హీరో రాజ్ తరుణ్ పై  నార్సింగి పిఎస్ లో కేసు నమోదు

గత వారం రోజులుగు సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం మరో మలుపు తిరిగింది. లావణ్య చేసిన ఫిర్యాదును నార్సింగ్ పోలీసులు స్వీకరించి కేసు నమోదు చేశారు. దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి రాజ్ తరుణ్ తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ షార్ట్ ఫిలిం నటి లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలకు తగిన ఆధారాలు అందించాలని పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు.తాజాగా ఆమె తన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. లావణ్య పోలీసులకు 170 ఫొటోలను, పలు టెక్నికల్ ఆధారాలను అందించారు. దాంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 493, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తో పదేళ్ల క్రితమే పెళ్లయిందని, అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య వెల్లడించారు. లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో కలిసి ఉంటున్నామని, అన్విక పేరుతో తాను రాజ్ తరుణ్ తో కలిసి విదేశాలకు కూడా వెళ్లామని చెప్పారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య తెలిపారు. "మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడు. మాల్వీ కోసం రాజ్ తరుణ్ ముంబయి కూడా వెళ్లడంతో నేను ప్రశ్నించాను. ఇప్పుడు మాల్వీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా వాయిస్ రికార్డు చేశాడు" అని పేర్కొన్నారు లావణ్య.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత  గత ఐదేళ్లుగా రాష్ట్రం మొత్తాన్ని ఆందోళనకు గురి చేసిన రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక విధానం ఇలా ఒక్కటొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాటి విషయంలో నిర్ణయాలు అమలులోకి వస్తున్నాయి. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ నుంచి కేంద్రం వెనక్కు తగ్గిందన్న వార్త యావత్ ఆంధ్ర ప్రజానీకాన్నీ ఆనందంలో మునిగి తేలేలా చేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి మరీ సాధించుకున్న విశాఖ పట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం నిర్ణయించుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. కేంద్రం ప్రతిపాదనను కనీసం వ్యతిరేకించడానికి కూడా గత వైసీపీ అదే జగన్ సర్కార్ సాహసించలేదు. కేంద్రం నిర్ణయాన్ని కాదంటే.. మోడీకి ఎక్కడ కోపమొస్తుందో అన్నట్లుగా జగన్ వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ పతనమై చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తరువాత ఏపీ ప్రజల అస్థిత్వ ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం వెనక్కు తగ్గిన సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం ఎన్నికల సమయంలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కానీయబోమని హామీ ఇచ్చింది. అవసరమైతే విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణ బాధ్యతను రాష్ట్రమే తీసుకుంటుందన్న  భరోసాను కూడా ప్రజలకు కల్పించింది. ఇప్పుడు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గురువారం (జులై 11) విశాఖ పర్యటనకు రానున్నారు. ఆ సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏం చర్యలు చేపట్టాలి అన్న అంశంపై అధికారులతో పాటు ప్లాంట్ కార్మికులు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారితో చర్చించనున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యపక్షమైనందున రాష్ట్ర ప్రభుత్వ అభీష్ఠానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకునే అవకాశాలు దాదాపుగా లేవని అంటున్నారు. విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తరువాత కేంద్ర మంత్రి విశాఖకు రావడం ఇదే తొలిసారి.పెట్టుబ‌డుల  స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో క‌ల‌పాల‌ని ఉద్యోగులు కోరుతుండ‌గా… ప్లాంట్ నిర్వ‌హ‌ణ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి అప్ప‌జెప్పాల‌ని , ప్రైవేటీకరణ యోచన మానాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి విశాఖ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  గురువారం చ‌ర్చ‌ల త‌ర్వాత హైద‌రాబాద్ లోని ఎన్.ఎం.డీ.సీ అధికారుల‌తో కేంద్ర‌మంత్రి కుమార‌స్వామి చ‌ర్చ‌లు జ‌రుపుతారు. ఎన్.ఎం.డీ.సీకి ఐర‌న్ ఓర్ గ‌నులున్న నేప‌థ్యంలో స్టీల్ ప్లాంట్ విష‌యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుందని అంటున్నారు.

మంగళగిరి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ ల పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులని పోలీసుల దర్యాప్తులో తేలింది. కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్​గా గుర్తించారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరు పరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మరో పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.   

ఏపీలో కాంగ్రెస్ కు వైఎస్ బ్రాండే దిక్కు?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్వ వైభవం సంగతి అలా ఉంచి కనీసం ఉనికి మాత్రంగానైనా నిలబడాలంటే వైఎస్ బ్రాండే దిక్కని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఇంత కాలం లేని విధంగా ఇప్పుడు వైఎస్ 75వ జయంతిని విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించింది. వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా ఉండటం ఆ పార్టీకి ఒకింత కలిసి వచ్చే అంశంగా భావిస్తోంది. ఆమె ద్వారానే వైఎస్ కాంగ్రెస్ సొత్తు అని చెప్పించడం ద్వారా వైఎస్ బ్రాండ్ ను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందని భావించవచ్చు. విజయవాడ వేదికగా జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమానికి  పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మొత్తాన్ని తీసుకుని రావడం ద్వారా ఒక బలమైన సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ ఫొటోలతో  వైసీపీ చేస్తున్న హంగామాను తిప్పికొట్టడానికి, వైఎస్ ఎంత మాత్రం వైసీపీకి చెందిన వ్యక్తి కాదనీ, ఆయన కుమారుడు వైఎస్ రాజకీయవారస్వానికి అనర్హుడు అని చాటడమే లక్ష్యంగా ప్రసంగించడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ రాజకీయవారసురాలిగా షర్మిలను గుర్తించిందని చెప్పడంలో సఫలీకృతులయ్యారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, షర్మిల సీఎం అవుతారు అనడం ద్వారా ఇటీవల ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ జీరో రిజల్ట్ కారణంగా షర్మిలపై మొలకెత్తుతున్న అసమ్మతిని మొగ్గలోనే తుంచేసినట్లైంది.  రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో ఉనికి మాత్రంగా మిగిలి, గత వైభవాన్ని పూర్తిగా కోల్పోయిన ఏపీ కాంగ్రెస్ లో జవసత్వాలు నింపి, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు రేవంత్ ప్రసంగం నిస్సందేహంగా దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర విభజన తరువాత జరిగిన మూడు ఎన్నికలలోనూ ఏపీలో కాంగ్రెస్ కు వచ్చినది జీరో రిజల్టే. అయితే ఈ సారి ఆ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ గతంలో కంటే బలంగా పుంజుకుంది. కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించకుండా నివారించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.  ఇక ఏపీలో   వైసీపీ ఓటమిలో కాంగ్రెస్ కూడా కీలక పాత్ర పోషించింది.  వైఎస్ జయంతి సభలో  వైఎస్ ఆత్మగా చెప్పబడే కేవీపీ రామచంద్రరావు చాలా మంది వైసీపీ నాయకులు తనతో టచ్ లో ఉన్నారనీ, ఏ క్షణంలోనైనా వారంతా కాంగ్రెస్ గూటికి చేరతారంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపడం ఖాయం.   తాజా ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం కారణంగా ఆ పార్టీ ఇప్పుడు నిస్తేజంగా మారింది. ఆ గ్యాప్ ను కాంగ్రెస్ ఫిల్ చేసే అవకాశాలే ఉన్నాయి. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటం, ఆమెకు వైఎస్ ఆత్మ అండగా నిలవడంతో రాష్ట్రంలో వైఎస్ లెగసీని కాంగ్రెస్ సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నరేంద్ర మోడీ ‘దేశ’ముదురు!

విదేశ పర్యటనలు భారీగా చేస్తూ వుండే మన ప్రధాని నరేంద్ర మోడీని గిట్టనివాళ్ళు ‘దేశదిమ్మరి’ అంటూ వుంటారుగానీ, ఆయన నిజానికి ‘దేశ’ముదురు! ప్రధానిగా గత పదేళ్ళ కాలంలో ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నిటినీ ఒక చుట్టు చుట్టేశారు. కొన్ని దేశాలనయితే రెండుమూడు సార్లు కూడా చుట్టేశారు. అంటే కుళ్ళుకుంటున్నామని అనుకుంటారుగానీ, ఏవేవో టుమ్రీ దేశాలు తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలనూ ప్రధానమంత్రి మోడీ కవర్ చేసేశారు. ఇక మిగిలిన దేశాలకు టిక్ పెట్టే పనిలో ఈ మూడో టర్మ్.లో వున్నారు. ఈ టర్మ్ పూర్తయ్యేసరికి  ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీ పర్యటించని దేశమే వుండదు అంటే అతిశయోక్తి కాదేమో! జనరల్‌గా అంతర్జాతీయ సమిట్లు ఏవైనా విదేశాలలో వున్నాయంటే మన ప్రధానమంత్రి కంపల్సరీగా వెళ్తారు. అక్కడకి వచ్చిన వివిధ దేశాల నాయకులు మోడీ గారిని ‘‘సార్.. మా దేశం రావచ్చు కదా’’ అని అంటారు. అలా పిలిచిందే తడవుగా మోడీ గారు సదరు దేశం టూర్ ప్లాన్ చేసుకుంటారు. రెండ్రోజుల క్రితమే రష్యా వెళ్ళి పుతిన్‌ని ఆలింగనం చేసుకున్న మోడీ, ఇప్పుడు ఆస్ట్రియా టూర్లో వున్నారు. ఆస్ట్రియా ఛాన్స్.లర్ కార్ల్ నెహమ్మర్‌తో దిగిన సెల్ఫీని మీడియాకి విడుదల చేశారు. ఇండియా, ఆస్ట్రియా మధ్య స్నేహ సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీ అక్కడకి వెళ్ళారు. 49 ఏళ్ళ తర్వాత ఆస్ట్రియా వెళ్ళిన మొదటి ప్రధానమంత్రిని నేనే అని తన సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తనను తాను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ చేసుకుంటారు. సదరు దేశాధ్యక్షుడో, ప్రధానమంత్రో పురుషుడు అయితే గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత సెల్ఫీ దిగడం తప్పనిసరి. ఏ మహిళామూర్తో అయితే చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగుతారు. ఎలా అవుతాయో ఏమోగానీ, సదరు ఆలింగనాలు, సెల్ఫీలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతూ వుంటాయి. మన మీడియా అయితే, మన మోడీ గారి గొప్పతనాన్ని చూసి ప్రపంచ నాయకులు స్పెల్ బౌండ్ అయ్యారని, ‘విశ్వగురు’ అంటే మరెవరో కాదు.. మోడీ గారే అని కథనాలు వండి వడ్డిస్తూ వుంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇంట మాత్రమే కాకుండా.. రచ్చలో కూడా గెలుస్తున్నట్టు కనిపిస్తున్న మన మోడీ గారు నిజంగానే ‘దేశ’ముదురు!

బీజేపీ ప్రసన్నం కోసం హస్తినలో కేటీఆర్ పడిగాపులు!?

బీఆర్ఎస్ పార్టీ సొంతంగా బలోపేతం కావడంపై ఆశలు వదిలేసుకుందా?  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు ఉంటే చాలన్న పరిస్థితికి వచ్చేసిందా? అంటే ఆ పార్టీ అడుగులు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను బెయిలుపై తీసుకువచ్చేందుకు హస్తిన వెళ్లిన కేటీఆర్, కేసీఆర్ గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేశారు. కవిత బెయిలు కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో పెద్దగా బయటకు రాలేదు కానీ, మంగళవారం (జులై 9)న వారు హస్తినలో మీడియాతో మాట్లాడిన మాటలు వింటే మాత్రం బీజేపీని ప్రసన్నం చేసుకోవడమే వారి టాస్క్ అన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  హస్తిన వేదికగా కేటీఆర్ మీడియా సమావేశంలో ఢిల్లీ మద్యం కుంభకోణం లో కవిత అరెస్టు అక్రమం అని చెప్ప లేదు. అలాగే బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వేధిస్తోందన్న విమర్శలూ చేయలేదు. మరి ఆయన ఆ మీడియా సమావేశంలో మాట్లాడిందేమిటి? అంటే అసందర్భంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు కూడా మోడీని మెప్పించే విధంగా ఉన్నాయి. అంటే మోడీ కాంగ్రెస్ పైనా, రాహుల్ గాంధీపైనా ఏ లైన్ లో అయితే విమర్శలు చేస్తారో కేటీఆర్ కూడా అదే లైన్ ను పట్టుకుని అవే విమర్శలను గుప్పించారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీల నాయకులు హస్తిన వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తే వారు జాతీయ మీడియా కంటే తమ రాష్ట్ర మీడియాలో  ఎక్కువ కవరేజ్ రావాలని కోరుకుంటారు. కానీ కేటీఆర్, హరీష్ రావులు మాత్రం తమ ప్రెస్ మీట్ వివరాలు జాతీయ మీడియా కవరేజ్ బాగుండాలని భావించారు. అందుకే వారు హస్తినలో మీడియా సమావేశం పెట్టి  జాతీయ మీడియా దానిని విస్తృతంగా కవర్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక అడుగు ముందుకు వేసి మోడీనే టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఇప్పుడు హస్తిన వేదికగా కేటీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా మోడీని పల్లెత్తు మాట అనలేదు.  కాంగ్రెస్ టార్గెట్ గానే ఆయన విమర్శల ఝరి సాగింది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీనే టార్గెట్ చేశారు. ఇదంతా బీజేపీని, మోడీని మెప్పించడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి కేటీఆర్ ప్రయత్నాలు ఫలించాయా? లేదా? అన్నిది రానున్న రోజులలో తెలుస్తుంది.  

కారుతో చెరువులోకి దూసుకెళ్ళాడు!

హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలతో కలసి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన కారుతో చెరువులోకి దూసుకెళ్ళాడు. స్థానికంగా వున్నవాళ్ళు సకాలంలో స్పందించి వీళ్ళని కాపాడారు. బీఎన్ రెడ్డి నగర్‌కి చెందిన అశోక్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం తన పిల్లలు మార్నింగ్ వాక్ కోసం అన్నట్టుగా తీసుకొచ్చాడు. అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర వున్న ఇనాంగూడ చెరువులోకి కారుతో సహా దూసుకెళ్ళాడు. దాంతో కారు నీళ్ళలో మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికుడు తాళ్ళ సాయంతో కారుని బయటకి లాగారు. కారులో వున్న నలుగురినీ కాపాడారు. అశోక్ ఆత్మహత్యకు ప్రయత్నించడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.

జగన్ కు అవినాష్ నుంచే అసమ్మతి సెగ?!

వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా? జగన్ కు వ్యతిరేకంగా ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు పావులు కదుపుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔననే  సమాధానమే వస్తుంది. జగన్ ను వైసీపీ శాసనసభాపక్షం తమ నేతగా ఇప్పటికీ ఎన్నుకోకపోవడం, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసలు జగన్ అసెంబ్లీకి హాజరౌతారా లేదా అన్న విషయంలో పార్టీ నేతలు, శ్రేణులకే స్పష్టత లేకపోవడం చూస్తుంటే.. జగన్ కచ్చితంగా సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశంలో లేరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సభలో కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది సభ్యలు కూడా వైసీపీ నుంచి ఎన్నిక కాలేదు. దీంతో జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టి అవమానాల పాలయ్యే కన్నా, పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కడప లోక్ సభ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది. అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నట్లు   వైసీపీ వర్గాలలో  చర్చ జరుగుతోంది. తాను పులివెందుల అసెంబ్లీ సభ్యునిగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలో అవినాష్ కు పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తానని జగన్ ఎంతగా చెబుతున్నా అవినాష్ వినడం లేదని కడప జిల్లా వ్యప్తంగా ఓ చర్చ అయితే జోరుగా సాగుతోంది. గతంలో పలువురికి ఇచ్చిన హామీలను జగన్ విస్మరించిన సందర్భాలను ఉటంకిస్తూ అవినాష్ కడప లోక్ సభ స్థానానికి రాజీనామా చేస్తే తన బతుకు కూరలో కరివేపాకులా తయారౌతుందని అనుమానిస్తున్నారని అంటున్నారు. జగన్ పులివెందుల అసెంబ్లీ సభ్యుడిగా రాజీనామా చేసి, ఆ స్థానం నుంచి తనను నిలబెడతారని అవినాష్ నమ్మడం లేదు. తాను కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేస్తారు, అందులో అనుమానం లేదు, కానీ జగన్ రాజీనామా చేసిన పులివెందుల స్థానం నుంచి తనకు అవకాశం ఇస్తారని మాత్రం అవినాష్ నమ్మడం లేదని కడప వాసులు అంటున్నారు. ఆ స్థానం నుంచి జగన్ తన సతీమణి భారతిని రంగంలోకి దించుతారని అవినాష్ గట్టిగా నమ్ముతున్నారనీ, అదే జరిగితే తన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడలా మారడం ఖాయమని ఆయన భయపడుతున్నారు. జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉంటే, తనపై వైఎస్ వివేకా హత్య కేసు ఉందని ఆయన  తన రాజీనామా గురించి అడిగిన వారికి గుర్తు చేస్తున్నారు.  మొత్తం మీద కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలన్న జగన్ ఆశలకు అవినాష్ రెడ్డి ఆదిలోనే గండికొడుతున్నట్లుగా కనిపిస్తోందన్న చర్చ అయితే వైసీపీ వర్గాలలోనూ, కడప జిల్లా వ్యాప్తంగానూ జోరుగా సాగుతోంది. 

అమరావతి ఓఆర్ఆర్ కు ఈ ఏడాది బడ్జెట్ లోనే నిధులు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్న హామీని నిలుపుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. చంద్రబాబునాయుడు ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అందుకు అవసరమైన నిధులను ఈ ఏడాది బడ్జెట్ లోనే కేటాయించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. 189 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పాతిక వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతాయన్నది అంచనా కాగా, కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లోనే ఐదు నుంచి పది వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు నిర్ణయించింది.   అంతే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ సహా మొత్తం ఖర్చులు కేంద్రమే భరించనుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డును కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానించేలా 6 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు. 

లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై యాక్సిడెంట్.. 18 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ లో ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కంటైనర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై వేగంగా వచ్చిన కంటైనర్  బీహార్ నుంచి ఢిల్లీ వెళుతున్న డబుల్ డెక్కర్ ట్రావెల్స బస్సును ఢీ కొంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

ఏపీలో ఇసుక పాల‌సీపై రాద్దాంతం.. వైసీపీని తిప్పికొడుతున్న జనం

ఏపీలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అభివృద్ధి ప‌నులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగగలుగుతున్నారు.  మ‌రోవైపు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే పెంచిన పెన్ష‌న్ల‌ను ఒకటో తేదీనే అందజేసిన చంద్రబాబు సర్కార్.. ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన‌ట్లుగా ఉచిత ఇసుక విధానాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తెచ్చిన ఇసుక పాల‌సీని ర‌ద్దు చేసి కొత్త ఇసుక పాల‌సీకి సంబంధించిన జీవోను   విడుద‌ల చేసింది. ఈ జీవో ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు నిల్వ ఉన్న ఇసుక‌ను ఉచితంగా అందిస్తుంది. ప్ర‌భుత్వానికి ఎలాంటి రాబడి లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులు మాత్ర‌మే చెల్లించి ఇసుకను తీసుకెళ్లేలా వీలు క‌ల్పించింది. అయితే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఈ చార్జీలు ఉన్నాయి. ర్యాంపులకు దగ్గరగా ఉన్న చోట ఒకలా, దూరంగా ఉన్నచోట మరోలా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, ఐదేళ్లు పాల‌న‌లో ఇసుక దోపిడీకి అల‌వాటుప‌డ్డ వైసీపీ నేత‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఏమాత్రం రుచించ‌డం లేదు. దీంతో ఇసుక ఉచిత పాల‌సీపై నానా రాద్దాంతం చేస్తున్నారు.   అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు అన‌ట్లుగా వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో కొన‌సాగిన వైసీపీ నేత‌లు ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయ‌లు దండుకున్నారు. ఇసుక‌ను బంగారం త‌ర‌హాగా మార్చేశారు. దీంతో ఏపీలో గ‌డిచిన‌ ఐదేళ్ల కాలంలో ఇసుక పేరెత్తితేనే ప్ర‌జ‌లు వామ్మో అనే  ప‌రిస్థితి ఉంది. ఇసుక‌ను కొనుగోలు చేయ‌లేని మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు.. ఇళ్లు, ఇత‌ర నిర్మాణాల‌ను వాయిదా వేసుకున్నారు. దీంతో ఏపీలో నిర్మాణ రంగం కార్మికులు ప‌నుల‌కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లాల్సి వ‌చ్చింది. వైసీపీ హ‌యాంలో ప‌ది టన్నుల లారీ ఇసుకకు యాభై వేలు నుంచి డెబ్బై వేలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది పదివేలకే వస్తోంది. దూరాన్ని బట్టి కాస్త పెరగవచ్చు. అయితే, ఇంటి నిర్మాణ దారులకు భారీగా డబ్బులు ఆదా అవుతున్నాయి. ఈ విషయం ఇసుక తీసుకెళ్లేవారికి తెలుసు. అయినా వైసీపీ నేత‌లు, వైసీపీ సోషల్ మీడియా, వారి అనుకూల మీడియా కూట‌మి ప్ర‌భుత్వం ఇసుక పాల‌సీపై పెద్ద‌ ఎత్తున రాద్దాంతం చేస్తున్నాయి.  ఉచిత ఇసుక అంటూ హామీ ఇచ్చిన కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ హామీని తుంగ‌లో తొక్కిందంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ రాద్ధాంతం చేస్తోంది.   ఇదేనా మీరు ఇచ్చే ఉచిత ఇసుక అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారానికి నెటిజ‌న్లు గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియా వేదికగా ఈ దుష్ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వంలో ఇసుక‌కు కేవ‌లం ర‌వాణా, లోడింగ్‌ చార్జీలు మాత్ర‌మే ఉండ‌టంతో చిత్తూరులో 20 ట‌న్నుల ఇసుక రూ.4వేల‌కు వ‌స్తుంది.. గ‌త ప్ర‌భుత్వంలో ఇదే ఇసుక‌ రూ.60వేల‌కు విక్ర‌యించార‌ని ఆధారాలతో సహా వివరించారు. ఇలా ప‌లు జిల్లాల్లో ఇసుక త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి రావ‌టం ప‌ట్ల నెటిజ‌న్లు  హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వాన్ని ప‌రిశీలిస్తే.. వైసీపీ హ‌యాంలో ఇసుక బంగారంగా మారింది. ఈ విష‌యం ఏపీలో ఎవ‌ర్ని అడిగినా చెప్పేస్తారు. గ‌త ప్ర‌భుత్వంలో టన్ను ఇసుక రూ. 8వేల నుంచి రూ. 10వేలు ప‌లికింది. దీనికితోడు ప్ర‌భుత్వానికి చెల్లించాల్సి సొమ్మును కేవ‌లం న‌గ‌దు రూపంలోనే తీసుకున్నారు. దీంతో వైసీపీ నేత‌లు ఇసుక విక్ర‌యాల‌తో పెద్ద‌మొత్తంలో ప్ర‌భుత్వానికి రావాల్సిన సొమ్ముకు గండి కొట్టి దోచుకున్నారు.    వైసీపీ హ‌యాంలో ఇసుక ధ‌ర‌, టీడీపీ హ‌యాంలో ట్రాన్స్‌పోర్టు ఛార్జీల‌తో ఇసుక ఎంత ధ‌ర‌కు ల‌భిస్తుంద‌నే విష‌యాల‌పై వాస్త‌వాల‌ను ప‌రిశీలిస్తే అస‌లు విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. అల్లూరి జిల్లాలో వైసీపీ హ‌యాంలో ట‌న్ను ఇసుక రూ.749 నుంచి 1600 ప‌లికితే.. ఇప్పుడు రూ. 300ల‌కు ల‌భిస్తోంది. అన‌కాప‌ల్లిలో రూ. 1600కు ల‌భిస్తే.. ప్రస్తుతం రూ. 1225కు ల‌భిస్తోందిది. అనంత‌పురం జిల్లాలో రూ. 818కి ల‌భిస్తే.. ఉచిత ఇసుక విధానంలో  రూ. 195కే అందుబాటులోకి వచ్చింది. బాప‌ట్ల జిల్లాలో వైసీపీ హ‌యాంలో ట‌న్ను ఇసుక రూ. 553 నుంచి రూ. 1088కి ల‌భిస్తే ఇప్పుడు తెలుగుదేశం హ‌యాంలో రూ. 665కే ల‌భిస్తున్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో ఇసుక ధ‌ర‌ను ప‌రిశీలిస్తే గ‌త ప్ర‌భుత్వం కంటే ప్ర‌స్తుతం చాలా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తుంది. పారదర్శకంగా గనులు భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ఇసుకను ప్రజలకు అందిస్తున్నాసరే వైసీపీ నేతలు మాత్రం టీడీపీపై విష ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఆపడం లేదు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని జనం ఛీ కొడుతున్నారు. వైసీపీ ప్రచారంలోని డొల్లతనాన్ని స్వచ్ఛందంగా ఎండగడుతున్నారు. 

‘విద్యుత్’ వాస్తవాలతో చంద్రబాబు ‘శ్వేతపత్రం’ విడుదల!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగ సమగ్ర పరిస్థితిని ప్రజల ముందు వుంచే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని జగన్ ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్టు చంద్రబాబు చెప్పారు.   "ఏ ఎన్నికలలో అయినా రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోనూ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్తుతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసింది. అసమర్థులు పాలకులైతే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినంది. అయినప్పటికీ, దేశం బాగుపడింది. నేను తెచ్చిన సంస్కరణలు రాజశేఖరరెడ్డి హయాంలో కనిపించాయి. తెలుగుదేశం హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా చేశాం. మా ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ కో, జెన్ కోలకు అవార్డులు వచ్చాయి. గత ఐదేళ్లలో జనంపై జగన్ 32,166 కోట్ల రూపాయల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో 49,596 కోట్ల రూపాయల అప్పులు చేశారు. థర్మల్ విద్యుత్తుని గ్రీన్ హైడ్రోజన్‌గా మార్చడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వస్తే అదనంగా పన్నులు వస్తాయి. రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తి పెంచడానికిచర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కమిటీ నిర్ణయిస్తుంది. విద్యుత్ సరఫరాలో నష్టాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. విద్యుత్ రంగాన్ని బోలపేతం చేయడానికి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటాం. జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 4,773 కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. గత ప్రభుత్వ అసమర్థత వల్ల ఊహించని కోణాల్లో విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ బాండ్లలో ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్.కో పెట్టుబడులు పెట్టడం చూస్తుంటే జగన్ ప్రభుత్వం ఏ స్థాయి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థమవుతోంది. ట్రూ అప్, ఇంధన సర్‌ఛార్జ్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాల పేర్లతో జగన్ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది. గృహ వినియోదారులపై ఛార్జీలు 45 శాతం పెంచారు. ఛార్జీల పెంపుతో ఒక కోటి 53 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 50 యూనిట్లు వాడిన పేదవారి మీద కూడా వందశాతం ఛార్జీలు పెంచారు. టారిఫ్ ద్వారా 16,699 కోట్ల రూపాయలు, ట్రూ అప్ ద్వారా 5,886 కోట్ల రూపాయలు, ఇంధన ఛార్జీలు 3,977 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 5,607 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని విద్యుత్ రంగంపై పెనుభారం వేశారు. ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు 79 శాతం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై భారం మోపాయి. కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీలు 9 వేల కోట్ల రూపాయలు చెల్లించారు. పవన విద్యుత్తుతో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారు. అసమర్థ పాలనతో విద్యుత్ రంగం 47,741 కోట్ల రూపాయలు నష్ట పోయింది. విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు 1,29,503 కోట్ల రూపాయల నష్టం జరిగింది. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతాం. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలు మరింత పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలి. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి కేంద్రం సాయం తీసుకుంటాం. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం” అని చంద్రబాబు వివరించారు.

డోన్ట్ వర్రీ.. అదంతా ఒట్టి గ్యాసే..!

వంట గ్యాస్ కస్టమర్ల ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియను చేపట్టాలని కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దాంతో ఎల్‌పీజీ కంపెనీలు ఈ కేవైసీ ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, ఈ కేవైసీ నమోదు గ్యాస్ ఏజెన్సీల దగ్గర మాత్రమే చేయించుకోవాలని కొన్ని కంపెనీలు పట్టుపడుతూ వుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా, అర్జెంటుగా ఈ కేవైసీ చేయించుకోపోతే గ్యాస్ కనెన్షన్ రద్దు అవుతుందని కూడా వదంతులు వ్యాపించాయి. ఈ విషయమై కేరళ శాసనసభ పక్ష నేత వీడి సతీశన్ కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి లేఖ రాశారు. దీని మీద కేంద్ర మంత్రి స్పందించారు. కేవైసీ ప్రక్రియ మీద క్లారిటీ ఇచ్చారు. ఈ కేవైసీ అనేది కేవలం డీలర్ల దగ్గరే చేయించుకోవాలనే రూల్ ఏమీ లేదని చెప్పారు. అలాగే ఫలానా గడువు లోపల ఈ కేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ కనెన్షన్ రద్దు అవుతుందన్న వార్తలు కూడా కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను తొలగించడం కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ కేవైసీని నిర్వహిస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సాధారణంగా గ్యాస్ సిలెండర్లను డెలివరీ చేసే సమయంలోనే డెలివరీ సిబ్బంది కస్టమర్ల ఈ కేవైసీ వివరాలు తీసుకుంటారు. డెలివరీ సిబ్బంది దగ్గర వుండే ఫోన్లో వినియోగదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ఈ ప్రక్రియని పూర్తి చేస్తారు. లేదా కస్టమర్లు వాళ్ళ గ్యాస్ డీలర్ దగ్గరకి వెళ్ళి అయినా ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు. అది కూడా కుదరకపోతే ఏ కంపెనీ గ్యాస్ సిలెండర్ కొంటున్నారో, ఆ కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్ళి కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ నమోదు ప్రక్రియకి ప్రస్తుతానికి డెడ్‌లైన్ లాంటిదేమీ లేదు.

ఇంతకీ... విజయమ్మ ఎందుకు ఏడ్చినట్టు?

సోమవారం నాడు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ భార్య విజయమ్మతోపాటు, కుమారుడు, వైసీపీ అధినేత జగన్, కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్సార్ వారసురాలు షర్మిల, వీళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముక్తాయింపుగా విజయమ్మ శ్రద్ధాభక్తులతో ప్రార్థించారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో జగన్ తల్లి దగ్గరకి వచ్చి కొద్ది క్షణాలు నిల్చున్నారు. అప్పుడు కొడుక్కి దగ్గరగా వెళ్ళిన విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలామందిని ఓదార్చిన అనుభవం వున్న జగన్, తల్లిని మాత్రం ఓదార్చకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కన్నీరు మున్నీరు అవుతున్న విజయమ్మను ఆమె సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఇతర బంధువులు ఓదార్చారు. విజయమ్మని ఓదార్చడం సంగతి అటుంచితే, ఇప్పుడు చాలామందిలో తలెత్తుతున్న ప్రశ్న ఇంతకీ... విజయమ్మ ఎందుకు ఏడ్చినట్టు? * తన భర్త వైఎస్ రాజశేఖరెడ్డి గుర్తొచ్చా? * జగన్ దారుణంగా ఓడిపోయినందుకా? * త్వరలో జగన్ మళ్ళీ జైలుపాలు అవబోతున్నాడనా? * తాను గెలిపించమని ఓటర్లని రిక్వెస్ట్ చేసినా తన కుమార్తె షర్మిల ఓడిపోయిందనా? * షర్మిలకు ఆస్తి విషయంలో అన్యాయం జరుగుతోందనా? * కొడుక్కి దూరమైపోయాననా? * వదినా అని గౌరవంగా పిలిచే వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా తేలలేదనా? * ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని తాను వేరేవాళ్ళని ఉద్దేశించి అంటే, అది తన కొడుక్కే తగిలిందనా?

జగన్ చెక్కభజనలో తరించిన కేటీఆర్!

కల్వకుంట్ల తారకరామారావుకు గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ బీఆర్ఎస్ పరాజయం ఏమంత ఆశ్చర్యం కలిగించలేదుట కానీ ఈ ఏడాది ఏపీ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ ఘోరంగా పరాజయం పాలు కావడం ఆశ్చర్యం కలిగించిందట. అసలు జగన్ ను ఏపీ ప్రజలు ఓడించడం వెనుక కారణమేమిటో అర్ధం కావడం లేదని కేటీఆర్ చెబుతున్నారు. 40శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి కేవలం 11 స్థానాలే దక్కడమేంటని దిగ్భ్రమ చెందుతున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జగన్ ఓటమిని నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ఇదే కేటీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన తమ పార్టీ పని తీరును గోప్పగా చెప్పుకోవడానికి జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉండే వారు. ఏపీలో రోడ్ల దుస్థితిని ప్రస్తావిస్తూ తెలంగాణలో రహదారులు అద్దంలా ఉంటాయని చెప్పుకునే వారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అధమస్థానానికి పడిపోయిన ఏపీని ఎత్తి చూపుతూ తాము అగ్రస్థానంలో ఉన్నామని జబ్బలు చరుచుకునే వారు. ఇలా ప్రతి విషయంలోనూ జగన్ వైఫల్యాలను, జగన్ ప్రభుత్వ అసమర్ధతను చెబుతూ తాము గొప్పగా పాలన సాగిస్తున్నామని తమ భుజాలు తామే చరుచుకున్న కేటీఆర్... అంత గొప్పగా పాలన చేసిన తమనే జనం ఓడిస్తే అధ్వాన పాలనను అందించిన (ఈ మాట ఆయనే పలు సందర్భాలలో చెప్పారు.) జగన్ పార్టీని ఎందుకు గెలిపిస్తారన్న అనుమానం ఆయనకు ఏపీ ఎన్నికలకు ముందూ తరువాతా కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  జగన్  పాలనపై సెటైర్లు వేయడంలో ఒక్క కేటీఆర్ అనే కాదు, అధికారంలో ఉండగా కేసీఆర్ సైతం ఏపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తన పాలనలో తెలంగాణ ఎలా దూసుకుపోతోందో చెప్పడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునే వారు కారు. ఒక సందర్భంలో కేసీఆర్ ఏపీ పరిస్థితిని ఎత్తి చూపుతూ గతంలో  ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో రెండెకరాలు కొనేవారనీ, కానీ తన హయాంలో పరిస్థితి రివర్స్ అయ్యిందనీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో రెండెకరాలు కొనొచ్చనీ వ్యాఖ్యానించారు.  ఆయన తనయుడు మరో రెండాకులు ఎక్కువ చదివినట్లుగా..  గతంలో అవకాశం ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్ ను చులకన చేస్తూ మాట్లాడే వారు. జగన్ హయాంలో ఏపీలో ఐటీ పరిశ్రమ తిరోగమనదిశలోకి వెళ్లింది. ఆ విషయంపై కేటీఆర్ ఎంత హేళనగా మాట్లాడారో ఒక సారి గుర్తు చేసుకుందాం.  ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఆయన కాస్త ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టండి.. కావాలంటే ఆ రాష్ట్రముఖ్యమంత్రితో స్వయంగా నేనే మాట్లాడి సెట్ చెస్సానని చెప్పారు. అలాగే ఏపీలో రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి అయ్యో పాపం అన్నట్లుగా ఉందనీ, అయినా ఆ రాష్ట్రం పట్ల కూడా కాస్త దయచూపండి అంటూ ఏపీని, ఏపీ దుస్థితినీ హేళన చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని, తమ పాలనను తానే పొగిడేసుకుని తన భుజాలు తానే చరిచేసుకున్నారు. అటువంటి కేటీఆర్ తన ఓటమి కంటే గతంలో తాను ఛీ అన్నా, చులకన చేసినా దులుపుకుపోయిన మిత్రుడు జగన్ పట్ల ప్రేమ ఒలకబోయడం, జగన్ చెక్క భజన చేయడంలో తరించడం విడ్డూరమే. 

అవినాష్ కూడా జగన్ కు జెల్ల కొట్టేస్తారా!?

ఓటమి వైసీపీ ఇంటిగ్రిటీని దెబ్బతీసిందా?  జగన్ పార్టీ ముక్కలుచెక్కలు కాబోతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది. వైసీపీ పూర్తిగా దివంగత వైఎస్సార్ లెగసీపైనే ఆధారపడి ఉంది. అంటే వైఎస్ కుటుంబ ఐక్యతే ఆ పార్టీకి బలం. అయితే ఇప్పుడు ఆ బలం వైసీపీకి లేదు. జగన్ తన ఐదేళ్ల పాలనతో చేతులారా వైసీపీ లెగసీని వదులుకున్నారు. కాదు కాదు దూరం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత భవిష్యత్ లో పార్టీపై తన ఆధిపత్యానికి అడ్డువస్తారన్న అనుమానమో, మరోటో కానీ ముందు చెల్లి షర్మిలను, ఆ తరువాత తల్లి విజయమ్మనూ పార్టీకి దూరం చేశారు. వారంతట వారే పార్టీతో బంధాన్ని పుటుక్కున తెంచేసుకునేలా చేశారు. ఆ క్రమంలో చెల్లినీ, తల్లినీ కూడా అవమానించారు. దీంతో ముందు షర్మిల తెలంగాణకు వలస వెళ్లి తండ్రి వైఎస్ పేరుమీద ఆ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసుకుని తన రాజకీయాలు తాను చేసుకుంటూ సాగుతుంటే అందుకు కూడా జగన్ పలు ఆటంకాలు కల్పించారు. షర్మిలకు ఎటువంటి సాయం అందకుండా మోకాలడ్డారు. ఈ క్రమంలో తల్లి షర్మిల కూడా వైసీపీతో అనుబంధాన్ని తెంచుకుని, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో సహా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కుమార్తె షర్మిల పంచన చేరారు. సొదరుడి వేధింపుల కారణంగా షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి, ఆ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి సోదరుడికే సవాల్ విసిరారు. సరే షర్మిల ఫ్యాక్టర్ కూడా పని చేసింది. అంతకు మించి తన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా జగన్ ను ఆయన పార్టీని ఏపీ ప్రజలు అధికారం నుంచి దించేశారు.  దీంతో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమైంది. జగన్ ఒక్కడూ ఒక వైపు, వైఎస్ కుటుంబం మొత్తం మరో వైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో వైసీపీలో ఉండేదెవరు? గోడ దూకేసేదెవరు అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి. నిన్నమొన్నటి దాకా జగన్ చూసి రమ్మంటే కాల్చి  వచ్చినట్లు వ్యవహరించిన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలంతా సైలెంటైపోయారు. ఏ మాత్రం సందు చిక్కినా పార్టీ గోడదూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన వారు కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలా వెళ్లిన వారిలో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి,  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ వంటి వారు ఉన్నారని పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఇడుపులపాయలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలు వైఎస్ కుటుంబంలో ముగ్గరూ మూడు దారులు అన్న చందంగా  జరిగాయి. వైఎస్ కుటుంబంలో ముగ్గురూ మూడు దారులు అన్నట్లుగా ఆ కార్యక్రమం జరిగింది. ఇడుపుల పాయలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమం సాక్షిగా జగన్ వైఖరిని గమనించిన వారు.. కుటుంబంతో ఆయన సయోధ్య అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ ను వెంటబెట్టుకుని ఆయన తిరగడంతో జగన్ వైఎస్ అభిమానులకూ దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఇంత కాలం  ఏ అవినాష్ కు అయితే తాను రక్షణ కవచంగా నిలబడ్డారో అదే అవినాష్ కూడా రివర్స్ అయ్యేలా జగన్ అడుగులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లడానికి ఇసుమంతైనా ఆసక్తి చూపని జగన్ దృష్టి ఇప్పుడు లోక్ సభపై పడిందని అంటున్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి ఏదో మేరకు రక్ష కావాలంటే లోక్ సభ సభ్యుడిగా ఉంటేనే సాధ్యమౌతుందని ఆయన భావనగా చెబుతున్నారు. అందుకే పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి కడప లోక్ సభ సభ్యునిగా పోటీలో దిగాలని జగన్ భావిస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన అవినాష్ ను కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. గతంలో కూడా వైఎస్ వివేకానందరెడ్డిపై ఇలాగే ఒత్తిడి తెచ్చి కడప లోక్ సభ సభ్యత్వా నికి దూరం చేసిన సంగతి విదితమే.  అయితే ఇప్పుడు అవినాష్ అందుకు అంగీకరించే పరిస్థితి లేదని అంటున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు తనకు రక్షణ కవచమని వైఎస్ అవినాష్ రెడ్డి బలంగా భావిస్తున్నారు.  అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం చేజారడంతో అక్రమాస్తుల  కేసుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసేందుకు పార్లమెంట్ కు వెళ్లడమొక్కటే మార్గమని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఇరువురి మధ్యా విభేదాలు పొడసూపే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే..అంటే అవినాష్ కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిరాకరించి తమ్ముడుతమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు రాజకీయం రాజకీయమే అంటే  జగన్ పరిస్థితి ఏమిటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. మొత్తం మీద ఏ రకంగా చూసినా ఎక్కడా కూడా జగన్ మాట నెగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. 

భారతీయుడు 2’ టీమ్‌కి రేవంత్ అభినందనలు

కొంత కాలం క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం రేగిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి డ్రగ్స్‌ని విస్తరింపజేస్తున్న కొంతమందిపై చర్యలు తీసుకుంది. అయితే ఇటీవలికాలంలో ఈ డ్రగ్స్‌కి సంబంధించిన కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆమధ్య బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం జరిగిందన్న విషయం పెద్ద సంచలనమే సృష్టించింది. అది మరచిపోకముందే హైదరాబాద్‌లోని ఖాజాగూడలోని ఓ పబ్‌లో డ్రగ్స్‌ వాడుతున్నారన్న పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆ పబ్‌పై దాడి చేసి పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.  ఇలా దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక మూల మనం డ్రగ్స్‌ మాట వింటూనే ఉన్నాం. డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ గా ఉంది. డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ప్రకటించింది. దానికి అందరి మద్దతు కావాలన్న ఉద్దేశంతో సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్‌లోగానీ, మరేదైనా పబ్లిక్‌ ఫంక్షన్స్‌లోగానీ ప్రముఖులంతా డ్రగ్స్‌పై అవగాహన కలిగించేలా సందేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అందులో భాగంగానే సోమవారం జరిగిన ‘భారతీయుడు2’ చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌లో హీరోలు కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, నటుడు సముద్రఖని, దర్శకుడు శంకర్‌ డ్రగ్స్‌కి వ్యతిరేకంగా తమ వాణిని వినిపించారు. ‘సే నో టు డ్రగ్స్‌’ అంటూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు.  దీనిపై ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.  డ్రగ్స్‌ రహిత సమాజం కోసం  ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, సముద్రఖని, శంకర్‌ కలిసి ఓ అవగాహన వీడియో చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, ‘భారతీయుడు2’ చిత్ర యూనిట్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.  ఈ చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.