మంత్రి ట్విస్ట్.. చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చాం

  ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజధాని పరిధిలో ఐదు గ్రామాలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ భూసేకరణ వ్యవహారంపై రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దు.. వారు అంగీకరించి భూములు ఇస్తేనే తీసుకోండని లేని పక్షంలో ఏపీ ప్రభుత్వంపై పోరాడటానికైనా సిద్ధమని హెచ్చరించారు. మరోవైపు ప్రతి పక్షనేత జగన్ కూడా భూసేకరణ పై ధర్నా చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈవ్యవహారంపై మంత్రి నారాయణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భూసేకరణ బిల్లు విషయం చంద్రబాబుకు తెలియదని.. చంద్రబాబు దృష్టికి తీసుకురాకుండానే భూసేకరణ బిల్లు ఇచ్చామని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. భూసేకరణ బిల్లుకు చంద్రబాబు మొదటి నుండి వ్యతిరేకమే అని కానీ రాజధాని నిర్మాణానికి సమయం దగ్గర పడుతుండటంతో తానే నోటిఫికేషన్ జారీ చేయించానని చెప్పారు. ఇప్పుడు ఈ బిల్లును తాము వెనక్కి తీసుకుంటున్నామని.. చంద్రబాబు.. అలాగే భూసేకరణ పై పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులను ఒప్పించే భూసేకరణ చేస్తామని.. ఎవరినీ బలవంతం పెట్టబోమని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

ప్రత్యేక హోదా గురించి త్వరగా ఆలోచించండి.. వెంకయ్య

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంపై నీతి ఆయోగ్‌ అధికారులతో భేటీ అయ్యారు. ఈరోజు వెంకయ్యనాయుడి నివాసంలో గంటకు పైన వీరితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని త్వరగా పరిశీలించాలని ఆయన వారికి సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన చర్చలు గురించి.. రాష్ట్ర విభజన వల్ల రాజధాని లేక.. ఆర్ధిక లోటుతో ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలగురించి వెంకయ్య వారికి వివరించినట్టు సమాచారం. ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అదనంగా ఆర్థిక చేయూత అందజేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సరిపోయినన్ని నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు.

అవసరమైతే పవన్ తో మాట్లాడుతా.. చంద్రబాబు

  ఏపీ రాజదాని కోసం రైతుల దగ్గర నుండి భూసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అటు జనసేనపార్టీ అధ్యక్షుడు.. ఇటు వైఎస్స్రాఆర్ పార్టీ అధినేత జగన్ ఇద్దరు తమ వ్యతిరేకతను చూపించారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ ను ఆపుకోని మరీ వచ్చి రైతలను పరామర్శించి వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. అయితే రైతల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని.. అవసరమైతే వారి ఇవ్వడానికి అంగీకరిస్తే తీసుకోండని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంలో భూసేకరణ కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైతే తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతానని స్పష్టం చేశారు. కొంతకాలంగా టీడీపీ పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

పాత చంద్రబాబును చూస్తారు.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యోగుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పనిచేసే వారే నాదగ్గర ఉంటారు పనిచేయని వారిని నేను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర విడిపోవడం వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా దెబ్బతింది.. ఈ నేపథ్యంలో ఏపీని అభివృద్ధి చేయడానికి నేను అహర్నిశలు కష్టపడుతున్నా అధికారుల నుండి సరైన సహకారాలు అందడంలేదని మండిపడ్డారు. గతంలో ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా ఉండేవాడిని నిర్లిప్తంగా ఉన్నా, నిరక్ష్యంగా వ్యవహరిస్తే గతంలో సహించేవాడిని కాదు.. ఇప్పుడు ఉద్యోగులు పనితీరు మార్చుకుంటే సరాసరి లేకపోతే మరో 3 నెలల్లో పాత చంద్రబాబును చూస్తారంటూ ఆయన హెచ్చరించారు.   గుంటూరు ఆస్పత్రి ఘటన, ఇంజక్షన్ల సైకో ఘటనపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి రోజుల పసికందు మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ‘ఆ డాక్టర్‌కు బుద్ధి లేదు' అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాక ఒక సైకో ఇంజక్షన్లు చేసి పారిపోతుంటే పోలీసులు వాడిని పట్టుకోవడానికి భయపడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకోను పట్టుకోకపోవడంపై తాను డిజిపి నుంచి అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి వాయించి పారేశానన్నారు. పనిచేసే అధికారులే తన దగ్గర ఉంటారని, పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు.

తను ప్రత్యర్ధి.. ఎలా ఫోన్ చేస్తా

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో విద్యుత్ ఉద్యోగుల రిలీవింగ్ పై వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఇరు రాష్ట్రాలలో విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్‌.. జగన్ కు ఫోన్ చేసి ఈవిషయంపై కేటీఆర్ తో మాట్లాడాలని.. సూచించారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈవార్తలను సీఎం రమేశ్ ఖండించారు. తాను జగన్ కు ఫోన్ చేయలేదని.. అసలు జగన్ తో మాట్లాడాల్సిన అవసరం ఏంటని? ప్రశ్నించారు. మేము కడప జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులం.. అలాంటిది ఆయనకు నేను ఫోన్ ఎలా చేస్తాను..ఫోన్‌ చేయలేదు. మాట్లాడలేదు.. ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. అయితే ఈ విషయంపై విద్యుత్ ఉద్యోగులు నన్ను ఢిల్లీలో కలిశారు.. aవారిని నేను కేంద్రమంత్రి దగ్గరికి తీసుకెళ్లి సమస్యను వివరించాను అని తెలిపారు.

జగన్ కు నో పర్మిషన్

  గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కరిచి చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారి కుటుంబాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పరామర్సించాలనుకున్నారు కానీ ఆయనకు అనుమతి లభించలేదు. జగన్ కి అనుమతి లభించకపోవడం ఏంటనుకుంటున్నారా?. అక్రమాస్తుల కేసులో జగన్ ఈరోజు కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసు విచారణ కాస్త ఆలస్యంగా రావడంతో అప్పటివరకూ ఎదురు చూసిన జగన్ తను గుంటూరు వెళ్లాల్సి ఉందని.. అందుకు అనుమతించాలని తన తరపు న్యాయవాదిని కోరారు. ఇదే విషయాన్ని న్యాయవాది న్యాయమూర్తికి తెలియజేయగా కేసు విచారణ జరుగుతున్నప్పుడు నిందితులు ఎక్కడికి వెళ్లకూడదు.. ఈ విషయం మీ క్లయింట్ కి తెలియదా అని ప్రశ్నించారు. విచారణ సమయంలో కోర్టులోనే ఉండాలని ఆదేశించింది. దీంతో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ కు అనుమతి లభించలేదు. 

దానిపై మాకూ అంతే హక్కుంది.. చంద్రబాబు

  హైదరాబాద్ పై తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఆంధ్ర రాష్ట్రానికి కూడా అంతే హక్కు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ఏదో సమస్య సృష్టిస్తూ.. లేనిపోని వివాదాలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి చాలా నష్టం జరిగిందని కట్టుబట్టలతో హైదరాబాద్ నుండి వచ్చేశామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కొట్లాడితే వచ్చేది ఏమీ లేదన్నారు. తనకు ఎవరితోను రాజీపడాల్సిన అవసరం లేదని, నా విశ్వసనీయతనే తనకు శ్రీరామ రక్ష అన్నారు. ఏపీకీ ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా రెండూ ఇవ్వాలని కేంద్రాన్ని కోరానని.. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ది చెందే వరకూ కేంద్రం సహరించాలని కోరానని చెప్పారు. ఎవరూ ఆధైర్యపడవద్దని, అందరం కలిసి సాధించుకుందామని చెప్పారు.

జగన్ కు చంద్రబాబు కౌంటర్

ఓటుకు నోటు విషయంపై చంద్రబాబు భయపడుతున్నారని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ చంద్రబాబును విమర్శించగా, చంద్రబాబు దానికి ధీటుగా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. నేను భయపడేందుకు నా పైన ఉన్న కేసులు ఏమిటో చెప్పాలని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. అక్రమాస్తుల కేసులో ఉన్న జగన్ ఇప్పుడు కేసుల గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.   అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని.. వారికి కావల్సింది కేవలం పదవి మాత్రమే కావాలి.. తనకు రాష్ట్ర అభివృద్ది కావాలని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రంతో చర్చలు కూడా జరిగాయి.. కేంద్రం కూడా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిందని అన్నారు. భూసేకరణ విషయంలో కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని.. రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారని.. రాజధాని ఆపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరు ఇద్దామనుకుంటే రాజకీయం చేస్తున్నారన్నారని విమర్శించారు.

