Top Stories

కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు

   బాపట్లా జిల్లా  చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జులై నెల 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.  చీరాల కుప్పడం పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి  న్యూ ఢిల్లీలో అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్ లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది.   
కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు Publish Date: Jun 13, 2025 9:43PM

ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం : సీఎం రేవంత్

  తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో  విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.  రాష్ట్రంలో ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్ల‌లున్న గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపున‌కు వీలుగా విద్యా వ్య‌వ‌స్థ‌ను మార్పు చేయాల‌ని రేవంత్‌ సూచించారు.  హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల‌కు నైపుణ్యాభివృద్ధి క‌ల్పిస్తే భ‌విష్య‌త్‌లో వారు త‌మ‌కు ఇష్ట‌మైన రంగంలో రాణించే అవ‌కాశం ఉంటుంద‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా సాగుతున్న నేప‌థ్యంలో విద్యా శాఖ పుర‌పాల‌క శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ లేఅవుట్ల‌లో సామాజిక వ‌స‌తుల కోసం గుర్తించిన స్థ‌లాల్లో పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. క్వాలిటీ ఫుడ్, యూనిఫాంలు, పాఠ్య పుస్త‌కాలు అందిస్తుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నార‌ని.. డే స్కాల‌ర్స్‌కూ ఆ పాఠ‌శాల‌ల్లోనే అవ‌న్నీ అందించే విష‌యంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు ముఖ్యమంత్రి  సూచించారు
ప్రభుత్వ  పాఠశాలలో  విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం : సీఎం రేవంత్ Publish Date: Jun 13, 2025 9:32PM

తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారంపై న్యాయపోరాటం : లోకేష్

  తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తల్లికి వందనంలో రూ. 13 వేలు ఇచ్చి రూ. 2 వేలు నా ఖాతాలో పడ్డాయన్న ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలని  గతంలో మాదిరి భరించేది లేదు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు'. అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అటు, ఉపాధ్యాయుల బదిలీలు జూన్ 16 కల్లా పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువుతాం. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి.  తల్లికి వందనం అర్హులు ఎంత మంది ఉంటే అంత మందికీ లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు పథకాన్ని వర్తింప చేస్తున్నాం. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తాం'. అని లోకేష్ తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిల్లల తల్లులు తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.
తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారంపై న్యాయపోరాటం : లోకేష్ Publish Date: Jun 13, 2025 8:43PM

జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు

  తెలంగాణల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కానుందని తెలిపింది.  ఈ ఎన్నికల్లో అన్ని పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, అందుకోసం పార్టీలో కొత్త, పాత నేతలు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమిష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.  మరోవైపు సర్పంచ్ ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత వారం నుంచి రాష్ట్ర మంత్రులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఫోకస్ పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు
జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు Publish Date: Jun 13, 2025 8:10PM

ఏఐజీ ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

  బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగా గులాబీ బాస్  ఏఐజీ  ఆసుపత్రికి వెళ్లారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్‌కు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాధారణ గ్యాస్ట్రిక్ టెస్టులు చేసినట్లు వెల్లడించారు.  కాగా గతంలోనూ పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే.  
 ఏఐజీ ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు Publish Date: Jun 13, 2025 7:38PM

ఏసీబీ నోటీసులతో రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్‌ ఉందని.. తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.  తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు విచారణకు సహకరిస్తానంటూనే సీఎం  రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు. బాధ్యత గ‌ల పౌరుడిగా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతానన్న కేటీఆర్,  పాల‌న చేత‌గాక ప్రజ‌ల దృష్టి మ‌ళ్లించే య‌త్నం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.  ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి స‌వాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచార‌ణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ ప‌రీక్షల‌కు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? జ‌డ్జి స‌మ‌క్షంలో ఇద్దరం లై డిటెక్టర్ ప‌రీక్షలు చేయించుకుందాం. ఈ ప‌రీక్షల‌ను టీవీల్లో లైవ్‌గా చూపిద్దాం. లై డిటెక్ట‌ర్ ప‌రీక్షలు చూసి ఎవ‌రు నేర‌స్థులో ప్రజ‌లే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్ట‌ర్ ప‌రీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా..? రాష్ట్రం దివాళా తీసిందంటూనే ప‌దేప‌దే విచార‌ణ‌ల‌తో ప్రజాధ‌నం వృథా ఎందుకు..? ప్రజాధ‌నం వృథా ఎందుకు..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిల‌దీశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. లై డిటెక్టర్‌ పరీక్షలకు నేను సిద్ధం.. సీఎం సిద్ధమా? ఏసీబీ నోటీసులపై కేటీఆర్‌ స్పందించారు. ఫార్ములా-ఈ కేసులో ఈనెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ‘‘బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతా. పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం ఇది. ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్‌ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించుకుందాం. టీవీల్లో లైవ్‌గా చూపిద్దాం. లైడిటెక్టర్‌ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా? పదే పదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.  
ఏసీబీ నోటీసులతో రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు Publish Date: Jun 13, 2025 7:06PM

తుమ్మలను ఇరికించడానికి కుట్ర జరుగుతోందా?

  గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి . కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారుతోంది. తన మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసమో, కేసీఆర్‌ను ఇరికించడం ఇష్టం లేకో ఈటల రాజేందర్ .. అసలు తప్పే జరగలేని వాంగ్మూలం ఇచ్చారు. అన్నీ మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జరిగాయన్నారు.  మూడు బ్యారేజీలు కట్టాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులు. అందుకే ఆయన రియాక్ట్ అయి కౌంటర్ ఇచ్చారు, ఈటల వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆ ఉపసంఘం.. మూడు బ్యారేజీలు నిర్మించాలని ఎలాంటి సిఫారసులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వక ముందే.. మూడు ప్యారేజీల నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. అసలు కాళేశ్వరంకు కేబినెట్లో అనుమతి కూడా తీసుకోలేదని, కావాలంటే తానే కాళేశ్వరం కమిషన్ కు ఓ లేఖ రాస్తానని ప్రకటించారు. అవసరమైతే వాంగ్మూలం కూడా ఇస్తానన్నారు.బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.  బీజేపీ ఎంపీగా ఈటల ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల ఉన్నారు. అటు రాజేందర్ ను కేసీఆర్ అవమానకరంగా.. కుట్రలు చేసి మరీ పార్టీ నుంచి బయటకు పంపారు. తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. పంతం పట్టి తన సొంత జిల్లా ఖమ్మంలో బీఆర్ఎస్‌కు స్థానం లేకుండా చేశారు. కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ కేసీఆర్‌ను రక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తుమ్మలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వక్తమవుతోంది. కాళేశ్వరం విషయంలో కర్త, కర్మ , క్రియ కేసీఆర్ అనేది బహిరంగరహస్యం. ఆయనే ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈటల ఆయన కోసం తుమ్మలకు బురద అంటించాలని చూడటం విమర్శల పాలవుతోంది.
తుమ్మలను ఇరికించడానికి కుట్ర జరుగుతోందా? Publish Date: Jun 13, 2025 6:04PM

మాజీ సీఎం విజయ్ రూపాని కుటుంబ సభ్యులను పరామర్శించిన మోడీ

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ  శుక్రవారం పరామర్శించారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం  అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఉన్నత అధికారులతో  మోడీ  సమీక్షా సమావేశం నిర్వహించారు.  విమాన ప్రమాదంపై ఆరాతీశారు. ఫ్లైట్ టేకాఫ్, పైలట్ ఎమర్జెన్సీ కాల్, ప్యాసింజర్స్ అలర్ట్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. విమాన ప్రమాదానికి కారణమేంటన్నది త్వరగా తేల్చాలని ఆదేశించారు. ఈ తరువాత ఈ ఘోర విమాన ప్రమాదంలో మరణించిన  మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.    
మాజీ సీఎం విజయ్ రూపాని కుటుంబ సభ్యులను పరామర్శించిన మోడీ Publish Date: Jun 13, 2025 5:46PM

పేర్ని నానికి అరెస్ట్ భయం వెంటాడుతోంది : మంత్రి కొల్లు రవీంద్ర

  అరెస్ట్ భయంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడిని  గెలిపించుకోవడానికి నాని పడరాని పాట్లు పడ్డారని, నకిలీ పట్టాలు సృష్టించారని ఆయన అన్నారు. ఎమ్మర్వో ఆఫీసులో నకిలీ పట్టాలు రాస్తుంటే తాము పట్టుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్‌తో 2024లో ఎన్నికల ముందు సీఆర్‌జెడ్‌ భూముల్లో ఇళ్ల పట్టాలు ఎలా ఇప్పించారు? ఇది చట్టవిరుద్ధమని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టాయి" అని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.  గత ఐదేళ్లలో ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. "గత ఐదేళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, బందరు నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఓటమి తర్వాత కూడా బుద్ధి రాలేదు. అరెస్ట్ భయంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని ఒక బ్రోకర్‌లా వ్యవహరించారు" అని మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 పేర్ని నానికి అరెస్ట్ భయం వెంటాడుతోంది : మంత్రి కొల్లు రవీంద్ర Publish Date: Jun 13, 2025 5:40PM

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం..దొరికిన బ్లాక్ బాక్స్

  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్‌ ఇండియా విమానం  శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ డీవీఆర్‌ లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ఏటీఎస్‌ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. ‘ఇది ఒక డీవీఆర్‌. దీనిని మేం శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం ఇక్కడికి వస్తుంది’ అని ఏటీఎస్‌ అధికారి మీడియాతో అన్నారు. అయితే విమాన శిథిలాల్లో లభించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ డీవీఆర్‌ను పరిశీలించిన తర్వాత ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాదం గురించి కొంత సమాచారం తెలిసే అవకాశమున్నది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.  ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.  అయితే విమానం సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోవడంతో.. 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు . మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో మరో నలుగురు నేడు ప్రాణాలు విడిచారు. కాగా మరికొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న ఘటన జరిగినప్పటి నుంచి మరో మెడికో కనబడకుండా పోయారని అధికారులు పేర్కొన్నారు. 24 గంటలుగా ఆ విద్యార్థి ఆచూకీ లేదని, శిథిలాల కింద మరోసారి గాలిస్తామని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మెడీకోలతోసహ ఇప్పటి వరకు 269 మంది చనిపోయాన సంగతి తెలిసిందే.   
 అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం..దొరికిన బ్లాక్ బాక్స్ Publish Date: Jun 13, 2025 4:43PM

ఎట్ట‌కేల‌కు క‌మ‌ల్ హాస‌న్ ద ఎంపీ

తొలి నుంచి క‌మల్ హాస‌న్ ది  ద్ర‌విడ నాస్తిక వాదం. అది బై బ్ల‌డ్ అలా వ‌చ్చిందా అన్నది తెలీదు కానీ ఆయ‌న ద‌క్షిణాదిలోనే  ఏఎన్నార్ త‌ర్వాత  నాస్తిక‌వాదంలో అగ్ర‌గ‌ణ్యుడు. బేసిగ్గా సినిమాల్లో ఉంటే వారు త‌ప్ప‌క అప‌ర భ‌క్తులై ఉంటారు. ద‌ళితులైనా స‌రే భ‌క్తిపార‌వ‌శ్యంలో మునిగి  తేలుతుంటారు. ఉదాహ‌ర‌ణ ఇళ‌యారాజా, జేసుదాసు. జేసుదాసు మ‌రీ.. తాను హిందూ కాకున్నా ఇక్క‌డి దేవీ దేవ‌త‌లంటే విప‌రీత‌మైన  భ‌క్తి భావంతో ఉంటారు. ఆల‌యంలోకి రానివ్వ‌కున్నా  స‌రే ఆయ‌న.. బ‌య‌టే నిల‌బ‌డి గురువాయూర‌ప్ప‌ను విశేషంగా కొలుస్తుంటారు. అలాంటి ఫీల్డ్ లో ఉండి కూడా  తొలి నుంచి  క‌మ‌ల్ నాస్తిక వాదంతోనే ఉండేవారు. బేసిగ్గా క‌మ‌ల్ ది త‌మిళ బ్రాహ్మ‌ణ అయ్య‌ర్ కుటుంబం. తండ్రి శ్రీనివాస అయ్య‌ర్ న్యాయ‌వాది. ఆయ‌న కూడా అంతే. త‌న పిల్ల‌లంద‌రికీ హాస‌న్ అనే ముస్లిం నేమ్ పెట్ట‌డంలోనూ ఇదే విప్ల‌వాత్మ‌క ధోర‌ణి. త‌న ముస్లిం ఆప్త‌మిత్రుడి జ్ఞ‌ప‌కార్ధంగా ఆయ‌న త‌న పిల్ల‌ల‌కు హాస‌న్ అన్న పేరు పెట్టిన‌ట్టుగా చెబుతారు. అందుకే చారు హాస‌న్, క‌మ‌ల్ హాస‌న్ అన్న పేర్లు. ఇవే ల‌క్ష‌ణాల‌ను పుణికిపుచ్చుకున్న క‌మ‌ల్ ర‌జ‌నీకి ఎంతెంతో భిన్నం. త‌మిళ‌నాట నెత్తికి ఎంతగా విభూతి ప‌ట్టీలు పెట్టుకున్నా స‌రే ద్ర‌విడ వాదం వినిపిస్తేనే రాజ‌కీయాల్లో రాణించ‌గ‌లం. క‌న్న‌డ బార్న్, మ‌రాఠా బేస్డ్ ర‌జ‌నీ.. త‌న‌ది ఆధ్యాత్మిక రాజ‌కీయ‌మ‌ని అన్నారు. అయినా స‌రే ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాలేక ఆమ‌డ దూరంలోనే ఆగిపోయారు. అదేమంటే ఆరోగ్య స‌మ‌స్య‌లుగా చెప్పారు. అదే క‌మ‌ల్ గెలిచినా ఓడినా  ముందుకైతే దూకేశారు. కోయంబ‌త్తూరులో ఒక మ‌హిళ చేత ఓడిపోయారు కూడా.  అలాగ‌ని రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారా అంటే లేదు. మొన్న‌టికి మొన్న క‌న్న‌డ భాష‌కు సంబంధించిన సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ.. మ‌క్క‌ల్ నీతి మ‌య్యం... అంటే ప్ర‌జ‌ల నీతి కోసం పుట్టిన పార్టీ. ఇక్క‌డ నీతి న్యాయం అందివ్వ‌డ‌మే త‌న ధ్యేయం. ఏది నిజ‌మో అదే మాట్లాడుతానంటూ స్ట్రైట్ ఫార్వ‌ర్డ్ నెస్ ని ఫాలో అవుతున్నారు. గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్ ద‌క్షిణాదిలో అన్ని  రాష్ట్రాలు ద్ర‌విడ వాదం గొడుగులోకి రావాల‌ని పిలుపునిచ్చారు. ఇక్క‌డి భాష‌లు కూడా తెలుగు- త‌మిళ‌- మ‌ల‌యాళ‌- క‌న్న‌డ అంటూ అన్నీ ద్ర‌విడ భాష‌లే అంటూ ద‌క్షిణాది భావ‌న రెచ్చ‌గొట్టే య‌త్నం చేశారు. దానికి తోడు ద్ర‌విడ మున్నెట్ర క‌గ‌జం పార్టీకి రాజ్య‌స‌భ‌లో అంత పెద్ద క‌ళా సాహిత్య రంగాల‌కు చెందిన నాయ‌క‌త్వం లేదు. పార్టీ వాయిస్ కానీ ద‌క్షిణాది వాయిస్ గానీ వినిపించేంత గొప్ప లీడ‌ర్షిప్ లేదు. ఇప్ప‌టికే కేంద్రంతో భాషా గొడ‌వ‌ల నుంచి, నీట్, రూపాయి గుర్తు వంటి ఎన్నో స‌మ‌స్య‌లున్నాయి. ఇలాంటి వాటికి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిగ‌ర్ అయిన క‌మ‌ల్ హాస‌న్ అయితే ఇటు పార్టీకి కూడా అండ‌గా ఉంటార‌ని డీఎంకే భావిస్తున్నది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య్, అన్నాడీఎంకే, బీజేపీలు ఏక‌మై ముందుకెళ్లే పరిస్థితి ఉంది. క‌రుణానిధి చనిపోయాకు డీఎంకేకి ఒక సినిమాప‌ర్స‌నాల్టీ లేదు. అటు అన్నాడీఎంకేకి విజ‌య్ ఎలా తోడు అవుతున్నారో.. ఇటు క‌మ‌ల్ ద్వారా డీఎంకేకి ఒక సినీ  ముఖ చిత్రం ఉండ‌టం మంచిదిగా భావించిన స్టాలిన్ ఈ దిశ‌గా క‌మ‌ల్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చిన‌ట్టు తెలుస్తోంది.. ఏది ఏమైనా సొంత పార్టీ ద్వారా సాధించ‌లేనిది.. సొంత ద్ర‌విడ   విధానం ద్వారా ఏంపీ కాగ‌లిగిన‌ క‌మ‌ల్ హాస‌న్ కి శుభాకాంక్ష‌లు
 ఎట్ట‌కేల‌కు క‌మ‌ల్ హాస‌న్ ద ఎంపీ Publish Date: Jun 13, 2025 4:07PM

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

  ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం జూన్ 16న  10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ అధికారంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. రాజధాని నగరం హైదరాబాద్ నడిబొడ్డున ఓవైపు హుస్సెన్ సాగర్, మరోవైపు కొత్త సచివాలయం మధ్య ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల మేర ఈ కారు రేస్ సాగింది.  ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డును సంసిద్దం చేసారు. ఫిబ్రవరి 11, 2023 లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు  అసెంబ్లీ ఎన్నికల వేళ అక్టోబర్ 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవో కు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని అంటోంది. అంతేకాదు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బిఐ నిబంధనలు పాటించలేరని తమ విచారణలో తేలినట్లు చెబుతోంది.
కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు Publish Date: Jun 13, 2025 3:46PM

అమెరికా ఆర్మీడేకి చీఫ్ గెస్ట్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

భార‌త్ కి దౌత్య‌ప‌ర‌మైన దెబ్బ‌.. కాంగ్రెస్ ఆందోళన  పాక్ అమెరికా లు  సంప్ర‌దాయ మిత్ర దేశాలు. అయితే  911 దాడుల త‌ర్వాత  పాక్ కి దూరం జ‌రుగుతూ వ‌చ్చింది అమెరికా.  అప్ప‌ట్లో జార్జి బుష్ కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడ‌దే సీన్ రిపీట్ అవుతూ వ‌స్తోంది. మీకు తెలుసో తెలీదో గానీ మునీర్ కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయ్.  ట్రంప్ పిల్ల‌ల‌కు చెందిన వ‌ర‌ల్డ్ లిబ‌ర్టీ ఫైనాన్షియ‌ల్ అనే బిట్ కాయిన్ సంస్థ తో మునీర్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ ఒప్పంద ప‌త్రాల మీద సంత‌కాలు చేసింది. ఈ సంస్థ పాక్ భూభాగం కేంద్రంగా బిజినెస్ చేస్తోంది. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరిందో తెలిస్తే ఎవరైనా సరే షాక్ కాక తప్పదు. ఒక ప‌క్క పాక్,  భార‌త్ మధ్య  భీక‌ర‌మైన యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డి ఉన్న స‌మ‌యంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ మాట‌కొస్తే ప‌హెల్గాం దాడుల‌కూ మునీర్ వ్యాఖ్య‌ల‌కు సంబంధ‌ముంద‌ని అంటారు కాంగ్రెస్ క‌మ్యూనికేష‌న‌ల్ హెడ్ అయిన జైరామ్ ర‌మేష్. మునీర్ రెచ్చ‌గొట్టిన త‌ర్వాతే ఉగ్ర‌వాదులు కాశ్మీర్ లో రెచ్చిపోయి 26 మందిని హ‌తం చేశారు.  ఇప్పుడు కాశ్మీర్ ప‌ర్యాట‌కం లేక విల‌విల‌లాడుతోంది.  దానికి తోడు ఆ స‌మ‌యంలో అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ సైతం భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.  వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఈ దాడిలో ఇన్ డైరెక్టుగా అమెరికా  పాత్ర ఉన్న‌ట్టు కూడా అనుమానించాలి.  మొన్న ఇదే మునీర్ ఏదో సాధించేసిన‌ట్టు.. అత‌డికి ఫీల్డ్ మార్ష‌ల్ ప‌ద‌వినిచ్చి స‌త్క‌రించింది పాకిస్తాన్. ఇప్పుడు చూస్తే అమెరికా ఆర్మీ పెరెడ్ కి మునీర్ కు అనూహ్య ఆహ్వానం. దీనంత‌టి వెన‌క అస‌లేం న‌డుస్తోందన్నది స‌స్పెన్స్ గా మారింది. ఈ ఆర్మీడే ఆహ్వానానికి ముందు యూఎస్ జ‌న‌ర‌ల్ ఒక‌రు పాకిస్తాన్ ను  ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌లో అత్యుత్త‌మ భాగ‌స్వామిగా అభివ‌ర్ణించ‌డం కొస‌మెరుపు. అంతే కాదు రెండేళ్ల‌లో ఈ ఇద్ద‌రు.. అంటే    అమెరికా, పాక్ జ‌న‌ర‌ల్స్ మూడు సార్లు క‌లిసిన‌ట్టు రిపోర్టులున్నాయి.  హ‌ఫీజ్ స‌యీద్, మ‌సూద్ అజ‌ర్ వంటి వ‌ర‌ల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ట్రెర్ర‌రిస్టుల‌కు ర‌క్ష‌ణ, శిక్ష‌ణ‌తో పాటు వారి కోసం నిధుల సేక‌ర‌ణ కూడా చేసే పాక్ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌లో భాగ‌స్వామి ఎలాగ‌య్యిందో అమెరికాకు తప్ప ఇంకెవ‌రికీ అర్ధం కాదు. గ‌తంలో ఇదే పాక్ ర‌క్ష‌ణ మంత్రి తాము గ‌తంలో యూఎస్ కోసం ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఎన్నో చెత్త ప‌నులు చేసిన మాట వాస్త‌వం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ ఏ కొత్త చెత్త ప‌నులు యూఎస్ కోసం పాక్ చేస్తుందో అర్ధంకాని అగ‌మ్యగోచ‌రం.  ఇక్క‌డ పాకిస్థాన్ ఉచ్చులో అమెరికా చిక్కిందా.. లేక అమెరికా ఉచ్చులో పాక్ చిక్కిందా? అన్న‌దొక స‌స్పెన్స్. గ‌ త కొంత కాలం నుంచి పాకిస్థాన్ కి ఏకైక ఆర్ధిక ఆద‌రవు చైనా. చైనా పాక్ భూభాగాన్ని ఆశించి.. చైనా పాక్ కారిడార్ పేరిట ఒక ప్ర‌పంచ ర‌హ‌దారి నిర్మాణం చేయ‌డ‌మే కాదు.. హైబ్రిడ్ రోడ్లు, సీపోర్టులు, ఎయిర్ పోర్టులు నిర్మిస్తోంది.  అయితే బ‌లూచిస్తాన్ స్వేచ్చా పోరాటం చేయ‌డంతో పాటు త‌మది స్వతంత్ర దేశమని  ప్ర‌క‌టించుకుంది. ఆ దేశం గానీ రేప‌టి  రోజున అధికారికంగా పాక్ నుంచి డిటాచ్ అయితే చైనాతో పాక్ సంబంధాలు పూర్తిగా  చెడిపోయే ప‌రిస్థితి. ఇప్ప‌టికే బ‌లూచీలు త‌మ భూభాగంలోని చైనీయుల‌ను త‌రిమి త‌రిమి కొడుతున్నారు. ఈ  సిట్యువేష‌న్లో చైనా కూడా ఆలోచ‌న‌లో ప‌డింది. దానికి తోడు సింధ్ లో నీటి క‌ట‌క‌ట  కార‌ణంగా  ఏకంగా హోం మంత్రి ఇంటికే నిప్పు పెట్టిన ప‌రిస్థితి. ప‌రిస్థితులు ఎంత మాత్రం స‌జావుగా లేక పోవ‌డంతో.. మునీర్ నాయ‌క‌త్వంలో అమెరికాకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా ప‌థ‌క  ర‌చ‌న చేసింది పాక్. అంతే కాదు అమెరికాకు కూడా పాక్ సాయం అవ‌స‌రం.  కార‌ణ‌మేంటంటే చైనాతో యూఎస్ విప‌రీతమైన వాణిజ్య యుద్ధం చేస్తోంది. అందులో భాగంగా  చైనా ఇటీవ‌ల అరుదైన ఖ‌నిజాల‌ను అమెరికాకు స‌ర‌ఫ‌రా చేయ‌డాన్ని ఆపేసింది. దీంతో అమెరికా చైనాను క‌ట్ట‌డి చేయ‌డానికంటూ పాక్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటోందని తెలుస్తోంది. అందుకే వ‌ద్ద‌న్నా ఐఎంఎఫ్ లోన్లు, వ‌ర‌ల్డ్ బ్యాంకు అప్పులు పాక్ కి ఇప్పిస్తోంది అమెరికా. దానికి తోడు మునీర్ కి కూడా ఏదో ఒక  అగ్ర‌దేశం అండ కావాలి. వారి ద్వారా దేశాన్ని ముందుకు న‌డ‌పాల్సిన  ప‌రిస్థితి  ఉంది. భార‌త్  ఇటు బలూచీల‌ను రెచ్చ‌గొడుతూ.. అటు   ఆఫ్ట‌న్ల‌తో చెలిమి చేస్తోంది.  దీంతో అన్ని  ర‌కాలుగా తిరిగి అమెరికాకు ద‌గ్గ‌ర‌వ్వ‌డ‌మే ల‌క్ష్యంగా పాక్ పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మునీర్ కు అమెరికా ఆర్మీడేకు ఆహ్వానం అన్నది దౌత్య ప‌రంగా  భార‌త్ కి భారీ ఎదురుదెబ్బ‌ అంటోంది కాంగ్రెస్.  ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే పాక్ డ‌యాస్పోరా సైతం ఈ ఆహ్వానానికి వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే పాక్ మాజీ  ప్ర‌ధాని ఇమ్రాన్ పార్టీ అమెరికాలోని పాక్ ఏంబ‌సీ ముందు నిర‌స‌న  కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. అమెరికాతో ఏ ఒప్పంద‌మైనా స‌రే పాక్ కి న‌ష్ట‌మేనంటోంది ఇమ్రాన్ పార్టీ. ఇన్నేసి  దుశ్శ‌కునాల  మ‌ధ్య అసీం  మునీర్ ఏం సాధిస్తాడో తెలియాల్సి ఉంది. ఇక్క‌డో మ‌రో గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే..  అమెరికా  జూన్ 14న త‌న 250వ ఆర్మీడే జరుపుకుంటోంది.. సరిగ్గా అదే రోజు ట్రంప్ 79వ బ‌ర్త్ డే కూడా. దానికీ మునీర్ హాజ‌ర‌వుతున్నాడు. స‌రే.. మ‌రి  అమెరిక‌న్ సోల్జ‌ర్స్ ని ఉద్దేశించి ఆయ‌నెలా వారికి ప్రేర‌ణ‌గా  నిలుస్తాడ‌న్న‌ది అర్ధం కావ‌డం లేదెవ‌రికీ. కార‌ణ‌మేంటంటే ప్లాన్స్ లేవు- ప్రేయ‌ర్స్ త‌ప్ప అంటూ ఆప‌రేష‌న్ సిందూర్ లో చేతులెత్తేసిన మునీర్ వీరికెలా ఇన్ స్పిరేష‌న్ అవుతాడో అర్దం కాక బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు ఒక్కొక్క‌రూ.
అమెరికా ఆర్మీడేకి  చీఫ్ గెస్ట్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ Publish Date: Jun 13, 2025 3:45PM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

  జనగామ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్‌ తెలుసుకున్నారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.  శస్త్ర చికిత్స అనంతరం తొందరగానే కోలుకుంటున్నట్లుగా కేటీఆర్‌తో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నాయకులు ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం ఎర్రవల్లి వ్యవసాయ క్షేతంలోని బాత్‌రూంలో జారిపడటంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎడమ కాలి తొడ ఎముక ఫ్రాక్చర్‌ అయిన సంగతి తెలిసిందే.  
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌ Publish Date: Jun 13, 2025 3:17PM

కవిత దారెటు.. ఈ ప్రశ్నకు బదులేది?

సరదాగా.. కొంచే కామెడీ..గా అయితే.. బాలయ్య బాబులా... సరే.. సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి?’ అనుకోవచ్చు.  కాదూ..  కూసింత సీరియస్’గా చెప్పుకుందామంటే, రజనీకాంత్ చెప్పిన  అతిగా ఆశ పడే ఆడది.. ఆతిగా ఆవేశ పడే మగాడు సుఖ పడినట్లు చరిత్రలో లేదు  అన్న డైలాగు  గుర్తు చేసుకోవచ్చు.  అవును..  మన ఇప్పుడు మాట్లాడు కుంటున్నది  బీఆర్ఎస్ లో తిరుగు బావుటా ఎగరేసిన   ఎమ్మెల్సీ,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె  కల్వకుంట్ల కవిత గురించే.  నిజానికి..  కవిత మనసులో ఏముందో అప్పుడే కాదు.. ఇప్పటికీ అంటూ ఈరోజుకు కూడా ఎవరికీ తెలియదు. అందుకే..  ఆమె  ఏదో ఉహించుకుని అడుగు ముందుకు వేశారా.. లేక అత్యాశకు పోయి గడప  దాటారా? అనేది ఒక విధంగా ఈ రోజుకూ  శేష ప్రశ్నగానే ఉందని అంటున్నారు. అలాగే..  అమెది తిరుగు బాటు కాదు..  కేసీఆర్ వ్యూహంలో భాగమనే ప్రచారం కూడా జరుగుతోంది.    అయితే..  రెండు రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు ఎదురు వెళ్ళిన   కవితను కంటి సైగతోనే  కేసీఆర్ దూరంగా ఉంచిన వైనం  గమనిస్తే..  కవిత ప్రవర్త కేసీఆర్ ను గట్టిగా హర్ట్ చేసిందనీ,  ఆమె పట్ల కేసీఆర్   నిజంగానే చాలా   కోపంగా ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైం దని అంటున్నారు. నిజానికి  అందరికీ మరీ ముఖ్యంగా కవితకు  తమ స్థానం ఏమిటో అర్థం అవడం కోసమే కేసీఆర్  అందరి ముందూ కవితను దూరం పెట్టారని అంటున్నారు. అలాగే  ఆమె ఎవరిని  దేవుడి చుట్టూ చేరిన దయ్యాలు గా పేర్కొన్నారో వారు అదే స్థానాల్లో అలాగే ఉన్నారు. కేసీఆర్ వారికి ముందు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇచ్చారు. ఇస్తున్నారనే విషయం కూడా విచారణ క్రమంలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.   అంటే..  గతంలో తామే గులాబీ జెండా నిజమైన యజమానులమంటూ చిన్నపాటి ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈటల రాజేందర్ తదితర నాయకుల పట్ల వ్యహరించిన తీరుగానే  కవిత విషయంలోనూ కేసీఆర్ కఠిన వైఖరి కొనసాగిస్తారని అనుకోవచ్చని అంటున్నారు.ఈ నేపధ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు  ఏమిటనేది  ప్రశ్నగా మారిందని అంటున్నారు. నిజానికి..  కవితకు ఇప్పటికే పరిస్థితి అర్థమైందనీ  అందుకే ఆమె  తండ్రికి దగ్గరయ్యేదుకు   ప్రయత్నాలు చేస్తున్నట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్  కు కాళేశ్వరం కమిషన్  నోటీసు ఇవ్వడాన్ని  ప్రశ్నిస్తూ..  ‘జాగృతి’ బ్యానర్ పై నిరసన ప్రదర్శన  నిర్వహించడం  పిలుపు లేకుండానే పలకరించేందుకు ఫార్మ్ హౌస్ కు వెళ్ళడంతో పాటుగా..  ఇతర చానల్స్ ద్వారా కూడా  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇంత వరకు అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రానట్లు తెలుస్తోంది. అదే సమయంలో..  ఇప్పటికిప్పుడు పార్టీ పరంగా కవిత పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోక పోవచ్చని అంటున్నారు. అలాగే..  పార్టీ పెట్టే అవకాశం గానీ వేరే పార్టీలో చేరే పరిస్థితి కానీ  కవితకు లేదని అంటున్నారు.  ముఖ్యంగా  తాను కాంగ్రెస్ పార్టీలోఉన్నంత వరకు కేసీఆర్  ఫ్యామిలీలో ఎవరినీ కాంగ్రెస్  లో చేర్చుకునే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపధ్యంలో కాంగ్రెస్  తలుపులు కవితకు మూసుకున్నట్లే అంటున్నారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనక్కరలేదు.  సో .. కవిత రాజకీయ భవిష్యత్ ఏమిటి ? ఆమె మరో షర్మిల అవుతారా ? లేక ఏదో దారిన ఫార్మ్ హౌస్ కు చేరతారా? కవిత దారెటు .. ఈ ప్రశ్నకు బదులేది?
కవిత దారెటు.. ఈ ప్రశ్నకు బదులేది? Publish Date: Jun 13, 2025 3:16PM

విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు విశ్వాస్ కీలక ప్రకటన

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ కీలక ప్రకటన సమాచారం వెల్లడించారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని ఆయన వెల్లడించారు. నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదని అని విశ్వాస్‌ కుమార్‌ వెల్లడించారు.  చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు అయ్యాయి. వాటినుంచి కోలుకుంటున్న ఆయన తాజాగా డీడీ న్యూస్‌ మీడియాతో మాట్లాడారు. విమాన భాగం విడిపోయి మెడికోల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌పై పడింది.  ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు రాగానే మంటలు అంటుకున్నాయి. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాని ఆయన తెలిపారు. ఎవరో నన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరిలించారు అని మీడియాతో తెలిపారు. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ప్రయాణికుడిని శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్‌కుమార్‌.. గుజరాత్‌లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలోని 11-ఏ సీటులో విశ్వాస్‌ కుమార్‌ కూర్చున్నారు.
విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు విశ్వాస్ కీలక ప్రకటన Publish Date: Jun 13, 2025 2:50PM

కేసీఆర్ విచార‌ణ ఇలా.. అప్పట్లో బాబు విచారణ అలా?

ఎలా అర్ధం చేసుకోవాలి గురూ!  మొన్నామ‌ధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వ‌చ్చి ఆయ‌న బంధువుల‌ను ప‌ర‌మార్శించిన విష‌యం గుర్తుందా?  అప్పుడు కేసీఆర్ ఎంత ప్ర‌శాంతంగా ఉన్నారో.. ఇప్పుడు కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన‌పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీడియా క‌ళ్ల‌న్నీ కేసీఆర్ పైనే. కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియానూ చూడ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి బైట్ ఇవ్వ‌లేదు. ఎలాంటి యాక్టివిటీ లేదు. కమిషన్ ఎదుట హాజరైయ్యారు. వెళ్లారు. వాళ్లు అడిగింది. కేసీఆర్ చెప్పింది. రికార్డుల్లో భ‌ద్రంగా ఉంటుందేమోగానీ కేసీఆర్ హావ‌భావాలు ఏమంత తోట్రు పాటుకు గురైన‌ట్టు క‌నిపించ‌లేదు. అధికారం నుంచి దిగినోళ్ల‌కి ఇదంతా స‌హ‌జంర భ‌య్ అంటా ఒక ఈవెంట్ కి వ‌చ్చిన‌ట్టు వచ్చి వెళ్లిపోయారాయ‌న‌.  అదే ఏపీలో చంద్ర‌బాబు విచార‌ణ స‌మ‌యంలో న‌రాలు తెగే ఉత్కంఠ‌. ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం నుంచి కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌డం ద‌గ్గ‌ర వ‌ర‌కూ హై టెన్ష‌న్. ఆపై జైలుకు పంప‌డం వ‌ర‌కూ ఒక సుదీర్ఘ‌మైన ఉత్కంఠ భ‌రిత‌మైన వ్య‌వ‌హారం. ఈ మొత్తం మూడు నాలుగు ఎపిసోడ్లుగా సాగింది. ఎంతో ఎగ్జైట్ మెంట్ న‌డిచింది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న ఒక కుర్చీలో ఒంట‌రిగా కూర్చుని ఆలోచిస్తున్న పోజ్ అయితే బాబు అభిమానుల‌ను, టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ను ఒక  ఊపు ఊపేసింది. తీవ్ర స్థాయిలో చ‌లించిపోయారంతా. బాబుకేమి జ‌రుగుతుందో అన్న ఆందోళన అప్పట్లో వ్యక్తమైంది.  అప్ప‌ట్లో బాబు ఆయ‌న అరెస్టు విచార‌ణ జైలు జీవితం అదో పెద్ద చ‌ర్చ‌.   అదే ఇక్క‌డ కేసీఆర్.. వ‌చ్చారు వెళ్లారు. అంతే మ‌ధ్య‌లో ఎలాంటి హైడ్రామా లేదు. ఒక ప‌క్క కుమార్తె గుడ్ మార్నింగ్ డాడీ అని ప‌ల‌క‌రించే య‌త్నం చేస్తే ఆగు అన్న‌ట్టు సైగ చేశారు త‌ప్పించి.. ఆమెతో క‌నీసం మాట్లాడ‌లేదు. ప్ర‌భుత్వ ప‌రంగా కూడా కేసీఆర్ ని మ‌రీ ఇబ్బంది పెట్టే య‌త్నం చేసిన‌ట్టు కూడా క‌నిపించ‌లేదు.బ‌హుశా కేసీఆర్ ని అంత‌క‌న్నా మించి ట‌చ్ చేయొద్ద‌ని రేవంత్ స‌ర్కార్ అనుకుందో ఏమో. మ‌ధ్య‌లో ఎలాంటి తోట్రుపాటు, త‌డ‌బాటు ఏదీ లేదు. అంటే అక్క‌డికి ఇక్క‌డికీ హై డ్రామాలో ఎంత మార్పు? ఇది ప్రాంతాల వారీగా ఉన్న తేడానా? లేక నాడు జ‌గ‌న్ చంద్ర‌బాబును వేధించినంత‌గా.. నేడు రేవంత్ స‌ర్కార్ కేసీఆర్ ని ఇబ్బంది పెట్ట‌డం లేద‌నుకోవాలా? ఎక్క‌డో ఎమోష‌న‌ల్ డ్రామా మిస్ అవుతోంద‌ని అంటున్నావాళ్లు లేక పోలేదు. ఒక్క క‌విత  నుంచి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామాకు తెర‌లేప‌డం త‌ప్ప‌.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌నంలో కేసీఆర్ ప‌ట్ల రేవంత్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై క‌నీస స్పంద‌న లేదు. ఈ విష‌యంలోని విభిన్న‌త గుర్తించిన చాలా మంది నాటి చంద్ర‌బాబు విచార‌ణ‌- నేటి కేసీఆర్ విచార‌ణ‌కు పోలిక తెస్తున్నారు. అంత హై డ్రామా లేదిక్క‌డ అంటూ కేసీఆర్ విచార‌ణా ప‌ర్వాన్ని ఒకింత తేల్చేసిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఆయ‌న కూడా ఏదో ఒక ఈవెంట్ కి వ‌చ్చిన‌ట్టు వ‌చ్చి వెళ్లిపోవ‌డంతో అదే క‌రెక్ట్ అనుకుంటున్నారు.
కేసీఆర్ విచార‌ణ ఇలా.. అప్పట్లో బాబు విచారణ అలా? Publish Date: Jun 13, 2025 2:07PM

కొమ్మినేనికి బెయిలు మంజూరు చేసిన సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. రాజధాని మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో  సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంను ఆశ్రయించారు. ఆయన బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం (జూన్ 13) విచారణ జరిపి బెయిలు మంజూరు చేసింది. దీంతో సుప్రీంలో కొమ్మినేనికి భారీ ఊరట లభించినట్లైంది. అయితే బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు కొమ్మినేనికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అమరావతిపై మరోసారి అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించింది.   అదే సమయంలో ప్రభుత్వంపైనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని పేర్కొంటూ నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని సుప్రీం ప్రశ్నించింది.   ఒక చానెల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  వాటని ఖండిచకుండా కొమ్మినేని చర్చను కొనసాగించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అమరావతి మహిళలు కొమ్మినేని, కృష్ణంరాజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.
కొమ్మినేనికి బెయిలు మంజూరు చేసిన సుప్రీం కోర్టు Publish Date: Jun 13, 2025 1:07PM

జగన్ ఇమేజ్ డ్యామేజ్!?

వైసీపీ అధినేత జగన్  సమయం సందర్భం లేకుండా ప్రదర్శిస్తున్న దూకుడు విమర్శలపాలవుతోంది. వాస్తవానికి పార్టీ ఓటమి తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే అరుదైపోయింది. ఇటీవల తెనాలిలో దళిత యువకుల పరామర్శ పేరుతో బయటకు వచ్చి వైసీపీని మరింత డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అలాగే తన   సొంత మీడియాలో అమరావతి మహిళలపై కొమ్మినేని, కృష్ణంరాజులు చేసిన చర్చపై జగన్ స్పందించిన తీరు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారిందని వైసీపీ శ్రేణులే వాపోతున్నాయంట. గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లంతా గంజాయి బ్యాచ్ అనీ, ఆ మత్తులో కానిస్టేబుల్‌పై దాడి  కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. అందుకనే  పోలీసులు ఆ విధంగా  దండించాల్సి వచ్చిందని స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే వాళ్లు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులనీ, దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని వైసీపీ విమర్శిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ హుటాహుటిన ఆ యువకుల పరామర్శ పేరుతో తెనాలి వెళ్లారు. అయితే అసలు ఆ ఘటనలో నిజానిజాలు ఏంటో తేలకుండా ఎందుకు  అంత హడావుడిగా వెళ్లారనేది  అంతుపట్టకుండా తయారైంది. పైగా వెంటనే టిడిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో  డాక్టర్ సుధాకర్ అంశం తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయనకు పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేదాకా పరిస్థితి తీసుకొచ్చారని  అప్పటి జగన్ ప్రభుత్వంపై దాడి మొదలైంది.  మరో వైపు తెనాలిలో జగన్ చేసిన ప్రసంగంలో  కూడా  స్పష్టత లేకుండా పోయింది.  నిజానికి ఇలాంటి అంశాల్లో  ప్రతిపక్ష పార్టీలు ముందుగా ఒక బృందాన్ని పంపించడమో..  నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడమో రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోంది.  పోలీసులపై చట్టపరమైన చర్యలు, ఆ యువకులపై ఉన్న కేసులు విషయం పక్కన పెడితే  .. ఆ ముగ్గురి విషయమై స్థానికులు   నెగిటివ్ గానే  చెప్తున్నారు. ఆ క్రమంలో తెనాలి పర్యటన  జగన్‌కు కానీ,  వైసిపికి కానీ రాజకీయంగా ఏ విధంగానూ లాభించక పోగా నెగిటివ్ అయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయంట.  ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి  ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కూటమి గెలిచిన జూన్ 4వ తేదీని  వెన్నుపోటు దినంగా నిర్వహించాలని  రాష్ట్ర వ్యాప్త నిరసనలకు జగన్ పిలుపు ఇచ్చారు. పార్టీ శ్రేణులన్నీ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన మాటతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  ఆ రోజున కీలక నేతలు అందరూ  వైసీపీ శ్రేణులతో కలిసి  నిరసనలు జరిపారు . బొత్స లాంటి సీనియర్ నేత కూడా  నిరసన చేస్తూ ఎండ వేడి తట్టుకోలేక నిరసన కార్యక్రమంలోనే సొమ్మసిల్లారు.  2024 ఎన్నికల తర్వాత  ఏడాది కాలం లో వైసీపీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.  వైసీపీ కార్యకర్తలు, అభిమానులు  నెన్నుపోటు దినం నిరసనల్లో పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ఈ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన  జగన్ మాత్రం   బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి ముందుగా షాక్ తిన్నది వైసిపి శ్రేణులే. బహిరంగంగా వాళ్ళు చెప్పకపోయినా పార్టీ పరంగా నిర్వహించిన అంత ముఖ్యమైన కార్యక్రమంలో  పార్టీ అధ్యక్షుడు పొల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోవడం పట్ల వైసీపీ వర్గాలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయంట. అలా మళ్లీ జగన్ జనంలో నెగిటివ్ అయ్యారంటున్నారు.   ఇక లేటెస్ట్ కాంట్రవర్సీ  రాజధాని అమరావతి  దేవతల రాజధాని కాదంటూ  రాయలేని భాషలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు  వ్యాఖ్యానించారు.  ఆ షోకి యాంకర్ గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్  కొమ్మినేని శ్రీనివాసరావు మద్దతు ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అది  ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది.  ఆల్రెడీ కొమ్మినేనిని, కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు.  మొదటినుంచి మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగన్ అన్నట్లు అమరావతి ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నెమ్మదిగా రాజధాని ప్రాంతంలో బలం పెంచుకోవడానికి వైసిపి ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం కచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. అయితే వైసీపీ నేతలు మాత్రం సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా  సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అటు ఛానల్ పైన ఇటు ఆ జర్నలిస్టుపైనా అందరూ విరుచుకుపడుతున్నారు.  మహిళలకు క్షమాపణ చెప్పడం మాని కొమ్మినేని అరెస్టును జగన్ తప్పుపడుతున్నారు. ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ టూగా ఫోకస్ అవున్న సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి మహిళలను మళ్లీ టార్గెట్ చేస్తున్నారు. కొమ్మినేని, కృష్ణంరాజుల డిస్కషన్‌పై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకర జాతి, పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంకర జాతి వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన మహిళల త్యాగాలను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  అమరావతి రాజధాని విషయంలో వైసీపీ రాజకీయ కోణం అందరికీ తెలిసిందే కానీ .. ఆ అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసిపి ముఖ్యులు దారుణంగా ఫెయిల్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి జగన్ అనాలోచితంగా ప్రదర్శిస్తున్న దూకుడు పార్టీ ప్రతిష్టాను మరింత దిగజార్చుతోందని ఆ పార్టీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.
జగన్ ఇమేజ్ డ్యామేజ్!? Publish Date: Jun 13, 2025 12:37PM

జూబ్లీ ఉప పోరుకు వ్యూహాలు రెడీ !

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో..  దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటించేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత, బీఆర్ఎస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఇటీవల కంటోన్మెంట్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.  సో.. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్‌ నియోజక వర్గంలోనూ త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి.. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్  సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.   ముఖ్యంగా  కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీ హిల్స్  సీటును కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వంక బీఆర్ఎస్  సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. వరసగా మూడుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీకి, పార్టీ కంటే మిన్నగా,పార్టీ అధినేత కేసీఆర్ కు ఉన్నఅనుబంధం దృష్ట్యా..  నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నట్లు చెపుతున్నారు. మాగంటి సతీమణి సునీతను బరిలో దించి గెలిపించుకోవాలని, ఇప్పటికే కేసీఆర్ ముఖ్య నాయకులను ఆదేశించినట్లు చెపుతున్నారు. అయితే..  ఆమె పోటీకి సుముఖంగా ఉన్నారా, లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదని పార్టీ వర్గాల సమాచారం.  ఒక వేళ ఆమె పోటీకి సుముఖంగా లేకుంటే..   కేసీఆర్ కుటుంబం నుంచే మరో మహిళను పోటికి దించే ఆలోచన ఉందంటున్నారు.  అయితే.. కేసీఆర్ అందుకు అంగీకరించక పోవచ్చని కూడా చెబుతున్నారు.   మరోవంక.. కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్  స్ట్రాటజీ నే జూబ్లీ హిల్స్  లో రీప్లే  చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు.  ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి  ఓటమిపాలయ్యారు. అయితే..  నాగేందర్  ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఉడుతుందా అనేది తేలకుండా వుంది. అది వేరే సంగతి.  కంటోన్మెంట్ కు అదనంగాజూబ్లీహిల్స్‌ సీటునూ గెలుచుకుని హైదరాబాద్‌లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు అండతో గెలిచే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఇక్కడి నుంచి  పోటీ  చేసి ఓడిపోయినా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లేదా గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీచేసిననవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చి, ఎంఐఎం మద్దతుతో ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ నాయకత్వం లెక్కలు వేస్తునట్లు చెపుతున్నారు.  ఇక బీజేపీ విషయానికి వస్తే..  ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన    కూటమి ప్రయోగాన్ని  తెలంగాణాలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా  భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి..  మాగంటి గోపీనాథ్   టీడీపీ ప్రోడక్ట్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆతర్వాత.. మారిన పరిస్థితుల కారణంగా  2016లో బీఆర్ఎస్ లో చేరి వరసగా 2018, 2023 ఎన్నికల్లో విజయ సాధించారు. అయినా..  తెలుగు దేశం పార్టీతో, ముఖ్యంగా చంద్రబాబు నాయు డుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి. అందుకే..  మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు మాగంటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో  తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. అయితే   ఇంతవరకు ఈ విషయం పై పార్టీ కేంద్ర నాయకత్వంతో  చర్చించలేదని, ఏదైనా తెలంగాణలో కూటమి ఎంట్రీ గురించి, పై స్థాయిలో నిర్ణయం జరగ వలసి ఉంటుదని అంటున్నారు.  ఏది ఏమైనా బీజేపీ గట్టి అభ్యర్ధిని బరిలో దించి  గట్టి పోటీ ఇస్తుందని,ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. 
జూబ్లీ ఉప పోరుకు వ్యూహాలు రెడీ ! Publish Date: Jun 13, 2025 10:52AM

భర్త కోసం లండన్ ప్రయాణం.. ప్రమాదంతో అనంతలోకాలకు.. నవ వధువు విషాదం

 అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో త‌న భ‌ర్త‌ను క‌ల‌వ‌డానికి రాజ‌స్థాన్ నుంచి యూకే వెడుతున్న నూత‌న వ‌ధువు ఖుష్బూ ఒక‌రు. రాజ‌స్థాన్ బ‌లోత్రా జిల్లాకు చెందిన‌ 21 ఏళ్ల ఖుష్బుకు లండ‌న్లో డాక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న విపుల్ తో గ‌త జ‌న‌వ‌రిలో వివాహం జ‌రిగింది. పెళ్ల‌యిన  రెండు నెల‌ల‌కు విపుల్ లండ‌న్ వెళ్లి పోయారు. ఖుష్పు పాస్ పోర్ట్ వీసా వంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడానికి ఇండియాలోనే ఉండిపోయారు. చివరకు అన్నీ క్లియరెన్సులూ వచ్చి భర్త వద్దకు చేరుకోవడానికి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.   ఖుష్బూ   తండ్రి,  స్థానిక బీజేపీ నేత, వ్యవసాయదారుడు. తన కుమార్తెను తీసుకుని   జూన్ 11 రాత్రి అహ్మదాబాద్ కు చేరుకున్నారు. కుమార్తెకు వీడ్కోలు ఇచ్చే ముందు ఎయిర్ పోర్టు వద్ద సెల్ఫీ తీసుకుని తమ కుటుంబ గ్రూపులలో షేర్ చేశారు. అదే చివరి చూపు, చివరి ఫొటో అయ్యింది. విమాన ప్రమాదంలో ఖుష్బు మరణించారు. కొత్త జీవితంపై కోటి ఆశలతో అహ్మదాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన ఖష్బు ప్రాణాలు ఆ ప్రమాదంలో అనంత వాయువుల్లో కలిసిపోయాయి.  
భర్త కోసం  లండన్  ప్రయాణం.. ప్రమాదంతో అనంతలోకాలకు.. నవ వధువు విషాదం Publish Date: Jun 13, 2025 10:18AM

ఆశలను చిదిమేసిన విమాన ప్రమాదం.. మాటలకందని విషాదం

విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ కు చెందిన  ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లోనే పని చేస్తున్నారు. ఆయన కల కుటుంబం మొత్తాన్ని లండన్ కు తీసుకువెళ్లి అక్కడే స్థిరపడాలని. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చిందని సంబరపడ్డారు. భార్యా, ముగ్గురు పిల్లలను తీసుకుని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరారు. విమానం టేకాఫ్ కు ముందు కుటుంబంతో సెల్ఫీ దిగి బంధుమిత్రులకు గుడ్ బై చెబుతూ షేర్ చేశారు. అయితే అదే చివరి ప్రయాణమనీ, తిరిగి రాని లోకాలకు వెడుతున్నామనీ ఆ క్షణంలో వారికి తెలియదు.  లండన్ ప్రయాణం ఖరారు కావడంతో ప్రతీక్ జోషి భార్య కోమి వ్యాస్  తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ లు సహా కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించారు.   గత ఆరేళ్లుగా లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రతీక్ జోషి.. ఈ ఆరేళ్లూ భార్యాబిడ్డలను లండన్ తీసుకువెళ్లి అక్కడ స్థిరపడాలన్న లక్ష్యంతోనే ఉన్నారు. ఆ లక్ష్య సాధన కోసం శ్రమించారు. చివరకు అన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నాయని అనుకుంటున్న సమయంలో.. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా.. ఘోర విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించింది.    ఇలా ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. అందులో రాజస్థాన్ కు చెందిన ఖుష్బూ గాధ ఒకటి. ఆమెకు ఇటీవలే వివాహం అయ్యింది. ఆమె భర్త లండన్ లో విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  తన భర్తను కలిసేందుకు ఆమె లండన్ బయలుదేరారు.  అయితే ఆమె లండన్ చేరలేదు. ఆహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే భారత పర్యటనకు వచ్చిన ఇద్దరు బ్రిటిషర్లది మరో విషాదం. భారత్ సంస్కృతి పట్ల అభిమానంతో.. భారత్ లో పర్యాటక ప్రదేశాలను చూసి ఆ అనుభవాలను జీవితాంతం పదిలంగా దాచుకోవాలన్న ఆశలో  ఇద్దరు బ్రిటిషర్ లు భారత పర్యటనకు వచ్చి... బ్రిటన్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇద్దరూ అసువులు బాసారు. బుధవారం (జూన్ 11) వీరు   ఇన్ స్టా గ్రాంలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. భారత్ లో ఇది మాకు చివరి రాత్రి అంటూ మొదలు పెట్టి.. భారత్ పర్యటన మాకు ఎన్నో మరపురాని అనుభూతులను మిగిల్చింది. ఈ పర్యటనతో భారత్ పట్ల మా అభిమానం, ఇష్టం ఎన్నో రెట్లు పెరిగింది. కొన్ని గంటల్లో ఈ దేశం విడిచి వెడుతున్నాం. అందుకు చాలా బాధగా ఉంటోంది అంటూ సాగిన వారి ఇన్ స్టా గ్రాం పోస్టు కంటతడి పెట్టిస్తోంది. భారత్ పై అంతటి అభిమానాన్ని పెంచుకున్న వారు  ఇలా విమన ప్రమాదంలో మరణించడం బాధేస్తోందంటూ నెటిజనులు కామెంట్లు పెడతున్నారు. 
ఆశలను చిదిమేసిన విమాన ప్రమాదం.. మాటలకందని విషాదం Publish Date: Jun 13, 2025 9:46AM

ఇయర్ ఫోన్ లు వాడుతుంటారా?  ఈ నిజాలు తెలుసా?

  ఇయర్ ఫోన్స్ ఇప్పటి ప్రజల జీవనశైలిలో భాగం అయిపోయాయి.  ఉదయాన్నే వాకింగ్,  జాకింగ్ చేస్తున్నా,  ప్రయాణాలు చేస్తున్నా,  ఎవరితో అయినా ఫోన్  మాట్లాడుతున్నా.. ఇలా చాలా సందర్భాలలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది.  ఇక నిరంతరం ఫోన్ లు మాట్లాడే వృత్తి లేదా వాతావరణంలో ఉండే వారు రోజులో చాలా గంటల సేపు ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు.  ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లు రిసీవ్ చేసుకుని మాట్లాడటానికి వీలు లేని వారు కనీసం ఒక చెవికి అయినా ఇయర్ ఫోన్ లేదా ఇయర్ బడ్ పెట్టుకుని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు.  చాలా మంది రోజులో 10-12 గంటలు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతూ గడిపేస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే పెద్ద సౌండ్స్ తో ఇయర్ ఫోన్స్ వాడేవారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవేంటంటే.. ఇయర్‌ఫోన్ వాడకం వల్ల వినికిడి ఆరోగ్యంపై ప్రభావం పెరుగుతోంది. "70 డెసిబెల్స్ (dB) కంటే ఎక్కువ శబ్ద స్థాయిలకు ఎక్కువ కాలం గురికావడం శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. అయితే 100 dB కంటే ఎక్కువ శబ్దాలకు అకస్మాత్తుగా గురికావడం తక్షణ చెవుడుకు కారణమవుతుంది." రద్దీగా ఉండే వీధులు,  80-100 dB ట్రాఫిక్, 120 dB కంటే ఎక్కువ బిగ్గరగా ఉండే కచేరీలు లేదా పటాకులు మోత మొదలైన వాటి కారణంగా శబ్ద స్థాయిలు పెరుగుతాయి.  ఇది వినికిడి లోపానికి కారణమవుతుంది. వీటికి తోడు ఇయర్ ఫోన్ ల వాడకం పెరిగితే తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇయర్ ఫోన్స్ నేరుగా చెవి లోకి ధ్వనిని పంపుతాయి, దీని వలన వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలా మంది  తెలియకుండానే తీవ్రమైన శబ్దానికి గురవుతారు. తరచుగా ఎక్కువసేపు సంగీతం లేదా కాల్‌లను ఎక్కువసేపు వింటారు. మరికొందరికి సంగీతం అనేది ఎక్కువ శబ్దం పెట్టుకుని ఆస్వాదించడం అనే అలవాటు కూడా ఉంటుంది.  " 60% కంటే ఎక్కువ వాల్యూమ్‌లలో ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది". రూల్ ఆఫ్ 60 అంటే.. "60 నియమం" అంటే శబ్దాన్ని  60% కంటే తక్కువగా ఉంచడం.  ఇయర్‌ఫోన్ వినియోగాన్ని రోజుకు 60 నిమిషాలకు మించకుండా పరిమితం చేయడం. అదనంగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు సురక్షితమైన ప్రత్యామ్నాయం, ఎందుకంటే అవి ఇన్-ఇయర్ పరికరాలు చేసే విధంగా చెవి లోకి ధ్వనిని లోతుగా ప్రసారం చేయవు. అధిక వాల్యూమ్ నష్టం.. ఎక్కువసేపు 85dm కంటే ఎక్కువ వాల్యూమ్‌లో సంగీతాన్ని వింటే, అది శాశ్వత వినికిడి లోపానికి కారణమవుతుంది. ఇయర్‌ఫోన్‌లను విరామం లేకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల చెవికి ఒత్తిడి వస్తుంది, దీని వలన అసౌకర్యం,  తాత్కాలిక వినికిడి లోపం సంభవించవచ్చు. హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, ఇయర్‌బడ్‌లు కర్ణభేరికి దగ్గరగా ఉంటాయి. ఇది ధ్వని ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది.  దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. బిగ్గరగా సంగీతం వినడమే కాకుండా, ఇయర్‌ఫోన్‌లను ఇతరులకు ఇవ్వడం,  ఇతరులవి తీసుకుని వాడటం వంటివి  లేదా ఎక్కువసేపు వాడటం వల్ల కూడా చెవిలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.                                            *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఇయర్ ఫోన్ లు వాడుతుంటారా?  ఈ నిజాలు తెలుసా? Publish Date: Jun 13, 2025 9:30AM

టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?

  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
టీ తాగే సరైన విధానం మీకు తెలుసా? Publish Date: Jun 13, 2025 9:30AM

విమాన ప్రమాదంపై దర్యాప్తునకు భారత్ కు బ్రిటన్ ఏఏఐబీ బృందం

అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఎయిర్ ఇండియాకు చెందిన  విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  కూలిన దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విమాన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ కు అండగా ఉంటామని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.  ప్రధాని నరేంద్రమోడీ ప్రమాద స్థలాన్ని ఈ రోజు సందర్శించనున్నారు. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. అదలా ఉంటే..  ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తులో పాలుపంచుకునేందుకు  బ్రిటన్‌కు చెందిన  ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్  (ఏఏఐబీ) బృందం భారత్‌కు వస్తోంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో  ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఏఏఐబీ  ఈ దర్యాప్తులో భారత్ కు సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తమ దేశ పౌరులు కూడా ఉన్నందున, భారత దర్యాప్తులో తమకు 'నిపుణుల హోదా' ఉంటుందని బ్రిటన్ పేర్కొంది.   విమాన ప్రమాదంలో మరణించిన వారిలో వారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఒక కెనడా పౌరుడు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఉన్నారు. 
విమాన ప్రమాదంపై దర్యాప్తునకు భారత్ కు బ్రిటన్ ఏఏఐబీ బృందం Publish Date: Jun 13, 2025 9:25AM

పక్షులు ఢీ కొనడం వల్లే విమానం కుప్పకూలిందా?

అహ్మ‌దాబాద్  విమాన ప్రమాదంలో 8200 గంటల విమాన ప్రయాణం అనుభవం ఉన్న పైలట్ సుమిత్ సభర్వాల్, అలాగే  కోపైలట్  కో పైలట్ క్లైవ్  కుంద‌ర్  మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో 298 మంది చనిపోయారు. మరణించిన వారిలో 241 మంది విమాన ప్రయాణీకులు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన మిగిలిన వారంతా బీజే మెడికల్ కాలేజీ విద్యార్థలు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ ను ఢీ కొనడంతో వారు మరణించారు. లంచ్ టైమ్ లో ఈ దారుణం సంభవించింది. భోజనాలు చేస్తున్న విద్యార్థులు అలాగే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా కూడా వైద్య విద్యార్థులే. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.   విమాన ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. ప్రాధ‌మికంగా అయితే ప‌క్షులు ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.  
పక్షులు ఢీ కొనడం వల్లే విమానం కుప్పకూలిందా? Publish Date: Jun 13, 2025 8:50AM

జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

  జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్ ఇన్‌చార్జిగా సీతక్క, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జిగా తుమ్మల నాగేశ్వర రావు, మహబూబ్ నగర్ ఇన్‌చార్జిగా దామోదర్ రాజనర్సింహా, రంగారెడ్డి ఇన్‌చార్జిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్‌చార్జిగా పొన్నం ప్రభాకర్‌, వరంగల్ జిల్లా ఇన్‌చార్జిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.  సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సీపీఆర్‌ఓ గా గుర్రం మల్సూర్‌ను ప్రభుత్వం  నియమించింది. 
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు Publish Date: Jun 12, 2025 9:46PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు

  తెలంగాణలో భారీగా  ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు  ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 33 మంది ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, . పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించింది.  గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది.  సిద్దిపేట కలెక్టర్‌గా కే హైమావతి, సింగరేణి డైరెక్టర్‌గా పీ గౌతమ్‌ను నియమించింది. 
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు Publish Date: Jun 12, 2025 9:29PM