త్వరలో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం
posted on Oct 9, 2020 @ 3:33PM
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వ్యాపారాలు పేరిట బ్యాంకుల నుంచి రుణం తీసుకుని రూ.826.17 కోట్ల మేర దారి మళ్లించారన్న ఆరోపణలపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. అయితే, ఈ అంశంపై రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఎంపీగా అనర్హుడ్ని చేయలేని వైసీపీ నేతలు ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగవేశానంటూ రాయడం ద్వారా ఓ పత్రిక విశ్వసనీయత పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. బ్యాంకుల నుంచి మేం తీసుకున్న రుణం రూ.4 వేల కోట్ల లోపే ఉంటుందన్నారు. అందులో రూ.2 వేల కోట్లు ఇంకా బ్యాంకు ఖాతాల్లోనే ఉన్నాయని తెలిపారు. అక్టోబరు 6న తనపై కేసు నమోదైందని చెప్పిన ఆయన.. అదే రోజున సీఎం జగన్ ప్రధాని మోదీని కలవడం, పీఎన్ బీ బ్యాంకు చైర్మన్ ను కలవడం అనుమానాలు కలిగిస్తోంది అన్నారు.
తమ వ్యాపారాల్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెబుతానని తెలిపారు. తనపై సీబీఐ కేసు వేయించేలా చేసింది సీఎం జగన్ కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ అని ఆరోపించారు. కేంద్ర ఆర్థికశాఖలో ప్రవీణ్ ప్రకాష్ బ్యాచ్ మేట్ ఉన్నారని, ఆయన ద్వారానే ఈ కేసు వేయించారని పేర్కొన్నారు.
వాళ్లపై రూ.43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉండడంతో తనపై రూ.23 వేల కోట్లు అని ఆరోపణలు చేశారనుకుంటున్నానని ఎద్దేవా చేశారు. అవాస్తవాలతో కథనాలు రాసిన వారిపై కేసులు వేద్దామని మా లాయర్లు చెబుతున్నారు కానీ, మరో మూడ్నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరో కేసు వేయడం ఎందుకుని ఆగిపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగతి పబ్లికేషన్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యనించారు.