అజ్ఞాతం వీడిన పీవీపీ.. పోలీసుల ఎదుట హాజరు!!
posted on Aug 14, 2020 @ 2:51PM
కిడ్నాప్ కేసుతో పాటు మరో కేసులో వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
గత సెప్టెంబర్ 16న పీవీపీ తన వద్ద మేనేజర్ గా పని చేసిన తిమ్మారెడ్డిని కిడ్నాప్ చేశారంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీవీపీ పై ఏ1 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం బంజారాహిల్స్ లో ఓ విల్లాకు సంబంధించిన గొడవలో ఆ విల్లా యజమాని పీవీపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులపై పీవీపీ కుటుంబసభ్యులు కుక్కలను వదిలారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ సీరియస్గా తీసుకున్నారు.
పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో పీవీపీ హైదరాబాదును వీడి విజయవాడకు వెళ్లిపోయారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందారు. అయితే, ఈ రెండు కేసులకు సంబంధించి విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో.. ఈరోజు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట పీవీపీ విచారణకు హాజరయ్యారు.