చంద్రబాబు నెల రోజుల పాలన.. జనంలో భవిష్యత్ పై భరోసా

ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి, ప్ర‌జా పాల‌న ప్రారంభ‌మై నెల రోజులు  అయ్యింది. ఐదేళ్లు జగన్  ప్ర‌భుత్వ  హ‌యాంలో బిక్కుబిక్కుమంటూ జీవ‌నం సాగించిన ప్ర‌జ‌లు.. ఇప్పుడు స్వేచ్చ‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.   ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టి నెల రోజులు దాటింది. మంత్రివ‌ర్గం కొలువుదీరింది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి పీఠం అదిరోహించిన నాటినుంచి ప్ర‌తీ రోజూ   స‌మీక్ష‌లు, స‌మావేశాల‌తో అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు.   ఏపీ న‌లుమూల‌లా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతిపై దృష్టిసారించిన చంద్ర‌బాబు.. ఆమేర‌కు అభివృద్ధి ప‌నుల్లో వేగం పెంచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి పోల‌వ‌రంపైనా ఫోక‌స్ పెట్టారు. మ‌రోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పై ఫుల్ ఫోకస్ పెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యావ్యవస్థ పై  దృష్టి సారించారు. పాతిక మంది దివ్యాంగ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపారు. చిన్న టెక్నికల్ ఇష్యూతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఆగిపోయిన వారి అడ్మిషన్లను తిరిగి లభించేలా చేశారు. ఇతర శాఖ‌ల‌ మంత్రులు సైతం బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌టి రోజు నుంచే వారివారి శాఖల‌పై ఫోకస్ పెట్టారు. ఫ‌లితంగా నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఏపీలో అభివృద్ధి ప‌నులు ప‌రుగులు పెడుతున్నాయి. త‌ద్వారా గ‌త ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో న‌ర‌క‌యాత‌న అనుభ‌వించి ప్ర‌జ‌లు..  ప్ర‌స్తుతం నెల‌రోజుల  తెలుగుదేశం పాలన భేషుగ్గా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.   వైసీపీ హ‌యాంలో   జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మంత్రులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ముఖ్య‌మంత్రి, మంత్రి ప‌ద‌వి అంటే కేవ‌లం ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చేయ‌డానికి,  ఎంజాయ్ చేయ‌డానికి  అన్న‌ట్లుగా వ్వ‌హ‌రించారు. బూతుల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై రెచ్చిపోవ‌టం, డ్యాన్సులు చేయ‌డం, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకోవ‌టానికే మంత్రులు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. తమకు పదవులు ఉన్నది జ‌గ‌న్‌ను పొగ‌డ‌టానికి, ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌ను అవ‌మానించ‌టానికే అన్న‌ట్లుగా వ్యవహరించారు.  గ‌త ప్ర‌భుత్వంలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో మంత్రులు నోటికి త‌క్కువ ప‌నిచెబుతూ.. అభివృద్ధి పనులు పూర్తిచేయ‌డంపై ఎక్కువ దృష్టిసారించారు. చంద్ర‌బాబు, నారా లోకేశ్ ఇప్పటికే అనేక ప‌థ‌కాల‌పై సమీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ పాల‌న‌లో దూసుకెళ్తున్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తొలిసారి ప్ర‌భుత్వంలో ఉండ‌టంతో ఆయ‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై స‌మీక్ష‌ల‌తో అవ‌గాహ‌న పెంచుకుంటూ, ఇటు జ‌న‌సేన పార్టీ, అటు ప్ర‌భుత్వంలో త‌న శాఖ‌లను బ్యాలెన్స్ చేసుకుంటూ త‌న‌దైన ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఇచ్చిన హామీ ప్ర‌కారం.. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెంచిన పింఛ‌న్ల‌ను 1వ తేదీనే అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మొదటి తారీకునే జీతాలు జ‌మ అయ్యాయి. ఉచిత ఇసుక విధానం అందుబాటులోకి వచ్చింది. వైసీపీ హ‌యాంలో ఇసుక  ధర బంగారంతో పోటీపడింది. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు పస్తులుండాల్సి వచ్చింది. ఉచిత ఇసుక విధానం అమలులోకి రావడంతో వారికి పనులు పుష్కలంగా దొరుకుతున్నాయి.   ప్ర‌జ‌ల‌కు మంచిచే య‌డాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేత‌లు అన‌వ‌స‌ర‌పు రాద్దాంతం చేస్తూ ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. మ‌రోవైపు తెలుగుదేశం నెల‌రోజుల పాల‌న‌లో నిరుద్యోగుల ఆశ‌లు నెర‌వేర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంది. మెగా డిఎస్సీ ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబ‌ట్టి.. యువతకు ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెచ్చేలా చంద్ర‌బాబు దృష్టి కేంద్రీక‌రించారు. త‌ద్వారా రాష్ట్రానికి భారీ సంఖ్య‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ క్ర‌మంలోనే  మ‌చిలీపట్నంలో బీపీసీఎల్‌ సంస్థతో భారీ పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది.  అలాగే వియత్నం దేశం నుంచి ఆటోమొబైల్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది.  మ‌రోవైపు సీఎంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటినుంచి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులకు ఎరువులు, విత్తనాలను ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచ‌డంతో రైతులు సంతోషంగా త‌మ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.  వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చింది చాలా త‌క్కువ‌. కేవ‌లం బ‌హిరంగ స‌భ‌ల‌కు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అదికూడా ఆయ‌న ప్ర‌యాణించే మార్గంలో అధికారులు ప‌ర‌దాలు క‌ట్టేవారు. ఒక్క‌సారి కూడా మీడియా స‌మావేశంలో జ‌గ‌న్‌ మాట్లాడ‌లేదు. గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఏపీలో జ‌రిగిన అక్ర‌మాల‌ను శాఖ‌ల వారిగా శ్వేత‌ప‌త్రాల రూపంలో చంద్ర‌బాబు బ‌య‌ట‌పెడుతున్నారు. అంతేకాదు.. నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే నాలుగైదు సార్లు మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేశారు. ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు   చేశారు. త‌ద్వారా నెల‌రోజుల పాల‌న‌లో ఎక్కువగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేదుకు చంద్ర‌బాబు ప్రాధాన్య‌త‌నిచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్లో ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యేలా చంద్ర‌బాబు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మొత్తానికి.. గ‌తంలో జగన్ పాలన ఆరంభంలోనే కూల్చివేతలు, రీ టెండర్లు, మంత్రుల బూతు పురాణాలతో ప్రారంభ‌మైతే..  తెలుగుదేశం ప్ర‌భుత్వ  పాల‌న ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధితో ప్రారంభ‌మైంది.  ఇంత చేస్తున్నా తెలుగుదేశం  ప్ర‌భుత్వంపై  ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒకింత  అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆ అసంతృప్తిని క్యాడర్ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ హయాంలో తెలుగుదేశం క్యాడర్ పై ఇష్టారీతిగా కేసులు నమోదు చేసి, ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై చర్యల విషయంలో  చంద్రబాబు సర్కార్ దూకుడుగా వెళ్లకపోవడమే. ఇదే విషయాన్ని క్యాడర్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.   లోకేశ్ రెడ్ బుక్ విషయంలోకూడా పార్టీ క్యాడర్ కాస్త అసంతృప్తి గానే ఉంది. గ‌త ఐదేళ్ల కాలంలో వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌తో ఇబ్బందులు ప‌డిన‌ టీడీపీ కార్య‌క‌ర్త‌లు లోకేశ్ రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారా అని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా తెలుగుదేశం క్యాడర్ అవినీతికి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు కాదు కాదు తక్షణ చర్యలు ఉండాలని భావిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన ప్రతి అధికారిపై చర్యలు ఉంటాయనీ, చట్ట ప్రకారమే ఆ చర్యలు ఉంటాయనీ చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిధిమీరి వ్యవహరించిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని లోకేష్ సైతం చెబుతున్నారు. క్యాడర్ అసహనానికి గురి కాకుండా ఓపికపట్టాల్సి ఉంటుంది.

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్.మెంట్ డీజీగా హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. బదిలీ అయిన అయిన ఐఏఎస్ అధికారులు, కొత్త బాధ్యతల వివరాలు... * జి. అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. * ఆర్.పి.సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్. * జి.జయలక్ష్మి- సీసీఎన్ఏ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు. * కాంతిలాల్ దండే- ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ. * సురేశ్ కుమార్- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి, గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు., జీఏడీ కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు. * సౌరభ్ గౌర్- ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు. * యువరాజ్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి. * హర్షవర్ధన్- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు. * పి.భాస్కర్- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి,  ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు. * కన్నబాబు- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గానూ బాధ్యతలు. * వినయ్‌చంద్- పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ. * వివేక్ యాదవ్- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి. * సూర్యకుమారి- మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ. * సి. శ్రీధర్ - ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బాధ్యతలు. * జె.నివాస్- ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్. * విజయరామరాజు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్. * హిమాంశు శుక్లా- సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్. * ఢిల్లీరావు- వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్. * వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్ బదిలీ. * గిరిజాశంకర్- ఆర్థికశాఖ నుంచి రిలీవ్.

65 కోట్ల రూపాయల స్కూలు ఫీజు వాపస్!

స్టూడెంట్స్ నుంచి అక్రమంగా వసూలు చేసిన 65 కోట్ల రూపాయల ఫీజును తిరిగి ఇచ్చేయాలని పలు ప్రైవేట్ పాఠశాలలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా కొన్ని స్కూళ్ళు నిబంధలను ఉల్లంఘించి ఫీజులు పెంచాయి. ఈ విషయమై అధికార యంత్రాంగానికి ఫీజులు అందడంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తు అధికారులు పలు స్కూళ్ళ ఖాతాలను పరిశీలించారు. 2018-19, 2024-25 విద్యా సంవత్సరాల మధ్యకాలంలో 10 పాఠశాలలు 81 వేలకు పైగా విద్యార్థుల నుంచి దాదాపు 65 కోట్ల రూపాయలను అదనంగా వసూలు చేసినట్టు తేలింది. దీనిని ప్రభుత్వం తప్పుపట్టింది. ఎక్కువగా చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వాలని సదరు స్కూళ్ళకు నోటీసులు జారీ చేసింది. సాధారణంగా స్కూళ్ళ 10 శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. 15 శాతానికంటే ఎక్కువ ఫీజు పెంచాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, ఈ స్కూళ్ళు మాత్రం ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేశాయి.

 తన సస్పెన్షన్ పై కంటతడి పెట్టిన వైకాపా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి

తనను వైసీపీ అధిష్ఠానం మోసం చేసిందంటూ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేస్తారా? అని మండిపడ్డారు. తాను పార్టీకి ఎలాంటి మోసం చేయలేదని చెప్పిన ఆయన... తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే, తన నుంచి వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని అన్నారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించారని... అయినప్పటికీ పదేళ్లుగా తాను పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. ఒక్కో ఇటుక పేర్చుతూ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే మరో వ్యక్తిని ఇన్ఛార్జీగా తీసుకొచ్చి తనను అవమానించారని సిద్ధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్ చేస్తే స్పందించొద్దని అధికారులను కట్టడి చేశారని మండిపడ్డారు. కొంతమంది డబ్బులు, పదవుల కోసం పార్టీని నాశనం చేశారని చెప్పారు. జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే... తానే తప్పుకునే వాడినని అన్నారు. రేపటి నుంచి తన కొత్త రాజకీయం చూస్తారని సిద్ధారెడ్డి చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనే విషయంపై తన సన్నిహితులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి టికెట్ ను సిద్ధారెడ్డికి కాకుండా... మక్బూల్ అహ్మద్ కు ఇచ్చారు. మక్బూల్ పై టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ గెలుపొందారు. కాగా, ఆ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలతో సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. 

