టాప్ లో తెలంగాణ.. ఏపీ ఎక్కడుందో తెలుసా?
posted on Aug 20, 2020 @ 4:43PM
ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరధ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా మంచి నీటి సరఫరా అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో 98.31 శాతం ఇళ్ళకు మంచి నీటి నల్లా కలెక్షన్లు ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం 98.31 శాతం ఇళ్ళకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ జల్ జీవన్ మిషన్ వివరాలు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 54.38 లక్షల ఇళ్లుండగా వాటిల్లో 53.46 లక్షల ఇళ్లకు తాగునీరు అందుతోంది. తెలంగాణ తరువాత 89.05 శాతంతో గోవా రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా, 87.02 శాతంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరి మూడో స్థానంలో నిలిచింది.
నల్లా కలెక్షన్లలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలిస్తే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనకపడిపోయింది. ఈ జాబితాలో కేవలం 34.62 శాతంతో ఏపీ 13వ స్థానంలో నిలిచింది. ఇక 2.05 శాతంతో పశ్చిమ బెంగాల్, 1.86 శాతంతో మేఘాలయ చివరి స్థానాలలో ఉన్నాయి.
ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. "కేంద్ర జల శక్తి నివేదిక ప్రకారం.. తెలంగాణ 98.31 శాతం నల్లాల కనెక్షన్లతో తాగునీరు అందిస్తూ తొలిస్థానంలో నిలిచింది. మిషన్ భగీరథ ద్వారా ఈ తాగునీరు అందుతోంది. ఈ అద్భుత విజయానికి కారణమైన సీఎం కేసీఆర్ దూరదృష్టికి, కష్టపడి పనిచేసిన ఆర్డబ్ల్యూఎస్ టీమ్ కు అభినందనలు" అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.