ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం : సీఎం రేవంత్
posted on Jun 13, 2025 9:32PM

తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని రేవంత్ సూచించారు.
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్లో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. క్వాలిటీ ఫుడ్, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు