గాయాలు తగలకపోయినా చర్మం మీద నీలి రంగు గుర్తులు కనిపిస్తున్నాయా? ఈ నిజాలు తెలుసుకోండి.. !
గాయాలు తగలకపోయినా చర్మం మీద నీలి రంగు గుర్తులు కనిపిస్తున్నాయా? ఈ నిజాలు తెలుసుకోండి.. !

కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం, చర్మం దెబ్బ తినడం వంటివి జరగకపోయినా, చర్మం మీద నీలం రంగులో మచ్చలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి ఎలాంటి గాయాలు అయినట్లు కూడా గుర్తుండదు. చాలామంది తరచుగా ఇది సాధారణమే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఒక శరీరం లోపల ఏదో సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. పదేపదే కారణం లేకుండా ఏర్పడే గాయాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే… మచ్చలు ఎందుకు కనిపిస్తాయి? కొన్నిసార్లు అధిక శారీరక శ్రమ లేదా తీవ్రమైన వ్యాయామం చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలను ప్రభావితం చేయగలదని నిపుణులు అంటున్నారు. కండరాలపై అధిక ఒత్తిడి ఈ నాళాలు చిట్లిపోవడానికి, చర్మం కింద రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది, దీని ఫలితంగా నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తికి గాయం అయినట్టు తెలియకపోవచ్చు, కానీ మచ్చలు కనిపినస్తుంటాయి. మందులు.. కొన్ని మందులు కూడా చర్మం మీద ఇలా నీలి రంగు మచ్చలకు కారణం కావచ్చు. రక్తాన్ని పల్చబరిచే మందులు, ముఖ్యంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటివి, రక్తం మరింత త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. రక్తం సాధారణ వేగంతో గడ్డకట్టనప్పుడు, అది చర్మం కిందకు కారిపోయి, సులభంగా కమిలిపోతుంది. కొత్త మందులు తీసుకున్న తర్వాత ఈ సమస్య మొదలైతే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం. పోషకాల లోపం.. కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. విటమిన్ సి లోపం చర్మాన్ని, రక్తనాళాలను బలహీనపరిచి, చిన్న ఒత్తిడికే మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. ఐరన్ లోపం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది, విటమిన్ కె లోపం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, ఎటువంటి కారణం లేకుండా పదేపదే నీలి మచ్చలు రావడం పోషకాహార లోపానికి సంకేతం కావచ్చట.. ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం.. ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా వంటి అరుదైన సమస్యలలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతాయి. రక్తం గడ్డకట్టడంలో ప్లేట్‌లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి లోపం వల్ల చర్మంపై అకస్మాత్తుగా నీలం లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో, పదేపదే వచ్చే నీలం మచ్చలు నాన్-హాడ్కిన్స్ లింఫోమా లేదా ఇతర రక్త సంబంధిత సమస్యల వంటి తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది అరుదైనప్పటికీ, తీవ్రమైన అలసట, బరువు తగ్గడం లేదా తరచుగా రక్తస్రావం వంటి లక్షణాలతో పాటుగా ఉంటే వైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుడిని ఎప్పుడు కలవాలి? ఎటువంటి స్పష్టమైన గాయం లేకుండా శరీరంపై పదేపదే నీలి మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చలు క్రమంగా పెద్దగా అవుతూ పరిమాణంలో పెరుగుతుంటే, తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంటే, లేదా ఆ రక్తస్రావం సులభంగా ఆగకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని దాని ప్రారంభ దశలోనే గుర్తించి, వ3ఎలైనంత తొందరగా చికిత్సను ప్రారంభించవచ్చు. *రూపశ్రీ

Publish Date: Jun 9, 2026 3:24PM
విటమిన్ టాబ్లెట్లు మింగుతున్నారా? అమృతం కాస్తా విషంగా మారే ప్రమాదం ఉందట!
విటమిన్ టాబ్లెట్లు మింగుతున్నారా? అమృతం కాస్తా విషంగా మారే ప్రమాదం ఉందట!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:- మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Jun 8, 2026 4:32PM
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెకు ఏదో సమస్య ఉన్నట్టే!
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెకు ఏదో సమస్య ఉన్నట్టే!

గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె సమస్యలు వచ్చే వారిలో మొదట్లోనే చిన్న చిన్న లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులను , గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చు. శరీరంలో ఏ లక్షణాలు గుండె జబ్బులను సూచిస్తాయో.. ఆ లక్షణాలు మీకు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేస్కోండి.. ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం లేదా ఒత్తిడి వంటివి గుండె జబ్బు అత్యంత సాధారణ లక్షణాలు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు లేదా పదేపదే రావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి భుజం, మెడ, వీపు లేదా చేతికి కూడా వ్యాపించవచ్చు. ఇలా పదేపదే జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరి ఆడకపోవడం.. మెట్లు ఎక్కేటప్పుడు విపరీతమైన అలసటగా లేదా ఆయాసంగా అనిపిస్తే, అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అలసట, బలహీనత.. విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపిస్తుంటే, దానిని సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. గుండె పనితీరు తగ్గినప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు, దీనివల్ల అలసట , నీరసం ఏర్పడుతుంది. హృదయ స్పందన.. గుండె కొట్టుకునే వేగంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల గుండె సమస్యకు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి పదేపదే ఏర్పడుతుంటే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. *రూపశ్రీ.

Publish Date: Jun 8, 2026 1:31PM
గుండెను బలంగా, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలు!
గుండెను బలంగా, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలు!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్తే స్టెంట్ వేయాలని లేదా డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. కానీ, ప్రకృతి ప్రసాదించిన ఆహార నియమాలతో, ఆపరేషన్లు లేకుండానే గుండె బ్లాకులను తొలగించుకోవచ్చని మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు ఈ VIDEO లో వివరించారు. మనం ఈ మార్పును ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) సాధారణంగా గుండెలో బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే సర్జరీ వైపు మొగ్గు చూపుతాము. అయితే, సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. సర్జరీ భయం లేకుండా: స్టెంట్ లేదా బైపాస్ సర్జరీల అవసరం లేకుండానే 20% నుండి 40% వరకు బ్లాకులను సహజంగా తగ్గించుకోవచ్చు. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఎటువంటి ఇంజెక్షన్లు లేదా కెమికల్ మెడిసిన్స్ లేకుండా కేవలం కూరగాయల రసాలు మరియు ఆయుర్వేద పద్ధతులతో చికిత్స పొందవచ్చు. సమగ్ర ఆరోగ్యం: ఇది కేవలం గుండెకే కాదు, షుగర్, బీపీ, మరియు కిడ్నీ సమస్యలను కూడా ఒకేసారి అదుపులోకి తెస్తుంది. ఏమి చేయకూడదు? (What Not to Do?) ఆరోగ్యంగా ఉండాలంటే మందుల కన్నా ముందు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ముఖ్యం: నూనె వాడకం: నూనెతో వేయించిన పదార్థాలను (Oil-fried foods) పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రిజర్వేటివ్స్ మరియు సాల్ట్: బ్రెడ్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బీపీని మరియు కిడ్నీ సమస్యలను పెంచుతాయి. తెల్ల అన్నం మరియు గోధుమలు: కనీసం మూడు నెలల పాటు వైట్ రైస్ మరియు గోధుమలను దూరం పెట్టి, సిరిధాన్యాలు లేదా బార్లీ రొట్టెలు తీసుకోవాలి. పొగత్రాగడం: గుండె సమస్యలకు ప్రధాన కారణమైన స్మోకింగ్ వంటి అలవాట్లను తక్షణమే మానేయాలి. ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గం (How to do?) డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు సూచించిన ఈ చిట్కాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి: 9 వారాల జ్యూస్ థెరపీ: మొదటి వారం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ (200 ml). రెండో వారం: సొరకాయ జ్యూస్. మూడో వారం: కీరా (కుకుంబర్) జ్యూస్. ఈ విధంగా ఈ మూడు వారాల చక్రం 9 వారాల పాటు (మొత్తం 3 సార్లు) కొనసాగించాలి. ఆహార నియమాలు (Plate 1 & Plate 2): మొదటి ప్లేట్‌లో కేవలం పండ్లు (బ్లూబెర్రీస్, ఆపిల్, జామకాయ) మరియు మొలకలు తీసుకోవాలి. రెండవ ప్లేట్‌లో నూనె లేకుండా వండిన కూరలు, బార్లీ లేదా రాగి రొట్టెలు తీసుకోవాలి. కిడ్నీ మరియు బీపీ కోసం సహజ టీలు: కొలెస్ట్రాల్ తగ్గడానికి దాల్చిన చెక్క నీళ్లు తాగాలి. బీపీ అదుపులో ఉండటానికి కరివేపాకు డికాక్షన్ తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు 5 వేపాకులు, 3 రావి ఆకులను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. జీవనశైలి మార్పులు: సాయంత్రం 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవాలి (Barefoot walking), దీనివల్ల పాదాలలోని ఆక్యుప్రెషర్ పాయింట్లు స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణ సందేహాలు (Q&A) ప్ర: డయాలసిస్ ఆపడం సాధ్యమేనా? జ: అవును, సహజ ఆహారం మరియు వేపాకు, రావి ఆకుల కషాయం వంటి నాచురల్ ట్రీట్‌మెంట్ ద్వారా క్రియాటినిన్ తగ్గించి డయాలసిస్ అవసరం లేకుండా చేయవచ్చని డాక్టర్ గారు అబ్సర్వ్ చేశారు. ప్ర: ఆయిల్ లేకుండా వంటలు రుచిగా ఉంటాయా? జ: ఖచ్చితంగా! ఇడ్లీ కుక్కర్‌లో స్టీమ్ చేసిన మిర్చి బజ్జీలు లేదా బొండాలు వంటి వాటిని నూనె లేకుండానే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ప్ర: హార్ట్ హెల్త్‌ను ఎలా చెక్ చేసుకోవాలి? జ: 40 ఏళ్లు దాటిన వారు కనీసం 4-5 ఏళ్లకు ఒకసారి 'సిటీ కరోనరీ యాంజియోగ్రామ్' (CT Coronary Angiogram) చేయించుకోవాలి. AI సాయంతో కేవలం 2 నిమిషాల్లోనే రిపోర్ట్ వస్తుంది. మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313 USA : +1(732)947-4166 మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

Publish Date: Jun 6, 2026 2:00PM
రాత్రి పూట కాళ్ల పిక్కలు పట్టేయడానికి కారణాలు, నివారణలు
రాత్రి పూట కాళ్ల పిక్కలు పట్టేయడానికి కారణాలు, నివారణలు

చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో 'ఖల్లీ వాతం' అని అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లోనే ఉండి ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోగలిగే ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ (MD-Ayurveda) గారు చెప్పిన మాటలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. కాళ్ల పిక్కలు పట్టేయడానికి ప్రధాన కారణాలు: శరీరంలో వాత దోషం పెరగడం. డీహైడ్రేషన్ లేదా శరీరంలో నీటి శాతం తగ్గడం. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం. విటమిన్లు, ఖనిజాల (మెగ్నీషియం, పొటాషియం) లోపం. డా. చిట్టిభొట్ల సూచించిన అద్భుత ఆయుర్వేద హోం రెమెడీ: ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి మన వంటగదిలో దొరికే మూడు సహజసిద్ధమైన పదార్థాలతో సులువైన మందును తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: శొంఠి పొడి (Ginger Powder) మిరియాల పొడి (Black Pepper Powder) జీలకర్ర పొడి (Cumin Powder) తయారుచేసే విధానం మరియు వాడే పద్ధతి: పైన పేర్కొన్న మూడు పదార్థాలను సమాన మోతాదులో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు లేదా మీ వైద్యుల సలహా మేరకు అర టీస్పూన్ మోతాదులో కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఈ చిట్కా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, వాతాన్ని తగ్గించి, కండరాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

Publish Date: Jun 5, 2026 6:40PM
మార్కెట్లో కొనే ఓఆర్ఎస్ వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేస్కోండి!
మార్కెట్లో కొనే ఓఆర్ఎస్ వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేస్కోండి!

వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు వైద్యులు కూడా ఓఆర్ఎస్ తీసుకోమని చెబుతుంటారు. ఓఆర్ఎస్ అనగానే మార్కెట్లో దొరితే రెడీమేడ్ ఓఆర్ఎస్ గుర్తుకు వస్తుంది. వీటిని బాగా మరిగించి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలని చెబుతారు. కానీ వాటిని ప్రతిరోజూ కొనడం ఖర్చుతో కూడుకున్నది. ఇది మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఓఆర్ఎస్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఖర్చు తక్కువ, పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. ఓఆర్ఎస్ తయారు చేసే విధానం.. కావలసిన పదార్థాలు.. 1 లీటరు శుభ్రమైన లేదా మరిగించిన చల్లటి నీరు 6 టీస్పూన్ల చక్కెర (సుమారు 30 గ్రాములు) ½ టీస్పూన్ ఉప్పు (సుమారు 3 గ్రాములు) ఎలా తయారు చేయాలి? ముందుగా 1 లీటరు నీటిని మరిగించి చల్లారనివ్వాలి. శుభ్రమైన పాత్రలో లేదా సీసాలో నీళ్ళు పోయాలి. దానికి 6 టీస్పూన్ల చక్కెర , అర టీస్పూన్ ఉప్పు కలపాలి. పంచదార, ఉప్పు పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇలా చేస్తే ఇంట్లో తయారు చేసుకున్న ఓఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దీనిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. విరేచనాలు, వాంతులు లేదా అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ కలగవచ్చు. ఓఆర్ఎస్ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ గా మార్చడంలో సహాయపడుతుంది. ఓఆర్ఎస్ లో ఉండే ఉప్పు , చక్కెర శరీరంలో సోడియం, పొటాషియం , ఇతర ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. డీహైడ్రేషన్ వల్ల కలిగే అలసట, తలతిరగడం , నీరసాన్ని తగ్గించడంలో ఓఆర్ఎస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. తీవ్రమైన వేడి , వడగాలుల సమయంలో ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది , అంతేకాదు వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. విరేచనాలు, వాంతుల సమయంలో పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ చాలా సహాయపడుతుంది. అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని నీరు , ఖనిజాల లోపాలను భర్తీ చేయడం ద్వారా వేగంగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఓఆర్ఎస్ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఓఆర్ఎస్ ను 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటిని వాడాలి. ఉప్పు, చక్కెర పరిమాణాన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ పరిమాణం హానికరం కావచ్చు. విరేచనాలు, వాంతులు లేదా డీహైడ్రేషన్ సమస్య తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. చిన్న పిల్లలు , తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఓఆర్ఎస్ ను నమ్ముకోకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. *రూపశ్రీ.

