బాబూస్ మొగ్గు బాబు వైపే!

జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై  అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది. అయితే జనం మూడ్ ఏమిటన్నది తెలుసుకోవడానికి ఎలాంటి సర్వేలూ అవసరం లేదు.  వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం అందరికంటే ముందే పసిగట్టేసే బ్యాచ్ ఒకటి ప్రతి రాష్ట్రంలోనూ ఉంటుంది.  ఆ బ్యాచే ఐఏఎస్ ల బ్యాచ్.  రాజకీయ పరిభాషలో వారే బాబూస్.  అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో లేదో వాళ్లు ఇట్టే పసిగట్టేయగలరు.  ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో సారి గద్దె నెక్కే పరిస్థితి లేదని పసిగట్టిన వెంటనే వారి విధేయతలు మారిపోతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో  అధినేతలు చెప్పినట్లు నడుచుకుంటూనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి గద్దెనెక్కే పార్టీ నాయకుడితో సత్సంబంధాలు నెరపడం మొదలు పెట్టేస్తారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల తీరు గమనిస్తే రాబోయే ప్రభుత్వం ఎవరిదన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సాధ్యమైనంతగా ప్రభుత్వానికి దూరం జరుగుతున్నారు. ఇంత కాలం చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారులంతా.. ఇప్పుడు విపక్ష నేత కరుణా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగేళ్లుగా జగన్ కరుణా కటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తే చాలు.. గప్ చిప్ గా తెలంగాణ రాజధానికి చేరుకుంటున్నారు. రహస్యంగా ఆయనతో భేటీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కూడా ఇస్తున్నారు. జగన్ సర్కార్ ఒత్తిడితోనే తాము  తెలుగుదేవం పార్టీకి వ్యతిరేకంగా  పని చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు.   బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే ఇప్పడు బాబు ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నారు. ఈ తీరే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.  చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం, అదే సమయంలో సీఎం జగన్ సహా, వైసీపీ చేపట్టిన కార్యక్రమాలపై జనం విముఖత చూపుతుండటం.. జగన్ సభల నుంచే జనం పారారౌతున్న పరిస్థితి,  గడపగడపకు లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజా నిరసన ఎదురు అవుతుండటంతో  అధికారులకు విషయం అర్ధమైపోయింది.   తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు అన్నది నిర్ధారణ అయిపోవడంతో జగన్ కు ఒక్క చాన్సే లాస్ట్ చాన్స్ అనీ మరో చాన్స్ అసాధ్యం అనీ స్పష్టత వచ్చేసింది. దీంతో వచ్చేది తెలుగుదేశం సర్కారేనని నిర్ధారించుకున్న బాబూస్ ప్లేట్ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారు. నిబంధనల మేరకు నడుచుకున్న అధికారులు యథావిథిగా తమ ఉద్యోగ ధర్మం తాము నిర్వర్తిస్తుంటే.. పరిధి దాటి ఎక్స్ ట్రాలు చేసిన వారు మాత్రం ఇప్పడు గాభరా పడుతున్నారు. వచ్చే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోవడం ఖాయమని భయపడుతున్నారు. అందుకే ముందుగానే తమ ఎక్స్ ట్రాలకు కారణాలను చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుని కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు  తాపత్రేయ పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్ర‌భుత్వ  ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని అంటున్నారు.   తెలుగుదేశం ప్ర‌భుత్వంలో తాము నిర్వర్తించిన విధులు, తమ ప్రతిభను  గుర్తు చేస్తూ  గత నాలుగేళ్లుగా తమ పనితీరు అధ్వానంగా ఉండటానికి కారణం జగన్ సర్కార్ అసమర్థతా, అనుచిత ఒత్తిడే కారణమని వివరణ ఇచ్చుకుంటున్నారు.   అలాగే తెలుగుదేశం పార్టీలోనే  కొనసాగుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసిన సీనియర్ నేతలు కూడా ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు అడుగులు కదుపుతున్నారు.   అవకాశం దొరికితే చంద్రబాబును కలిసి తాము ఇంత కాలం ఒకింత సైలెన్స్ మెయిన్ టైన్ చేయడానికి కారణాలను చెప్పుకుని మళ్లీ పార్టీలో పూర్వపు స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించేశారు. వీలైతే చంద్రబాబును, కుదరకపోతే లోకేష్ ను కలిసి  తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. మరీ ముఖ్యంగా యువగళం పాదయాత్రలో వారు చురుకుగా కనిపిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా లోకేష్ తో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇప్పడు నారా లోకేష్ పాదయాత్ర వారికి తమ పలుకుబడిని ప్రదర్వించేందుకు ఒక అవకాశంగా లభించిదని భావిస్తున్నారు. అలాగే వివిధ కారణాల వల్ల  పార్టీ మారిన వారు మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు తమదైన శైలిలో, స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించేశారు.  
Publish Date: Jun 6, 2023 4:18PM

లోకేష్ పాదయాత్ర.. జన ప్రభం‘జనం’

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  జగన్  రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంట్రీయే అదిరిపోయింది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులో సాగిన ఆయన పాదయాత్ర ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గం.. అంటే సీఎం వైయస్ జగన్ సొంత మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇలాకాలో  జోరుగా, ఉత్సాహంతో  సాగుతోంది. అయితే ఏ నియోజకవర్గంలో లోకేశ్ అడుగు పెట్టినా.. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ప్రొద్దుటూరులో హూకిల్డ్ బాబాయి అంటూ తెలుగుదేశం  శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించడం.. ఆ క్రమంలో లోకేశ్ సైతం వారి వద్ద నుంచి ప్లకార్డను తీసుకొని ప్రదర్శించడం... అధికార వైసీపీ శ్రేణులను కొంత ఇబ్బందికి  చేసింది. అయితే ఒకానొక సమయంలో ఆ ప్లకార్డుల ప్రదర్శన ఆపాలంటూ పోలీసులు రంగంలోకి దిగి... నారా లోకేశ్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఆయన ససేమిరా అనడంతో ఇక చేసేది లేక ఖాకీలు వెనక్కి తగ్గారు. దీంతో తెలుగుదేశం   శ్రేణుల్లో  జోష్ పెరిగింది.  ఇక జమ్మలమడుగు, ప్రొద్దుటూరులోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డిల అవినీతిపై నారా లోకేశ్ విసిరిన పంచ్‌లు.. టపాసుల్లా పేలాయి.  అలాగే జగన్ పాలనలో చోటు చేసుకొన్న విధ్వంసం.. టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రజా సంక్షేమం కోసం చేపట్టనున్న విధి విధానాలను లోకేశ్ ప్రజలకు  స్పష్టం చేస్తూ వస్తున్నారు.  మరోవైపు రాయలసీమలో ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో.. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, యువత ఆశలు, ఆశయాలపై  లోకేష్ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చారని.. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీన కడపలో టీడీపీ అధికారంలోకి వస్తే.. రాయలసీమ ప్రజలకు ఎటువంటి పథకాలు అమలు చేస్తాము.. అలాగే యువత కు కల్పించే  ఉపాధి అవకాశాలు, అదే విధంగా రైతుల కోసం చేపట్టే పలు ప్రాజెక్టుల వివరాలను సైతం నారా లోకేష్ ప్రకటించనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంకోవైపు ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో టీడీపీ.. తన మేనిఫెస్టోని ప్రకటించింది. దీంతో ప్రజల్లో   క్లారిటీ అయితే వచ్చింది. ఇక లోకేశ్ రాయలసీమ వాసుల కోసం ప్రకటించే వరాలపై  ప్రజలు ఆసక్తితో ఉన్నారు. ఇక నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 1500 కిలోమీటర్లను పూర్తి చేసుకొని..  లక్ష్యం దిశగా వడి వడిగా సాగుతోంది. అలాగే లోకేశ్ విసురుతోన్న పంచ్‌లతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో దడ సైతం  పుట్టిస్తోంది.  జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఆయన పాదయాత్ర.. ఇటీవల రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహనాడు కోసం జస్ట్ నాలుగు రోజుల విరామం తీసుకున్నారు. అనంతరం నారా లోకేశ్ మళ్లీ.. తన పాదయాత్రను పున:ప్రారంభించారు.  ఆ క్రమంలో కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు ప్రజలు పోటెత్తుతోన్నారు. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర నాలుగొందల రోజుల పాటు.. నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇప్పటికే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకొని.. కడపలొ కొనసాగుతోంది. రేపో మాపో..  ఆ జిల్లాలో కూడా పూర్తి చేసుకొని... మరో జిల్లాల్లోకి దూసుకుపోనుంది.
Publish Date: Jun 6, 2023 3:38PM

బీఆర్ఎస్ అధినేతలో విజయంపై బెరుకు? ఎందుకంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గత తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా, ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కుంటున్నారు. ఆయన ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోంది? ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు ఆయన్ని చుట్టుముడుతుయి.   తెలంగాణలో  క్షేత్ర స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే, ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీఆర్ఎస్’ అనే సంకేతాలే విస్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి, 2014 తర్వాత చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా  తెలంగాణ రాష్ట్ర సమితి,(తెరాస) అదే పేరుతో ఉన్నంత వరకు కేసీఆర్ నాయకత్వానికి ఎదురన్నదే లేదు. ఆయన భయపడిన సందర్భం కూడా లేదు. కానీ ఇప్పడు ముఖ్యమంత్రి కేసీఆర్ లో బెరుకుదనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బీజేపీ పేరు ఎత్తి విమర్శ చేయడానికే ఆయన సాహసించడం లేదు.    మంచైనా చెడైనా టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) మన పార్టీ, మన తెలంగాణ పార్టీ, కేసీఆర్ మన నాయకుడు అని నమ్మి తొమ్మిదేళ్ళుగా కేసీఆర్ కు అండగా నిలిచిన తెలంగాణ వాదులు, పార్టీ క్యాడర్, అభిమానుల ఆలోచనలలో వస్తున్న పార్టీ పేరు మార్పు తరువాత ‘మార్పు’ ప్రస్ఫుటంగా కనిపించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నరు. కారణాలు ఏవైనా, ఎన్నికల సంవత్సరంలో పార్టీ పరిస్థితి ఒకింత ఇబ్బందికరంగానే ఉందని అంటున్నారు. వంద సీట్లకు పైగా గెలుస్తామన్న ఒకప్పటి ధీమా ఇప్పుదు పార్టీ అధినేత కేసీఆర్ లో, పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కాగడా పెట్టి వెతికినా కానరావడం లేదని అంటున్నారు. ముఖ్యంగా వామపక్షాలు చెయ్యేస్తేనే గానీ, మునుగోడు గెలవలేని పరిస్థితి నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఎన్నికల భయం కనిపిస్తోందని అంటున్నారు.అలాగే, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవన్న  వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించారు.   అందుకే  పార్టీ పేరు బీఆర్ఎస్ అయినా.. ఆయన జాతీయ రాజకీయాలలో పెద్దగా జోక్యం చేసుకుంటున్న దాఖలాలు కనిపించకుండా ఇటీవలి కాలంలో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. గతంలో సందర్భం ఉన్నా లేకున్నా.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించే కేసీఆర్ ఇప్పుడు అవకాశం ఉన్నా, సందర్భం వచ్చినా బీజేపీని కానీ, మోడీని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ పరిస్థితే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కష్ట కాలం నడుస్తోందని తేటతెల్లం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Jun 6, 2023 3:17PM

తెలంగాణలో కాంగి‘రేసు’

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, హిమాచల్ ఎన్నికలలో విజయం.. ఆ తరువాత కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని గెలుపు.. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని జోష్ ను పెంచాయి. పార్టీలో గతంలో ఎన్నడూ కానరాని ఐక్యత కనిపిస్తోంది. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాలలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలతో దూసుకుపోతున్నది. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కర్నాటక పరాజయంతో దిగాలు పడితే.. అదే సమయంలో కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో కనీవినీ ఎరుగని సమన్వయం ద్యోతకమౌతోంది. ఎన్నికలకు మరో ఆరు నెలల వరకూ సమయం ఉండగానే ఎన్నికల టీమ్ ను తెలంగాణ కాంగ్రెస్ రెడీ చేస్తున్నది. ఇంత కాలం అంతర్గత కలహాలతో నీరసించిన తెలంగాణ కాంగ్రెస్ కు కర్నాటకలో తమ పార్టీ విజయం జీవన్ టోన్ టానిక్ గా మారింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎటువంటి సమస్యలూ రాకుండా కాంగ్రెస్ ఎలక్షన్ టీమ్ ను రెడీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యత ఇస్తూనే, సీనియారిటీని కూడా పరిగణనలోనికి తీసుకుని సీసీపీ కార్యకవర్గ ఏర్పాటుకు సమాయత్తమౌతోంది. ఆ దిశగా ఇప్పటికే విస్తృత చర్చలు పురోగతిలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   హస్తిన డైరెక్షన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కసరత్తులో అందరి భాగస్వాములను చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పార్టీలో అసమ్మతి మొలకెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు.  అన్నిటికీ మించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ కీలక నేతలు రాహుల్, గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారన్న సమాచారం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.    ఈ  ఏడాది చివర్లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఇప్పటి నుంచే కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రతి రాష్ట్రంపైనా కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. అందులో భాగంగానే   తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చి కూడా ఆ క్రెడిట్ ను ఖాతాలో వేసుకోవడంలో వైఫల్యాన్ని అధిగమించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను స్వయంగా ప్రియాంక గాంధీ తీసుకున్నారని చెబుతున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తే.. ప్రియాక గాంధీ స్వయంగా రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లోక్ సభ బరిలో దిగుతారని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చింది.  గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టడం, అన్నిటికీ మించి ప్రియాంక ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఎఫైర్స్ పై ప్రత్యక్ష పర్యవేక్షణకు అంగీకరించడంతో కాంగ్రెస్ విజయంపై అంచనాలు పెరిగాయి.
Publish Date: Jun 6, 2023 2:19PM

కేశినేని అన్నదమ్ముల సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడ నగరం అనేక కీలకమైన రాజకీయ మలుపులకు కేంద్ర మయింది. ఆంధ్రుల సాస్కృతిక కేంద్రంగా కూడా గణతికెక్కిన బెజబాడ గ్రూపు తగాదాలకూ కేంద్ర బిందువు. తాజాగా రచ్చకెక్కిన కేశినేని బ్రదర్స్ వ్యవహారంతో  ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. కేశినేని బ్రదర్స్ అనగా కేశినేని శ్రినివాస్ అలియాస్ నాని, కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని అనే ఇద్దరు అన్నదమ్ముల కథ విజయవాడ వీధుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్.  మొదట్లో రామలక్ష్మణుల్లా మెలిగిన వీరిద్దరూ వాలి సుగ్రీవులుగా మారడానికి కారణాలు తెలియాలంటే ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రాంత ప్రజల రాకపోకలు పెరిగిపోయాయి.  దీంతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకుంది. సరిగ్గా  ఆ సమయంలోనే యువకులైన మన రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.  దక్షిణ భారత దేశంలోనే ఆటోమొబైల్ పరిశ్రమకు మూలమైన బెజవాడ నుండి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో ప్రారంభమైన వ్యాపారం మూడు బస్సులు, ఆరు ట్రిప్పులతో అభివృద్ధి చెందింది. పెద్ద వాడైన నానితో పొసగలేక తమ్ముడు చిన్ని వ్యాపారం నుండి వైదొలిగాడు. తన వాటాగా ఒ కోటి రూపాలయు తీసుకుని మోడల్ ట్రావెల్స్  అనే మరో కొత్త అనే మరో కొత్త సంస్థను ప్రారంభించాడు. హైదరాబాద్ తో పాటు ముంబై, చెన్నై వంటి నగరాలకు వ్యాపారాన్ని విస్తరించాడు.  ఆ రోజుల్లో ముంబై నుంచి కార్గొను హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖ వంటి నగరాలకు చేర్చే వ్యాపారం జోరుగా సాగింది. దీంతో అనతి కాలంలోనే చిన్ని నానిని మించిన వాడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య స్పర్ధలు మొదలయ్యాయి.  దీంతో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీసు వ్యూహాలకు నాని పదును పెట్టాడని బెజవాడలో చెప్పుకుంటారు. అప్పటి లోక్ సభ స్పీకర్ బాలయోగితో ఉన్న స్నేహంతో శివసేన నేతలతో కలిసి ముంబైలో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీశాడని నానిపై ఆరోపణలు ఉన్నాయి. బాలయోగితో నాని సంబంధాలపై బెజవాడలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.  ముంబాయిలో దెబ్బ తిన్న చిన్ని తన ఫోకస్ ను హైదరాబాద్ పై పెట్టాడు. రియల్ రంగంతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో కూడా నిలదొక్కుకుని నాని తలెత్తి కూడా చూడలేని స్థాయికి ఎదిగాడు. దీంతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు నాని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. విజయవాడ లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే.. వాలి సుగ్రీవులుగా మారిన నాని, చిన్నిలు పాత కక్షలను మరచిపోలేదు.  ఇప్పటికీ కత్తులు నూరుకుంటున్న కేశినేని బ్రదర్స్ కు ప్రస్తుత రాజకీయాలు కలసి వచ్చాయి. 2024లో విజయవాడ బరిలో నిలబడేందుకు ఇద్దరూ వ్యూహాలు పన్నుతున్నారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీతో కొంత దూరాన్ని పాటిస్తుండగా, వైసీపీ పరిస్థితులను అంచనా వేసే పనిలో పడింది. ఆర్థిక వనరులకు లోటు లేని చిన్ని ఈ సారి అన్నపై పై చేయి సాధించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే జరిగితే విజయవాడ రాజకీయాలలో ఒక కొత్త అంకానికి తెరలేస్తుంది. కనక దుర్గమ్మ సాక్షిగా, కృష్ణా తీరంలో జకగనున్న కేశినేని అన్నదమ్ముల సవాల్ బవిష్యత్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషించనుందని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. 
Publish Date: Jun 6, 2023 2:07PM

ఎల్ నినో.. జూన్ రెండో వారంలోనూ ఎండలే?

ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి. ప ఎదిమిది గంటలు దాటిందంటే  గడపదాటి  అడుగు బయటకు పెట్టాలంటే జనం జంకుతున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో వాతావరణం చల్లబడుతుంది. తొలకరి జల్లులు కురుస్తాయి. ఏరువాక మొదలౌతుంది. రైతులు వ్యవసాయ పనులలో బిజీ అవుతారు. కానీ ఈ ఏడో ఆ పరిస్థితి లేదు. జూన్ రెండో వారినికి కానీ తొలకరి పలకరించే అవకాశం లేదని వాతావరణ శాఖ చెప్పేసింది. ఇందుకు ఎల్ నినో పరిస్థితులే కారణమని పేర్కొంది. అంటే జూన్ రెండో వారం వరకూ ఎండలు మండిపోతాయన్న మాట. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో జనం ఎండ, ఉక్కపోతతో సతమతమౌతున్నారు. రోహిణీ కార్తె ముగిసినా ఎండల తీవ్రత తగ్గలేదు. పైపెచ్చు రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిపై ఎండ ప్రభావం పడుతోంది. అయితే, వృద్దులు, చిన్న పిల్లలు, ఇతర దీర్ఘకాల వ్యాదులతో బాధపడుతున్న వారిపై ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. రానున్న నాలుగు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడమే కాకుండా వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని పేర్కొని ఎల్లో కాషన్ జారీ చేసింది.   
Publish Date: Jun 6, 2023 1:13PM

ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే చెప్పే మాట ఇదే!

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాలలో ఒకటి అన్నది నిస్సందేహం. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ప్రమాద కోణంపై దర్యాప్తునకు సీబీఐ విచారణకు ఆదేశించడమూ తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే శాఖ  కుట్ర కోణం ఉందని చెప్పడం పరిపాటిగా మారిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ కుట్ర కోణానికి మతపరమైన మసాలా జోడించి దేశంలో విద్వేషాలు రగిలేలా సామాజిక మాధ్యమంలో పోస్టుల వెనుకే నిజమైన కుట్ర ఉందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రెండు రైల్వే పోలీసు డిస్ట్రిక్ట్స్ కు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీసు అదనపు డీజీపీగా పని చేసిన అనుభవం ఉన్న నాగేశ్వరరావు మరో ట్వీట్ లో ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదం వెనుక ఉన్నరైల్వే వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలచ్చడానికి, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రైల్వే అధికారులు వ్యూహాత్మకంగా ‘కుట్ర’ జరిగిందంటూ ప్రకటనలు గుప్పించడం పరిపాటేనని పేర్కొన్నారు.  తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత కాలంగా విజయవంతంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు.  ప్రస్తతం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై సామాజిక మాధ్యమంలో  విద్వేషం పెచ్చరిల్లేలా వస్తున్న వార్తల నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   ఆయన వ్యాఖ్యలు రైల్వే శాఖనే కాకుండా నేరుగా  కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నట్లుగా ఉండటంతో ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును తప్పుపడుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రమాదానికి కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అంతే కానీ దర్యాప్తుల పేరుతో కాలయాపన జరపడం తగదని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కేసును అప్పగించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. అలాగే మల్లికార్జున్ ఖర్గు ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి.. దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. సిబ్బంది కొరత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వైఫల్యం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.  
Publish Date: Jun 6, 2023 11:46AM

ఖాళీల భర్తీపై దృష్ఠి సారించేదెన్నడు?!

