ సారి గతాన్ని గుర్తు చేసుకోవాలని మంత్రి విడదల రజినీకి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు సూచిస్తున్నారు. 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీ  విజయం కోసం... సోషల్ మీడియాలో పని చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన అతికొద్ది మందిలో   విడదల రజినీ ఒకరని వారు వివరిస్తున్నారు. ఆ క్రమంలోనే... అంటే 2017లో విశాఖపట్నంలో జరిగిన మహానాడు వేదికపై నుంచి విడదల రజినీ మాట్లాడుతూ.. నేను మీరు నాటిన మొక్క సార్..  సైబరాబాద్‌ మొక్క సార్ అంటూ చంద్రబాబు ఎదుటే మాట్లాడిన రజనీ..  అప్పట్లో నరకాసురులు ఎలా ఉంటారని ఎవరైనా అడిగితే.. ప్రతిపక్ష   జగన్,  ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా ఉంటారని ఉదాహరణగా చూపించాలంటూ.. మైక్ అదిరేపోయేలా చెప్పిన సంగతిని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడం.. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో చేసేది లేక.. 2018లో జగన్ పార్టీలోకి ఆమె ఇలా జంప్ కొట్టి.... అలా అసెంబ్లీ టికెట్ తీసుకొని.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. జగన్ మలి కెబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని... అలాగే రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన జిల్లా విశాఖపట్నం అని.... ఆ జిల్లాకే ఇన్‌చార్జ్ మంత్రిగా ఆమె కొనసాగుతున్నారని వారు వివరిస్తున్నారు.   ఇదే విడదల రజినీ... నాడు మహానాడు వేదికగా చంద్రబాబు సమక్షంలో అలా మాట్లాడితే.. నేడు జగన్న సభలో ఇలా మాట్లాడారంటూ.. నెటిజన్లు ఈ సందర్భంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీకాక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని.. లేని పక్షంలో కేబినెట్‌లో మార్పులు చేర్పులు తప్పవంటూ ఇటీవల జరిగిన కెబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి  జగన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారనే కథనాలు అయితే మీడియాలో హల్‌చల్ చేశాయి. అలాంటి వేళ.. రేపో మాపో జగన్ కేబినెట్‌ను మూడో సారి విస్తరించే అవకాశాలు ఉన్నాయని.... ఈ నేపథ్యంలో పార్టీ అధినేత  జగన్ ముందరి కాళ్లకు బంధం వేసేలా మంత్రి విడదల రజనీ మాటలు మంత్రించి వదిలారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అదీకాక 2019 ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా విడదల రజినీని గెలిపిస్తే.. చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి.. తన కేబినెట్‌లో మంత్రిని చేస్తానంటూ ప్రతిపక్ష నేతగా  జగన్ ప్రకటించారని.. అయితే ఆ ఎన్నికల్లో విడదల రజినీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారనీ, అయితే  మర్రి రాజశేఖర్‌కు నిన్న మొన్నటి వరకు ఎటువంటి పదవి  దక్కలేదు  కానీ ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్సీగా గెలుపొందారని..  మరోవైపు  మర్రి రాజశేఖర్‌ సామాజిక వర్గానికి చెందిన వారు..  జగన్ మలి కెబినెట్‌లో ఒక్కరు కూడా లేరని.. ఈ నేపథ్యంలో ఒకే నియోజకవర్గంలో ఇద్దరికి కెబినెట్‌లో చోటు ఉండదు కాబట్టి.. మంత్రి పదవి నుంచి రజినీని తప్పించి... ఆ స్థానంలో మర్రి రాజశేఖర్‌ను తీసుకొనే అవకాశం అయితే ఉందనే ఓ చర్చ అయితే ప్రస్తుతం  నెట్టింట జోరుగా సాగుతోంది. మరోవైపు ఇదే చిలకలూరిపేట  నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలకు సంబంధించి హైకోర్టు జారీ చేసిన నోటీసులు..  జగన్ సోదరుడు కడప ఎంపీ  అవినాష్ రెడ్డి బంధువులతోపాటు మంత్రి విడదల రజినీ కూడా అందుకోన్నారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  ఏదీ ఏమైనా ఎటువంటి అండ.. దండా..  హంగు.. ఆర్భాటం లేకుండా.. చాలా సింపుల్‌గా 2014లో టీడీపీ గెలుపు కోసం పని చేసి.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టి... ఎమ్మెల్యేగా గెలుపొంది.. మంత్రి పదవి అందుకోవడం అంటే చాలా ప్రతిభ పాటవాలు ఉండాలని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. మహానటి అవతారం ఎత్తాలని అలా అయితేనే రాజకీయాల్లో రాణింపు ఉంటుందని స్పష్టమవుతోందని సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు.

బాధ్యత లేని సలహా.. ఆలోచన లేని ఆచరణ

సలహాలు ఇచ్చే వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ సలహాలను పాటించి నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి బాధ్యతగా లేకపోతే.. ప్రజలకు అష్టకష్టాలే. వారి వ్యతిరేకతా, ఆగ్రహం అన్నీ కూడా నేరుగా నిర్ణయాలు అమలు చేసే ప్రభుత్వం మీదకే వెళతాయి కానీ.. బాధ్యత లేని సలహాల మూటలు విప్పే వారిపై కాదు. ఇప్పుడు కొత్తగా వైసీపీ సర్కార్ ఆరంభించిన జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం కూడా అలాంటిదే. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమ రూపశిల్పి అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి.. వచ్చే ఎన్నికలలో గెలుపు మంత్రంగా ఎంచి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతటి కీలకమైన ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి కాకుండా, ప్రభుత్వ ముఖ్య సలహాదారు మీడియా ముందుకు వచ్చి వివరించడంలోనే ఈ కార్యక్రమం ఎవరి బ్రెయిన్ చైల్డ్ అన్నది అర్ధమైపోతోంది. అసలింతకీ ఈ పథకం ఏమిటి? ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుంది. జగనన్నే మా భవిష్యత్ అంటూ జనంలోకి వెళ్లడానికీ, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికీ తేడా ఏమిటి? గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులకు గడపగడపలోనూ పరాభవం ఎదురైంది. మరి ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్ అంటూ జనం ముందుకు ఎవరు వెళతారు? వారిని జనం ఎందుకు స్వాగతిస్తారు అంటే.. ఎవరి వద్దా సమాధానం లేదు. కానీ దబాయింపు సెక్షన్ అని ఒకటి ఉంది. గత నాలుగేళ్ల జగన్ పాలనలో పకడ్బందీగా అమలు అవుతున్న సెక్షన్ ఇది ఒక్కటి మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ అధికారులతో గడపగడపకూ వెళ్లిన ప్రజాప్రతినిథులు ఇక నుంచీ వలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు వెడతారు. వీరంతా జగన్ గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాల లబ్ధి దారులు ఎవరు ఉండాలి, ఎవరికి కొనసాగించాలి, ఎవరికి రద్దు చేయాలి అన్నది నిర్ణయించే వారు. వారి పని అదేనని జనం నమ్ముతున్నారు. వీరు ఇంటింటికీ తిరిగి మీకు అందుతున్న పథకాలు ఇవీ, దాని వల్ల నగదు రూపేనా మీరు తీసుకుంటున్న లబ్ధి ఇది అని వివరించి, జగనన్నే మీ భవిష్యత్ అని అంగీకరించకుంటే ఇవేవీ అందవు అని ఒక విధంగా వారిని బెదరిస్తారన్న మాట. అక్కడితో అది అయిపోలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ పాలన, ప్రస్తుత జగన్ పాలన గురించి అధికార పక్షం వెర్షన్ తో ఒక కరపత్రం ఉంటుంది. ఇక తరువాత జగనన్నే మా భవిష్యత్ అని వారి చేత ఒప్పించి.. ఆ వచ్చిన వాళ్లు ఒక ఫోన్ నంబర్ కు మిస్డ్ కాల్ చేయిస్తారు. అంతే అలా మిస్డ్ కాల్ చేసిన వారంతా జగనన్నే మా భవిష్యత్ అని భావిస్తున్న వారైపోతారు.   అప్పుడు వారికి జగన్ సందేశం వినిపిస్తుంది. ఆ తరువాత ఇంటికి స్టిక్టర్ అతికించేస్తారు. అంటే ఆ ఇంట్లో ఓట్లన్నీ జగన్ పార్టీకే అని కన్ ఫర్మ్ చేసేసుకుంటారు.  ఈ తంతంతా ఇందుకు ఇష్టపడితేనే జరుగుతుందని ఘనత వహించిన సలహాదారు చెబుతున్నా.. అలా ఇంటి మీదకు వచ్చి మేం చేస్తున్న ఘనమైన సంక్షేమాన్ని అంగీకరించి, మిస్ట్ కాల్ చేయండి అంటే నో అనే ధైర్యం ఎవరైనా చేస్తారా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. భయంతో అంగీకరించినా ఓట్లు వేసే టైమ్ కు జనం వారి నిర్ణయం మేరకే.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో జగన్ ను భయపెట్టిన ఆత్మ ప్రబోధానుసారమే నిర్ణయం తీసుకుని అమలు చేస్తారని పరిశీలకులు అంటున్నారు.