సీమాంధ్రలో పోలింగ్ పూర్తి

    సీమాంధ్ర ప్రాంతంలో పోలింగ్ ముగిసింది. సీమాంధ్రలోని 2 నియోజకవర్గాలలో 4 గంటలకు పోలింగ్ ముగియగా, మరో ఎనిమిది నియోజకవర్గాలకు 5 గంటలకు ముగిసింది. మిగిలిన 165 నియోజకవర్గాలకు సాయత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన ఆరుగంటల తర్వాత కూడా సీమాంధ్రలోని దాదాపు అన్ని పోలింగ్ బూత్‌లలో వందలాది మంది ఓటర్లు క్యూలో వున్నారు. క్యూలో నిల్చున్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకూ పోలింగ్ కొనసాగుతుంది.   సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అన్ని అవాంఛనీయ సంఘటనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణం కావడం విశేషం. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు విధ్వంసకాండ సృష్టించారు. జగన్ పోటీ చేసిన పులివెందులలో అయితే మరీ రెచ్చిపోయారు. పోలింగ్ రోజున కూడా ప్రలోభాల పరంపరని కొనసాగించారు. తెలుగుదేశం నాయకుల మీద దాడులు జరిపారు. అనేక చోట్ల రాళ్ళ వర్షం కురిపించారు. కొన్నిచోట్ల పోలింగ్ సిబ్బంది మీద, మరికొన్ని చోట్ల ఓటర్లమీద కూడా దాడులు జరిపారు. చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకుల మీద పోలీసులు కేసులు పెట్టారు.   విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు ఒక పోలింగ్ కేంద్రం మీద దాడి చేసి రెండు ఈవీఎంలను ఎత్తుకెళ్ళారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఎండ బాగా వున్నప్పటికీ క్యూలలో వున్న ఓటర్ల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు. గుంటూరు, కృష్ణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసినప్పటికీ ఓటర్ల సంఖ్య తగ్గలేదు. సాయంత్రం చల్లబడిన తర్వాత క్యూలలో నిల్చున్న ఓటర్ల సంఖ్య మరింత పెరిగింది.   ఈ ఎన్నికలలో 80 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం వుందన్న అభిప్రాయాలను పోలింగ్ ప్రారంభ సమయంలోనే అధికారులు వ్యక్తం చేశారు. వారు ఊహించినట్టుగానే దాదాపు 80 శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నదనేదానికి సూచిక అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తిరుపతి వైకాపా అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి ఘాతుకం

      తిరుపతి వైకాపా అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి క్షమించరాని నేరం చేశారు. తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట రమణ మీద చెయ్యి చేసుకున్నారు. తిరుపతిలో ఒకరికొకరు ఎదురుపడిన కరుణాకర్ రెడ్డి, వెంకట రమణ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వుండగానే కరుణాకర్ రెడ్డి వెంకట రమణ మీద చెయ్యి చేసుకున్నారు. దాంతో ఇద్దరికి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సర్దుమణిగేలా చేశారు. కరుణాకర్ రెడ్డి, వెంకట రమణను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తమ పార్టీ అభ్యర్థి వెంకట రమణ మీద వైకాపా అభ్యర్థి కరుణాకర్ రెడ్డి చెయ్యి చేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. కరుణాకర్ రెడ్డి ఓడిపోతున్నారన్న బాధతోనే ఇలా ప్రవర్తించారని అన్నారు. కరుణాకర్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బస్సు లోయలో పడి 17 మంది మృతి

      హిమాచల్ప్రదేశ్ సిమౌర్ జిల్లాలోని మైలా గ్రామంలో బస్సు లోయలో పడటంతో 17 మంది ప్రయాణికులు మరణించారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని షిల్లై ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా, ఇంకో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు మిలా నుంచి పనోటా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించింది.

భార్యతో కలసి ఓటేసిన భారతీయ తొలి ఓటర్

      భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పోలింగ్‌లో తొలిసారి ఓటు వేసిన వ్యక్తిగా తన పేరు నమోదు చేసుకున్న శ్యామ్ శరణ్ నేత తాజా ఎన్నికల సందర్భంగా కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. శ్యామ్ శరణ్ నేగి హిమాచల్ ప్రదేశంలో ఒక మారుమూల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1952లో ఓటింగ్ జరిగే సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో మంచు బాగా పేరుకుని వుంటుంది. కాబట్టి అక్కడ మాత్రం 1951 అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు తొలి ఓటరుగా నేగి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేగి ఎంతో ఉత్సాహంతా ఓటు వేస్తూనే వస్తున్నారు. ఈ ఎన్నికలలో కూడా ఆయన తన భార్య హీరాతో కలసి ఓటు వేశారు. 97 ఏళ్ళ వయసున్న తాను ఇప్పటికీ ఉత్సాహంగా ఓటు హక్కుని వినియోగించుకుంటూ వుంటానని, మరి మన దేశంలో కొంతమంది యువత ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఎందుకు బద్ధకంగా వ్యవహిస్తారో తనకు అర్థం కాని విషయమని ఆయన వాపోతూ వుంటారు.

మునిగిన ఓడలో 30 కిలోల బంగారం దొరికింది

      ఒక ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ఓడ నుంచి 300 కిలోల బంగారం బయటకి తీసుకొచ్చారు. అయితే ఇందులో వెరైటీ ఏమిటంటే, సదరు ఓడ మునిగిపోయి ఇప్పటికి 157 సంవత్సరాలు. 1857 సంవత్సరంలో దక్షిణ కెరోలినా ప్రాంతంలోని సముద్రంలో అమెరికాకి చెందిన ఎస్.ఎస్. సెంట్రల్ అనే పేరున్న ఒక పెద్ద స్టీమర్ మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 425 మంది చనిపోయారు. ఈ ఓడలోనే అమెరికాలోని కేలిఫోర్నియా నుంచి తెప్పిస్తున్న 300 కిలోల బంగారం వుండిపోయింది. ఇంతకాలం ఆ ఓడను చేరుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ బంగారం బయటకి రాలేదు. ఈమధ్యకాలంలోనే సదరు ఓడలోని బంగారాన్ని బయటకి తీసుకువచ్చారట.

ఓటర్లని రాళ్ళతో కొట్టారు

      మే, 7, 2014వ తేదీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వీరబాదుడు దినోత్సవం’గా జరుపుకుంటున్నట్టు కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటికి కనిపించినవాళ్ళందర్నీ బాదిపారేస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా అనేకమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద దాడి చేసిన వైపీసీ కార్యకర్తలు వాళ్ళని తలలు పగిలి రక్తం పారేట్టుగా కొట్టారు. అలాగే కొన్నిచోట్ల పోలీసులను కొట్టారు. మరికొన్ని చోట్ల మీడియా ప్రతినిధులను కొట్టారు. ఇంకొన్నిచోట్ల పోలింగ్ సిబ్బందిని బాదారు. ఇంతమందిని బాదాం.. ఇక ఓటర్లని మాత్రం వదలటం ఎందుకని అనుకన్నారేమోగానీ, ప్రకాశం జిల్లాలో బొల్లాపల్లిలో ఓటర్లను కూడా రాళ్ళతో కొట్టారు. వైసీపీ కార్యకర్తలు విసిరిన రాళ్ళు తగిలి అనేకమంది ఓటర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి కళ్ళ దగ్గర రాళ్ళు తగిలాయి.

తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని భార్యనే కాల్చేశాడు

      ఎన్నికల వేళ ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ వుంటాయి. అలాంటి విచిత్రం బీహార్‌లో జరిగింది. ఒక ప్రబుద్ధుడు తాను ఇష్టపడే పార్టీకి తన భార్య ఓటు వేయకపోయేసరికి ఆగ్రహం ఆపుకోలేకపోయాడు. నాటు తుపాకితో ఆమెని కాల్చిపారేశాడు. బీహార్‌లోని ఉజియార్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని మొయినుద్దీన్ నగర్‌లో వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి ఒక పార్టీని ఎంతో ఇష్టపడతాడు. ఆ పార్టీకి కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. బుధవారం నాడు వినోద్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్‌కి వెళ్ళి వచ్చిన అతని భార్య తాను కార్యకర్తగా వున్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేసినట్టు చెప్పింది. అంతే ఉదయ్ పాశ్వాన్‌కి బీపీ పెరిగిపోయింది. తన దగ్గరే వున్న నాటు తుపాకితో భార్యని కాల్చేశాడు. ఆ తర్వాత బీపీ డౌన్ అయ్యాక తాను చేసిన తప్పు తెలుసుకుని పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కథలో సుఖాంతం ఏమిటంటే, తుపాకీ కాల్పుకు గురైన వినోద్ పాశ్వాన్ భార్య ప్రాణాలతో బయటపడింది.

సీమాంధ్రలో 3గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

      ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలపై తమకు రిపోర్ట్ రాలేదని భన్వర్‌లాల్ తెలిపారు. మరోవైపు విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం, పలకజీడిలో రెండు ఈవీఎంలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది మావోయిస్టులు పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.   జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు : 1. శ్రీకాకుళం : 63శాతం 2. విజయనగరం : 65 శాతం 3. విశాఖపట్నం : 55 శాతం 4.తూగో : 63 శాతం 5. పగో : 67 శాతం 6. కృష్ణా : 62 శాతం 7. గుంటూరు : 67శాతం 8.ప్రకాశం : 62 శాతం 9. నెల్లూరు :63 శాతం 10. కడప : 65 శాతం 11. కర్నూలు : 63 శాతం 12. అనంతపురం : 66 శాతం 13.  చిత్తూరు : 61 శాతం

పులివెందులలో రీ పోలింగ్ తప్పదా?

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్‌ల దగ్గర వైసీపీ కార్యకర్తలు సృష్టించిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అనేక పోలింగ్ కేంద్రాల్లో వున్న ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను తన్ని బయటకి తరిమేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌కి పాల్పడ్డారు.   పులివెందులలో వైసీపీ భారీగా ఎన్నికల అక్రమాలకు పాల్పడే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానిక నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది. అయితే పోలింగ్ రోజున పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ చేసిన ఎన్నికల అక్రమాలను నిరోధించడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దాంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఎన్నిరకాలుగా నిబంధనలను అతిక్రమించవచ్చో అన్ని రకాలుగా తమ ప్రతిభ చూపించారు. అయితే పులివెందులలో వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. వైపీసీ నాయకుల అక్రమాలకు తగిన శాస్తిని చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. పులివెందుల నియోజకవర్గంలోని సగానికి పైగా కేంద్రాలలలో రీ పోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీచేసే విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, పాపం వైసీపీ కార్యకర్తలు కష్టపడి చేసిన రిగ్గింగ్ వృధా అయిపోయే అవకాశం వుంది.  

రాయపాటిపై జగన్ పార్టీ కార్యకర్తల దాడి

      ఓటమి భయం పట్టుకున్న వైసీపీ నాయకులు సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడులు ముమ్మరం చేశారు. అవకాశం దొరికితేచాలు తెలుగుదేశం వారిమీద దాడి చేశారు. ఈ దాడుల మీద సీమాంధ్రలో దాదాపు రెండు వందలకు పైగా కేసులు వైసీపీ నాయకుల మీద నమోదయ్యాయి. వైసీపీ నాయకులు ఎన్నికల సిబ్బంది మీద కూడా దాడిచేసిన ఘనతను తమ ఖాతాలో జమచేసుకున్నారు. ఇప్పుడు జగన్ పార్టీ నాయకులు నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో వున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు మీద నరసరావుపేటలో దాడి చేశారు. దాదాపు పదిమంది వైకాపా కార్యకర్తలు రాయపాటి కారు మీద రాళ్ళతో దాడి చేశారు. వీళ్ళు రాయపాటి కారును ధ్వంసం చేశారు. సమయానికి తెలుగుదేశం కార్యకర్తలు రాయపాటిని కాపాడారు. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన సమయంలో అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే రాయపాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రియాంక అమేథిని వదిలి వెళ్ళాలి: ఎన్నికల అధికారి

      ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ జరుగుతోంది. నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ స్థానికురాలు కాదు కాబట్టి పోలింగ్ రోజున అమేథీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే రూల్స్ ని అతిక్రమించడం కాంగ్రెస్ పద్ధతి కాబట్టి ప్రియాంక అమేథీని విడిచిపెట్టకుండా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు స్పందించారు. రాహుల్ గాంధీ తరపున ప్రచారం నిర్వహించిన ఆయన సోదరి ప్రియాంక గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతి సహాయ్ను అమేథీ వదిలి వెళ్లాలని జిల్లా రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. దాంతో వీరిద్దరూ అమేథీని వదిలి వెళ్ళక తప్పలేదు. ఇదిలా వుంటే కాంగ్రెస్ అభ్యర్థి కాగా, రాహుల్ గాంధీ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

లగడపాటి కొత్త కోరిక

      విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న లగడపాటి రాజగోపాల్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తాను ఎన్నికలలో నిలబడనని చెప్పిన లగడపాటి ఆ మాట ప్రకారం ఎన్నికలలో నిలబడలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి శాయశక్తులా కృషి చేసిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ చేతిలో తాను మోసపోవడంతోపాటు, ఆయన్ని నమ్మిన తెలుగు ప్రజలు కూడా మోసపోయేలా చేశారు. మొన్నీమధ్యే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన లగడపాటి సీమాంధ్రలో తెలుగుదేశం హవా ఖాయమని చెప్పారు. అంతా బాగుందిగానీ, ఓటు వేసిన తర్వాత లగడపాటి వ్యక్తం చేసిన కోరిక మాత్రం విచిత్రంగా వుంది. ఆంధ్రప్రదేశ్ పేరును ‘తెలుగునాడు’ అని మార్చాలట. అలా మారిస్తే తాను చాలా హ్యాపీగా ఫీలవుతాడట. యాక్టివ్ రాజకీయాల్లో లేకపోవడంతో తీరిగ్గా వున్న లగడపాటికి ఇలాంటి కొత్తకొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయన్నమాట. అయ్యా లగడపాటీ, ఇప్పుడు సీమాంధ్రులకు కావలసింది రాష్ట్రం పేరు మార్పు కాదు.. మీ కాంగ్రెస్ పార్టీ కారణంగా దారుణంగా మోసపోయిన వారికి ఊరట. అలా ఊరట రావాలంటే రాష్ట్రం పేరు మార్చితే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని సమర్థంగా చేయాల్సి వుంటుంది.

పోలింగ్‌లో అడ్రస్ లేని కాంగ్రెస్

      సీమాంధ్రలో పోలింగ్ చకచకా జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. వైకాపా ఓటర్లను ప్రలోభపరచడానికి ఎన్ని తంత్రాలు, కుతంత్రాలు ప్రయోగించినా ఓటర్ల నాడి తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా వున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండటం చూసి తట్టుకోలేని వైకాపా శ్రేణులు సీమాంధ్ర వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నాయి. చివరకి ఎన్నిక సిబ్బంది మీద కూడా దాటి చేయడానికి వైకాపా వర్గాలు సాహసించాయి. ఇదిలా వుంటే ఒకవైపు తెలుగుదేశం హవా వీస్తుంటే, మరోవైపు వైకాపా అరాచకత్వం పోలింగ్ సందర్భంగా కనిపిస్తోంది. ఈ రెండిటి మధ్య కాంగ్రెస్ ఊసు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్న ఓటర్లు కనిపించడం లేదు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

నరేంద్రమోడీ ర్యాలీలో ప్రమాదం

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు యువతులు కూడా వున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్‌లోని సలీంపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మోడీ ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ర్యాలీని ఉద్దేశించి అనౌన్స్ మెంట్లు చేసేందుకు నిర్మించిన ఒక వేదిక మీదకి జనం భారీగా ఎక్కడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిసింది.

సీమాంధ్రలో 1గంట వరకు పోలింగ్ శాతం వివరాలు

      ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 1-30 గంటలకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలపై తమకు రిపోర్ట్ రాలేదని భన్వర్‌లాల్ తెలిపారు. రొంపిచర్లలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో అక్కడ పరస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు : 1. శ్రీకాకుళం : 57 శాతం 2. విజయనగరం : 54 శాతం 3. విశాఖపట్నం : 56 శాతం 4.తూగో : 59 శాతం 5. పగో : 56 శాతం 6. కృష్ణా : 58 శాతం 7. గుంటూరు : 56 శాతం 8.ప్రకాశం : 59 శాతం 9. నెల్లూరు : 57 శాతం 10. కడప : 59 శాతం 11. కర్నూలు : 58 శాతం 12. అనంతపురం : 60 శాతం 13.  చిత్తూరు : 56 శాతం

కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు ఎలక్షన్ సందేశం

      కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆయన తన మాతృమూర్తి, కొడుకు విష్ణుతో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ ఎలక్షన్ సందేశం ఇచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని సినీ నటుడు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.   వైఎస్సార్ కుటుంబంతో వియ్యం అందుకున్న ఆయనకి చంద్రబాబుతో కూడా వ్యక్తిగత విభేదాలున్నాయి. అందుకే జగన్, చంద్రబాబు పేర్లు చెప్పకుండా ‘యువత’ అనే మాట వాడి జగన్‌కే ఓటు వేయండని చెప్పకనే చెప్పారు.  యువత చేతిలోనే  భవిష్యత్తు ఉందని... అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అంతులేకుండా పోయిందన్నారు. ఇదంతా ప్రజల సొమ్మే అని చెప్పారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టి ప్రజలకే పంచుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు చేసే వాగ్ధానాలు హద్దు మీరాయని, అమలు సాధ్యం కాని వాగ్దానాలను చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మోహన్‌బాబు చెబుతున్నప్పుడు ఆయన జగన్‌కి అనుకూలంగా, జగన్ మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నట్టు అర్థమైపోయింది. కొత్త రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఓటర్లంతా ఆత్మవంచన చేసుకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్షన్ కింగ్ ఎలక్షన్ సందేశం ఇచ్చారు.