ముప్పేట దాడితో విలవిల్లాడుతున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి

  రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి  అన్నిదారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది. గతంలో మూడు జిల్లాలకు పరిమితమైన అయన హావాను కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి సిద్దమైంది. అందులో బాగంగానే అయన నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపిందంటున్నారు. దాంతో పాటు అయన అస్తులపై విజిలెన్స్ నివేదిక అదారంగా ఎక్కడి కక్కడ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం దూకుడు పెంచింది. పెద్దిరెడ్డిని ఒక్క జిల్లాకు పరిమితం చేయడంతో టీడీపీ నేతల కంటే వైసీపీ సీనియర్లు తెగ హ్యాపీగా పీలవుతున్నారంట.వైసీసీ ప్రభుత్వంలో జిల్లాలో విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేట్లు పెద్దిరెడ్డి చక్రం తిప్పారు.   తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్‌లో ఉన్నప్పటికి చాల తెలివిగా తన నియోజకవర్గాన్ని మాత్రం చిత్తూరు జిల్లాలో కలిపించుకున్నారు. ఆయన కూమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపి కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న తంబల్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనికితోడు అయనకు రాజంపేట నియోజకవర్గంలో దగ్గర బంధువులు ఉన్నారు. మరో వైపు పెద్దిరెడ్డి నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా తనకు ప్రోటో‌కాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అగిపోయింది.అయితే అయన వ్యాపారాలు అస్తులు తిరుపతిలో ఉండటంతో పాటు అయన అనుంగు శిష్యులు అంతా తిరుపతి జిల్లాలో ఉండటంతో ఇక్కడ కూడా అయన ప్రభ వెలిగిపోయింది అధికారం ఉన్నప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయన వర్గం 2019-24 మద్య కాలంలో తమ అధికారాన్ని అన్ని విధాలుగా 3 జిల్లాలలో చూపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూముల అక్రమణ జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచెర్ల మండలంలోని మంగళం పెట అటవీ భూముల్లో  సరిహద్దు రాళ్లు నాటిన పెద్దిరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది. పాకాల కోర్టులో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ మొదలు అయ్యాయి. మదనపల్లి బండమీదామ్మపల్లెలో అయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో సీఐడీ కోర్టులో ప్రోసీడింగ్స్ మొదలయ్యాయి.. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం,  పార్టీ కార్యాలయం, గోశాల అన్నీ బుగ్గ మఠానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఉన్నాయన్న సర్వే డిపార్ట్ మెంటు నివేదిక అదారంగా అయనను విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. ఇక ఏపీ లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డి నాలుగో నిందితుడు.  అలా పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలవ్వడంతో కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు కూడా ఖుషీ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోపెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచింది. అప్పట్లో అయనను కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం చేయాలని వైసీపీలోన మిగతా జిల్లా మంత్రులు , సీనియర్లు ప్రయత్నించినప్పటికి ఫలించలేదు. అప్పట్లో డిప్యూటీ సియం గా ఉన్న నారాయణ స్వామి కంటే మాములు మంత్రి అయన పెద్దిరెడ్డికి అధికారిక కార్యక్రమాలలో అధికారులు పెద్దపీట వేసేవారు. చివరకు సియం హాజరైన అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ నిలబడి ఉంటే ద్దిరెడ్డి కూర్చున్న పోటోలు అప్పట్లోసోషియల్ మీడియాలో  పెద్దఎత్తున హల్ చల్ చేసాయి. ఇక రోజా సైతం పెద్దిరెడ్డి వైభోగం చూస్తూ తనకు మంత్రి హోదా ఎందుకు అని ఫీలైన సందర్భాలున్నాయంట. ఇలాంటి తరుణంలో అయన నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉండటంతో పుంగనూరుని చిత్తూరులో కలవవద్దని వైసీపీ నేతలు కోరారంట.  కాని అప్పుడు పెద్దిరెడ్డి హావా ముందు వీరి మాటలు సాగలేదంట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఇబ్బంది రాకుండా తిరుపతి ,చిత్తూరు జిల్లా నుంచి దూరం చేయడానికి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపేసింది. దాంతో పాటు పుంగనూరు సెగ్మెంట్లోని పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు తీసుకుందంట. పులిచెర్ల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. పులిచెర్లలో టీడీపీ బలంగా ఉండటంతో ఆ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి స్కెచ్ గీసిందంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై చాలామంది వైసీపీ ముఖ్య నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారంట. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలు ఇకపై పెద్దిరెడ్డి పెత్తనం ఉండదని సంబరపడిపోతున్నారంట.
Publish Date: May 22, 2025 7:40PM

తిరుమలలో అపచారం.. భక్తులు ఆందోళన

  తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద  ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం వ్యక్తి నమాజ్  చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.  గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని అటు స్థానికులు సైతం గమనించారు. వెంటనే టీటీడీకి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం శ్రీవారిని అపచారం చేయడమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పల్గమా దాడి నేపద్యంలో ఇలాంటి ఘటనలో తిరుమలలో జరగడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు  
Publish Date: May 22, 2025 7:31PM

కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు

  కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2017 లో  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం, గుర్తురులో ఝాన్సీ రెడ్డి రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కోసం ఈ స్థలంలో శంకుస్థాపన చేయడంతో భూమి వ్యవహా రం వెలుగుచూసింది. ఈ స్థలాన్ని విదేశీయురాలైన ఝాన్సీరెడ్డి ఎలా కొనుగో లు చేసిందని వర్ధన్నపేట, ఇల్లంద ప్రాంతానికి చెంది న దామోదర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో భారత పౌరసత్వాన్ని వదిలి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఝాన్సీరెడ్డి, విదేశీ మారక వ్యవహారాల చట్టం ప్రకారం వ్యవసాయ ల్యాండ్ కొనుగోలు చేయడం నేరం. పిటిషనర్ వాదనల ప్రకారం, ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా పౌరసత్వం స్వీకరించారని, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం ఆమె వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి ఈ భూమిని దక్కించుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం కూడా జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై మే 1వ తేదీన జస్టిస్ సీవీ భాస్కరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజా విచారణలో... ఝాన్సీ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో, భూమి కొనుగోలు వ్యవహారంపై జూన్ 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆమెకు, ఆమె భర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారితో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్‌లకు కూడా న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది
Publish Date: May 22, 2025 7:18PM

పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టాం.. ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్ లోని బికనూర్ ఎయిర్ బేస్ ను గురువారం (మే 22) సందర్శించిన మోడీ ఆ తరువాత ఓ బహిరంగ సభలో మాడారు.   పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను కేవలం 22 నిముషాలలో ధ్వంసం చేశామన్నారు.  గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో బదులు తీర్చుకున్నామని వెల్లడించారు. మన ఆడపడుచుల సిందూరం తుడిచిన ఉగ్రవాదులకు సిందూరం తుపాకి తూటాగా మారితే ఏం జరుగుతుందో చూపామన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారనీ, ఆపరేషన్ సిందూర్ తో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారనీ ప్రధాని మోడీ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో తన నరాల్లో రక్తం కాదు సిందూరం మరిగిందన్న ప్రధాని మోడీ.. ఇక ముందు కూడా ప్రతి ఉగ్రదాడిని, ఉగ్ర చర్యనూ యుద్ధంగానే పరిగణిస్తామన్నారు.  
Publish Date: May 22, 2025 6:23PM

మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలే బాంబులు పెట్టారు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారని అనుమానం వస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం సుప్రీంకోర్టుకు అర్ధమైంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి అర్థం కావట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని ఆయన అన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే.. ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించిందని కేటీఆర్ పేర్కొన్నారు.  జస్టిస్ గోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారు. అయితే కమిషన్‌ గడువు మళ్లీ ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాంమని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ప్రమాదకరమైన మానసిక స్థితి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు.  అందుకే ఒకే అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వర్షాలకు వరి ధాన్యం కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలాంటి సమయంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి, రేవంత్ రెడ్డి నాలుగుసార్లు మిస్ వరల్డ్ కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా?" అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే, అందాల పోటీల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. "సీపీఐ నేత నారాయణ చెప్పినట్లుగా, మంత్రులు అందాల రాణులకు టూర్ గైడ్‌లుగా మారారు. ఇది పాలనా లేక ఫ్యాషన్ షోనా?" అని కేటీఆర్ నిలదీశారు.
Publish Date: May 22, 2025 5:44PM

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మృతి

మాజీ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు (జీఎన్ రావు) బుధవారం (మే 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. హైదరాబాద్ కుందన్ బాగ్ లోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు.  రిటైర్ అయిన తరువాత ఈయన ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆరంభించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల కమిటీని జగన్ 2020లో ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి జీఎన్ రావును చైర్మన్ గా నియమించారు. జీఎన్ రావు నేతృత్వంలోని మూడు రాజధానుల కమిటీ   మూడు రాజధానులే రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని  నివేదిక సమర్పించింది. అలా నివేదిక సమర్పించి ఊరుకోకుండా.. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ని విశాఖలో ఏర్పాటు చేయాలేని కూడా జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. అలాగే రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా నియమించాలనీ జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికపై అప్పట్లో  చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావుపై తీవ్ర విమర్శలు సైతం చేశారు.   1988 బ్యాచ్ కు చెందిన జీఎన్ రావు ఉద్యోగ ప్రస్థానం గుంటూరు కలెక్టరుగా ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పలు కీలక పోస్టులలో పని చేశారు.  పదవీ విరమణ చేసిన తరువాత  అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆయన్ని శిల్పరామం స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు.  జీఎస్ రావు అంత్యక్రియలు శుక్రవారం  (మే 23) జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరుగుతాయి. 
Publish Date: May 22, 2025 5:41PM

కడప మహానాడు కమిటీల్లో తెలంగాణ టీడీపీ నేతలు.. సంకేతమదేనా?

