జగన్ లండన్ పర్యటన రద్దు..చలో ఢిల్లీ..?

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం,   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ముఖ్య నేతలతో భేటీ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు వ్యవహారంలో   సీఎం జగన్ రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే జగన్ లండన్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల చివరి వారంలో తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ దంపతులు వారం రోజుల పాటు లండన్ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ వేగం పెంచడం ఆ పర్యటన రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.  కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మరోసారి ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లే సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో సీఎం జగన్ సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందు కోసమే  లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారంటున్నారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యే ముందు వరకు కూడా నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కీలకమైన ఈ భేటీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందే సీఎం జగన్ అనంతపురం పర్యటనను కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. భాస్కరరెడ్డి అరెస్టు నేపథ్యంలో సోమవారం అధికారిక కార్యక్రమాలను కూడా సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. కేసు వ్యవహారంపైనే ముఖ్య నేతలతో పాటు న్యాయ నిపుణులతో చర్చించినట్లు చెబుతున్నారు.  కోర్టులపై అపారమైన నమ్మకం, విశ్వాసం ప్రభుత్వానికి ఉందని, ఈ కేసు విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్న విశ్వాశాన్ని కూడా జగన్ వ్యక్తం చేసినట్లు సమాచారం. సీబీఐ కేసు వ్యవహారంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న అంశాన్ని కూడా తెలుగుదేశం ఇతర పార్టీలన్ని రాజకీయం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, లేని దానిని ఉన్నట్లుగా చిత్రీకరించే పరిస్థితికి దిగజారుతున్నాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై ఎవరూ, ఎక్కడా మాట్లాడవద్దని, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పార్టీ కేంద్ర కార్యాలయం  అనుమతి తీసుకుని మాట్లాడాలని, అస్పష్టతతో ఎవరూ మాట్లాడకుండా చూడాలని ముఖ్య నేతలకు జగన్ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. భాస్కరరెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో జగన్ ఈ సూచన చేశారని చెబుతున్నారు. మెత్తం మీద.. భాస్కర రెడ్డి అరెస్టు, పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లతో జగన్  కంగారుపడుతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక తాను ఇప్పటి వరకూ నమ్ముకున్న ఢిల్లీ పెద్దలు ఈ విషయంలో  ఏ మెరకు  సహాయ పడతారన్నది ..వేచిచూడాల్సిందే.

ఈ జగన్ కు ఏమైంది?

మడమ తిప్పని, మాట తప్పని నేతగా తనని  తాను బ్రాండ్ గా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బ్రాండింగ్ క్రమంగా మసకబారుతోంది. అసలుజగన్ అంటేనే ధైర్యం, ధైర్యం అంటేనే జగన్ అంటూ విపరీతమైన ఫాలోయింగ్  సొంతం చేసుకున్న జగన్  ఇటీవలి కాలంలో ఆయనను అభిమానించే వారిని తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ స్థాపించిన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చిన్న విషయం కాదు.  11 కేసులలో 16నెలల జైలు జీవితం గడిపి కూడా ప్రజామోదం పొందడం ఒక్క జగన్ కే సాధ్యమైంది. జగన్ తెగువను, పట్టుదలను  ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరాలి. అయితే ఇంత బలమైన వ్యక్తిత్వం ఉన్న జగన్ ఇటీవల జావకారిపోతున్నారు. సీఎం పదవిని చేపట్టిన మొదటి సంవత్సరం విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రతిపక్షానికి 23 స్థానాలే వచ్చిన విషయాన్ని దెప్పిపొడుస్తూ గడిపేశారు జగన్. రోండవ సంవత్సరం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ ఆకర్ష్ ను విజయవంతంగా ప్రయోగించి చంద్రబాబుకు కంట్లో నలుసుగా మారాను జగన్. ఇక మూడో సంవత్సరం తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలను పార్టీ నుండి సాగనంపే పనిని జగన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇక నాలుగో సంవత్సరం అంతా ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టే పనికి తన అనుయాయులతో కలిసి పదును పెట్టారు.  చంద్రబాబు ధర్మపత్నిని అసెంబ్లీలో నానా మాటలూ అని ప్రతిపక్ష నేత చేత  అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేయించగలిగారు.  గడిచిన నాలుగేళ్లూ స్విచ్ లు నొక్కుతూ, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతూ, సంక్షేమం పేరుతో పైసలు పంచుతూ కాలం గడిపిన జగన్ కు చివరి సంవత్సరం కఠిన పరీక్షలు పెడుతోంది. 2019 ఎన్నికల ముందడు జరిగిన కోడి కత్తి కేసు, వివేకా హత్య వంటి సంఘటనలు జగన్ కు గుది బండగా మారాయి. ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లి పనులు చక్కపెడుతున్నా.. సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో అన్న అనుమానం జగన్కు కలగలేదని చెప్పాలి. ఢిల్లీలో ప్రతిభావంతులైన నాయకులకు బాధ్యతలు ఇచ్చిన జగన్ ప్రధాని కార్యాలయంలో చీమ చిటుక్కుమన్నా సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేసుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయినా జగన్  అంచనాలకు అందకుండా ఢిల్లీలో పరిణామాలు జరుగుతున్నాయి అనే అనుమానం ఆయన పార్టీ నేతల్లో బలపడుతోంది. ప్రస్తుతం జగన్ పరిస్థితికి.. ఇంత కాలం దేన్నీ సీరియస్ గా తీసుకోలేకపోవడమే కారణమని ఈ పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీని మరింత డిఫెన్స్ లోకి నెట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు రిఫరెండం కాదని బయటకు ఎంత చెప్పుకున్నా పార్టీలో డల్లతనాన్ని ఈ ఫలితాలు చెప్పకనే చెప్పాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ పరువు బజారున పడటంతో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు అసమ్మతి నేతలంటూ నలుగురిని బయటకు పంపించి పార్టీ చేతులు దులుపుకుంది.  తాజాగా కోడి కత్తి వివాదంలో ఎన్ఐఏ రిపోర్టు జగన్ ను, పార్టీని ఇబ్బంది పెట్టగా, వివేకా హత్య కేసు జగన్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాల్ విసిరింది. అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగియడంతో జగన్ ఇబ్బందులు పెరిగాయి. దీంతో అనంతపురం సభను, లండన్ పర్యటనను సైతం జగన్ రద్దు చేసుకున్నారు.  మైసూరు నుంచి ఆఘమేఘాల మీద లాబీయిస్టులు విజయవాడలో వాలిపోయారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్న వాస్తవం జగన్ కు బాగా తెలుసు.  ఇదిలా ఉంటే అసలు భయమన్నదే ఎరుగని జగన్ కు పరిస్థితులు భయాన్ని పరిచయం చేశాయని విశ్లేషకులు అంటున్నారు.  చివరి సంవత్సరం గడ్డు కాలంగానే ఉంటుందన్నది ఇప్పటికే జగన్ కు అర్ధం అయి ఉండాలి. 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పెద్ద బాధ్యతకు జగన్ సిద్ధం కావాల్సి ఉంది. 

పవన్ దెబ్బకు జగన్ విలవిల!

జనసేనాని అనుకున్నది సాధించారా? ఏపీలో జగన్ పార్టీకి బీజేపీని దూరం చేయడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వను అన్న తన మాటను నిలబెట్టుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జనసేన అధినేత తన పంతం నెగ్గించుకున్నారా? ఏపీలో జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యం అని ప్రకటించిన ఆయన అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అని పంతం పట్టారు. ఇందు కోసం అసవరమైతే బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి ఒప్పిస్తానని కూడా చెప్పారు. ఈ మాట ఆయన ఎప్పుడో చెప్పారు. ఆ తరువాత పదేపదే పునరుద్ఘాటించారు. అయితే ఆయన మాటలు గాలి మూటలేనా   అనిపించేలా ఇటీవలి ఆయన హస్తిన పర్యటనకు ముందు వరకూ రాష్ట్ర బీజేపీ నేతల తీరు ఉండింది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలపై పలు సందేహాలు ఉండేవి. ఒక వైపు ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటే.. మరో వైపు రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీల మైత్రి విచ్ఛిన్నం కావడం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా ఉండింది. ఈ నేపథ్యంలోనే పలు మార్లు జనసేనాని బీజేపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్రంలోని అగ్రనాయత్వం కానీ ఈ నాలుగేళ్లలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలూ  నిన్న మొన్నటి దాకా కనిపించలేదు. అయితే తాడో పేడో తేల్చుకోవడానికి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఇటీవల రెండు రోజులు హస్తిన లో మకాం వేసి మరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరిపి వచ్చారు. ఆ సందర్భంగా హస్తిన వేదికగా పవన్ కల్యాణ్ విలేకరులతో మాట్లాడారు. అప్పుడు కూడా పొత్తుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ తన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిందన్న ఒక్క మాటతో సరిపెట్టేశారు. నడ్డాతో భేటీ తరువాత సంయుక్తంగా మీడియా ముందుకు రాకపోవడం, జగన్, నాదెండ్ల ఇరువురు మాత్రమే తప్పదన్నట్లుగా హస్తినలో మీడియాతో మాట్లాడటం, అదీ ముక్తసరిగా సరిపెట్టేయడంతో బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో కూటమిగా ఏర్పడేందుకు విముఖత చూపిందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన తరువాత బీజేపీ కేంద్ర నాయకత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. అలాగే రాష్ట్ర నాయకత్వ గళం కూడా మారింది. అంతకు ముందులా రాష్ట్రంలో అధికార వైసీపీ పట్ల సానుకూలత తగ్గినట్లు స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే.. వైసీపీ సర్కార్ విధానాలపై బీజేపీ రాష్ట్ర సర్కార్ విమర్శల దాడి పెంచడం చూస్తుంటే.. పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన తరువాత వైసీపీ సర్కార్ పట్ల బీజేపీ వైఖరి మారినట్లుగా స్పష్టమౌతోంది. అన్నిటికీ మించి వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి వద్దకు సీబీఐ వస్తోందన్న భావన కలిగితే చాలు ఏపీ సీఎం జగన్ అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని హస్తినలో వాలిపోయేవారు. ఈ సారి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్టు చేసినా.. అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఐదో సారి సమన్లు జారీ చేసిన జగన్ తన పర్యటనలైతే రద్దు చేసుకున్నారు కానీ.. హస్తిన బాట పట్టలేదు. అలాగే సీబీఐ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, అవినాష్ రెడ్డిని ఐదో సారి విచారించేందుకు నోటీసు ఇవ్వడం, ముందస్తు బెయిలు కోసం అవినాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ స్పష్టంగా అవినాష్ ను అవసరమైతే అరెస్టు చేస్తామని చెప్పడం చూస్తుంటే.. సీబీఐ దూకుడును అడ్డుకునే ప్రయత్నాలేవీ కేంద్రం నుంచి జరగడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద పవన్ హస్తిన పర్యటన ఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్నట్లుగా వైసీపీకి బీజేపీని దూరం చేయడమే కాకుండా... తెలుగుదేశం కు దగ్గర చేర్చేందుకు దోహదపడిందని అంటున్నారు.  

పార్టీ కీలక నేతలతో జగన్ బేటీ.. ఏం చర్చించారంటే?

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు అనూహ్యంగా పెంచిన నేపథ్యంలో జగన్ కోటరీలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి మేనమామ అయిన వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు తరువాత ఈ భయం మరింత పెరిగింది. ఈ కేసులో పాత్ర ధారులు, సూత్ర ధారులెవరన్నది తేలిపోయే దశకు వచ్చిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సోమవారం (ఏప్రిల్ 17) సీబీఐ విచారణను తప్పించుకున్న అవినాష్ రెడ్డి మంగళవారం ( ఏప్రిల్ 18) అనివార్యంగా సీబీఐ ఎదుట హాజరు కాకతప్పదు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్బంగా  కోర్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందా అన్న కోర్టు ప్రశ్నకు సీబీఐ తరఫు న్యాయవాదులు అవసరం అయితే అరెస్టు చేస్తామని బదులిచ్చారు. అలాగే భాస్కరరెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందనీ, ఆయన పిటిషన్ కోర్టు విచారణలో ఉండగానే అరెస్టు చేయడం అక్రమమనీ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనను మధ్యలో అడ్డుకున్న కోర్టు.. పిటిషన్ విచారిస్తామన్నామే కానీ.. అరెస్టు చేయవద్దని ఆదేశించలేదుగా అని వ్యాఖ్యనించింది. ఈ నేపథ్యంలోనే గతంలో అవినాష్ రెడ్డి సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఏప్రిల్ 18) అవినాష్ రెడ్డిని విచారించిన అనంతరం ఆయనను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదించిన మేరకు ఈ నెల 30 లోగా వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే సీబీఐ విచారణను వేగవంతం చేసింది. వరుస అరెస్టులతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత  జగన్ పార్టీ ముఖ్యనేతలతో సోమవారం (ఏప్రిల్ 17) అత్యవసరంగా సమావేశమయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివేకా హత్య చేసులో బాస్కరరెడ్డి అరెస్టుతో జగన్ ఆది, సోమవారాలలో తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. చివరాఖరికి జగనన్న విద్యా దీవెన పథకం కింద అనంత జిల్లాలో ఏర్పాటు చేసిన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని సైతం రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ప్యాలెస్ లోనే పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారు.    ఈ కేసులో బాధితుల తరఫు వారూ, నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారూ కూడా జగన్ ను సమీప బంధువులే కావడంతో ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు వైసీపీపై కూడా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వైపు జగన్ కు స్వయానా చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత.. మరో వైపు సీఎం సతీమణి మేనమావ, ఆయన కుమారుడు.. దీంతో ఈ కేసులో ఏ పరిణామమైనా నేరుగా జగన్ కుటుంబంపైనే ప్రభావం చూపుతోంది.  అంతే కాకుండా వివేకా హత్య కేసులో వెలుగులోకి వస్తున్న అంశాలు సీమ రాజకీయాలలో కూడా ప్రభావం చూపుతున్నాయి.  అజాత శత్రువుగా పేరుపడిన వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్న అంశాలు, జరుగుతున్న అరెస్టులు అధికార పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో పడేశాయి. పైపెచ్చు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వివేకాపై ఇప్పుడు చేస్తున్న ఆరోపణలతో  వారికి పులివెందులలోనే కాకుండా కడప వ్యాప్తంగా ప్రతికూత ఎదురౌతోంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? పార్టీపై ఈ కేసు ప్రభావం పడకుండా ఎం చేయాలి అన్న విషయాలపై చర్చించేందుకే జగన్ పార్టీకి చెందిన కీలక నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బీజేపీ మీద కేసీఆర్ ఫోకస్

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలని చూస్తున్నారు. బిజేపీకి  ఒక్క స్థానం దక్కకుండా పూర్తి ఫోకస్ పెట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తీవ్రంగా యత్నిస్తూనే బీజేపీ అడ్రస్ గల్లంతు చేయాలని చూస్తున్నారు. బీజేపీ నామరూపాలు లేకుండా చేయాలని  ఆయన భావిస్తున్నట్లు కనబడుతుంది. కనీసం 100 సీట్లు బీఆర్ఎస్ గెలుపొందాలని కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు.  గోషామహల్, హుజూరాబాద్, దుబ్బాక నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈ మూడు స్థానాల్లో కాషాయ జెండాకు బదులు పింక్ జెండా ఎగరేయాలని ఉవ్వీళూరుతున్నారు.  గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త మీద విద్వేష ప్రసంగ ఆరోపణపై పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. అయితే నేటి వరకు అతని సస్పెండ్ ఉపసంహరణ కాలేదు.  పోలీసులు అతన్ని పీడీ యాక్ట్ క్రింద అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే కోర్టు అతనికి కండిషన్ బెయిల్ మంజూరు చేసింది.  రాజా సింగ్ ను ఓడించడానికి బీఆర్ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్ పోటీ చేసే అవకాశాలున్నాయి. దాదాపు అతనికి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   2018లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటి చేసి 44 వేల వోట్లు సాధించి రాజాసింగ్ పై ఓడిపోయారు.  హుజూరాబాద్ లో ఎంఎల్సీ కౌశిక్ రెడ్డి తో పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఈటెల రాజేందర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డిని రంగంలో దించే అవకాశముంది.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఓడించడానికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త కోట ప్రకాశ్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దుబ్బాక మీద ఫోకస్ పెట్టాలని కేసీఆర్  ఇప్పటికే ప్రకాశ్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.   

జగన్ జాతకం తిరగబడిందా?

వైనాట్ 175 అంటూ రంకెలేసిన వైసీపీ సేన ప్రస్తుతం ఆత్మ పరిశీలనలో పడింది. నేనున్నాను.. నేను విన్నాను నుండి మా నమ్మకం నీవే జగన్ అనేంత వరకూ సాగిన జగన్సాలన ఏమీ సాధించకుండానే చరమాంకానికి చేరుకుంది. డజను సీబీఐ కేసులు, 16 నెలల జైలు జీవితం పెట్టుబడిగా సాధించుకున్నసీఎం పదవి  జగన్ కు కష్టాలనే మిగిల్చింది. నోరు జారిన పాపానికి నవరత్నాలను మేనిఫెస్టోలో పెట్టి, గెలిచిన తరువాత అమలుకు అష్టకష్టాలూ పడుతున్నాడని రాజకీయ పండితులు అంటున్నారు. దీంతో రాష్ట్రం  దివాళా తీసే పరిస్థితి రావడం,  అప్పుల కోసం అన్ని అడ్డ దారులూ తొక్కడం జగన్ పదవీ కాలంలో ఆయనకు గుర్తుండిపోయే కొన్ని విషయాలు. డబ్బులు పంచడమే సంస్కరణ అన్న కొత్త సంస్కరణ అమలు చేయడం ఎంత కష్టమో జగన్ కు అర్ధం అయ్యింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా 97 వూల రెటకలే. ఇది62 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాటా. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఐదేళ్లూ పరిపాలన  సాగించిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా లక్షా డెబ్భై వేల కోట్లు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడిచిన  నాలుగేళ్లలో చేసిన అప్పు అక్షరాలా రెండు లక్షల ముఫై వేల కోట్లు. అన్నీ చేర్చుకుని ఈ రోజుకు ఏపీ అప్పు నాలుగు లక్షల ఎనభై మూడు వేల కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. అయితే తెలుగుదేశం హయాంలో ఐదేళ్ల అప్పుకంటే జగన్ నాలుగేళ్ల అప్పు యాభై వేల కోట్లు అధికం.  మరో సంవత్సరం మిగిలి ఉన్నందున మరో 70 వేల కోట్ల అప్పుకు జగన్ పథకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో జగన్ కు తప్పనిసరి అనేది ఆర్థిక విశ్లేషకుల వాదన.  జగన్ ప్రభుత్వం స్విచ్ నొక్కిపంచిన డబ్బులే ఓట్లుగా మారి ఈవీఎమ్ చిప్ లను ఫ్యాన్ గుర్తుతో నింపేస్తాయని వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అలా అయితే 2024 ఎన్నికలలో అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది కొంత మంది సిట్టింగ్ లు, ఆశావహుల లాజిక్. ఒక వేళ వైసీపీ అభ్యర్థులు అలా ఆలోచించి ఎన్నికలలో ఖాళీ జేబులతో తిరిగితే పార్టీ అధికారంలోకి రావడం సంగతి  తరువాత, పరువు కూడా దక్కదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పులి మీద పుట్రలా  వివేకా హత్య కేసు, పార్టీలో అసమ్మతి, మరో వైపు రోజు రోజుకీ పెరుగుతున్న తెలుగుదేశం గ్రాఫ్ వైసీపీ అధిష్ఠానానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.  ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. చర్చించుకుంటున్నారు. తాజాగా జగన్ జాతకాలు చెప్పే వారిని స్పెషల్ ఫ్లైట్లలో రప్పించుకుని చర్చించడం ఆ పార్టీలో అంతర్మథనాన్ని చెప్పకనే చెబుతోంది.

స్వలింగ సంపర్క వివాహాలపై సుప్రీం విచారణ

స్వలింగ  సంపర్క వివాహాలకు చట్ట బద్దత విషయంలో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ ప్రారంభించనుంది.  అయితే ఈ విచారణ ప్రారంభించడానికి ఒక రోజు ముందే కేంద్ర ప్రభుత్వం స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకించింది. ఈ పిటిషన్ కొట్టి వేయాలని కేంద్ర ప్రభుత్వం మరో సారి సుప్రీంను అభ్యర్థించింది. స్వలింగ  సంపర్క వివాహాలకు సంబంధించిన అన్ని పిటిషన్లను కొట్టి వియాలని కేంద్రం కోరింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ ఎస్ కె కౌల్ ,జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్‌ 18 నుంచి దీనిపై విచారణ చేపట్టనుంది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత ఇవ్వాలని   డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు సహా వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు నవంబర్ 25న, రెండు వేర్వేరు స్వలింగ జంటల పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.  స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సమయంలో, స్వలింగ సంపర్కులకు సాధారణ పౌరుడితో సమానమైన ప్రాథమిక హక్కులు ఉన్నాయని కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు మంగళవారం తుది వాదనలు విననుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కొన్నేళ్లుగా భారతదేశంలో స్వలింగ సంపర్కానికి ఆమోదం కూడా పెరిగింది. ప్రపంచ  వ్యాప్తంగా 28 దేశాల్లో స్వలింగ సంపర్క వివాహాలకు చట్ట బద్దత లభించింది. భారత దేశంలో మాత్రం చాలాకాలంగా ఈ అంశం మరుగున పడింది.  గే, లెస్బియన్స్ అనే స్వలింగ సంపర్కులు చాలా కాలంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వివాహాల విషయంలో ఇంకా చట్ట బద్దత లభించలేదు. 

బాబులు దారి తప్పారు.. గుజరాత్ దినపత్రిక సంచలన కథనం

ఐఎఎస్,   అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలనూ ప్రభావితం చేస్తారు. అంతేనా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కావాలన్నా, కాకుండా ఉండాలన్నా వారిపైనా ఆధారపడి ఉంది. రాజకీయాలలో భవిష్యత్ పరిణామాలు ఏమిటి, ముందు ముందు ఏం జరగబోతోంది అన్నీ పరిశీలకుల కంటే, విశ్లేషకుల కంటే ముందుగానే పసిగట్టేస్థారు. అధికారంలో ఉన్న సర్కార్ మరో సారి గద్దెనెక్కుతుందా? విపక్షానికే పరిమితమౌతుందా.. ప్రజల నాడి ఎలా ఉంది ఇవన్నీ వారికి కరతామలకం. అటువంటి అధికారులు అడ్డదారులు తొక్కాలని నిర్ణయించుకుంటే.. వారిని ఆపడం కాదు కదా అడ్డదారుల్లో వెళుతున్నారని పసిగట్టడం రాజకీయ నేతలకు, దర్యాప్తు సంస్థలకూ అంత తేలిక కాదు. బాబూస్ పైనా మంత్రులు, ముఖ్యమంత్రులు అధికంగా ఆధారపడతారు. కీలక పదవులలో తమకు అనుకూలురను నియమించుకోవాలని చూస్తారు. ఎందుకంటే.. ఆపత్కాలంలో తమ మేధా సంపత్తితో తమను చిక్కుల నుంచి బైటపడేయగలుగుతారన్న నమ్మకం. ఇక అటువంటి బ్యూరోక్రట్లు రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఇట్టే పట్టేస్తారు.  రాజకీయలతో అసలు ఏ సంబంధం లేనట్లుండే అధికారులు రాజకీయ పరదాల చాటున ఏం జరుగుతుందో కళ్ళు మూసుకుని చూసేయగలరు.  అందుకు తగ్గట్టుగా తమను తాము ట్యూన్ చేసుకుంటారు. స్ట్రాటజీలు మార్చుకుంటారు. తమ వరకూ రాదనుకుంటే.. అడ్డగోలు సంపాదనలకూ వెనుకాడరు. అధికార పార్టీ ప్రాపకం కోసం రూల్స్ ను అతిక్రమించేయగలరు, లేదా వాటిని అవసరానికి అనుగుణంగా మార్చేయగలరు. రాజకీయ నాయకులతో బాబూస్ కుమ్మక్కుతో అడ్డగోలుగా ఆస్తులు పెంచేసుకున్న ఐఏఎస్ ల వ్యవహారం ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యాపారాలు, ఆస్తుల వ్యవహారంపై  విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, అధికారుల పెట్టుబడులపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ దినపత్రిక దివ్య భాస్కర్ ప్రచురించిన కథనం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ లు స్టాక్ మార్కెట్ లో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల విలువ 7500 కోట్ల రూపాయలకు పైమాటేనన్నది దివ్యభాస్కర్ దినపత్రిక కథనం. రాష్ట్రంలోని స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా దివ్యభాస్కర్ అధికారుల బండారాన్ని బయటపెట్టింది. వీరికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేల అండ దండిగా ఉందని కూడా ఆ పత్రిక కథనం పేర్కొంది. రాష్ట్రంలోని 90శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ లు తమతమ బంధువులు, స్నేహితుల పేరు మీద ఓపెట్ చేసిన డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్లలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసినట్లు ఆ పత్రిక కథనం పేర్కొంది.  ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి వారు పాల్పడిన అవినీతే కారణమన్నది ఆ పత్రిక కథనం సారాంశం.  అయినా ప్రభుత్వంతో, ప్రభుత్వంలోని పెద్దలతో, అధికార పార్టీ కీలక వ్యక్తులతో కుమ్మక్కైతే... దోపిడీకి రాచబాట పరిచినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్, రియల్ వ్యాపారంలో బాబుల పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెల్లడైనా చర్యలేవని ప్రశ్నిస్తున్నారు.  దివ్యభాస్కర్ కథనం ఒక్క గుజరాత్ లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకూ మాత్రమే తన కథనాన్ని పరిమితం చేసింది కానీ.. దేశంలోని పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పరిస్థితి అన్ని హద్దులనూ దాటేసిందని అంటున్నారు. ఏపీలో ఐఏఎస్, అధికారులు తరచుగా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితికీ, కోర్టుల చేత అక్షింతలు వేయించుకోవడానికీ ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలను ఏవో ప్రయోజనాలను ఆశించి గుడ్డిగా అంగీకరించి అమలు చేసేయడమేనని అంటున్నారు. ఇలా కుమ్మక్కయ్యే క్రమంలో దండిగా ఆర్థిక లబ్ధి కూడా పొందుతున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో జగన్ రెడ్డి   ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత.. సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుబోనెక్కిన విషయాన్ని,  చీవాట్లు తిన్న విషయాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.    

అఖిల భారతీయ సర్వీస్ అధికారులు పారాహుషార్

  అఖిల భారతీయ సర్వీస్ అధికారులైన ఐఏ ఎస్ , ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ అధికారులు షేర్ బజార్ లో పెట్టుబడులు, విక్రయాలు జరిపితే  ఇక నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారమివ్వాల్సిందే. పారదర్శకతను పాటించాలని ప్రభుత్వం సూచించింది. షేర్ బజార్ లో పెట్టుబడులు , ఇతర పెట్టుబడులు పెట్టినట్లయితే మూలవేతనం కంటే అధికంగా ఉంటే కేంద్ర కార్మిక శాఖకు సమాచారం ఇవ్వాల్సిందే.వారి మొత్తం లావాదేవీల క్యాలెండర్ సంవత్సరంలో ఆరు నెలల మూలవేతనం కంటే  ఎక్కువ ఉంటే కేంద్ర కార్మిక శాఖకు సమాచారమివ్వాల్సిందే.   అఖిల భారతీయ సర్వీసెస్ నియమావళి 1968 నియమం16(4) ప్రకారం అతను అందించాల్సిన సారూప్య సమాచారానికి అదనంగా ఉంటుంది.  ఈ నియమాలు ఆలిండియా సర్వీసెస్ క్రింద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్,  ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారులకువర్తి స్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.   గుజరాత్ కు చెందిన ఐఏఎస్ , ఐపిఎస్ , ఐఎఫ్ఎస్ అధికారులు స్టాక్  మార్కెట్లో 7500  కోట్లు, రియల్ ఎస్టేట్లో  పెట్టు బడులు పెట్టినట్లు  బట్ట బయలైంది. గుజరాత్ స్టాక్ మార్కెట్ నుంచి దైనిక్ భాస్కర్ అనే హిందీ పత్రిక తెప్పిచుకున్న రిపోర్టును బట్టబయలు చేయడంతో  కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.  90 శాతం మంది  అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ బంధువులు,స్నేహితుల పేర్లతో తీసుకున్న డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్లలో భారీగా పెట్టుబడులు పెట్టిన‌ట్లు దైనిక్ భాస్కర్  ప‌త్రిక తేల్చింది. అందులో IAS, IPS లు స్టాక్ మార్కెట్‌లో 7500 కోట్లు, రియల్ ఎస్టేట్‌లో 15 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన‌ట్లు తేలింది. గుజరాత్ ఎమ్మెల్యేలు,మంత్రుల ఆస్తులు లెక్కలేనంతగా పెరిగాయి. అధికారులు,  మంత్రులు ఇంత పెద్ద మొత్తంలో సంప‌ద కూడ‌బెట్ట‌డానికి అవినీతే కార‌ణ‌మ‌ని తేల్చారు.  రిటైర్డ్ ఉన్న‌తాధికారులు, ఆర్దిక నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా అవినీతి పరుల‌పై చ‌ర్య‌లు తీసుకోవడం లేదని దైనిక్ భాస్కర్  పేర్కొంది.   

కర్ణాటక బిజెపీకి బిగ్ షాక్

మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్ సోమవారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరడం బిజేపీకి పెద్ద లోటు. బిజేపీ టికెట్ లభించని కారణంగా జగదీశ్ షట్టర్ బిజేపీ నుంచి  వైదొలగినట్టు తెలుస్తోంది. ఆదివారం నాడు బిజెపీ  శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరుసటి రోజే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగదీశ్ షట్టర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సమయంలో అఖిల భారత కాంగ్రెస్  నేత మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో చేరారు. బిజేపీ బలోపేతానికి తన శక్తి వంచన మేర పాటుపడ్డానని జగదీష్ షట్టర్ అన్నారు. పార్టీలో తీవ్ర అవమానం జరగడంతో వైదొలగునట్టు చెప్పారు. హుబ్లీ ధార్ వాడ నియోజకవర్గం నుంచి 20 నుంచి 25 వోట్ల నియోజకవర్గం నుంచి గెలుపొందాను. అక్కడ ఆరుసార్లు విజయం సాధించాను. ఇపుడు ఏడోసారి.  కర్ణాట కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుజేవాలా ఒక ట్వీట్  చేశారు. ఒక కొత్త శకంకు నాంది అని వ్యాఖ్యానించారు. షట్టర్ ఒక ప్రత్యేక విమానంలో హుబ్లీ నుంచి బెంగుళూరు చేరుకుని కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగదీశ్ షట్లర్ ఇటీవలె కర్ణాటక   ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మయ్ , కేంద్ర మంత్రులు ప్రహలాద్ జోషి, ధర్మేంద్ర ప్రదాన్లతో చర్చలు జరిపారు. కానీ వారితో చర్చలు విఫలం కావడంతో జగదీశ్ షట్టర్ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  మే 10వ తేదీన ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో జగదీశ్ షట్టర్ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జగదీశ్ షట్టర్ తన పదవికి రాజీనామా  చేసినట్లు తెలుస్తోంది. తనకు బిజేపీ టికెట్ రాకపోవడం పెద్ద అవమానమన్నారు. బాధాతప్త మనసుతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని , పార్టీ టికెట్ ఇవ్వక బిజేపీ తనను అవమానపర్చిదని జగదీశ్ షట్టర్ పేర్కొన్నారు. తన మీద పెద్ద కుట్ర జరిగిందని, బిజేపీని కర్ణాటకలో నిర్మించింది తానేనని ఆయన గుర్తు ఆవేదన చెందారు. నన్ను అవమాన పరిచినందుకు ఊరుకునేది లేదని కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి సమాధానమిస్తానని జగదీశ్ షట్టర్ అన్నారు. బిజేపీ నుంచి వైదొలగడం తన కెంత మాత్రం ఇష్టం లేదని తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగుతున్నట్లు చెప్పారు.  కర్ణాటక బిజేపీలో రెబల్స్ ఎక్కువయ్యారు.  ఆ పార్టీ ఎమ్మెల్సీ మంజునాథ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను పోటీ చేయనున్న నియోజకవర్గం నుంచి  మంత్రి తనయుడు పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మంత్రి నేరుగా తన కుమారుడికి   టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో మంజునాథ వైదొలగాడు. 

నాడు సెంటి మెంట్.. నేడు యాంటీ సెంటిమెంట్!

అధికారం అందుకోవాలంటే.. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలి... అలా అయితేనే.. అందలం ఎక్కగలమని   వైసీపీ అధినేత జగన్ విపక్ష నేతగా  గత ఎన్నికల వేళ భావించారు. అందుకోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్నే కాదు.. తనకు తాను సృష్టించుకున్న అవకాశాలనూ యథేచ్ఛగా వాడుకున్నారు. అందులో భాగంగానే ఆయన సెంటిమెంట్‌ను.. అయింట్‌మెంట్‌లా ఉపయోగించుకున్నారు.  ఆ క్రమంలోనే  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై జరిగిన కోడికత్తి దాడిని...  అలాగే తన సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తదితర అంశాలను   జగన్ గత ఎన్నికల ప్రచార వేళ.. చాలా చాలా పద్దతిగా వాడుకొని... అధికారాన్ని దక్కించుకోవాలన్న తన లక్ష్యానికి చేరుకొన్నారు. ఈ విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయనకు అప్పుడు అక్కరకు వచ్చిన సెంటిమెంట్ ఇప్పుడు యాంటీ సెంటిమెంట్ గా మారుతోందంటున్నారు పరిశీలకులు.  2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో నాటి ప్రతిపక్ష నేత  జగన్‌పై కోడికత్తి దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు.. ప్రజలను   నిర్ఘాంత పరిచాయి. వైయస్ జగన్‌పై కోడికత్తి దాడిలో ఎటువంటి కుట్ర కోణం లేదని దర్యాప్తులో తేలిందని కోర్టుకు ఎన్‌ఐఏ తెలిపింది. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక  జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన జనిపల్లి శ్రీనివాసరావు..  తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని కూడా ఎన్ఐఏ తేల్చేసింది.  అలాగే  2019, జనవరి 17న ఎన్ఐఏకి నిందితుడు శ్రీనివాసరావు.. ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో సైతం సంచలన నిజాలు వెలుగు చూశాయి. కోడికత్తితో పోడిస్తే..   జగన్‌కు ప్రజల్లో సానుభూతి వస్తుందని...  దీంతో ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తారని ఎన్ఐఏ ముందు శ్రీను చెప్పారు. అలాగే ఈ కోడి కత్తి దాడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ దాడి జరిగిన వెంటనే   జగన్ హైదరాబాద్‌కు విమానంలో వెళ్లడం...  అనంతరం స్థానిక సిటీ న్యూరో సెంటర్‌లో చేరడం.. ఆయనకు రెండు రోజులు విశ్రాంతి అవసరమని ఆ ఆసుపత్రి వైద్యుడు చెప్పడం చకచకా జరిగిపోయాయి.   ఇంకోవైపు వైయస్ జగన్‌పై దాడి చేసిన వెంటనే శ్రీను వద్ద నుంచి 11 పేజీల ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం.. అందులో పేర్కొన్న అంశాలు.. రేషన్ షాపులకు వెళ్లి రేషన్ తీసుకోనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ నేపథ్యంలో వారి... ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ అందించాలంటూ సదరు లేఖలో శ్రీను పేర్కొనడం..   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవే అంశాలు అమలు కావడం ఒక ఎత్తు అయితే..  కోడికత్తి దాడిలో  జగన్‌కి వైద్యం అందించిన వైద్యుడు..  ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటంపై పలు కథనాలు   వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్‌లో .. పలు సందేహాలకు తెరలేచిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. మరో వైపు గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అంటే 2019, మార్చి 15న వైయస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఈ హత్య చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందంటూ..  నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో తన చిన్నాన్నను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశారు? వారు ఏం ప్రయోజనం ఆశించి ఈ దారుణానికి ఒడిగట్టారు? ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. నిజానిజాలు బయటకురావంటూ మీడియా ముందుకు వచ్చి   జగన్ డిమాండ్   చేశారు.     అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. వివేకా హత్య కేసు మాత్రం ముందుకు కదల్లేదు. విపక్ష నేతగా ఉండగా సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేసిన జగన్ సీఎం అయ్యాకా.. అబ్బే సీబీఐ దర్యాప్తు ఎందుకు అంటూ మాటమార్చారు. దీంతో  హతుడువివేకా కుమార్తె  డాక్టర్ సునీత.. ఒంటరిగా న్యాయపోరాటానికి దిగి..   తన తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ  పోరాడుతున్నారు. ఆమె పోరాటం ఫలితంగా కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారింది. ఒక తార్కిక ముగింపు దిశగాసాగుతోంది. అదలా ఉంటే..   అటు కోడి కత్తి దాడి కానీ.. ఇటు సొంత బాబాయి వివేకా హత్యను కానీ...  జగన్ అండ్ కోకు అనుకూలంగా సెంటిమెంట్‌ని  పండించి అధికారం కట్టబెట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. నాడు అదికారానికి దోహదపడేలా సెంటిమెంట్ ను పండించిన ఘటనలే ఇప్పుడు రివర్స్ లో జగన్ కు వ్యతిరేకంగా యాంటీ సెంటిమెంట్ గా మారుతున్నాయి.  

విశాఖ ఉక్కు సెంటిమెంట్ తో జేడీ రాజకీయ పబ్బం!

విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వ్యవహారంలో సీబీఐ మాజీ జేడీ తన రాజకీయ ప్రయోజనాలను వెతుక్కుంటున్నారా?  విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడానికి ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న  బృహత్ ఉద్యమాన్నినీరుగార్చైనా సరే తాను రాజకీయంగా లబ్దిపొందాలని భావిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కావడాన్ని వ్యతిరేకించాల్సిన నేతలు.. తామే  పెట్టుబడులు పెడతామంటూ ముందుకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  జనంలో పలుకుడి, పాపులారిటీ కోసం.. విశాఖ ఉక్కు రక్షకులుగా ముద్ర కోసం.. అసలు లక్ష్యాన్ని వదిలేసి.. అసలు లక్ష్మానికే ఎసరు పెట్టేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు విషయంలో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం విమర్శలకు గురి అవుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పరిశ్రమకు నిధులు వచ్చేలా చేయాల్సిన నాయకులు.. అందుకు భిన్నంగా బిడ్ వేస్తాం, పెట్టుబడులు పెడతాం అంటూ కేంద్రం నెత్తిన పాలు పోస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రజల తరఫున అంటూ దాఖలు చేసిన బిడ్ పై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటూ ఆయన వెన్స్ ప్రా ఇంపెక్స్ కంపెనీ  ద్వారా దాఖలు చేసిన బిడ్ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పేరు మీదే బిడ్ దాఖలు చేస్తానని ప్రకటించిన లక్ష్మీనారయణ ఇప్పుడు కంపెనీ పేరుపై బిడ్ దాఖలు చేయడమేమిటని నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల ప్రమేయం లేకుండా దాఖలైన  ఈ బిడ్ ద్వారా ఆయన ఆశిస్తున్నదేమిటి? నిన్న మొన్నటి వరకూ  వావిలాల గోపాలకృష్ణయ్య  పైసా ఉద్యమం స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ. 100 ఇస్తే నెలలో రూ. 850 కోట్లు జమౌతాయని, అలా ఓ నాలుగు నెలలు జమ చేస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చిని చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హఠాత్తుగా మాట  మార్చి కొత్త కంపెనీని తెరపైకి తీసుకురావడం వెనుక ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రజల నుంచి సేకరించే కోట్లాది రూపాయల సొమ్మును ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటూ తాను ఏ కంపెనీ  పేరుతో బిడ్ దాఖలు చేశారో ఆ కంపెనీలో జమ చేస్తారా?  వచ్చే ఎన్నికలలో తాను విశాఖ నుంచి పోటీ చేస్తాననీ, ఒక వేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వక పోతే ఇండిపెడెంటుగానైనా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జేడీ.. విశాఖ ఉక్కును  ఎన్నికలలో తన  విజయానికి సోపానంగా ఉపయోగించుకోవడానికే ఫక్తు రాజకీయ వేత్తలా మాటలతో మాయ చేసి జనం చెవులలో పువ్వులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ గా పని చేసిన కాలంలో జనంలో తన పట్ల ఏర్పడిన నమ్మకాన్నే వారిని వంచించడానికి పెట్టుబడిగా వాడుకుని జనాన్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.  తెలంగాణలో అధికారంలోఉన్నకేసీఆర్ సర్కార్   ‘బిడ్‌’లో పాల్గొంటున్నట్టు ప్రకటించగానే  దాన్ని జేడీ స్వాగతించిన  లక్ష్మీనారాయణ  స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు దోహదపడే విధంగానే వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం అంటున్నారు.   విశాఖ ఉక్కు సెంటిమెంట్ ను ఆలంబనగా చేసుకుని తన రాజకీయ బవిష్యత్ కు బాటలు వేసుకునేందుకు జేడీ చేస్తున్న ప్రయత్నంగా విశాఖ వాసులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.  

యూపీలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందా?

ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల పరిరక్షణ పేరిట యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రాతియుగంలోకి రాష్ట్రాన్ని తీసుకు వెళుతోందా? ప్రభుత్వం మాఫియా, గూండాయిజం, రౌడీయిజం అణచివేత పేరిట సర్కార్ హింసకు తెరలేపిందా? అంటే రాజకీయ ప్రత్యర్థులు, పరిశీలకులు, చివరకు సామాన్య జనం సైతం ఔననే అంటున్నారు.  ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ 178 మంది క్రిమినల్స్ ఎన్ కౌంటర్లో హతమయ్యారు. అంటే దాదాపుగా ప్రతి 13 రోజులకూ ఒక ఎన్ కౌంటర్ జరిగిందన్న మాట. 2022 ఎన్నికలలో యోగి సర్కార్ మరో సారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆ ప్రభుత్వం మాఫియాపై ఉక్కుపాదం మోపడమూ ఒక కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే రాజ్యహింస భయంతోనే యోగి సర్కార్ అధికారాన్ని నిలబెట్టుకుందన్న రాజకీయ విమర్శలూ ఉన్నాయి. నేరస్థుడిని చట్టం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి. ఇది రాజ్యాంగం చెబుతున్న మాట. అయితే యూపీలోని యోగి సర్కార్ మాత్రం తానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదన్నది విపక్షాల విమర్శ. ఇప్పుడు ఒక్క సారి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోడీ సర్కార్ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తుందనీ, అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ముడుపులు, అవినీతి వంటి వాటిని ప్రోత్సహించడానికి కూడా వెనుకాడదనీ కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు మళ్లీ యూపీలో గ్యాంగ్ స్టర్ ల ఏరివేత పేర రాజకీయ లబ్ధి కోసం యోగి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. కేంద్రంలోని మోడీ సర్కార్ తీరు దాదాపు ఒకేటే అనేలా  జరుగుతున్న పరిణామాలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మళ్లీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాల వద్దకు వస్తే.. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో మోడీకి అస్మదీయుులగా పేరుపడ్డ వారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే తనకు మూడు వందల కోట్లు ముడుపులు అందుతాయని ఆఫర్ వచ్చిందన్నారు. అలాగే పుల్వామా ఘటన విషయంలో మోడీ సర్కార్ ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందో.. తీరా ఆ ఘటన జరిగిన తరువాత దానిని తన రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకుందో సవివరంగా చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఆర్డీఎక్స్ తో వచ్చిన ట్రక్కు దాదాపు పక్షం రోజులు జమ్మూ కాశ్మీర్ రోడ్ల మీద యథేచ్ఛగా తిరిగినా గుర్తించలేని ఘోర నిఘా వెఫల్యాన్ని ఎండగట్టారు. అలాగే ఘటన జరిగిన తరువాత తనను నోరెత్తదంటూ స్వయంగా మోడీ ఫోన్ చేశారనీ, ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు కూడా అదే విధంగా ఫోన్ చేశారనీ వెల్లడించారు.  ఏ మాత్రం భద్రత లేని విధంగా సీఆర్పీఎఫ్ దళాలను రోడ్డు మార్గంలో పంపడం సరైనది కాదనీ, వారిని ఎయిర్ లిఫ్ట్  చేయాలన్న తన సూచనను మోడీ సర్కార్ పట్టించుకోలేదనీ సత్యపాల్ మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.  ఇప్పుడు మళ్లీ యూపీ విషయానికి వస్తే..  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్‌ హత్య ఘటన తర్వాత హంతకులను ఉద్దేశించి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అంతమొందిస్తామని  అసెంబ్లీ వేదికగా గట్టి హెచ్చరిక చేశారు. న్యాయవాది  బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి, ఉమేష్ పాల్ ను ప్రయాగ రాజ్ లో హత్య చేసిన హంతకులను మట్టిలో కలిపేస్తా ( మిట్టీ మే మిలాదేంగా) అని  హెచ్చరించారు.  ఆయన అన్నట్లుగానే  లోక్ సభ మాజీ ఎంపీ,   గ్యాంగ్ స్టర్ అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ ను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ లో హత మార్చారు. ఈ సంఘటన ఒక్క యూపీలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అది ఇంకా జనం మదిలో తాజాగా ఉండగానే.. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులైన మరో ఇద్దరు.. అసద్‌ తండ్రి అతీక్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ లు దారుణ హత్య కు గురయ్యారు.   ఉమేశ్ పాల్‌ హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్‌ చెకప్‌ కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి పోలీసులు జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సందర్భంగా పోలీసు వలయంలో ఉన్న అతీక్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు దూసుకు వచ్చి పాయింట్ బ్లాంక్ లో తుపాకితో కాల్పులు జరిపి హత మార్చారు. ఈ ఘటనపై యోగి సర్కార్ ఒక విచారణ కమిటీ వేసింది. అది వేరే సంగతి. కానీ ప్రయాగ్ రాజ్ లో ఈ సంఘటన జరిగిన తరవాత అంతటా యోగి చెప్పింది చేశారన్న మాటే వినిపిస్తోంది.  

అవినాష్ కు సీబీఐ నోటీసు.. జగన్ పర్యటన రద్దుకూ లింకేమిటో?

గదిలో ఉన్న స్విచ్చి నొక్కితే వరండాలో లైటు వెలుగుతుంది. అలాగే సీబీఐ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తే చాలు ఏపీ సీఎం జగన్ తన పర్యటనలను, కార్యక్రమాలను రద్దు చేసేసుకుంటారు. గతంలో రెండు సార్లు ఇలాగే జరిగింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా అదే జరిగింది. గతంలో ఆయన తన పర్యటనలను రద్దు చేసుకున్న రెండు సార్లూ సిరికిం జెప్పడు.. అన్నట్లుగా హఠాత్తుగా హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ సీబీఐ దర్యాప్తులో వేగం మందగించిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు సీబీఐ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఆదివారం (ఏప్రిల్ 16) అరెస్టు చేసింది. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీబీఐ పది రోజుల కస్టడీకి పిటిషన్ దాఖలు చేసింది. అలాగే సోమవారం (ఏప్రిల్ 17) విచారణకు హాజరు కవాల్సిందిగా అవినాష్ రెడ్డికి నోటీసు పంపింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జగన్ సోమవారం (ఏప్రిల్ 17)న అనంతపురం జిల్లాలోని శింగనమలలో వసతి దీవెన పథకం కింద బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేయాలి. అయితే  ఆ పర్యటన రద్దైంది. కారణాలేమిటన్నదానిపై స్పష్టత లేదు. అనివార్య కారణాల వల్ల జగన్ సింగనమల పర్యటన రద్దైందనీ, ఈ నెల 26న ఆయన విద్యాదీవెన పథకానికి బటన్ నొక్కుతారని సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో రెండు సార్లు చేసిన విధంగానే ఈ సారి కూడా ఆయన సోమవారం హుటాహుటిన హస్తిన బయలుదేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ ఆయన హస్తిన వెళ్లి కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపినా.. గతంలోలా ఈ సారి వర్కౌట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. సుప్రీం కోర్టుకు సీబీఐ చెప్పిన మేరకు వివేకా హత్య కేసు దర్యాప్తు ఈ నెల 30లోగా పూర్తి చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది కనుక సీబీఐ దర్యాప్తు నెమ్మదించే అవకాశాలు అంతంతమాత్రమేనని అంటున్నారు. మరి ఇంతకీ జగన్ శింగనమల పర్యటన రద్దు కావడానికి కారణమైన ఆ అనివార్య కారణాలేమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.  

మరో సారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసు.. ఇక అరెస్టే?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముగింపు దశకు వచ్చేసినట్లేనా అంటే ఔననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. క్షణం ఆలస్యం చేయకుండా అవినాష్ రెడ్డికి మరో సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది. ఆ నోటీసులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా సోమవారం (ఏప్రిల్ 17) నాడే విచారణకు రావాలని పేర్కొంటూ ఆదివారం (ఏప్రిల్ 16) ఆయనకు నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా ముహుర్తం ఖరారైనట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు ఆదివారం పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అవినాష్ లేరు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాత్రమే ఉన్నారు. దీంతో  ఆయన ఒక్కరినే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఒక వేళ అవినాష్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లో ఉండి ఉంటే ఆయనను కూడా అరెస్టు చేసి ఉండేవారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని అవినాష్ నివాసానికి కూడా సీబీఐ అధికారులు ఆదివారం వెళ్లారు. అయితే ఆయన అప్పటికే తన తండ్రి అరెస్టు వార్త తెలుసుకుని పులివెందులకు బయలు దేరడంతో హైదరాబాద్ నివాసంలో కూడా సీబీఐ అధికారులకు ఆయన దొరకలేదని అంటున్నారు.దీంతో ఆదివారం సాయంత్రం (ఏప్రిల్ 16)  సాయంత్రం అనివాష్ రెడ్డికి సీబీఐ సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది.  అసలు ఇప్పటికే నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అరెస్టు చేయనున్నట్లు కూడా కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి ఆ తరువాత కారణాలేమైతేనేం దానిని ఉపసంహరించుకున్నారు.అంతకు ముందే సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో సోమవారం విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెలాఖరులోపు .. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలియజేసిన సంగతి విదితమే. అందుకే వేగం పెంచి అరెస్టుల పర్వానికి తెరలేపింది. ఇప్పటికే ఈ కేసులో వరుస అరెస్టులు చేసింది. అవినాష్ సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ తరువాతి టార్గెట్ అవినాష్ రెడ్డే అంటున్నారు.  తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డిలో కూడా ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన పులివెందులలోని సీఎం కార్యాలయం వద్ద ఆదివారం (ఏప్రిల్ 16) విలేకరులతో మాట్లాడుతూ మళ్లీ పాతకథనే వినిపించారు. సీబీఐ దర్యాప్తు సవ్యదిశలో సాగడం లేదని ఆరోపణలు గుప్పించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను సీబీఐ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు కురిపించారు. దీనిపై న్యాయనిపుణులు నిందితుల ఆరోపణలు, అభ్యంతరాలను దర్యాప్తు సంస్థలు పట్టించుకోవలసిన అవసరం లేదని చెబుతున్నారు.  

హౌ టూ డిఫీట్ మోడీ? కేసీఆర్ స్కెచ్ రెడీ!

 నిజానికి ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారమే అంతిమ లక్ష్యం. అలాగే ఏ రాజకీయ నాయకుడికి అయినా పదవే పరమావధి.  సో 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు అన్ని పార్టీలూ  ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్  పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కూడా.  2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్  మెజారిటీ సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యకం చశారు. అలాగే  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని దేశం అంతటా అమలు చేస్తామని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా వాగ్దానం చేశారు. అవును  అంబేడ్కర్ జయంతి నాడు అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ వేదిక నుంచి కేసీఆర్ దేశ ప్రజలకు ఈ వాగ్దానం చేశారు.  నిజానికి 2024 ఎన్నికల్లో ఏదో విధంగా బీజేపీ మోడీలను ఓడించి ప్రధాని పదవిని అలంకరించాలని ఒక్క కేసీఆర్  మాత్రమే కాదు, రాహుల్ గాంధీ మొదలు చాలా మంది మహా నాయకులు ఆశ పడుతున్నారు. రేసులో పరుగులు తీస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కేసేఆర్  దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయానికి కొద్ది గంటలు అటూ ఇటుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో  2024 ఎన్నికల్లో బీజేపీ, మోదీలని ఓడించడం ఎలా? అనే విషయంపై మంతనాలు సాగిస్తున్నారు. అంతకు ముందు ఇదే విషయంపై నితీష్ కుమార్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత  తేజస్వి యాదవ్ తోకలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపారు. అలాగే ఇటీవల జాతీయ హోదా కోల్పోయిన సిపిఐ జాతీయ నేత డి.రాజా, సిపిఎం నేత సీతారాం ఏచూరితోనూ.. హౌ టూ డిఫీట్’ బీజేపీ అండ్ మోడీ’ అనే విషయంపై ‘శాస్త్రీయ’ చర్చలు సాగించారు. నిజానికి, వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించి, అ కుర్చీలో తాము కూర్చోవాలని ఆశపడని విపక్ష నేత బహుశా ఎవరూ ఉండరేమో.. అయితే, అది అయ్యే పనేనా? అన్నదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసమే ప్రాంతీయ పార్టీల జాతీయ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. మల్లగుల్లాలు పడుతున్నారు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా అటూ ఇటూ పరుగులు తీస్తునారు.  అయితే  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చింది మొదలు, జాతీయ రాజకీయాలపై దృష్టి నిలిపిన కేసీఆర్  ఇతరుల కంటే ఒకడుగు ముందుకేసి, ఏకంగా హామీలు కురిపించే వరకు వెళ్లారు. నిజానికి, నిన్నమొన్న ఢిల్లీలో కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు అందరినీ కలిసిన నితీష్ కుమార్ కు ఇతర పార్టీల నుంచి కొంత సానుకూల స్పందన వచ్చింది. ప్రతి నియోజక వర్గంలో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని నిలిపాలనే ఆయన ప్రతిపాదనను దాదాపు అన్ని పార్టీలూ కనీసం సూత్ర ప్రాయంగా అయినా అంగీకరించాయి. కానీ, గతంలో కేసీఆర్ ఇలాగే అనేక పార్టీల నాయకులను కలిసినా  నితీష్ సహా ఏ  ఒక్కరు కుడా సానుకూలంగా స్పందించలేదు. అయినా కేసీఆర్ ప్రగతి భవన్ గడప దాటకుండానే, ఢిల్లీ పీఠానికి నిచ్చెనలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్‌దే అంటున్నారు. మహారాష్ట్రలో ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేసిన కింది స్థాయి నేతల్ని చేర్చుకుంటూ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే కలలు కంటున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్ చెప్పేదానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదని, బీఆర్ఎస్ నాయకులే పెదవి విరుస్తున్నారు. 

వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి అరెస్టు.. అవినాష్ రెడ్డి కూడా?

వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు  వేగం పెంచారు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఆదివారం (ఏప్రిల్ 16)  పులివెందులలో అరెస్టు చేశారు.  అంతకు ముందు తెల్లవారు జామునే రెండు వాహనాలలో పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు అక్కడ భాస్కరరెడ్డిని విచారించారు. అనంతరం ఆయనను అదుపులోనికి తీసుకుని హైవదరాబాద్ తరలించారు. ఈ కేసులో రెండు రోజుల కిందట అరెస్టైన అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా భాస్కరరెడ్డిని విచారించిన పోలీసులు భాస్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. భాస్కరరెడ్డి అరెస్టు విషయం  తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భాస్కరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు మైదరాబాద్ తరలించారు. వివేకా హత్య కేసులో వరుస అరెస్టులతో సీబీఐ దూకుడు పెంచింది. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు భాస్కరరెడ్డి తరువాతి వంతు వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు సరైనవేనని అనిపించే విధంగానే పరిణామాలు సంభవిస్తున్నాయి. పులివెందులలో భాస్కరరెడ్డి అరెస్టు కాగానే.. హైదరాబాద్ లోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు విచారించిన సీబీఐ, ఇప్పుడు మరోసారి ఆయన నివాసానికి వెళ్లడంతో ఇహనో, ఇప్పుడో ఆయన అరెస్టు కూడా అనివార్యమన్న భావన వ్యక్తమౌతోంది. కాగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని గతంలోనే సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం చూస్తుంటే ఆయనను కూడా అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించడం, అలాగే వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని సీబీఐ పేర్కొనడం.. అందుకు తగ్గట్టుగానే ఆదివారం (ఏప్రిల్ 16) ఉదయమే భాస్కరరెడ్డిని పులివెందులలో అదుపులోనికి తీసుకోవడం, అలాగే హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం చూస్తుంటే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వరుస అరెస్టుల నేపథ్యంలో వివేకా హత్య కేసు కొలిక్కి వస్తున్నట్లే అనిపిస్తోంది. గజ్జట ఉదయ్ కుమార్ ను అరెస్టు చేసిన  సీబీఐ అతడి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగిన నిముషాల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకున్నారనీ, సాక్ష్యాలను మాయం చేసి గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనీ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడమే కాకుండా అందుకు సంబంధించి గూగుల్ లుకౌట్ ఆధారాలు కూడా సమర్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు తార్కిర ముగింపునకు వస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బండి సంజయ్

బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను  అధిష్టానం  అక్కున చేర్చుకుంటుంది. శనివారం రాజాసింగ్ జన్మదినోత్సవం. అయితే తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. మహమ్మద్ ప్రవక్త మీద వివాదా స్పద వీడియో విడుదల చేసిన రాజాసింగ్ పై పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ప్రవక్త మీద వివాదా స్పద ప్రకటన చేసిన  నుపుర్ శర్మతో పాటు రాజాసింగ్ పై సీరియస్ అయ్యింది.   హైదరాబాద్ నుంచి ఎన్నికైన  ఏకైక  బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనమైంది. బిజేపీ శ్రేణులు నొచ్చుకున్నాయి.  రాజాసింగ్ బహిరంగ ప్రదేశాల్లో ప్రసంగించకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కేసులో రాజాసింగ్ కు కోర్టు  రిమాండ్ విధించింది. పార్టీ అధిష్టానానికి కూడా రాజా సింగ్ దూరంగా ఉన్నారు. పార్టీ అగ్రనేతలు రాజాసింగ్ ను కలవకుండా దూరం పాటించారు. శనివారం బర్త్ డే విషెస్ ను సోషల్ మీడియా ద్వారా బండి సంజయ్ వ్యక్తం చేయడంతో సస్పెన్షన్  ఉపసంహరణ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచనాప్రాయంగా పేర్కొన్నాయి. రాజాసింగ్ సేవలు వినియోగించుకోవడానికే   బండి సంజయ్ బర్త్ డే విషెస్ చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం అనుమతితో బండి సంజయ్ రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పినట్లు అర్థమౌతుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

పొంగులేటి.. జూపల్లి సస్పెన్స్ థ్రిల్లర్!

సినిమాల్లోనే కాదు,  రాజకీయాల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి. అందుకు తెలంగాణలో ఉత్కంఠ భరితంగా నడుస్తున్న ‘పొంగులేటి..జూపల్లి’ పొలిటికల్ డ్రామాను ఉదాహరణగా చెప్పవచ్చు అంటున్నారు.  పొంగులేటి  ఏ పార్టీలో చేరతారు? జూపల్లి దారెటు? అనే చర్చ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తోంది. అయితే ఇంతరకూ  ఈ ఇద్దరు నాయకులూ కూడా తమ మనసులోని మాటను బయట పెట్టలేదు. కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న  పొంగులేటి, జూపల్లి  తాజా సమాచారం మేరకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితిలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదనీ, అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనీ,  అది తమకు ఇష్టం లేదని ఆ ఇద్దరు నేతలు తమ ముఖ్య అనుచరుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అలాగే మరి కొందరు ముఖ్యనాయకులు, బీఆర్ఎస్ తో ప్రీ పోల్ కాకున్నా పోస్ట్ పోల్ అలయన్స్ తప్పదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలాగే  జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏదో ఒక స్థాయిలో పొత్తు తప్పదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల నుంచే వినిపిస్తోంది.  అలాగే  బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఒక్క పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయన వర్గానికి చెందిన కొద్ది మంది నాయకులు మినహా మిగిలిన కాంగ్రెస్ సీనియర్లతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది. అంతే కాకుండా, స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అవసరమని లేదంటే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన 20 – 30 మంది ఎమ్మెల్యేలు ముందులానే కారెక్కి చెక్కేస్తారని అన్నట్లు కూడా ప్రచారం జరిగుతోంది. ఈ నేపథ్యంలో పవర్ లోకి వచ్చినా రాకున్నా కేసీఆర్ కుటుంబ పాలనను, బీఆర్ఎస్ అరాచక పాలనను ఒక్క బీజేపీ మాత్రమే ఎదుర్కొనగలదని  పొంగులేటి, జూపల్లి భావిస్తునట్లు తెలుస్తోంది. మరో వంక బీజేపీ నాయకులు ఈ మేరకు ఆ ఇద్దరు నాయకులకు హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు. అంతే కాదు బీజేపీకి పూర్తి మెజారిటీ రాకున్నా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్త్రలో అధికారం దక్కించుకున్న పద్దతిలో. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ను గద్దె దించి అధికారం దక్కించుకునేందుకు మోదీ షా జోడీ వెనకాడరనే నమ్మకం కుదిరిందని అందుకే పొంగులేటి, జూపల్లి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అదే విధంగా వారి సొంత  వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా కూడా వారికీ బీజేపీనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయస్ అవుతుందని అంటున్నారు. అయితే తమ క్యాడర్ ను ఒప్పించడమే కొంచే కష్టంగా ఉందని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వామపక్ష భావజాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో బీజేపీలో చేరితే క్యాడర్ ఎదురుతిరిగే ప్రమాదం ఉందని పొంగులేటి ముందు వెనుకలాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే లా అనేక వ్యూహాగానాలు వినిపిస్తున్నా, పొంగులేటి ఎటు పోతున్నారు? జూపల్లి దారెటు? అనే ప్రశ్నలకు ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. అయితే పొంగులేటి ఒక విషయం వరకూ క్లారిటీ ఇచ్చారు. ఆయన పుట్టింటికి వెళ్ళడం లేదు. వై ఎస్సార్టీపీలో చేరడం లేదు.  తాను వైఎస్సీర్టీపీలో చేరడం లేదని పొంగులేటి తేల్చి చెప్పారు. అంతే కాదు షర్మిల పార్టీలో మొహమాటానికి చేరి తన గొంతు తాను కోసుకోలేనని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరడం లేదని షర్మిలకు కోపం ఉండొచ్చని.. కానీ తాను ఏ లక్ష్యంతో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చానో అలాంటి లక్ష్యం ఉన్న పార్టీలో చేరతానని తెలిపారు.  ఇక ఇప్పడు కాంగ్రెస్ గూటికి వెళ్తారా లేక కమలం పార్టీలో చేరి పంతాన్ని నెగ్గించుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.అలాగే, జూపల్లి నోటి నుంచి నిర్ణయం వచ్చే వరకు జూపల్లి దారెటు అనేది కూడా సస్పెన్సే అంటున్నారు .