ఒడిశాలోని బలాసోర్ ట్రిపుల్ ట్రైన్ దుర్ఘటన దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను సైతం దిగ్భ్రాంతికి లోను చేసింది. మనది ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్.  అయితే  ఈ భారీతనానికి సరిపడ వర్క్ ఫోర్స్ ఏ మాత్రం లేదు.  రైల్వేశాఖ స్వయంగా వెల్లడించిన వివరాల మేరకు సిబ్బంది మేరకు వర్క్ లోడ్ పెరుగుతోంది తప్ప సిబ్బంది సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇప్పటికీ  చాలా కీలక పోస్ట్ లు ఖాళీగానే ఉన్నాయి.  కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన లెక్కల ప్రకారం... ప్రస్తుతానికి మన ఇండియన్ రైల్వేలో దాదాపు 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్ట్లు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది మార్చిలోనే ఈ లెక్కలు చెప్పారాయన. అప్పటి నుంచీ వీటిని భర్తీ   చేయలేదు. ఇప్పటికీ అవి ఖాళీగానే ఉన్నాయి.  2022 డిసెంబర్ 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నాన్ గెజిటెడ్ విభాగంలో 3 లక్షల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా నార్త్ జోన్లోనే ఎక్కువగా 38,754 ఖాళీలున్నాయి. వెస్టర్న్ జోన్లో 30,476, ఈస్టర్న్ జోన్లో 30,141, సెంట్రల్ జోన్లో 28 వేల 650 ఖాళీలున్నట్టు చెప్పారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అంటే... ఇంజనీర్స్, టెక్నీషియన్స్, క్లర్క్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్లు. ఈ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఉన్న వారిపైనే పని భారం పెరుగుతోంది. టికెట్ బుకింగ్ విభాగంలోనూ సిబ్బంది సరిపడినంతగా లేదు. ఫలితంగా...ఇది కూడా సవాలుగా మారుతోంది. కొంత మందైతే రోజుకి 16 గంటల పాటు పని చేస్తున్నారు. కనీసం సెలవులు పెట్టడానికి కూడా వీల్లేనంత బిజీగా ఉంటున్నారు. కొందరు రైల్వేలోనే వేరే డిపార్ట్మెంట్ కు  మారేందుకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్లకు ప్రిపరేషన్ కు కూడా టైమ్  దొరకడం లేదు.   మొత్తం ట్రైనుకు ఒకరు లేదా ఇద్దరు టీసీలతో టిక్కెట్ చెకింగ్ పనులను అప్పగించి.. వాళ్ల మీదే భారం వేసి.. రైల్వే శాఖ తమాషా చూస్తుందని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నా.. వారి బాధలన్ని పట్టించుకునే నాథుడే లేరు. ఇక రైల్ సేఫ్టీ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతానికి  దాదాపు లక్షా 40వేల ఖాళీలున్నాయి. ఇదంతా రైల్వే ప్రైవేటీకరణ పాలసీల వల్ల వచ్చిన సమస్యలేనన్న విమర్శ:లు ఉన్నాయి.  ఇండియా రవాణాకి వెన్నెముక లాంటి రైల్వే నెట్ వర్క్ లో ఇన్ని పోస్ట్లు ఖాళీ గా ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే రిక్రూటింగ్ సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. మొత్తం రైల్వే నెట్వర్క్ లో ఉన్న ఖాళీల్లో దాదాపు 25 శాతం మేర ఖాళీలు... భద్రతా విభాగంలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా మోదీ ప్రభుత్వం ప్రమాదానికి ఏవేవో కారణాలు చెబుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   వివాదాల సంగతి పక్కన పెడితే.... ఖాళీలున్నాయన్న మాట మాత్రం వాస్తవం. రైల్వేలో సంస్కరణలపై దృష్టి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ  ఖాళీల భర్తీ విషయాన్ని పట్టించుకోవాలి. ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు భారత్ లో మెండుగా ఉన్నాయనిపదే పదే చెప్పుకునే మోడీ సర్కార్ .. ఇలాంటి దుర్ఘటనలకు ఏం సమాధానం చెప్పుకుంటుందో.. సవాళ్లను ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.
Publish Date: Jun 6, 2023 11:40AM

కేసీఆర్ మౌనం వ్యూహత్మకమేనా?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే టార్గెట్‌తో టీఆర్ఎస్ పార్టీని కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇటీవలి కాలంలో ఆయన  మౌనంపై  రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది.  ప్రతిపక్ష పార్టీల సీఎంలంతా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సమావేశం అయ్యేందుకు సన్నద్ధమౌతుంటే..  అసలు మోడీ వ్యతిరేకతే పునాదిగా జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి సమావేశాన్ని కేసీఆర్ ముందుండి నిర్వహించాలి. కానీ అందుకు భిన్నంగా అసలు ఆయన హాజరవుతారా? లేదా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ది వ్యూహాత్మక మౌనం అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటే.. పరిశీలకులు మాత్రం వేరే విధంగా విశ్లేషణలు చేస్తున్నారు.  అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టించుకుని మరీ బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల తుటాలు కురిపించే కేసీఆర్ ఇటీవలి కాలంలో అసలు ఆ దిశగా గొంతు కూడా సవరించుకోవడం లేదు. ఏవైనా సభలూ సమావేశాలలో మాట్లాడినా, ఆయన విమర్శలన్నీ కాంగ్రెస్ పైనే ఉంటున్నాయి కానీ బీజేపీ ఊసు కానీ, ప్రధాని మోడీ మాట కానీ ఎత్తడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయానికి ఎంతో కీలకం అయినటువంటి కర్నాటక ఎన్నికలలో ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని అంతా భావించినప్పటికీ అసలా వైపునకే కన్నెత్తి చూడలేదు.   రెండువేల నోట్ల రద్దు సందర్భంగానూ, కేజ్రీవాల్ స్వయంగా వచ్చి మద్దతు కోరినా ఆచితూచి స్పందించడం ద్వారానూ అసలు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా? లేక మద్దతు పలుకుతున్నారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత  అరెస్ట్ ఖాయమంటూ జరిగిన ప్రచారం ఇప్పుడు జరగడం లేదు. అసలా కేసులో ఆమె ఆరోపణలు నిజంగా ఎదుర్కొన్నారా అన్నట్లుగా సీబీఐ, ఈడీలు మౌనం వహించాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మౌనం వెనుక ఆయన బీజేపీకి సరెండర్ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  మొత్తం మీద పార్టీ పేరు నుంచి తనకు అచ్చివచ్చిన తెలంగాణ పదాన్ని సైతం తొలగించి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్ధమైన కేసీఆర్ ఇప్పటికిప్పుడైతే  దేశ రాజకీయాల్లో  ఏకాకిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ ఏ వేదిక మీద నుంచి మాట్లాడినా  ఆ ప్రసంగ లక్ష్యం మాత్రం బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్ గానే ఉండేది.   తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని హెచ్చరించే వారు. అటువంటిది ఇటీవలి కాలంలో ఆయన బీజేపీని కానీ, ప్రధాని మోడీని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. చివరాఖరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఆయన ప్రసంగంలో కూడా జాతీయ అంశాలను ప్రస్తావించలేదు. దీంతో ఆయన బీజేపీకి అనుకూలంగా.. స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్  వర్గాల్లోనే  వ్యక్తమౌతోంది. 
Publish Date: Jun 6, 2023 11:24AM

కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ ప్రియాంక.. లోక్ సభకు పోటీ కూడా ఇక్కడ నుంచే?!

హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు  తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్  ప్రచార బాధ్యతలు పార్టీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. వాస్తవానికి చాలా కాలంగా ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.   ఒక దశలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి, పతాక స్థాయికి చేరిన సమయంలో ప్రియాంక జోక్యంతోనే ఆ వివాదం సర్దు మణిగిందని అంటారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  చేసిన  వ్యాఖ్యలు, ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన తూటాల నేపధ్యంలో తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు.  అయితే, ఆ సమయంలో ప్రియాంక జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా ఉండేందుకు విదేశాలకు వెళ్ళారని అంటారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే  కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతనే తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. అందుకే కావచ్చు కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక చూపిన చొరవే కారణమని అంటారు. అలాగే రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన  మాణిక్యం ఠాగూర్‌ ను పార్టీ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్‌ ఠాక్రేకు బాధ్యతలు అప్పగించడం వెనక ప్రియాంక పాత్ర కీలకమని అంటారు.    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  విజయంపై ధీమాతో ఉంది. మిగిలిన పార్టీల కంటే ఒకటి రెండు అడుగులు ముందుంటోంది. ఎన్నికల సమాయత్తంలో కానీ, వ్యూహాలలో కానీ ఈ సారి కాంగ్రెస్ వేగం పెరిగింది.  కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తుంటే, కర్నాటక ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది.  సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్‌లో ‘రైతు డిక్లరేషన్’ ప్రకటన చేస్తే.. ఇప్పుడు  ‘యూత్ డిక్లరేషన్’ పేరిట యువతను టార్గెట్ చేసింది.   అన్ని వర్గాల ప్రజానీకానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రియాంక పర్యటన  ఇలా ముగిసిందో లేదో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  అలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలలో శ్రీమతి గాంధీ వారసురాలిగా పార్టీ శ్రేణులు భావించే  ప్రియాంకా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఇందుకోసం ఆమె మెదక్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారని చెబుతున్నారు.  1980 మధ్యంతర ఎన్నికలలో ఇందిరాగాంధీ రాయ్‌బరేలీతో పాటు తెలంగాణలోని మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. తన సొంత రాష్ట్రమైన రాయ్‌బరేలీలో ఏడు వేల మెజారిటీ తెచ్చుకుంటే, మెదక్ నుంచి  రెండు లక్షల ఓట్ల మెజారిటీతో ఆమెను తెలంగాణ  ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ప్రియాంక పోటీ చేసినా అదే ఫలితం వస్తుందన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో చాలా బలంగా వ్యక్తమౌతోంది.   ప్రియాంకను ‘ఫేస్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ గా రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ప్రియాంక తెలంగాణ నుంచి పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ అమాంతం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  మొత్తానికి ప్రియాంక తెలంగాణలో పోటీ కోసం రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేశారని సమాచారం.  తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న సానుభూతిని  క్యాష్ చేసుకోవడంలో పార్టీ  రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. అయితే పీసీసీ చీఫ్  రేవంత్ ఈ సారి మాత్రం అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ విషయంలో సీరియస్‌గానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు.  అన్నిటికీ మించి  ప్రియాంకా గాంధీ  యూత్ డిక్లరేషన్ పార్టీ శ్రేణుల్లో  ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ సభ  గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీజేపీని ఢీ కొట్టలేక చతికిలపడుతున్న కాంగ్రెస్‌కు ప్రియాంక రూపంలో ఊపిరిపోయాలని హైకమాండ్ అనుకుంటోందట. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం ప్రియాంకను కీలకంగా మార్చారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే ప్రియాంక తెలంగాణలో పర్యటించారని సమాచారం. ఆసక్తికర విషయం ఏంటంటే.. మున్ముందు ఆమెను తెలంగాణ ఇన్‌చార్జిగా కూడా నియమించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.  అలాగే ఇంత కాలం అటా ఇటా అంటూ ఊగుతూ వస్తున్న బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా తమ ద్వైదీ భావానికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ గూటికి చేరాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారని చెబుతున్నారు. వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందంటున్నారు. ఈ నెల 25న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ గూటికి చేరుతారని చెబుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ ను, బీజేపీని డీలా పడేటట్లు చేస్తే కాంగ్రెస్ లో మాత్రం కొత్త ఊపు, ఉత్సాహానికి కారణమైందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు అయితే ఈ సారి తెలంగాణలో తమ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశలన్నీ ప్రియాంకా గాంధీపైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఆమె పోటీకి దిగడం ఖాయమన్న ప్రకటన వెలువడితే.. రాష్ట్రంలో రాజకీయాలు కాంగ్రెస్ అనుకూలంగా చాలా వేగంగా మారిపోతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Jun 6, 2023 10:57AM

ధరణి జోలికొస్తే అంతే ..

తాము అధికారంలో వస్తే ధరణి పోర్టల్ ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ధరణి జోలికొస్తే బంగాళా ఖాతంలో విసిరేస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. 2020 అక్టోబర్ 29న ప్రారంభమైన ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి వివాదాస్పదమైంది. భూమి రిజిస్ట్రేషన్ సర్వీసు మొదలు భూసంబంధిత సేవలు  ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి. చెకింగ్ ల్యాండ్ రికార్డ్స్, లాండ్ మార్కెట్ వాల్యూ, ఈసీ వివరాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు ధరణిలో అందుబాటులో ఉంటాయి. మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఆవిష్కరణ ధరణి పోర్టల్ అని ప్రచారంలో ఉంది.  భూములు లేనివారికి సైతం భూమి ఉన్నట్లు ధరణి పోర్టల్ లో నమోదయ్యాయి. కాబట్టి కెసీఆర్ కుటుంబం ఈ భూములు కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అసలు లబ్దిదారులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎటువంటి సెల్ లేదు. లక్షలాది ఫిర్యాదులు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. హైకోర్టు ను ఆశ్రయిస్తే తప్ప ఫిర్యాదులు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఫిర్యాదు దారుల ఆర్థిక స్థోమత బలహీనంగా ఉంటే జీవిత కాలంలో కూడా న్యాయం జరిగే అవకాశాలు తక్కువ.  విజయలక్ష్మి అనే మహిళ ఒక ఎకరం 32 గుంటల భూమిని 2019 ఆగస్ట్ లో కోట్ల జగదీశ్ కు విక్రయించింది. కానీ అదే భూమి విజయ లక్ష్మికి విక్రయించినట్లు ధరణిలో నవంబర్ 4న రికార్డ్ అయ్యింది.ఖంగుతిన్న జగదీశ్ తహసీల్ దార్ ను సంప్రదించాడు. అయితే ఈ భూమి ఇంకా విజయలక్ష్మి పేరు మీదే ఉంది. ఇంత వివాదాస్పద ధరణి పోర్టల్ లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడుకరవయ్యారు.  
Publish Date: Jun 5, 2023 9:39PM

తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల మరో విజయసాయేనా?

సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు.ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని, రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు.అయితే, సజ్జల  జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే, వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన చాలా వరకు వైఎస్ కుటుంబంతో కలిసే ప్రయాణం చేశారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి తోనే ఆయన రాజకీయ ప్రయాణం సాగింది. జగన్ తో ఆయన రాజకీయ సంబంధాలు, మధ్య మధ్యన కొంత ఒడి దుడుకులు, ఎత్తు పల్లాలు ఎదుర్కున్నా, ఎదురైన అవరోధాలను అధిగమించిన ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి చేరుకున్నారు. అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని పక్కకు నెట్టి ఆ స్థానాన్ని సజ్జల సొంత చేసుకున్నారు. ఆ  విధంగా ఆయన రాజకీయాల్లో మొదటి గమ్యాన్నిచేరుకున్నారు. నిజానికి ఆయన పేరుకు ముఖ్యమంత్రి సలహాదారే కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలా చాలా ఎక్కువని వైసీపీ శ్రేణులే చెబుతుంటాయి.  అలాగే సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల  పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా  ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత  ముఖ్య నేతగా చక్రం తిప్పుతున్నారని, ఇంకా స్పష్టంగా చెప్పలంటే డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని  పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఆ కారణంగానే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని అంటారు.  అదలా ఉంటే   ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపధ్యంలో  సజ్జల తిరుగులేని పెత్తనానికి దాదాపుగా చెక్ పడిందన్న వాదన గట్టిగా వినిపించింది. అప్పటి వరకూ సజ్జలపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని బయటకు చెప్పేందుకు జంకిన నేతలు ఇప్పుడు ఆయనపై బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.  సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంటలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు  అంటున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణమంటూ వేలెత్తి చూపుతున్నారు. దాదాపు ఇలాంటి ఆరోపణలే, ఇదే స్థాయి అసంతృప్తే   జగన్   మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా వెల్లువెత్తింది.   ముఖ్యంగా బాలినేని వంటి వారు నేరుగా సజ్జలపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో బాలినేనిని బుజ్జగించడానికి స్వయంగా రంగంలోకి దిగిన సజ్జల ఆ విషయంలో విఫలమై వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తరువాత జగన్ జోక్యంతో బాలినేని కొంత మొత్త పడినా.. సజ్జలపై అప్పట్లో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి మాత్రం నివురుగప్పిన నిప్పులా అలాగే రగులుతూ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నివురు తొలగిపోతోందన్న సంకేతాలు బలంగా కనిపించాయి. అయితే  ఆ ఫలితాల అనంతరం నలుగురు పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హతలో అసమ్మతి గళం బహిర్గతం కాకుండా ఒకింత నెమ్మదించడానికి కారణమైంది. అయితే ఆ సమయంలో  ఇంకా చాలా మందిలో అసమ్మతి గూడు కట్టుకుని ఉందన్న వార్తలు వెల్లువెత్తిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.  ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే,తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్  గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్  గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని  అన్నారు. అలాగే  ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు సైతం చేశారు. చేశారు. అలాగే, సస్పెన్షన్ వెతుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి కూడా సజ్జల నుంచి తనకు ప్రాణహాని ఉందని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తల దాచుకుంటున్న ఆమె ఏపీకి వెళ్ళాలంటే, సజ్జల ఏమి చేస్తారో అనే భయమేస్తోందని, అన్నారు.  నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని, అయితే ఎందుకనో వాటిని అంతగా పట్టించుకోలేదని అంటారు. ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే ఇంతకాలం సరైన  సమయం కోసం ఎదురు చూస్తునం సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. జగన్ నేరుగా దిగి బుజ్జగించకుండా ఉన్నట్లైతే ఇప్పటికే పార్టీలో సజ్జలపై భారీ స్థాయిలో తిరుగుబాటు జరిగి ఉండేదని కూడా పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.   జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు,  వైఎస్ రాజశేఖర రెడ్డి ‘ఆత్మ’మిత్రులు,  వైఎస్’కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా  వైసీపీలో సజ్జలపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులకు దన్నుగా నిలుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదలా ఉంటే ఇటీవలి కాలంలో పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల హవా ఒకింత తగ్గిందని కూడా పరిశీలకులు అంటున్నారు.  జగన్ రెడ్డి కూడా  సజ్జలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనీ, త్వరలోనే సజ్జల పాత్ర కూడా పార్టీలో, ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి పాత్రలా నామమాత్రం అయిపోయినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి, 
Publish Date: Jun 5, 2023 5:50PM

మల్లారెడ్డికి టికెట్ కట్? 

బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ అవినీతిపరులకు టికెట్ కట్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ కట్ అయ్యే వారి జాబితాలో మల్లారెడ్డి ముందువరసలో ఉన్నట్లు సమాచారం.  పాలమ్మినా నీళ్లమ్మినా అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన మంత్రి మల్లారెడ్డికి  వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్లు పెద్ద సార్ కు ఉప్పందడం మల్లారెడ్డికి టికెట్ రాకపోవచ్చని బిఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మల్లారెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కనుందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మేడ్చెల్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కల్సి ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్థానిక ప్రజలు సైతం మంత్రి మల్లారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ తెప్పించుకున్న రిపోర్టులో మల్లా రెడ్డిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. మల్లారెడ్డి అనుచరులకే కార్పోరేషన్ చైర్మన్ పదవులు దక్కుతున్నాయని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మేడ్చెల్ జిల్లా క్యాడర్ బిఆర్ఎస్ కు దూరం కావడం బిఆర్ ఎస్ అధినేతకు కోపం తెప్పించినట్లు సమాచారం. మరో వైపు ప్రజల నుంచి ఫిర్యాదులను కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారు. కెసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మల్లారెడ్డి నాయకత్వాన్ని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి అనుచరురాలు ఏకంగా స్విమ్మింగ్ ఫూల్ కట్టుకోవడం కేసీఆర్ కు రుచించలేదు. చెత్త కుండి స్థలాన్ని సైతం మల్లారెడ్డి వర్గీయులు  కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవలె కేసీఆర్ బిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ అని ప్రకటించిన కొద్ది రోజుల్లో మల్లారెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. . 
Publish Date: Jun 5, 2023 5:37PM

కమలంతో కలిసినందుకే మజ్లిస్ దూరమైంది

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పని తీరు మీద చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిత్ర పక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు ప్రస్తుతం శత్రుపక్షాలుగా మారాయి.  అసదుద్దీన్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. షాదీ ముబారక్ వంటి స్కీములను పరిచయం చేసిన బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంపై  లోతుగా అధ్యయనం చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ప్రచార సమయం నుంచి బిజెపి బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు పూర్తిగా సమసిపోవడమే అసద్ కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. టీఎస్ పిసిసి పేపర్ లీకేజి వ్యవహారంలో మంత్రి కెటీఆర్ హస్తముందని బిజెపి ఆరోపించగా పదో తరగతి పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తముందని బిఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. ఇక్కడితో ఆగకుండా బండి సంజయ్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల  కవిత పాత్ర ఉందని సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటులో పేర్కొంది.అప్పట్లో  రేపో, మాపో కవిత అరెస్ట్ అనే ఊహాగానాల  ప్రచారం జరిగింది. . తీరా చూస్తే కవిత కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అరెస్ట్ వార్త అటకెక్కడంతో మజ్లిస్ పార్టీ అదినేత అసద్ కు కీడుశంకించింది. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి అని ప్రపంచానికి తెలిసిపోయింది. బీఆర్ఎస్ తో ముందుకెళితే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓటర్లు దూరమవుతారని మజ్లిస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడైంది. దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ గల్లంతవుతుందని మజ్లిస్ ముందే పసిగట్టింది.ఈ కారణంగా మజ్లిస్ బిఆర్ఎస్ ను విమర్శించింది. 
Publish Date: Jun 5, 2023 4:27PM