మరో ప్రాణాన్ని తీసిన జగన్ పార్టీ మద్యం

      జగన్ పార్టీ పంచుతున్న మద్యం ఓటర్ల ప్రాణాలు తీస్తోంది. సీమాంధ్రలో నిన్నటి వరకు వైకాపా పంచిన మద్యం కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ రోజున కూడా ఒక ఓటరు మీద వైకాపా మద్యం కాటు పడింది. అనంతపురం జిల్లా నల్లచెరువు గ్రామంలో వైకాపా కార్యకర్తలు పంచిన మద్యం తాగి ఒక ఓటరు మరణించాడు. మరో నలుగుర్ల తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. ఓటర్లకి మద్యం తాగించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళాలని ప్రయత్నించిన వైకాపా కార్యకర్తలు ఒకరు మరణించడం, నలుగురు అస్వస్థతకి గురి కావడంతో అదిరిపోయి అక్కడి నుంచి పారిపోయారు. పోలింగ్ రోజున వైకాపా మద్యం భారీ స్థాయిలో పంచడానికి ఏర్పాట్లు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. అయితే వైకాపా మద్యాన్ని అడ్డుకోవడంతో ఎన్నికల కమిషన్ విఫలం కావడంతో మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది.

వైకాపా గురునాథరెడ్డి భార్య ఓటు గల్లంతు.. ఎట్టకేలకు ఓటు!

      ఎన్నికలలో ఓట్లు గల్లంతు కావడం మామూలే. సాధారణ ఓటర్ల ఓట్లు గల్లంతు అయితే పెద్దగా పట్టించుకునేవారు వుండరు. ప్రముఖుల ఓట్లు గల్లంతు అయితేనే అవి వార్తల్లోకి వస్తూ వుంటాయి. గతవారం హైదరాబాద్‌లో బ్రహ్మానందం ఓటు గల్లంతయితే అందరూ అయ్యోపాపం అనకపోగా, బ్రహ్మానందం కమెడియన్ కదా.. అందుకే నవ్వేశారు. ఇప్పుడు సీమాంధ్రలో కూడా ఓట్ల గల్లంతు వార్తలు బోలెడన్ని వెలుగులోకి వస్తున్నాయి.   అనంతపురం అర్బన్ నియోజకవర్గం జగన్ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి భార్య  కేఎస్ఆర్ కాలేజీ పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేయడానికి వెళ్లారు. అందరితోపాటు వరుసలో నిలబడి లోపలకు వెళ్లారు. అప్పటికే ఆమె ఓటు ఎవరో వేసేసినట్లు ఎన్నికల సిబ్బంది చెప్పారు.  దాంతో గురునాథరెడ్డి అధికారులతో  వాగ్వాదానికి దిగారు. ఈ కారణంగా అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. తరువాత అధికారులు వచ్చి ఆమెకు ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం గురునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము వెళ్లేసరికే తన భార్య  ఓటును ఎవరో వేసేశారని చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఈ విషయాన్ని గుర్తించి తన భార్యకు  ఓటు వేసే అవకాశం కల్పించినట్టు  తెలిపారు.

సీమాంధ్రలో గెలుపుపై జగన్ ధీమా

      పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో భాకరాపురం ప్రాంతంలో వున్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పోలింగ్ కేంద్రంలో విధుల్లో వున్న పోలింగ్ సిబ్బందికి వంగి వంగి దణ్ణాలు పెట్టారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో తమ పార్టీ గెలుస్తుందన్న ధీమాని వ్యక్తం చేవారు. ఎన్నికల తర్వాత సీమాంధ్రలో వైకాపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... ఈ వ్యవహారంపై తొందరపడబోమన్నారు. తనకు అన్నింటికన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.

సీమాంధ్రలో పోలింగ్: వైకాపా దౌర్జన్యకాండ

      సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైకాపా నాయకులు పూర్తిగా తెగించేశారు. ఎంతటి దారుణానికైనా వెనుదీయని విధంగా ప్రవర్తిస్తున్నారు. పలువురు నేతలపై వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడి, వాహనాలను ధ్వంసం చేస్తున్నారు.   1. జమ్మలమడుగు మండలం గొడెగనూరులో టీడీపీ అభ్యర్థి రామాసుబ్బారెడ్డిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల పరిశీలకులు,మీడియా సిబ్బంది పైనా వైసీపీ దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2. చాపాడు మండలం నక్కలదిన్కెలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ అభ్యర్థి సుధాకర్‌యాదవ్‌పై దాడి చేసి, వాహనం ధ్వంసం చేశారు. 3. చాపాడు మండలం విదునూరులో స్వతంత్ర అభ్యర్థి పుత్తా సుధాకర్‌యాదవ్ వాహనంపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. 4. మైదుకూరు మండలం ఎన్..ఎర్రపల్లెలో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి కారుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. 5. బి.మఠం మండలం కొత్తపల్లెలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. టీడీపీ అభ్యర్థి సుధాకర్‌యాదవ్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో సుధాకర్‌యాదవ్ కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. 6. బి.మఠం మండలం చెంచయ్యగారిపల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.  

రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు

      వైఎస్ జగన్‌కి, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకి భవిష్యత్తులో రెచ్చిపోయే అవకాశాలు కనిపిచండం లేదు కాబట్టి ఈ ఎన్నికలలో రెచ్చిపోతున్నారు. సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా వైకాపా నాయకులు పూర్తిగా తెగించేశారు. ఎంతటి దారుణానికైనా వెనుదీయని విధంగా ప్రవర్తిస్తున్నారు. శాంపిల్‌గా కడప జిల్లాని తీసుకుంటే వైకాపా కార్యకర్తలు వీరంగం ‌సృష్టిస్తునారు. చాలా పోలింగ్ బూత్‌‌ల్ని ఆక్రమించి రిగ్గింగ్ చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లను చాలాచోట్ల బయటకి తరిమికొట్టారు. కొన్నిచోట్ల క్యూలలో నిల్చున్న ఓటర్లని, ఓటు వేయబోతున్న ఓటర్లని కూడా ప్రభావితం చేస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరగడానికి కారణమయ్యారు. వైకాపా కార్యకర్తలు కొన్నిచోట్ల మీడియావాళ్ళని చావబాదారు. ఒకచోట అయితే ఎన్నికల అధికారినే కొట్టారు. పోలింగ్ రోజున కూడా డబ్బు, మద్యం పంపిణీని యథేచ్ఛగా చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులు ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ పోలింగ్ ఏజెంట్లను టార్గెట్ చేసుకుని వారిమీద దాడులు చేస్తు్న్నారు. ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ మొదలైన రెండు మూడు గంటల్లోనే వైకాపా శ్రేణులు ఇన్ని లీలలు ప్రదర్శించాయి. పోలింగ్ ముగిసే వరకూ ఇంకెన్ని లీలలు చూసి తరిస్తామో ఏంటో..

అధికారాంతంలో సోనియా, మన్మోహన్!

      సోనియాగాంధీ అధికారం ముగుస్తోంది. దీనితోపాటు యుపిఏ ప్రభుత్వం అధికారం కూడా ముగిసిపోనుంది. పదేళ్ళపాటు దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోవడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి వుంది. ఇప్పుడు అధికారాంతంలో వున్న సోనియా, మన్మోహన్ మంగళవారం నాడు చిట్టచివరి అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. ఏర్పాటైన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో సోనియా, మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. వీరిద్దరికీ ఇది చివరి అధికారిక సమావేశం. ఈ సందర్భంగా సోనియా, మన్మోహన్ మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం సహకారం కారణంగానే జాతీయ సలహామండలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగిందని తమని తాను పొగుడుకున్నారు.

సీమాంధ్రలో ప్రారంభమైన పోలింగ్

      సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మొత్తం 3.67 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు, ఎన్నికల కమిషన్ పటిష్టచర్యలు చేపట్టింది. లక్షా 22వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు రక్షణశాఖ హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలవద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

సబ్బం హరిది రాజకీయ ఆత్మహత్యా?

  జైసపా అభ్యర్ధిగా వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ దిగిన సబ్బం హరి, ఎన్నికలకు కొన్ని గంటల ముందు పోటీ నుండి విరమించుకొని, పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీ, తెదేపాలకు మద్దతు తెలపడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమేనని వైకాపా నేత వాసిరెడ్డి పద్మావతి వ్యాఖ్యానించారు. కానీ సబ్బంహరి బీజేపీ తరపున వైజాగ్ నుండి పోటీ చేస్తున్న ఆ పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబుకు తోడ్పడటం ద్వారా చాలా తెలివిగా వ్యవహరించి, విజయావకాశాలున్న ఆ పార్టీలో కర్చీఫ్ వేసినట్లే భావించవచ్చును.   సబ్బంహరి వంటి అపార రాజకీయ అనుభవజ్ఞ్డుడు ఒట్టి పుణ్యాన్న పోటీ నుండి విరమించుకొని తన ప్రత్యర్ధులకు మద్దతు పలికారంటే అంతకంటే అవివేకం ఉండబోదు. ఆయన వెనక్కి తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. 1. జైసపా అభ్యర్ధిగా నిలబడిన తాను ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని ఆయన గ్రహించారు. ఎలాగు ఓడిపోతామని తెలిసినపుడు, ఇంకా పోటీలో కొనసాగే బదులు బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా (త్యాగం) పోటీ నుండి విరమించుకొన్నట్లయితే, మున్ముందు బీజేపీలో చేరి ఏదయినా పదవో, అధికారమో స్వీకరించవచ్చును. ఆ పార్టీలో కాకపోతే తెదేపాలోనయినా చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. లేదా ఆ రెండు పార్టీలతో సత్సంబందాలు ఏర్పరుచుకోవచ్చును.   2. బీజేపీ అభ్యర్ధికి మద్దతు తెలపడం ద్వారా తనను ఘోరంగా అవమానించిన వైకాపా అభ్యర్ధి విజయమ్మ విజయావకాశాలను దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకోవచ్చును. మరి ఆయన నిర్ణయం తప్పో ఒప్పో వైకాపా నేతలే చెప్పాలి.

