ఘాట్కేసర్‌లో అర్థరాత్రి హైడ్రామా.. కార్లను వెంబడించిన పోకిరీలు!
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి హైడ్రామా.. కార్లను వెంబడించిన పోకిరీలు!

ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుని కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. బైక్‌లపై దూసుకొచ్చిన వారు కార్లను వెంబడిస్తూ, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. కొంతదూరం వరకు వెంటాడుతూ దాడికి కూడా యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో బైక్‌లపై వచ్చిన యువకులు కారు చుట్టూ తిరుగుతూ, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసినా వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వ్యవహరిస్తూ హంగామా సృష్టించినట్లు బాధితులు తెలిపారు. పోకిరీల తీరుతో కారులో ఉన్న చిన్నారులు భయంతో బిగ్గరగా ఏడవగా, మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ భయానక అనుభవాన్ని వివరిస్తూ ఓ యువతి సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసింది. రాత్రి వేళల్లో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, డ్యాష్‌క్యామ్ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళల్లో ఇలాంటి పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి విచారణ చేపడతారా? బాధ్యులను గుర్తించి చట్టం ముందు నిలబెడతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Publish Date: Jun 29, 2026 5:21PM
అన్నాడీఎంకేకు భారీ షాక్!
అన్నాడీఎంకేకు భారీ షాక్!

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రవాణా శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడైన ఎంఆర్ విజయభాస్కర్ తాజాగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అధికారికంగా లేఖ సమర్పించారు. అన్నాడీఎంకేలో ఎంతో కాలంగా చురుగ్గా ఉంటూ, కరూర్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న విజయభాస్కర్ లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం ప్రతిపక్ష శిబిరానికి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. వరుస రాజీనామాలతో అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం భారీగా పడిపోతోంది. ఈ వరుస పరిణామాల వెనుక తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ దూకుడు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు టీవీకేలో చేరిపోగా, విజయభాస్కర్ రాజీనామా తదుపరి రాజకీయ దిశపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర శాసనసభలో ఒకప్పుడు బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు కేవలం 44 మంది సభ్యుల బలానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. గత నెలలోనే మరగతం కుమారవేల్ (మదురాంతకం), ఎస్. జయకుమార్ (పెరుందురై), పి. సత్యభామ (ధరాపురం) వంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత మాజీ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ఐదో ఎమ్మెల్యేగా రాజీనామా చేయగా, ఇప్పుడు ఎంఆర్ విజయభాస్కర్ ఆరో వికెట్‌గా నిలిచారు. ఈ వరుస రాజీనామాలతో తమిళనాడులో కనీసం 5 నుండి 6 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు అధికార డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్నాయి. కేవలం గుర్తింపు కోసమే శాసనసభ్యులు ఇష్టానుసారంగా రాజీనామాలు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని లెఫ్ట్ పార్టీలు విమర్శిస్తున్నాయి. అన్నాడీఎంకే అగ్ర నాయకత్వం ఈ సంక్షోభాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వం వహిస్తున్న ఈ తరుణంలో, సి.వి. షణ్ముగం మరియు ఎస్.పి. వేలుమణి వర్గాల మధ్య ఉన్న అంతర్గత పోరు వల్లనే ఎమ్మెల్యేలు అసంతృప్తితో పార్టీని వీడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రాజకీయ వలసలు కేవలం ఎమ్మెల్యేల రాజీనామాలతోనే ఆగుతాయా లేదా రాబోయే రోజుల్లో మరికొందరు నేతలు కూడా ఇదే బాట పడతారా అనేది ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ ఆరో రాజీనామా అన్నాడీఎంకే పార్టీ మనుగడకే ఒక సవాల్‌గా నిలిచింది.

Publish Date: Jun 29, 2026 5:05PM
కేటీఆర్ ర్యాలీలో జగన్ ఫ్లెక్సీలు.. దీని భావమేమి తిరుమలేశా?
కేటీఆర్ ర్యాలీలో జగన్ ఫ్లెక్సీలు.. దీని భావమేమి తిరుమలేశా?

ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీఆర్ఎస్, వైసీపీల బంధం గురించి చర్చ బాహాటంగా సాగడం కద్దు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైపీపీ అధినేత జగన్, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుల మధ్య స్నేహం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇరువురు నేతలూ పరస్పరం ప్రశంసలను గుప్పించుకోవడం తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన ఒక భారీ ర్యాలీలో బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తెలంగాణ వేదికగా జరిగిన ఈ పొలిటికల్ డెవలప్‌మెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు కథేంటి, దీని వెనుక ఏవైనా పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయా అన్నది ఇప్పుడు రాజకీయవర్గాలలో తెగ చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తెలంగాణ రాజకీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కి నాయకుల ఫోటోలు లేదా ఫ్లెక్సీలు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం కేటీఆర్ స్వయంగా హైదరాబాద్‌లో జగన్ తో భేటీ అఅయ్యారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు పార్టీల మధ్య, అలాగే కేటీఆర్, జగన్ మధ్య అనుబంధానికి సంబంధించిన వార్తలుపెద్దగా వినిపించలేదు. మధ్యలో అడపాదడపా వైసీపీ బీఆర్ఎస్ అనుబంధం, జగన్, కేటీఆర్ స్నేహం గురించిన ప్రస్తావనలు వచ్చినా, తాజాగా వికారాబాద్ లో కేటీఆర్ ర్యాలీ జరుగుతున్న సమయంలో జగన్ ఫ్లెక్సీలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామంపై తెలంగాణలో కాంగ్రెస్, ఏపీ తెలుగుదేశం నేతలు తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్, వైసీపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ తాము చేసిన ఆరోపణలకు ఈ ఫ్లెక్సీలు బలమైన నిదర్శనమని అంటున్నారు. మరోవైపు, వికారాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు, వైసీపీ సానుభూతిపరుల మద్దతును కూడగట్టేందుకే ఈ తరహా ఫ్లెక్సీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jun 29, 2026 5:01PM
వేడివేడి బజ్జీలు వికటించి.. 23 మందికి ఫుడ్ పాయిజన్
వేడివేడి బజ్జీలు వికటించి.. 23 మందికి ఫుడ్ పాయిజన్

వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు. రహదారి పక్కన బండిపై విక్రయిస్తున్న బజ్జీలను కొనుగోలు చేసి తిన్నారు. అయితే ఆ రుచి క్షణాల్లోనే చేదు అనుభవంగా మారింది. బజ్జీలు తిన్న కొద్దిసేపటికే ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని రహదారి పక్కన బండిపై విక్రయించిన బజ్జీలు తిన్న మొత్తం 23 మందిలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయి. బాధితులకు వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బజ్జీల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు తెలిసింది. ఫుడ్ పాయిజన్‌కు కారణం కలుషిత నూనెనా, నాసిరకం పదార్థాలా, లేక పరిశుభ్రత లోపమా అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Publish Date: Jun 29, 2026 4:51PM
వీఐపీల భద్రతలో భారీ కోత..రేవంత్ సర్కార్ నిర్ణయానికి కారణమేంటంటే?
వీఐపీల భద్రతలో భారీ కోత..రేవంత్ సర్కార్ నిర్ణయానికి కారణమేంటంటే?

తెలంగాణలో వీఐపీల భద్రతలో సీఎం రేవంత్ భారీగా కోత విధించారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు అందిస్తున్న సెక్యూరిటీని భారీగా తకోత విధించాలని తీసుకున్న అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను ప్రభుత్వం కుదించడంతో వివాదం మరింత ముదిరింది. ప్రవీణ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ.. ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఇదంతా నిబంధనల మేరకే ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎవరికైనా నిజంగా ప్రాణభయం ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని.. భద్రత కుదింపు అంశాన్ని రాజకీయం చేయొద్దనీ అధికారులు అంటున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది. అదలా ఉంటే.. ఈ సానుకూల మార్పులను నిశితంగా సమీక్షించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇకపై కొంతమంది ప్రముఖులకు గతంలో ఇచ్చిన విధంగా అదనపు భద్రతను కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అందులో భాగంగానే.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వంద మంది ప్రముఖులకు ప్రస్తుతం అందుతున్న వివిధ రకాల భద్రతా సౌకర్యాలను పూర్తిగా ఉపసంహరించుకోవడమో లేదా కుదించడమో చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇందులో భాగంగా వీఐపీలకు కేటాయించిన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు గన్‌మెన్‌ల సౌకర్యాలను కూడా వెనక్కి తీసుకోనున్నారు. గతంలో కొందరి ప్రముఖుల రక్షణ కోసం "వన్ ప్లస్ వన్ స్థాయి సెక్యూరిటీ ఉండగా, మరికొందరి రక్షణ కోసం అత్యంత కీలకమైన టూ ప్లస్ టూ స్థాయి గన్‌మెన్‌ల భద్రత ఉండేది. ఇప్పుడు ఈ క్యాటగిరీలన్నింటినీ పునఃసమీక్షించి భారీగా కోత విధించింది. ఈ కోత మంగళవారం (జులై 1) నుంచే అమలులోకి రానుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600 మంది ప్రముఖులకు వివిధ క్యాటగిరీలలో భద్రత కల్పిస్తోంది. ఈ భారీ జాబితాలో ప్రస్తుత, మాజీ రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు, సమాజంలో పలుకుబడి ఉన్న ముఖ్య వ్యక్తులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సిబ్బందిని, వనరులను కేవలం వీఐపీల భద్రతకే పరిమితం చేయడం కంటే, ప్రజా రక్షణకు మళ్లించడం ఎంతో ఉత్తమమని ప్రభుత్వం యోచిస్తోంది. మావోయిస్టు ముప్పు లేని వారికి భద్రతను తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే వృథా వ్యయాన్ని భారీగా అరికట్టవచ్చని, అలాగే పోలీసు వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.

Publish Date: Jun 29, 2026 4:34PM
నాన్నా పులి కథలా ఇరాన్, అమెరికా శాంతి చర్చలు!
నాన్నా పులి కథలా ఇరాన్, అమెరికా శాంతి చర్చలు!

అమెరికా ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య దాడులు, ఉద్రిక్తతలు సడలడం లేదు. పదే పదే శాంతి ఒప్పంద ప్రకటనలు, కాల్పుల విరమణ ఒప్పందాలతో ఇరాన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం వార్తలపై ప్రపంచం నమ్మకం సడలిపోతోంది. ఈ వ్యవహారం అంతా నాన్నా పులి కథలా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా.. ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది. నిఘా వ్యవస్థలు, సమాచార మార్పిడి నెట్‌వర్కులు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్‌ల నిల్వ స్థావరాలు, సముద్రంలో గనులు పరవడం వంటి సామర్థ్యాలపై అమెరికా దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇరాన్‌ మళ్లీ దాడులకు దిగిందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్‌ పదేపదే ఉల్లంఘిస్తోందని విమర్శలు గుప్పించిన ఆయన, ఇదే పరిస్థితి కొనసాగితే.. పూర్తి స్థాయి యుద్ధం ద్వారా ఇరాన్‌ చాప్టర్ ను క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఖ్చీ హర్ముజ్‌ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ ఉందని పునరుద్ఘాటంచారు. నియమాలు ఉల్లంఘించే నౌకలు సమస్యలకు కారణమవుతాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అదే సమయంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నేవీ కమాండర్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే సమస్యలను ఎదుర్కొంటాయని హెచ్చరించారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కువైట్‌లోని అలీ అల్‌ సలేం ఎయిర్‌ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. కువైట్‌ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. తీవ్ర సైనిక ఉద్రికతల మధ్య కూడా శాంతి చర్చల యత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో జరిగిన అవగాహన ఒప్పందం తర్వాత 60 రోజుల వ్యవధిలోనే దాడులు మళ్లీ మొదలవడంతో చర్చలు నిలిచిపోయాయి. అయితే ఖతార్, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు మళ్లీ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ వారంలోనే దోహాలో హర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ చర్చలు ఫలితాలిస్తే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉంది.

Publish Date: Jun 29, 2026 4:17PM
యూట్యూబ్‌లో చూసి ప్రసవం చేసిన అత్త.. కోడలి ప్రాణం బలి!
యూట్యూబ్‌లో చూసి ప్రసవం చేసిన అత్త.. కోడలి ప్రాణం బలి!

సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది. ఒక ఘోర కలియుగ విషాదం. ఇంటర్నెట్‌లో దొరికే అరకొర సమాచారాన్ని, వీడియోలను నమ్మి సొంతంగా వైద్యం చేసుకోవడం ప్రాణాంతకమని హెచ్చరించే ఒక హృదయ విదారక ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఉతుకులి తాలూకా పుంజైతళవాయిపాళ్యం గ్రామంలో చోటుచేసుకుంది. 32 ఏళ్ల కే. శశికళ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆమె భర్త 35 ఏళ్ల కులందైసామి ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. వీరికి ఇప్పటికే ఆరేళ్ల కుమార్తె ఉంది. అయితే, రెండోసారి గర్భం దాల్చిన శశికళకు ప్రకృతి సిద్ధమైన విధానంలో, ఎటువంటి ఆధునిక మందులు లేకుండా ఇంట్లోనే ప్రసవం జరగాలనే విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే గర్భం దాల్చినప్పటి నుంచి ఆమె ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లలేదు, కనీస వైద్య పరీక్షలు లేదా అవసరమైన టీకాలు కూడా వేయించుకోలేదు. ప్రభుత్వ ప్రసవ పర్యవేక్షణ వ్యవస్థ అయిన 'పిక్మీ' (PICME) లో కూడా తన పేరును నమోదు చేసుకోలేదు. జూన్ 24వ తేదీ తెల్లవారుజామున శశికళకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా అయితే వెంటనే ఆస్పత్రికి తరలించాలి, కానీ వీరు మాత్రం ఇంట్లోనే ప్రసవం చేయాలని నిర్ణయించుకున్నారు. శశికళ భర్త కులందైసామి, ఆమె అత్త పళనియత్తాల్ కలిసి యూట్యూబ్‌లో సహజ ప్రసవం ఎలా చేయాలనే వీడియోలను చూస్తూ కాన్పు చేయడానికి సిద్ధపడ్డారు. యూట్యూబ్ స్క్రీన్ వైపు చూస్తూ, వీడియోలో చెబుతున్న సూచనలను పాటిస్తూ అత్త స్వయంగా కోడలికి ప్రసవం చేసింది. కొంత సమయం తర్వాత శశికళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప క్షేమంగానే పుట్టినా, అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. ప్రసవం పూర్తయిన తర్వాత గర్భాశయం నుండి మాయ (Placenta) బయటకు రాలేదు. దాంతో శశికళకు విపరీతంగా అంతర్గత రక్తస్రావం (Post-partum haemorrhage) ప్రారంభమైంది. రక్తం మడుగులో అపస్మారక స్థితికి చేరుకుంటున్న శశికళను చూసి కంగారుపడిన కుటుంబ సభ్యులు చివరకు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై ఈరోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమె గర్భసంచిని కూడా తొలగించారు. అయినప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో జూన్ 25న కోయంబత్తూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు మరణంతో పోరాడిన శశికళ, చివరకు చికిత్సకు స్పందించక జూన్ 28వ తేదీ ఆదివారం ఉదయం కన్నుమూసింది. కన్నతల్లి ప్రేమకు నోచుకోకుండా ఆ పసిగుడ్డు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉంది. బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఉతుకులి పోలీసులు భర్త కులందైసామిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద సాపరాధ నరహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్ చూస్తూ ప్రసవాలు చేయడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగిస్తోంది.

Publish Date: Jun 29, 2026 4:16PM
మధిరలో సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు.. కారణమేంటంటే?
మధిరలో సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు.. కారణమేంటంటే?

