లోకేష్ పారిపోయాడు.. కేటీఆర్ జులాయి! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన కామెంట్లు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గ్రేటర్లో వరద సాయం పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేస్తే కొట్టేయడం ఇబ్బంది అవుతుందని.. ఓట్లు కొనుగోలు చేయడానికి నగదు బదిలీ పథకం పెట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ జులాయి అని రేవంత్ మండిపడ్డారు.  వరద సాయం కోసం ఇచ్చిన రూ. 10 వేల డబ్బుల్లో టీఆరెస్ నేతలు రూ. 5 వేలు కొట్టేశారని, దీనిపై ప్రజలంతా తిరగబడాలని ఆయన పిలుపిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు పైసలు అందలేదని, టీఆర్ఎస్ దొంగలకు మాత్రం డబ్బులు వెళ్లాయని  రేవంత్  మండిపడ్డారు.    జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. వరద సాయం వివరాలు అడిగితే చెప్పలేక లోకేష్ కుమార్ పారిపోయారన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులను పెట్టి దొంగలా తప్పించుకున్నాడని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.  శనివారం నాడే కమిషనర్ లోకేష్ అపాయింట్మెంట్ తీసుకున్నా.. ఆయన ఎందుకు ఆఫీసుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు ఆదుకోకుండా గులాబీ నేతలకు కమిషనర్ డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.    వరద సాయంలో జరిగిన అవతకవకలకు నిరసనగా  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.  వరద బాధితులతో కలిసి రేవంత్‌ నిరసనకు దిగారు.  కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికివెళ్లకుండా వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వరద బాధితుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి.. అందులో 250  కోట్ల రూపాయలు గులాబీ నేతలే ఆరోపించారు.

అన్ని పార్టీలు చుట్టేసిన రాములమ్మ! ఈసారైనా సెటిలయ్యేనా?

22 ఏండ్లు.. ఐదు పార్టీలు.. ఒకసారి ఎంపీ పదవి. ఇవీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండుగా పిలుచుకునే విజయశాంతి అలియాస్ రాములమ్మ రాజకీయ చరిత్రను సూచించే లెక్కలు. సినిమా రంగం నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన విజయశాంతి.. ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేకపోయారు. నాలుగు పార్టీలు మార్చారు. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని కొంత కాలానికి దుకాణం ఎత్తేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటి చైర్మెన్ గా ఉన్న ఆమె,,  త్వరలోనే బీజేపీలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.    1998లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు  విజయశాంతి.  తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్ తో కలిసి పనిచేశారు రాములమ్మ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ తర్వాత గులాబీ పార్టీలో నంబర్2 పొజిషన్ లో విజయశాంతి ఉన్నారనిపించింది.   అయితే కొద్ది రోజులకే  కేసీఆర్ తో ఆమెకు విభేదాలొచ్చాయి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాసైన సందర్భంలో ఆమె టీఆర్ఎస్ ఎంపీగా సభలోనే ఉన్నారు. అయితే కేసీఆర్ తో మాత్రం దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్  లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతిని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ చైర్మెన్ ను చేశారు.             ఫైర్ బ్రాండ్ లేడీగా రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి ఎక్కడా స్థిరంగా ఉండకపోవడంపై విమర్శలకు తావిచ్చింది. ఆవేశపూరిత నిర్ణయాలే ఆమెకు నష్టం కల్గించాయనే భావన వ్యక్తమవుతోంది. ఎల్ కే అద్వాని శిష్యురాలిగా బీజేపీలో చేరిన రాములమ్మకు ఆ పార్టీలో  మంచి గుర్తింపే దక్కింది. అయితే కొంత కాలానికే ఆమె తల్లి తెలంగాణ పేరుతొ సొంత పార్టీ స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే దేవేందర్ గౌడ్ పీఆర్పీ వైపు మొగ్గు చూపడంతో.. విజయశాంతి ఆయనతో విభేదించారు. అనూహ్యంగా తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు.    2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి.. కొంత కాలానికే ఆ పార్టీ నేతలతో విభేదాలొచ్చాయి. ఎంపీగా ఉంటూనే టీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్జేజీలో ఉన్న సమయంలోఎంపీగా ఉన్న విజయశాంతి.. కేసీఆర్ తో మాత్రం గ్యాప్ పెంచుకుంటూనే వచ్చారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కొన్ని ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో  పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2013లో రాములమ్మని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక 2014లో విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు.    కాంగ్రెస్ లోనూ విజయశాంతికి మంచి స్థానమే దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. తర్వాత ప్రచార కమిటి చైర్మెన్ చేశారు. నిజానికి ఎన్నికల ప్రచారంలో తప్ప మిగితా సమయంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరు. కొన్ని సార్లు నెలల తరబడి ఆమె బయటికే రారని ఆరోపణలున్నాయి. అయినా రాములమ్మకు కీలక పోస్టులు కట్టబెట్టింది కాంగ్రెస్. విజయశాంతికి  కాంగ్రెస్ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉండేవంటారు. అందుకే టీపీసీసీ నేతలతో పని లేకుండానే ఆమెకు పార్టీలో కీలక పోస్టులు వచ్చాయంటారు. అయితే ఈ మధ్య రాష్ట్ర పార్టీ సీనియర్లు తనను పట్టించుకోవడం లేదని,  కొన్ని కీలక సమావేశాలకు పిలవలేదనే భావనలో విజయశాంతి ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల  ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు. గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతి.. అదే జిల్లా పరిధిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికను పట్టించుకోకపోవడంతోనే ఆమె పార్టీ మారడం ఖాయమనే సంకేతమిచ్చింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో రాములమ్మ పార్టీ మారకపోవచ్చని భావించారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ తో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.    బీజేపీ నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాములమ్మ.. తిరిగితిరిగి మళ్లీ అదే పార్టీ  చేరబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో చేరి తనదైన ముద్ర వేసి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు బీజేపీలో చేరడం.. అటు ఆ పార్టీకి, ఇటు ఈమెకు కూడా లాభం చేకూర్చే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో ఈసారైనా విజయశాంతి నిలదొక్కుకోగలుగుతుందా లేద మళ్లీ కొన్ని రోజులపై పార్టీ మారుతుందా అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.

సీఎం తేజస్వికి శుభాకాంక్షలు! ఫలితాలు రాకముందే హోరెత్తిన ట్విట్టర్ 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక ముందే.. మహా గట్ బంధన్ ఎన్నికల సారథి, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. బిహార్ లో ఆర్జేడీ కూటమిదే అధికారమని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో.. ఆ కూటమి కార్యకర్తల అనందానికి అంతే లేకుండా పోయింది.  ఇప్పటికే గెలుపుపై ధీమాగా ఉన్న ఆర్జేడీ కార్యకర్తలకు.. ఫలితాలకు ఒక రోజు ముందు తేజస్వి యాదవ్ పుట్టినరోజు కావడం డబుల్ ధమాకాగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్జేడీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.      అయితే తమ యువ నేత తేజస్వి యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సీఎం తేజస్వి అని పోస్టులు చేశారు ఆర్జేడీ కార్యకర్తలు. పాట్నాలోనూ 'ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ భారీగా బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. తేజస్వికి విషెష్ చెప్పేందుకు భారీగా తరలివచ్చిన నేతలు కార్యకర్తలు, అభిమానులు .. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.    ట్విట్టర్ లో తేజస్వి యాదవ్ పేరు మార్మోగుతోంది. ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్‌లో తేజస్వీ పేరు టాప్ లో నిలిచింది.  ఇండియా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగుల్లో తేజస్వీ పేరుతోనే నాలుగు హ్యాష్‌‌ట్యాగ్‌లు నిలిచాయి. ‘‘ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’’ హ్యాష్‌‌ట్యాగ్‌ అందులో టాప్ లో నిలిచింది.  తమ అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ముఖ్యమంత్రి కాబోతున్నారనే నమ్మకంతో  ఆ శుభాకాంక్షలు కూడా ముందుగానే చెప్పేశారు  నెటిజెన్లు.

అక్కడ 33.. ఇక్కడ 32! ఏపీలో మారిన కొత్త జిల్లాల లెక్క?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి దీనిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోయినా ఏపీలో ఏర్పడబోయే జిల్లాలపై  జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది 25 జిల్లాలని.. మరికొందరు 26, 27 వరకు ఉంటాయని చెబుతున్నారు. తాజాగా ఏపీలో 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని మరో ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన మంత్రి తానేటి వనిత కూడా ఇదే విషయం చెప్పారు. కొత్తగా 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికి ప్రస్తుతం 32 జిల్లాలు ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మంత్రి ప్రకటనతో ఏపీలో కొత్తగా మరో 19  జిల్లాలు ఏర్పాటు కావొచ్చని.. వచ్చే ఏడాది జనవరి కల్లా దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.    ఉత్తరాంధ్రలో ప్రస్తుతం మూడు జిల్లాలు ఉండగా పునర్విభజనతో అని ఏడుకు పెరగబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు కొత్తగా పలాస, పార్వతీపురం, అరకు, అనకాపల్లి జిల్లాలు వస్తాయని సమాచారం.  ఇక గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలుగా మారనున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయని చెబుతున్నారు. కృష్ణా జిల్లాను విజయవాడ,మచిలీపట్నం జిల్లాలుగా విభజించనున్నారు.గూంటూరు జిల్లా  నాలుగు  ముక్కలు కానుంది. గుంటూరుతో పాటు అమరావతి, బాపట్ల, నర్సరావుపేట కేంద్రాలుగా కొత్త జిల్లాలు రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఒంగోలు.. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు జిల్లాలు రానున్నాయట.             రాయలసీమ మొత్తం 10 జిల్లాలుగా మారబోతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. చిత్తూరుతో  పాటు ఆధ్యాత్మిక నగరం తిరుపతి , మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు  వస్తాయని  చెబుతున్నారు. ప్రస్తుత అనంతపురం జిల్లా అనంతపురం, హిందూపురం జిల్లాలుగా విభజన కానుందంటున్నారు. ప్రస్తుత కర్నూల్ జిల్లా కర్నూల్, అదోని, నంద్యాల జిల్లాలుగా మూడు ముక్కలు అవుతుందని చెబుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కొత్తగా రాజంపేట జిల్లా వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.    జగన్ సర్కార్ రూపొందిస్తున్న కొత్త జిల్లాల ప్రతిపాదనలు,  అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పునర్విభజన తర్వాత రాయలసీమలో 10 జిల్లాలు ఉండనుండగా.. ఉత్తరాంధ్ర  ఏడు జిల్లాలుగా మారబోతోంది. ఉభయ గోదావరి ఐదు జిల్లాలుగా విభజన కానుండగా.. కోస్తాంధ్ర  10 జిల్లాలుగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కర్నూల్, విశాఖ, చిత్తూరు, తూర్పు గోదావరి మూడు ముక్కలు కానున్నాయి. ఏపీలో పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు నాలుగు జిల్లాలుగా విడిపోనుంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు , కడప, అనంతపురం , పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రెండుగా విడిపోనున్నాయి.    ఆంధ్రప్రదేశ్ 25 జిల్లాలుగా పునర్విభజన జరగనుందని వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న 25 లోక్ సభ నియోజకవర్గాలనే జిల్లాలుగా మారుస్తారని భావించారు. ఆ దిశగానే ప్రభుత్వం నియమించిన జిల్లాల పునర్విభజన కమిటి కూడా కసరత్తు మొదలు పెట్టిందని ప్రచారం జరిగింది. అయితే తమ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చాయి.  మార్కాపురం, గూడూరు, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో  ప్రభుత్వం కూడా మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కనే తాజాగా 32 జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చిందంటున్నారు.    మరోవైపు  32 జిల్లాల ప్రతిపాదనపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా  ఆసక్తికర వాదనలు వస్తున్నాయి. 32 జిల్లాలతో ప్రయోజనం ఉంటుందా అని కొందరు పోస్ట్ చేస్తున్నారు. 32 జిల్లాలు అవసరమంటారా అంటూ మరికొందరు జనాల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న జిల్లాల వల్ల వచ్చే ప్రయోజనాలేంటీ, నష్టాలేంటీ అన్న విషయాలపైనా ఏపీ ప్రజల్లో మంచి చర్చ జరుగుతోంది. తన  ఫ్రెండ్ కేసీఆర్ బాటలోనే జగన్ నడుస్తున్నారని, తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు కావడంతో ఇక్కడ కూడా అలాగే చేయాలని చూస్తున్నారనే సెటైర్లు కొందరు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.

ఎముకలు విరగొచ్చు.. తలలు పగలొచ్చు! బెంగాల్ బీజేపీ చీఫ్ వార్నింగ్ 

పశ్చిమ బెంగాల్లో అధికార తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కత్తులు దూరుతున్నాయి రెండు పార్టీలు. తమ మాటల తూటాలతో కాక రేపుతున్నారు నేతలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుచరులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ.. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.     దీదీ సోదరులకు ఇదే నా హెచ్చరిక. ఎవరైతే వచ్చే ఆరు నెలల్లో సమస్యలు సృష్టిస్తారో వారికి నా వార్నింగ్. వారి కాళ్లూ చేతులు, ఎముకలు విరిగిపోవచ్చు. తలలు పగలొచ్చు. వారు ఆసుపత్రుల్లో చేరవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటున్నారా? శ్మశానానికి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి" అని హల్దియాలో జరిగిన ర్యాలీలో దిలీప్ ఘోష్ హెచ్చరించారు. ఈ వార్నింగులే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.    బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మమతను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ ముఖ్య నేతలు కూడా బెంగాల్ లో పర్యటిస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బెంగాల్ లో పర్యటించారు. ఇక బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో అయితే చాలా కాలంగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. అయితే అమిత్ షా పర్యటించి వెళ్లిన రెండు రోజుల్లోనే దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.    దిలీప్ ఘోష్ హెచ్చరికలపై టీఎంసీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు స్పష్టించేలా బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపై హైకమాండ్ డైరెక్షన్ లోనే రాష్ట్ర నేతలు రెచ్చిపోతున్నారని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఎముకలు విరగొడతాం.. తలలు పగలకొడతామంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినబెంగాల్ బీజేపీ చీఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తృణామూల్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

