బైడెన్ అవినీతిని దాస్తున్నారు.. మీడియాపై ట్రంప్ ఫైర్
posted on Oct 29, 2020 @ 10:28AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దీ రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ లో టెన్షన్ మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎపుడు తన అనుచిత వ్యాఖ్యలతో వివాదాల్లో మునిగి తేలే ట్రంప్ తాజాగా అమెరికన్ మీడియాపై ఫైరయ్యారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అవినీతిని అమెరికన్ మీడియా తొక్కిపెడుతోందని అయన మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, అలాగే బడా టెక్నాలజీ కంపెనీలు బైడెన్ నుంచి లబ్ది పొంది, ఆయనను రక్షించేందుకు ఆరాటపడుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే ఆ సంస్థలు అడ్డుకుంటున్నాయని అయన విమర్శించారు.
అమెరికాలో ఇటువంటి పక్షపాత వైఖరి ఇంతకుముందు ఎప్పుడూ లేదని, ఇప్పుడే మొదటి సారి చూస్తున్నామని అయన అన్నారు. అయితే చివరికి ఇది ఆ సంస్థలకే నష్టం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఎన్నికలను ప్రస్తుత ప్రభుత్వ సూపర్ ఎకనమిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్కు మధ్య జరుగుతున్న పోటీగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు ఈ రెండింటిలో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా, మాస్కో మేయర్కు అత్యంత సన్నిహితుడైన డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్టు ట్రంప్ కొద్దికాలం క్రితం ఆరోపించారు.