తెలంగాణ రాజకీయాల్లోనూ, వ్యవసాయ రంగంలోనూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధిర పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మంగళవారం (జూన్ 30) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ.. భారీ వర్షాల కారణంగా రద్దైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు. అయితే.. మధిరలో సభ రద్దైన ప్పటికీ, రైతాంగానికి అందించాల్సిన లబ్ధిని, భరోసాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయ కూడదన్న కృత నిశ్చయంతో.. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ బృహత్తర కార్యక్ర మాన్ని నిలిపివే యకుండా.. ప్రత్యామ్నాయంగా, మధిరలో జరగాల్సిన ఈ వేడుకను తక్షణమే హైదరాబాద్‌ శిల్పకళా వేదికకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోయినా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతుల వద్దకే నేరుగా వెళ్లాలని ప్రభుత్వం నిశ్చయించింది. శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం ఈ సభ అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సభను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా.. రైతు భరోసా పంపిణీ సదస్సు గా నామకరణం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ విప్లవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఈ వేడుకలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భౌతికంగా మధిరలో సభ సాధ్యం కాకపోయినా, అధునాతన డిజిటల్ , వర్చువల్ పద్ధతుల ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల పరిధిలోని రైతులను ఏకతాటిపైకి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రైతు వేదికల' నుంచి రైతులు నేరుగా ఈ శిల్పకళా వేదిక సదస్సును వీక్షించేలా ప్రత్యేక లైవ్ స్క్రీన్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆడియో-విజువల్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Publish Date: Jun 29, 2026 4:04PM
ప్రేమ పెళ్లి.. విషాదాంతం.. ఆరు నెలల పసిబిడ్డ అనాథ
ప్రేమ పెళ్లి.. విషాదాంతం.. ఆరు నెలల పసిబిడ్డ అనాథ

గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఆరు నెలల క్రితం ఓ పసిబిడ్డ జన్మించింది. అయితే ఏమైందో ఏమో.. ఆ ప్రేమజంట తీసుకున్న కఠిన నిర్ణయం ఆ చిన్నారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, బలసాయి, పద్మ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు జన్వాడలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదు నెలల పసిబిడ్డ ఉంది. అయితే ఆదివారం తమ నివాసంలోనే బలసాయి, పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, దర్యాప్తు వివరాల ఆధారంగా పూర్తి సమాచారం వెలుగులోకి రానుంది. ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ కోల్పోయి అనాథగా మారిన ఆరు నెలల పసిబిడ్డను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

Publish Date: Jun 29, 2026 3:58PM
ఎస్ఐఆర్ భయం.. డ్రైవర్ ఆత్మహత్య
ఎస్ఐఆర్ భయం.. డ్రైవర్ ఆత్మహత్య

తెలంగాణలో ఎస్‌ఐఆర్ భయం పీక్స్ కు చేరిందని చెప్పాలి. ఈ భయంలో హైదరాబాద్ లో ఒకరి ఆత్మహత్యకు కారణమైంది. సర్ నివేదికలు, తనిఖీలుఈ నివేదికల భయం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రభుత్వ అధికారిక రికార్డులు లేదా ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు నమోదు కాలేదన్న బాధతో, భయంతో, మనస్తాపంతో ఓ కారు డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బోరబండ పరిధిలోని భరత్‌నగర్‌ లో జరిగింది. బోరబండ భరత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్ వృత్తిరీత్యా కారు డ్రైవర్‌. రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి అతనిది. ఎంతో కష్టపడి తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ముజీబుర్ రహ్మాన్‌ కు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు దివ్యాంగులు. కాగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఆసరాగా నిలిచేవి. అయితే.. ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు. పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా ఇద్దరు దివ్యాంగుల పోషణ ఎలా అనే ఆవేదన కలిచి వేసింది. ఈ క్రమంలోనే ఇటీవల తరచుగా తన భార్య వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబం రోడ్డున పడుతుందన్న ఆందోళనకు గురయయాడు. ఆ ఆందోళనతోనే షేక్ ముజీబుర్ రహ్మాన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలను, భార్యను వదిలి అతను బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఒక చిన్న జాబితా లేదా అధికారిక ప్రక్రియ ఒక ప్రాణాన్ని బలితీసుకోవడంపై భరత్‌నగర్ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Publish Date: Jun 29, 2026 3:53PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds