కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే గడువుకన్నా ముందుగానే వ్యాక్సిన్
posted on Aug 20, 2020 @ 10:48AM
మన దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్ కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా పై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఒక వేళ కేంద్రం కనుక నిర్ణయిస్తే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ విషయంలో అత్యవసర ఆదేశాలు ఇవ్వడం ద్వారా అనుకున్న సమయం కన్నా ముందుగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమని ఐసీఎంఆర్ తెలిపింది.
దేశంలో కరోనా పరిస్థితులు, వాక్సిన్ విషయం పై హోమ్ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఐసీఎంఆర్ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే మనదేశంలో భారత్ బయోటెక్ కోవాగ్జిన్, జైడస్ కాడిలా జైకోవిడ్ వ్యాక్సిన్లు రెండో దశ ట్రయల్స్ ను పూర్తి చేసుకున్నాయని... ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో కరోనా నిరోధక యాంటీ బాడీలు పెరగడమే కాక సైడ్ ఎఫెక్ట్ లు కూడా పెద్దగా నమోదు కాకపోవడంతో, "ఎమర్జెన్సీ ఆథరైజేషన్" ద్వారా వ్యాక్సిన్ ను రిలీజ్ చేసి యువతకు ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నప్పటికీ, కేంద్రం అత్యవసరమని భావిస్తే, వెంటనే దాన్ని విడుదల చేసేందుకు సిద్ధమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ స్వయంగా వ్యాఖ్యానించినట్టు కమిటీలోని ఓ ఎంపీ మీడియాకు తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ కంప్లీట్ అయి ఫలితాలు రావడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని భార్గవ చెప్పారని, అయితే ప్రభుత్వం కనుక తప్పదని భావిస్తే, వ్యాక్సిన్ ను వెంటనే రిలీజ్ చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన తెలిపినట్లుగా తెలుస్తోంది.