మధ్యప్రదేశ్ లో కర్నాటక తరహా గేమ్... హుటాహుటిన ఢిల్లీకి శివరాజ్ సింగ్...
మధ్యప్రదేశ్ లో కర్నాటక తరహా నెంబర్ గేమ్ మొదలైంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నెంబర్ గేమ్ తర్వాత కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే, బీజేపీ నెక్ట్స్ టార్గెట్ మధ్యప్రదేశే నంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడంతో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆర్నెళ్లు తిరగకుండానే, మళ్లీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో నెంబర్ గేమ్ మొదలైంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు.... బీజేపీ 107 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే, నలుగురు ఇండిపెండెంట్స్ గెలవగా, బీఎస్పీ 2, ఎస్పీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. రెండు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు కావాల్సి ఉండటంతో, ఎస్పీ, బీఎస్పీ, నలుగురు ఇండిపెండెంట్స్ తో కలిసి మొత్తం 121మంది బలంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బీజేపీ కంటే కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ గెలుచుకున్న కాంగ్రెస్.... ఎస్పీ, బీఎస్పీ, ఇండిపెండెంట్స్ మద్దతుతో సర్కారును నడుపుతోంది. ఇదే, బీజేపీకి ఆయుధంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 9 సీట్ల దగ్గర ఆగిపోయిన కాషాయ పార్టీ, ఇఫ్పుడు నెంబర్ గేమ్ మొదలుపెట్టింది. కర్నాటక తరహాలోనే అసమ్మతి రాజేసి గద్దెనెక్కేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే 8మంది ప్రభుత్వ ఎమ్మెల్యేలకు వల విసిరిందని అంటున్నారు. 8మందిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, మిగతా నలుగురు బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని చెబుతున్నారు. అయితే, బీజేపీ బంధించిన 8మంది ఎమ్మెల్యేల్లో, నలుగురు తప్పించుకుని వచ్చారని, ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఆధీనంలోనే ఉన్నారని దిగ్విజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
అయితే, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో కమలనాథులు కొట్టిపారేస్తున్నారు. కేవలం సంచలనం కోసమే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఏదో ఒక సంచలనం లేదా కలకలం సృష్టించి, తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ ఆరోపించారు. అయితే, శివరాజ్ సింగ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడంతో మధ్యప్రదేశ్ లో నెంబర్ గేమ్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. మరి, స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కమల్ నాథ్... తన సర్కారును కాపాడుకుంటారో లేక... కర్నాటక తరహాలో అధికార పీఠాన్ని కోల్పోతారో వేచిచూడాలి.