తెలుగుదేశంపార్టీ  ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడులో  తెలంగాణ పార్టీ నేతలకు సముచిత స్థానం ఇచ్చింది. మహానాడు కోసం వేసిన 19 కమిటీలలోనూ తెలంగాణ తెలుగుదేశం నేతలకు స్థానం కల్పించింది. అంతే కాకుండా తెలంగాణ అంశాలపై కూడా ఈ మహానాడులో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విషయంలో  పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు.   తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, తీసుకొస్తానని చంద్రబాబు ఇప్పటికే పలు సార్లు బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉన్నప్పటికీ  పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహించే నాయకులకే కొరత ఉందన్నది తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే మహానాడులో తెలంగాణలో పార్టీ పటిష్టతపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో భాగంగానే మహానాడు కమిటీల్లో తెలంగాణ పార్టీ నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు.  మహానాడు ఆహ్వాన కమిటీలో తెలంగాణ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు,  తీర్మానాల కమిటీలో నన్నూరి నర్సిరెడ్డి, చిలువేరు కాశీనాధ్, సామ భూపాల్ రెడ్డికి స్థానం కల్పించారు. అలాగే  వసతుల కమిటీలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, సనగాల సాంబశివరావు, షేక్ అరిఫ్ లకు,  మహానాడు వేదిక కమిటీలో నందమూరి సుహాసిని, నన్నూరి నర్సిరెడ్డికి అవకాశమిచ్చారు. భోజనాల కమిటీలో కూరపాటి వెంకటేశ్వర్లు, బండి పుల్లయ్య, అజ్మీరా రాజునాయక్, జనగాం నర్సింగరావు సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియా కమిటీలో తెలంగాణ తెలుగుదేశం నేతలు తిరునగిరి జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, ప్రకాష్ రెడ్డి, ఆర్ధిక వనరుల కమిటీలో గడ్డి పద్మావతి, నెల్లూరి దుర్గాప్రసాద్ కు చోటుకల్పించారు. వీళ్ళే కాకుండా ఇంకా అనేక కమిటీల్లో తెలంగాణ నేతలకు చంద్రబాబు  అవకాశాలు కల్పించారు. అవకాశాలు కల్పించటమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మహానాడులో తీర్మానాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.   ఇప్పటికే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోను సభ్యత్వ నమోదు  కార్యక్రమం నిరాఘాటంగా జరుగుతునే ఉంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దాదాపు 4 లక్షల సభ్యత్వాలున్నాయి. కడపలో మహానాడు తర్వాత ఇక జాప్యం లేకుండా తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారంటున్నారు. తెలంగాణలో ఎంపికచేసిన    నియోజకవర్గాల్లో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి గట్టి పట్టు ఉన్న   రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో  ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఈ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిం చాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.   
Publish Date: May 22, 2025 5:23PM

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..ఎందుకో తెలుసా?

  సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు.  2023లో బేగంబజార్, నల్గొండ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో, సీఆర్పీసీ 313 ఎగ్జామినేషన్లో భాగంగా సీఎం హాజరయ్యారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది.  గత శాసన సభ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్‌ సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు.  ముఖ్యమంత్రి కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది.  
Publish Date: May 22, 2025 5:06PM

కొత్త రేషన్ కార్డుకు ఆ సర్టిఫికెట్ అవసరం లేదు : మంత్రి నాదెండ్ల

  రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. అలాగే పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో కూడా అవసరం లేదన్నారు. ఈ విషయంలో క్షేత్రస్ధాయి సిబ్బంది పొరపాట్లు చేయువద్దని ఆదేశించారు. రేషన్ కార్డుల కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా తప్పనిసరిగా స్వీకరించాలని, ఏవైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.  దరఖాస్తు అందిన 21 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి కార్డులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన 4.24 కోట్ల మందికి జూన్ నెలలో ఉచితంగా రేషన్ కార్డులు (స్మార్ట్ రైస్‌కార్డులు) జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద సిద్ధంగా ఉందని, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం సామాన్యులకు మరింత చేరువగా ఉంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రైస్‌కార్డులను అందిస్తామని, దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. ఫ్యామిలీ సభ్యుల్లో ఎవరినైనా వయసుతో నిమిత్తం లేకుండా రేషన్ కార్డులో చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి  తెలిపారు. అయితే, కార్డు నుంచి పేర్ల తొలగింపునకు మాత్రం ప్రస్తుతం మరణించిన వారి వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా, రేషన్ కార్డులో కుటుంబ పెద్ద (హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ) పేరు మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. కార్డులో నమోదైన తప్పుడు వివరాలను సరిచేసుకునేందుకు గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇకపై తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించుకునేలా సులభతరం చేశామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.
Publish Date: May 22, 2025 4:31PM

సజ్జలకూ చెరశాల?.. అటవీ భూముల కేసులో అడ్డంగా బుక్

 వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సర్వం తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కర్మఫలం అనుభవించడానికి రెడీ కాక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు పిల్ల సజ్జల జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా చేసిన నిర్వాకానికి అజ్ణాతంలో గడుపుతున్నారు. కేసుల్లో అరెస్టు బెయిలు రక్షణ ఉన్నప్పటికీ భయంతో బెంబేలెత్తుతున్నారు. నోరు విప్పి మాట్లాడడానికి జంకుతూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇక  ఇప్పుడు పెద్ద సజ్జల అదే సజ్జల రామకృష్ణారెడ్డి బూబాగోతాన్ని తేల్చేందుకు సర్కార్ సమాయత్తమైంది. తాజాగా ఆయన ఆక్రమించి అనుభవిస్తున్న 55 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  క‌డ‌ప జిల్లా సీకే దిన్నెమండ‌లం ప‌రిధిలోని అట‌వీ భూముల్లో 55 ఎక‌రాల‌ను సజ్జల ఆక్రమించి   సజ్జ‌ల ఎస్టేట్‌ నిర్మించిన‌ట్టు వచ్చిన ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.   దీంతో  క‌లెక్ట‌ర్ ఆదేశాలతో రెవెన్యూ, అట‌వీ శాఖల అధికారుల‌ బృందం స‌జ్జ‌ల ఎస్టేట్‌లో ప‌ర్య‌టించి.. నిజనిజాల నిగ్గు తేల్చింది. సజ్జల అటవీ భూముల ఆక్రమణ వాస్తవమేనని అధికారుల బృందం నివేదిక సమర్పించింది.  ఆ నివేదిక ఆధారంగా  సజ్జల ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సంబంధిత భూముల‌ను స్వాధీనం చేసుకుని.. కంచె ఏర్పాటు చేయ‌డంతోపాటు.. హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.   అయితే సజ్జల కబ్జాల పర్వం, ఆక్రమణల వ్యవహారం ఇంతటితో ఆగేది కాదు. ఆగే అవకాశమూ లేదు. ఎందుకంటే.. జగన్ హయాంలో సజ్జల కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి సజ్జలకు సహకరించిన అధకారులందరిపైనా అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా సజ్జల కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు.  ఆక్ర‌మిత భూమిలో ఉన్న చెట్ల‌ను న‌రికి వేయ‌డం.. అట‌వీ సంప‌ద‌కు న‌ష్టం క‌లిగించ‌డం పైనా ప‌రిహారం వ‌సూలు చేయడమే కాకుండా,  కేసు న‌మోదు చేసి.. జైలుకు త‌ర‌లించే అవ‌కాశం కూడా ఉంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో జగన్ హయాంలో నిబంధనలు, విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా చట్ట, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన ఘనులంతా ఇప్పుడు చట్టం ముందు దోషులుగా నిలవక తప్పదని అంటున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు, గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసు, ముంబై నటి కాదంబరి జత్మలాని కేసుల్లో పలువురు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ జాబితాలో సజ్జల కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. 
Publish Date: May 22, 2025 4:10PM

వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం

  ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. "మన ఊరు - మాటా మంతి" పేరుతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సక్రమంగా పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఇంకా వారికి ఉన్న సమస్యలపై ఆరా తీశారు.  ప్రజలు చెప్పిన సమస్యలను తెలుసుకున్న పవన్ వాటి పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమానికి హాజరైన రావివలస గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి తెలుపుకునే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. 
Publish Date: May 22, 2025 4:07PM

కిరికిరి కిష‌న్!

ఇంత‌వ‌ర‌కూ రాష్ట్రానికి ఏం చేశారో తెలీక ప‌రేషాన్  ఇప్ప‌టి వ‌ర‌కూ తెలంగాణ‌కు ఒక కేంద్ర‌మంత్రిగా కానీ, అంబ‌ర్ పేట్ ఎమ్మెల్యేగా గానీ, సికింద్ర‌బాద్ ఎంపీగా గానీ కిష‌న్ రెడ్డి ఏం చేసిన‌ట్టు? అని గూగుల్ సెర్చ్  చేస్తే.. క‌నిపించే ఒకే ఒక్క ఆన్స‌ర్.. ఆయ‌న సీతాఫ‌ల్ మండీలో ఓపెన్ చేసిన ఒకే ఒక్క లిఫ్ట్. అంత‌కు మించి మ‌రేం క‌నిపించ‌ద‌ని అంటారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్ర మంత్రిగా కిష‌న్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంట‌న్న‌ది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లు పెడితే టీపీసీసీ  చీఫ్ మ‌హేష్ గౌడ్ వ‌ర‌కూ అంద‌రూ అడిగి చూశారు. నో ఆన్స‌ర్. ఇక రాజాసింగ్ ని అడిగితే కిష‌న్ రెడ్డి కిరికిరిల‌న్నీ ఇట్టే బ‌య‌ట పెట్టేస్తారు. అధికారంలో ఎవ‌రుంటే వారితో చెలిమి చేయ‌డం కిష‌న్ రెడ్డికి కాషాయంతో పెట్టిన విద్య‌గా చెబుతాడాయ‌న‌. దీంతో ఇదో దుమారం. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాక‌పోవ‌డానికి కిష‌న్ రెడ్డి అతి పెద్ద కారణంగా చెబుతారు. మోడీ తో ఇంత సాన్నిహిత్య‌ముండి.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. ఎందుక‌లా చేస్తార‌ని అడిగితే  అదంతే. అలా ఎప్ప‌టికీ ఉండ‌దంతే అంటారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  అదేమంటే రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింద‌న్న ప్రెజంటేష‌న్లు ఇచ్చి మ‌మ అనిపించేస్తారు కిష‌న్ రెడ్డి. ఇవి కాదు మీరు మీరేం చేశారో చెప్పాల‌ని నిల‌దీస్తారు కాంగ్రెస్ లీడ‌ర్లు. మొన్న‌టికి మొన్న కాంగ్రెస్.. ఒక అఖిల ప‌క్షం వేస్తే అందుకూ డుమ్మా కొట్టారు కిష‌న్ రెడ్డి. అదేమంటే త‌న‌కు లేటుగా తెలిసింద‌ని తేల్చేశారు. ఇక‌పై ముందుగా చెప్పండి వ‌స్తాన‌ని క‌వ‌ర్ చేశారు. ఈ మేనేజ్మెంట్ మెంటాల్టీ ఆయ‌న‌కు తొలినాటి నుంచి  ఉంద‌ని అంటారు.  దీనంత‌టికీ కార‌ణ‌మేంటి? ఒక య‌డ్యూర‌ప్ప‌లా ఇక్క‌డ కూడా కిష‌న్ రెడ్డి ఎందుకు ఎద‌గ‌లేక పోతున్నారు? పార్టీని అధికారంలోకి ఎందుకు తేలేక పోతున్నారు? అని చూస్తే ఆయ‌న‌కు అధికారంలో ఉండ‌టం క‌న్నా ఇలా కేంద్రంలో ఏదో ఒక మంత్రి ప‌ద‌వితో.. రాష్ట్రంలో ఉన్నామంటే ఉన్నామ‌న్న పాత్ర పోషించ‌డ‌మే చాలా చాలా ఇష్ట‌మ‌ని అంటారు. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి గ‌త కొంత‌కాలంగా ఖాళీ ఉందిక్క‌డ‌. ఈట‌ల‌కు ఈ పోస్టు దాదాపు ఖ‌రారైతే.. మోకాల‌డ్డేసిన ఘ‌న‌త కూడా కిష‌న్ రెడ్డి పేరిటే లిఖించ‌బ‌డి ఉంద‌ని అంటున్నారు. ఒక వేళ ఈట‌ల అధ్య‌క్షుడిగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్తే అదెక్క‌డ ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించే వ‌ర‌కూ వెళ్తుందోన‌ని.. త‌న పాత బ్యాచ్ మొత్తాన్ని పోగేసి కొత్త వ్య‌క్తి అధ్య‌క్షుడు కాకుండా కిష‌న్ రెడ్డి కిరికిరి చేసిన‌ట్టు చెప్పుకుంటున్నారంతా.  గ‌తానికి వ‌ర్త‌మానానికి తేడా చూస్తే ఒక‌ప్పుడు తెలంగాణ‌ అసెంబ్లీలో ఒకే ఒక్క‌డిగా ఉన్న ఎమ్మెల్యే కాస్తా ఇప్పుడు 8 మంది వ‌ర‌కూ చేరింది. ఎంపీల సంఖ్య కూడా 8కి చేరింది. మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ రాణింపు. ఇక గ్రేట‌ర్ లో బండి హ‌యాంలో 4 నుంచి సుమారు 50 వ‌ర‌కూ చేరింది. కానీ వీరిలో ఏ ఒక్క‌రిలోనూ మ‌రొక‌రికి స‌ఖ్య‌త ఉండ‌దు. పాత కొత్త బ్యాచ్ లు వేరు వేరు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీల గ్రూపులు వేరు వేరు. ఇలా ర‌క‌ర‌కాల గ్రూపులుగా పార్టీ త‌యార‌య్యి.. అదో క‌ప్ప‌ల త‌క్కెడ‌గా మారింద‌ని స‌మాచారం. దీనంత‌టికీ కార‌ణం కిష‌న్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్ వంటి వారు. ఇక్క‌డ కూడా ఏపీలా ఒక కూట‌మి క‌ట్టి.. ఎలాగైనా అధికారంలోకి రావ‌చ్చ‌ని భావిస్తుంటే.. అందుకు మోకాల‌డ్డుతున్న‌ది కూడా కిష‌న్ రెడ్డేనంటారు. కార‌ణం ఇప్ప‌టికే అక్క‌డ త‌మ జ‌గ‌న్ రెడ్డిని ఓడించిన కూట‌మి అంటేనే కిష‌న్ రెడ్డి కి కోపం చిరాకు. అలాంటి కూట‌మితో ఇక్క‌డా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మా? న‌థింగ్ డూయింట్ అంటున్నార‌ట కిష‌న్ రెడ్డి. అదేమంటే రేవంత్ రెడ్డి.. టీడీపీ- బీజేపీ- జ‌న‌సేన కూట‌మిక‌ట్ట‌డాన్ని అడ్డుకుంటున్న‌ట్టు ఒక రూమ‌ర్ వ‌దిలి... నిందంతా ఆయ‌న‌పైకి తోసేస్తున్నార‌ట కిష‌న్ రెడ్డి.  అంటే రాష్ట్రంలో పార్టీ దానంత‌ట అది మోడీ హ‌వాలో ఓట్లు, సీట్లు సాధించ‌డం త‌ప్ప‌.. ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం.. అధ్య‌క్ష స్థాయిలో చేసిన కృషిని అనుస‌రించి తెచ్చిన విజ‌యం కిష‌న్ రెడ్డి పేరిట ఒక్క‌టీ ఉండ‌ద‌ని అంటారు.. కాల‌సాపేక్ష సిద్దాంతం.. అంటే పార్టీలో అధిక కాలం ఉండ‌టం వ‌ల్ల వ‌చ్చే ప‌ద‌వుల‌ను అనుభ‌వించి అక్క‌డితో ముగిద్దాం అన్న ధోర‌ణి త‌ప్ప‌.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావ‌డాన్ని కిష‌న్ రెడ్డి పెద్ద‌గా ఆస్వాదించ‌ర‌ని తెలుస్తోంది. కార‌ణం అదే ఇత‌ర పార్టీలు అధికారంలో ఉంటే వారితో లాలూచీ ప‌డి.. అడ్డంగా సంపాదించుకోవ‌చ్చు. ఎవ‌రూ అడిగే వారుండ‌రు. ఒక వేళ త‌మ పార్టీ స్వ‌యానా అధికారంలో ఉంటే ఫోక‌స్ అంతా మ‌న మీదే ఉంటుంది కాబ‌ట్టి.. ఆ ఊసే వ‌ద్ద‌ని అంటార‌ట కిష‌న్ రెడ్డి. అలాంటి అవ‌కాశం ఇత‌రుల‌కు వ‌చ్చినా.. దాన్ని త‌న‌కున్న పాత ప‌రిచ‌యాల‌తో ఎలాగోలా మేనేజ్ చేసి చెక్ పెట్ట‌డంలో ఆరితేరిన నిపుణుడట కిష‌న్ రెడ్డి. త‌న మొత్తం కెరీర్ లో కిష‌న్ రెడ్డి నేర్చుకున్న విద్యే ఇదేన‌ట‌. పార్టీని అధికారంలోకి తెస్తే ఎంత? తేకుంటే ఎంత‌? అదే ఎవ‌రు అధికారంలో ఉంటే వారితో కుమ్మ‌క్కై నాలుగు రాళ్లు వెన‌కేసుకోక ఏంటీ చాద‌స్త‌మ‌ని మొహం మీదే అడిగేస్తార‌ట‌ కిష‌న్ రెడ్డి.  కిష‌న్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఏదైనా ఉందంటే అది ఇదేనంటారు. గ‌తంలో ఇటు కేసీఆర్, అటు జ‌గ‌న్ తో బాగా ద‌గ్గ‌ర‌య్యి.. వారి ద్వారా కావ‌ల్సినంత వెన‌కేశార‌ట కిష‌న్ రెడ్డి. అందుకే ఈ సారికి పార్టీ నుంచి పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న ఉండ‌కూడ‌ద‌ని చెప్పి పైన త‌నకున్న‌ ప‌లుకుబ‌డితో అధ్య‌క్ష ప‌ద‌వి సాధించార‌ట‌. అప్పుడే అనుకున్నారంతా.. ఈ సారి ఎన్నిక‌లకు కిష‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌లో వెళ్ల‌డం అంటే అది ఓట‌మిని కొని తెచ్చుకోవ‌డ‌మ‌ని.  ఇలా కిష‌న్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయ‌క‌, పార్టీకి ఏం చేయ‌క‌.. అధికారంలోకి తెచ్చే దారిలేక‌.. ఎవ‌రైనా ఆ ప్ర‌య‌త్నం చేస్తుంటే చూస్తూ ఓర్చుకోలేక.. ఒకరంగా సైంధ‌వుడి పాత్ర పోషిస్తున్న‌ట్టుగా మాట్లాడుకుంటున్నారు పార్టీలో.. అందుకే ఆయ‌న‌కు కిరికిరి కిష‌న్ రెడ్డి అని పేరుపెట్టుకుని.. త‌మ అక్క‌సు మొత్తం తీర్చుకుంటున్నార‌ట రాజాసింగ్ లాంటి కొంద‌రు. మ‌రి చూడాలి త‌న‌పై వ‌స్తున్న ఈ ఆరోప‌ణ‌ల‌కు కిష‌న్ రెడ్డి ఎలాంటి స‌మాధానం ఇస్తారో. తెలాల్సి ఉంది.
Publish Date: May 22, 2025 3:48PM

ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్..ఎందుకంటే?

  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై  సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ  రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ సర్వోత్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని జస్టిస్ గవాయి మండిపడ్డారు. ప్రభుత్వ మార్కెటింగ్ కార్పొరేషన్ సంస్థపై ఈడీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి, ఒక ప్రభుత్వ సంస్థను దోషిగా ఎలా చిత్రీకరిస్తారంటూ ఈడీని నిలదీసింది. తమిళనాడులోని సర్కారు లిక్కర్ షాపులపై ఈడీ చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు గ్రహం వ్యక్తం చేసింది.  మద్యం రవాణా, బార్ లైసెన్సుల మంజూరు, బాటిల్ తయారీ సంస్థలు మరియు డిస్టిలరీలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం ద్వారా లెక్కల్లో చూపని నగదును ఆర్జించారన్న ఆరోపణలపై ఈడీ మార్చిలోనూ, గత వారంలోనూ తమిళనాడులోని ప్రభుత్వ లిక్కర్ షాపులపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల సమయంలో అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిలోని డేటాను క్లోన్ చేశారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, "మీరు వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు... కానీ కార్పొరేషన్లపైన ఎలా చేస్తారు? మీ ఈడీ అన్ని హద్దులూ మీరుతోంది!" అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
Publish Date: May 22, 2025 3:39PM

తండ్రి పోలీసు, కొడుకు టెర్రరిస్టు .. ఫ్యామిలీ ప్యాకేజ్‌పై డౌట్లు

విజయనగరం టెర్రర్‌ మాడ్యూల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్‌ కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఒక్కసారిగా కేసులో క్లారిటీ వస్తోంది. సిరాజ్ , హైదరాబాద్‌కు చెందిన సమీర్, వరంగల్‌కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్‌తో కలిసి ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.  జకీర్ నాయక్, ఇస్రార్‌ అహ్మద్‌, షేక్ యాకుబ్ జమాలి, షేక్ జావిద్ రబ్బాని ప్రసంగాలతో ప్రభావితమైన ఈ గ్రూప్.. ఏకంగా అల్ హింద్ ఇతహదుల్ ముస్లిమీన్.. అంటే అహిం పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌ ను దేశవ్యాప్తంగా విస్తరించి.. యువతను మతోన్మాదంవైపు ఆకర్షించాలనేది వీరి ప్లాన్ అన్నది కన్ఫెషన్ రిపోర్ట్ లో తేలిన విషయం. ఇదే కాన్సెప్ట్‌తో ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నాడు సిరాజ్. అక్కడ మరి కొంత మందితో పరిచయం పెంచుకున్నాడు.  ఆ తర్వాత వీరికి సౌదీ నుంచి ఆదేశాలు రావడం ప్రారంభమైంది. బీహార్ నుంచి సౌదీకి వెళ్లి అక్కడే ఉంటున్న అబు ముసాబ్‌ సూచనలతో యాక్షన్ ప్లాన్ కు రెడీ అయ్యారు. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. అబు సూచనలతో తక్కువ ఖర్చుతో ఐఈడీ బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యామని సిరాజ్‌ చెబుతున్నాడు. బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు వీరికి ఒమన్ నుంచి అందాయని తేలింది. ఒమన్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్‌ ఖాన్ ఈ డబ్బును పంపాడని పోలీసులు గుర్తించారు. బాంబుల తయారీకి ఆన్‌లైన్‌లో అమోనియం నైట్రేట్‌, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను కొనుగోలు చేసింది సిరాజ్ టీమ్. ఇవన్నీ కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు.. స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేశారు. దీపావళి టపాసుల మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు.  విజయనగరంలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చడానికి సిరాజ్ కుట్ర పన్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్‌ అయ్యాడు. అతని బైక్ హ్యాండిల్‌కు ఉన్న సంచిలో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ మ్యాటర్ మొత్తం బయటికొచ్చింది. వీరంతా నిత్యం టచ్‌లో ఉండేందుకు సిగ్నల్ యాప్‌ వాడారు. సిగ్నల్‌ యాప్‌లో సిరాజ్-సమీర్ మధ్య చాటింగ్‌ జరిగింది. బాంబుల తయారీ, పేలుళ్ల గురించి డిస్కషన్ చేసుకున్నారు. వీరికి డబ్బులు అందితే ఓ స్కూల్ పెట్టి అందులోని కెమికల్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేయొచ్చంటూ చాటింగ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను టార్గెట్ చేద్దామంటూ డిస్కషన్ చేసుకున్నారు. ఒక రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు.  వీటికి తోడు సిరాజ్‌కు విజయనగరం సహకార బ్యాంక్‌ అకౌంట్‌లో 42 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. సహకారబ్యాంక్ అకౌంట్‌లో అంత డబ్బు ఎలా వచ్చింది..? అనేది తేలాల్సి ఉంది. సిరాజ్ అరెస్టయ్యాక డీసీసీబీ బ్యాంక్‌లో సిరాజ్‌కున్న లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు అతడి తండ్రి రెహ్మాన్. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే రెహ్మాన్ ముందు సివిల్ డ్రెస్‌లో, తర్వాత యూనిఫామ్‌లో బ్యాంక్‌కు వెళ్లి లాకర్‌ ఓపెన్ చేయడానికి బ్యాంకు సిబ్బందిపై  ఒత్తడి తెచ్చాడు. ఎన్ఐఏ అధికారులు ముందుగానే అలర్ట్ చేయడంతో రెహ్మాన్‌ను అనుమతించలేదు బ్యాంక్ సిబ్బంది. సిరాజ్ లాకర్‌ను ఆయన తండ్రి ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు..? అన్ని లక్షలు అకౌంట్ లో ఉంటే, అవి ఎలా వచ్చాయని తండ్రి ఎందుకు అడగలేదు? ఇదంతా ముందే తెలుసా..?  ఇలాంటి డౌట్లు తెరపైకి వస్తున్నాయి. అన్ని విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అటు సిరాజ్ బాంబ్ పేల్చాలనుకున్న ప్లేసుల్లో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్ చేసింది.
Publish Date: May 22, 2025 3:27PM

ఆ నవ్వుకి అర్ధం ఏమిటి?

అరెస్టు చేయడానికి వచ్చినపుడు బయట పోలీసుల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అది చూసి నిందితుడు రెచ్చిపోయి, ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాడు.  అరెస్టు చేసి సెల్ లో వేశాకా, పోలీస్ మర్యాద మరో రకంగా ఉంటుంది. చిల్లర దొంగతనాలు చేసి తరచూ జైలుకెళ్ళే వారికి ఆ తేడా తెలుసు కానీ, ఇటీవల బడా రాజకీయా నాయకులు అరెస్టుల క్యూ పెరిగాక, లాకప్ లు, జైలు గదులు నిండపోయాక వారి ప్రవర్తనలోనూ వింత మార్పులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో వైసీపీ అధినేత జగన్ ను అరెస్టు చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనలో ఆందోళన మొదలైనట్లుంది. గత నాలుగు రోజులుగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరినీ వదిలిపెట్టం. రాసి పెట్టుకోండంటున్నారు. మొన్నటి వరకూ బట్టలూడదీస్తాం అని చెబుతున్న నేపథ్యంలోనే ఆయన సహచర, అనుచరగణం ఒక్కొక్కరూ అరెస్టై జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అయినా ఆయన రంకెలు తగ్గలేదు.  ఇదే విషయాన్ని తాజాగా  ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని ఒక మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తే.. ఆయన ఆసాంతం విని పకపకా నవ్వారు. అంతే తప్ప కామెంట్ చేయలేదు. దాంతో ఆయన నవ్వుకి అర్ధం ఏమిటి అని వెతుక్కోవలసిన పనిలో పడ్డారు పాత్రికేయులు. రేపో మాపో ఆయన కూడా అరెస్టయ్యేవాడేననీ, దానికే రంకెలు వేస్తున్నాడనీ అర్ధం కాబోలు అనుకుంటూ పాత్రికేయులు చర్చించుకుంటున్నారు. జగన్ జైలు కెళితే లెక్కలు రాసుకుని ఉపయోగం ఏమిటి?  ఈ కేడర్ తర్వాత కూడా ఆయన వెంటే ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 
Publish Date: May 22, 2025 3:10PM