మరో పాక్ ఉగ్రవాది పట్టివేత

  గత కొద్దిరోజుల క్రితం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ప్రాంతంలో మహ్మద్ నవేద్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్ పైన దాడి చేయగా జవాన్లు ఎదురు దాడికి దిగి కాల్పులు జరపగా మహ్మద్ నవేద్ పట్టుబడ్డాడు. ఇప్పుడు భారత సైన్యం చేతికి మరో ఉగ్రవాది దొరికాడు. నలుగురు పాక్ ఉగ్రవాదులు ఉత్తర కాశ్మీర్లో చొరబడగా ఉగ్రవాదులకి.. జవాన్ల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా షాజద్ అహ్మద్ అనే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఇతడు పాకిస్తాన్ లోని బాలోచిస్తాన్ కు చెందిన ముజఫడ్ కు చెందినవాడిగా పోలీసు అధికారులు గుర్తించారు. ఇతనికి ఇంతకుముందు భారత్ లో చొరబడిన ఉగ్రవాదులకు సంబంధం ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం షాజద్ అహ్మద్ ను మిలటరీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

దయచేసి పవన్ కళ్యాణ్ తో జగన్ ను పోల్చొద్దు

  ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ కేవలం సీఎం కుర్చీ మీద వ్యామోహంతోనే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని.. అంతేకాని ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని మండిపడ్డారు. అంతేకాదు దయచేసి పవన్ కళ్యాణ్ తో జగన్ పోల్చవద్దని.. పవన్ కళ్యాణ్ కు జగన్ కు చాలా తేడా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ రైతుల మీద ఉన్న ప్రేమతో వారి కోసం మాట్లాడుతుంటే జగన్ మాత్రం వారిని రైతులను రైచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు.  కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ కంటే ముందే భూసేకరణ విషయంలో ఏపీ రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకొని రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని.. వారి ఇష్టప్రకారమే ఇస్తే తీసుకోండని.. వారిని ఒప్పించి భూసేకరణ చేయండని చెప్పిన సంగతి తెలిసిందే. అయినా ఏ రోజూ తీరిక లేనట్టూ ఈ నెల 29 అంటే రాఖీ రోజూ ప్రత్యేక హోదాపై ధర్నాకు దిగడం జగన్‌ పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.

జగన్ జోస్యం నెరవేరేనా?

  ఈమధ్య జగన్ మోహన్ రెడ్డి జోస్యంబా చెపుతున్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెపుతున్నారు. ఇంతకు ముందు కూడా జగన్ ఇంకా మూడేళ్లు మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఉంటుందని.. తరువాత మాదే అధికారమని చెప్పుకొచ్చారు. మరి జగన్ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు కాని ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు అందరూ నవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది.   ఎందుకంటే అయిన దానికి కాని దానికి కేవలం టీడీపీ ప్రభుత్వాన్నిఇరుకున పెట్టాలని మాత్రమే జగన్ ఎప్పుడు చూసిన ధర్నాలు చేస్తుంటారు. ఆరకంగానైనా టీడీపీపైన ఒత్తిడి తీసుకురావచ్చనే ఉద్దేశం తప్ప ఏం లేదు. దీనిలో భాగంగానే మొన్న ప్రత్యేక హోదా విషయంలో ఇక్కడెక్కడా ధర్నా చేయడానికి స్థలం లేనట్టు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ ధర్నా చేశారు. ఏమైంది.. ప్రతిపక్ష నేతలను విమర్శించి.. మీడియాలో కనిపించడం తప్ప వచ్చిందేమీ లేదు. అయినా ప్రతిపక్షాలను విమర్శించడానికి అక్కడివరకూ వెళ్లాలా అన్న వారు కూడా లేకపోలేదు. పోనీ ధర్నా వల్ల ఏమన్న పేరు వచ్చిందంటే అదీ లేదు.. ఎందుకంటే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ కూడా ధర్నా చేస్తానని చెప్పిన తరువాతే జగన్ ధర్నా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా అంతే జరిగింది. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకన్నారు. ఇప్పుడు జగన్ ధర్నా అంటూ అక్కడ హడావుడి చేయడం తప్ప ఏంలేదు. మరోవైపు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రెడిట్ మొత్తం కొట్టేశాడు.. ఇప్పుడు జగన్ ఏం చేసినా లాభం లేదని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మళ్లీ ఈనెల 29న రాష్ట్ర బంద్ కు కూడా పిలుపునిచ్చారు. మరి ఈబంద్ వల్ల ఏం ఒరుగుతుందో చూడాలి. మొత్తానికి జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు. అందుకే ఇప్పటినుండే తరువాతం తానే సీఎం అని ‘‘కచ్చితంగా ఎప్పుడో చెప్పలేను కానీ అతి త్వరలోనే రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని జోస్యం చెపుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు జగన్ పిట్టల దొరలా పగటి కలలు కంటున్నారని విమర్శిస్తున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

కేటీఆర్ కు మీరే చెప్పాలి జగన్.. సీఎం

  ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల రిలీవింగ్ పై ఎప్పటినుండో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికత ఆధారంగా ఆంధ్రా విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవింగ్ చేసి వారికి వేతనాలు కూడా చెల్లించట్లేదు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం రమేషే జగన్ కు ఫోన్ చేసి ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదని.. ఈ విషయంపై కేటీఆర్ తో మాట్లాడి వారికి వేతనాలు ఇప్పించాలని కోరారట. సీఎం రమేష్ చెప్పిన దానికి జగన్ కూడా సముఖత చూపించారట. అంతేకాదు జగన్ ఈ విషయంపై కేటీఆర్ తో కూడా మాట్లాడినట్టు.. ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.   దీనికి కేటీఆర్ కూడా స్పందించి రిలీవింగ్ చేసిన విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ద్యుత్ సంస్థల యాజమాన్యంతో చెప్పినట్లుగా.. దీనిలో భాగంగానే విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను కలిసినట్టు తెలుస్తోంది. కాని ఇంతా జరిగిన ఈ అంశం కేసీఆర్ పరిధిలో ఉండటం వల్ల ఆ తరువాత కెటిఆర్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారని అంటున్నారు.

రాష్ట్రానికి రూ.2,25,486 కోట్లు ఇవ్వండి: బాబు డిమాండ్

  ప్రధాని నరేంద్ర మోడీతో మొన్న సమావేశమయిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేప్పట్టేందుకు వీలుగా రాష్ట్రానికి మొత్తం రూ. 2,25,486 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. తానేమీ కొత్తగా నిధులు కోరడం లేదని రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులను కోరుతున్నానని ఆయన స్పష్టం చేసారు. బీహార్ రాష్ట్రానికి ఇటీవల మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీని చూసి తను ఈ డిమాండ్లు ప్రధాని ముందు పెట్టడం లేదని, వీటి గురించి చాలా కాలంగా కేంద్రప్రభుత్వాన్ని తను అడుగుతున్నానని తెలిపారు. కనుక తను సమర్పిస్తున్న ఈ నివేదిక ఆధారంగానే నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్రానికి అందించవలసిన ఆర్ధిక ప్యాకేజిపై రోడ్డు మ్యాప్ తయారు చేయాలని ఆయన కోరారు.   చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించిన నివేదికలో శాఖల వారిగా కోరిన నిధుల వివరాలు: సాగునీరు, వ్యవసాయాభివృద్ధికి: రూ. 24, 627 కోట్లు, గ్రామీణ త్రాగునీటి సరఫరా: రూ. 13,714 కోట్లు, విద్యుత్: రూ. 3,190 కోట్లు, అటవీ శాఖ: రూ.1,950 కోట్లు, రహదారులు, మౌలిక వసతులు: రూ. 27,985 కోట్లు, రైల్వేలు: రూ. 21,420 కోట్లు, పోర్టుల అభివృద్ధి: రూ. 4,800 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి: రూ. 3,100 కోట్లు, పర్యాటక శాఖ: రూ. 4,750 కోట్లు, పట్టణాభివృద్ధి రూ. 14,106 కోట్లు, మొత్తం: రూ. 2,25,486 కోట్లు.