ప్రశాంత్ కిషోర్ సొంత కుంపటి... ముహూర్తం అక్టోబర్ 2

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత కుంపటి అదే పార్టీ ఆవిర్బావానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజున సొంత పార్టీని ప్రకటించనున్నారు. కాకతాళీయం ఎంత మాత్రం కాదు కానీ సరిగ్గా రెండేళ్ల కిందట ప్రశాంత్ కిశోర్ తన ఎన్నికల వ్యూహకర్త ఉద్యోగానికి పదవీ విరమణ ప్రకటించి బీహార్ వ్యాప్తంగా జన సూరత్ యాత్రకు శ్రీకారం చుట్టింది కూడా అక్టోబర్ 2నే. అంటే గాంధీ జయంతి రోజునే. ఈ రెండేళ్లలో ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రమంతటా పర్యటించారు. ఆయన దాదాపు రాష్ట్రంలో దాదాపు 5000 కిలోమీటర్లు యాత్ర చేశారు. ఈ యాత్రలో భాగంగా ఆయన బీహార్ లోని 14 జిల్లాలలో పాదయాత్ర చేశారు. మిగిిన 10 జిల్లాలలో కారు యాత్ర చేశారు.  ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త విధుల నుంచి వైదొలగి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు యోచన చేయడానికి ముందు దేశంలోని వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందజేశారు. 2014 బీజేపీ విజయం వెనుక ఉన్నది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే. అలాగే 2019 ఎన్నికలలో ఆయన జగన్ నేతృత్వంలోని వైసీపీకి వ్యూహాలు అందించారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆ తరువాత 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ విజయానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమనడంలో సందేహం లేదు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహాలు అందించి వాటిని అధికారంలోకి తీసుకురావడం కంటే తాను సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి ఎందుకు రాకూడదనుకున్నారో ఏమో సొంత రాష్ట్రం బీహార్ లో జన సూరజ్ యాత్ర పేరిట సుదీర్ఘ యాత్ర చేశారు. ఆ యాత్ర ప్రారంభించిన సందర్భంలోనే తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి బీహార్ ఎన్నికల బరిలో దిగుతాననీ, అందుకోసమే జనసూరజ్ యాత్ర చేపట్టానని ప్రకటించారు. తన యాత్ర సందర్భంగా ఆయన తాను ఏర్పాటు చేయబోయే పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకున్నారు. అలాగే కింద స్థియి నుంచీ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టారు. బీహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో తన పార్టీ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలలోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తన జనసూరజ్ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమాావేశంలో ఆయన మాట్లాడుతూ కులం, మంతం, ప్రాతిపదికన ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.  మీ పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని కోరారు.  

వల్లభనేని వంశీ.. దారులన్నీ మూసుకుపోయాయా?

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే...వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా అజ్ణాతంలోకి జారుకుంటున్నారు. అలా అజ్ణాతంలోకి జారుకున్న వైసీపీ నేతలలో ముందుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చెప్పుకోవాలి. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో వీడి వైసీపీలో చేరడమే కాకుండా...తెలుగుదేశం అధినేత, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీని గన్నవరం ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో ఛీ కొట్టారు.  తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎన్నికైన వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై విపక్షానికి పరిమితం కావడంతో క్షణం ఆలోచించకుండా వైసీపీలోకి దూకేశారు. అలా దూకేసిన కొద్ది రోజులకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారాభువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించడం తన బలంగా, తన గొప్పతనంగా భావించుకున్న వంశీకి 2024 ఎన్నికలలో పరాజయం తన గెలుపు ఉన్న శక్తి ఏదన్నది తెలిసేలా చేసింది.  జగన్ అండ చూసుకుని తెలుగుదేశం శ్రేణులు, నేతలపై ఇష్టారీతిగా చెలరేగిపోయిన వల్లభనేని వంశీకి ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమయ్యాకా... చుక్కలు కనిపిస్తున్నాయి. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి సంఘటనలో ఆయనపై కేసు నమోదైంది. నాడు దాడిలో పాల్గొన్న ఆయన అనుచరులు 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైంది. అయితే వంశీ మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన వేర్ అబౌట్స్ కూడా తెలియకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  అక్కడ నుంచే ఆయన బీజేపీలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా ఒక్క  అడుగూ పడినట్లు కనిపించదు. ఒళ్లైపై తెలియకుండా విర్రవీగిన వంశీని తమ పార్టీలోకి ఆహ్వానిం చడానికి కమలం పార్టీ సిద్ధంగా లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఒక వేళ అదే నిజమైతే ఆయన ఇక ఎల్లకాలం అజ్ణాతంలోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అజ్ణాతం లేకుంటే జైలు అన్నట్లుగా వంశీ పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ పరిస్థితి గమనించే తెలుగుదేశంకు దగ్గరకావడానికి వంశీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. ఎలా చూసుకున్నా వంశీకి తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ అన్నది అసంభవమని పరిశీలకులు అఅంటున్నారు.  తెలుగుదేశం ఎన్ఆర్ ఐల ద్వారా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌తో మాట్లాడేందుకు వల్లభనేని వంశీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వంశీ అనుచరులే బాగాటంగా చెబుతున్నారు.   

వైకాపాకు షాక్.. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కి టిడిపి తీర్థం

అవినీతి,  అహంకారంతో పదవీ చ్యుతుడైన వైకాపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాభవం తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అధికార టీడీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ చేయడంతో చిత్తూరు కార్పొరేషన్ అధికార కూటమి పరమైంది. తాజాగా వైసీపీకి మరో భారీ షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కౌన్సిలర్లతో కలిసి డాక్టర్ సుధీర్ గురువారం అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మంత్రిని కలిసి టీడీపీలో చేరే విషయంపై సుధీర్ చర్చలు జరిపారని, సదరు మంత్రి వీరిని అమరావతికి తీసుకెళ్లారని అనధికారిక సమాచారం. ఇక, పుంగనూరులో మున్సిపల్‌ చైర్మన్‌ సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో వారంతా టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత వల్లభనేనివంశీ అరెస్ట్ కు రంగం సిద్దం 

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి కేసులో పోలీసులు రిమాండ్‌ రికార్డు తప్పుల తడకగా ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న 71 నిందితుల్లో 15 మందిని మంగళవారం (జులై 9న) అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన మూల్పూరి ప్రభుకాంత్, ఎర్రగుళ్ల నాగేష్‌ సహా 15 మందిని రిమాండ్‌ నిమిత్తం గన్నవరం 12వ అదనపు న్యాయస్థానంలో బుధవారం ప్రవేశపెట్టారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి ఎఫ్‌ఐఆర్‌లో ఒక పేరు, మరోచోట ఇంకొ పేరును సగం పేరును నమోదు చేశారు. ఊరి పేర్లు తప్పులు ఉన్నట్లు న్యాయమూర్తి గుర్తించారు. నివేదికలోని తప్పులు సవరించిన తర్వాతే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. దీంతో బుధవారం రాత్రి 10 గంటలకు తప్పులు సరిచేసిన అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజులు పాటు రిమాండ్‌ విధించారు.

బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీత మీద ప్రమాణం!

ఈమధ్య బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓడిపోయారుగానీ, చాలామంది భారత సంతతికి చెందిన వారు మాత్రం పార్లమెంటు సభ్యులుగా విజయం సాధించారు. మొత్తం 27 మంది బ్రిటన్ పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. వారిలో ఒకరైన శివానీ రాజా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. శివానీ రాజా భగవద్గీత మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. లైసెస్టర్ ఈస్ట్నియోజకవర్గం నుంచి శివానీ విజయం సాధించారు. ఆమె విజయం తాజాగా అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. గత 37 సంవత్సరాలుగా లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం లేబర్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ అభ్యర్థి, భారత సంతతి నాయకుడు రాజేష్ అగర్వాల్‌ని ఓడించి శివానీ ఎంపీగా గెలిచారు. శివానీ గుజరాతీ మూలాలున్న యువతి. తాను భగవద్గీత మీద ప్రమాణం చేసి పదవిని చేపట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శివానీ రాజా తెలియజేశారు. ‘‘లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాజుకు విధేయతగా వుంటానని, భగవద్గీత మీద ప్రమాణం చేయడం నాకు గర్వకారణం’’ అని ఆమె పేర్కొన్నారు. 29 ఏళ్ళ శివానీ రాజా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు.

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ... ఇదీ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకరరావు తీరు 

ఫోన్ ట్యాపింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ బిఐ మాజీ చీఫ్ ఇప్పట్లో ఇండియాకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ కేసులో దర్యాప్తు అధికారులకు  ఆయన సహకరించే అవకాశాలు సన్నగిల్లినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచే జూబ్లిహిల్స్ పోలీసులకు లేఖలు రాస్తున్న ప్రభాకర్ రావు  ఇక మొహం చాటేస్తున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేదని చెబుతూ ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ప్రభాకర్ రావు చేస్తున్నట్టు కనబడుతోంది.  ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో అనధికారికంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో  అధికారులు ప్రతిపక్ష పార్టీల నేతలు, పలువురు వ్యాపారులు, కీలక వ్యక్తులఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్‌ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆయన దేశం వదిలి అమెరికాకు వెళ్లిపోయారు. కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 23న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని లేఖలో వెల్లడించారు. జూన్‌ 26న తాను ఇండియాకు తిరిగి రావాల్సి ఉందని.. ఆరోగ్యం బాగోలేక యూఎస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. తాను క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాని.. అమెరికా డాక్టర్ల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని ప్రభాకర్ రావు తెలిపారు. ఒక పోలీసు అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని... తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టపరంగా విచారణ జరపాలని కోరుతున్నానని.... విచారణలో పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అయినా, మెయిల్ ద్వారా అయినా సమాచారం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోనని... పూర్తిగా కోలుకున్న తర్వాత దర్యాప్తు అధికారుల ముందు హాజరై, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలతో తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన చెందుతున్నామని చెప్పారు

పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా... జగన్ రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్?

గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో జగన్ పులివెందుల శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనీ, కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం జగన్ కడప లోక్ సభ సభ్వత్యానికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి, ఆయనను తాను రాజీనామా చేసిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దింపుతారన్నవార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు వైసీపీ నుంచి కానీ జగన్ నుంచి కానీ ఎటువంటి స్పందనా లేదు. పార్టీ వర్గాలు జగన్ కడప నుంచి లోక్ సభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే ఉన్నారనీ, అలా అయితేనే తనకు తన అక్రమాస్తుల కేసులను డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటందని భావిస్తున్నారనీ అంటున్నారు.  అయితే కొంచం లాజిక్ తో ఆలోచిస్తే జగన్ పులివెందుల అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి కడప నుంచి లోక్ సభకు పోటీ చేస్తే అక్కడ గెలుస్తారా?  అలాగే అవినాష్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే ఆయనకు విజయం సాధించే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉప ఎన్నికలలో సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి తోడు తాజా ఎన్నికలలో పులివెందులలో జగన్ మెజారిటీ బాగా తగ్గింది. అలాగే కడప లోక్ సభ నియోజకవర్గంలో జగన్ కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి, సొంత చెల్లెలు షర్మిల రంగంలోకి దిగడం ఖాయం. అటువంటప్పుడు జగన్ ఆమెను నేరుగా ఢీకొని గెలవగలరా? తాజా ఎన్నికలలో కడప జిల్లాలో తెలుగుదేశం అద్భుత ప్రదర్శన కనబరిచింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ తరుణంలో పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఆ పార్టీకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఒక వేళ ఉప ఎన్నికలలో పులివెందుల నుంచి అవినాష్ పోటీ చేసి ఓడిపోయినా, కడపలో జగన్ స్వయంగా పరాజయం పాలైనా ఇక జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే అవుతుంది.   నిజంగానే జగన్ పులివెందుల స్థానానికి, అవినాష్ రెడ్డి కడప లోక్ సభ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెరతీస్తే.. కడపలో జగన్ విజయం సంగతి ఎలా ఉన్నా పులివెందులలో అవినాష్ రెడ్డి విజయం సాధించడం మాత్రం అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగన్ కు మెజారిటీ తగ్గింది. ఇక్కడ తెలుగుదేశం తరఫున బీటెక్ రవి రంగంలోకి దిగుతారు. సీఎం హోదాలో పోటీలో ఉన్న జగన్ నే దీటుగా ఎదుర్కొన్న బీటెక్ రవికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో  అవినాష్ పై విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.  ఇక కడప విషయంలోనూ తెలుగుదేశం అంత తేలిగ్గా తీసుకోదనీ, అవసరమైతే జగన్ ఓటమి లక్ష్యంగా ఉప ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థిగా నిలిచే షర్మిలకు లోపాయికారీ మద్దతు ఇచ్చే అవకాశాలే మెండుగా ఉంటాయనీ చెబుతున్నారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికలో ఏం జరిగిందో  పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే  జగన్ చేజేతులా తన రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లేనని విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణ డీజీపీగా జితేందర్!

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హోం డీజీపీగా వున్న రవి గుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త డీజీపీ జితేందర్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి ఎంపికయ్యారు. మొదట నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ రో్జుల్లో నక్సల్స్ ప్రభావం అధికంగా వున్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్ళి ఢిల్లీ సీబీఐలో, అనంతరం 2004 నుంచి 2006 వరకు గ్రే హౌండ్స్.లో పనిచేశారు. అనంతరం డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్ బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత వరంగల్ రేంజ్ డీఐజీగా నియమితులయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్.మెంట్‌లో బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ళ శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా వున్నారు. జితేందర్ 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు తమ ప్రతిభతో ఎస్ ఐలు అయ్యారు

దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి ఎస్ ఐ లు అయ్యారు. బిహార్‌ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు.  అందులో ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ట్రాన్స్‌మెన్ పుట్టుక లో ఆడ కాగా ఒకరు ట్రాన్స్‌ఉమెన్,పుట్టుకలో మగ, ఉన్నారు.  గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్ ఎస్ ఐ లు అయ్యారు.ఒకేసారి ముగ్గురు ట్రాన్స్ జెండర్ లు ఎస్ ఐలు మారడం పలువురికి ప్రేరణ మిగిల్చింది.  భారత సివిల్ సర్వీస్ లో తొలిసారి భారత సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారి ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఐఆర్ఎస్‌లో (ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ) పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి అన్ని అధికారిక రికార్డుల్లో తన పేరు, లింగ మార్పిడి చేసుకున్నారు. ఈ తరహాలో చరిత్రలో తొలిసారి వచ్చిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్  కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల ఎం.అనసూయ ఇప్పుడు ఎం.అనుకతిర్ సూర్యగా మారిపోయారు. ఇన్నాళ్లు స్త్రీగా ఉన్న అనుకతిర్‌ను ఇకపై పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది. అన్ని అధికారిక రికార్డుల్లోనూ అనుకతిర్ సూర్యగా గుర్తిస్తారు. కాగా లింక్డ్ఇన్‌లో లభ్యమైన ప్రొఫైల్ ప్రకారం.. సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్‌గా ప్రమోషన్ పొందారు. గతేడాది నుంచి హైదరాబాద్‌‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీలో 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.

తెలంగాణలో రాజ్య సంక్రమణ సిద్దాంతం ... తేల్చేసిన కరడుగట్టిన కమ్యూనిస్ట్ నేత బివిరాఘవులు 

రాజ్యసంక్రమణ సిద్ధాంతం.  ఈస్టిండియా కంపెనీకి గవర్నర్ గా పని చేసిన  డల్హౌసీ  ఈ సిద్దాంతానికి కర్త, కర్మ, క్రియ అని వేరే చెప్పక్కర్లేదు. . ఆయన రూపొందించి అమలుపరచిన  ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం నవీన భారతావనిలోనూ కొనసాగుతోంది.   ఈ సిద్ధాంతాన్ని  భారత ఉపఖండంలో ఈస్టిండియా కంపెనీ పరిచయం చేసినప్పటికీ ఇది 1858 సంవత్సరం వరకు కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెన పాలన తర్వాత బ్రిటిషు వలస పాలకులు మనదేశాన్ని ఏలారు. రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రకారం   సామంత రాచరిక సంస్థానాలలో పాలకుడు అసమర్ధుడైనా లేదా పుత్రసంతానం లేకుండా మరణించినా, ఆ రాజ్యాలు అప్రమేయంగా ఈస్టిండియా కంపెనీ రాజ్యంలో కలిసిపోతాయి.తరతరాలుగా పుత్ర సంతానం లేని రాజులు వారసున్ని దత్తత తెచ్చుకోవటమనే సంప్రదాయాన్ని ప్రోత్సహించింది.  అంతేకాక కాబోయే పాలకుడు సమర్ధుడా? కాడా? అన్న విషయాన్ని బ్రిటీషువారే నిర్ణయించేవారు. ఈ సిద్ధాంతాన్ని అప్పట్లో మన భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీని అమలు న్యాయబద్ధంకాదని  వాదించారు. చాలామంది భారతీయులు, స్వాతంత్ర సమర యోధులు  ఈ సిద్దాంతంపై పోరాడారు. కానీ కరడు గట్టిన కమ్యూనిస్ట్ యోధుడైన సిపిఎం జాతీయ నేత అయిన బివి రాఘవులు రాజ్య సంక్రమణ సిద్దాంతం పై నోరు విప్పారు. రాజ్య సంక్రమణ సిద్దాంతం ఇంకా కొనసాగుతుందని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా? ఎప్పుడు గద్దెనెక్కుదామా? అని బీజేపీ కాచుకొని కూర్చుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు లౌకిక శక్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలపై కేంద్రం మోపిన భారాన్ని మరిచిపోయి... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చదువుతున్నారని విమర్శించారు.హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ... తెలంగాణలో బీఆర్ఎస్‌కు మనుగడ ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూచించారు. పార్లమెంట్‌లో ఇష్యూ టు ఇష్యూను బట్టి వ్యవహరిస్తామని కేటీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. అలా స్పందించడమంటే రాజకీయం కాదని... లొంగుబాటు అవుతుందన్నారు.దేశమంతా అభివృద్ధి జరిగితే ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ చెప్పాలని నిలదీశారు. సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచన, ఆత్మవిమర్శ లేకుండా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ ఎన్నికలను డబ్బులతో ముంచేసిందని ఆరోపించారు.తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 19 శాతం నుంచి 35 శాతానికి పెరగడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇక్కడ బీజేపీని నియంత్రించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కేరళలోనూ బీజేపీ ఒక సీటు సాధించడం చింతించాల్సిన విషయమే అన్నారు. ప్రధాని మోదీ కార్పోరేట్ శక్తులకు సేవకుడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్లడంలో సీపీఎం చేసిన త్యాగం మరే పార్టీ చేయలేదన్నారు. ఓట్లు.. సీట్లు కాదని... దేశాన్ని రక్షించుకోవడమే సీపీఎం లక్ష్యమన్నారు. తెలంగాణలో మతోన్మాదాన్ని ప్రజల మనస్సులో నుంచి తొలగించే బాధ్యత సీపీఎంపై ఉందన్నారు.

నాకు టికెట్ ఇస్తే సికింద్రాబాద్ గెలిచేవాడిని: మీడియాకెక్కిన హనుమ

 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు కలిసి కట్టుగా ఉన్న  తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడిప్పుడే బజారున పడుతున్నారు. కాంగ్రెస్ లో కుమ్ములాటలు షరామామూలే. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఎక్కువే. రేవంత్ రెడ్డిని ఎవరూ ఓడించరు. అంతర్గత కుమ్ములాటల వల్లే రేవంత్ సర్కారు పడిపోతుందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత్ రావ్ వ్యాఖ్యలు.  పార్టీలో తనకు ఎనిమిదేళ్లుగా ఒక్క పదవీ లేదని, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వి.హనుమంతరావు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.టీ20 కప్ గెలిచిన టీమిండియాకు వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశంలో క్రికెట్‌కు మంచి క్రేజ్ ఉందన్నారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా క్రికెట్ స్టేడియం లేదన్నారు. కానీ ఏపీలో 12 ఉన్నాయని వెల్లడించారు.తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మాణానికి పన్నెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. గతంలో కేటీఆర్ క్రీడలను ప్రోత్సహించలేదని... కనీసం ఎకరం భూమిని కూడా కేటాయించలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు.