మాజీ సీఎం చంద్రబాబు పై లోకాయుక్తలో కేసు నమోదు..
posted on Aug 14, 2020 @ 6:00PM
ఏపీ సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో ధర్మ పోరాట దీక్ష పేరుతో పలు నగరాలలో దీక్ష చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఒకసారి దేశ రాజధాని ఢిల్లీలో కూడా అఖిల పక్ష నాయకులతో కలిసి దీక్ష చేసారు. ఐతే కేంద్ర ప్రభుత్వం పై చేసిన ఈ దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
తాజాగా దీని పై అడ్వొకేట్ ఏ.వి. రమణ లోకాయుక్తకు మొన్న జులై నెలలో ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుకు ఆధారంగా ఆ అడ్వొకేట్ కొన్ని బడ్జెట్ పేపర్లను, అలాగే అప్పటి కొన్ని వార్తల క్లిప్పింగులను కూడా జతచేశారు. అప్పట్లో మొత్తం 11 కోట్ల మేరకు నిధుల్ని విడుదల చేయగా, ఢిల్లీ దీక్షకు దాదాపు 7.5 కోట్లు ఖర్చు చేశారని అయన ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఐతే తాజాగా ఈ విషయంలో స్పందించిన లోకాయుక్త చంద్రబాబు పై కేసు నమోదు చేస్తున్నట్లుగా ఆ అడ్వొకేట్ కు ఇచ్చిన సమాధానం లో తెలిపింది.