Publish Date: Jun 5, 2026 6:22PM
మీకు ఎక్కువ కోపం వస్తుందా? శరీరంలో ఇలా జరిగినందుకే అలా!
మీకు ఎక్కువ కోపం వస్తుందా? శరీరంలో ఇలా జరిగినందుకే అలా!

ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అసలు అంత కోపం ఎందుకు వస్తుంది అనే విషయం కూడా అర్థం కానట్టు ఉంటుంది. కోపం అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు.. అది మనస్సు , శరీరానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు, వారి శరీరం పూర్తిగా అల్లకల్లోలానికి గురవుతుంది. అతిగా కోపం తెచ్చుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ నిజం ఏమిటో తెలుసుకుంటే.. మెదడులోని ఈ భాగమే కారణం... మన మెదడులో అమిగ్డాలా అనే ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. దీనిని శరీరపు అలారం అని కూడా పిలవవచ్చు. మనకు ఏదైనా విషయం గురించి బాధగా అనిపించినప్పుడల్లా, ఈ అలారం వెంటనే మోగుతుంది. కోపానికి లోనయ్యే వ్యక్తులలో ఈ ప్రాంతం చాలా చురుకుగా ఉంటుంది. ఇది మెదడులోని ఆలోచనా భాగాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల తొందరగా కోపం వచ్చే వారు ఆలోచించకుండానే మాటలు మాట్లాడతారు లేదా పనులు చేస్తారు. కోపం రాగానే జరిగేది ఇదే.. అమిగ్డాలా చురుకుగా మారినప్పుడు అది అడ్రినలిన్ , కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ల విడుదల శరీరంలో ఈ క్రింది ప్రధాన మార్పులకు కారణమవుతుంది. గుండె కొట్టుకోవడం చాలా వేగంగా అవుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. కండరాలు పూర్తిగా వ్యాకోచిస్తాయి. శ్వాస చాలా వేగంగా , నిస్సారంగా మారుతుంది. ముఖానికి, చేతులకు రక్త ప్రసరణ పెరగడం వల్ల ముఖం ఎర్రగా మారుతుంది. మితిమీరిన కోపం ఏదైనా వ్యాధికి సంకేతమా? పదే పదే మితిమీరిన కోపం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిరంతర కోపం శరీరాన్ని ఎప్పుడూ ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది గుండెపోటు, పక్షవాతం , నిద్రలేమి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు లేదా నిద్రలేమి కూడా కోపం పెరగడానికి దోహదం చేస్తాయి. మితిమీరిన కోపాన్ని ఎలా శాంతపరచాలి? కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అసాధ్యం కాదు. కోపం వచ్చినప్పుడల్లా వెంటనే దీర్ఘంగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. 1 నుండి 10 వరకు అంకెలను వెనక్కి లెక్కించండి. కాసేపు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లడం, చల్లటి నీళ్లు తాగడం కూడా కోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ యోగా, ధ్యానం చేయడం మనసును ప్రశాంతపరచడానికి, అమిగ్డాలాను నియంత్రించడానికి సహాయపడుతుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 4, 2026 5:56PM
ఏ వయసు వారు ఎంత టీ తాగాలి? టీ లవర్స్ తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజమిది!
ఏ వయసు వారు ఎంత టీ తాగాలి? టీ లవర్స్ తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజమిది!

భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది. ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు. ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు. కొందరు బెడ్ టీని ఇష్టపడితే, మరికొందరు రోజంతా చాలా కప్పులు తాగుతారు. వయసుకు తగ్గట్టు ఎంత టీ తాగాలి? దీని గురించి చాలామందికి తెలియదు. అధికంగా టీ తాగడం వల్ల క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. టీ ఆరోగ్య ప్రయోజనాలు.. టీలోని కెఫీన్ , ఇతర సమ్మేళనాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే టీని అధికంగా తీసుకున్నప్పుడు హానికరంగా కూడా మారుతుందని వైద్యులు అంటున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా మారింది. చాలామంది పాలతో కాఫీలు, టీలు మానేసి గ్రీన్ టీ ఇష్టపడుతున్నారు. ఈ సమ్మేళనాలకు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు బరువు విషయంలో పర్పెక్ట్ గా, మొత్తం ఆరోగ్యం విషయంలో ఎంతో నిలకడగా ఉంటారని పరిశోధనలో తేలింది. రోజులో ఎంత టీ తాగాలి? ఎంత పరిమాణంలో టీ తాగడం సరైనది అనే విషయం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వయస్సు, ఆరోగ్య పరిస్థితి , జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టీనేజర్లు , యువకులు రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం మంచిదని చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీ ఎక్కువగా తాగితే.. ఎక్కువగా టీ తాగడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చంచలత్వం, నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి , ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లవర్స్ ఇవి గుర్తుంచుకోవాలి.. టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం, టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. *రూపశ్రీ.

Publish Date: Jun 3, 2026 3:52PM
విటమిన్-సి లేదా విటమిన్-డి.. రోగనిరోధక శక్తి పెరగడానికి ఏది ముఖ్యమంటే!
విటమిన్-సి లేదా విటమిన్-డి.. రోగనిరోధక శక్తి పెరగడానికి ఏది ముఖ్యమంటే!

బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం, చెడు ఆహారపు అలవాట్లు శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ఈ కారణంగానే పదే పదే జలుబు, అలసట, ఇన్ఫెక్షన్లు , నీరసం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చాలామంది విటమిన్ సి , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ రోగనిరోధక శక్తికి చాలా కీలకమైనవే. అయితే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి విటమిన్-సి, విటమిన్-డి.. ఈ రెండు విటమిన్లలో ఏది ముఖ్యమైనది? వివరంగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం.. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రక్షణ కవచం వంటిది. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించి, నిర్మూలిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తే, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వైద్య నివేదికల ప్రకారం విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది , యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో , వాపును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మాత్రమే రోగనిరోధక శక్తి బలపడదని, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, సరైన పోషకాహారం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి , డి రెండూ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ వేర్వేరు విధులు ఉన్నాయి, కాబట్టి వీటిలో దేని లోపమైనా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. విటమిన్-సి.. విటమిన్ సి ఆరోగ్యానికి అత్యవసరం, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. ఇది శరీరంలో నిల్వ ఉండని, నీటిలో కరిగే విటమిన్, కాబట్టి ఇది ప్రతిరోజూ అవసరం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో మరింత మెరుగ్గా పోరాడగలుగుతుంది. విటమిన్ సి ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తగినంత మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు కాలవ్యవధిని కొంత మేరకు తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్-డి.. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా అవసరం విటమిన్ డి శరీరంలోని టి-కణాలను , ఇతర రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. ఈ కణాలు వైరస్‌లు , బ్యాక్టీరియాలతో పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి వాపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను బాలెన్స్ విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ , ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతూ, తక్కువ సూర్యరశ్మిని పొందే వ్యక్తులలో ఈ లోపం సర్వసాధారణం. పోషకాలను ఎలా పొందాలి? శరీరానికి అవసరమైన విటమిన్ సి , డి అందాలంటే, సరైన ఆహారం , జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. నారింజ, ఉసిరి, నిమ్మకాయలు, జామకాయలు, క్యాప్సికమ్ , స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కోసం, గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, పుట్టగొడుగులు , పాల ఉత్పత్తులను తినడం మంచిది. *రూపశ్రీ.

Publish Date: Jun 2, 2026 6:43PM
ఉదయం లేవగానే చీలమండల్లో నొప్పి వస్తోందా?  ఇది ఏ జబ్బుకు సిగ్నల్ తెలుసా?
ఉదయం లేవగానే చీలమండల్లో నొప్పి వస్తోందా?  ఇది ఏ జబ్బుకు సిగ్నల్ తెలుసా?

ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి. ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు. కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు. మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు. అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది. చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి. పనిలో భాగంగా గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు.. మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి. *రూపశ్రీ.

Publish Date: Jun 1, 2026 5:11PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds