వైఎస్ జగన్ కేసుల విచారణ 12కి వాయిదా
posted on Oct 9, 2020 @ 3:11PM
హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 12 కి వాయిదా పడింది. అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసులను నవంబరు 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం విచారణ జరిగేది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది. దీంతో ఈ కేసు విచారణ ఇక నుండి రోజువారీ సాగనుంది. ఈ నేపథ్యంలో కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
జగన్, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిని కోర్టు అంగీకరించింది. కరోనా నేపథ్యంలో.. కోర్టు హాలులో ఎక్కువమంది న్యాయవాదులు, నిందితులు ఉండటం ఇబ్బందిగా ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని, జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. తాము కూడా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జగన్ కేసులో నాలుగు ఛార్జిషీట్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఉంది. స్టే ఉన్న కేసులను నవంబర్ 9 కి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. ఇతర కేసుల విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో జగన్ కి ఇబ్బంది తలెత్తే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్కు లీజులు, వాన్ పిక్ కు భూకేటాయింపులతో పాటు ఎమ్మార్ వ్యవహారంపై నమోదు చేసిన ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. ఈ కేసులలో సత్వర విచారణ జరిగి ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.