అనంతపురం కోవిడ్ హాస్పిటల్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం...

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాద దుర్ఘటన మరిచిపోక ముందే తాజాగా అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ హాస్పిటల్ కొవిడ్ వార్డులోని రికార్డు రూములో 12 గంటల సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ గది పక్కనే 24 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.   అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఎస్పీ సత్య ఏసుబాబు, స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే కరోనా బాధితులను మరో వార్డుకు తరలించారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన పై ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వెన్నుపోటుకు పాతికేళ్ళు.. త్వరలో బాబు పాలిటిక్స్ కు ముగింపు: సునీల్ దేవధర్

ఏపీలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిన దగ్గరనుండి పార్టీ మంచి దూకుడుగా వ్యవహరిస్తోంది. అటు అధికార పక్షమైన వైసిపిని ఇటు ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేస్తూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.   తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సరిగ్గా 25 ఏళ్ల కిందట టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావు తనను వెన్నుపోటు పొడిచినందుకు చంద్రబాబును పార్టీ నుండి బహిష్కరించారని, ఈ రోజును చంద్రబాబు ఇప్పటికి గుర్తుచేసుకుంటారనే తాము భావిస్తున్నామని అయన తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ మధ్య బీజేపీ పైనా, ప్రధాని మోదీ పైనా అపవాదులు వేశారని సునీల్ దేవధర్ ఈ సందర్భంగా ఆరోపించారు. అయితే ఇప్పుడు బాబు అధికారం కోల్పోయాడని, త్వరలోనే అయన రాజకీయ బరి నుండి కూడా పూర్తిగా నిష్క్రమిస్తారని అయన జోస్యం చెప్పారు. ద్రోహులు ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందేనని అయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.   అంతేకాకుండా 1995 ఆగస్టు 25న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సహా మరో ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుపుతూ అప్పటి అసెంబ్లీ స్పీకర్ కు పంపిన లేఖను కూడా సునీల్ దేవధర్ ఈ సందర్భంగా ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా..!

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి అయన సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం ను కలిసి రాజీనామా లేఖను ఇచ్చారు. రామచంద్రమూర్తి నాలుగైదు నెలల కిందటే రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అప్పట్లో ఎందుకో సైలెంటయిపోయారు. తాజాగా ఇప్పుడు హఠాత్తుగా అయన తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి ఇచ్చారు.    గతంలో సీఎం జగన్ మీడియాలో డైరక్టర్‌గా పని చేసిన ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ప్రభుత్వ పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా సీఎం జగన్ నియమించి మంచి జీతభత్యాలతో కేబినెట్ హోదా కూడా ఇచ్చారు. అయితే.. తనకు ఏమీ పని మాత్రం ఉండటం లేదని అంతేకాకుండా ముఖ్యమంత్రి పాలనాపరమైన, విధాన నిర్ణయాలు తీసుకునే సమావేశాలకు ఆయనకు సమాచారం కూడా ఉండటం లేదని దీంతో అసంతృప్తికి గురైన అయన గతంలోనే రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి.   ఏపీ ప్రభుత్వంలో సలహాదారులుగా నియమితులైన వారిలో కేవలం ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారు ఉత్సవ విగ్రహాల లాగా మిగిలారని వార్తలు వస్తున్నాయి. ఈ ఒకరిద్దరు సలహాదారులు మాత్రమే అందరి బదులు సీఎం కు సలహాలు ఇస్తూంటారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇలా ఉండటం ఇష్టం లేక రామచంద్రమూర్తి రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.

చంద్రబాబు మాటలు వింటే నువ్వు కూడా మటాష్.. హీరో రామ్ కు కొడాలి నాని హితవు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో హీరో రామ్ ట్వీట్స్ ద్వారా స్పందించడంపై రాజకీయపరంగా తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ఇటు సోషల్ మీడియాలోను అటు బహిరంగంగాను కొంత మంది మండిపడ్డారు. తాజాగా ఈ విషయంలో హీరో రామ్ ట్వీట్స్‌ పై మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు.   హీరో రామ్ చంద్రబాబు మాట వినకపోవడం మంచిదని అయన సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని చంద్రబాబు టీడీపీలో ఎలా చేరారో, తరువాత తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఎన్టీఆర్‌కు ఎలా వెన్నుపోటు పొడిచారో, పార్టీ, పదవిని ఎలా లాగేసుకున్నారో ఇవన్నీ అందరికి తెలుసని నాని అన్నారు. చంద్రబాబు మాటలు వింటే అటు సినిమా కెరీర్, ఇటు రాజకీయ జీవితం ఏమవుతుందో ప్రముఖ హీరోలు అయిన తోటి ఆర్టిస్టులు పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లను అడిగితే చెబుతారని కొడాలి నాని హితవు చెప్పారు.   అసలు ఏ తప్పు చేయకపోతే డాక్టర్ రమేశ్ ఎందుకు పారిపోతారని నాని ఈ సందర్భంగాగా ప్రశ్నించారు. రమేశ్ ఆసుపత్రి యజమాని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని, అంతేకాకుండా రమేశ్ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసునని చెపుతూ.. చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ తలదాచుకున్నారని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేసారు. మహిళల్ని ముందు పెట్టుకుని డాక్టర్ రమేశ్ పారిపోయారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన కేవలం కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని నాని తీవ్రంగా దుయ్యబట్టారు. తనకు తన పార్టీకి విరాళాలు ఇచ్చే వారికి అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. డాక్టర్ రమేశ్‌ను కాపాడేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వైఎస్ జగన్‌కు లేదని, చంద్రబాబుకు వయస్సు పెరిగినా బుద్ధి రాలేదని మండిపడ్డారు.

జైలులో ఉన్నప్పుడు మీకిచ్చిన నెంబ‌ర్.. టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది

ఏపీలోఅవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌ 14400 ప్రారంభించిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, 14400 కాల్‌ సెంటర్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు వీలుగా బిల్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని తెలిపారు. 14400 నంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించాలి, పర్మినెంట్‌ హోర్డింగ్స్‌ పెట్టాలని సీఎం పేర్కొన్నారు.   కాగా, జగన్ సర్కార్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌ 14400 పెట్టడం, అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. "వైఎస్ జగన్ గారూ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌ 14400 పెట్టారు. అవినీతి చ‌క్ర‌వ‌ర్తి, క్విడ్‌ప్రోకో కింగ్‌, ప్ర‌జ‌ల‌సొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ..ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచ‌ల్‌గూడ‌లో 16 నెల‌ల్లో జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబ‌ర్ 6093. ఇదే నెంబర్ అవినీతి పై ఫిర్యాదు చెయ్యడానికి టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది!" అంటూ ఎద్దేవా చేశారు.    "మీరు దోచేసిన ప్రజా సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమచేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుంది జగన్ రెడ్డి గారు ఒక సారి ఆలోచించండి." అంటూ లోకేష్ చురకలు అంటించారు.

త్వరలో వరంగల్ వాసులకు విమానయాన సేవలు

ఎయిర్ పోర్టుకు తగిన స్థలం కోసం 10 రోజుల్లో సర్వే   వరంగల్ నగర అభివృద్ధిలో భాగంగా మామునూరు ఎయిర్ పోర్టు సేవలు ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటిఆర్ కేంద్ర మంత్రి ని కోరారు.   వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చి, మామునూరు ఎయిర్ పోర్టును ఆపరేషన్ లోకి తీసుకురావాలని కోరుతూ ఢిల్లీలో కేటిఆర్ కేంద్ర పౌర విమానయాన, పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి విజ్ణప్తి చేశారు. 10 రోజుల్లో ఇందుకోసం సర్వే చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దాంతో త్వరలో ఓరుగల్లు వాసులకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు చోట్ల ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయడంపై సర్వే జరుగుతుంది. అయితే మామునూరులో రన్ వే ఉండడంతో త్వరలో ఓరుగల్లులో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నారు.   వరంగల్ లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయి, వసతులున్న నగరంగా వరంగల్ మారుతుంది. ఎయిర్ పోర్ట్ నిర్మాణం నగర అభివృద్ధిలో కీలక ఘట్టంగా మారుతుంది.

ఫోన్ డేటా చార్జీల పెంపు తప్పదు

వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్ లు, జూమ్ మీటింగ్ లు, కాపక్షేపం కోసం చాటింగ్ లు ఇలా అనేక రకాలుగా మొబైల్ డేటా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రానున్న కాలంలో చార్డీల పెంపు తప్పదు అంటున్నాయి మొబైల్ కంపెనీలు. మొన్నటి వరకు నెట్ వర్క్ వాడకం దారుల సంఖ్య పెంచడానికి ఉచితం నెట్ వేసి మరీ జియో సంస్థ ఇంటర్నెట్ సదుపాయం కల్పించింది. ఆ తర్వాత చార్జీలు పెంచింది. కరోనా కష్టకాలంలో మొబైల్ నేస్తమై ఎంతోమందికి కాలక్షేపంగా మారింది. ఇప్పుడు అదను చూసుకుని చార్టీలు పెంచడానికి టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి.    తాజాగా భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ రానున్న ఆరు నెలల్లో మొబైల చార్జీల ధరలు పెరుగుతాయని మెల్లగా లీకేజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ధరలకు డేటా ఇవ్వడం ఇకపై సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. మొబైల్ కమ్యూనికేషన్ కోసం కన్నా కాలక్షేపం కోసం వాడేవారి సంఖ్య పెరగడంతో డేటా వాడకం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ధరలను పెంచినా కాలక్షేపం కోసం అలవాటు పడిన వినియోగదారులు కిక్కురుమనకుండా చెల్లిస్తారని కంపెనీ యాజమాన్యం ధీమా..! ఏం చేస్తాం అంతా కరోనా కాలం మహిమ.

అమరావతి పై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

ఏపీ రాజధాని అమరావతి పై ఏపీలో తీవ్రమైన రచ్చ జరుగుతున్న సంగతి తెసిందే. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని అమరావతి విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో చట్టసభలు నిర్మించడం, నిర్వహించడం కూడా కుదరదని కొడాలి నాని అన్నారు. నేను వైఎస్ జగన్ ను కూడా కోరబోతున్నాను. హైకోర్టు కూడా పేదలు ఉండడానికి వీల్లేదని చెబితే కనుక అక్కడ రాజధాని నిర్మించడానికి కూడా వీల్లేదు అని అన్నారు.   అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచాలని జగన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయితే దీనిపై అమరావతి జెఏసి కోర్టు మెట్లెక్కింది. దీంతో హైకోర్టు ఈ ఉత్తర్వుల పై స్టే విధించింది.

స్వర్ణపాలెస్ అగ్నిప్రమాద ఘటన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే.. డాక్టర్ రమేష్ కు ఊరట

ఎపి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో డాక్టర్ రమేష్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌పై ఈరోజు హైకోర్టు స్టే విధించింది. డాక్టర్ రమేష్ ఫైల్ చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డాక్టర్ రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ను గతంలో ఎయిర్ పోర్టు క్వారంటైన్ సెంటర్ గా నిర్వహించారా? లేదా? అని అడిగింది. అసలు స్వర్ణ ప్యాలెస్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలను ఎందుకు బాధ్యులను చేయలేదని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రశ్నించించింది. దీంట్లో అధికారుల తప్పు కూడా ఉందని.. ఈ ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది.   ఈ నెల 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డాక్టర్ రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదంలో 10 మంది మరణించగా మరో 20 మందికి గాయాలయ్యాయి.

గులాబీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్? 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసనమండలి ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. హైద్రాబాద్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కారు పార్టీ దూకుడుగా ఉండేది. అయితే తొలిసారి ఆ పార్టీలో ఎన్నికల టెన్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉండగా.. నల్గొండ నుంచి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు ఉండగా.. నల్గొండ స్థానం పరిధిలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలున్నాయి. ఓటు హక్కు ఉన్నవారంతా విద్యాధికులు కావడంతో... వారంతా ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న సస్పెన్ష్ అధికార పార్టీలో ఉంది. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు చాలా గుర్రుగా ఉన్నారు. మూడేళ్ల కిందట ఇస్తామన్న పీఆర్సీ ఇంకా ఇవ్వకపోవడం.. ప్రశ్నించే ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేయడం వంటి ఘటనలపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. బదిలీలు, ప్రమోషన్ల విషయాన్ని సర్కార్ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు పెరిగాయని ఆరోపిస్తున్న ఉద్యోగులు.. తమను బెదిరించేలా సర్కార్ వ్యవహరిస్తోందనే భావనలో ఉన్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరును ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. తహశీల్దార్లు, రెవిన్యూ సిబ్బందిపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్న నిరుద్యోగులు... ఇప్పటికే చాలా సార్లు ఆందోళన చేశారు. కేసీఆర్ పై గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో విద్యార్థుల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది.     కరోనా కట్టడి, వరదలు, పంట నష్టం విషయాల్లోనూ ప్రభుత్వ తీరు సరిగా లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న వేళ కేసీఆర్.. ప్రజలను గాలికోదిలేశారనే వాదన ఉంది. కరోనాతో ప్రజలు చనిపోతున్నా ముఖ్యమంత్రి స్పందించలేదని, ప్రగతి భవన్, ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించాయి. జనాలు కూడా కరోనా కట్టడిలో సర్కార్ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వరదలు వచ్చినా.. క్షేత్రస్థాయి అధికారులు సరిగా స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి వ్యతిరేకత కనిపిస్తుండటంతో గులాబీ పార్టీలో మండలి ఎన్నిక గుబులు రేపుతోంది.    మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలను విపక్షాలు సవాల్ గా తీసుకుంటున్నాయి. టీజేఎస్ ఛైర్మెన్ కోదండరామ్ నల్గొండ నుంచి పోటీ చేసే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కోదండరామ్ కు ఉద్యోగులు, నిరుద్యోగులు మద్దతు ఇవ్వొచ్చని వారు భయపడుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో కోదండరామ్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కోదండరామ్ గెలిస్తే కేసీఆర్ కు ఇబ్బందులే. హైద్రాబాద్ స్థానంలో బీజేపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఉద్యోగ సంఘం నేత దేవిప్రసాద్ ను బరిలోకి దింపినా టీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఇప్పుడు ఉద్యోగులంతా సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నందున.. ఈసారి గెలవడం దాదాపు అసాధ్యమనే చర్చ అంతర్గతంగా టీఆర్ఎస్ లో జరుగుతోంది. హైద్రాబాద్ పై ఎలాగు ఆశలు లేవు.. నల్గొండలో కూడా ఓడిపోతే పార్టీ పరువు పోతుందని మరికొందరు నేతలు భయపడుతున్నారు. పోటీ చేసి ఇబ్పందులు పడేకంటే.. పోటీ చేయకుండా ఎవరికైనా తటస్థులకు లోపాయకారిగా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా టీఆర్ఎస్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కారు పార్టీకి సవాల్ గా నిలువబోతున్నాయి. మరీ కేసీఆర్ ఎలా ముందుకు వెళతారో చూడాలి.

