విమాన ప్రమాదంపై దర్యాప్తునకు భారత్ కు బ్రిటన్ ఏఏఐబీ బృందం

అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఎయిర్ ఇండియాకు చెందిన  విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  కూలిన దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విమాన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ కు అండగా ఉంటామని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.  ప్రధాని నరేంద్రమోడీ ప్రమాద స్థలాన్ని ఈ రోజు సందర్శించనున్నారు. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.

అదలా ఉంటే..  ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తులో పాలుపంచుకునేందుకు  బ్రిటన్‌కు చెందిన  ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్  (ఏఏఐబీ) బృందం భారత్‌కు వస్తోంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో  ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఏఏఐబీ  ఈ దర్యాప్తులో భారత్ కు సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తమ దేశ పౌరులు కూడా ఉన్నందున, భారత దర్యాప్తులో తమకు 'నిపుణుల హోదా' ఉంటుందని బ్రిటన్ పేర్కొంది.   విమాన ప్రమాదంలో మరణించిన వారిలో వారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఒక కెనడా పౌరుడు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఉన్నారు.