యు.పి.లో జీపును ఢీకొన్న రైలు: 13 మంది దుర్మరణం

  ఉత్తరప్రదేశ్‌లో పెళ్ళిబృందం ప్రయాణిస్తున్న ఒక జీపును లెవల్ క్రాసింగ్ దగ్గర రైలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పెళ్ళికి హాజరైన 16 మందితో తిరిగి వస్తున్న జీపు రాత్రివేళ కావడంతో యు.పి.లోని సిస్వా - గుగ్లీ మధ్య కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ దగ్గర ట్రాక్‌ని దాటే ప్రయత్నం చేయడంతో అకస్మాత్తుగా గోరఖ్ పూర్ - నర్కాతియా ప్యాసింజర్ రైలు దూసుకు వచ్చి ఈ ఘోర ప్రమాదం జరిగింది. జీపులో ప్రయాణిస్తున్న 16 మందిలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

మాజీ సీఎం నేదురుమల్లి కన్నుమూత.. పలువురి నివాళి

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు నేదురుమల్లి జనార్దనరెడ్డి (80) హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1935 ఫిబ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడలో నేదురుమల్లి జనార్దనరెడ్డి జన్మించారు. రాజకీయాలలోకి రాకముందు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 1998లో బాపట్ల, 1999లో నరసరావుపేట, 2004లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు నేదురుమల్లి ఎన్నికయ్యారు. 1988లో పీసీసీ అధ్యక్షుడిగా నేదురుమల్లి పనిచేశారు. 1990 నుంచి 92 వరకు జనార్దన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేదురుమల్లి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నక్సలైట్ల మీద నిషేధం విధించారు. ఆయనను చంపాలని నక్సలైట్లు రెండుసార్లు ప్రయత్నించారు. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మి గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లికి నలుగురు కుమారులున్నారు. నేదురుమల్లి మరణంతో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకాడలో విషాదఛాయలు అలముకున్నాయి. నేదురుమల్లి భౌతికకాయాన్ని నిమ్స్ నుంచి సోమాజిగూడలోని నివాసానికి తరలించారు. జనార్దనరెడ్డి మరణవార్త తెలియగానే కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు, సహచరులు పెద్ద సంఖ్యలో నేదురుమల్లి నివాసానికి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి పళ్ళంరాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్య, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, వైసీపీ నేత మైసూరారెడ్డి తదితరులు నేదురుమల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు పంపకాలు

  ఒకవైపు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలతో హడావుడి పడుతుంటే, గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం నిశబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. మే16న ఎన్నికల ఫలితాలు వెలువడగానే, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్దమయిపోతుంది గనుక, ఈలోగానే రెండు ప్రభుత్వాలకు అవసరమయిన కార్యాలయాల ఏర్పాట్లు చకచకా పూర్తి చేసేస్తున్నారు. జూన్ రెండున అధికారికంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరుగుతున్నపటికీ, ఎన్నికల ఫలితాలు వెలువడేలోగానే, ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల కొరకు ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా విభజించి అవసరమయిన మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.   తెలంగాణకు ఏ, బీ, సీ, డీ బ్లాకులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణకు హెచ్, కె, ఎల్ బ్లాకులు కేటాయించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్ బ్లాక్ ను కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంగా లేక్ వ్యూ అతిథి గృహాన్ని కేటాయించారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ని కూడా రెండు రాష్ట్రాలకు విభజించారు. రెండు రాష్ట్రాలకు డీఐజీ మరియు సీఐడీ కార్యాలయాలను కూడా కేటాయిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. ఈనెల 20లోగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు రాష్ట్రాలకు అన్నివిభాగాలలో పంపకాలు, భవనాల కేటాయింపులు పూర్తయిపోవాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు.     ఇక ఈ రోజు విద్యుత్ పంపకాలు కూడా పూర్తయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ విభాగాలకు విద్యుత్ పంపకాలు కూడా పూర్తయిపోయాయి. వీటిలో తూర్పు డిస్కంకు-15.80 శాతం, మధ్య (సెంట్రల్) డిస్కంకు-38.02 శాతం, ఉత్తర డిస్కంకు-17.87శాతం, దక్షిణ డిస్కంకు-30.31శాతం విద్యుత్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.   ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు ఐఏయస్, ఐపీయస్ మరియు ఐఎయఫ్ అధికారులను కేటాయిస్తూ సిఫార్సులు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 మంది ఐఏయస్, 144 మంది ఐపీయస్, 82మంది ఐఎయఫ్ అధికారులను, తెలంగాణా రాష్ట్రానికి 163మంది ఐఏయస్,112మంది ఐపీయస్, 65 మంది ఐఎయఫ్అధికారులను కేటాయించాలని కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 

పవన్ టీ ఇచ్చాడు.. చంద్రబాబు భోజనం పెట్టాడు

ఎన్నికల ముందు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కి సఖ్యత కుదిరిన సమయంలో చంద్రబాబు నాయుడు అందర్నీ ఆశ్చర్యపరిచే రీతిలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనం కోసమో, స్నేహం కోసమో ఒకరి ఇంటికి వెళ్ళడం అనేది ఎవరూ ఊహించని విషయం. ఎవరైనా చంద్రబాబు దగ్గరకే రావాలి తప్ప చంద్రబాబే ఒకరి దగ్గరకి వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్‌తోనే మొదలైంది. ఆనాడు జరిగిన ఈ సంఘటన గురించి చంద్రబాబు చెబుతూ, ‘పవన్ కళ్యాన్ తేనీటి విందుకు పిలిచారు.. వచ్చాను’ అని చెప్పారు. ఆ తర్వాత పవన్, బాబు ఇద్దరి స్నేహం బలపడటం, బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ వీరలెవల్లో ప్రచారం చేయడం జరిగాయి. ఇచ్చిపుచ్చకున్నదే అసలైన స్నేహం. అందుకే చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్‌ని తన ఇంటికి లంచ్‌కి పిలిచాడు. పవన్ కళ్యాణ్ కాదనకుండా చంద్రబాబు ఇంటికి వచ్చాడు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌‌తో కలసి పవన్ కళ్యాణ్‌కి సాదర స్వాగతం పలికారు. ముగ్గురూ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు కుటుంబం నవకాయ పిండివంటలతో షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన టీకి బదులుగా చంద్రబాబు మంచి భోజనం పెట్టాడు. చెల్లుకి చెల్లు మరి పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసిన దానికి బదులుగా చంద్రబాబు ఏమిస్తారో, ఏ పదవి ఇస్తారో చూడాలి.

వాట్స్ యాప్‌పై నిషేధం

  సెల్ ఫోన్లలో విస్తృతంగా వ్యాప్తిలో వున్న ‘వాట్స్ యాప్’ను ఇరాన్ నిషేధించింది. ఇరాన్‌లో ఈ యాప్ ఎవరూ వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ గతంలో ఫేస్ బుక్‌ని కూడా నిషేధించింది. ఫేస్‌బుక్‌ని, వాట్స్ యాప్‌ని నిషేధించడానికి ఇరాన్ అధికార వర్గాలు చెప్పిన కారణాలు వింటే ఎవరైనా ఆశ్చర్యంతో నోళ్ళు తెరుస్తారు. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ ఈమధ్యనే వాట్స్ యాప్‌ని కొలుగోలు చేశాడు. అందుకే దీనిని నిషేధించారు. గతంలో ఫేస్ బుక్‌ని నిషేధించడానికి కారణం దాని అధినేత మార్క్ జుకెర్ బర్గ్ కావడమే కారణం. జుకెర్ బర్గ్ కి, ఇరాన్‌కి శత్రుత్వం ఏమిటని ప్రశ్నిస్తే, ‘‘జుకెర్ బర్గ్ అమెరికాకి చెందిన వ్యక్తి. అంతేకాకుండా అతను యూదులకు మద్దతు ఇస్తూ వుంటాడు. అందువల్ల అతనికి సంబంధించినవి ఇరాన్‌లో వ్యాప్తిలో వుండటానికి వీల్లేదు’’ అని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. చాదస్తం అంటే ఇదే కదూ?!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మటాష్: వెంకయ్య నాయుడు

  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలుచుకోదని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయమని అన్నారు. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన సందర్భంగా గురువారం నాడు వెంకయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ప్రజలందరూ కాంగ్రెస్ పేరు చెబితేనే మండిపడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేశారని వెంకయ్య నాయుడు చెప్పారు. సీమాంధ్ర పోలింగ్‌లో కాంగ్రెస్‌కి ఓటు వేసినవాళ్ళుగానీ, కాంగ్రెస్ గురించి పట్టించుకున్నవాళ్ళు కానీ కనిపించలేదని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.

చంద్రబాబు ప్రాధాన్యతలు ఏమిటి?

  ఈ ఎన్నికలలో రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీ కనుక అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడితే ఆయన ప్రాధాన్యతలు ఏవిధంగా ఉండవచ్చునో ఒకసారి చూద్దాము.   1. మొట్ట మొదట కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలో స్థిరపడేందుకు అవసరమయిన మద్దతు కూడగట్టవచ్చును.   2. కొత్త రాజధాని గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగానే వీలయినంత త్వరగా ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయాలను యుద్దప్రాతిపదికన నిర్మించి ప్రభుత్వపాలన రాష్ట్రం నుండే చేసేందుకు అవసరమయిన చర్యలు తీసుకోవచ్చును. అవసరమయితే ముందుగా కొన్ని కార్యాలయాలను రాష్ట్రంలో లభ్యమయ్యే భవనాలలోకి మార్చినా మార్చవచ్చును.   3. గాడి తప్పిన పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టేందుకు అవసరమయిన అని చర్యలు యుద్దప్రాతిపాదికన చెప్పట్టవచ్చు.ఆర్ధిక లోటుని భర్తీ చేసుకొనేందుకు గాను కేంద్రం నుండి భారీ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తూనే, తనకున్నపరిచయాలతో సాఫ్ట్ వేర్ కంపెనీలను, పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి రప్పించవచ్చు. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలూ, నిర్మాణ రంగాలకు చెందిన పరిశ్రమలకు పెద్ద పీట వేయవచ్చును.   4. నష్టాల ఊబిలో కూరుకుపోయున్న ఆర్టీసీ, చేనేత వంటి అనేక సంస్థలను గాడిన పెట్టె ప్రయత్నం చేయవచ్చు.   5. ఇదివరకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వోద్యోగులను నిర్లక్ష్యం చేసినందున చాలా భారీ మూల్యం చెల్లించ వలసి వచ్చింది గనుక ఈసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ మూడు అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టడం తధ్యం.

తెదేపాకు కలిసి వచ్చిన అంశాలు ఏమిటి?

  ఆంద్ర, తెలంగాణాలలో ఎన్నికలు పూర్తయిపోయాయి. తెలంగాణాలో తెరాసకు కొంత ఆధిక్యత వచ్చి న్నప్పటికీ, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తునన్నారు. ఇక ఆంద్ర విషయానికి వస్తే తెలుగుదేశం, వైకాపాల మధ్య జరిగిన హోరాహోరీగా పోటీలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కారణం తెదేపా పటించిన అభివృద్ధి, సంక్షేమ మంత్రాలే. పట్టణాలలో ప్రజలను చంద్రబాబు చెప్పిన సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, సింగపూరు వంటి ఆధునిక రాజధాని నిర్మాణం వంటివి విపరీతంగా ఆకట్టుకోనగా, ఆయన ప్రకటించిన ఋణాల మాఫీ, సంక్షేమ పధకాలు, ఇతరత్రాలు గ్రామీణులను ఆకర్షించాయి.   ఇక చంద్రబాబుకి మరికొన్ని అంశాలు కూడా బాగా కలిసివచ్చాయి.   1. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో పూర్తిగా డ్డీలా పడిపోవడం. ఆ పార్టీ నుండి హేమాహేమీలు తెదేపాలోకి వచ్చి చేరడం.   2. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడి ఉండటం. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన కలిగి ఉండటం.   3. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిపాలనానుభవం లేకపోవడం. అతనిపై అనేక సీబీఐ, ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు కలిగి ఉండటం. చంద్రబాబు పరిపాలనానుభావం అనుభవం, దక్షత, కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండటం.   4. విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు. మోడీతో ఆయనకున్న సాన్నిహిత్యం. మోడీ, పవన్ కళ్యాణ్ ప్రచారం, ప్రజలపై వారి ప్రభావం.

అపాయింటెడ్ డే విషయంలో టీఆర్ఎస్‌ది అరణ్యరోదన

  రాష్ట్ర విభజన అపాయింటెడ్ డేని జూన్ 2 నుంచి మే 17వ తేదీకి మార్చాలని, తద్వారా టీఆర్ఎస్ పార్టీలో చీలిక వచ్చి, అధికారం నుంచి దూరమయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. హైదరాబాద్‌లో మొర పెట్టుకున్నా, ఢిల్లీలో మొరపెట్టుకున్నా సంబంధీకులందరూ డేట్ ముందుకు జరపడం మావల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి వచ్చే అపాయింటెడ్ డేను జూన్ 2 నుంచి ముందుకు జరపడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ఆలోపు విభజన పంపకాలు చేయడం కుదరదని వెల్లడించాయి. అపాయింటెడ్ డే నాటికి పంపకాలు ఒక కొలిక్కి వచ్చేలా లేవని, దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరగా ప్రభుత్వాల ఏర్పాటు, అపాయింటెడ్ డేను ముందుకు జరపడం సాధ్యం కాదని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జూన్ 2 వరకూ ఆపితే ఈ లోపు రాజ్యాంగ, రాజకీయ సమస్యలు ఎదురవుతాయని టీఆర్ఎస్ నాయకులు మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.

హిందూపూరంలో గెలుస్తా.. సినిమాలు తగ్గిస్తా: బాలకృష్ణ

      అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి బాలక‌ృష్ణ పోటీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బాలక‌ృష్ణ మీడియాతో మాట్లాడారు. హిందూపురంలో తన గెలుపు ఖాయమని నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాలయ్య తెలిపారు. ప్రజాసేవ కోసం సినిమాలను కొంత తగ్గించుకుంటానని, పూర్తిగా దూరంకాబోనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని బాలకృష్ణ తెలిపారు.

ఓటేశాక చనిపోయింది

      కాళ్ళూ చేతులు సరిగానే వున్న కుర్రకారుని ఓటేయడానికి రమ్మంటే ఇంట్రస్ట్ లేదని చెబుతారు. ఓటరుగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారు. అయితే బాధ్యత తెలిసిన వారు మాత్రం తమకు వయసు ఎంత మీద పడినా ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ ఎన్నికలలో శతాధిక వృద్ధులు అనేకమంది పోలింగ్ బూత్‌లకు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో అయితే వంద సంవత్సరాలు దాటిన వృద్ధురాలు ఆరోగ్యం బాగాలేకపోయినా, శరీరం సహకరించకపోయినా ఓటు వేయడానికి తపనపడింది. ఓటు వేసి వచ్చి ఉత్తమ పౌరురాలిగా తనను తాను నిరూపించుకుంది. పండంటి నిండు జీవితాన్ని చాలించింది. కృష్ణా జిల్లాలోని పి.నైనవరం గ్రామానికి చెందిన చిట్టి దుర్గమ్మ అనే శతాధిక వృద్ధురాలు ఓటు వేసి వచ్చిన కొద్ది సేపటికే కన్నుమూసింది.

ఇ.సి. నన్ను మాత్రమే టార్గెట్ చేసింది: లగడపాటి

      ఎన్నికల కమిషన్ తనను మాత్రమే టార్గెట్ చేసి నోటీసులు జారీ చేసిందని, తనలాంటి కామెంట్లు చేసిన ఇతరుల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని లగడపాటి రాజగోపాల్ వాపోతున్నారు. సీమాంధ్ర ఎన్నికల ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన లగడపాటి సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చే అవకాశం వుందని చెప్పారు.   ఆయన అవకాశం వుందని చెప్పారే తప్ప సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వంటి వివరాలేవీ వెల్లడించలేదు. అయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లగడపాటి మీద కేసు నమోదు చేసింది. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఇలాంటి తరహా వ్యాఖ్యానాలు చేసిన వైసీపీ నాయకుల మీద, టీఆర్ఎస్ నాయకుల మీద ఎన్నికల కమిషన్ కేసులు నమోదు చేయలేదని ఆయన అంటున్నారు. కేసులు నమోదు చేస్తే అందరిమీదా నమోదు చేయాలని లేకపోతే తనమీద నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ తనమీద కేసు నమోదు చేసినప్పటికీ లగడపాటి రాజీపడలేదు. సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందని స్పష్టంగా చెప్పారు. మరి ఎన్నికల కమిషన్ దీన్ని కూడా సీరియస్‌గా తీసుకుని ఆయన మీద మరో కేసు నమోదు చేస్తుందేమో చూడాలి.

సీమాంధ్రలో 120 నుంచి 140 సీట్లు ఖాయం: చంద్రబాబు

      సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెరిగిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పోలింగ్ పూర్తవగానే టీడీపీ విజయం ఖాయమని సగర్వంగా ప్రకటించిన ఆయన, గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో తమ పార్టీ 120 నుంచి 140 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. అలాగే 20నుంచి 22 పార్లమెంటు సీట్లు తెలుగుదేశం ఖాతాలో పడబోతున్నాయని చెప్పారు.   ఈ పోలింగ్‌లో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని, వైకాపా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. బీజేపీకి ఓటు వేశానని బయటకి చెప్పినందుకే తన ఓటు చెల్లదని చెప్పిన ఎన్నికల కమిషన్‌కి జగన్ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు వినిపించలేదా అని  ప్రశ్నించారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు.

సింగపూర్‌కు బాబు, డెహ్రాడున్‌కి జగన్ ల ఫ్యామిలీ

      ఎన్నికల సందర్భంగా వాళ్ళనీ వీళ్ళని తిట్టి, వాళ్ళచేత వీళ్ళచేత తిట్టించుకున్న రాజకీయ నాయకులు ఎన్నికలు ముగిశాక మైండ్ ఫ్రెష్ చేసుకోవడం కోసం విహార యాత్రలు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు ముగియగానే కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయారు. హరీష్‌రావు, కేటీఆర్, కవిత తమతమ కుటుంబ సభ్యులతో ఎవరికి నచ్చిన దేశానికి వాళ్ళు సైట్ సీయింగ్‌కి వెళ్ళిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో చాలామంది ఇప్పుడు పలు దేశాలకు విహార యాత్రలకు వెళ్ళిపోయారు. సీమాంధ్రలో ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో విదేశాలకు విహార యాత్రకు వెళ్ళబోతున్నారు. చంద్రబాబు నాయుడు సింగపూర్‌కి వెళ్ళే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.   సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానని చెబుతున్న చంద్రబాబు ఈ పర్యటన సందర్భంగా సింగపూర్‌‌లో ఏవైనా అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలుసుకుని వస్తారేమో చూడాలి. అలాగే వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటుంబ సభ్యులతో డెహ్రాడూన్ వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బోలెడన్ని కేసులున్న జగన్ సారు డెహ్రాడూన్ వెళ్ళడానికి కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. విహారయాత్రలకు వెళ్ళిన అందరూ కౌంటింగ్ నాటికి తిరిగి వచ్చే అవకాశం వుంది. అప్పటి వరకు ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా వుండొచ్చు.  

వారణాసిలో వేడివేడి నమో రోటీ

      మొన్నటి వరకూ నరేంద్రమోడీ స్పెషల్ చాయ్‌ అమ్మకాలు దేశవ్యప్తంగా జరిగాయి. ఆ తర్వాత నమో జ్యూస్ షాపులు దేశమంతటా వెలిశాయి. వీటికి ప్రజల నుంచి విశేష ఆదరణ అభిస్తోంది. ఇప్పుడు వారణాసిలో నమో రోటీ దుకాణాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి నుంచి పార్లమెంట్‌‌కి పోటీ చేస్తుండటంతో ఆయనకు అక్కడి ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఈ ఆదరణను క్యాష్ చేసుకోవాలని కొందరు దాభా యజమానులు భావించారు. అంతే వారణాసి ఏరియాలోని దాభాల్లో ‘నమో’ బ్రాండ్ రోటీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ రోటీలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా అభిస్తోందట. ఈ నమో రోటీల మీద ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్’ (ఈసారి ప్రభుత్వం నరేంద్రమోడీదే) అనే మాటను ముద్రించి విక్రయిస్తున్నారు. నమో రోటీల ఆవిర్భావంతో గతంలో కంటే రోటీల వ్యాపారం బాగా పెరిగిందని, రోటీలతోపాటు కర్రీల వ్యాపారం కూడా బాగా పుంజుకుందని వారణాసి ప్రాంతంలోని దాభాల యజమానులు మురిసిపోతూ చెబుతున్నారు. అయితే ఈ రోటీల అమ్మకాన్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు.

సీమాంధ్రలో పోలింగ్ శాతం.. గతంతో పోలిస్తే ఎక్కువే

        బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్‌లో దాదాపు 80 శాతం ఓట్ల పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ప్రకటించారు. బుధవారం ఎనిమిది గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటి వరకు 80 శాతం పోలింగ్ జరిగిందని, అప్పటికి కూడా పోలింగ్ జరుగుతూ వున్నందున కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. మొత్తమ్మీద 2009 సంవత్సరం ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలవారిగా 2009, 2014 సంవత్సరాలలో పోలింగ్ శాతం వివరాలు ఇలా వున్నాయి.   శ్రీకాకుళం - 76% (2014) - 75% (2009) విజయనగరం - 78% (2014) - 76% (2009) విశాఖపట్నం - 73% (2014) - 73% (2009) తూర్పు గోదావరి - 78% (2014) - 78% (2009) పశ్చిమ గోదావరి - 78%  (2014) - 84% (2009) కృష్ణ - 81% (2014) - 80% (2009) గుంటూరు - 84% (2014) - 79% (2009) ప్రకాశం - 80% (2014) - 77% (2009) నెల్లూరు - 73% (2014) - 71% (2009) కడప - 75 %(2014) - 75% (2009) కర్నూలు - 76% (2014) - 70% (2009) అనంతపురం - 80% (2014) - 73% (2009) చిత్తూరు -  80% (2014) - 77% (2009)

కొనసాగుతున్న జగన్ పార్టీ దౌర్జన్యకాండ

      సీమాంధ్రలో ఎన్నికలు ముగిసినా వైకాపా దౌర్జన్యకాండ కొనసాగుతూనే వుంది. ఈ ఎన్నికలలో ఓడిపోతానని భయం పట్టుకున్న జగన్ .. ఓటర్లను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి బూత్‌ల్ని ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయడం వరకు అన్ని ఎలక్షన్ల అవలక్షణాలను ప్రదర్శించారు. కానీ అవన్ని అంతగా ఫలించకపోవడంతో టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నికలు ముగిసినా వైకాపా పార్టీ వారు టీడీపీ వర్గీయులపై దాడులను మాత్రం ఆపలేదు. నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం ఏరుకోలులో టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వీరిని చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపైనా వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఎస్సై సహా పలువురు గ్రామస్థులకు గాయాలయ్యాయి.      ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం సూరావారిపల్లెలో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ వర్గాలు దాడి చేశాయి. ఈ ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నాయి. వెంటనే వారిని చిలకలూరుపేట ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించారు.

చంద్రబాబు, జగన్ ఇంటర్వ్యూలు

  పోలింగు ముగిసిన తరువాత చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడారు. ఇరువురూ కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఇరువురూ కూడా ప్రజల తీర్పు ఏకపక్షంగా తమ పార్టీకే అనుకూలంగా రాబోతోందని అన్నారు. ఈ ఎన్నికలలో ఓటింగు శాతం పెరిగినట్లయితే, తమ ఓడిపోయే ప్రమాదం ఉందనే భయంతో తమ ప్రత్యర్ద పార్టీ ప్రజలు ఓట్లు వేయకుండా చేసేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే పోలింగు స్టేషన్ల వద్ద భయానక వాతావరణం కల్పించాయని ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకొన్నారు.   జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రాభివృద్ధికి పూర్తిగా సహకరించే కూటమికే మా పార్టీ మద్దతు ఇస్తుంది. చంద్రబాబు కేంద్రం ముందు సాగిలపడి సహాయ, సహకారాలు అర్దిస్థానని చెపుతున్నారు. కానీ నేను మాత్రం కేంద్రం మెడలు వంచి మనకి రావలసిన నిధులు సాధిస్తానని చెపుతున్నాను. ప్రజా తీర్పు ఏకపక్షంగా రాబోతోంది గనుక, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొనే ఏ కూటమి అయినా మన మద్దతు కోసం దిగిరావలసిందే. అందువల్ల మనం కోరుకొన్నవిధంగా పనులు చేసిపెట్టే పార్టీకే మద్దతు ఇస్తాము. ఈవిషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.   చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ “ఈసారి జరిగిన ఎన్నికలు కొన్ని ప్రధాన అంశాలపైనే జరిగాయి. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం, రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం అనే మూడు ప్రధాన అంశాలపైనే ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చును. కనుక ప్రజాతీర్పు కూడా ఏకపక్షంగా తేదేపాకు అనుకూలంగా రాబోతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిలలో ఒక బయానక వాతావరణం సృష్టించి, ఓటింగు శాతం తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా 80శాతం పోలింగు జరిగింది. దీనివలన తెదేపా గెలుపు ఖాయమయింది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా వివిధ సమయాలలో, వివిధ రకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదేపని చేసారు. ఇటువంటి విపరీత పోకడలకు పోయినవారు చరిత్రలో చాలా మంది ఉన్నారు. వారందరూ చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం తధ్యం. అది త్వరలోనే తెలుస్తుంది,” అని అన్నారు.

ప్రజాసేవ చేయడానికి ఇంత దౌర్జన్యం అవసరమా?

  ఈసారి ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల నకిలీ మద్యం, నకిలీ కరెన్సీ పంపకాలు కూడా జరిగాయి. కొన్ని ప్రాంతాలలో ఇతర జిల్లాల నుండి వచ్చిన రౌడీ మూకలు ప్రజలను, ప్రత్యర్ధులను, చివరికి పోలీసులను, మీడియాను, పోలింగు అధికారులను కూడా భయబ్రాంతులను చేసారు. పోలింగు మొదలయ్యే వరకు ప్రలోభాల పర్వం సాగించిన సదరు పార్టీ, పోలింగు మొదలయినప్పటి నుండి పూర్తయిన తరువాత కూడా చాలా దౌర్జన్యంగా వ్యవహరించింది. కొన్ని చోట్ల ప్రత్యర్ధ అభ్యర్ధులను నిర్బంధించడం, కొట్టడంతో ప్రత్యర్ధులు కూడా జరిగిన సంఘటనలు ప్రజలే చూసారు. అనేక చోట్ల రెండు ప్రధాన పార్టీల అనుచరుల మధ్య ఘర్షణలు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు, లాటీ చార్జీ చేయవలసి వచ్చింది. ఇంతకు ముందు ఎన్నికలలో ఇటువంటి చెదురు ముదురు సంఘటనలు జరిగినప్పటికీ, ఇంతగా దౌర్జన్యకాండ ప్రజలెన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేసేందుకే అయితే ఇంత దౌర్జన్యం, గొడవలు అవసరం లేదు. కానీ, వివిధ ప్రాంతాలలో నిన్న జరిగిన సంఘటనలు చూసినపుడు, అది ప్రజాసేవ కోసమేనని ఎవరూ భావించలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అధికారం కైవసం చేసుకోవడానికి ఎన్నికలలో పోరాడటం చూసాము. కానీ వ్యక్తులు తమను కమ్ముకొన్న సమస్యల నుండి బయటపడేందుకు ఎన్నికలలో పోటీ చేయడం ఇదే ప్రధమం. ఏమయినప్పటికీ ప్రజలు తమ తీర్పు చెప్పేశారు. ఇక ఎవరి భవిష్యత్ ఎలా ఉండబోతోందో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. అధికారంలోకి రాబోయే పార్టీని బట్టే రాష్ట్ర ప్రజల భవిష్యత్ కూడా ఆధారపడి ఉంటుంది.