ఉన్నా లేన్నట్టు.. లేకున్న ఉన్నట్టు.. ఏంటో కరోనా మాయ

పాండవుల కోసం మయుడు నిర్మించిన మయసభలో చిత్రవిచిత్రాలు గోచరించాయట. ద్వారం ఉన్నా లేన్నట్టు, గోడలు లేకున్నా ఉన్నట్టు.. ప్రస్తుతం కరోనా అదేవిధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. లక్షణాలు ఉన్నా కరోనా లేనట్టు, ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా ఉన్నట్టు.. ఎంటో ఈ కరోనా మాయ అంటూ అటూ ప్రభుత్వం, ఇటు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చేసేది ఏమీ లేక ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే.. చేయడానికి ఏమీ లేక ప్రజలు చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా వేలాదిమంది ఈ మహ్మమారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది ఇంటికే పరిమితమై ఆరోగ్యవంతమైన రేపటి కోసం ఎదురుచూస్తున్నారు.   తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఊహించినదాని కంటే ఎక్కువే ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు నిర్వహించన సర్వేలో  నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి గత 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని అంచనా వేశారు. మురుగునీటి నమూనాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ  వివరాలు వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ఉందని, లక్షణాలు లేకుండానే ఎక్కువమంది కరోనా బారిన పడి తమకే తెలియకుండా కోలుకుంటున్నారని  తాజా అధ్యయనం పేర్కోంటుంది.   తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 84,163 మంది కోలుకున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం 52,933 మందికి కరోనా ‌పరీక్షలు చేయగా 2579మందిలో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.  తెలంగాణలో ఇప్పటివరకు 10, 21,054 మందికి టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.    తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే లో ఇదే పరిస్థితి. కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారిలో 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. నాలుగు జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ గా వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 89,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 2,68,828 మంది కోలుకున్నారు. 3.368మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 32,92,501 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

హిందూ మహాసముద్రంపై అధిపత్య యత్నాలు

హిమాలయాల వద్ద మోహరింపులు   హిందూ మహాసముద్రంపై అధిపత్య యత్నాలు   చైనా ఎత్తులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా భారత్   హిమాలయాల్లో భారత్ చైనా సరిహద్దుల్లో లఢఖ్, గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ వెంట సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు హిమాలయాల్లో గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్న భారత సైన్యం సాగరతలంలోనూ సత్తా చాటేందుకు సమాయత్తం అవుతోంది. తాజాగా డ్రాగన్ కంట్రీ మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్‌లలో ఓడరేవుల ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతోంది. ఈ క్రమంలో చైనా దూకుడుకు తగిన పాఠం చెప్పడానికి భారత సైన్యం  కూడా దేశ ద్వీప భూభాగాల్లో నౌవికా, వైమానిక, సైనిక దళాలను మోహరిస్తోంది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఉత్తర అండమాన్‌లోని ఐఎన్‌ఎస్ కోహస్సా, షిబ్‌పూర్ , నికోబార్‌లోని క్యాంప్‌బెల్ స్ట్రిప్ వద్ద  ఎయిర్‌స్ట్రిప్‌ను  ఇప్పటికే పూర్తి స్థాయి యుద్ధ స్థావరాలుగా భారత్ అభివృద్ధి చేస్తుంది. వీటితో పాటు లక్షద్వీప్‌లోని అగట్టి వద్ద ఉన్న ఎయిర్‌స్ట్రిప్ ను సైనిక కార్యకలాపాల కోసం అభివృద్ధి చేస్తున్నారు.  భారత్ కు సహాయంగా అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన బి - 2 స్పిరిట్ బాంబర్లు మూడు హిందూ మహాసముద్రంలోని డియోగో గార్పియా నౌకాకేంద్రానికి ఇప్పటికే చేరుకున్నాయి. 2020 ప్రారంభంలోనే ఇక్కడికి అమెరికా బి-52 హెచ్ ఫైటర్ జెట్లు ఆరు చేరుకున్నాయి.   బంగాళాఖాతం  నుంచి మలక్కా స్ట్రెయిట్స్ వరకు,  అరేబియా సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్ వరకు నౌవికాదళాన్ని సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక్కడ గస్తీ మరింత పెంచారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాలు ఈ రెండు ద్వీపాలలోనే ఉన్నాయి.   చైనా యుద్ధానికి సిద్ధమై భారత్ తో తలపడితే భూ, గగన, సాగర తలాల్లో ఎలా వచ్చినా డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉంది.  

బాబు నిర్లక్ష్యంతో.. కంచుకోటలాంటి ఆ నియోజకవర్గంలో మూడో స్థానానికి టీడీపీ..

నిన్నటివరకు ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ ఈ రోజు అక్కడ పార్టీ పరిస్థితి అంతా అయోమయంగా తయారైంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన వ‌ల్ల‌భనేని వంశీమోహన్ సీఎం జగన్ ను కలిసి జెండా ఎత్తేయడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వం లేకుండా పోయింది. వంశీ  టీడీపీని వీడి చాలా కాలం అయినా కూడా ఆయన స్థానంలో ఇన్‌ఛార్జిని నియమించకుండా చంద్రబాబు మీన మేషాలు లెక్కపెడుతున్నారని స్థానిక కార్యకర్తల‌ నుండి విమర్శ వినిపిస్తోంది. అసలు వంశీ ఎప్పుడైతే సీఎం ను కలిసి మద్దతు ప్రకటించారో అపుడే ఇన్‌ఛార్జిని ప్రకటిస్తే గన్నవరంలో పార్టీ పరిస్థితి బాగుండేదనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లోనూ, సానుభూతిపరుల్లోనూ వ్యక్తం అవుతోంది. అయితే వంశీ పార్టీని వీడిన తరువాత అయినా ఇన్‌ఛార్జి వ్యవహారం తేల్చ‌కుండా అటు చంద్రబాబు ఇటు లోకేష్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని.. ఇప్పటికే నాయకత్వం లేక పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కొంత మంది వంశీ వెంట వెళ్లుతున్నారని మరి కొన్ని రోజుల్లో పార్టీలో క్రియాశీల‌కంగా ఉన్నవారంతా కూడా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.   వాస్తవానికి టిడిపి నుంచి వైసిపి లోకి వెళ్లిన వంశీ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇప్పటికే వైసిపి లో ఉన్న గ్రూపు తగాదాల‌తో ఆయనకు కూడా చుక్కలు కనపడుతున్నాయంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎప్పటి నుండో పాతుకుపోయిన దుట్టా రామచంద్రరావు వర్గీయులు ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరో పక్క గత ఎన్నికల్లో వైసిపి తరుపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా ఎమ్మెల్యే వంశీ కి చిక్కులు సృష్టిస్తున్నారు. దీనికి తోడు దుట్టా అల్లుడు నియోజకవర్గ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. అయితే దుట్టా, యార్లగడ్డ వర్గాల‌ను కలుపుకుని వెళ్లాల‌ని వంశీ ఎంత ప్రయత్నిస్తున్నా వారు ఆయనకు సహకరించడం లేదు. ఒకవేళ వారిద్దరూ సహకరిస్తే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళతానని వైసిపి తరుపున గెలిచి రాజధాని ప్రాంతంలో రికార్డు సృష్టించాల‌ని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అది సాధ్యం కాకపోవడంతో తనతో పాటు నిన్నటి వరకు టిడిపిలో పనిచేసి తన వెంట రాని నాయకుల‌ను తనవైపు తిప్పుకుంటున్నారు.    కొన్ని గ్రామాల్లో ఉన్న టిడిపి నాయకులు వంశీ వెంట వెళుతున్నా వారిని ఆపేవారు కానీ, వారికి సర్దిచెప్పి పార్టీలో ఉండేలా చేయగలిగిన నాయకులు కానీ ప్రస్తుతం టిడిపిలో కనిపించడం లేదు. రోజు రోజుకు నియోజకవర్గంలో టిడిపి బల‌హీనం అవుతున్నా బాబు గారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. ఒకవేళ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగి వంశీ కి వైసిపి టికెట్ వస్తే ఆయనను వ్యతిరేకించే వైసిపి నాయకులు ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉపఎన్నికల్లో పోటీ వంశీకి ఇండిపెండెంట్‌ అభ్యర్ధికి మధ్యే జరిగే పరిస్థితి. దీంతో టిడిపి మూడవ స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ఎవరో ఒకరికి ఇన్‌ఛార్జి పదవిని అప్పగించకపోతే అయన కలలుగన్న రాజధాని ప్రాంతంలో, టీడీపీ కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో టీడీపీ మూడోస్థానానికి పడిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

కేటీఆర్ ఆశలపై నీళ్లు.. పట్టాభిషేకం ఇప్పట్లో లేనట్లే!!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా వున్న కల్వకుంట్ల తారక రామారావు(కేటిఆర్) పట్టాభిషేకం ఇప్పట్లో లేనట్లే నని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఇక నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, దాంతో తన కుమారుడు, ప్రస్తుతం తన మంత్రివర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టి తాను ఢిల్లీ కి మకాం మారుస్తారని ఎప్పటినుంచో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.     దీనికి ఊతమిస్తున్నట్లు, కొద్దిరోజులక్రితం, అంటే ఆగష్టు 12 వ తారీఖున, కేటీఆర్, ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ లో దాదాపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించినంత పనిచేసారు. దీనికి మంత్రులందరూ, అధికారులు, వివిధ శాఖలకు చెందిన శాఖాధిపతులు హాజరుకావడం జరిగింది. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు.    వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేరుగా ప్రశ్నించారు. కుమారుడు కేటీఆర్ మంత్రివర్గ సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని వివిధ పార్టీల నాయకులు ప్రశ్నించారు. దీనికి అటు ముఖ్యమంత్రి నుండి కానీ, ఇటు కేటీఆర్ నుండి కానీ, కనీసం అధికార పార్టీ నేతలెవ్వరూ కూడా స్పందించలేదు సరికదా కనీసం కేటీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంపై ఎలాంటి స్పస్టతనుకూడా ఇవ్వలేదు.    దీనికి తోడు కొంతమంది అధికార పార్టీ ఎమ్యెల్యేలు కేటీఆర్ ను ముఖ్యమంత్రి గా చూడాలని కోరుకుంటున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. దీంతో అందరూ ఇక కేటిఆరే తప్పక ముఖ్యమంత్రి కాబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. దీనికి తగ్గట్లు, కేసీఆర్ అతి త్వరలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని, అయన ఢిల్లీ కి మకాం మార్చి వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులతో, కొందరు పార్టీల నాయకులతో చర్చలు జరుపుతారనే ప్రచారానికి తెర లేపుతూ కొన్ని ప్రసార మాద్యమాల్లో వార్తలు కూడా రావడం కూడా జరిగింది.    అయితే, దీనిపై ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించిగుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి దీనికి ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని తెలుస్తోంది. దీనికి కారణం, కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఇదే అవకాశంగా తీసుకొని, పార్టీని తెలంగాణాలో బలం పెంచుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఒకసారి కేటీఆర్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే, తమకు ఈ విషయాన్నీ ప్రజల్లోకి తీసుకు వెళ్లడం సులభమవుతుందని బీజెపీ నమ్ముతున్నదని ఇంటలిజెన్స్ వర్గాలు నివేశికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.    దీంతో కేసీఆర్ ప్రస్తుతానికి ఈ విషయంపై వెనక్కు తగ్గినట్లేనని, ప్రస్తుతానికి కేటీఆర్ ఆశలపై కేసీఆర్ నీళ్లుచల్లారని తెలుస్తోంది.

వివాదాలకు కేరాఫ్

తస్లీమా నస్రీన్(25ఆగస్టు 1962)   'సమాజంలోని సంఘటనలపై స్పందించే హక్కు అందిరికీ ఉంది. తమ అభిప్రాయాలు చెప్పేవారిని మతాల పరంగా, కులాల పరంగా విడదీయవద్దు' అంటారు తస్లీమా నస్రీన్. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉందని చెప్పే ఆమె వివాదస్పద రచయితగా పేరు తెచ్చుకున్నారు. హేతువాదిగా, స్త్రీవాద, మానవహక్కుల కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె తలకు వెలకట్టినా తలవంచకుండా మత ఛాందసవాదులను ఎదిరించి నిలబడ్డారు. 1992లోబాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతిస్పందిస్తూ బంగ్లాదేశ్‌లో హిందువులపై ముస్లీంలు జరిపిన దాడులకు వ్యతిరేకంగా రాసిన 'లజ్జా ' నవల ఆమెను వివాదస్పద రచయితగా పరిచయం చేసింది.    బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ లో తస్లీమా 25ఆగస్టు, 1962న జన్మించారు. ముస్లీం కుటుంబంలో పుట్టిపెరిగినప్పటికీ ఆమె మతాలకు అతీతంగా మారారు. హేతు వాదిగా, నాస్తికురాలిగా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేవారు. వైద్య విద్యను పూర్తి చేసిన ఆమె 1994 వరకు ప్రభుత్వ డాక్టర్ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రచనారంగం వైపు వచ్చారు. 1990 నుంచి తన అభ్యుదయవాద రచనలతో ప్రపంచ ప్రసిద్ధి పొందారు. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత సంఘటన, ఆ తర్వాత జరిగిన దాడులు ఆమెపై చాలా ప్రభావం చూపించాయి. బంగ్లాదేశ్ లో ఒక మతం వారు మరో మతం వారిపై మానవత్వం లేకుండా దాడులు చేయడంతో స్పందించిన ఆమె ఆ తర్వాత లజ్జా పేరుతో ఒక నవల రాశారు. మత ఛాందసవాదుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోన్నారు. ఆ నవల కాపీలను తగలబెట్టారు. ఆమెపై ఫత్వా జారీ చేయడమే కాక ఆమె తలకు వెల కట్టారు. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించారు. భారతదేశానికి వచ్చిన ఆమె కోల్ కత్తాలో నివాసం ఉంటున్నారు.   తస్లీమా ముస్లీం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపారు. బురఖా లో వారు అవమానాలను, అణిచివేతను ఎదుర్కోంటున్నారని ఎన్నోవేదికలపై తన అభిప్రాయాలను వెల్లడించి వివాదస్పద వ్యక్తిగా మారారు. కొద్దినెలల కిందట ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ కుమార్తె ఖతీజా బుర్ఖా ధరించిన విషయంపై కూడా స్పందించి మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ హీరో సుశాంత్ మరణం విషయంలోనూ ఆమె స్పందించారు.   'నేను మీ శత్రువును కాదు. ముస్లింల నిజమైన నేస్తాన్ని. విద్యావంతులు, మేధావులు తమ మతం సంస్కరించబడాలని కోరుకుంటున్నారు. నేనూ అదే కోరుకుంటున్నాను' అంటారు తస్లీమా.  తాను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సస్‌(ఎయిమ్స్‌) దానం చేస్తున్నట్టు తస్లీమా ప్రకటించారు. మతానికన్నా మనవత్వమే ముఖ్యమని చాటారు.

మీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు.. మా పార్టీ కి ఆపాదిస్తే  సహించేది లేదు

నాయకత్వలేమితో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు తమ పార్టీకి ఆపాదిస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర బిజేపి కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి కాలేకపోయాను అన్న ఆవేదనలో ఉన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు బిజేపితో మ్యాచ్ ఫిక్స్ అయ్యారని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా పోషించలేకపోతుందన్నారు.   రాహుల్ గాంధీ ఎప్పుడూ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని, అనవసరమైన ఆరోపణలు చేసి తన స్థాయి దిగదార్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల కు స్వేచ్ఛ లేదన్నారు. ఆ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని తన లాంటి సీనియర్ నాయకుల ను కూడా టికెట్ ఇవ్వడానికి డబ్బులు అడిగారని ఆయన నిశితంగా విమర్శించారు. తెలంగాణ లో టిఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు.

ఏపీలో కర్రీ పాయింట్లకు కూడా తప్పని పన్ను పోటు.. సంక్షేమ పథకాల కోసమేనట  

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోసం కొత్త కొత్త దారులు వెతుకుతున్నాయి. దీని కోసం ఒక పక్క కరోనా వ్యాప్తి కొనసాగుతుండగానే వైన్ షాపులు ఓపెన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలు కొంత వరకు ఆదాయాన్ని పెంచుకున్నాయి. ఇపుడు తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ వృత్తి పన్ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు కొన్ని సవరణలు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే దిశగా కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ ప్రభుత్వం ఈ సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది.   తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. సినిమా నిర్మాతపై పన్ను విధించడమే కాక ఆ నిర్మాత తీసే సినిమాలో జూనియర్‌ ఆర్టిస్టులపైనా అదే పన్ను.. డ్యాన్సర్లపైనా పన్ను.. కూరలు విక్రయించే వీధుల్లోని కర్రీ పాయింట్లపైనా పన్ను. ఆర్థిక పరమైన కష్టాలతో అప్పుల వేట కొనసాగిస్తున్న ఏపీలోని జగన్ సర్కారు "సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు కావాలి" అని స్పష్టంగా చెబుతూ కొత్త పన్నులు విధించింది. తాజాగా వృత్తి పన్ను విధింపును క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు పన్ను వసూలుకు పకడ్బందీగా నిబంధనలు రూపొందిస్తూ మరో జీవోను కూడా జారీ చేసింది. దీంతోపాటు వృత్తి పన్ను చెల్లిస్తేనే లైసెన్సులు, రెన్యువల్స్‌, ఇతర అనుమతులు ఇవ్వాలంటూ సంబంధిత శాఖలన్నింటినీ ఆదేశించింది. నిర్మాత నుంచి జూనియర్‌ ఆర్టిస్టు దాకా సినిమా, టీవీ పరిశ్రమకు సంబంధించిన వారెవరినీ వదలకుండా అందరిపైనా ఒకే రీతిలో రూ.2500 వృత్తి పన్ను విధించారు. ప్రొడ్యూసర్లు, డిస్ర్టిబ్యూటర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రఫీ ఫిల్మ్‌ ప్రాసెసర్లు, ఫొటోగ్రఫీ డైరెక్టర్లు, మ్యూజిక్‌ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, గీత రచయితలు, నటులు, కథా రచయితలు, గాయకులు, రికార్డిస్టులు, ఎడిటర్లు, ఔట్‌డోర్‌ ఫిల్మ్‌ యూనిట్లు, అసిస్టెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు, కెమెరామెన్లు, స్టిల్‌ ఫొటోగ్రాఫర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ కెమెరామెన్లు, అసిస్టెంట్‌ రికార్డిస్టులు, అసిస్టెంట్‌ ఎడిటర్లు, డ్యాన్సర్లు ఇలా ఎవ్వరిని వదలకుండా ప్రతి ఒక్కరూ రూ.2,500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ జీవోలో పేర్కొన్నారు.   జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు రూ.2500 వృత్తి పన్నును విధించింది. వీడియో లైబ్రరీ, వే బ్రిడ్జి ఆపరేటర్లకు రూ.2500 మేర వృత్తి పన్నువిధించింది. వృత్తి పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి కొత్తగా కర్రీ పాయింట్లను కూడా చేర్చారు. క్యాంటీన్లు, రెస్టారెంట్లు, టేక్‌ అవే ఫుడ్‌ పాయింట్ల సరసన కర్రీ పాయింట్లను కూడా చేర్చి ఏడాదికి రూ.2500 వృత్తి పన్ను చెల్లించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఏదైనా సంస్థ నుంచి రెమ్యునరేషన్‌ పొందుతున్న వారూ పన్ను చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. అయితే పబ్లిక్‌ టెలిఫోన్‌ ఆపరేటర్లను వృత్తి పన్ను నుంచి మినహాయించింది. రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు వృత్తి పన్ను వసూళ్లు కూడా పడిపోవడంతో ఈ సవరణలు చేసినట్టు ఆ జీవోలో పేర్కొంది.   గతంలో ఈ పన్ను వసూళ్ల బాధ్యతను కేవలం వాణిజ్య పన్నుల శాఖ ఒక్కటే చూసుకునేది. అయితే తాజాగా వృత్తి పన్ను వసూలు బాధ్యతను కూడా 18 శాఖలకు అప్పగించారు. ఇప్పుడు సంబంధిత రంగాలను పర్యవేక్షించే శాఖలకే అప్పగించి, వృత్తి పన్ను కడితేనే అనుమతులు ఇవ్వాలని తాజాగా ఆదేశించారు. ఓవైపు ప్రతి నెలా ఆదాయం తగ్గుతున్నప్పటికీ రైతు భరోసా, వాహనమిత్ర, అమ్మ ఒడి, నాడు నేడు, టెలీ మెడిసిన్‌, మహిళలకు సున్నా వడ్డీ రుణాల పథకాల వంటివి అనేకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి భారీస్థాయిలో నిధులు అవసరం అవుతున్నందున వృత్తి పన్ను రేట్లు సవరించడం తప్పనిసరైందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ బరిలో కోదండరాం..!!

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) నిర్ణయించింది. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన  పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు.   వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి కోదండరాం బరిలోకి దిగితే బాగుంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే, ఏ నిర్ణయమైనా సమష్టిగా తీసుకోవాలని కోదండరాం స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా మరోసారి సమావేశమై అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈలోగా ఇతర పార్టీలు, సంఘాల నేతల అభిప్రాయాలు, మద్దతు సేకరించాలని కోరారు.    ఇక 2018 ఎన్నికల్లో తాము పోటీ చేసిన దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. దానిపై నివేదిక తయారు చేసేందుకు కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు.   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసిఆర్ సర్కార్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దేని కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ కల కేసిఆర్ తో సాకారం కావట్లేదని చెబుతూ.. గత ఎన్నికలకు ముందు  టీజేఎస్‌ పార్టీని స్థాపించారు. అయితే, మహాకుటమి పొత్తులో భాగంగా కొద్ది స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన టీజేఎస్‌.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపాయింది. అయితే, కోదండరాం మాత్రం.. కేసిఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికపై దృష్టి పెట్టడం చూస్తుంటే.. కోదండరాం కాస్త దూకుడు పెంచినట్టు కనిపిస్తున్నారు. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఏ మేరకు ప్రభావితం చూపిస్తారో.

ఏపీలోని కరోనా క్వారంటైన్ సెంటర్లో అగ్నిప్రమాదం..

ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించిన ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని కొమ్మాది లో ఉన్న శ్రీ చైతన్య వాల్మీకి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంప్యూటర్‌లు, ఇతర ఫర్నిచర్ దగ్ధమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది కరోనా బాధితులను మరో చోటికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారెవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.   ఇది ఇలా ఉండగా ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటనపై ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీని పై ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా విశాఖలోని క్వారంటైన్ సెంటర్లో ప్రమాదం జరగడంతో తీవ్ర కలకలం రేగింది.