ట్రంప్ కు మున్సిపల్ అఫీసులో ఉద్యోగం! జెరూసలేమ్ అధికారుల కలకలం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు ఓ రెంజ్ లో పేలుతున్నాయి. ఆయనతో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. ఓడిపోయినా ఆయన ఇంకా అధ్యక్ష భవనం వీడకపోవడంపైనా పంచ్ లు విసురుతున్నారు. తాజాగా డొనాల్డ్  ట్రంప్ ను హేళన చేసే మరో ఘటన జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ కు ఉద్యోగాన్ని ఇస్తున్నట్టు ట్వీట్ పెట్టి కలకలం రేపారు జరూసలేమ్ మునిపల్ అధికారులు.    అధ్యక్షుడిగా ఉద్యోగం పోయినందుకు బాధ పడవద్దని, తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామంటూ ట్రంప్ ను ఉద్దేశించి జెరూసలేమ్ మునిసిపల్ అధికారులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ కావడంతో వెంటనే దాన్ని ఉన్నతాధికారులు తొలగించారు. ఈ పోస్ట్ అనుకోకుండా వచ్చిందని జెరూసలేమ్ మున్సిపల్  అధికార ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.  డొనాల్డ్  ట్రంప్ కు ఉద్యోగం ఇచ్చేందుకు తాము సిద్ధమంటే, తాము సిద్ధమని ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు కూడా ప్రకటిస్తున్నాయి.

తిరుమలలో భక్తుడి కిడ్నాప్‌ కలకలం

తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. అయితే, కుటుంబీకుల సమాచారంతో.. పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమై కిడ్నాపర్లను వెంటనే పట్టుకున్నారు.  నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని ఎస్పీటీ అతిథిగృహానికి చేరుకోగానే.. నలుగురు వ్యక్తులు హనుమంతరావును బలవంతంగా ఓ కారులో ఎక్కించుకుని తిరుపతి వైపు దూసుకుపోయారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కారు నంబరును పోలీసులకు తెలియజేశారు.    పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమై అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద కారును అడ్డుకుని హనుమంతరావును రక్షించి.. కిడ్నా్‌పకు పాల్పడిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శ్రీనివాస్‌, మారుతి, పుట్టపర్తికి చెందిన కుమార్‌, చిత్తూరుజిల్లా చౌడేపల్లెకు చెందిన సురేష్‌ ఉన్నారు. పెనుగొండ కియా ప్లాంట్‌ ఎదుట క్యాటరింగ్‌ బిజినెస్‌ చేసేందుకు శ్రీనివాస్‌ వద్ద నుంచి రూ.20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వక పోవడంతోనే హనుమంతరావును కిడ్నాప్‌ చేసినట్లు దర్యాప్తులో తేలిందని తిరుమల డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.

సీఎంవోలో మూడో పవర్ సెంటర్! యువ నేతల మధ్య వార్? 

ఆ ఇద్దరు యువ నేతలు. ఒకరు మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాలనలో చక్రం తిప్పుతున్నారు. మరొకరు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులుగా ఉంటున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య  ముందు నుంచి సఖ్యత బాగానే ఉండేది. కాని ప్రస్తుతం ఆ ఇద్దరు యువ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇవే కామెంట్స్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.    ఆ ఇద్దరు యువనేతలు ఎవరో కాదు.. ఒకరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాగా... మరొకరు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. కేటీఆర్, సంతోష్‌రావుల మధ్య పంచాయితీ నడుస్తోందంటూ తాజాగా బాంబు పేల్చారు బండి సంజయ్. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సంజయ్ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో గుబులు రేపుతుండగా.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇందులు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.    సీఎంవోలో మూడో పవర్ సెంటర్ గా ఎంపీ సంతోష్ కుమార్ మారిపోయారనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. సీఎంవోలో సీఎం కేసీఆర్ కు మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ నర్సింగ్ రావులు కీలకంగా ఉన్నారు. వారితో పాటు మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. వారంతా సీఎం సెంటర్ గా పనిచేస్తారని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ కూ సీఎంవోతో పాటు ఉన్నతాధికారుల్లో సెపరేట్ టీమ్ ఉందని తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ లు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్ లు కేటీఆర్ సెంటర్ లో ముఖ్యలని చెబుతారు. అయితే కొన్నిరోజులుగా ఎంపీ సంతోష్ కు మద్దతుగా మరో వర్గం తయారైందనే ప్రచారం జరుగుతోంది. సీఎంవోతో పాటు సచివాలయంలోనూ సంతోష్ కోటరి బలంగా ఉందని కొందరు టీఆర్ఎస్ నేతలే అఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.    నిజానికి గతంలో సీఎం కేసీఆర్ పర్యటనలు, ఆయన వ్యక్తిగత నిర్ణయాల వరకే సంతోష్ కుమార్ చూసేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఉండేవారు. అయితే రాజ్యసభకు పంపించాక ఆయనలో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు కేసీఆర్ కార్యక్రమాలు చూడటంతో పాటు పార్టీ, ప్రభుత్వ  పాలనా వ్యవహరాల్లోనూ సంతోష్ కుమార్ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. గతంలో ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగులు, ప్రమోషన్ల కోసం కేటీఆర్ ను కలిసివారు.. ఇప్పుడు సంతోష్ తో కూడా తమ పని జరుగుతుందని వారు చెబుతున్నారట. అందుకే ఎప్పడూ బిజీగా ఉండే కేటీఆర్ కంటే సంతోష్ తో పని చేయించుకోవడమే బెటరనే అభిప్రాయం అధికారుల్లో ఉందంటున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా సంతోష్ ను పవర్ సెంటర్ గా చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, బదిలీల కోసం కేటీఆర్ తో పాటు సంతోష్ కు కలుస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది.   గతంలో సినీ, రాజకీయ ప్రముఖులంతా మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరిగేవారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, సర్కార్ నుంచి రాయితీలు అడగాలన్నా అందరూ కేటీఆర్ దగ్గరకే వచ్చేవారు. కాని ఇప్పుడు కొందరు వ్యాపార, సినీ ప్రముఖులు ఎంపీ సంతోష్ ను  ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా ఆయనకు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ, వ్యాపర దిగ్గజాలతో సంతోష్ కు పరిచయాలు పెరిగాయని, దీంతో ఆయన ఇమేజీ కూడా పెరిగిందనే చర్చ జరుగుతోంది. మీడియాను కూడా సంతోష్ మ్యానేజ్ చేస్తున్నారని, అందుకే ఆయన కార్యక్రమాలకు మంచి కవరేజ్ లభిస్తుందని చెబుతున్నారు.    మొత్తంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవల కాలంలో తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు పార్టీ, ప్రభుత్వ వ్యవహరాల్లో కీలకంగా మారారని కేటీఆర్ టీమ్ కూడా గుర్తించిందని అంటున్నారు.  సంతోష్ రావు తీరుపై కేటీఆర్ వర్గం గుర్రుగా ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు బలాన్నిచ్చేలా బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీని కలవర పరుస్తుందంటున్నారు. మొత్తానికి కేటీఆర్, సంతోష్ మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం ఆధిపత్య పోరు సాగుతుందనే సంజయ్ కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లోనూ, కారు పార్టీల్లోనూ కాక రేపుతున్నాయని చెబుతున్నారు.

10 వేలు తీసుకున్నవారే ధర్నాలో కూర్చున్నారు! విపక్షాలది బురద రాజకీయమన్న కేటీఆర్ 

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు అడగకముందే వరద సాయం కోసం 550 కోట్ల రూపాయలను ప్రకటించామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటివరకు 4 లక్షల 30 వేల కుటుంబాలకు 10 వేల రూపాయల సాయం అందించామని తెలిపారు. 3 లక్షల 80 వేల కుటుంబాలు GHMC పరిధిలో, 12 వేల కుటుంబాలు కంటోన్మెంట్ పరిధిలో, 40 వేల సిటీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు అందించామన్నారు. 920 అధికారిక బృందాల ద్వారా ఒకేరోజు లక్ష మందికి డబ్బులు ఇచ్చామన్నారు కేటీఆర్.    10 వేల సాయం పొందిన ప్రతీ ఒక్కరి వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. సిటీ లో ఇంకా కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని ప్రకటించారు. మిగిలిన వారికి కూడా పదివేల సాయం ఇవ్వాలని సీఎం చెప్పారని తెలిపారు. 10 వేల రూపాయలు తీసుకున్న వారే కొందరు ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలో కూర్చుంటున్నారని కేటీఆర్ చెప్పారు. ఇంకొక వంద కోట్లు ప్రకటించమని సీఎంని కోరి అయినా అర్హులందరికీ వరద సాయం అందేలా చూస్తామని కేటీఆర్ ప్రకటించారు.    వరదల వల్ల 8,868 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి  స్పందన లేదన్నారు కేటీఆర్. గతంలో కర్ణాటక, గుజరాత్ లో వరదలు వచ్చినపుడు తక్షణమే కేంద్రం నిధులు పంపించిందని తెలిపారు. ఆరేండ్లలో తెలంగాణ నుండి 2 లక్షల 72 వేల కోట్లు పన్నులు కేంద్రానికి కడితే 1లక్షా నలభై వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేదని కేటీఆర్ విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ కి డిపాజిట్ రాదన్నారు మున్సిపల్ శాఖ మంత్రి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కబ్జాలను అరికడితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టం పై అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు కేటీఆర్.    1908, 1916 తర్వాత ఈసారి హైదరాబాద్ లో అతిపెద్ద వర్షపాతం నమోదైందన్నారు కేటీఆర్. 120 సెంటిమీటర్ల వర్షం కురిసిందన్నారు. ఒకేసారి కుంభవృష్టి లాగా అసాధారణ వర్షం కురవడం వల్లే వరద తీవ్ర ప్రభావం చూపిందన్నారు. నాళాలు కబ్జా చేయడం, చెరువులు కబ్జాల వల్ల వందలాది కాలనీలు మునిగాయన్నారు. ఏ సిటీ లో లేని విధంగా హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరు వరదల సమయంలో జనాల దగ్గరికి వెళ్లి కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు.

ఉద్యోగ సంఘ నేతలూ.. నెత్తురు ఉడకటం లేదా?

జీతాలు,పెన్షన్లు ఆపినా గొంతు పెగలదేం   నేతలపై ఉద్యోగుల ఉగ్రరూపం   జగనన్న సర్కారుకు శ్రమదానం చేస్తున్న ఉద్యోగ సంఘాల పాతివ్రత్యానికి, ఇప్పుడు పెద్ద పరీక్ష వచ్చి పడింది. ఒక్క డీఏను విడతల పద్ధతిలో ఇచ్చినందుకే, జగనన్న సర్కారుకు శతకోటిదండాలు పెట్టి, అపార భక్తిప్రపత్తులు చాటిన ఉద్యోగ సంఘాల నేతలు.. 40 శాతం మందికి ఇంకా వేతనాలు, పెన్షన్లు ఇవ్వని సర్కారు వైఫల్యంపై ఏమంటారు? 60 శాతం మంది పొందిన ప్రయోజనాలను, మిగిలిన 40 శాతం మందికి ఇప్పించడంలో నేతలు ఎందుకు విఫలమయ్యారు? ఈన్యాయంపై గొంతెత్తేందుకు, చొక్కా-లాగూలు తడిసిపోతున్నాయా? గత పాలకుల ముందు రెచ్చిపోయిన మీ పౌరుషం, ఏ కృష్ణానదిలో కలిసింది?.. ఇవీ.. ఇప్పటివరకూ పెన్షన్లు, జీతాలు అందని 40 శాతం మంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘ ‘పెద్దారెడ్ల’పై ప్రదర్శిస్తున్న ఉగ్రరూపం.   ఏపీలో ఆర్ధికపరిస్థితి అధ్వానస్థితికి చేరింది. 40 శాతం మందికి ఇంకా పెన్షన్లు, వేతనాలు, డీఏ చెల్లింపులు అందకపోవడమే, దానికి నిలువెత్తు నిదర్శనం. పథకాలతో ప్రజలకు డబ్బులు పప్పుబెల్లాల్లా పంచేస్తున్న జగనన్న సర్కారుకు.. తమకు జీతాలు, పెన్షన్లు, డిఏ బకాయిలు ఇచ్చేందుకు మాత్రం, చేతులు రాకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. దీనికంతటికీ తమ నాయకుల, పరాథీన త-లొంగుబాటే కారణమని ఉద్యోగులు చెబుతున్నారు.   తమ ‘పెద్దారెడ్లు’ పూర్తి సమయాన్ని.. సర్కారు సేవలో తరించేందుకే వెచ్చిస్తున్నందున, తమ గురించి ఆలోచించే సమయం లేకుండా పోయిందని,  వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, గత 17 నెలల క్రితం వరకూ.. ఉద్యోగ సంఘాల నేతలంటే, పాలకులకు భయం ఉండే భయం, ఇప్పుడు లేదంటున్నారు. దానికి కారణం.. తమ నేతల అసమర్థత- వైఫల్యం-‘సామాజిక’సంకటమేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి వారికే చెమటలు పట్టించి, సెక్రటేరియట్ వద్ద పడుకునేలా చేసిన ఘనత, నాటి ఉద్యోగులదని గుర్తు చేస్తున్నారు.   గతంలో ఏ సీఎం అయినా.. ఉద్యోగ సంఘ నేతలకు ఎప్పుడంటే అప్పుడు, అపాయింట్‌మెంట్ ఇచ్చిన గత పూర్వవైభవాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఇప్పుడు నేతలే సీఎంను కలిసేందుకు వణికిపోతున్నారు. సీఎం కూడా వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా, కిందివారితో మాట్లాడిస్తున్నారని చెబుతున్నారు. తమ డిఏలు ఆగినా, జీతాలు-పెన్షన్లు నిలిపివేసి, కోతలు విధించినా.. ఇదేం అన్యాయమని ప్రశ్నించే దమ్ము, ఒక్క నాయకుడికీ లేకుండా పోవడం తమ దౌర్భాగ్యమంటున్నారు. ఎమ్మెల్యేలు-ఎంపీలంటే.. మళ్లీ టికెట్లు వస్తాయో, రావోనన్న భయంతో పాలకపార్టీని ప్రశ్నించకుండా మౌనంగా ఉంటారు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, ప్రశ్నించే ధైర్యం చేయరు. కానీ ఉద్యోగులకు ఆ భయం అవసరం లేదు. పార్టీలు-ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, 30 ఏళ్లు సర్వీసులో ఉంటారు. మరి అలాంటి ఉద్యోగులు-వారికి నాయకత్వం వహిస్తున్న నేతలూ, పాలకులకు ఎందుకు భయపడుతున్నారన్నది ప్రశ్న.   సచివాలయ ఉద్యోగుల పరిస్థితి, మరీ దారుణంగా ఉందంటున్నారు. ఉద్యోగ సంఘ నేతలు తమ మెహర్బానీ కోసం, తమ ప్రయోజనాలను పాలకుల వద్ద.. పణంగా పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పెద్దారెడ్లు’... మీ ఉద్యోగుల మనోవేదన మీకు అర్ధమవుతోందా? -మార్తి సుబ్రహ్మణ్యం

స్వరూపానందులకు.. సేవానందలహరి!

టీటీడీ అధికారుల సేవ చూడతరమా?   ఆయన జగద్గురువే కాదు. ‘జగన్గు’రువు కూడా. ఆ రెండేకాదు. లోకరక్షకుడు. అంతకంటే ముందు విశాఖ రక్షకుడు కూడా! ఆ స్వామివారు అక్కడ నడయాడుతున్నందుకే, విశాఖ శత్రుదుర్భేద్యంగా మారింది. నేను ఉన్నాను-నేను విన్నాను అని జగనన్న మాదిరిగా చెప్పకపోయినా.. ఆయన ఉన్నారన్న భరోసాతోనే అక్కడ నౌకాదళం ఏర్పాటుచేశారన్నది ఓ ప్రతీతి. స్వామివారు విశాఖలో లేకపోతే ఎగసిపడే సాగర కెరటాలు, ఆయన వచ్చాకనే శాంతిస్తాయన్నది ఓ నానుడి. ఆయన దగ్గరికి సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. సాధారణ రేషన్‌డీలర్ల సంఘం నాయకులు కూడా వచ్చి, తమ ఈతిబాధలు వెళ్లబోసుకుంటారు. అంత ‘పవర్’ఫుల్ స్వామి ఆయన!   ఆ స్వాములోరే స్వయంగా.. క్రైస్తవుడిగా ఉన్న జగన్‌బాబును, గంగలో మూడు మునకలేయించి, ‘కరుడుగట్టిన హిందూవాది’గా మార్చారని, మన నందమూరి లక్ష్మీపార్వతమ్మ తాదాత్మ్యంతో ధృవీకరించారు. అలాంటి ‘అభినవ ఆదిశంకరాచార్య’కరుణా కటాక్షాలు, కఠోర తపస్సుతోనే మన జగనన్న..   దేశం మెచ్చిన నలుగురు ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరు కాగలిగారు. అంటే స్వామివారు ఒక ఉత్తమ ముఖ్యమంత్రిని దేశానికి అందించారన్నమాట!   ఆ తపస్వి- రాజర్షి-మహర్షుల వారి చల్లని చూపులు ప్రసరిస్తున్నందుకే.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి, అన్ని రంగాల్లో పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడే స్థాయిలో, పరుగులు తీస్తోంది. మరి అలాంటి భగవంతుడి అవతారమయిన స్వామివారు.. ఎయిర్‌పోర్టుకు వస్తే, టీటీడీ అధికారులు ఆయనకు ఎదురేగి స్వాగత సత్కారాలివ్వడం కూడా తప్పేనా? కలికాలం కాకపోతే.. అసలు అది కూడా ఒక వార్తనా? ఇవీ.. నడిచే దేవుడయిన, విశాఖ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి భక్తకోటి.. ఆవేదన-ఆర్తి-ఆగ్రహం కలగలిపి కారుస్తూ, సంధిస్తున్న ‘భక్తకన్నీటి’ప్రశ్నలు.   లేటెస్టుగా విశాఖ స్వాములోరు, తిరుమల దర్శనానికి వెళ్లారు. సరే.. ఆ పిచ్చికాలంలో అంటే శంకరాచార్యుల వారంటే.. ఫ్లెక్సీ స్వాగతాలు, పేపర్ యాడ్స్, పోలీసు కాన్వాయ్, వీవీఐపీలు పక్కన లేకుండానే దేశమంతా పాదయాత్ర చేశారు. మరి ఇప్పుడూ అలాగే చేయాలంటే ఎలా? ఎంచక్కా విమానాలు, బెంజికార్లు ఉన్న ఈ కాలంలో కూడా.. పాతకాలపు శంకరాచార్యుల మాదిరి నడిస్తే, పెద్ద ఇమేజ్-మీడియా కవరేజీ ఏముంటుంది? అందుకే విశాఖ స్వాములోరు, సరదాగా విమానంలో వచ్చారు. దానిపై కూడా విమర్శలు! హేమిటో? హెందుకో అర్ధం కాదు.   మరి అంతలావు సర్కారీ స్వాములోరు ఎయిర్‌పోర్టుకు వస్తే, ఆయనకు బాజా భజంత్రీలతో కాకపోయినా, కనీసం శాలువ-జగనన్నమాల.. సారీ..  గజమాలతో వెళ్లయినా స్వాగతించాలి కదా? మన టీటీడీ చైర్మన్ సహిత అధికారులు, ఎయిర్‌పోర్టుకు ఎదురేగి.. అలాగే స్వామివారిని స్వాగతించారు. ఒక రాజర్షికి చేసిన ఈ సాదాసీదా సన్మానం-గౌరవానికే సోషల్ మీడియా, గిట్టని రాజకీయ పార్టీలు గావుకేకలు పెట్టి.. గాయిగత్తర చేయడం స్వామివారి,  అనంతకోటి భక్తులకు సుతరామూ నచ్చడం లేదట. వారి సున్నిత హృదయాలు గాయపడ్డాయట.   అసలు స్వామివారి మహత్తు- త్యాగం ముందు.. ఈ గజమాల సన్మానాలు ఏ మూలకు పనికివస్తాయన్నది వారి ప్రశ్న. మరి స్వామి వారు తిరుమలకు వెళ్లినప్పుడు, శ్రీ వేంకటేశ్వరుడు కొండ దిగి, ఆయనకు స్వాగతం పలికే వీలు లేదు కదా? ఇప్పటికయితే వారికి ఆ ప్రొటోకాల్ ఇంకా కల్పించలేదు. కాబట్టి, ఆ ప్రకారం.. శ్రీవారి ప్రతినిధులుగా టీటీడీ అధికారులు, చైర్మన్ వస్తే తప్పేంటి? ఆయనకేమీ మణులు మాణిక్యాలు ఇవ్వలేదు కదా? జస్ట్. ఎయిర్‌పోర్టుకు వెళితే తప్పేంటన్నది స్వామివారి భక్తుల ప్రశ్న. అవును మరి. వారి వేదనా వినదగ్గదే!   నిజమే.. నిజానికి స్వామి వారు వచ్చినప్పుడు శ్రీవారే స్వయంగా వచ్చి స్వాగతించాలి. అలాంటి ప్రొటోకాల్ పాటించటం.. ఈ యుగంలో విగ్రహరూపంలో ఉన్న, ఆ యుగం శ్రీవారికి తెలియదు. కాబట్టే తన ప్రతినిధులుగా అధికారులను పంపారని సరిపెట్టుకోక, ఈ యాగీ ఏమిటి? అందుకే కదా గతంలో కూడా,  రాజర్షుల వారిని మూలవర్లకు అలంకరించే ఆకుతో చేసిన రామచిలకను, తిరుమల నుంచి అలిపిరికి తెచ్చిన.. ‘ధర్మాత్ముడైన ధర్మాధికారి’, మన  ధర్మారెడ్డిని భక్తులు తెగ మెచ్చుకుంది? గోశాలను-అందులోని గోవుల జన్మను, ధన్యం చేసేందుకు వచ్చిన మహర్షుల వారిని.. డాలర్‌శేషాద్రి వంటి సంఘసేవక స్వామి సహా, అధికారులు వచ్చి, మేళతాళాలు-బాజా భజంత్రీలతో స్వాగతించి, భక్తుల మెప్పు పొందింది కూడా అందుకే కదా?    ఇవన్నీ తెలియని పిచ్చి వాళ్లు, మతిలేని గతితప్పిన వాళ్లంతా.. స్వామివారిని ఆడిపోసుకోవడం మహాపచారమే కదా? అయినా మన పిచ్చి గానీ.. ‘పైవాడి’ ఆజ్ఞలేకపోతే.. స్వామి వారికి ఇంత భోగం పడుతుందా చెప్పండి? ఆ ‘పైవాడి’ ఆజ్ఞలేక, ఆగ్రహంతోనే కదా.. తమిళనాడులో కంచిస్వామివారు చెరసాలపాలయింది! హేమిటో.. ఈ జనం హెప్పుడు మారతారో హేమో?! -మార్తి సుబ్రహ్మణ్యం

నిందితుల వరుస ఆత్మహత్యలు! కీసర లంచం కేసులో అసలేం జరుగుతోంది?

తెలంగాణలో సంచలనం స్పష్టించిన కీసర మాజీ తహసీల్దార్​ నాగరాజు లంచం డిమాండ్ కేసులో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కోటి పది లక్షల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి.. కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్‌ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు ధర్మారెడ్డి. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు.   కోటి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు... గత నెల 14న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ధర్మారెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుసగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.    దాదాపు 40 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు తీసుకున్నట్లు ధర్మారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సెప్టెంబరు 29న ధర్మారెడ్డితో పాటు ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. కీసర మండలం రాంపల్లిలో వేర్వేరు సర్వేనెంబర్లలో 24.16 ఎకరాల భూమికి సంబంధించి నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విలెన్స్‌ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో ఏసీబీ మరో కేసును నమోదు చేసింది. ఆ భూముల ఫైళ్లు ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేసి, పాసు పుస్తకాలు జారీ చేశాడని ఆరోపణలు వచ్చాయి. దానిని విజిలెన్స్ అధికారులకు నివేదించారు.                       నకిలీ పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ధర్మారెడ్డితో తహశీల్దార్ నాగరాజు ఒప్పందం చేసుకున్నారని ఏసీబీ గుర్తించింది. కందడి లక్ష్మమ్మ, కందడి బుచ్చిరెడ్డి, కందడి మణెమ్మ, స్థానిక రైతు కందడి ధర్మారెడ్డికి నాగరాజు పాసుపుస్తకాలు ఇచ్చాడు. లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అంజిరెడ్డికి ధర్మారెడ్డి సమీప బంధువు. నలుగురికి పాసుపుస్తకాలిచ్చిన భూమి మొత్తం 24.16 ఎకరాలు అని తెలుస్తోంది. దీని విలువ 2.68 కోట్లుగా ఉంటుందని గుర్తించారు. మార్కెట్‌ విలువ ప్రకారం ఆ భూమి మొత్తం విలువ రూ.48.80 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు

ఎన్నికల విధులలో ఉన్న అధికారులకు, పోలీసు అధికారుల మధ్య పరస్పర అవగాహన, సమాచార మార్పిడి, సహకారం ఉన్నప్పుడే ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులు నాలుగు జిల్లాల్లో ఉన్నాయని, జిహెచ్ఎంసీలో 6 జోన్లు, 30 సర్కిల్స్ ఉన్నాయని, దాదాపు 74 లక్షల ఓటర్లు ఉంటారని, 8000 పైచిలుకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. పోలీస్ అధికారుల ముఖ్యమైన విధులు శాంతిభద్రతలు కాపాడుతూ స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం అన్నారు. ఎన్నికల సమయంలో లైసెన్స్ లేని ఆయుధాలు సీజ్ చేయాలని, లైసెన్స్ ఆయుధాలు కలిగినవారు తమ ఆయుధాలు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సంబంధిత పోలిస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని, బీట్ పెట్రోలింగ్ పెంచాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని చట్టప్రకారం శిక్షించాలని అన్నారు. రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన రోజు నుండి మున్సిపల్ సర్కిల్ లలో పరిస్థితులను బట్టి తగినన్ని స్టాటిక్ సర్వేలేన్స్ టీములు, ఫ్లైయింగ్  స్క్వాడ్ లు, చెక్ పోస్టులు, పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ప్లాన్ తయారు చేయాలని, సమస్యలు సృష్టించే అరాచక శక్తులపై 24 గంటలు నిఘా పెట్టాలని, ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించాలని, రౌడీ మూకలు చెలరేగకుండా చూడాలన్నారు. మోడల్ కోడ్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, వాహనాలు, లౌడ్ స్పీకర్ల వాడకం, పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయడం, లిక్కర్ షాపులు మూసివేయడం వంటి సూచనలు విధిగా అమలయ్యేలా చూడాలన్నారు.  ఎన్నికల ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి ఒక మెకానిజం తయారు చేసుకొని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ సెంటర్లవద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ రోజున అల్లరి మూకలను అదుపు చేయడానికి తగినన్ని స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, ఎప్పటికప్పుడు సానిటైజర్తో చేతులు శుభ్రపరుచుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో పొలీస్ అధికారులతో సమన్వయ పరచుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని నోడల్ ఆఫీసర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసి అన్ని రకాల  సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారులు సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో సంప్రదించి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని, ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుతూ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సజావుగా జరుగునట్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ. సజ్జనార్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, అడిషనల్ డిజీపి (శాంతి భద్రతలు) జితేంద్ర, సూపరింటె౦డెంట్ ఆఫ్ పోలీస్, సంగారెడ్డి, ఇతర పోలిస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మహాకూటమిదే బీహార్? ఎగ్జిట్ పోల్స్ లో లీడ్

హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మహా ఘట్ బంధన్ కూటమికే ఆధిక్యం కనిపిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమికి 100 నుంచి 115... బీజేపీ, అధికార జేడీయూలతో కూడిన ఎన్డీయే కూటమికి 90 నుంచి 110 స్థానాలు... ఎల్జేపీకి 3 నుంచి 5 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.  టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వేలో ఎంజీబీ కూటమికి 120... ఎన్డీయే కూటమికి 116, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు దక్కుతాయని తేలింది.   ఎంజీబీ కూటమికి 108 నుంచి 131 స్థానాలు, ఎన్డీయేకి 104 నుంచి 128 స్థానాలు లభిస్తాయని ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ప్రకటించింది. రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వేలో... ఎంజీబీ కూటమికి 118 నుంచి 138 స్థానాలు, ఎన్డీయే కూటమికి 91 నుంచి 117 స్థానాలు, ఎల్జేపీకి 5 నుంచి 8 స్థానాలు, ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలుస్తారని అంచనా వేశారు. అయితే అన్ని సర్వేల్లోనూ రెండు కూటముల మధ్య తేడా మాత్రం చాలా స్వలంగానే ఉంది. దీంతో ఫలితాల్లో ఏదైనా జరగవచ్చని భావిస్తున్నారు. మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 60 శాతం వరకు పోలింగ్ జరిగింది.

ఆమెకు ఛాన్స్ ఇస్తే.. అసెంబ్లీ, సెక్రటేరియట్ ను కూడా పేకాట క్లబ్ గా మార్చేస్తుంది: అనిత 

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఒకప్పటి ఆమె అనుచరుడు, ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ తాజాగా చేస్తున్న ఆరోపణల పై తీవ్ర దుమారం రేగుతోంది. ఊరికి దూరంగా ఉండే తోటలలో పేకాట క్లబ్ నడిపే విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి... సందీప్ సలహా కోరుతున్నట్టుగా తాజాగా ఒక ఆడియో బయటపడింది. దీనిపై టీడీపీ పార్టీకి చెందిన తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేసారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా పేకాట క్లబ్బులు నిర్వహించడం వైసీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆమె అన్నారు.   ఇప్పటికే రాష్ట్రంలో ఊరూ, వాడా పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసి ప్రజలను గుల్ల చేస్తున్నారని, అసలు అవకాశం రావాలే గానీ ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ లలో కూడా పేకాట ఆడించేందుకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రెడీగా ఉన్నారని ఆమె విమర్శించారు. తనను ఎన్నుకున్న తాడికొండ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పేకాట క్లబ్ లపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేయాలని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు. పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న శ్రీదేవి ఎమ్మెల్యేగా పూర్తిగా అనర్హురాలు అని ఆమె స్పష్టం చేశారు.   ఏపీ సర్కారు వెంటనే స్పందించి తాజాగా మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్ పై విచారణ జరిపించాలని అనిత డిమాండ్ చేసారు. పేకాట క్లబ్బులు నిర్వహిద్దామని స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పడంపై సీఎం జగన్ స్పందించాలని అనిత కోరారు. లేటెస్ట్ గా వాటాల పంపిణీలో విభేదాలు రావడంతోనే తనకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యే శ్రీదేవి నాటకాలు ఆడుతున్నారని అనిత ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని ఏకంగా జూదాంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కామాఖ్యదేవికి మూడు బంగారు కలశాలు.. 20 కిలోలు విరాళమిచ్చిన అంబానీ దంపతులు 

అసోంలోని నీలాచల కొండల్లో కొలువైన కామాఖ్య దేవి ఆలయానికి 20కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు ముకేష్ అంబానీ దంపతులు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవికి బంగారం విరాళం ఇస్తామని మూడు నెలల కిందే అంబానీ దంపతులు ప్రకటించారు. ఆలయ వర్గాలకు సమాచారం అందించారు. మూడు కలశాల బంగారు తాపడం ఖర్చులు తాము భరిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున బంగారం అందించగా, ఆలయ కలశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.   కలశాల నిర్మాణ పనుల్లో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేశ్ అంబానీ, ఆయన అర్ధాంగి నీతా అంబానీ అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. దేశంలోని శక్తిపీఠాల్లో ప్రముఖమైన  కామాఖ్య ఆలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

అర్ధరాత్రి నోటీసులు, అరెస్టులు, కూల్చివేతలు! వేధింపులే లక్ష్యమన్న చంద్రబాబు 

అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి జీవీఎంసీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై ఈ రకంగా స్పందించడం వెనుక వేధింపు లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. కక్ష పూరిత చర్యల్లో భాగంగానే అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు అంటిస్తున్నారని టీడీపీ అధినేత  ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాంగాన్ని, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు చంద్రబాబు.     అధికారంలో ఉన్నవాళ్లు ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలు ఆలోచిస్తారు, ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని కూడా ఉత్తేజపరుస్తారు... కానీ వైసీపీ పాలకుల తీరు వేరని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కక్ష ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనతో  వైసీపీ రాత్రుళ్ళు నిద్రకూడా పోతున్నట్టు లేదని ఆయన ఎద్దేవా చేశారు.  సబ్బం హరి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించిందని, కానీ అంతలోనే భవనాలు తొలగించాలంటూ ప్రభుత్వం మరో నోటీసును పంపించిందంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఆ నోటీసును కూడా రాత్రివేళ ఇంటికి అంటించిపోయారని ఆరోపించారు.    సబ్బం హరికి జీవీఎంసీ అధికారులు గురువారం రాత్రి నోటీసులు జారీచేశారు. రిజర్వు ఓపెన్‌ స్పేస్‌లో భవనాలను నిర్మించారని, 3 రోజుల్లో వాటిని తొలగించాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు  టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది హరి ఇంటికి వెళ్లగా ఆయన లేరు. ఆ నోటీసును తీసుకునేందుకు వాచ్‌మన్‌ నిరాకరించడంతో గోడకు అతికించి వెళ్లిపోయారు. జీవీఎంసీకి అందించిన స్కీమ్‌ ప్లాన్‌ ప్రకారం సుమారు 2,200 గజాల స్థలాన్ని రిజర్వు ఓపెన్‌ స్పేస్‌గా మార్క్‌ చేశారు. ప్రస్తుతం అందులో కొంతభాగంలో సబ్బం హరికి చెందిన రెండు భవనాలు, గురవారెడ్డి, చిరంజీవిరెడ్డి, రాధాకృష్ణ అనే వ్యక్తులకు చెందిన భవనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పార్కు స్థలంలో సుమారు వంద గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ జీవీఎంసీ సిబ్బంది  నెల రోజుల కిందట తెల్లవారుజామున వాచ్‌మన్‌ గది బాత్‌రూమ్‌ను కూలగొట్టారు.                     మరోవైపు విశాఖలో ఉన్న తన స్థలంలోని నిర్మాణాల తదుపరి కూల్చివేతలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ మాజీ ఎంపీ సబ్బం హరి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఆయన దాఖలు చేసుకున్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై సోమవారం వరకు స్టేట్‌సకో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ బీజేపీలో వర్గపోరు ముదురుతోందా?

తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోందా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలుగా నేతలు విడిపోయారా? పార్టీ నేతల వలసల వెనక ఆయన హస్తం ఉందా?. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీ కేడర్ తో పాటు ప్రజల్లో వస్తున్న సందేహాలివి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీకి నాయకుల మధ్య వర్గపోరు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య వర్గ పోరు జరుగుతోందని సమాచారం. పార్టీ నేతలు కూడా ఇరు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు. నేతల మద్య వర్గపోరు ఉందనడానికి బలాన్నిచ్చేలా ఆ పార్టీలో వరుస ఘటనలు జరుగుతున్నాయి.    ఇటీవల కిషన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డికి టీఆర్ఎస్ నేత‌ల‌తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సిద్ధిపేట ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రిగా క‌లెక్ట‌ర్, సీపీని పిలిపించి మాట్లాడే అధికారం కిష‌న్ రెడ్డికి ఉన్నా ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. అయితే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా బీజేపీ నేతలెవరు స్పందించలేదు. నిజానికి కేంద్రమంత్రిని టార్గెట్ చేశారు కాబట్టి పార్టీ అధ్యక్షుడైన సంజయే ఖండించాలి. కాని బండి ఆ పని చేయలేదు. అంతేకాదు ఇతర నేతలు కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేదు. ఈ ఘటనతో బీజేపీలో కిషన్ రెడ్డికి, సంజయ్ వర్గాల మధ్య వార్ జరుగుతుందన్నది తెలుస్తోంది.    దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సిద్దిపేట పోలీసులు తనపై దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అయినా కేంద్రమంత్రిగా ఉన్నకిషన్ రెడ్డి ఆ ఘటనపై సీరియస్ గా స్పందించలేదని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కేంద్రమంత్రి హాోదాలో ఆయన జిల్లా కలెక్టర్, సీపీని పిలుపించుకుని మాట్లాడొచ్చు. కాని కిషన్ రెడ్డి మాత్రం దుబ్బాక వెళ్లి రఘునందన్ రావుతో మాట్లాడి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వచ్చేశారు. ఇది కూడా  ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే దానికి బలాన్నిస్తోంది. రఘునందన్ రావుది సంజయ్ టీమ్ వర్గంగా చెబుతారు, అందుకే దుబ్బాక ఉప ఎన్నికను కిషన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతున్నా కిషన్ రెడ్డి ఎక్కువగా ప్రచారం చేయకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది.    బండి సంజయ్ కమిటిలో కిషన్ రెడ్డి వర్గీయులను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్నిజిల్లాల్లోనూ కిషన్ రెడ్డికి అనుచరులుగా  ఉన్నవారిని పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి .. టీవీ చర్చల్లో పార్టీ వాయిస్ ఘనంగా వినిపించే జూబ్లీహిల్స్ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డికి సంజయ్ టీమ్ లో చోటు దక్కకపోవడం అందరిని అశ్చర్యపరిచింది. కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నందువల్లే శ్రీధర్ రెడ్డిని తీసుకోలేదని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారని తెలుస్తోంది. శ్రీధర్ రెడ్డి తరహాలోనే చాలా మంది కిషన్ రెడ్డి అనుచరులకు బండి సంజయ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని పా్టీలో చర్చ జరుగుతోంది.    పార్టీలో తన మనుషులను నిర్లక్ష్యం చేయడంపై కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ తనకు తెలియకుండానే సంజయ్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. సంజయ్ తీరుతో అసహనంగా ఉన్న కిషన్ రెడ్డి... కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదని చెబుతున్నారు.ఈ కారణంగానే బండి సంజయ్ పై సిద్దిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపణలు వచ్చినా.. కిషన్ రెడ్డి అంతగా స్పందించలేదని చెబుతున్నారు. కరీంనగర్ లో సంజయ్ ధీక్ష చేస్తున్నా.. షుగర్ లెవల్స్ పడిపోయి ఆస్పత్రిలో చేరినా కేంద్రమంత్రి అక్కడి వెళ్లలేదనే చర్చ జరుగుతోంది.   కిషన్ రెడ్డిపై కూడా తీవ్ర  ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్ వర్గ నేతలు.  సంజయ్ కు చెక్ పెట్టేందుకు కిషన్ రెడ్డి మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర సమస్యలపై బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే.. ఢిల్లీనుంచి వీడియో కాన్పరెన్స్ లో కిషన్ రెడ్డి అవే అంశాలపై మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల్లో సంజయ్ కు  గ్రాఫ్  పెరగకుండా ఉండేందుకే కిషన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి ఎందుకు ఎక్కువగా ప్రచారం చేయలేదో చెప్పాల్సి ఉందన్నారు, రఘునందన్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన పార్టీ నేత కమలాకర్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి అనుచరుడేనని చెబుతున్నారు . కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీకి సవాల్ గా మారిన ఉప ఎన్నిక సమయంలో తమ అనుచరుడిని కంట్రోల్ చేయలేకపోయారా అని సంజయ్ వర్గ నేతలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జూబ్లీహిల్స్   పార్టీ ఇంచార్జ్ గా ఉన్న  శ్రీధర్ రెడ్డి కిషన్ రెడ్డి డైరెక్షన్ లోనే గులాబీ గూటికి చేరారని  చెబుతున్నారు బండి సంజయ్ వర్గీయులు.    బీజేపీలో మరో వివాదం కూడా ముదురుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా  ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే బండి సంజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి గత ఏడాది కాలంలో చాలా మంది నేతలు బీజేపీలో చేరారు. ఇప్పుడు పార్టీలో వారి హవానే నడుస్తుందన్నది పాత నేతల ఆరోపణ. వరంగల్ జిల్లాలో ఎంపీ గరికపాటి మోహన్ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిని బండి ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోత్కుపల్లి హవా సాగుతుందంటున్నారు. కరీంనగర్ జిల్లాలో మాజీ ఎంపీ వివేక్, సోమారపు సత్యనారాయణ పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అంతా ఎంపీ ధర్మపురి  అర్వింద్ చెప్పినట్లు నడుస్తుండగా.. పాలమూరు జిల్లాలో జితేందర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ లోనూ  మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ఇంపార్టెన్స్ తగ్గిదంటున్నారు బీజేపీ లీడర్లు. తమను పట్టించుకోవడం లేదనుకుంటున్న నేతలంతా కిషన్ రెడ్డిని ఆశ్రయిస్తూ బండి సంజయ్ పై ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతున్నారు.    బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీలో వర్గ పోరు ముదురుతుందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్నపార్టీకి ఇలాంటివి ఇబ్బందులు తెస్తాయని చెబుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం కలుగుతుందని  కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరీ బీజేపీ నేతలు ఎలా ముందుకు వెళ్తారో..