మాజీ సీఎం నేదురుమల్లి కన్నుమూత.. పలువురి నివాళి
posted on May 9, 2014 @ 12:15PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు నేదురుమల్లి జనార్దనరెడ్డి (80) హైదరాబాద్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1935 ఫిబ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడలో నేదురుమల్లి జనార్దనరెడ్డి జన్మించారు. రాజకీయాలలోకి రాకముందు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 1998లో బాపట్ల, 1999లో నరసరావుపేట, 2004లో విశాఖపట్నం నుంచి లోక్సభకు నేదురుమల్లి ఎన్నికయ్యారు. 1988లో పీసీసీ అధ్యక్షుడిగా నేదురుమల్లి పనిచేశారు. 1990 నుంచి 92 వరకు జనార్దన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేదురుమల్లి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నక్సలైట్ల మీద నిషేధం విధించారు. ఆయనను చంపాలని నక్సలైట్లు రెండుసార్లు ప్రయత్నించారు. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మి గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లికి నలుగురు కుమారులున్నారు. నేదురుమల్లి మరణంతో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకాడలో విషాదఛాయలు అలముకున్నాయి. నేదురుమల్లి భౌతికకాయాన్ని నిమ్స్ నుంచి సోమాజిగూడలోని నివాసానికి తరలించారు. జనార్దనరెడ్డి మరణవార్త తెలియగానే కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు, సహచరులు పెద్ద సంఖ్యలో నేదురుమల్లి నివాసానికి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి పళ్ళంరాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్య, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, వైసీపీ నేత మైసూరారెడ్డి తదితరులు నేదురుమల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.