జగన్ ప్రాదాన్యత దేనికో?

  జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవగానే ఐదు సంతకాలు చేస్తానని జనాలను ఒకటే ఊదరగొట్టారు. అంతేకాక ప్రజలకు చెప్పినవి, చెప్పనివి కూడా చాలా పనులు చేస్తానని ప్రకటించారు. బహుశః ప్రజలకు చెప్పని వాటిలో తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడం కూడా ఒకటేమో! ఈ ఎన్నికలలో వైకాపా, గెలిచినా ఓడినా ఆయన తన తలపై కత్తిలా వ్రేలాడుతున్న సీబీఐ, ఈడీ కేసులు మాఫీ చేయించుకోవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తారని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందుకే ఆయన మొదటి నుండి కూడా తనకు 30 యంపీ సీట్లు కావాలని ప్రజలను గట్టిగా కోరుతున్నారు. ఒకప్పుడు సమైక్య ఉద్యమాలు జోరుగా నడుస్తున్నవేళ తనకు 30 యంపీ సీట్లు ఇచ్చినట్లయితే, రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత జరిగే ఎన్నికలలో 30 సీట్లు వచ్చినా అదెలా సాధ్యమో ఆయన ఏనాడు వివరించలేదు. ఎవరూ ఆయనని అడగలేదు కూడా. ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక, జగన్ తన 30 యంపీ సీట్ల పాట పల్లవి, స్వరం కూడా మార్చి, ఇప్పడు వాటిని కేంద్రానికి ఎరగా వేసి దాని మెడలు వంచి నిధులు తీసుకువస్తానని గర్జించారు. తన తండ్రిపై ప్రజలలో ఉన్న సానుభూతిని పెట్టుబడిగా పెట్టి, రాష్ట్రంలో అధికారం, ముఖ్యమంత్రి పదవి, 30యంపీ సీట్లు సంపాదించుకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ ప్రజలు తనకి 30 యంపీ సీట్లు గనుక ఇచ్చినట్లయితే మళ్ళీ వాటిని పెట్టుబడిగా పెట్టి తన కేసుల నుండి విముక్తి పొందాలని ప్రయత్నిచడం తధ్యం. ఒకవేళ బీజేపీ/ఎన్డీయే కూటమి 272 యంపీ సీట్లు గెలుచుకోగలిగి, బయట పార్టీల మద్దతు ఆవసరం పడకపోయినట్లయితే, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కోర్టు గడపలు ఎక్కక తప్పదు.

రాష్ట్రంలో రెండోదశ.. కేంద్రంలో 8వ దశ పోలింగ్ రేపే..

  సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతోపాటు సహా దేశవ్యాప్తంగా 64 లోక్‌సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. సీమాంధ్ర (25), ఉత్తరప్రదేశ్ (15), బీహార్ (7), హిమాచల్ ప్రదేశ్ (4), జమ్ము కాశ్మీర్ (2), ఉత్తరాఖండ్ (5), పశ్చిమ బెంగాల్ (6)లలో బుధవారం 8వ దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్థానాల్లో సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఇప్పటి వరకు 7 దశల్లో 438 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సుమారు 66.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొమ్మిదవ, చివరిదశ పోలింగ్ ఈనెల 12న జరుగుతుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది.మే 16వ తేదీన దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.

టీఆర్ఎస్ చీలికవర్గం నాయకుడెవరు?

  ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్‌ని నిట్టనిలువుగా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చాలామంది టీఆర్ఎస్‌కి పూర్తి మెజారిటీ వస్తుందని, కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. అయితే తెలంగాణలో హంగ్ రాబోతోందని , కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశం వుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. తెలంగాణలో ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంపాదించడానికి టీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చడానికి కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ప్రజా ప్రతినిధుల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించడంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన అనుభవం వుంది. ఇప్పుడీ మంత్రాన్ని ఈ ఎన్నికలలో ఎన్నికవబోతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రయోగించడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. టీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చే ఎమ్మెల్యేలకు ఒక నాయకుడు వుండాలి. ఆ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయాలి. అప్పుడే టీఆర్ఎస్‌ని చీల్చడానికి వీలవుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌ పార్టీని చీల్చడానికి ఉపయోగపడే నాయకుడిగా కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోంది. టీఆర్ఎస్‌లో హరీష్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో పెరుగుతున్నాయి. టీఆర్ఎస్‌లో ఎప్పటికైనా కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్‌దేనని హరీష్ రావుకి స్పష్టంగా తెలుసు. టీఆర్ఎస్‌లో వుండగా తాను తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అనేది ఊహల్లో తప్ప వాస్తవంలో అసాధ్యమని కూడా తెలుసు. గతంలో ఓసారి పార్టీలో కేటీఆర్‌తో వున్న విభేదాలకు చిరాకెత్తిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి, ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం

  థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ నగరంలో ఈ భూకంప కేంద్రం వుంది. నగరంలో విమానాశ్రయం ఎక్కడ వుందో అక్కడే భూకంప కేంద్రం వుండటం విశేషం. భూకంపం సంభవించగానే విమానాశ్రయంలో వున్నవారిని వెంటనే అక్కడి నుంచి బయటకి పంపేశారు. ఎయిర్పోర్టులో భూకంపం వల్ల చాలా విధ్వంసం జరిగింది. రన్వేకు మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లలేదు. విమాన సర్వీసులకు ఆటంకం కలగలేదు. అలాగే పాన్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లు నిలువునా చీలిపోయాయి. కిటికీలు బద్దలయ్యాయి. గోడలు కూలిపోయాయి. బౌద్ధారామాలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు ఒకరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

సబ్బం హరి నిష్క్రమణతో మారనున్న బలాబలాలు

  జై సమైక్యాంధ్ర పార్టీ తరపున వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న సబ్బం హరి, ఎన్నికలకి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నఈ తరుణంలో పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా ఎన్నికలబరి నుండి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఆయన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వైజాగ్ నగరానికి మేయర్ గా కూడా పనిచేసారు. కానీ కొన్ని కారణాల వలన ఆరేళ్ళపాటు పార్టీ నుండి బహిష్కరింపబడ్డారు. సాధారణంగా అంతకాలం పార్టీకి దూరమయిన వారు మళ్ళీ పార్టీలోకి వచ్చే ఆలోచన చేయరు. వచ్చినా వారికి ఎటువంటి ప్రాధాన్యము ఉండదు. కానీ, సబ్బం హరి మాత్రం గత ఎన్నికలలో అనకాపల్లి యంపీ టికెట్ సాధించుకోవడమే కాకుండా అక్కడి నుండి గెలిచి మళ్ళీ తన రాజకీయ జీవితాన్ని గాడిన పెట్టుకోగలిగారు. జగన్ పార్టీ పెట్టిననాటి నుండి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికలలో తాను వైకాపా టికెట్ పైనే పోటీ చేస్తానని ఆయన కాంగ్రెస్ లో ఉండగానే ప్రకటించారు.   జగన్ జైలు నుండి విడుదల అయిన తరువాత , ఇక వైకాపా తీర్ధం పుచ్చుకొని పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్దమయిన తరువాత తనింకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సంగతి మరిచిపోయి, తను అప్పుడే వైకాపాసభ్యుడు అయిపోయినట్లు భావిస్తూ ‘మా పార్టీ (వైకాపా) ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీయే కూటమికే మద్దతు ఇస్తుంది” అని ఆయన ప్రకటించేశారు.   ఆ సమయంలో, “జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో ఆవిధంగా రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నందునే బెయిలు మీద బయటకు రాగలిగారని” తెదేపా నేతలు చేస్తున్న తీవ్ర విమర్శలతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ యంపీగా ఉన్న సబ్బం హరి ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ప్రకటన చేయడంతో తీవ్ర ఆగ్రహం చెందిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీలో ప్రవేశించక మునుపే ఆయన మొహం మీదనే తలుపులు మూసి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసారు.   అ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని వైజాగ్ నుండి విజయమ్మపై పోటీకి దిగిన సబ్బం హరి, ఇప్పుడు తాను గెలిచే అవకాశాలు కనిపించకపోవడంతో, బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా పోటీ నుండి విరమించుకొన్నారు. స్థానికుడయిన సబ్బం హరికి వైజాగ్ లో మంచి బలం, పలుకుబడి, అన్ని పార్టీల నేతలతో, కార్యకర్తలతో సత్సంబందాలు కూడా ఉన్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీ, తెదేపా అభ్యర్ధులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి, తన అభిమానులను కూడా వారికే ఓటు వేయమని అభ్యర్ధిస్తున్నారు. తత్ఫలితంగా విజయమ్మ విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ ప్రభావం అసెంబ్లీ అభ్యర్దులపైనా పడవచ్చును. ఏమయినప్పటికీ ఇది కిరణ్, జగన్ రెడ్డిలు ఇద్దరికీ ఇబ్బందికరమేనని చెప్పవచ్చును.

అపాయింటెడ్ డేపై కేంద్రానికి చెప్పుకోండి: హైకోర్టు

  ఎన్నికల ప్రక్రియ ముగియడానికి, అపాయింటెడ్ డేకి మధ్య 17 రోజుల వ్యవధి వుండటం టీఆర్ఎస్‌కి చెమటలు పట్టిస్తోంది. ఈ పదహేడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ట్రిక్కులు ప్రయోగించి టీఆర్ఎస్‌లో చీలిక తెచ్చే ప్రమాదం వుందని భయపడుతోంది. తద్వారా తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళే అవకాశం వుందని భావిస్తోంది. అందుకోసమే అపాయింటెడ్ డేని జూన్ 2 నుంచి మే 16వ తేదీకి మార్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ పిటిషన్‌ను మంగళవారం నాడు పరిశీలించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ హైకోర్టు ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే వుంటే రాజ్యాంగ సంక్షోభం వచ్చే అవకాశం వుందని వాపోయింది. అయితే హైకోర్టు మాత్రంఈ అంశాన్ని కేంద్రం దృష్టికే తీసుకెళ్ళాలని, అభ్యంతరాలుంటే కేంద్రానికే చెప్పుకోవాలని పిటిషన్ వేసిన టీఆర్ఎస్‌కి సూచించింది. దాంతో ఇప్పుడీ అంశం కేంద్రం మీద ఆధారపడింది. కేంద్రంలో వున్న కాంగ్రెస్ ఆపాయింటెడ్ డేని పొరపాటుగా కూడా మార్చదని అందరికీ తెలిసిన విషయమే.

ప్రచారం కోసం అతి తెలివి ప్రదర్శన

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకున్న అతి తెలివితేటల్ని చాలా తెలివిగా ప్రదర్శిస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగిసినా ఇంకా కక్కూర్తితో ప్రచారం చేయాలని ప్రయత్నిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీతో సరిపోదన్నట్టు ఏకంగా పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలోనే ప్రచారం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచీ వైకాపా గుర్తు అయిన ఫ్యాన్ ముద్రించి వున్న కప్పులతో టీ పంపిణీ జరుగుతోంది. పోలింగ్ కేంద్రం సమీపంలోనే వున్న ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంటిన్ నుంచి ఈ టీ కప్పులు సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కప్పుల మీద ఫ్యాన్ గుర్తు వుంటే, మరికొన్ని కప్పుల మీద వైకాపా తరఫున ఎస్.కోట, బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలు ముద్రించి వున్నాయి. వైకాపా చేస్తున్న ఈ చీప్ ట్రిక్స్ ని చూసి పోలింగ్ సిబ్బంది నోరు తెరిచారు.

విశాఖ బరి నుంచి తప్పుకున్న సబ్బం హరి

  విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలో వున్న సబ్బం హరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను పోటీలో వుంటే ఓట్లు చీలుతాయని, తద్వారా జగన్ పార్టీ అభ్యర్థి విజయమ్మ గెలిచే అవకాశం వుంది కాబట్టి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇక రాష్ట్ర విభజన తప్పదని స్పష్టమైపోయిందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయాల్సిన అవసరం, పార్లమెంటుకు జగన్ పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా చేయాల్సిన అవసరం వుందని సబ్బం హరి అన్నారు. అందుకే విశాఖలో విజయమ్మ గెలవకుండా వుండటం కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన చెప్పారు. విజయమ్మకు విశాఖ పార్లమెంటు సీటు ఇవ్వడం వెనుక వున్న అసలు రహస్యం తనకు తెలుసని సబ్బం హరి అన్నారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ అధికారంలోకి వస్తే అరాచకం ప్రబలుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ నుంచి విశాఖని, రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిమీదా వుందని చెప్పారు. ఈ ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని సబ్బం హరి చెప్పారు.