ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 12కి వాయిదా
posted on Oct 9, 2020 @ 7:52PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 12కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 12 నుంచి రోజువారీ విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.
ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులపై కోర్టులు విచారణ ప్రారంభించాయి.
ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసు వ్యవహారంపై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కాగా, ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు సెబాస్టియన్, ఉదయసింహ తదితరులు నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులో ఆడియో టేపుల విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టు కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఇప్పటికే 960 పేజీలతో కూడిన చార్జిషీటు దాఖలు చేసింది. స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడిదన్నది ఈ కేసులో కీలక అంశం.
2015లో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం కోసం అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను నగదుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో రేవంత్ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు ఈ కేసు విచారం ప్రారంభం కావడంతో.. దీనిపై కోర్టు ఏం తీర్పు ఇస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.